భార‌తీ రెడ్డి @ 400 కేజీ గోల్డ్?

భారతీరెడ్డి 400 కిలోల బంగారం కొన్నారంటూ ఆరోపణించారు  బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డి. అయితే ఇందులో వాస్త‌వ‌మెంత‌? అవాస్త‌వ‌మెంత‌? అన్న విషయానికి వస్తే..  ఆంధ్రప్రదేశ్ మ‌ద్యం కుంభ‌కోణం,  మ‌రో కుంభకోణం ఏదైనా సరే  జ‌గ‌న్ అండ్ కో..  బ్లాక్  మ‌నీ వైట్ చేయ‌డానికి మూడు నాలుగు మార్గాల‌ను ఎంపిక చేసుకుంటే వాటిలో గోల్డ్ బిస్కెట్స్, కాయిన్స్  ఒకటి.  ఈ విష‌యం  రాజ్ కేసిరెడ్డి విచారణలో వెలుగులోకి వచ్చింది.     జ్యువెల‌రీ షాప్స్,  రియ‌ల్ ఎస్టేట్,   యాడ్ ఏజెన్సీస్, ఆపై దేశ విదేశాల్లో కంపెనీల  స్థాప‌న వంటి దారుల గుండా  వీరు త‌మ త‌మ బ్లాక్ మ‌నీ వైట్ చేసేందుకు శాయ‌శ‌క్తులా  కృషిచేసిన‌ట్టు రాజ్ కేశిరెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సిట్ పేర్కొంది.  అయితే ఈ మొత్తం బినామీల ద్వారా జ‌గ‌న్ కి చేరేలా పకడ్బందీ వ్యూహం ప్రకారం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా  చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి సైతం మ‌ద్యం సొమ్ముతో భారీగా  ఆస్తులు కూడ‌బెట్టిన‌ట్టు తేల్చిన సిట్ ఆయన ఆస్తుల అటాచ్ మెంట్ కు రెడీ అవుతోంది. ప్రభుత్వ అనుమతితో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్ మెంట్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించనుంది.   ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణం, ఇతర స్కాముల ద్వారా కూడబెట్టిన ఆస్తిపాస్తులు డ‌బ్బు ద‌స్కం జ‌గ‌న్ కి చేరేలా, ఆపై బంగారం వంటివి భార‌తీరెడ్డికి చేరేలా వైసీపీలోని అక్రమార్కులంతా కలిసి స్కెచ్ వేశారని బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి విమర్శలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  ఒక‌ప్పుడు త‌న  భ‌ర్త‌ను తాను ఈ రాజ‌కీయాలే వ‌ద్ద‌ని చెప్పాన‌ని భారతీరెడ్డి పలు సందర్బాలలో చెప్పారు.  ఇక్క‌డుంటే జైల్లో పెడ‌తారు కాబ‌ట్టి మ‌నం ఎక్క‌డైనా విదేశాల‌కు వెళ్లి హాయిగా ఉందామ‌ని సూచించాన‌నీ చెప్పిన సందర్భాలున్నాయి. అయితే ఆయన వినలేదని భారతీరెడ్డి ఆవేదన కూడా వ్యక్తం చేశారు.  జ‌గ‌న్ కూడా ఆయన  తండ్రిలా పేద ప్ర‌జ‌ల దేవుడిగా మారాల‌ని భావించారనీ, ఈ విషయాన్ని ఆయన తనతో చెప్పారనీ కూడా గతంలో భారతీ రెడ్డి చెప్పారు.  అటువంటి భారతీ రెడ్డి   తాజాగా బంగారం మొత్తం నిల్వ‌లు   త‌న ప‌రం చేసుకున్న‌ట్టుగా ఆదినారాయణరెడ్డి వంటి వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు.  మ‌రి  చూడాలి ఈ బంగారాన్ని ఎలా రిక‌వ‌రీ చేస్తారో పోలీసులు. చెవిరెడ్డి ఆస్తులు అటాచ్ చేసిన‌ట్టు వీటిని కూడా చేస్తారేమో చూడాలి మరి. 

