హిడ్మా ఎన్ కౌంటర్ ఓ కట్టుకథ!

హిడ్మా ఎన్‌కౌంటర్‌  ఓ కట్టుకథగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అభివర్ణించింది. మావోయిస్టు అగ్రనేత హిడ్మాను విజయవాడలో అరెస్టు చేసి హత్య చేసి మారేడుమిల్లి ఎన్ కౌంటర్ కథ అల్లారని ఆరోపించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి  మాడ్వి హిడ్మా , రాజే తో పాటు కొంతమందిని విజయవాడలో నిరాయుధులుగా ఉండగా పట్టుకుని క్రూరంగా హత్య చేశారని ఆ ప్రకటన పేర్కొంది.  ఈ క్రూర హత్యకాండకు వ్యతిరేకంగా ఆదివారం (నవంబర్ 23) దేశ వ్యాప్తంగా నిరసన దినం  పాటించాలని దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని పిలుపునిచ్చింది.     దేశంలో ఆర్ఎస్ఎస్-బీజేపీ మనువాదులు పచ్చి ఫాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.  ఫాసిస్టు ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ హత్యలను చేస్తున్నదని ఆ ప్రకటన పేర్కొంది.  హిడ్మా,  అతని  భార్య  రాజే కొద్దిమంది వ్యక్తులతో కలిసి చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లారనీ, ఈ సమాచారాన్ని కొందరు ద్రోహుల ద్వారా తెలుసుకుని వారిని పట్టుకుని హత్య చేశారని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది.   కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో ఆంధ్ర ఎస్ఐబీ  ఈ నెల 15 న విజయవాడలో హిడ్మా తదితరులను అదుపులోనికి తీసుకుని  లొంగదీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై క్రూరంగా హత్య చేసారని పేర్కొంది. మారెడుమిల్లి అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగిందని, ఆయుధాలు దొరికాయని, ఆరుగురు చనిపోయారని ప్రకటించటం లాంటివన్ని పచ్చి అబద్దాలని పేర్కొంది.   చివరి వరకు ఉద్యమంలో కొనసాగి, శత్రువుకు తలవంచకుండా తమ ప్రాణాలర్పించిన కామ్రేడ్స్ కు పార్టీ శ్రద్ధాంజలి ఘటిస్తోందన్న ఆ ప్రకటన వీరు  కొనసాగించిన విప్లవ సాంప్రదాయాలను, ఉద్యమ స్పూర్తిని నింపుకుని ఉద్యమాన్ని కొనసాగిస్తామని కేంద్రకమిటీ శపథం చేస్తోందని పేర్కొంది. 

రూ.5లక్షల కోట్ల భారీ స్కామ్.. రేవంత్ పై కేటీఆర్ సంచలన ఆరోపణ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా ఐదు లక్షల కోట్ల రూపాయల స్కామ్ కు తెరలేపారంటే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం (నవంబర్ 21) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన  కేటీఆర్ హైదరాబాద్ నగరంలో పారిశ్రామిక భూముల రెగ్యులరైజేషన్ పేర రేవంత్  దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని భారీ స్కార్ కు రూపకల్పన చేశారని విమర్శించారు. గతంలో తమ ప్రభుత్వం కనీసం 100 శాతం నుంచి అత్యధికంగా 200 శాతం ఎస్ఆర్‌ఓ రేట్లు చెల్లించాలని నిర్దేశించగా, కాంగ్రెస్ ఇప్పుడు కేవలం 30 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుందంటూ కొత్త పాలసీని తీసుకువచ్చిందన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్‌లో భారీ స్కామ్‌కు ప్రణాళిక రూపొందించారన్నారు. ఈ విధానం ద్వారా   9,292 ఎకరాల భూమిని కేవలం 30 శాతం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవచ్చనీ, తద్వారా ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయానికి గండి పడుతుందని కేటీఆర్ అన్నారు.  ఇప్పటికే ఆ భూములకు సంబంధించి రేవంత్ రెడ్డి సోదరులు, అనచరులు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. అందుకే ఈఘమేఘాలమీద వారం రోజుల్లో దరఖాస్తులు, మరో వారంలో ఆమోదాలు, కేవలం 45 రోజుల్లో రెగ్యులరైజేషన్ అంటూ తొందరపడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.  ఈ పాలసీ కాంగ్రెస్ కు, ముఖ్యమంత్రి రేవంత్ కు ఏటీఎంగా మారిందన్నారు.  ఆ భూములు కొనుగోలు చేసినా.. క్రమబద్ధీకరణ చేసుకున్నా ఇండస్ట్రియలిస్టులకు భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.   ప్రజల ఆస్తిని కాపాడేందుకు బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తుందని చెప్పారు.  తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందనీ, అప్పుడు   నగరంలోని పారిశ్రామిక భూముల లావాదేవీలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.  రేవంత్ రెడ్డి అవినీతికి అండగా నిలబడి  ఈ పాలసీలో భాగస్వాములై భవిష్యత్తులో ఇబ్బందులకు గురికావద్దంటూ  పారిశ్రామికవేత్తలకు  సూచించారు.  ఇంకా ఫార్ములా ఈ కార్ కేసుపై మాట్లాడుతూ.. తనను అరెస్టు చేసే దమ్ము రేవంత్ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదనీ, అందుకే లైడిటెక్టర్ కు సైతం రెడీ అని సవాల్ విసిరాననీ చెప్పారు. ఇక పరువు కాపాడుకునేందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజీనామా డ్రామాకు తెరతీశారని కాంగ్రెస్ పై మండి పడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ భావిస్తున్నారన్నారు. ఒక వేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినా స్థానిక ఎన్నికల తరువాతే ఉప ఎన్నికలు ఉంటాయని కేటీఆర్ జోస్యం చెప్పారు.  ప్రభుత్వం ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ కుప్పిగంతులు వేస్తోందని విమర్శించారు. 

