వైఎస్ వివేకా హత్యకేసు.. ఇకపై రోజువారీ విచారణ

  వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇక పై రోజువారీ విచారణ కొనసాగించాలని సిట్ నిర్ణయించింది. డ్రైవర్లు ప్రకాష్, దస్తగిరిని విచారించిన పోలీసులు రేపు విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ బీటెక్ రవికి కూడా నోటీసులిచ్చారు. అటు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని కూడా విచారించే అవకాశం ఉంది. మరోవైపు వివేక కేసులో న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదన్నారు మాజీ సీఎం చంద్రబాబు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 2019, మార్చి 15 న పులివెందుల లోని తన స్వగృహంలో దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే ముగ్గురు వ్యక్తుల ఆధ్వర్యంలో 3 దర్యాప్తు బృందాలు దర్యాప్తు చేశాయి. ఇంతవరకు కూడా ఎవరు నిందితులు అనేది ఇంత వరకూ ఎవరూ కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏఎస్పీ అన్బురాజన్ ఆధ్వర్యంలో దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా వైయస్ కుటుంబీకులతో పాటు అనుమానితులందర్నీ కూడా రోజువారీ విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ఈ విషయం పైన విజృంభంగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేయాలని ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎస్పీ అన్బురాజన్ ఆధ్వర్యంలో సిట్ బృందం మళ్లీ దర్యాప్తు ప్రారంభించింది.

రాజధాని రచ్చ.. అమరావతి నిర్మాణంపై విపక్షాల సమావేశం

  ఏపీలో రాజధాని రాజకీయం హీటెక్కింది. రాజధాని అమరావతి నిర్మాణంపై టిడిపి.. వైసిపిలు పోటా పోటీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. విజయవాడలో టిడిపి అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజా రాజధాని అమరావతి పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్ కు 17 పార్టీలను.. 22 విభాగాల సంఘాలను కూడా టిడిపి ఆహ్వనించింది. సంపద సృష్టి , పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన అజెండగా సమావేశం ఏర్పాటు చేసినట్టు టిడిపి నేతలు చెబుతున్నారు. టిడిపి నిర్వహించే సమావేశాల్లో రాజధాని పై జగన్ సర్కారు తీరును విమర్శించే అవకాశం ఉంది. అమరావతిలో భూ సేకరణకు సమయం పట్టిందని టిడిపి నేతలు గుర్తు చేసే అవకాశం ఉంది. ఇరవై తొమ్మిది గ్రామాల భూములు తీసుకుని నిధులు వెచ్చించి చేపట్టిన పనులు నిర్మాణాల పై వివరిస్తారు. ఏడాది లోనే ఎక్కువ నిర్మాణాలు పూర్తయ్యాయని టిడిపి నేతలు చెబుతున్నారు. రాజధాని మార్పు పై పూటకోమాట మాట్లాడుతూ ప్రజల్లో అభద్రతా భావం కలిగిస్తున్నారనే విషయం పై కూడా రౌండ్ టేబుల్ సమావేశం దృష్టి పెట్టనుంది. అంతే కాకుండా చంద్రబాబు బస్సు పర్యటన సమయంలో జరిగిన ఆందోళనను ఈ మీటింగ్ లో ప్రస్తావించే అవకాశం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల అభిప్రాయాలను తీసుకొని రాజధాని పై పోరాటాన్ని ఉధృతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరోవైపు టిడిపి నిర్వహిస్తున్న ప్రజా రాజధాని అమరావతి మీటింగ్ కు వైసీపీ కౌంటరిస్తోంది. రాజధాని ప్రాంత రైతులు రాజధాని నిజస్వరూపం పేరుతో సదస్సు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. తుళ్లూరులో రాజధా ని అంశంపై వివిధ పార్టీల నేతలు ప్రజా సంఘాలతో ఈ సమావేశం జరుగుతోంది. అమరావతి అసలు కోణం,కుంభకోణం శీర్షికన జరిగే ఈ సమావేశాల్లో అమరావతి పేరుతో గత టిడిపి ప్రభుత్వం చేసిన కుంభకోణాలు భూ దందాలు, అవినీతిపై చర్చిస్తారు. రాజధాని ప్రాంత రైతులకు, రైతు కూలీలకు రాజధానిలో సామన్యులకు జరిగిన అన్యాయం పై సమావేశాల్లో ప్రధానంగా చర్చిస్తారు. అమరావతి లో రాజధానిపై పోటా పోటీ సమావేశాలు రాజకీయాలు చలిలో కూడా వేడి పుట్టిస్తున్నాయి. రాజధాని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యంలో తమ వాదన ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు అధికార విపక్షాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.

నగరంలో నయా రోడ్లు.. గుంత పడిన గంటకే పూడ్చేస్తారు

  చిన్న వర్షం పడితే చాలు రోడ్డు మీద నిలిచిపోయే నీళ్లు, చెత్తా చెదారాన్ని ఎవరు చూడరు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాధుడు లేడు. ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు ఉండవు. భాగ్యనగరం రోడ్ల గురుంచి ప్రస్తావిస్తే ఇవే గుర్తొస్తాయి. ఈ కష్టాలు త్వరలోనే తీరిపోనున్నాయి. ప్రధాన రహదారుల మార్గాల్లో 709 కిలోమీటర్ల మేర రోడ్ల పనుల నిర్వహణను ఐదేళ్ల పాటు ప్రైవేటు ఏజెన్సీల చూసుకుంటున్నాయి. దీనికోసం 1800 కోట్లను కేటాయించనుంది ప్రభుత్వం. ఈ మేరకు జోన్ల వారీగా ఏడు ప్యాకేజీలగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. దీనిలో నాలుగు ప్యాకేజీలకు అనుమతులిస్తూ ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసింది. మిగతా మూడు ప్యాకేజీలకు ఆర్థిక శాఖ అనుమతి రాగానే జీవోలు వెలువడనున్నాయి. తరవాత వారం రోజుల్లోగా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అమల్లోకి రానుంది. దీంతో టెండర్ దక్కించుకున్న సంస్థలు నెలరోజుల్లో రోడ్ల పనులు ప్రారంభించనున్నాయి. ఇందులో భాగంగా ఏజెన్సీలకు ఐదేళ్ళల్లో చేయవలసిన పనుల ప్రణాళికను రూపొందించారు.  టెండర్లు దక్కించుకున్న సంస్థలు మొదటి నెలలో గుంతలు పూడుస్తున్నారు. ఇక ఆరు నెలల్లోగా పూర్తిగా దెబ్బ తిన్న రోడ్లను బాగు చేయడం..ఆ తర్వాత తొలి ఏడాది 50% , రెండో ఏడాది 30% , మూడో ఏడాది 20% కొత్తగా రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు వాటి మెయింటెనెన్స్ నిర్వహిస్తారు. వీటితో సహా ఎక్కడ ఏ విధానం అవసరమనుకుంటే దాన్ని కాంట్రాక్టు సంస్థలు చూసుకోవాలి ఆధునిక సాంకేతికతను కూడా వినియోగించనున్నారు. రోడ్లు తళతళలాడేలా ప్రయాణానికి అనువుగా ఫుట్ పాత్ పచ్చదనం పారిశుధ్యం వంటి బాధ్యత లను కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఖచ్చితంగా పాటించాలి.జాతీయ రహదారులపై చిన్నపాటి గుంత పడిన నిర్మాణ సంస్థలు రోడ్డు నాలుగు మూడేళ్ల వరకూ తొలగించి కొత్త రోడ్లు వేస్తారు. నగరంలోని రహదారులపై ఇలాంటి పరిస్థితి ఉండదు. గుంత పడిన ప్రదేశంలో తాత్కాలిక మరమ్మతులు చేస్తారు. వర్షం పడితే రోడ్ల పై చెత్తా చెదారం.. నీటి నిల్వ.. డ్రైనేజ్ వాటర్ వస్తూ ఉంటుంది. దీనితో పాటు ఫుట్ పాత్, స్పీడ్ బ్రేకర్లు, బార్ మార్కింగ్స్, లేన్ మార్కింగ్, రోడ్ స్టార్స్, సైనేజ్ బోర్డు వంటివి కనిపించవు. ప్రైవేటు ఏజెన్సీలకు రోడ్డు మెయింటెనెన్స్ అప్పగించటం వల్ల ఇవన్నీ ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికి భాగ్యనగర ప్రజల సమస్యలు దీనితో పూర్తిగా తీరనున్నాయో లేదో వేచి చూడాలి.