అమెరికాలో తల్లీ కొడుకుల హత్య.. ఎనిమిదిన్నరేళ్ల తర్వాత హంతకుడి గుర్తింపు

అమెరికాలో ఎనిమిదిన్నరేళ్ల కిందట జరిగిన తల్లీ కొడుకుల హత్య కేసులో నిందితుడిని ఎట్టకేలకు కనిపెట్టారు. తొలుత ఈ కేసులో హతురాలి భర్తే నిందితుడిగా అనుమానించారు. హతురాలి తల్లిదండ్రులు సైతం అతడిపైనా ఆరోపణలు చేశారు. ఫిర్యాదు చేశారు. అయితే భర్తే హత్య చేశాడన్న ఆధారాలేవీ దొరకలేదు.   చివరికి హత్య జరిగిన ఎనిమిదిన్నరేళ్ల తరువాత అసలు నిందితుడిని కనిపెట్టారు. ఎనిమిదిన్నరేళ్ల తర్వాత నిందితుడ్ని కనిపెట్టారు.   వివరాల్లోకి వెడితే..  అమెరికా న్యూజెర్సీలోని మెపుల్ షేడ్‌లోని ఫాక్స్ మెడో అపార్ట్‌మెంట్‌లో  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 38 ఏళ్ల మహిళ  శశికళ నర్రా , ఆమె కుమారుడు  హత్యకు గురయ్యారు. అప్పట్లో అందరూ శశికళ భర్త నర్రా హనుంతరావే హంతకుడని అనుమానించారు.  ఎనిమిన్నరేళ్ల విచారణ తర్వాత అమెరికా పోలీసులు అసలు నిందితుడిని కనిపెట్టారు. హంతకుడిని  నజీర్ హమీద్ గా గుర్తించారు. నజీర్ కూడా ఇండియనే.  శశిఖళ భర్త హనుమంత్ రావు నర్రా మాజీ సహోద్యోగి. వృత్తిపరమైన వివాదాల కారణంగా  వ్యక్తిగత ప్రతీకారేచ్ఛతో  అతడే ఈ హత్యలకు పాల్పడ్డాడని అమెరికా పోలీసులు తెలిపారు. కాగా శశికళ, ఆమె కుమారుడిని హత్య చేసిన తరువాత నజీర్ అహ్మద్ ఇండియా వచ్చేశాడు.  ఇప్పుడు అతడిని తమకు అప్పగించాలంటూ  అమెరికా ఇండియన్ గవర్నమెంట్ తో సంప్రదింపులు చేస్తున్నది.  ఇంతకీ నజీర్ అహ్మద్ హంతకుడని ఎలా కనిపెట్టగలిగారంటే.. అతడు గతంలో పని చేసిన కంపెనీలో ఉపయోగించిన లాప్ టాప్ ద్వారా డీఎన్ ఏను సేకరించి.. క్రైమ్ ప్రదేశంతో ఉన్న రక్తపు మరకలతో సరిపోల్చడం ద్వారా నజీరే హంతకుడని గుర్తించారు.     

ఫార్ములా ఈ రేస్.. కేటీఆర్ కు బిగ్ షాక్!

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు బిగ్ షాక్ తగిలింది. ఈయన ఏ1 నిందితుడుగా ఉన్న ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఏసీబీకి తెలంగాణ గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇప్పటికే  ఈ కేసులో ఏ1 కేటీఆర్ ను ఏసీబీ నాలుగు సార్లు విచారించిన సంగతి తెలిసిందే. అలాగే ఇదే కేసులో ఏ2గా ఉన్న అరవింద్ కుమార్ ను ఐదుసార్లు విచారించింది. ఈ కేసుకు సంబంధించి వందలాది డాక్యుమెంట్లను, ఈ-మెయిల్స్ ను, ఎలెక్ట్రానిక్ ,ఇతర సాక్ష్యాలను ఏసీబీ సేకరించింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో  తొమ్మిది నెలల పాటు అన్ని కోణాల నుంచీ పకడ్బందీగా  విచారణ జరిపిన ఏసీబీ ఇప్పుడు కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి  రెడీ అవుతోంది.  కాగా ఈ కేసులో కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి ఆయన ఎమ్మెల్యే కనుక గవర్నర్ అనుమతి అవసరం. దీంతో ఏసీబీ కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ గత సెప్టెంబర్ 9న లేఖ రాసింది.  అలా లేఖ రాసిన పది వారాల తరువాత కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు  గవర్నర్ నుంచి అనుమతి లభించింది.  అలాగే ఈ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు డీవోపీటీ అనుమతి కోరిన ఏసీబీ.. ఆ అనుమతి కూడా రాగానే కేటీఆర్, అరవింద్ కుమార్, అలాగే బీఎల్ఎన్ రెడ్డిలపై చార్జిషీట్ దాఖలు చేయనుంది. 