బెంగళూరు వదిలేస్తే భారీ ప్రోత్సాహకాలు, రాయతీలు.. ఐటీ కంపెనీలు, ఉద్యోగులకు కర్నాటక బంపరాఫర్

ఇండియన్ సిలికాన్ వ్యాలీ  బెంగళూరు నగరం నుంచి టెక్ కంపెనీలను, టెకీలను బయటకు వెళ్లిపొమ్మంటోంది కర్నాటక ప్రభుత్వం. ఇందు కోసం ఏకంగా ఒక పాలసీనే రూపొందించింది.  ఈ పాలసీ మేరకు  స్టార్టప్‌లు, టెక్ కంపెనీలు రాష్ట్రంలోని టైర్ 2 నగరాలకు మారితే కోట్ల రూపాయల సబ్సిడీలు, పన్ను రాయితీలు ఆఫర్ చేస్తోంది సిద్దరామయ్య సర్కార్. ఇలా ఇచ్చే ప్రోత్సాహకాలలో గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు 50 శాతం అద్దె రాయితీ, మూడు సంవత్సరాల పాటు 30 శాతం ఆస్తి పన్ను మినహాయింపు, 5 ఏళ్ల పాటు విద్యుత్ చార్జీలపై 100 శాతం మినహాయింపును అందిస్తోంది. అదే కాకుండా కంపెనీలకు ఫోన్, ఇంటర్నెట్ ఖర్చుల్లో  పాతిక శాతం, ఏఐ, బ్లాక్‌చెయిన్, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక రంగాల్లో పరిశోధన ఖర్చులపై 40 శాతం వరకు   రీఫండ్ పొందే అవకాశం కూడా కల్పిస్తున్నది. ఈ విధానం టెక్ కంపెనీలను విశేషంగా ఆకర్షిస్తున్నట్లు సమాచారం. దీనిపై  టెక్ కమ్యూనిటీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ప్రభుత్వం నూతన ఐటీ పాలసీలో భాగంగా  కంపెనీలు మైసూర్, మంగళూరు వంటి నగరాలకు మారేందుకు డబ్బు ఆఫర్ చేస్తోంది. ఈ పాలసీ కోసం కర్నాటక సర్కార్ ఐదేళ్లలో  దాదాపు 960 కోట్ల రూపాయలు వ్యయం చేయనుంది. ఈ పాలసీలో ఫస్ట్ కం ఫస్ట్ సెర్వ్ పద్ధతిగా ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అవకాశాలుంటాయని అంటున్నారు.  ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కర్నాటక సర్కార్ వచ్చే నెల రెండో వారం నాటికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బియాండ్ బెంగళూరు అన్న కర్నాటక సర్కార్ వ్యూహంలో లీవ్ బెంగళూరు కీలకం అంటున్నారు.   రాష్ట్రంలోని మైసూరు, మంగళూరు, హుబ్బిళి, ధారవాడ, బేలగావి, కలబురిగి, శివమెుగ్గ, దావణగెరె, తుమకూరు వంటి నగరాలు ఐటీ ఆధారిత కేంద్రాలుగా అభివృద్ధి చెందితే.. రాష్ట్రప్రగతికి దోహదమౌతాయని ప్రభుత్వం చెబుతున్నది. అలాగే కంపెనీలు రాష్ట్రంలోని ఇతర నగరాలకు తరలిపోవడం వల్ల బెంగళూరులో  ట్రాఫిక్, పొల్యూషన్ వంటి సమస్యలు  కూడా ఆటోమేటిగ్గా సాల్వ్ అయిపోతాయన్నది ప్రభుత్వ భావనగా తెలుస్తోంది.   అలాగే బెంగళూరు నగరం విడిచి రాష్ట్రంలోని ఇతర నగరాలకు వెళ్లేందుకు ఎంచుకున్న ఐటీ ఉద్యోగులకు కూడా కర్నాటక ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా  బెంగళూరు నుంచి రాష్ట్రంలోని మైసూరు మైసూరు, మంగళూరు, కలబురగి వంటి ఇతర నగరాలకు మారేందుకు అంగీకరిస్తే వారికి 50 వేలు ప్రొత్సాహకంగా అందించాలని నిర్ణయించింది. ఇందు కోసం ప్రభుత్వం 445 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విధానం కూడా అతి త్వరలో అమలులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఓ వైపు స్టార్టప్ లను తరలిపోవాలని కోరుతూనే.. వాటికి సిబ్బంది కొరత లేకుండా, రాకుండా ఉద్యోగులకు కూడా బెంగళూరు వదిలి వెళ్లిపోవడానికి సుముఖత చూపితే ప్రోత్సాహకం అందించాలని నిర్ణయించింది.   దేశం మొత్తంలోనే ఐటీ ఉద్యోగులకు అత్యంత ప్రీతిపాత్రమైన నగరంగా బెంగళూరు భాసిల్లుతోంది. అటువంటి నగరాన్ని వీడడానికి ఐటీ కంపెనీలు, ఐటీ ఉద్యోగులూ ఏ మేరకు ముందుకు వస్తారన్నది చూడాల్సిందే.  

అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు.. ఎందుకంటే?

నగరంలోని ప్రముఖ ఫిల్మ్ స్టూడియోలైన అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ ఈ శుక్రవారం (నవంబర్ 21) నోటీసులు జారీ చేసింది. ఈ రెండు స్టూడియోలు తమ వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపుతూ భారీగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారని అధికారులు గుర్తించారు.   అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియో , అలాగే ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ కు చెందిన  రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ  జారీ చేసిన నోటీసుల్లో ఈ రెండు స్టూడియోలూ ట్రేడ్ లైసెన్స్ ఫీజ్ తక్కువగా చెల్లిస్తున్నట్లే పేర్కొంది.  అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలు.. తమ వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ.. భారీగా ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు  గుర్తించిన అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు.   అన్నపూర్ణ స్టూడియో 1,92,000 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తోందనీ, దీని ప్రకారం  రూ.11, 52,000 రూపాయలు చెల్లించాల్సి ఉండగా,   8,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే వ్యాపారం చేస్తున్నట్లుగా చూపించి కేవలం రూ. 49వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రామానాయుడు స్టూడియో  68 వేల చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తూ, కేవలం 19 వందల చదరపు అడుగుల విస్తీర్ణం అని మాత్రమే  చూపుతూ.  రూ.7,600 మాత్రమే టాక్స్ చెల్లిస్తోందని పేర్కొన్న అధికారులు ఆ మేరకు    బకాయిపడ్డ  మొత్తాన్ని వెంటనే  చెల్లించాలని ఈ రెండు స్టూడియోలనూ నోటీసులు జారీ చేశారు. 