సీఎం జగన్ కాన్వాయ్ ముందు కిడ్నీ బాధితుల నిరసన

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందు నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన కిడ్నీ బాధితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని జీజీహెచ్ లో ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకున్న రోగులకు చెక్కులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ వచ్చారు. కిడ్నీ మార్పిడి చేసుకున్న బాధితులకు పది వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కాన్వాయ్ ముందు కిడ్నీ మార్పిడి చేయించుకున్న బాధితులు ప్లకార్డులు ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన పోలీసులు బాధితులను అడ్డుకున్నారు. నిరసన తెలుపుతున్న బాధితను అరెస్టు చేసి అరండల్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముఖ్యమంత్రి వెళ్లిపోయిన తర్వాత బాధితులను పోలీసులు వదిలేశారు. డయాలసిస్ చేసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందని కిడ్నీ మార్పిడి చేయించుకున్నవారిని పట్టించుకోవటం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి కిడ్నీ మార్పిడి చేయించుకున్నవారిని కూడా పెన్షన్ లిస్ట్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. కేవలం డయాలసిస్ చేయించుకున్న వారికి మాత్రమే పెన్షన్  ఇస్తే కిడ్నీ మార్పిడి చేయించుకున్న వెంటనే విధుల్లోకి వెళ్లలేమని.. నిత్యావసరాలకు సైతం ఇబ్బంది పడుతున్నారన్నారు. అంతే కాక కేవలం తమ మందులకు నెలకు పది వేలు ఖర్చు అవుతున్న నేపధ్యంలో ప్రభుత్వమే తమ పై జాలి చూపాలని తెలిపారు. తమను కూడా పెన్షన్ లిస్ట్ లో జోడించాలని కొందరు కిడ్నీ మార్పిడి బాధితులు ఆవేదనను వ్యక్తం చేశారు.

ఖాళీగా రోడ్ల మీద తిరిగితే జైలుకే.. ఆవారా, పోకిరీలను టార్గెట్ చెయ్యనున్న పోలీసులు

  గ్రామాల్లో మహిళల రక్షణ.. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు మహిళలతో ప్రత్యేక కమిటీలను వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీలు గ్రామంలో జరిగే సంఘటనలను ఎప్పటికప్పుడు స్థానిక పోలీసులకు తెలియజేస్తారు. కమిటీలో గ్రామ కార్యదర్శి ఆయా మహిళా స్వశక్తి సంఘాలకు చెందిన ప్రతి నిధులు సభ్యులుగా ఉంటారు. మహిళల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల పై హోం మంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సమావేశమయ్యారు. ముఖ్యంగా గ్రామాల్లో జరిగే కొన్ని అసాంఘిక ఘటనలు.. జులాయిగా తిరిగే పోకిరీల చర్యలు పోలీసుల దృష్టికి రావడం లేదని అభిప్రాయపడ్డారు. గ్రామంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఈ కమిటీ గ్రామాల్లో జరిగే అన్ని విషయాలను ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారమిచ్చే అవకాశముంటుందని భావించారు. కమిటీల్లో మహిళా గ్రూపులను భాగస్వాములను చేయడం ద్వారా మహిళలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. మహిళలందరికీ క్లిష్ట సమయాల్లో ఏం చేయాలనే దానిపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. చదువుతో సంబంధం లేకుండా వీరి కోసం ప్రత్యేకంగా ఈ-ఎంపవర్ మెంట్ ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్సును ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఈ కోర్సులో మహిళల రక్షణకు సంబంధించి 17 నుంచి 20 ప్రశ్నలుంటాయి. వీటికి సరైన సమాధానం చెబితే సర్టిఫికెట్ ఇస్తారు. ఈ కోర్సులో క్లిష్ట సమయంలో ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి, పోలీసులకు ఏ విధంగా సమాచారమివ్వాలి ఇలాంటి అంశాల పై ప్రశ్నలుంటాయి. ఇది గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని మహిళలందరూ కోర్సును పూర్తి చేయవచ్చు. మహిళల రక్షణపై విస్తృత అవగాహన చేపట్టాలనీ పట్టణాలలోని అపార్టుమెంట్లు కాలనీల్లో ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇక పరిధితో సంబంధం లేకుండా మహిళల అపహరణకు సంబంధించిన కేసులను తక్షణమే రిజిస్టర్ చేసి వెంటనే రంగంలోకి దిగాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు షీ టీమ్స్ ను బలోపేతం చేస్తారు. హ్యాక్ ఐ యాప్ ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తారు. పోలీస్ యాప్, డైల్ 100, 101,1091,112 పై విస్తృత ప్రచారం చేస్తారు. హెల్ప్ లైన్ నెంబర్ లో కనిపించే విధంగా విద్యా సంస్థలు రవాణా వాహనాల్లో నోటీసు బోడ్లు పెడతారు.ప్రభుత్వ కార్యాలయాల్లో బహిరంగ స్థలాల్లో పాఠ్యపుస్తకాల మీద హెల్ప్ లైన్ నెంబర్లు కనిపించే విధంగా ఏర్పాటు చేస్తారు. రాష్ట్రమంతటా హోర్డింగ్స్, గోడల పై పెయింటింగ్ వేయించమన్నారు. విద్యా సంస్థల్లో డ్రగ్స్ వాడుతున్నట్లయితే కళాశాలలు రహస్యంగా తమకు నివేదించాలని పోలీసులు సూచించారు. దానిపై రహస్య విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎలాంటి ఉద్యోగం లేకుండా జులాయిగా తిరిగే వాళ్ల పై దృష్టి పెట్టాలని పోలీసు శాఖ భావిస్తోంది. కనీస అవసరాల ఖర్చుల కోసం ఇనుము, వాహనాల్లోంచి పెట్రోల్, డీజిల్, ఇళ్లల్లో రాత్రిపూట వస్తువుల దొంగిలిస్తూ తిరిగే వాళ్ల పై ఎక్కువ నిఘా పెట్టనున్నారు. నేరగాళ్ల మనస్తత్వం, జీవన విధానాలకు దగ్గరగా ఉన్న వాళ్ల పై ఎక్కువ నిఘా ఉంచాలని పోలీసులు భావిస్తున్నారు. వైట్ నర్ కు బానిసలై రైల్వే స్టేషన్ లు డంపింగ్ యార్డుల్లో సంచరించే వాళ్లపై కూడా కన్నేసి ఉంచుతారు.

