తల్లి పోటు ..చెల్లి పోటును ఏమంటారు జగనన్నా ?

‘బాలయ్యా .. ప్లూటు బాబు ముందు ఊదు, జగనన్న ముందు కాదు. అక్కడ ఉన్నది ‘రీల్’ సింహం కాదు. జ‘గన్’ అనే  రియల్ సింహం. తేడా వస్తే దబిడి దిబిడే’  ఇదొక ట్వీట్.  ఈ ట్వీట్’ చేసిన వారు, ఒక మహిళా మంత్రి ఆమె పేరు రోజా..  అలాగే మరో మహిళా మంత్రి కూడా ఇదే స్థాయిలో మరో ట్వీట్ చేశారు. నిజానికి, ఈ ఇద్దరు మంత్రులే కాదు,  జనం ఛీ.. కొడుతున్న ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు నిర్ణయాన్ని సమర్ధించుకునేందుకు  వైసీపీ నాయకులు, సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులు, దిగజారుడు వ్యాఖ్యలు చాలానే చేస్తున్నారు. వైసీపీకి తోడు, ఆ పార్టీ రహస్య మిత్రులు బీజేపే నాయకులు కూడా వంత పాడుతున్నారు. సంకుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్టీఅర్ కుటుంబంలో తెలుగు దేశం పార్టీలో చిచ్చుకు పెట్టే మరో కుట్రకు తెర తీస్తున్నారు.  చిత్రం ఏమిటంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలు, ఈ వంకర ట్వీట్లు చేసిన మహిళ మంత్రుల వరకూ ప్రతి ఒక్కరూ ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్శిటీ పేరు ఎందుకు మార్చారో, చెప్పకుండా, తమ తప్పుడు నిర్ణయాన్ని ప్రశ్నించే అర్హత తెలుగు దేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి లేదనే వితండ వాదాన్ని తెర మీదకు  తెస్తున్నారు.  ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్శిటీ పేరు ఎందుకు మార్చారు? అనే ప్రశ్నకు ఏమాత్రం సంబంధం లేని గతాన్ని తీసుకొచ్చి, మోకాలుకు బోడి గుండుకు ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు, తెలుగు దేశం నాయకులే కాదు రాష్ట్ర ప్రజలు అందరూ ముక్త కంఠంతో ఒకటే ప్రశ్న అడుఉగుతున్నారు. ‘ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్శిటీ పేరు ఎందుకు మార్చారు?’ అని. అలాగే తప్పు చేస్తున్నావని హెచ్చరిస్తున్నారు. రాజకీయ లబ్దికోసం రాష్ట్రంలో చిచ్చు పెట్టవద్దని  అంటున్నారు.    కానీ, జగన్ రెడ్డికి, ఆయనకు ప్లూటు ఊదుతున్న  మహిళా మంత్రులు, ఇతర నేతలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, ఎప్పుడో దశాబ్దాల క్రితం తెలుగు దేశం పార్టీలో ఏర్పడిన అంతర్గత సంక్షోభానికి, ‘వెన్నుపోటు’ అనే పేరు తగిల్చి, ఆ వంక తమ ప్రభుత్వం తీసుకున్న అరాచక రాజకీయ నిర్ణయాన్ని సమర్ధించుకునే  ప్రయత్నం చేస్తున్నారు.  నిజానికి అప్పుడేమి జరిగిందో, ఎందుకు తెలుగు దేశం పార్టీలో సంక్షోభం ఏర్పడిందో, అందరికీ తెలిసిన విషయమే. ఆ నాడు, తెలుగుదేశంలో సంక్షోభానికి మూల కారణం, లక్ష్మీ పార్వతి. ఆమె దుష్ట సంకల్పంతో ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించి పెట్టిన చిచ్చు కారణంగానే తెలుగు దేశం పార్టీలో సంక్షోభం ఏర్పడింది. ఆమె దుష్ట బుద్దితో ఎన్టీఆర్ ను మోసం చేసి వివాహం అనే ముసుగులో ఆయన జీవితంలో ప్రవేశించారు. భార్యగా నటించారు. అప్పుడే కాదు, ఇప్పడు కుడా ఆమె నైజం మారలేదు.నిజంగా ఆమె మనసా,వాచా,కర్మణ ఎన్టీఅర్ ను భర్తగా భావిచి ఉంటే, గౌరవించి ఉంటే, ఎన్టీఆర్ కు ఇంత అవమానం జరిగిన మరు క్షణం ఆమె తన పదవికి రాజీనామా చేయవలసింది. కానీ, ఇన్ని రోజులైనా, ఇంత చర్చ జరుగుతున్నా ఆమె మౌనంగా ఉన్నారు. ఎన్టీఆర్ ను అవమానించిన ప్రభుత్వం ఇచ్చిన పదవిలో కొనసాగుతున్నారు. అంటే ఆమె ఎన్టీఅర్ జీవితంలో ఎందుకు ప్రవేశించారో , ఏమి చేశారో, రాజ్యాంగేతర శక్తిగా ఆమె ఎలా ప్రవర్తిచారో వేరే చెప్పనక్కరలేదు. ఇంకా చిత్రం ఏమంటే, నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో వుండి, అప్పట్లో వైసీపీని, జగన్ మోహన్ రెడ్డిని, చివరకు, చేతులు జాడించి జగన్ రెడ్డి, ‘ఆ దివంగత నేత, మహా  నాయకుడు’ అని గొప్పగా చెప్పుకునే వైఎస్సార్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోసిన, ఈ మహిళా మణులే ఇప్పుడు చంద్రబాబు గురించి వెన్నుపోటు థియరీలు మాట్లాడుతున్నారు. జగన్ రెడ్డిని   జ‘గన్’రీల్ సింహం కాదు, రియల్ సింహం’ అంటూ ఎత్తేస్తున్నారు. వారేవా, ఎంతటి జాణతనం, అని జనం విస్తు పోతున్నారు.  అదొకటి అలా ఉంటే, ఎప్పుడో దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనను చిలువలు పలవలుగా చిత్రించి అసలు సమస్యను పక్క దారి పట్టించే జగన్ రెడ్డి,  తనను కష్ట కాలంలో, జైలులో ఉన్న సమయంలో, జగనన్న వదిలిన బాణం అంటూ, సుదీర్ఘ పాద యాత్ర చేసి పార్టీని బతికించిన సోదరి షర్మిలకు ఇచ్చిన కానుకను ఏమంటారు? పార్టీని నిలబెట్టిన తన స్వంత తల్లీ, చెల్లిని పార్టీ నుంచి మెడ పట్టి బయటకు గెంటడాన్ని, ఏమంటారు? ఏ పోటంటారు? జగన్ రెడ్డి  అయన్ను భట్రాజు పొగడ్తలతో ముంచెత్తుతున్న,మహిళా నేతలు సమాధానం చెప్పవలసి ఉంటుంది. కానీ, వారు సమాధానం చెప్పరు. చెప్పలేరు, కానీ ప్రజలు మాత్రం సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తారు. నో డౌట్.