బండి వర్సెస్ ఈటల.. తెలంగాణ బీజేపీలో చీలిక స్పష్టం!

తెలంగాణలో బీజేపీ ప్రస్థానం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. ఇందుకు ప్రధాన కారణం నేతల మధ్య సయోధ్య లేకపోవడమే.. సయోధ్య లేకపోవడం ఒక్కటే కాదు.. రాష్ట్ర పార్టీ నేతలలో విభేదాలు తరచూ బహిర్గతమౌతున్నాయి. అంతే కాదు.. ఈ  నేరుగా పేరు పెట్టి మరీ ఒకరినొకరు బహిరంగంగా విమర్శలకు దిగేంతగా ఈ విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి.  ఇంత కాలం తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ము లాటలు,నాయకుల మధ్య విభేదాలు, వివాదాలు  సాగుతూనే ఉన్నాయి. అయితే జూబ్లీ ఉప ఎన్నిక ఫలితం తరువాత అవి రచ్చెక్కాయి.    రాష్ట్రంలో అధికారమే తరువాయి అన్న పరిస్థితి నుంచి జూబ్లీ ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా గల్లంతయ్యే పరిస్థితికి బీజేపీ దిగజారిపోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీ రాష్ట్రనాయకుల మధ్య సయోధ్య లేమే అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? నాయకుల మధ్య విభేదాల వెనుక ఉన్న అసలు సిసలు రీజనేంటి? అని పరిశీలిస్తే..   సాధారణంగా బీజేపీలోకి బయట నుంచి వచ్చి చేరిన వారు ఇమడ లేరు. హిందుత్వ భావజాలం, ఆర్ఎస్ఎస్ బీజేపీకి మెంటార్ గా వ్యవహరించడం.. అన్నిటికీ మించి బీజేపీలోకి బయటి పార్టీలకు వచ్చిన వారిని తొలి నుంచీ పార్టీలో ఉన్నవారు మనస్ఫూర్తిగా కలుపుకునే పరిస్థితి లేకపోవడం సహజపరిణామం.   అయితే బీజేపీ నాయకత్వం మోడీ, షా చేతులలోకి వచ్చిన తరువాత పార్టీలో ఆ పరిస్థితి మారిపోయింది. సిద్ధాంతం కంటే ఓట్లు, సీట్ల లెక్కలకే బీజేపీ హైకమాండ్ ప్రాధాన్యం ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా బీజేపీకీ ఇతర పార్టీలకీ, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కూ తేడా లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీలో తొలి నుంచి ఉన్నవారూ, తరువాత వచ్చి చేరిన వారి మధ్య అగాధం ఏర్పడింది. అది పెరుగుతూ వస్తోంది. మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ఈ పరిస్థితి మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  జూబ్లీ ఉప ఎన్నికలో ఘోర పరాజయం తరువాత ఈ విభేదాలు నివురు తొలగించుకుని నిప్పులా బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ల మధ్య సైద్ధాంతిక అంతరం ఈ విభేదాలు రాజీకి ఆస్కారం లేనంత తీవ్ర స్థాయికి చేరడానికి కారణమయ్యాయి.  బండి సంజయ్ నూటికి పదహారణాల హిందుత్వ వాది. ఈటల రాజేందర్ రాజకీయ నేపథ్యం ఇందుకు పూర్తి భిన్నం.  ప్రాణం ఉన్నంతవరకు హిందూత్వమే తన మార్గమని బండి సంజయ్ అంటే.. మతతవ్వం ఇక్కడ నడవదని ఈటల కుండబద్దలు కొడతారు.  బరాబర్ హిందుత్వ అజెండాతో  ఎన్నికలో పోటీ చేయడం కరెక్టు కాదంటారు. అలా పోటీ చేస్తే ఇదిగో ఇలా డిపాజిట్లు గల్లంతౌతాయని ఈటల ఎలాంటి శషబిషలూ లేకుండా కుండబద్దలు కొట్టేశారు. జూబ్లీలో బీజేపీకి డిపాజిట్ గల్లంతు కావడానికి హిందుత్వ అజెండాయే కారణమని విస్ఫష్టంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఈటల నేరుగా బండి సంజయ్ పేరు ప్రస్తావిస్తూ ఆయన మతతత్వ అతివాద ధోరణితో చేసిన ప్రచారమే జూబ్లీలో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతు కావడానికి కారణమని చెప్పడమే కాకుండా, ప్రచార అజెండాలో మతం ప్రస్తావన లేకుండా ఉంటే ఫలితం మెరుగ్గా ఉండేదని చెప్పారు. ఈ నేపథ్యంలో బండి వర్సెస్ ఈటల వ్యవహారం రాష్ట్ర పార్టీలో స్పష్టమైన చీలకను స్ఫురింప చేస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.  

ఫార్ములా ఈ రేస్ కేసు.. కేటీఆర్ క్విడ్ ప్రోకో!.. అరెస్టేనా?