మరో 'దిశా' ఘటన.. మహిళ పరిస్థితి విషమం

  దిశ హత్యోదంతం మరువక ముందే యూపీలో మరో దారుణం కలకలం రేపుతోంది. ఉన్నవ్ లో ఓ మహిళ పై అయిదుగురు నిందితులు అత్యాచారం చేసి కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. తమ పై కేసు విత్ డ్రా చేసుకోలేదని ఆక్రోశంతోనే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఎనభై శాతం గాయాలపాలయిన బాధితురాలిని హుటాహుటిన లక్నో ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. తన పై అయిదుగురు అత్యాచారం చేశారంటూ కొన్ని నెలల కిందట బాధితురాలు కేసు పెట్టింది. అప్పట్నుంచీ కేసు విత్ డ్రా చేసుకోవాలి అంటూ ఆమె పై నిందితులు ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ ఆమె దానికి అంగీకరించకపోవడంతో ఆమెను ఎలాగైనా హతమార్చాలన్న కసితో రగిలిపోయిన నిందుతులు అదనుకోసం వేచి చూశారు. రాయిబరేలి వెళ్లేందుకు ఆమె ఊరికి బయటికి రాగా అడ్డగించి రోడ్డు పైనే కిరోసిన్ పోసి తగలబెట్టేశారు. దారుణానికి ఒడిగట్టిన ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారైన మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. వారం కిందట దిశా హత్యోదంతం ఒక్క సారిగా షాక్ కు గురి చేసిన నేపథ్యంలో యూపీ ఘటన మరోసారి తీవ్రంగా కలచి వేస్తోంది.

కరెంటు చార్జీల మోత.. ఏపీలో భారీగా పెరగనున్న యూనిట్ చార్జీ

  ఏపీలో కరెంట్ చార్జీల పెంపునకు రంగం సిద్ధమవుతుంది. కొన్ని వర్గాల పై విద్యుత్ చార్జీల భారం మోపాలని డిస్కంలు ప్రతిపాదించాయి. చార్జీల పెంపు ద్వారా వచ్చే ఏడాది రూ.1373 కోట్ల రూపాయలు అదనంగా సమకూర్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం ఆదాయం అవసరాల నివేదిక టారిఫ్ ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ కమిషన్ సమర్పించాయి. చార్జీల పెంపు ప్రతిపాదన నుంచి 500 ల యూనిట్లలోపు గృహ వినియోగదారులను మినహాయించారు. ప్రస్తుతం 2 డిస్కంలకు కరెంటు చార్జిలు ఇతరత్రా మార్గాల్లో రూ.30,400 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కానీ వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.44,840 కోట్ల నిధులు అవసరముంది. చార్జీల పెంపు ద్వారా అదనంగా రూ.1373 కోట్లు సమకూర్చుకోవాలని డిస్కంలు ప్రతిపాదించాయి. ఆ తర్వాత కూడా ఆదాయానికి అవసరానికి మధ్య రూ.13,000 ల కోట్ల రూపాయల వ్యత్యాసముంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ద్వారా దీనిని పూడ్చుకోగలమని ఈ సంస్థలు రెగ్యులేటరీ కమిషన్ కు నివేదించాయి.  500 యూనిట్ లకు మించి విద్యుత్ వాడే గృహ వినియోగదారులకు యూనిట్ కు 90 పైసలు పెంచాలని ప్రతిపాదించారు. ఏపీలో కోటిన్నర మంది గృహ వినియోగదారులు ఉండగా ఇందులో నెలకు 500 ల యూనిట్లకు మించి విద్యుత్ వాడేవారు 2 శాతానికి మించి ఉండరని అధికార వర్గాలు చెబుతున్నాయి. నెలకు 200 ల యూనిట్లలోపు వినియోగించే వారికి స్వల్ప ఊరటను ప్రతిపాదించారు. ఇప్పటి దాకా వారికి గత సంవత్సరంలో వినియోగించిన విద్యుత్ ను బట్టి స్లాబ్ ను నిర్ణయించేవారు. కొత్త ప్రతిపాదనలతో ఏ నెల వినియోగంలో ఆ నెల యూనిట్ల ఆధారంగానే స్లాబ్ వుంటోందని ప్రతిపాదించారు. దీని వల్ల రాష్ట్రం మొత్తం మీద విద్యుత్ సంస్థలకు రూ.60 కోట్ల రూపాయల మేర ఆదాయం తగ్గుతోందని తమ అంచనాల్లో ప్రతిపాదించారు. గత ఆర్థిక సంవత్సరంలో చార్జీల భారం ఎక్కువగా ఉందని మీ కరెంట్ వద్దని రైల్వే పేర్కొన్న ఆ సంస్థకు నచ్చజెప్పి గిట్టుబాటు టారిఫ్ ను ఈఆర్సీ ఇప్పించింది. ఈ దఫా మాత్రం రైల్వేలకూ చార్జీలు పెంచాల్సిందేనని డిస్కంలు ప్రతిపాదించాయి.  పెంపు ప్రతిపాదనల్లో ప్రధానంగా 10 కేటగిరీల్లో లక్ష్యంగా చేసుకున్నారు. సాగు నీటి ఎత్తిపోతల పథకాలు, హెచటీ వాణిజ్య సంస్థలు, ఫంక్షన్ హాళ్లు, స్థానిక సంస్థలు, తాగు నీటి సరఫరా సంస్థలు, గ్రామీణ విద్యుత్ సహకార సంస్థలు వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలు అమలైతే స్థానిక సంస్థలపై 24.92 శాతం దాకా అదనపు భారం పడుతుంది. రైల్వేపై ఏకంగా 56.67 శాతం, పౌల్ట్రీ రంగంపై 14.42 శాతం, ఎత్తిపోతల పథకాలపై 23.26 శాతం భారం పడనుంది.ఇక అత్యధికంగా క్యాటగిరి-4 లో చార్జీల పెంపుతో 575 కోట్ల దాకా రాబట్టనున్నారు. క్యాటగిరీ-5 పై 302 కోట్ల మేర భారం పడుతోందని లెక్కలు తేల్చారు. మరోవైపు డిస్కంల పై విద్యుత్ కొనుగోళ్ల భారం కూడా పెరిగింది. 2019-20 లో ఈఆర్సీ ఆమోదించిన మేరకు కరెంటు కొనుగోలు వ్యయం యూనిట్ కు 3 రూపాయల 98 పైసలు ఉండగా, 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 4 రూపాయల 72 పైసలకు చేరింది. విద్యుత్తు కొనుగోళ్లకు ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 2019-20 లో రూ.11,402 కోట్లు కాగా రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.12,439 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఒక యూనిట్ ను సరఫరా చేయడానికి అయ్యే ఖర్చు 2019-20 లో 6 రూపాయల 18 పైసలు కాగా 2020-21 లో 7 రూపాయల 36 పైసలుగా ఉంటుందని తేల్చారు. ఏఆర్ఆర్ లో పేర్కొన్న లోటును ప్రభుత్వం పూర్తి స్థాయిలో భరిస్తే చార్జీల పెంపు ఉండదు. అయితే విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన ఏఆర్ఆర్ టారిఫ్ ప్రతిపాదనలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం టారిఫ్ ఉత్తర్వులు ఇస్తామని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి తెలిపింది.