ఊస‌ర‌వెల్లి మ‌హాత‌ల్లి!

బ‌డిపేరు ...విద్యాల‌యం అనేది    దాన్ని సాయింత్రానిక‌ల్లా మార్చేశాడు. ప‌క్కింటి పెద్దాయ‌న‌, ఎదురింటివాళ్లూ వీధిలో చాలాకాలం ఉంచి ఉన్న వారంతా క‌లిసి క‌ట్టుగా కాకున్నా వంతుల వారీగా కాస్తంత సౌమ్యంగానే తిట్టారు. పెద్దామె మాత్రం పోనీ లేద్దూ, వీధి పేరు ఉండ‌నే ఉందిగా అన్న‌ది. ఈసారి ప‌క్క వీధిలోవారూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఈవిడేనా అన్న ది అని.  ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీ పేరు మార్చ‌డం పై ఇప్ప‌టికే దేశ‌మంతా తెలుగువారు నిర‌స‌న వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆ కాన్సెప్ట్‌ని అమ‌లు చేసిన వాడు ఎన్టీఆర్‌. అందుకు తెలుగు ప్ర‌జ‌లు నీరాజ‌నాలు ప‌లికారు. ఇప్ప‌టికీ ఆ వ‌ర్సిటీ ఎంతో గొప్ప‌సేవ‌లు అందిస్తోంది. ఎంతో ప్ర‌సిద్ధి పొందింది. కాగా త‌న‌కు న‌చ్చ‌లేద‌నో, వేరే పార్టీవారి  హ‌యాంలో ఏర్పాట‌యిన సంస్థ అనో ఏదో మిష‌తో పేరు మార్చేస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న చేశారు ఏపీ సీఎం జ‌గ‌న్‌. అంతే అనుకున్న‌దే త‌డ వుగా దాని పేరు వైఎస్ ఆర్ హెల్త్ వ‌ర్సిటీగా మార్చేశారు.  కానీ దాన్ని ఇత‌ర మేధావుల‌ను గాని ఏమాత్రం సంప్ర‌దించ‌కుండానే కేవ‌లం అధికారంలో ఉన్న ద‌ర్పంతో ఆ నిర్ణ‌యం తీసేసుకున్నారు జ‌గ‌న్‌. అమ‌లు చేసిన నిర్ణయాన్ని కాదంది యావ‌త్ తెలుగు జాతి.  అయితే ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీపార్వ‌తి కాస్తంత ఆల‌స్యంగానే తేరుకుని అదేం పెద్ద వివాదాస్ప‌ద అంశ మే కాద‌న్నారు. పేరు మార్చినంత మాత్రాన ప్ర‌త్యేకించి ప‌రువుపోవ‌డాలు, మ‌ర్యాద‌లు త‌గ్గ‌డాలు ఉండ‌వ న్నారు. పైగా ఒక సంస్థ‌కు పేరుమార్చారు. కానీ ఎన్టీఆర్ పేరు శాశ్వ‌తంగా ప్ర‌జ‌ల మ‌ధ్య నిలిచేలా, ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ నిరంత‌రం పొందేలా ఏకంగా ఒక జిల్లాకే ఆయ‌న‌పేరు ఉన్నది క‌దా అన్న‌ది ఆమె ప్ర‌శ్న‌. ఒక జిల్లా పేరు ఉండ‌డం చాలా గొప్ప‌సంగ‌తి. ఒక సంస్థ‌కు ఉన్న‌పేరును ఎవ‌ర‌యినా మార్చుకోవ‌చ్చు. అలాంటపుడు హెల్త్‌వ‌ర్సిటీ పేరు ఎన్టీఆర్, వైఎస్సార్ పేర్ల మ‌ధ్య పెద్ద‌గా సీరియ‌స్‌గా ప‌ట్టించుకోన‌ వ‌స‌రం లేద‌ని ఆమె అభిప్రాయం. కానీ తెలుగు ప్ర‌జ‌లు అలా ఊరుకుంటారా? ఎంతో కాలం నుంచి ఆ మ‌హానుభావుడి పేరున ఉన్న‌ది ఇపుడు హ‌ఠాత్తుగా మార్చాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని మండి ప‌డుతున్నారు. ఎవ‌రు ఎలా స్పందించినా, అది ఎన్టీఆర్ ప‌ట్ల వారి వీరాభిమానానికి ద‌ర్ప‌ణం ప‌డు తుంది.  