శబరిమల ప్రవేశానికి వర్చువల్ క్యూపాస్

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ రోజు రోజుకూ అధికమౌతున్న నేపథ్యంలో   కేరళ ప్రభుత్వం   కీలక నిర్ణయం తీసుకుంది.  కేరళ హైకోర్టు సూచనల మేరకు కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది.  భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిబంధనలు ఈ నెల 24 వరకూ కచ్చితంగా అమలు చేయనున్నట్లు కేరళ సర్కార్ ప్రకటించింది.   శబరిమలకు ఒకేసారి అధిక సంఖ్యలో యాత్రికులు చేరకుండా నియంత్రించేందుకు రోజువారీ అనుమతులకు పరిమితి విధించింది.అలాగే వర్చువల్ క్యూ ద్వారా రోజుకు 70,000మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. అదనంగా స్పాట్ బుకింగ్ ద్వారా మరో ఐదు వేల మందికి ప్రవేశం కల్పిస్తారు.   కోటా పూర్తయిన వెంటనే స్పాట్ బుకింగ్ నిలిపి వేస్తారు.  జరుగుతుంది. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి  వర్చువల్ క్యూ పాస్ తప్పనిసరి చేసింది. దీంతో ఈ పాస్ లేకుండా నీలక్కల్ చెక్‌పాయింట్ నుంచి శబరిమలకు ఎవరినీ అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.  భక్తుల  స్పాట్ బుకింగ్ కోసం నీలక్కల్, వండిపెరియార్ సత్రం, ఎరుమెలి,  చెంగన్నూర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీలక్కల్ వద్ద కోటా చాలా వేగంగా ముగిసే అవకాశం ఉన్నందున, యాత్రికులు ఇతర కేంద్రాల్లోనే పాస్ పొందాలని సూచించారు.యాత్ర ప్రారంభించే ముందు పాస్ తమ వద్ద ఉన్నదని భక్తులు తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. అలాగే నీలక్కల్, పంపా,  సన్నిధానం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భద్రతా చర్యలకు యాత్రి కులు  సహకరించాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల భక్తుల కోసం 04735-14432 హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేశారు.  బరిమల యాత్రను మరింత క్రమబద్ధంగా, భద్రతగా నిర్వహించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రపతి, గవర్నర్ కు కాలపరిమితిపై సుప్రీం తీర్పు నేడు

చట్ట సభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్ లకు కాలపరిమితి నిర్ణయించే విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం గురువారం (నవంంబర్ 20)తీర్పు వెలువరించనుంది.  దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే ఈ విషయంలో సుప్రీం తీర్పు ఎలా ఉంటుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.  చట్ట సభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం రాజ్యాంగబద్ధమేనని కొందరు వాదిస్తుండగా, మరి కొందరు అది అధికారాల విభజనను ఉల్లంఘించడమే అవుతుందంటున్నారు.   తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆమోదించకుండా సుదీర్ఘకాలం జాప్యం చేయడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం, బిల్లులపై గవర్నర్లు మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేననీ, అలా తీసుకోకుంటే.. ఆ బిల్లులు ఆమోదం పొందినట్లే భావించాలని తీర్పు ఇచ్చింది.  దీంతో తమిళనాడు ప్రభుత్వం 10 బిల్లులను చట్టాలుగా నోటిఫై చేసింది. దీంతో..  రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి న్యాయవ్యవస్థ గడువులు విధించడం సరికాదంటూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.  ఇదే అంశంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద తనకున్న అధికారాలతో సుప్రీంకోర్టు సలహా  కోరారు.  బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుని గడువులు నిర్దేశించవచ్చా? స్పష్టత ఇవ్వాలంటూ సుప్రీంను కోరారు.   రాష్ట్రపతి అభ్యర్థన మేరకు జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు గవర్నర్లకు గడువు విధించడాన్ని వ్యతిరేకించాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే   పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పంజాబ్ వంటి రాష్ట్రాలు సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తూ..  గవర్నర్లు తమ నిర్ణయాన్ని నిర్దుష్ట కాలవ్యవధిలో తీసుకోవాలని వాదించాయి.   ఈ వాదనలు విన్న సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం గత ససెప్టెంబర్ 11న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రాజ్యాంగ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న  సీజేఐ జస్టిస్ బి.ఆర్. గవాయ్ ఈ  ఆదివారం(నవంబర్ 23) పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ విరమణకు ముందు ఈ కీలక అంశంపై తీర్పు వెలువరించనుండటం గమనార్హం. 

తెలంగాణ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు షురూ

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు షురూ చేసింది. పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్‌ను ప్రకటించింది. గురువారం (నవంబర్ 20) నుంచి ఆదివారం (నవంబర్ 23) వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరణకు షెడ్యూల్ విడుదల చేసింది.  ఆదివారం (నవంబర్ 23)  తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో డిసెంబరు రెండో వారంలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూలు వెలువడే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాల సవరణకు షెడ్యూల్ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  గత సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై విస్తృత చర్చ జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 1 నుంచి జరగనున్న ప్రజాపాలన వారోత్సవాల అనంతరం  స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. తొలుత పంచాయతీ ఎన్నికలు, ఆ తరువాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు తగ్గట్టుగా కసరత్తు ప్రారంభించింది.   