కొత్త దేశం వచ్చింది.. ఆ దేశం నుండి 14 లోకాలకు ప్రవేశం ఫ్రీ.. నిత్యానందుడే రాజు

  కొత్త ఇళ్లు కట్టుకునే వాళ్ళని చూశాము.. కొత్త వెంచర్ వేసే వాళ్లని చూసి ఉంటాము. అలాంటిది ఊరు.. రాష్ట్రం కూడా కాదు ఏకంగా కొత్త దేశాన్నే ఏర్పాటు చేసుకున్నాడు నిత్యానంద. " కైలాసం రివైవింగ్ ద ఎన్ లైట్ అండ్ సివిలైజేషన్ ద గ్రేట్ హిందూ నేషన్ " అనే పేరుతో నిత్యానంద కొత్త దేశానికి నామకరణం కూడా చేశాడు. దక్షిణ అమెరికా లోని ఈక్వెడార్ కు సమీపంలో ఉంది. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు సమీపంలో ఉండే ఒక ద్వీపాన్ని ఈక్వెడార్ నుంచి కొనేసుకున్న నిత్యానంద ఆ దీవిలో తన సొంత దేశాన్ని ఏర్పాటు చేసి సొంత జెండా, పాస్ పోర్ట్, జాతీయ చిహ్నం, రాజ్యాంగం ఇలా అన్నింటినీ రూపొందించుకున్నాడు. ఆ దేశానికి ఆయనే రాజు.. పాలన కోసం ప్రధాన మంత్రిని మంత్రిమండలిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కైలాస వాసులు కావాలనుకునే వారికి ఒక బంపర్ ఆఫర్ ఉంది. అదేంటంటే ఆ దేశానికి విరాళాలు ఇవ్వడమే.. పైసలిస్తే పౌరసత్వ పథకం అన్నమాట. అలా పైసలిచ్చినవారికి పాస్ పోర్టులు ఇస్తారు. ఆ దేశ పాస్ పోర్ట్ పౌరుసత్వం లేకపోయినంత మాత్రాన దిగులు చెందక్కర్లేదు.. ప్రపంచంలో ఏ మూల ఉన్నా హిందూయిజాన్ని ఆచరించలేకపోతున్న హిందువులైతే చాలు ఆ దేశ పౌరులేనట, ఆదేశం హద్దుల్లేని దేశమట.  మనం ఫలానా దేశ పౌరులమని ధ్రువీకరించే గుర్తింపు పత్రం పాస్ పోర్టు. మన అందరి వద్ద ఉండేది భారత పాస్ పోర్ట్ దాని ప్రయోజనం అంతవరకే, వేరే దేశాలకు వెళ్లాలంటే మన పాస్ పోర్టుతో పాటు ఆయా దేశాలు ఇచ్చే వీసా కావాలి. కానీ నిత్యానందుడు తన కైలాసవాసులకు ఇచ్చే పాస్ పోర్టుతో 11 డైమన్షన్ లకు, 14 లోకాల లోకి ప్రవేశం ఉచితం. ఆయా లోకాల వీసాలు గట్రా అక్కర్లేదు. కానీ పాస్ పోర్టులో మాత్రం కించిత్ స్థాయి బేధాలున్నాయి. స్థాయిని బట్టి కొందరికి బంగారం రంగులో ఉండే గోల్డెన్ పాస్ పోర్ట్, మరికొందరికీ ఎర్ర రంగు అట్టతో ఉండే పాస్ పోర్ట్ ఇస్తారు. ఏ స్థాయి వాళ్ళకి ఏ రంగు పాస్ పోర్ట్ ఇస్తారనే వివరాల్లో మాత్రం కైలాస్ అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించలేదు. తన సొంత దేశానికి ప్రధానిగా తన అనుచరుడు సన్నిహితుడైన మా అనే వ్యక్తిని ప్రధానిగా నియమించిన నిత్యానంద మంత్రిమండలిని ఏర్పాటు చేశాడు. సదరు ప్రధాని మంత్రులతో నిత్యానందుడు నిత్యం చర్చలు సమావేశాలు కూడా జరుపుతున్నాడు. కైలాస దేశ రాజ్యాంగంలో 547 పేజీలున్నాయి. తమిళం, హిందీ, సంస్కృత భాషల్లో ఆ రాజ్యాంగం వుంటుంది. 

దాగుడుమూతలు ఆడుతున్న గంటా.. అడుగులు ఏ పార్టీ వైపు?

  విశాఖ ఉత్తర నియోజక వర్గం టిడిపి ఎమ్మెల్యే గంటా పార్టీని వీడుతారని గత కొన్ని నెలల నుంచి జోరుగా ప్రచారం జరిగింది. అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని కూడా టాక్ వినిపించింది. అయితే జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పుతున్న మంత్రి ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రయత్నానికి బ్రేక్ పడింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి గంటా వస్తే పార్టీకి మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని ఆ మంత్రి అధిష్ఠానం వద్ద గట్టిగా వాదించారు. దీంతో అధిష్టానం కూడా ఆలోచనల్లో పడి ఏ నిర్ణయమూ తీసుకోలేక పోయింది. అయితే మారిన రాజకీయ పరిస్ధితుల్లో బిజెపిలో చేరాలని గంటా శ్రీనివాసరావు నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గం చెబుతుంది. ఇప్పటికే ఆయన జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయి బిజెపి నేతలతో మంతనాలు కూడా జరిపారు. సమీప రోజుల్లోనే ఆయన సైకిల్ దిగడం ఖాయమని విశాఖలో వార్తలు గుప్పుమంటున్నాయి. విచిత్రమేమిటంటే గంటా రాకను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది వ్యతిరేకిస్తుంటే కమలం పార్టీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. ఆయన రాకను నగరంలో మెజారిటీ బిజెపి నేతలు స్వాగతిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ బిజెపి పెద్దలతో గంటా శ్రీనివాసరావు ఒక దఫా చర్చలను పూర్తి చేశారు. గంటాతో పాటు పలువురు టిడిపి నేతలు కూడా పార్టీ మారే అవకాశం ఉంది.  ప్రజారాజ్యం పార్టీలో గంటా` ఉన్నప్పుడు నగరంలో చాలా మంది నేతలు ఆయనకు సన్నిహితులుగా ఉన్నారు. ఇప్పుడు కూడా వారు ఆయన వెన్నంటే ఉన్నారు. ఒకవేళ టిడిపిని గంటా వీడితే ఎవరెవరు ఆయన్ను అనుసరిస్తారు అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. బిజెపిలో గంటా శ్రీనివాసరావు చేరతారన్న అంశాన్ని ఆ పార్టీ నేతల వద్ద ప్రస్తావిస్తే అవును కొంతమంది టిడిపి నేతలు మా పార్టీ లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు అని బదులిస్తున్నారు. ఎవరెవరు చేరబోతున్నారు అని అడిగితే మాత్రం ఆ ఒక్కటీ అడగొద్దు అని సమాధానం దాటవేస్తున్నారు. ఇదిలా వుంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి ఆ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొని అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అయితే ఎపిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురవుతున్న సవాళ్లను తట్టుకొని నిలబడాలంటే బీజేపీలో చేరడం మంచిదనే అభిప్రాయానికి చాలా మంది నేతలు వచ్చేశారు. తమకు రాజకీయ రక్షణ కోసం విశాఖ టిడిపికి చెందిన కొంతమంది నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక్కరు కూడా తాము టిడిపిని వీడి బిజెపిలోకి వెళుతున్నామని బహిరంగంగా చెప్పడం లేదు. అలా అని వలసలపై వస్తున్న వార్తలను సైతం వారు ఖండించడం లేదు. కావున గంటాపై వినిపిస్తున్న వార్తలు ఊహాజనకంగా మిగులుతాయో నిజమవుతాయో చూడాలి.