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు గవర్నర్ అనుమతించడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో కేటీఆర్ అరెస్టు ఖాయమన్న ప్రచారం కూడా జోరందుకుంది. ఈ నేపథ్యంలోకే ఫార్ములా ఈ కార్ కేసును లొట్టపీసు కేసుగా గతంలో కేటీఆర్ అభివర్ణించడంతో.. అసలీ కేసేంటి? ఇందులో కేటీఆర్ పై ఉన్న అభియోగాలేంటి.. పది వారాల పాటు నాన్చి నాన్చి గవర్నర్ ఇప్పుడే కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వడమేంటి? జూబ్లీ బైపోల్ ఫలితానికీ.. గవర్నర్ అనుమతి ఇవ్వడానికి సంబంధం ఏంటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.   బీఆర్ ఎస్ హయాంలో  గత అసెంబ్లీ ఎన్నికల  ముందు 2023లో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. ఇది సాఫీగానే సాగిపోయింది. అయితే ఆ  తర్వాత దీనిపై తీవ్ర వివాదాలు ముసురుకున్నాయి. ఈ రేస్‌ను కండక్ట్ చేసిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్‌కు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఖాతా నుంచి 54.88 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి.  అయితే  ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు ఈ సొమ్ము బదిలీ చేసేందుకు   హెచ్ ఎండీఏ ఎటువంటి తీర్మానం చేయలేదు. కనీసం ఆర్థిక శాఖ అనుమతి కూడా పొందలేదు.  దీంతో కేవలం అప్పటి మంత్రి  కేటీఆర్  నోటి మాటే వేదంగా, శాశనంగా భావించి హెచ్ఎండీఏ దాదాపు 54.88 కోట్ల రూపాయలను ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు బదిలీ చేసింది.   అయితే  ఆ వెంటనే 45 కోట్ల రూపాయలను కేటీఆర్  ఖాతాకు ఫార్ములా ఈ కార్  ఈవెంట్ స్పాన్సర్ సంస్థ ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థకు  బదిలీ చేసింది. దీనిపైనే  కేసు నమోదైంది.  సుమారు 55 కోట్ల రూపాయలను ఇచ్చి దానిలో 45 కోట్ల రూపాయలను ఎన్నికల బాండ్ల పేరుతో కేటీఆర్ ఖాతాకు బదిలీ చేశారన్నది ఏసీబీ  ఆరోపణ. సో ఈ ఫార్ములా రేస్ వెనుక భారీ అవినీతి జరిగిందని ఏసీబీ చెబుతోంది. దీంతో మాజీ మంత్రి చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. అసలు ఏం జరిగిందన్న విషయంపై ఆరా తీయాలంటే మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్‌ను విచారించాలని కోరుతూ ఏసీబీ  గవర్నర్‌  అనుమతి కోరారు. అనుమతి ఇవ్వడంలో జాప్యం చేసినా గవర్నర్ చివరకు అనుమతి ఇచ్చారు. దీంతో కేటీఆర్ చిక్కుల్లో పడ్డట్టేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేటీఆర్ క్విడ్ ప్రోకో ప్రస్ఫుటంగా బయటపడిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా ఇప్పటి వరకూ కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వకుండా మౌనంగా ఉన్న గవర్నర్ ఇప్పుడు అంటే జూబ్లీ ఉప ఎన్నిక తరువాత ఓకే చెప్పడం వెనుక బీజేపీ ఉందంటున్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో బీజేపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఇక ఇటీవలి కాలంలో తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత అయితే ఏకంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందంటూ బాంబ్ పేల్చారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీ ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కోల్పోవడానికి బీఆర్ఎస్ తో  రహస్య ఒప్పదం అన్న ఆరోపణలను ప్రజలు విశ్వసించడమే కారణమని కమలనాథులు భావిస్తున్నారు. దాంతో  అటువంటిదేమీ లేదని చాటుకోవడానికే ఇప్పుడు ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి లభించిందని అంటున్నారు. 

తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు?.. రాజీనామా దిశగా దానం, కడియం అడుగులు

తెలంగాణలో మరో  రెండు ఉప ఎన్నికలు జరగడం ఖాయమా అంటే ఔననే చెప్పాల్సి వస్తున్నది జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే. పిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై నిర్ణయం తీసుకునే విషయంలో తెలంగాణ స్పీకర్ విచారణ జోరందుకుంది. సుప్రీం కోర్టు స్పీకర్ నిర్ణయం వెలువరించడానికి నిర్దుష్ట గడువు విధించడంతో ఆయన విచారణ ప్రక్రియను స్పీడప్ చేశారు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది పక్కన పెడితే... ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపి మరీ విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక సారి నోటీసులు అందుకుని కూడా స్పీకర్ విచారణకు గైర్హాజరైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెడ్యే కడియం శ్రీహరిలకు స్పీకర్ మరోసారి  నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వారు రాజీనామా యోచన చేస్తున్నట్లు వారి వారి సన్నిహితుల ద్వారా తెలుస్తున్నది. ఇప్పటికే వారిరువురూ కూడా వారి వారి అనుచరులతో భేటీ అయ్యారు.  గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరిన పది మంది ఎమ్మెల్యేలలో దానం, కడియం కూడా ఉన్న సంగతి తెలిసిందే.  కాగా పార్టీ ఫిరాయించిన మిగిలిన ఎనిమిది మందీ ఇప్పటికే స్పీకర్ విచరణకు హాజరౌతుండగా కడియం, దానంలు మాత్రమే గైర్హాజరయ్యారు.  కాగా మిగిలిన ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలూ తాము పార్టీ ఫిరాయించలేదని, టెక్నికల్ గా ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెబుతున్నారు. అయితే అలా చెప్పే అవకాశం కడియం, దానంలకు లేకుండా పోయింది. ఎందుకంటే వీరిరువురూ కాంగ్రెస్ గూటికి చేరారనడాని బలమైన ఆధారాలు ఉన్నాయి. ఆ కారణంగానే వీరు స్పీకర్ విచారణకు గైర్హాజరయ్యారంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన దానం నాగేందర్.. 2024 సార్వత్రిక ఎన్నికలలో   కాంగ్రెస్ అభ్యర్థిగా సికిందరాబాద్ లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.  అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన కడియం శ్రీహరి  2024 లోక్ సభ ఎన్నికలలో వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తన కుమార్తె కావ్య తరఫున బహిరంగంగా ప్రచారం నిర్వహించారు.  దీంతో వీరిరువురూ పార్టీ ఫిరాయించలేదని చెప్పడానికి చాన్స్ లేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే అనర్హత వేటు ఎదుర్కొనే కంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయడం మేలని ఈ ఇరువురూ భావిస్తున్నట్లు సమాచారం.  ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు తథ్యమన్న చర్చ జోరందుకుంది. 

సాగర్ కుడికాలువకు గండి

నాగార్జునసాగర్‌ కుడికాలువ కట్టకు గురువారం (నవంబర్ 20)అర్ధరాత్రి గండి పడింది.  ఎస్కేప్‌ ఛానల్‌ వద్ద కట్టకు గండి పడి నాగులేటి వాగుకు ఒక్కసారిగా  ప్రవాహం పెరిగింది. దీంతో వాగు పరీవాహక  ప్రాంతాల ప్రజలలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.  పల్నాటి వీరుల తిరునాళ్ల నేపథ్యంలో నాగులేటి వాగుకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో  వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న దుకాణాలలోకి నీరు చేరింది.   మరో వైపు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోన్న ఆందోళనలో జనం ఉన్నారు. కాగా గండి విషయం తెలుసుకున్న ఎన్నెస్పీ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని  గండి పూడ్చే పనులు చేపట్టారు.ఇలా ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే కట్టను ధ్వసం చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   ఇలా ఉండగా.. సాగర్ కుడికాలువకు గండిపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే ఆందోళన వద్దంటూ ప్రజలకు సూచించారు. యుద్ధ ప్రాతిపదికన గండి పూడ్చివేత పనులు చేపట్టామనీ, మధ్యాహ్నానికల్లా గండిని పూడ్చేస్తామనీ హామీ ఇచ్చారు. అలాగే గ్రామాలలోకి నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  అదే సమయంలో.. గండి పడటానికి గల కారణాలను నివేదిక రూపంలో అందించాలని మంత్రి నిమ్మల ఆదేశించారు. 