బిహార్ సీఎంగా పదోసారి నితీష్ ప్రమాణస్వీకారం

బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్  నితీశ్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్డీఏ సభాపక్ష నేతగా నితీశ్ కుమార్ పేరును బీజేపీ ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బిహార్ గవర్నర్కు సమర్పించారు. గురువారం (నవంబర్ 20) ఉదయం పదకొండున్నర గంటలకు పట్నాలోని గాంధీ మైదానంలో నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది పదోసారి. ఈ సారి నితీష్ కుమార్ కేబినెట్ లో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలు బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా 21 మందితో నితీష్ కేబినెట్ కొలువుతీరనుంది. 

కోర్టుకు జగన్ షెడ్యూల్.. ధిక్కారమా? అహంకారమా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత గురువారం (డిసెంబర్ 20)   హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకానున్నారు.   అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా ఆయన  ఆరేళ్ల తరువాత కోర్టు మెట్టెక్కడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.  ముఖ్యమంత్రి హోదాలో ఉండటం, ఇతర కారణాల రీత్యా జగన్ కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చారు. అయితే ఈ సారి మాత్రం అలా కుదరలేదు. ఆయన కోర్టు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్ కు సీబీఐ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురుకావడంతో కోర్టు ఆయన పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో అనివార్యంగా జగన్ కోర్టుకు హాజరు కాక తప్పడం లేదు.  నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరయ్యేందకు జగన్ గురువారం (నవంబర్ 20) ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు హాజరై.. కోర్టు విచారణ ముగిసిన తరువాత లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లి కొద్ది సేపు విశ్రాంతి తీసుకుని, ఆ తరువాత  బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి విమానంలో బెంగళూరు వెడతారు.   ఇలా ఉండగా జగన్ కోర్టుకు ఎన్నిగంటలకు వచ్చి ఎన్ని గంటలకు తిరిగి వెళ్లాలన్న విషయాన్ని తనకు తాను స్వయంగా నిర్ణయించుకోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. అక్రమాస్తుల కేసులో నిందితుడై ఉండీ, 18 నెలలు జైలు జీవితం గడిపి గత పుష్కరకాలంపైగా బెయిలుపై ఉండి కూడా గత ఆరేళ్లుగా ఒక్కటంటే ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాని జగన్ ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవడ్డానికి వస్తూ కోర్టుకే సమయం ఇవ్వడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.  వీటన్నిటికీ మించి ఈ రోజు నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తులకు సంబంధించి దాదాపు 31 కేసులకు సంబంధించి విచారణ జరగనుంది. ఇన్ని కేసుల విచారణకు జగన్ ఇచ్చిన గంట సమయం సరిపోతుందా?   జగన్ తనంతట తాను నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారమే కోర్టులో విచారణ జరుగుతుందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.  నిందితుడిగా ఉన్న జ‌గ‌న్ ఒక గంట పాటు మాత్రమే కోర్టులో ఉంటాను అంటూ న్యాయస్థానానికి సమయం ఇవ్వడం ఏమిటని న్యాయనిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  కోర్టులో తాను ఎంత సమయం ఉంటాను అన్నది ఒక నిందితుడు తనంతట తాను స్వయంగా ఎలా నిర్ణయించుకుంటాడు? ఇలా తాను గంట సేపు మాత్రమే ఉంటానంటూ జగన్ న్యాయస్థానానికే షెడ్యూల్ ఇవ్వడం న్యాయ వ్యవస్థను ధిక్కరించడం, చులకన చేయడమే అవుతుందని న్యాయనిపుణులు అంటున్నారు.  జగన్ వైఖరి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.   

ఈ భూమిపై నడయాడిన దైవ స్వరూపం పుట్టపర్తి సాయిబాబా.. చంద్రబాబు

ఈ భూమిపై మనం చేసిన, మనకు తెలిసిన   దైవ స్వరూపం     సత్యసాయి బాబా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.  ప్రేమ, సేవ, శాంతిలకు బాబా నిలువెత్తు నిదర్శనమన్నారు. పుట్టపర్తిలో  జరుగుతున్న శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పాల్గొని ప్రసంగించారు.   ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం   సత్యసాయి శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోందని, ఆయన స్ఫూర్తిని, చూపిన మార్గాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబా సేవలను స్మరించుకుంటూ ప్రధాని రూ.100 విలువైన స్మారక నాణేన్ని, స్మారక తపాలా బిళ్లలను విడుదల చేశారు.