ఎమ్మెల్యేలతో రెగ్యులర్ టచ్‌లో చంద్రబాబు... భయపడొద్దంటూ భరోసా

టీడీపీ అధినేత చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు. వీలు కుదిరినప్పుడల్లా ఫోన్లో మాట్లాడుతూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలతో వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుండటంతో అప్రమత్తమైన చంద్రబాబు... తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ గురిపెట్టిన ఎమ్మెల్యేలు... ఊగిసలాటలో ఉన్న నేతలతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతున్న చంద్రబాబు... తొందరపడి ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని చెబుతున్నారు. వైసీపీ కావాలనే మైండ్ గేమ్ ఆడుతోందని, ఆర్ధిక మూలాలపై గురిపెట్టి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటోందని, అయినాసరే ఎవరూ భయపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు. ఇక, ఎప్పట్నుంచో పార్టీ మారతారని ప్రచారం జరుగుతోన్న విశాఖ సిటీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కూడా చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. మొదట్లో గంటా వైసీపీలోకి వెళ్తారని... ఆ తర్వాత బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే, ఎప్పట్నుంచో తెలుగుదేశం కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న గంటా... ప్రస్తుతం ఏ పార్టీలోనూ చేరకుండా స్తబ్ధుగా ఉండటంతో... బాబు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఏదైనా సమస్య ఉంటే తనను కలిసి మాట్లాడాలని, ఎలాంటి ఇబ్బంది ఉన్నా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే, టీడీపీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి రావాలని చంద్రబాబు ఆహ్వానించడంతో... తప్పనిసరిగా వస్తానంటూ గంటా చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పై కూడా వైసీపీ నుంచి ఒత్తిడి వస్తున్నట్లు తెలియడంతో మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే, అనగాని ఫోన్లో అందుబాటులోకి రాలేదని చెబుతున్నారు. ఇక, గొట్టిపాటి రవికుమార్ పైనా అలాంటి ఒత్తిడే ఉన్నా... ఇప్పటికిప్పుడు పార్టీ మారే ఆలోచన లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. చంద్రబాబుతో కూడా ఆయా ఎమ్మెల్యేలు తమకు పార్టీ మారే ఆలోచన లేదని చెప్పినట్లు తెలుస్తోంది.

నత్త నడక నిర్మాణం... ప్రతి పండగకు కొన్ని ఇస్తామనేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వం

గ్రేటర్ సిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు నత్త నడకన సాగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం గ్రేటర్ పరిధిలో లక్ష ఇళ్లు నిర్మిస్తామని చెప్పినా అనుకున్న సమయానికి పూర్తి కావడం లేదు. కొన్ని చోట్ల మాత్రం కోర్టు కేసుల వల్ల నిర్మాణమే జరగలేదు. హైదరాబాదులోని 109 ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తుండగా వీటిలో ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకొని లబ్ధిదారుల అందినవి కేవలం 30% ఇళ్లు మాత్రమే. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చాలా వరకు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. సింగం చెరువు తండాలో 176, ఐడీహెచ్ లో 136, చిత్తారమ్మ బస్తీలో 101 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యి లబ్ధిదారులకు అందాయి. ఇక కొల్లూరులో 15,660 మెగా డబుల్ బెడ్ రూంల ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. ఒకే చోట 15,660 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది.117 హౌజింగ్ బ్లాకుల్లో S9,S+10,S+11 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో మరి కొన్ని.. రెవెన్యూ కోర్టు కేసులతో 7 ప్రాంతాల్లో 1,918  ఇళ్ళ నిర్మాణాలు ఆగిపోయాయి.ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిలో 9 వేల ఇళ్లు పూర్తయినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఫిబ్రవరిలో వీటిని అర్హులకి అందిస్తామన్నారు. జూన్ వరకు 50 వేల ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.కార్వాన్ నియోజక వర్గంలోని బోజగుట్టలో 1800 వందలు కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. శంకుస్థాపన చేసిన సమయంలో వాటిని పద్నాలుగు నెలల్లో నిర్మించి ఇస్తామని అప్పటి వరకు పక్కనే ఉన్న ఖాళీ స్థలాల్లో గుడిసెలు ఏర్పాటు చేసుకోవచ్చని రెండేళ్ల కిందట జీహెచ్ ఎంసీ అధికారులు తెలిపారు. అయితే కొంత మంది అక్కడే గుడిసెలు వేసుకోగా మరి కొందరు వేరే ప్రాంతాల్లో అద్దెకుంటున్నారు. శంకుస్థాపన చేసి రెండేళ్లవుతున్నా పనుల్లో మాత్రం పురోగతి లేకపోవడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల కిందట విజయ దశమి సందర్భంగా 109 ప్రాంతాల్లో శంకుస్థాపనల చేస్తే వాటిలో చాలా వరకు నిర్మాణా లు నిదానంగా సాగుతున్నాయి. అవి ఎప్పుడు పూర్తవుతాయో లబ్ధిదారులకు ఎప్పుడు అందుతాయో తెలియక గందరగోళంలో ఉన్నారు.

సాధారణ ఎమ్మెల్యేగా చంద్రబాబు..! వింటర్‌లో షాకిచ్చేందుకు వైసీపీ పావులు

దారుణ పరాజయంతో దెబ్బతిన్న తెలుగుదేశం ఆత్మస్థైర్యాన్ని మరింత దెబ్బ తీసేందుకు ఆర్నెళ్లుగా పావులు కదుపుతోన్న జగన్ ప్రభుత్వం... టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. టీడీపీ నుంచి గెలిచిన 23మంది ఎమ్మెల్యేల్లో ఐదారుగురికి పక్కకు లాగేస్తే, బాబుకి ప్రతిపక్ష హోదా పోయినట్లే. ఎందుకంటే, 175 సీట్లున్న ఏపీ అసెంబ్లీలో ఏ పార్టీకైనా ప్రతిపక్ష హోదా దక్కాలంటే పదో వంతు సీట్లు రావాల్సి ఉంటుంది. అంటే కనీసం 17 లేదా 18మంది ఎమ్మెల్యేలు ఉండాలి. అయితే, టీడీపీకి ప్రస్తుతం 23మంది ఎమ్మెల్యేలు ఉండటంతో... ఐదారుగుర్ని లాగేస్తే.... ఆటోమేటిక్ గా ప్రతిపక్ష హోదా కోల్పోతుంది. ఇప్పుడదే పనిలో వైసీపీ సీరియస్ గా వర్క్ చేస్తోంది.  ఇప్పటికే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ లాక్కుంది. అధికారికంగా వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరకపోయినా... తెలుగుదేశం నుంచి మాత్రం బయటికి వచ్చేశారు. దాంతో, మరో ఐదుగురు ఎమ్మెల్యేలను టీడీపీ నుంచి బయటికి లాగాలని వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. నయానాభయానో టీడీపీ ఎమ్మెల్యేలను తనవైపుకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా విశాఖలో ఒకరిపై... గుంటూరు జిల్లాలో ఇద్దరిపై... ప్రకాశం జిల్లాలో ముగ్గురిపై గురిపెట్టినట్లు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్... ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, వీరాంజనేయస్వామిని వైసీపీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్ధిక మూలాలపై దెబ్బకొట్టడం ద్వారా తమవైపు రప్పించుకోవాలని జగన్ ప్రభుత్వం చూస్తోంది. మొత్తానికి, చంద్రబాబు టార్గెట్ గా టీడీపీ ఎమ్మెల్యేలపై గురిపెట్టిన వైసీపీ... ఈసారి సీరియస్ గా ప్రయత్నిస్తోంది. ఒకవైపు చంద్రబాబుపై ముప్పేట దాడి చేస్తూనే, ఎమ్మెల్యేలను దూరం చేయడం ద్వారా ఆత్మస్థైర్యాన్ని తీయాలని పావులు కదుపుతోంది. అలా, చంద్రబాబు స్థాయిని తగ్గించి, అసెంబ్లీలో మరింత ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. మరి, ఈ శీతాకాల సమావేశాల్లోనే బాబుకి ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తారో ఏమో చూడాలి.