భార్యా బిడ్డల హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష

వికారాబాద్  హత్యల కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ వికారాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ మేజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.  భార్యా పిల్లలను హత్య చేసిన కేసులో కోర్టు నిందితుడు ప్రవీణ్ కుమార్ కు ఉరిశిక్ష విధిస్తూ గురువారం (నవంబర్  22) తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెడితే..  వికారాబాద్ పట్టణంలో  ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగించే ప్రవీణ్ కుమార్ కు అప్పటికే పెళ్లై ఒక కొడుకు ఉన్న మహిళతో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది.  దీంతో వారివురూ వివాహం చేసుకున్నారు. వారికి ఒక పాప జన్మించింది. అయితే వివాహం తరువాత ప్రవీణ్ కుమార్ మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవపడుతుండేవాడు.   2019 ఆగస్టు 5 రాత్రి పీకలదాకా మద్యం సేవించిన ప్రవీణ్ కుమార్ ఇంటికి వచ్చి భార్యతో ఘర్షణ పడ్డాడు. గొడవ పెద్దదవ్వడంతో ఆగ్రహానికి లోన ప్రవీణ్ కుమార్  ఇంట్లో ఉన్న ఇనుప రాడ్ తో భార్య మరియు ఐదేళ్ల కుమార్తెను  కొట్టి హతమార్చాడు. అనంతరం 9 ఏళ్ల కుమారుడని గొంతు నులిమి హత్య చేశాడు. భార్యా పిల్లలను హత్య చేసిన అనంతరం  పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భార్య మొబైల్లో మెసేజీలు  చూసి  అనుమానం పెంచుకుని భార్య పిల్లలను హత్య చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో బయటపడింది.   పోలీసులు సాక్ష్యాధారాలు లను సేకరించి కోర్టులో సమర్పించారు. ఈ మేరకు కోర్టు విచారణ జరిపి నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ కీలక తీర్పు వెల్లడించింది.  

టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం

  తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో సిట్ దూకుడు పెంచింది.  ఈ కేసు దర్యాప్తులో ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్న అంశాలు విస్తుగొలుపుతున్నాయి.  మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలోనే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నది. అంతే కాకుండా ఈ వ్యవహారంలో వైసీపీ కీలక నేతల హస్తం ఉందని దర్యాప్తులో వెలుగులోనికి వస్తున్నది. జగన్ హయాంలో టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని సిట్ ఇప్పటికే విచారించింది. ఈ విచారణలో ధర్మారెడ్డి కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.  ఇప్పుడు తాజాగా  టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సిట్ విచారించింది. గురువారం (నవంబర్ 19) ఉదయం వైవీ సుబ్బారెడ్డిని సిట్ అధికారులు హైదరాబాద్ లోని ఆయన నివాసంలోనే విచారించారు. సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో సిట్ అధికారులు వైసీ సుబ్బారెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసింది.   ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్నతో పాటు టీటీడీ మాజీ ఈవో, పలు కీలక అధికారులు విచారణను ఎదుర్కొన్నారు. వారి వాంగ్మూలాలన సిట్ రికార్డు చేసింది. వారి విచారణలో వెలుగులోనికి వచ్చిన అంశాలు, ఈ కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన సమాచారంతో అధికారులు సుబ్బారెడ్డిని విచారించారు.  టీటీడీకి సరఫరా అయ్యే నెయ్యి నాణ్యత, కొనుగోలు విధానాలు, కాంట్రాక్టుల కేటాయింపులపై సిట్ అధికారుల ప్రశ్నలతో వైవీ సుబ్బారెడ్డి ఉక్కిరిబిక్కిరైనట్లు సమాచారం.  సుబ్బారెడ్డి విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోనికి వచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి వినియోగం కేసులో వైవీ సుబ్బారెడ్డి విచారణ అత్యంత కీలకంగా భావిస్తున్నారు.    తొలుత ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైవీ సుబ్బారెడ్డికి సిట్ అధికారులు  నోటీసులు జారీ చేశారు. అయితే.. అరోగ్యం సహకరించని కారణంగా తాను విచారణకు రాలేననీ వైవీ చెప్పడంతో సిట్ అధికారులు నేరుగా హైదరాబాద్ వచ్చి సుబ్బారెడ్డిని ఆయన నివాసంలోనే విచారించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరిందన్న సంకేతాలను ఇచ్చింది.   వైసీపీ ప్రభుత్వ హయాంలో సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన సంస్థలు, వాటితో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఛైర్మన్ హోదాలో తీసుకున్న నిర్ణయాలపై ఈ విచారణలో కీలక సమాచారాన్ని సిట్ అధికారులు రాబట్టినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్నను సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారించిన సంగతి తెలిసిందే. అప్పన విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగా ఇప్పుడు సుబ్బారెడ్డిని ప్రశ్నించినట్లు చెబుతున్నారు.  

పేర్ని నానికి పరాభవం.. అయినా నోరెత్తితే ఒట్టు!