చంద్రబాబు ఓ అద్భుతం.. ఆనంద్ మహేంద్ర

మహీంద్ర అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ అనంద్ మహీంద్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనను ఒక అద్భుతంగా అభివర్ణించారు. చంద్రబాబు పని తీరు, అభివృద్ధి కాముకత, దార్శనికత మాత్రమే కాకుండా ఆయన రూపొందించే విధానాలు కూడా గొప్పగా ఉంటాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్రా చంద్రబాబును ప్రశంసించడం ఇదే ప్రథమం కాదు. గతంలో కూడా పలు సందర్భాలలో ఆయన నారా చంద్రబాబుపై పొగడ్తలు కురిపించడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు తమ సంస్థ సిద్ధంగా ఉందని ప్రకటించారు.  చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కారణంగా ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సుకతతో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే  ఈ సారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించిన  ఎస్క్రో వ్యవస్థపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. అలాగే రాష్ట్రానికి ఒక ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలన్న చంద్రబాబు దార్శనికతను అభినందించారు.  దీర్ఘకాలంగా ఆయన నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిత్సున్న తీరు పట్ల తాను ముగ్థుడైనట్లు పేర్కొన్నారు. కాగా ఆనంద్ మహేంద్ర ట్వీట్ పై స్పందించిన చంద్రబాబు ఆయనకు కృతజ్ణతలు తెలిపారు.  ఆయనను ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడానికి ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.   

అమరావతే ఏపీ రాజధాని డిసెంబర్ లోనే గెజిట్?!

ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అమరావతే. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజథాని అమరావతిపై కుట్రల  నేపథ్యంలో ప్రస్తుతం అమరావతి రైతులు అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ అధికారిక గెజిట్ ను డిమాండ్ చేస్తున్నారు. సీఆర్డీఏ కమిషనర్ ఇటీవలఅ రైతులతో సమావేశమైన సందర్భంగా ఈ విషయంపై రైతుల నుంచి బలమైన డిమాండ్ వినిపించింది. అమరావతి గెజిట్ కు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని రైతులు కోరుతున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఆర్డీయే కమిషనర్  ఈ బిల్లుకు అవసరమైన విధివిధానాలపై దృష్టిపెట్టనున్నట్లు చెప్పారు.  అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే శీతాకాల సమావేశాలలోనే అంటే డిసెంబర్ లోనే అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఖరారు చేస్తూ చట్టపరమైన రక్షణ కలిగేలా గెజిట్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.   ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా పార్లమెంట్ లో చట్టం చేయించి, గెజిట్ జారీ చేయించాలన్న రైతుల డిమాండ్ కు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది.  తెలుగుదేశం ప్రస్తుతం కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తూండటంతో ఈ మేరకు అమరాతి గెజిట్ విడుదల చేయించే విషయంలో ప్రభుత్వానికి పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా లేదని అంటున్నారు.   

ఇది కదా విజ్ణత!

రాజకీయాలు ఎన్నికల సమయంలోనే.. మిగిలిన సమయంలో రాజకీయ విభేదాలు మరిచి రాష్ట్ర ప్రగతి గురించే ఆలోచించాలి. ఇదీ తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తరచూ చెప్పే మాట. ఇప్పుడు ఆయన, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం అదే దారిలో నడుస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా మారింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన స్వల్ప వ్యవధిలోనే పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఇందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి దార్శనికత, మంత్రి నారా లోకేష్ చొరవ, కృష్టి, పట్టుదల కారణమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన పార్టీ నాయకులు మాత్రం ఈ మొత్తం ఘనతను తమ ఖాతాలో వేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి ఇప్పుడు ఇలా పెట్టుబడులు వెల్లువెత్తడానికి తమ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలే కారణమని చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.  విశాఖ పెట్టుబడుల సదస్సు విషయంలో కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేశారు. గూగుల్ డేటా సెంటర్ ఘనతా తమదేనని చెప్పుకోవడానికి ప్రయత్నించారు.  అభివృద్ధి అన్నది సమష్టిగానే సాధించగలమని ఎప్పుడూ చెబుతూ ఉండే మంత్రి నారా లోకేష్ వైసీపీ క్లెయిములపై స్పందించిన విధానం ఆయనలో పరిణితికి అద్దంపట్టింది.  వైసీపీ హయాంలో ఆ ప్రభుత్వం  కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలను సమర్పిస్తే వాటిని అమలులోకి తీసుకురావడానికి, ఆ ఒప్పందాల క్రెడిట్ వైసీపీకే ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని గతంలోనే చెప్పిన లోకేష్ ఇప్పుడు తాజాగా మరో ముందడుగు వేసి.. గతంలో వైసీపీ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న కంపెనీలతో సంప్రదింపులకు  ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.   గత ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న పెట్టుబడిదారులతో ఇప్పటికే సంప్రదించామని చెప్పిన లోకేష్ వారికి అనుకూలమైన, విశ్వసనీయ వాతావరణాన్ని అందించేందుకు ప్రయత్ని స్తున్నామని చెప్పారు.  ఈ ఒక్కమాటతో రాష్ట్ర అభివృద్ధి విషయంలో తాము రాజకీయ తారతమ్యాలు చూపబోమని చాటారు.  ఇది కదా విజ్ణత అంటే అంటూ  నెటిజనులు పెద్ద ఎత్తున లోకేష్ పై ప్రశంసలు కురిపిస్తూ, వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఏపీకి పెట్టుబడుల వరద లోకేష్ చలవే.. పొగడ్తలు కురిపించిన రాయిటర్స్