ఒక సంస్థ కంటే కృష్ణా జిల్లా కి ఎన్టీ ఆర్  పేరు ఉండ‌డం పెద్ద విష‌యం గ‌నుక‌, ఆ జిల్లా అభివృద్ధి , ప్ర‌జా సంక్షేమానికి ప్రాధాన్య‌త‌నీయాల‌ని ల‌క్ష్మీపార్వ‌తి సూచించ‌డాన్ని కూడా లెక్క‌లోకి తీసుకోవాల‌ని విశ్లేష కుల మాట‌. ప్ర‌తీదీ రాజ‌కీయ కోణంలో చూడ‌టం త‌గ‌ద‌ని ఆమె అన్నారు. అయితే స‌మ‌యంగాని స‌మ యంలో ఇలాంటి ఆవేశ‌పూరిత నిర్ణ‌యాలు తీసుకోవ‌డం పార్టీ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీస్తుంద‌నేది వైసీపీ నాయ కుల మ‌న‌సులో మాట‌. అస‌లే మూడేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌లు కూడా ప్ర‌తిప‌క్షం స్థాయిలో విసిగెత్తి, ఎదురు తిరుగుతున్నారు. ఎక్క‌డా మంత్రులు, ఎమ్మెల్యేలు తిర‌గ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ త‌రుణంలో జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం పార్టీ భ‌విత‌ను దెబ్బ‌తీస్తుందనేది వారు బ‌య‌ట‌కు చెప్ప‌లేని మాట‌.  ఇక్క‌డ మ‌రో మాట‌.. అస‌లు సంస్థ పేర‌యినా, జిల్లాకి పేరు పెట్ట‌డం లేదా తీసేయ‌డం అనే అంశాల్లో  ల‌క్ష్మీపార్వ‌తి మ‌హోన్న‌త అభిప్రాయాలు, సూచ‌న‌లు ప్ర‌భుత్వానికి అవ‌స‌ర‌మా? అని విశ్లేష‌కుల మాట‌. ఎందుకంటే, ఆమె ఎన్టీఆర్ స్థాపించిన పార్టీనే అంటిపెట్టుకుంటాన‌ని పూర్వం శ‌ప‌థం చేసి  ఆ త‌ర్వాత రాజ‌కీప‌రిణామాల్లో పార్టీకి దూర‌మ‌య్యారు. ఇపుడు జ‌గ‌న్ అభిమానిగా మారి వైసీపీ జెండా నీడ‌లో సంచ‌రి స్తున్నారు. క‌నుక ప్ర‌బుత్వ నిర్ణ‌యం మంత్రులు, ఎమ్మెల్యేలు, వీరాభిమానుల‌కు ఎలా శిరోధార్య మో ల‌క్ష్మీ పార్వ‌తికి కూడా అంతే. అందుకే ఆమె వ‌ర్సిటీ పేరు మార్చ‌డం విష‌యాన్ని పెద్ద‌గా సీరియ‌స్‌ గా తీసుకో లేదు.. పైగా  కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరుంది గ‌దా.. వ‌ర్సిటీ  పేరు విష‌యం చిన్న‌దిగానే క‌న‌ ప‌డింది.  అయితే అన్నివ‌ర్గాల నుంచి ముఖ్యంగా విప‌క్షాల నుంచి వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు స‌మాధానంగా  ఆమె ఆ విధంగా  స్పందించారు. కానీ గ‌తంలో ఎన్టీఆర్‌కు ఎవ‌రు వ్య‌తిరేకంగా మాట్టాడినా విరుచుకుప‌డిన ల‌క్ష్మీ పార్వ‌తి వ‌ర్సిటీ పేరు మార్ప‌డి విష‌యంలో మాత్రం గ‌ట్టిగా వ్య‌తిరేకించ‌క‌పోవ‌డం ప‌ట్ల అంత‌టా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇపుడు జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని ఖండించ‌క‌పోవ‌డ‌మే ఆమె ప‌రిస్థితి వ్య‌క్త‌ మ‌వుతుంది.  ఏ గాలి కా మాట మాట్లాడుతోంద‌న్న‌ది ప్ర‌జ‌లు గ్ర‌మించారు. ఇలాంటి ఊస‌ర‌వెల్లి త‌త్వాన్ని ఆమె త‌ప్ప మ‌రొక‌రు ప్ర‌ద‌ర్శించ‌లేరు. 

ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు తుగ్లక్ నిర్ణయం.. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వక్తలు

పాలకుడు మూర్ఖుడైతే పాలకులకు కష్టాలు తప్పవన్నారు. అలాగే ప్రజాస్వామ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంకుశుడైతే సమాజంలోని అన్ని వర్గాలూ ఇబ్బందులు పడక తప్పదు. ఇప్పటికే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను లేకుండా చేసి విద్యార్థులను, యువతను అష్టకష్టాల పాలు చేసిన జగన్, ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయంతో వైద్య విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాడుతున్నారు. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పేరును డా.వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంగా మార్చుతూ శాసనసభ ఆమోదించిన బిల్లు కు రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేయకుండా  తిరస్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో ఎస్ ఎఫ్ ఐ వివిధ  రాజకీయ పార్టీలు, విద్యార్థి - యువజన - కార్మిక సంఘాల రాష్ట్ర నేతలతో శనివారం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వక్తలందరూ ముక్తకంఠంతో జగన్ సర్కార్ నిర్ణయాన్ని తప్పుపట్టారు.  రాజకీయ అంశాన్ని కాకుండా సాంకేతికంగా కూడా యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం తుగ్లక్ నిర్ణయమేనని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ పై అభిమానం, వైఎస్ పై దురభిమానం అన్న అంశాన్ని పక్కన పెడితే జగన్ రెడ్డి తీసుకున్న తుగ్లక్ నిర్ణయం  ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం అనుబంధ విద్యా సంస్థల్లో   విద్యార్థులుగా ఉన్న వారి భవిష్యత్ తో చెలగాటమాడడమేనని విమర్శించారు. ఐదేళ్ళు వైద్య విద్యను అభ్యసించిన   విద్యార్థులు రెండు పేర్లతో ఉన్న యూనివర్సిటీ సర్టిఫికెట్ల తో భవిష్యత్ లో గందరగోళ పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుందని పేర్కొన్నారు. అలాగే ఈ విశ్వ విద్యాలయంలో గతంలో వైద్య విద్యనభ్యసించిన వారు ముందు ముందు సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి అనివార్యమౌతుందని ఆందోళణ వ్యక్తం చేశారు.  ఎందు కంటే విదేశాల్లో వారి వైద్య పట్టాకు ప్రాధాన్యత దక్కదని ఇన్ని సమస్యలను తెచ్చిపెట్టే పేరు మార్పు తుగ్లక్ చర్య కాక మరేమౌతుందని వారు ప్రభుత్వాన్ని నిలదీశారు.   సంక్షేమ పథకాలకు ఇప్పటి ప్రభుత్వం పెట్టుకొన్న పేర్లను   తర్వాత వచ్చే ప్రభుత్వం తొలగించినా లేదా గత ప్రభుత్వ సంక్షేమ పథకాల పేర్లను ఇప్పటి ప్రభుత్వం తొలగించినా ఆ పథకాలు కొనసాగినంత కాలం ఎటువంటి సమస్యా తలెత్తదు కానీ, విశ్వవిద్యాలయాల పేర్లను ఇలా రాజకీయ ప్రయోజనం కోసమే, కక్ష సాధింపు కోసమే, అయిష్టత కారణంగానో ఆషామాషీగా మార్చేస్తే సమాజానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాల ప్రతిష్ఠా మసకబారుతుందని, అందుకే ప్రభుత్వ నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదించడం సరికాదనీ, ఆయన విజ్ణతతో నిర్ణయం తీసుకోవాలని వక్తలు పేర్కొన్నారు.  ఎన్.టి.ఆర్.ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పేరు మార్పు అంశాన్ని రాజకీయ దృష్టితో కాకుండా, ప్రజాప్రయోజనం దృష్టితో ఆలోచించి, చారిత్రక కోణంలో పరిశీలించి గవర్నర్ నిర్ణయం తీసుకోవాలనీ, ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం చరిత్రను అగౌరపరిచేలా ఉందనీ, దీనివల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం శూన్యమని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వక్తలు పేర్కొన్నారు.  అంతే కాకుండా ఆ యూనివర్సిటీ  అనుబంధ విద్యా సంస్థల్లో  చదువుకుంటున్న వారి భవిష్యత్ తో ఈ నిర్ణయం చెలగాటమడటమేనని అన్నారు.  విశ్వవిద్యాలయం స్వయం ప్రతిపత్తి, సుపరిపాలన, ప్రతిష్ట , వైద్య విద్యా ప్రమాణాలు, వైద్య విద్యా రంగంలో పరిశోధనలపై ప్రభుత్వానికి దృష్టి లేని ప్రభుత్వం పేరు మార్పు విషయంలో తొందరపడటం రాజకీయ ప్రయోజనాలను ఆశించే తప్ప మరో కారణం కనిపించడం లేదన్నారు.  డాక్టర్ ఎన్టీఆర్  ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి ఒక చరిత్ర ఉంది. ఆ వర్సిటీ  ఎన్.టి.ఆర్. మానస పుత్రిక.  నైతిక విలువలతో కూడిన వైద్య విద్య అందించడం, సమర్థులైన పట్టభద్రులను తయారు చేయడం, నాణ్యమైన పరిశోధనలను ప్రోత్సహించడం, శిక్షణ ఇవ్వడం, ఆరోగ్య సంబంధిత విభాగాలను అన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకువచ్చే లక్ష్యంతో ఎన్టీఆర్ నెలకొల్పిన విద్యాలయం అది. 1986లో ఈ వర్సిటీ    27 అనుబంధ కళాశాలలతో మొదలైంది.  2019-20 విద్యా సంవత్సరం ఈ వర్సిటీ అనుబంధ కాలేజీల సంఖ్య నాటికి 298 పెరిగింది. రాష్ట్రంలో  ఆంధ్రా విశ్వ విద్యాలయం, శ్రీవేంకటేశ్వర, ఆచార్య నాగార్జున, శ్రీకృష్ణదేవరాయ, యోగి వేమన, రాయలసీమ, విక్రమ సింహ, ఆదికవి నన్నయ్య  యూనివర్సిటీలు, ఆచార్య యన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇలా ఒక్కొక్క విశ్వవిద్యాలయానికి ఒక్కొక్క చరిత్ర ఉన్నది.   వాటి పేర్లు మార్చగలరా? మారిస్తే ఆంధ్రప్రదేశ్ సమాజం సమర్ధిస్తుందా!  ఇడుపులపాయలోనే ఉన్న ట్రిబుల్ ఐటి  పేరు మారుస్తారా? అలాగే డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ పేరు మార్చగలరా?  అని ప్రశ్నించారు. 