ప్రస్తుతం వైసీపీలో నోరున్న ఒకే ఒక నాయకుడిగా గుర్తింపు పొందుతున్న పేర్ని నానికి ఘోర పరాభవం ఎదురైంది. మామూలుగా అయితే నోరేసుకుపడిపోయే పేర్ని నాని ఈ సారి మాత్రం మౌనాన్ని ఆశ్రయించారు. నోరెత్తి ప్రశ్నించలేదు. ఇంతకీ పేర్ని నానికి పరాభవం ఎక్కడ ఎదురైందంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. వైసీపీ అధినేత జగన్ దాదాపు ఆరేళ్ల తరువాత తొలి సారిగా అక్రమాస్తుల కేసు విచారణకు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు గురువారం (నవంబర్ 19) హాజరయ్యారు. తాడేపల్లి నుంచి ఉదయం గన్నవరం విమానాశ్రాయానికి చేరుకుని అక్కడ నుంచి గంటకు ఎనిమిది లక్షలు చెల్లించి మరీ ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి భారీ ర్యాలీగా నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. కోర్టు వద్ద కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ కేడర్ జమ అయ్యింది. అయితే కోర్టు ఆవరణలోకి జగన్ ను మాత్రమే అనుమతించారు. ఇక ఎవరినీ ఎంటర్ కానీయలేదు. అలా పోలీసులు ఆపేసిన వారిలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని కూడా ఉన్నారు. మామూలుగా అయితే తనను నిలువరించిన పోలీసులతో పేర్ని నాని వాగ్వాదానికి దిగాలి. కానీ ఎందుకో.. నోరెత్తలేదు. కోర్టు పరిసరాల్లో మాట్లాడితే అక్కడికక్కడే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించేస్తారని భయపడినట్లున్నారని నెటిజనులు ఎద్దేవా చేస్తున్నారు. అది పక్కన పెడితే.. తనను పోలీసులు నిలిపివేసినా పేర్ని నాని మాత్రం దాదాపు అరగంటకు పైన కోర్టు బయట అలాగే నిలబడి ఉన్నారు. కోర్టు ప్రొసీడింగ్స్ పూర్తై జగన్ బయటకు వచ్చే వరకూ నోరెత్తకుండా నిలుచున్నారు. అయితే బయట పెద్ద ఎత్తున గుమిగూడిన వైసీపీయేలు మాత్రం రప్పరప్ప ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారనుకోండి అది వేరే సంగతి.

వీళ్లు వాళ్లేనా?

అక్రమాస్తుల కేసులో  ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత  హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఇందు కోసం ఆయన బేంగళూరు నుంచి బుధవారం (నవంబర్ 18) తాడేపల్లిలోని తన ప్యాలెస్ కు చేరుకున్నారు. గురువారం (నవంబర్ 19)న ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి భారీ ర్యాలీగా నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. సరే అదలా ఉంచితే..  బుధవారం నవంబర్ 18) తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ తో ఒకప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్లుగా ఉండి.. గత ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన తరువాత సైలెంటైపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ కలిశారు. వీరితో పాటు ఇప్పుడు పార్టీలో వాయిస్ వినిపిస్తున్న ఏకైక నాయకుడు పేర్ని నాని కూడా ఉన్నారు. ఈ నలుగురూ ఒకే ఫ్రేములో కనిపించడం చాలా కాలం తరువాత ఇదే తొలిసారి.  కాగా జగన్ ను కలిసిన ముగ్గురు నాయకులు పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీలలో పేర్ని నానిలో భౌతికంగా పెద్ద మార్పేమీ కనిపించలేదు కానీ, వల్లభనేని వంశీ, కొడాలి నానిల అపియరెన్స్ లో మాత్రం చాలా చాలా మార్పు కనిపించింది. కొడాలి నాని బరువు తగ్గిపోయి.. మనిషి దాదాపుగా సగానికి సగం తగ్గిపోయినట్లు కనిపించారు. వల్లభనేని పరిస్థితి కూడా అలాగే ఉంది. వైసీపీ అందగాడు అంటు జగన్ గతంలో అభివర్ణించిన వల్లభనేని వంశీలో ఇప్పుడు ఆ చార్మ్ కానీ, ఉత్సాహం కానీ మచ్చుకైనా కనిపించడం లేదు.  నెరిసిపోయిన జుట్టు, గుబురుగడ్డంతో వంశీ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఈ ముగ్గురూ అంటే కొడాలి, పేర్ని నాని ద్వయం, వల్లభనేని వంశీ అధికార గర్వంతో విర్రవీగుతో.. ప్రత్యర్థులపై ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ పై ఇష్టారీతిగా నోరు పారేసుకునే వారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలైతే అనుచిత భాషా ప్రావీణ్య ప్రదర్శనలో డాక్టరేట్ పొందారా అన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత వారిలో ఆ దూకుడు, దురుసుతనం పూర్తిగా కనమరుగైపోయి మన్నుతిన్న పాములా అన్నట్లుగా కనిపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.  

అనిల్ అంబానీకి ఈడీ మరో షాక్.. ఆస్తుల అటాచ్

 ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి వరుస షాకులిస్తోంది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. తాజాగా అంబానీ గ్రూపునకు చెందిన 1400 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.    ఆయనకు చెందిన రిలయెన్స్ గ్రూప్ పై మనీలాండరింగ్  నిరోధక చట్టం కింద కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా  ఈ చర్య తీసుకుంది. ఇదే నెలలో ఈడీ ఇప్పటికే   అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కు చెందిన నవీ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీలో ఉన్న 132 ఎకరాల భూమిని జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఆ భూముల విలువ దాదాపు 4 వేల 462 కోట్లకు పైనే ఉంటుంది.  అంతకు ముందు ఈ ఏడాది అక్టోబర్ లో కూడా అనిల్ అంబానీ గ్రూపుకు చెందిన సంస్థలకు సంబంధించి 3 వేల 84 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే.   ఆ ఆస్తులు ఢిల్లీ, నోయిడా, ఘాజియాబాద్, ముంబై, పుణె, థానే, హైదరాబాద్, చెన్నై, కాంచీపురం, తూర్పు గోదావరిలలో ఉన్నాయి.  ఇప్పుడు తాజాగా  మరో 14వందల కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. దీంతో ఇప్పటి వరకూ అనిల్ అంబానీకి చెందిన దాదాపు 9వేల కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసినట్లైంది. ఈడీ తాజాగా జప్తు  చేసిన ఆస్తులు నవీ ముంబై, చెన్నై, పూణె, భువనేశ్వర్ లలో ఉన్నాయి.  