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రత్యేక కథనాన్ని వెలువరించింది. ఈ కథనంలో యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపించింది. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పదవీ బాధ్యతలు చేపట్టిన 16 నెలల స్వల్ప కాలంలోనే రాష్ట్రానికి పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రావడం వెనుక  లోకేష్ శ్రమ, సమర్థతను ప్రస్తావిస్తూ రాయిటర్స్ తన ప్రత్యేక కథనంలో.. 42 ఏళ్ల యువకుడు కీలకమని పేర్కొంది. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీయే చేసిన 42 ఏళ్ల యువకుడు నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక శక్తిగా నిలిచారనీ, నిలుస్తున్నారనీ ఆ వ్యాసంలో పేర్కొంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉండటం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయన తండ్రి కావడం కలిసివచ్చిన అంశాలే అయినా లోకేష్ తన ప్రతిభ, సమర్థత, వేగం, చొరవతో ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చగలు గుతున్నారని పేర్కొంది.  భారత్‌లో డేటా సెంటర్ కోసం గూగుల్ స్థలాన్ని అన్వేషిస్తోందని తెలియగానే లోకేశ్ బృందం రంగంలోకి దిగి,  పన్ను విధానాలు, డేటా భద్రత వంటి అంశాలపై గూగుల్ లేవనెత్తిన సందేహాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించి నివృత్తి చేయడమే కాకుండా స్పష్టమైన హామీలు ఇవ్వడం ద్వారా  నెలల వ్యవధిలోనే గూగుల్ తో  ఒప్పందం ఖరారైంది. అదేవిధంగా, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం అనుమతులు కూడా ఆఘమేఘాల మీద లభించేలా లోకేష్ చొరవ చూపారని ఆ ప్రత్యేక వ్యాసంలో రాయిటర్స్ పేర్కొంది.  లోకేష్ చెబుతున్న  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం నినాదం కాదనీ.. అది ఆచరణలో కనిపిస్తోందని ప్రశంసించింది.    రాయిటర్స్ రాష్ట్రప్రభుత్వ విజయాలు, అందులో తన పాత్రపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం పట్ల రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.  వ్యాపార నిర్వహణలో వేగం, పారదర్శకత, సాహసోపేతమైన సంస్కరణల పై తమ ప్రభుత్వం  దృష్టి సారించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.  

గుజరాత్ జైల్లో టెర్రరిస్టుపై ఖైదీల దాడి

గుజరాత్ జైల్లో ఉన్న టెర్రరిస్టు అహ్మద్ మొహియిద్దీన్  సయ్యద్ పై ఖైదీలు దాడి చేశారు. హైదరాబాద్ కు చెందిన ఆహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి విదితమే.  ఐఎస్‌కేపీ  ఆదేశాల మేరకు ఆముదం గింజల నుంచి విషం తయారు చేసి.. దాన్ని ప్రసాదంలో కలిపి.. అమాయకుల ప్రాణాలు తీయాలన్న కుట్రను ఛేదించిన ఏటీఎస్ పోలీసులు ఆ కుట్రలో కీలకంగా ఉన్న  ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం  గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న అతడిపై   జైలులో ఖైదీలు కొందరు   దాడి చేశారు.  అతడిని హై సెక్యూరిటీ సెల్‌లో బంధించినప్పటికీ.. అకస్మాత్తుగా వచ్చిన ఖైదీలు అహ్మద్ మీద దాడి చేసి తీవ్రంగా కొట్టారని అధికారులు తెలిపారు.  దీని గురించి సమాచారం అందిన వెంటనే గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు చెందిన ఓ బృందం సబర్మతి జైలుకు చేరుకుంది.  దాడి ఎందుకు జరిగిందనే అంశంపై దర్యాప్తు చేపట్టింది.   ఈ నెల 8న, గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ ( ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో హైదరాబాద్‌ నగరానికి చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్  కూడా ఉన్నాడు. మొహియుద్దీన్.. ఐసీస్‌కు చెందిన ఓ డిపార్ట్‌మెంట్ అయిన.. ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ)కు చెందిన ఉగ్రవాది అబూ ఖాదీమ్‌ అనే వ్యక్తితో టచ్‌లో  ఉండి,  అతడి ఆదేశాల మేరకు పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చైనాలో ఎంబీబీఎస్ చదవిని మొహియుద్దీన్.. అబుల్ ఖాదీమ్ ఆదేశాల మేరకు ఆముదం గింజల నుంచి ప్రమాదకరమైన రైసిన్ అనే ప్రమాదకరమైన విషాన్ని తయారు చేయడానికి ఇంట్లోనే అన్ని పరికరాలు ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అహ్మదాబాద్ ఏటీఎస్ వీరిని విచారిస్తోంది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