కేసీఆర్ బాటలో జగన్..! ప్రజలపై పెనుభారం మోపేందుకు అడుగులు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అనుసరిస్తున్నట్లే అనిపిస్తుంది. రైతుబంధు మాదిరిగా రైతు భరోసా... కంటి వెలుగు... ఇలా కొన్ని పథకాల్లో సారూప్యత కనిపిస్తుంది. ఇక, ఆర్టీసీ విషయంలో కేసీఆర్ బాటలోనే జగన్ కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న జగన్ నిర్ణయమే తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు దారి తీసింది. చివరికి కార్మికులు ఏమీ సాధించలేక చేతులెత్తేస్తే ప్రభుత్వం మాత్రం ప్రజలపై ఛార్జీల భారం మోపింది. అయితే, తెలంగాణ బాటలోనే ఆంధ్రప్రదేశ్ కూడా ఆర్టీసీ ఛార్జీలను పెంచేందుకు సిద్ధమవుతోంది. నష్టాలను పూడ్చుకునేందుకు తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలను పెంచడంతో ఏపీలోనూ ఫాలో కావాలని దాదాపు నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్టీసీకి ఏటా వెయ్యి కోట్లకు పైగా నష్టాలు వస్తున్నాయి. డీజిల్ ధరలు పెనుభారంగా మారడంతో ఎప్పట్నుంచో ఛార్జీలు పెంచాలని ఏపీఎస్-ఆర్టీసీ కోరుతోంది. కానీ, నాలుగైదు ఏళ్లుగా ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం ఒప్పుకోలేదు. ప్రయాణికులపై భారం మోపకుండానే... ఇతర మార్గాల్లో ఆదాయం పెంచుకోవాలని చెబుతూ వచ్చింది. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఏపీఎస్-ఆర్టీసీ కూడా ఆక్యుపెన్సీ రేషియోను క్రమంగా 82శాతానికి  పెంచుకుంటూ వచ్చింది. అలాగే, సరుకు రవాణా ద్వారా కూడా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఇంత చేస్తున్నప్పటికినీ నష్టాలు మాత్రం తప్పడం లేదు. అయితే, అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగన్ సర్కారు ప్రకటించడంతో కార్మికులకు భారీ ఊరట లభించినా... అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు ఛార్జీలను పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, ఆర్టీసీతోపాటు ప్రైవేట్ బస్సుల ఛార్జీల నియంత్రణ కోసం ప్రత్యేక రెగ్యులేటరీ కమిషన్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఒకవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూనే... మరోవైపు ప్రయాణికులపై భారం వేసేందుకు అడుగులు వేయడం సరికాదంటున్నారు. వచ్చే ఏడాది నుంచి ఆర్టీసీ కార్మికుల జీతాల భారాన్ని ప్రభుత్వమే తీసుకుంటున్నప్పుడు... ఇక ఛార్జీలు పెంచాల్సిన అవసరమేంటని అంటున్నారు.

మళ్లీ లక్ష్మణ్ కే టీబీజేపీ పగ్గాలు..! ఏపీలో మాత్రం వాళ్లిద్దరిలో ఒకరు..!

తెలంగాణ బీజేపీ పగ్గాలు మళ్లీ లక్ష్మణ్ కే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జితేందర్ రెడ్డి, డీకే అరుణ, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ తదితరులు టీబీజేపీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించినప్పటికీ... బీజేపీ అధిష్టానం మాత్రం మళ్లీ లక్ష్మణ్ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ఇటీవల జితేందర్ రెడ్డి.... బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలవడంతో తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించవచ్చని ప్రచారం జరిగింది. అయితే, తెలంగాణ సామాజిక పరిస్థితులపై లెక్కలేసిన బీజేపీ అగ్రనాయకత్వం లక్ష్మణ్ ను కొనసాగించడమే పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని నిర్ణయానికి వచ్చాయట. దాంతో, తెలంగాణ బీజేపీ పగ్గాలు మరోసారి లక్ష్మణ్ కే దక్కనున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను మార్చబోతున్నారనే మాట ఎప్పట్నుంచో వినిపిస్తోంది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒకరికి బాధ్యతలు అప్పగించవచ్చని ప్రచారం జరిగింది. అయితే, కన్నాను మార్చితే... బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కి గానీ... ఎమ్మెల్సీ విష్ణువర్దన్ రెడ్డికి కానీ ఏపీ బీజేపీ పగ్గాలు ఇస్తారని అంటున్నారు.

ఉల్లి సెగ... కిలో రూ.150 రూపాయలు మాత్రమే !!

  ఉల్లి సంక్షోభంతో దేశమే కుదేలవుతోంది. ఉల్లి ధర సెంచరీ దాటేసి రోజురోజుకు మరింత ఘాటుగా మారుతోంది. సంక్రాంతి దాటితే కానీ రేట్లు దిగి వచ్చే అవకాశం లేకపోవటంతో ఉల్లి పేరు చెబితేనే వినియోగదారుల గుండెలు గుబేలు మంటున్నాయి. ఉల్లి ఘాటు ఇప్పట్లో తగ్గేలా లేదు. ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత వారం రిటైల్ ధర కిలో రూ.100 రూపాయలు ఉండగా ఇప్పుడు రూ.150 రూపాయల వరకు వెళ్ళనుంది. బుధవారం ( డిసెంబర్ 4వ తేదీ) క్వింటా ఉల్లి కర్నూలు మార్కెట్ లో రూ.12510 రూపాయలు ఉండగా హైదరాబాద్ లో రూ.15000 వేల రూపాయలు పలికింది. దీంతో రెండు రాష్ట్రాల్లో ని రిటైల్ వ్యాపారులు ఇప్పుడే కిలో రూ.150 రూపాయలని అనేస్తున్నారు. ఇంకా ధర పెరుగుతుందనే ఉద్దేశంతో చాలా మంది సరుకు లేదని చెప్పేస్తున్నారు. ఉల్లి అధికంగా పండించే రాష్ట్రాల్లోనే ప్రస్తుతం పంట ఉత్పత్తి లేకపోవటంతో మార్కెట్ కు సరుకు రాక తగ్గిపోయింది. గతంలో కర్నూలు మార్కెట్ కు రోజుకు  5-6 వేల క్వింటాళ్ళు హైదరాబాద్ హోల్ సేల్ మార్కెట్ కు 200 లారీల సరుకు వచ్చేది. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పంట నిల్వలు తగ్గిపోయి మార్కెట్ కు సరుకు రావడం బాగా తగ్గిపోయింది. నాసిక్, సోలాపూర్ నుంచి చాలా రాష్ట్రాలకు ఉల్లి రవాణా జరుగుతోంది. అక్కడి నుంచి ఉల్లి తెప్పించాలంటే రవాణా ఆలస్యం కావడమే కాకుండా ఖర్చులు భారమవుతాయని వ్యాపారులు పెద్దగా సరుకు తెప్పించడం లేదు. ఏపీలోనే రైతు బజార్ లలో కిలో ఉల్లి రూ.25 రూపాయలకే సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మార్కెటింగ్ అధికారులు కర్నూలు మార్కెట్ కు వస్తున్న ఉల్లిపాయలను కొని రైతు బజార్ లకు తరలిస్తున్నారు. సబ్సిడీ పై ఉల్లిని అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కర్నూలు మార్కెట్ లో ఓ వైపు వ్యాపారులు మరో వైపు అధికారులు పోటీ పడి ఉల్లిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఉల్లి రైతుల మాట చెల్లుబాటు అవుతుంది. కానీ సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న ఉల్లి పంట సంక్రాంతి తర్వాత మార్కెట్ కు వస్తుందని అప్పటికీ ఉల్లి నిల్వలు అడుగంటి పోతాయని మార్కెటింగ్ వర్గాల సమాచారంతో కేంద్ర ప్రభుత్వం ఈజిప్టు నుంచి ఉల్లి దిగుమతి చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఈజిప్టు ఉల్లి ఇంకా రాష్ట్రాలకు చేరలేదు. దీంతో ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ రాష్ట్రాల సీఎస్ ను ఆదేశించారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో బడా వ్యాపారులు నిల్వలను  పొదుపుగా వదులుతుండడంతో కొరత తీరడం లేదని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.  