1 నుంచి రేవంత్ జిల్లాల పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టనున్నారు. ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో తిరుగులేని విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తున్నది. ఆ ఉత్సాహం అలా ఉండగానే స్థానిక ఎన్నికలకు వెళ్లి మరో విజయాన్ని పార్టీ ఖాతాలో జమ చేయాలని రేవంత్ తలపోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ నెలలోనూ తొలుత పంచాయతీ ఎన్నికలు జరిపించాలని ఆయన భావిస్తున్నారు. ఆ పంచాయతీ ఎన్నికల ముహూర్తం కూడా దాదాపుగా ఖారారైనట్లే కనిపిస్తోంది. స్థానిక ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన అంశం న్యాయస్థానాలలో వచ్చిన తీర్పుల కారణంగా వీలు కాలేకపోయినప్పటికీ, బీసీలకు రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కార్ కు క్రెడిట్ అయితే దక్కిందన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 1 నుంచి 9 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించి, అవి పూర్తి అవ్వగానే ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తున్నది. అదే విధంగా ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కూడా చేపట్టాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ఈ నెల 1 నుంచి 9 వరకూ జిల్లాల పర్యటనలు చేయనున్నారు. అయితే అంతకు ముందే.. రాష్ట్రంలో వివిధ శాఖల వారీగా జరిగిన ప్రగతిపై అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించాలని రేవంత్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

తెరపైకి ఐ బొమ్మ వ‌న్.. పైరసీ నాన్ స్టాప్

ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం అన్న పాట చందంగా తయారైంది సినిమా పైరసీల వెబ్ సైట్ ల పరిస్థితి. ఐబొమ్మ రవిని అరెస్టు చేసి ఆ ఐబొమ్మ వెబ్ సైట్ ను పోలీసులు ఇలా క్లోజ్ చేశారో లేదో.. అలా మరో పైరసీ వెబ్ సైట్ తెరమీదకు వచ్చింది. ఇబొమ్మ వన్ దాని పేరు. దీనిని బట్టి చూస్తుంటే.. ఐబొమ్మ రవి అరెస్టుతో మొత్తం పైరసీని కట్టడి చేసినట్లు కాదని పోలీసు అధికారి సీవీ ఆనంద్ చెప్పిన మాట నిజమే అనిపించక మానదు. నిన్నమొన్న‌టి  వ‌ర‌కూ ర‌వి అధ్వ‌ర్యంలో న‌డిచే ఐబొమ్మ‌, బప్పం  టీవీల ప‌ని  ఇక అయిపోయింది. సినిమా ఫీల్డ్ ఇక ఎంచ‌క్కా లాభాల ఆర్జ‌న చేయ‌వ‌చ్చనుకుంటుంటే.. ఐబొమ్మ వ‌న్ అంటూ మ‌రో కొత్త పైరసీ వెబ్ సైట్ తెరమీదకు వచ్చి ఒక్కొక్క‌రికీ  దిమ్మ తిరిగి మ‌ళ్లీ బొమ్మ కనిపించేలా చేసింది. ఇందులో కూడా స‌రిగ్గా  సినిమా పైరసీ కంటెంటే ఉంది. క్లిక్ చేస్తే చాలు నేరుగా మూవీ వరల్డ్ లోకి తీసుకుపోతుంది.   దీనంత‌టికీ కార‌ణం ఐ బొమ్మ ఎకో సిస్ట‌మ్ లో 65 మిర్ర‌ర్ వెబ్ సైట్స్ ఉన్నాయ‌నీ,  అందులో భాగంగానే  ఈ కొత్త  సైట్ ప్ర‌త్య‌క్ష‌మైంద‌నీ చెబుతున్నారు అధికారులు.  ఈ లెక్క‌న ఈ పైర‌సీ బెడ‌ద తెలుగు సినిమాకి ఇప్ప‌ట్లో వ‌దిలేలా లేర‌న్న మాట నిజ‌మేనంటున్నారు. సీవీ ఆనంద్ ఈ అంశంపై మాట్లాడుతూ, మ‌న ద‌గ్గ‌ర నివార‌ణ త‌ప్ప మ‌రెలాంటి శాస్వ‌త ప‌రిష్కారం లేద‌ని చెప్పుకొచ్చారు. ఒక‌టి పోతే మరొకటి అలా పుట్టుకొస్తూనే ఉంటాయి.   దొరికిన‌పుడు వాటి నిర్వాహకులను అరెస్టు చేయడమే అంతే! 

పూవర్తికి కు హిడ్మా భౌతిక కాయం.. కన్నీరుమున్నీరుగా విలపించిన గ్రామం

మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో  జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు  హిడ్మా మృతదేహాన్ని ఛత్తీస్ గఢ్ కు తరలించారు.   రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో నిన్న హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. పోస్టుమార్టం అనంతరం హిడ్మా, అతని భార్య రాజక్క మృతదేహాలను బంధువులకు అప్పగించారు. హిడ్మా స్వగ్రామం ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయి.   ఈ నెల 18, 19 తేదీల్లో మారేడుమిల్లి దగ్గర జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో మొత్తం 13 మంది మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన తరువాత భౌతిక కాయాలను వారి వారి బంధువులకు అప్పగించారు.  హిడ్మా మృతదేహం సుక్మా జిల్లా పూవర్తి గ్రామం చేరుకోవడంతో మొత్తం గామం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మావోయిస్టుల దండయాత్రకు నాయకత్వం వహించిన   హిడ్మా మృతదేహం స్వగ్రామానికి చేరడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.   గ్రామంలోని దాదాపు 50 ఇళ్లలో సగానికి పైగా ఇళ్లకు తాళాలే కనిపిస్తున్నాయి. గ్రామస్థులు భయంతో, దిగ్భ్రాంతితో తమ ఇళ్లకు తాళాలేసుకుని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.  హిడ్మా మృతదేహాన్ని చూసి  నడవలేని స్థితిలో ఉన్న హిడ్మా తల్లి మాంజు  భోరున విలపించింది 50 ఇళ్లే ఉన్న ఈ చిన్న గ్రామమైన పువర్తిలోనే ఏకంగా 90 మంది యువకులు మావోయిస్టులుగా మారారంటే గ్రామంపై హిడ్మా ప్రభావం ఎంతగా ఉందో అవగతమౌతుంది.  ఈ గ్రామానికే చెందిన మరో వాంటెడ్ మావోయిస్టు బార్స దేవా..  హిడ్మా తరువాత కీలక నాయకుడిగా భావిస్తున్నారు. మావోయిస్టుల అధీనంలో ఉండే ఈ ప్రాంతంలో దశాబ్దాల తరబడి భద్రతా దళాలకు ప్రవేశం కూడా కష్టమయ్యేది. అయితే ఏడాది క్రితం సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంపు స్థాపించడంతో పరిస్థితుల్లో కొంత మార్పు చోటు వచ్చింది. అంతే కాకుండా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఈ గ్రామం నుంచి ఒక్కటంటే ఒక్క ఓటు కూడా పోల్ అవ్వలేదంటే ఈ గ్రామంపై మావోయిస్టుల ప్రభావం ఎంత ఉందో అర్ధమౌతుంది.     