చెవిరెడ్డికి షాక్.. ఆస్తుల అటాచ్ కు సిట్ కు అనుమతి

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం సంభవించింది. ఈ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్ మెంట్ ప్రక్రియ సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేసిరెడ్డి  పలు చోట్ల ఆస్తులను కొనుగోలు చేసినట్లు సిట్ విచారణలో తేలింది. రంగారెడ్డి జిల్లా మామెరపల్లె, మాచ్ పల్లి గ్రామాల పరిధిలో 27.06 ఎకరాలు, అలాగే తన తల్లి కేసిరెడ్డి సుభాషిణి పేరిట 3.14 ఎకరాలు కొనుగోలు చేసినట్లు సిట్ ఆధారాలతో సహా కనుగోంది. ఆ ఆస్తుల అటాచ్ మెంట్ కోరుతూ సిట్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం అనుమతించిన మీదట.. ఆస్తుల అటాచ్ మెంట్ కోసం విజయవాడ ఎసీబీ కోర్టును సిట్ ఆశ్రయించింది. కోర్టు అనుమతి ఇవ్వడంతో వాటిని అటాచ్ చేసింది.   ఇక ఇప్పడు తాజాగా ఈ కేసులో  కీలక నిందితుడైన వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  మద్యం కుంభకోణంతో చెవిరెడ్డి కుటుంబం  అక్రమంగా భారీగా విలువైన అస్తులు కూడబెట్టినట్లు సిట్ గుర్తించింది.  మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి కుటుంబం కమిషన్లు, కిక్ బ్యాక్ లు తీసుకుని భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు నిర్ధారణకు వచ్చిన సిట్.. ఆస్తుల అటాచ్ మెంట్ కు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఆ మేరకు చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.   చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి,  కెవీఎస్ ఇన్ ఫ్రా ఎండీ గా ఉన్న భాస్కరరెడ్డి భార్య చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ అలియాస్ లక్ష్మి, సీఎంఆర్ ఇన్ ఫ్రా పేరిట చెవిరెడ్డి మరో కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల అటాచ్ మెంట్ కు సిట్ అనుమతి కోరింది.   మద్యం కుంభకోణం అక్రమాలతో చెవిరెడ్డి కుటుంబం  63. 72 కోట్ల పైగా ఆస్తులు కూడబెట్టిందనీ,  సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తుల విలువను తగ్గించి,  లెక్కల్లో చూపకుండా  54.87 కోట్ల పైగా  మొత్తాన్ని  బ్లాక్ మనీగా మలిచారనీ సిట్ నివేదికలో పేర్కొంది.  ఈ నేపథ్యంలోనే నెల్లూరుజిల్లా గూడూరు, పొదలకూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ల వద్ద  రిజిస్ట్రరైన ఆస్తుల ఆటాచ్ మెంట్  సిట్  ప్రభుత్వ అనుమతి కోరింది.  అలాగే చిత్తూరు జిల్లా పుత్తూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిందితుడు చెవిరెడ్డి కుటుంబం భారీగా మోసపూరిత భూ లావాదేవీలకు పాల్పడిందని సిట్ పేర్కొంది.  వెండోడులోని అరబిందో ఫార్మాకు కేవీఎస్ ఇన్‌ఫ్రా ద్వారా  263.28 ఎకరాల భూమి కొనుగోలు, అమ్మకం, లో మోసం జరిగినట్లు నిర్దరించింది. తక్కువ సమయంలోనే భూమి విలువలను అసాధారణంగా పెంచి  నల్లధనాన్ని తెల్లగా మార్చారని  సిట్ తన నివేదిక పేర్కొంది.  మద్యం కుంభకోణం నుండి కమిషన్లు, కిక్ బ్యాక్ లతో చెవిరెడ్డి కుటుంబం భారీగా స్థిర, చర ఆస్తులు కూడబెట్టిందనీ,   అవినీతి నిరోధక చట్టం, , క్రిమినల్ లా లోని పలు సెక్షన్ల ప్రకారం ఈ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని  సిట్ ప్రబుత్వాన్ని కోరింది. ఇందుకు అనుమతి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తుల అటాచ్ మెంట్ కు వియవాడ కోర్టులో దరఖాస్తు చేసేందుకు సిట్ కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్  ఉత్తర్వులు జారీ చేశారు. 