కిడ్నీ బాధితులకు పది వేల పెన్షన్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ముఖ్యమంత్రి కాన్వాయ్ ముందు నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన కిడ్నీ బాధితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని జీజీహెచ్ లో ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకున్న రోగులకు చెక్కులు పంపిణీ  చేసేందుకు రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి వచ్చారు. కిడ్నీ మార్పిడి చేసుకున్న బాధితులకు పది వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కాన్వాయ్ ముందు కిడ్నీ మార్పిడి చేయించుకున్న బాధితులు ప్లకార్డులు ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన పోలీసులు బాధితులను అడ్డుకున్నారు. నిరసన తెలుపుతున్న బాధితను అరెస్టు చేసి అరండల్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముఖ్యమంత్రి వెళ్లిపోయిన తర్వాత బాధితులను పోలీసులు వదిలేశారు. డయాలసిస్ చేసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందని కిడ్నీ మార్పిడి చేయించుకున్నవారిని పట్టించుకోవటం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి కిడ్నీ మార్పిడి చేయించుకున్నవారిని కూడా పెన్షన్ లిస్ట్ లో చేర్చాలని డిమాండ్ చేశారు.కేవలం డయాలసిస్ చేయించుకున్న వారికి మాత్రమే పెన్షన్  ఇస్తే కిడ్నీ మార్పిడి చేయించుకున్న వెంటనే విధుల్లోకి వెళ్లలేమని.. నిత్యావసరాలకు సైతం ఇబ్బంది పడుతున్నారన్నారు. అంతే కాక కేవలం తమ మందులకు నెలకు పది వేలు ఖర్చు అవుతున్న నేపధ్యంలో ప్రభుత్వమే తమ పై జాలి చూపాలని తెలిపారు. తమను కూడా పెన్షన్ లిస్ట్ లో జోడించాలని కొందరు కిడ్నీ మార్పిడి బాధితులు ఆవేదనను వ్యక్తం చేశారు.

తెలుగోడి తెలివి.. వాటర్ వెహికల్.. బోరు నీళ్లు పోస్తే చాలు

  పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా నీటితో నడిచే వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు గుంటూరుకు చెందిన పర్యావరణ శాస్త్రవేత్త సుందర్రామయ్య. తనకు వచ్చిన ఆలోచనలతో పదహారేళ్ల పాటు కష్టపడి తాను కన్న కలను నిజం చేశారు. సాధారణ అవసరాలకు వాడే నీటితోనే నడిచే వాహనాన్ని తయారు చేశారు. వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీ ద్వారా 20 శాతం ఇంధనం, 80 శాతం నీరుతో వాహనాలను నడపవచ్చు.  నీరు అంటే ఆక్సిజన్, హైడ్రోజన్ ల మిశ్రమం. నీటిలోంచి హైడ్రోజన్ ను వేరు చేసి ఎందుకు ఇంధనంగా ఉపయోగించకూడదు అన్న ఆలోచనలో ప్రయోగాలు మొదలు పెట్టారు సుందరరామయ్య. వాటర్ హైడ్రోసిస్ థెరపీ ద్వారా హైడ్రోజన్ తయారవుతుంది. అలా తయారైన హైడ్రోజన్ ఇంజన్ లోకి వెళ్లి కంప్రెస్ అవుతుంది. ఇంజన్ నడపడానికి ఈ హైడ్రోజన్ ఉపయోగపడుతుంది. వాటర్ ఫీల్ తో వాహనాల మైలేజీ కూడా పెరుగుతుందంటున్నారు సుందర్. ఒక లీటరు వాటర్ ని తీసుకొని అది కొన్ని వందల లీటర్ల హైడ్రోజన్ కింద కన్వర్ట్ చేస్తోంది. ఈ హైడ్రోజన్ డైరెక్ట్ గా కంబషన్ చాంబర్ లోకి వెళ్లి ఇంధనంగా ఉపయోగపడుతుంది. ఒక లీటర్ వాటర్ ఫ్యూయరల్ 30 లీటర్ల ఫ్యూయల్ కి సమానమంటున్నారు సుందర్. హైడ్రోజన్ ఫ్యూయల్ పర్యావరణరహితం అంటున్నారు సుందర్.  ప్రస్తుత వాహనాల ద్వారా పర్యావరణానికి కీడుచేసే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా రిలీజ్ అవుతోంది. వాటర్ తో నడిచే వాహనాల ద్వారా కేవలం ఆక్సిజన్ మాత్రమే విడుదలవుతుంది. మరో 6 నెలల్లో పూర్తి స్థాయిలో నీటితో నడిచే కార్లు రూపొందించబోతున్నామన్నారు సుందర్. నీటి నుంచి హైడ్రోజన్ వేరుచేయటం చాలా ప్రమాదకరమైన ప్రక్రియ అయినప్పటికీ చాలా రిస్క్ తో కూడిన ప్రయోగం చేస్తున్నామని చెప్పారు. మరోవైపు వాటర్ ఫ్యూయల్ పరికరం ఖరీదు చాలా ఎక్కువ. ఈ పరికరాన్ని వాహనంలో అమర్చాలంటే దాదాపు 3 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇది సామాన్యుడికి చాలా భారం. అందుకే ఈ ప్రొడెక్ట్ ను సామాన్యులకు అందుబాటు లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు సుందర్.