వివేకా హ‌త్య‌కేసు.. నిందితుడు శివ‌శంక‌ర రెడ్డికి  బెయిల్ నిరాక‌ర‌ణ‌

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు లో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డికి  సుప్రీంకోర్టు  బెయిల్  ఇచ్చేం దుకు నిరాకరించింది. బెయిల్ ఇవ్వడానికి సరైన కారణాలు తమకు కనిపించడంలేదని, హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ దశలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. శివశంకర్‌రెడ్డి తరపున కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ కౌన్సిల్ అభిషేక్‌ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు.  వివేకానందరెడ్డి హత్యకేసులో తొలుత దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ లో శివశంకర్ రెడ్డి పేరు లేదని ఆయన వాదించారు. అప్రూవర్‌గా మారి న వాచ్‌మెన్ స్టేట్ మెంట్‌లో కూడా శివశంకరరెడ్డి పేరు లేదన్నారు.  ఏ1 గా ఉన్న నిందితుడికి మూడు నెలల్లో బెయిల్ ఇచ్చారని, 11 నెలలు అవుతున్నా, ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా శివశంకర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వడం లేదని న్యాయవాది విన్నవించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసులో జోక్యం చేసుకోలే మని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది.  గ‌తంలోనూ  నిందితుల‌కు క‌డ‌ప కోర్టు బెయిల్ నిరాక‌రించింది. కేసులో ప్ర‌ధాన నిందితులుగా ఉన్న దేవి రెడ్డి శివ‌శంక‌ర్ రెడ్డి, ఉమాశంక‌ర్ రెడ్డిల బెయిల్ పిటిష‌న్ ను కోర్టు కొట్టివేసింది. నిందితుల బెయిల్ పిటి ష‌న్ పై వాద‌న‌లు ముగియ‌డంతో బెయిల్ పిటిష‌న్ల‌ను కోర్టు కొట్టి వేసింది. మ‌రోవైపు శివ‌శంక‌ర్ రెడ్డికి నార్కో ప‌రీక్ష‌లు నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి కోరుతూ సీబీఐ పులివెందుల కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. కోర్టు పిటిష‌న్ స్వీక‌రించింది. ఈ కేసులో వరుసగా రెండు, మూడు, ఐదో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసేందుకు జస్టిస్ డి.రమేష్ నిరాకరిం చారు. ఇద్దరు నిందితులు ఆరోగ్య కారణాలతో బెయిల్ కోసం ప్రయత్నించారు.

బతకనేర్చిన తనమంటే ఇదేనా జూనియర్?