హిడ్మా అనుచరుడు రావులపాలెంలో అరెస్ట్

కోనసీమ జిల్లా రావులపాలెంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుచరుడు మాధవిహండా సరోజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలో వరుసగా జరుగుతున్న ఎన్ కౌంటర్లు.. వాటికి సమాంతరంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో మావోయిస్టుల అరెస్టులు కలకలం సృష్టిస్తున్నాయి. విజయవాడ, ఏలూరు, కాకినాడ, అమలాపురంలలో జరిపిన సోదాలలో మంగళవారం (నవంబర్ 18) ఏకంగా 50 మంది మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు, బుధవారం ఉదయం అమలాపురం కు సమీపంలో ఉండే రావులపాలెంటో హిడ్మా అనుచరుడి మధవిహండా సరోజ్ ను అరెస్టు చేశారు. ఛత్తీస్ గఢ్ కు చెందిన సరోజ్ రావులపాలెంలో ఏం చేస్తున్నాడన్న కోణంలో అతడిని విచారిస్తున్నారు.  ఆపరేషన్ కగార్ తో వరుస ఎన్ కౌంటర్లు, లొంగుబాటులతో ఉక్కిరిబిక్కిరి అయిన మావోయిస్టులు షెల్టర్ కోసం ఏపీని ఎంచుకున్నారా? ప్రణాళిక మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో తలదాచుకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నాంపల్లి కోర్టు నుంచి జగన్ ఎక్కడకు వెడతారో తెలుసా?!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం (నవంబర్ 20) తన అక్రమాస్తుల కేసు విచారణకు నాంపల్లి కోర్టులో హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఆయన తాడేపల్లి నుంచి ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి  ప్రత్యేక విమానంలో బేంగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నాంపల్లి కోర్టుకు చేరుకుంటారు. ఆయన కోర్టులో గంట సేపు ఉంటారు. ఈ మేరకు జగన్ వ్యక్తిగత సిబ్బంది జగన్ నాంపల్లి కోర్టు హాజరుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. నాంపల్లి కోర్టు నుంచి ఆయన నేరుగా హైదరాబాద్ లోని తన లోటస్ పాండ్ నివాసానికి చేరుకుంటారు. అక్కడ దాదాపు గంట సేపు విశ్రాంతి తీసుకుని అక్కడ నుంచి నేరుగా బెంగళూరుకు బయలుదేరి వెడతారు.  

మావోలూ లొంగిపోండి.. మల్లోజుల పిలుపు

ఎన్ కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించడం పట్ల మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులు లొంగిపోవాలంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు మల్లోజుల వేణుగోపాల్ బుధవారం (నవంబర్ 19) విడుదల చేసిన ఓ వీడియోలో.. పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయనీ, దేశం కూడా ముందుకు సాగుతోందనీ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. హిడ్మా సహా పలువురు మావోయిస్టులు మరణించడం తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. ఆయుధాలు వీడి లొంగిపోవడమే మేలని ఆయన మావోయిస్టులకు హితవు పలికారు. లొంగిపోవాలనుకునే మావోయిస్టులు తనను సంప్రదించాల్సిందిగా పేర్కొంటూ తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఈ వీడియోను గడ్చిరోలి పోలీసులు అధికారికంగా విడుదల చేశారు.  

టెక్‌ శంకర్ సహా ఏడుగురు మావోయిస్టులు హతం

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో  బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు.  మంగళవారం ఇదే ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించగా మిగిలిన వారు అడవుల్లో దాక్కుని ఉన్నారనే సమాచారంతో  గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బలగాలు చేపట్టిన సంయుక్త  కూంబింగ్ లో గుత్తులూరు హిల్ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడి పోలీసులపై కాల్పులు జరిపారనీ, పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారనీ లడ్డా వివరించారు.  మృతులలో మావోయిస్టుల ఐఈడీ నిపుణుడు మెట్టూరు జోగారావు అలియాస్‌  టెక్‌ శంకర్  కూడా ఉన్నట్లు తెలిపారు.  ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన వారిలో  ముగ్గురు మహిళా మావోయిస్టులు  ఉన్నారన్నారు.    మావోయిస్టు టెక్‌ శంకర్‌   పేలుడు పరికరాల తయారీలో కీలక పాత్ర పోషించిచాడనీ,  గత కొన్నేళ్లుగా మావోయిస్టులు అమర్చిన అనేక లాండ్ మైన్ లరూపకల్పనలో కూడా  టెక్ శంకర్ దే కీలక పాత్ర అని లడ్డా చెప్పారు. ఇక ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన మిగతా సభ్యులను జ్యోతి అలియాస్ సరిత, సురేష్ అలియాస్ రమేష్, లోకేష్ అలియాస్ గణేష్, సైను అలియాస్ వాసు, అనిత, షమ్మిలుగా గుర్తించారు.