మాల వేస్తే స్కూలుకు రావద్దు.. అయ్యప్ప భక్తులపై క్రిస్టియన్ స్కూల్ ఆంక్షలు

  భువనగిరి ఇండియన్ మిషన్ స్కూలు యాజమాన్యం పై అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ పై దాడి చేసి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. అయ్యప్ప మాల వేసుకున్న పిల్లలను క్లాసులకు రావద్దని చెప్పడంతో యాజమాన్యంపై స్వాములు మండి పడ్డారు. మాల వేసుకుంటే స్కూలుకు ఎందుకు రాకూడదని పాఠశాల ప్రిన్సిపల్ ను, టీచర్లను నిలదీశారు. ఇండియన్ మిషన్ స్కూల్ లో నాలుగో తరగతి చదువుతున్న ప్రణీత్ రెడ్డి తండ్రితో పాటు అయ్యప్ప మాల వేసుకున్నాడు. అయ్యప్ప మాల వేసుకున్నాడని ప్రణీత్ ను క్లాస్ లోకి రావద్దని పాఠశాల యాజమాన్యం ఇంటికి పంపించింది. అలానే నాలుగు ఐదు తరగతులు చదువుతున్న నలుగురు విద్యార్థులు మాల వేసుకున్నారు. రోజూ లానే స్కూలుకు వెళ్లిన ప్రణీత్ ను తిరిగి ఇంటికి పంపేసింది యాజమాన్యం. వెంటనే ప్రణీత్ తండ్రి వెళ్లి ప్రిన్సిపాల్ ని ప్రశ్నించగా.. మాలలో ఉన్న విద్యార్ధులను బడిలోకి అనుమతించకూడదని యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. వెంటనే అయ్యప్ప స్వాములకు శివారెడ్డి సమాచారమిచ్చారు.  పెద్ద సంఖ్యలో బడి ప్రాంగణం దగ్గరకు చేరుకున్న అయ్యప్ప స్వాములు స్కూల్ ఎదుట ధర్నా చేశారు. తమ మత విశ్వాసాలకు భంగం కలిగిస్తున్న పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అక్కడే మూడు గంటల పాటు ఆందోళన నిర్వహించారు. స్కూల్ లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. అదే సమయంలో పలువురు తల్లితండ్రులు స్కూల్ కి వచ్చి పిల్లలను ఎందుకు వేధిస్తున్నారని టీచర్లను నిలదీశారు. పాఠశాల యాజమాన్యం అయ్యప్ప స్వాముల వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొనడంతో అక్కడికి పోలీసులొచ్చారు. విద్యాశాఖాధికారులు కూడా జోక్యం చేసుకోవటంతో పాఠశాల యాజమాన్యం దిగొచ్చింది. తాము ఏ మతానికి వ్యతిరేకంకాదని అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని చెప్పి అయ్యప్ప స్వాములను క్షమాపణ కోరింది. మాల వేసుకున్న విద్యార్ధులను అనుమతిస్తామని పేర్కొంది. గతంలో వినాయక దీక్షను చేపట్టిన విద్యార్ధులను కూడా బడిలోకి యాజమాన్యం అనుమతించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి జరిగిన దానికి ప్రిన్సిపాల్ క్షమాపణలు చెప్పడంతో అయ్యప్ప స్వాములు శాంతించారు.

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడటానికి తెలుగు సినీ ప్రముఖుల సాయం!

  కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. 15 శాసన సభ స్థానాలకు ప్రచారం ముగిసింది అక్కడ. గురువారం ఉప ఎన్నికలు జరుగుతాయి. 13 మంది కాంగ్రెస్, జేడీఎస్ రెబల్స్ కు టికెట్ ఇచ్చిన బిజెపి తన ఆలోచనను చెప్పేసింది. 2018 శాసన సభ ఎన్నికల తరవాత యడ్యూరప్ప సీఎం అయ్యారు. మధ్యలో జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ నేతగా కుమారస్వామి కొంతకాలం ముఖ్యమంత్రిగా నిర్వహించారు. ఇప్పుడు యడ్యూరప్ప అధికారాన్ని నిలబెట్టుకుంటారా లేదా అన్నది పెద్ద ప్రశ్న. 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో 17 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇటీవలే జరిగిన విశ్వాస పరీక్షలో యడ్యూరప్పకు అనుకూలంగా 106 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాలొచ్చే డిసెంబరు 9 నాటికి అసెంబ్లీ బలం 222 గా వుంటుంది. అంటే కనీస మెజారిటీకి 112 మంది మద్దతు అవసరం. బిజెపి తరపున మరో 6 గురు గెలిస్తే యడియూరప్ప ప్రభుత్వం గట్టెక్కినట్లే. 15 స్థానాల్లో ఘన విజయం సాధిస్తామని బీజేపీ చెప్పుకుంటుంది. కాంగ్రెస్, జేడీఎస్ వాదన మాత్రం మరోలా ఉంది. బిజెపి 2,3 స్థానాలకు మించి గెలవదని కాంగ్రెస్ అంటోంది. మహారాష్ట్ర పరిణామాల్ని గుర్తు చేస్తూ త్వరలో విపక్ష సంకీర్ణం కర్ణాటకలో కూడా ఏర్పాటు కావడం ఖాయమని కాంగ్రెస్ నేతలు విశ్లేషించుకుంటున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత విడిపోయిన కాంగ్రెస్ ,జేడీఎస్ మళ్లీ చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఉప ఎన్నికల ఫలితాలను బట్టి 2 పార్టీలు కలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. సీఎం పదవిపై పీటముడి లేదని అవసరాన్ని అవకాశాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని మాజీ సీఎం కుమారస్వామి తెలిపారు.  కర్ణాటక ఉప ఎన్నికల ప్రభావం పడమటి నుంచి తూర్పుకు మారుతుందా..ఏపీ రాజకీయాల పై కర్ణాటక ప్రభావం ఉంటుందా అనే సందేహం వ్యక్తం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి కర్ణాటకలో ఎందుకు ప్రచారం చేస్తున్నారు, ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ పరిశీలకుల్ని వేధిస్తున్నాయి. హాస్య బ్రహ్మగా పిలిచే గిన్నిస్ రికార్డు హోల్డర్ బ్రహ్మానందం ఈ ఉప ఎన్నికలో కర్ణాటక బీజేపీ తరపున ప్రచారం చేశారు. చిక్కబళ్ళాపురంలో బీజేపీ అభ్యర్థి సుధాకర్ రెడ్డి కోసం ఆయన వీధివీధినా ప్రచారం చేశారు. తెలుగులో మాట్లాడిన బ్రహ్మానందం బీజేపీ అభ్యర్థి తనకు మంచి మిత్రుడని అందుకే ప్రచారానికి వచ్చారని చెప్పుకున్నారు. బ్రహ్మానందాన్ని చూసేందుకు జనం భారీ సంఖ్యలో తరలి రావడంతో పాటు ఆయన చెబుతున్న తెలుగు సినిమా డైలాగులకు కేరింతలు కొట్టారు. అభిమానుల్లో ఉత్సాహం చూస్తే సుధాకరెడ్డి సునాయసంగా గెలుస్తారన్న నమ్మకం తనకుందని బ్రహ్మానందం అన్నారు. బ్రహ్మానందంతో పాటు డైలాగ్ కింగ్ సాయి కుమార్ కూడా బీజేపీ తరపున ప్రచారం చేశారు. బ్రహ్మానందం ,సాయికుమార్ ఒకే చోట బస చేయడం కూడా విశేషమని బిజెపి శ్రేణులు చెబుతున్నాయి. బీజేపీ తరపున బ్రహ్మానందం ప్రచారం దేనికి సంకేతం, బ్రహ్మానందం బీజేపీలో చేరే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. అది ఏపీ బీజేపీకి ప్రయోజనకరమని విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి పొలిటికల్ స్టార్సే కానీ సినీ స్టార్స్ పెద్దగా లేరు. రాష్ట్రంలో బలపడాలనుకుంటున్న కమలం పార్టీ పాపులర్ ఫేస్ కోసం వెతుకుతూనే ఉంది. ప్రస్తుతం టిడిపి, వైసిపిలో సినీ ప్రముఖులు ఎక్కువ మంది ఉన్నారు. బ్రహ్మానందంలాంటి పాపులర్ నటుడు బీజేపీలో చేరితే ట్రెండ్ మారుతుంది.. మరికొంతమంది సినీజనం పార్టీలోకి వస్తారు.. అలా పార్టీ బలపడే అవకాశముంటుంది. పార్టీ సభలకు జనం వస్తే ఓటర్లలో కూడా నమ్మకం పెరుగుతుంది. మరి బ్రహ్మానందం బిజెపిలో చేరాలంటే ఆయన ప్రచారం చేసిన చిక్కబళ్లపురంలో పార్టీ గెలవాలి. హాస్యబ్రహ్మ ప్రచారం చేసినందుకే గెలిచారన్న టాక్ రావాలి. అందుకే కర్ణాటక ఫలితాల ప్రభావం ఏపీపై ఉంటుందనీ భావించాల్సి ఉంటుంది.