బతకనేర్చిన వాడు అనిపించుకోవడం చాలా సులువు. అయితే  ఆ మాట తిట్టుగానూ, పొగడ్తగానూ కూడా వాడుతుంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను అందరూ బతకనేర్చినవాడుగా అభివర్ణిస్తున్నారు. సందర్భాన్ని బట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి అందరూ అంటున్న ఈ మాట ఏ విధంగా చూసుకున్నా కితాబని అనుకోవడానికి లేదు. రాజకీయాలకు చాలా కాలం నుంచీ జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. ఎప్పుుడో 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఆ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథంపట్టారు. అన్నగారు ఎన్టీఆర్ మనవడిగా ఆయనను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు జనం ఎగబడ్డారు. ఆయన ప్రచారం బ్రహ్మాండంగా క్లిక్ అయ్యింది. కారణాలేమైతేనేం.. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం పాలైంది. అంతే ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల వైపు కనీసం చూడను కూడా చూడలేదు. పూర్తిగా సినిమాలకే పరిమితమైపోయారు. సినిమాలలో బానే క్లిక్ అయ్యారు. ఎన్టీఆర్ మనవడిగా ఆయన సినీమా లాంఛ్ బ్రహ్మాండంగా జరిగింది. బాల రామాయణంలో రాముడిగా  మెరిసాడు. ఆ తరువాత కొంత  పెద్దయ్యాకా బ్లాక్ బస్టర్ లాంటి హిట్లతో స్టార్ హీరో హోదా సంపాదించుకున్నారు. ఆయన ఒక హీరో... ఆయన హీరోయిజం చూసే అనేక మంది ఎన్టీఆర్ కు వీరాభిమానులయ్యారు. హీరోయిజం తెరకే పరిమితమైందా అన్న విమర్శలను ఇప్పుడు జూనియర్ ఎదుర్కొంటున్నారు. ఏ మనిషైనా సరే కూడలి వచ్చినప్పుడు అటో ఇటో ఎటో అటు నడవాలి. ఆ నడక నీ దారి ఏమిటన్నది  తేలుస్తుంది. అంతే కానీ అటూ ఇటూ కాకుండా గోడమీద బల్లిలా ఉండిపోతానంటే.. అది బతక నేర్చిన తనం అవుతుందేమో కానీ మనిషి తనం, ధీరోదాత్త గుణం అని ఎంత మాత్రం అనిపించుకోదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారూ వ్యతిరేకిస్తుంటే.. ఆయన మనవడిగా ఎన్టీఆర్ స్పందన గోడమీద పిల్లి వాటాన్నే స్ఫురింప చేసింది. అదే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఎన్టీఆర్ మనవడు అన్న హోదాతో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో స్పందించిన తీరు అటూ ఇటూ కాని విధంగా ఉందనీ, తన తాత ద్వారా స్టార్ డమ్ వచ్చేసింది కనుక ఇప్పుడు తన తాత ఇమేజ్ ను మసకబార్చే యత్నాలు చేస్తున్న వారిని ఖండించి వారికి దూరమవ్వడం బతక నేర్చిన తనం కాదనుకున్నారా అన్నట్లు ఆయన స్పందన ఉంది.   ఆయన స్పందన ఆయన హీరోయిజం కేవలం వెండితెరకే పరిమితం అని ఒ  తేటతెల్లం చేసేసింది. తాత గౌరవం కంటే.. తన సినీ కెరీర్ ను కాపాడుకోవడమే ఎన్టీఆర్ కు ముఖ్యమని తేలిపోయింది హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో ఎన్టీరామారావును , వైఎస్‌తో పోలుస్తూ జూనియర్ చేసిన ట్వీట్ వెనుక ఉన్నది జగన్  అని  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పును తప్పుపట్టేవారికి చెక్ అన్నట్లుగా  జగన్ సూచన మేరకు, జగన్ కు రాజకీయంగా ప్రయోజనం చేకూరేలా ఎన్టీఆర్ వ్యవహరించారన్న ఆరోపణలకు వెల్లువెత్తుతున్నాయి.  ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు వ్యవహారంలో జూనియర్ స్పందనను సమర్ధిస్తున్న వారంతా వైసీపీ వర్గీయులే కావడమే ఇందుకు ప్రబల నిదర్శనంగా పరిశీలకులు చెబుతున్నారు. ఎన్టీఆర్ స్పందనను తమ నిర్ణయానికి ప్రజా మద్దతుగా చూపించుకోవాలన్న వైసీపీ వ్యూహం ప్రకారమే ఇదంతా జరిగిందన్న విశ్లేషణలకు కూడా  వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ స్పందనను బలపరుస్తూ చేస్తున్న వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.  ఎన్టీఆర్-వైఎస్‌ను ఒకేగాట కట్టిన ఎన్టీఆర్ స్పందన పట్ల తెలుగుదేశం, ఎన్టీఆర్ అభిమానులే కాదు.. తెలుగు వారంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఈ ప్రభావం ఆయన సినిమాల మీద కూడా పడే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. అంటు ఇప్పటికిప్పుడు బాయ్ కాట్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ హ్యాష్ టాగ్ క్యాంపెయిన్ ప్రారంభం కాకున్నా... సినిమా బాగోగులతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ మనవడు అన్న అభిమానంతో ఆయన సినిమాలకు మద్దతు తెలిపే పరిస్థితి ఇక ముందు ఎంత మాత్రం ఉండదని పరిశీలకులు అంటున్నారు.   సరే.. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ మార్పు వ్యవహారంలో, ఎన్టీఆర్-వైఎస్‌ను జూనియర్ ఒకే గాట కట్టడాన్ని  సోషల్‌మీడియాలో టీడీపీ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తోంది. రాజకీయ ఓనమాలు తెలియని జూనియర్ ఎన్టీఆర్ తన తాత ఔన్నత్యాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. పేదవాడి అన్నం గిన్నెలా ప్రజల హృదయాలలో అనితర సాధ్యమైన సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న ఎన్టీఆర్ ఎవరికీ తలవంచని ధీరోదాత్తుడనీ, ఆయన మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రతి అడుగూ భయమే, ప్రతి మాటా భయమే అన్న రీతితో వ్యవహరిస్తున్నారనీ అంటున్నారు. జూనియర్ తన అనుంగు స్నేహితుడిగా చెప్పుకునే కొడాలి నాని అసెంబ్లీలో భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే దీటుగా ఖండించడానికి కూడా భయపడిన సంగతిని ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ఆ తాత మనవడిని అంటూ అవకాశం వచ్చిన ప్రతి సారీ ప్రగల్బాలు పలికే జూనియర్.. ఆ తాత గౌరవాన్ని తగ్గించేలా ఆయన పేరు మీద ఉన్న హెల్త్ వర్సిటీ పేరు మారుస్తుంటే దీటుగా స్పందించడానికీ వెనుకాడిన విషయాన్ని ఎత్తి చూపుతూ  విమర్శలు సంధిస్తున్నారు.  అలాగే తన తాత పేరుమీద ఉన్న అన్న క్యాంటీన్లను రద్దు చేయడమే కాకుండా, ఆ పేరుతో క్యాంటీన్లు నడుపుతున్న వారిపై దాడిచేసి,వాటిని ధ్వంసం చేసిన పార్టీ నిర్ణయాన్ని సమర్ధించడమేమిటని నిలదీస్తున్నారు.    ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు  మార్పు వ్యవహారంలో జూనియర్  స్పందన ఆయనను ఎవరికీ కాకుండా చేసిందనడంలో సందేహం లేదు.  