పోక్సో కేసులో కర్నాటక మాజీ సీఎంకు సమన్లు

పోక్సో కేసులో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఎడ్యూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన ఈ కేసులో ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం వచ్చే నెల 2 లోగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ యెడ్యూరప్పకు సమన్లు జారీ చేసింది.   యెడ్యూరప్పపై 2004లో పోక్సో కేసు నమోదైంది.  సహాయం కోరేందుకు 2024 ఫిబ్రవరి 2న తన నివాసానికి వచ్చిన ఓ మైనర్ బాలికను యెడ్యూరప్ప లైంగికంగా వేధించారని ఆయనపై ఆరోపణలు నమోదయ్యాయి. బాధితురాలి తల్లి ఫిర్యాదుపై అప్పట్లో సదాశివనగర్‌ పోలీస్ స్టేషన్‌ కేసు కూడా నమోదైంది.  ఈ కేసు విచారణలో భాగంగా యెడ్యూరప్ప వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తూ న్యాయస్థానం ఆయనకు తాజాగా సమన్లు జారీ చేసింది. అంతకు ముందు తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ యెడ్యూరప్ప ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా, ఆయన అభ్యర్థనను   హకోర్టు ధర్మాసనం కొట్టివేసి, విచారణను ఎదుర్కోవలసిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిథుల కోర్టు యెడ్యూరప్పను వ్యక్తిగతంగా ఆదేశించాలంటూ సమన్లు జారీ చేయడం ప్రాథాన్యత సంతరించుకుంది.  

ఏపీ మద్యం కుంభకోణం కేసు.. నిందితుల డిఫాల్ట్ బెయిలు రద్దు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ ప్రత్యేక కోర్టు మంజూరు చేసిన డీఫాల్ట్ బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది. వీరు ముగ్గురూ ఈనెల ఈ నెల 26లోగా ఏసీబీ కోర్టు ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.  నిందితులు లొంగిపోయిన తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు  వెసులుబాటు కల్పించిన హైకోర్టు..  వారి రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపై   కేసు మెరిట్స్ ఆధారంగానే  విచారణ జరపాలని ఏసీబీ కోర్టుకు స్పష్టం చేసింది. హైకోర్టు  ఈ తీర్పులోని అభిప్రాయాలతో  ప్రభావితం కావాల్సిన అవసరం లేదనీ పేర్కొంది. వీరి డిఫాల్ట్ బెయిలును రద్దు చేసిన హైకోర్టు ముందు ఈ నెల 24లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఆ తరువాత నిందితుల తరఫు న్యాయవాదుల అభ్యర్థనతో లొంగుబాటు గడువును మరో రెండు రోజులు పొడిగించింది.  మద్యం కుంభకోణం కేసులో నిందితులు  ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సిట్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.  

రాష్ట్రపతి, గవర్నర్ లకు గడువు విధించలేం.. సుప్రీం

చట్ట సభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్ లకు కాలప పరిమితి  నిర్ణయించలేమని దేశ సర్వోన్నత  న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం గురువారం (నవంంబర్ 20)తీర్పు వెలువరించింది.  దీంతో ఈ విషయంలో సుప్రీం తీర్పు ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠకు తెరపడింది. అసలు విషయం ఏమిటంటే.. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆమోదించకుండా సుదీర్ఘకాలం జాప్యం చేయడంతో  తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం..  బిల్లులపై గవర్నర్లు మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేననీ, అలా తీసుకోకుంటే.. ఆ బిల్లులు ఆమోదం పొందినట్లే భావించాలని తీర్పు ఇచ్చింది.  దీంతో తమిళనాడు ప్రభుత్వం 10 బిల్లులను చట్టాలుగా నోటిఫై చేసింది. దీంతో..  రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి న్యాయవ్యవస్థ గడువులు విధించడం సరికాదంటూ సుప్రీం కోర్టులో  పలు పిటిషన్లు దాఖలయ్యాయి.  ఇదే అంశంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద తనకున్న అధికారాలతో సుప్రీంకోర్టు సలహా  కోరారు.  బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని గడువులు నిర్దేశించవచ్చా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలంటూ సుప్రీంను కోరారు.   రాష్ట్రపతి అభ్యర్థన మేరకు జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు గవర్నర్లకు గడువు విధించడాన్ని వ్యతిరేకించాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే   పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పంజాబ్ వంటి రాష్ట్రాలు సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తూ..  గవర్నర్లు తమ నిర్ణయాన్ని నిర్దుష్ట కాలవ్యవధిలో తీసుకోవాలని వాదించాయి.   ఈ వాదనలు విన్న సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం గత ససెప్టెంబర్ 11న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రాజ్యాంగ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న  సీజేఐ జస్టిస్ బి.ఆర్. గవాయ్ ఈ  ఆదివారం(నవంబర్ 23) పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ విరమణకు ముందు ఈ కీలక అంశంపై తీర్పు వెలువరించనుండటంతో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా గురువారం (నవంబర్ 20) సుప్రీం తీర్పు వెలువరించింది.  చట్ట సభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్ లకు  ఎటువంటి గడువూ విధించలేమని సుప్రీం తీర్పు రాజ్యాంగ ధర్మాసనం విస్పష్ట తీర్పు వెలువరించింది.  అయితే బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్  సుదీర్ఘ సమయం తీసుకుంటే మాత్రం సమీక్షించే అధికారం కోర్టులకు ఉందని పేర్కొంది.  బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్ల ముందు వాటిని ఆమోదించడం లేదా రాష్ట్రపతికి పంపడం, అదీ కాకుంటే.. వాటిని తిరిగి అసెంబ్లీకి తిరిగి పంపడం వినా మరో మార్గం లేదని సుప్రీం కోర్టు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.