కరోనా ఇక ముగిసిన అధ్యాయం!

గత రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని అస్తవ్యస్థం చేసిన కరోనా మహమ్మరి ఇక ముగిసిన అధ్యాయమే. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ  ధృవీకరించింది. చైనాలోని వూహాన్ లో మొదలైన కోవిడ్-19 ప్రపంచాన్ని కమ్మేసింది. లక్షలాది మంది  ఉసురు తీసేసింది.  మరి కొన్ని కోట్ల మంది కోవిడ్ అనంతర ఇబ్బందులతో ఇప్పటికీ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో డబ్ల్యుహెచ్ఓ ప్రపంచానికి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా ఇక ఎంత మాత్రం పెండమిక్ కాదనీ, అది ఎండమిక్ స్టేజికి చేరందన్న చల్లని కబురు చెప్పింది.   ప్రపంచాన్ని గజగజలాడించినన కోవిడ్-19 కథ ముగిసినట్టే అని అధికారికంగా ప్రకటించింది. ‘కరోనా వైరస్ వెలుగు చూసిన రెండున్నరేళ్లకు మహమ్మారి పలాయనం చిత్తగించే సమయం ఆసన్నమైందనీ, ఇక కరోనా  ప్రాణాతక వైరస్ కాదని తేల్చేసింది. అంత మాత్రాన కరోనా పూర్తిగా అంతర్ధానమైపోయిందని కాదని వివరణ ఇచ్చింది. కరోనా మహమ్మారిక కారణంగా గత రెండున్నరేళ్లుగా   చీకటిగుహలో మగ్గిపోతున్నాం.  ఇప్పుడు ఆ మహమ్మారి ఎండమిక్ దశకు రావడంతో ఇప్పుడు ఆ చీకటి గుహ చివరిలో వెలుగు రేఖ కనిపిస్తోందని  డబ్ల్యుహెచ్ఓ పేర్కొంది.  అయితే.. చీకటి గుహ  అవతలకు చేరుకుని వెలుగును పూర్తిగా అక్కున చేర్చుకోవడానికి మరింత సమయం పడుతుందని అంత వరకూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని డబ్ల్యుహెచ్ ఓ   డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ పేర్కొన్నారు.   కాగా.. కరోనా వైరస్ బలహీనం అయిందని అశోకా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ చెప్పారు.  తొలి నుంచీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులను గౌతమ్ మీనన్ ట్రాక్ చేస్తున్నారు. కరోనా వైరస్ కు మన శరీరాలు అలవాటు పడ్డాయని, అందువల్ల ఇక ఈ వైరస్ ఇంకెంత మాత్రం ప్రాణాంతకం కాదని ఆయన వివరించారు.   కరోనా మహమ్మారికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 62 కోట్ల, 2 లక్షల 42 వేల 551 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా వైరస్ సోకిన 65 లక్షల 40 వేల 339 మంది మరణించారు. కాగా భారతదేశంలో ఇప్పటి వరకు 4 కోట్ల 45 లక్షల 72 వేల 243 కరోనా కేసులు నమోదయ్యాయి. 5 లక్షల 28 వేల 530 మంది కరోనా మహమ్మారికి బలైపోయారు.

విభేదాలు సృష్టించ‌డ‌మే కేంద్రం ప‌ని...మ‌మ‌తాబెన‌ర్జీ

భ‌క్తి, స‌మైక్య‌తా భావ‌న‌ను పెంపొందించే దుర్గాపూజ స‌మ‌యంలోనూ బీజేపీ వ‌ర్గాలు విద్వేషాలు  రెచ్చ గొట్టేందుకు ఏమాత్రం వెనుకాడ‌టం లేద‌ని ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మండి ప‌డ్డారు. ప్ర‌జ‌ల్లో మ‌త‌విద్వేషాలు రెచ్చ‌గొట్టి విభేదాలు తేవ‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆమె అన్నా రు. బీజేపీ అనుస‌రిస్తున్న రాజ‌కీయాలు ఏమాత్రం అంగీకార‌యోగ్యంగా లేవ‌ని ఆమె అభిప్రా య‌ప‌డ్డారు. దేశంలో మైనారిటీ వ‌ర్గాల ప‌ట్ల‌ బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు విప‌క్షాలు ఐక్య‌మై పోరాడ‌ వ‌ల‌ సిన అవ‌స‌ రాన్ని బ‌ల‌ప‌రు స్తోంద‌ని మ‌మ‌తా అన్నారు. ఆమె  టీఎంసీ ప‌త్రిక న‌జ్రూల్ మంచ్ ప్ర‌త్యేక సంచిక విడు ద‌ల చేసి ప్ర‌సం గించారు.  బెంగాల్ ప్ర‌భుత్వాన్ని అన్నివిధాలా అప్ర‌తిష్ట‌పాలు చేయ‌డానికే కేంద్ర ప్ర‌భుత్వం అన్ని విధాలా  ప్ర‌య త్నిస్తోంద‌ని ఆ ప‌త్రిక‌కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. రాష్ట్రేత‌రులు కొంద‌రు డ‌బ్బులు ఆశించి డిజిట్ ప్లాట్‌ఫామ్‌ల‌ను బాగా వినియోగించు కుంటున్నార‌ని, వీరే సోష‌ల్ మీడియా ద్వారా రాష్ట్ర  ప్ర‌గ‌తిప‌ట్ల వ్య‌తి రేక‌త తీవ్రస్థాయిలో ప్ర‌చారం చేయడం దారుణ‌మ‌న్నారు.   దేశంలో అన్ని రాష్ట్రాల పాల‌నా వ్య‌వ‌హారాల్లోకి దూరి విభేదాలు సృష్టించి ప‌బ్బంగ‌డుపుకుంటున్న బీజేపీ వాస్త‌వానికి ప్ర‌జ‌ల అవ‌స‌రాలు, నిరోద్యోగుల స‌మ‌స్య‌ల గురించి నిర్ల‌క్ష్యం చేస్తోంద‌ని ఇప్ప‌టికే దేశంలో అన్నివ‌ర్గాల నుంచి నిర‌స‌న వెల్లువెత్తుతోంది. ఈ త‌రుణంలో బిజేపీ సిబిఐ, ఈడీల‌ను ఉసిగొల్పి విప‌క్షా ల‌పై ప‌గసాధించేందుకు పూనుకుని దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోందన్న‌ది విప‌క్షాల మాట‌.

భూముల విక్రయానికి తెలంగాణ సర్కార్ రెడీ !

తెలంగాణ ధనిక రాష్ట్రం. అందులో అనుమానం లేదు. కనక వర్షం కురిపించే ‘బంగారు హైదరాబాద్’ నోట్లో పెట్టుకుని పుట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, నిస్సందేహంగా ధనిక రాష్ట్రం. కానీ, ఇప్పుడు అదే ధనిక రాష్ట్రం అప్పుల ఉబిలో కూరుకుపోయంది. ఎనిమిదేళ్లుగా ఏటి కేడాది పెంచుకుంటూ వచ్చిన అప్పులతో  రాష్ట్రం ఇప్పుడు అప్పుల కుప్పగా మారిందనేది కూడా ఎవరూ కాదనలేని నిజం. ఎనిమిదేళ్లుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నతెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రభుత్వం, ప్రస్థానం ప్రారంభంలోనే  బంగారు తెలంగాణ లక్ష్యంగా సంకల్పం చెప్పుకుంది. అయితే, ఎనిమిదేళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే బంగారు తెలంగాణ సంగతి ఎలా ఉన్నా ,చివరకు అప్పులు కూడా పుట్టని స్థితికి చేరిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజానికి, ఇది విపక్షాలు చేస్తున్న ఆరోపణ మాత్రమే కాదు. ప్రభుత్వం కూడా అదే చెపుతోంది. అయితే, అప్పులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని, అంటోంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్నా చేసిన అప్పులు సక్రమగా రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేస్తున్నామని, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తమ ఎనిమిదేళ్ళ పాలనలో సంపద వృద్ధి జరిగిందని, వివరణ ఇస్తోంది. అన్నిటినీ మించి కాళేశ్వరం ప్రాజెక్టును పెద్ద అసెట్ గా చూపిస్తోంది. విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఎఫ్ఆర్బీఎం పరిమితులను దాటి, అప్పులు చేయడం లేదని వివరణ ఇస్తోంది. అలాగే,  తెచ్చిన అప్పులు సకాలంలో తిరిగి చెల్లిస్తున్నామని ప్రభుత్వం అప్పుల గురించి ఆందోళన అవసరం లేదని భరోసా ఇస్తోంది. మొన్నీమధ్య ముచ్చటగా మూడు రోజులు జరిగిన రాష్ట్ర శాసన సభ సమావేశాల్లో రాష్ట్ర అర్థిక  పరిస్థితి, అప్పుల పరిస్థితికి సంబంధించి ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. అయితే, కాంగ్రెస్ పక్ష నేత, బట్టి విక్రమార్క ఒక్క ముక్కలో తేల్చి వేసిన విధంగా, ఆర్థిక మంత్రి, ప్రపంచ దేశాలు అన్నీ చుట్టి వచ్చారు, కానీ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం పై మరో నాలుగు రాళ్లువేసి చేతులు కడుక్కున్నారు. అదలా ఉంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్త పరుస్తోంది,  ప్రతిపక్షాలు మాత్రమే,  కాదు, కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక రంగ నిపుణులు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. ఓ వంక ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి, మరోవంక సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపణలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు తెల్ల ఏనుగు లాగా మారిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.  ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం మెగా ప్రాజెక్టు వలన, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్  కుబేరుడయ్యారే తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల్లో ప్రాజెక్ట్  బండారం బయట పడింది. మోటార్లు మునిగిపోయాయి. అసలు ప్రాజెక్ట్ పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలియదు. ఎవరినీ, ఆ దిక్కుకు వెళ్లనీయడం లేదు.  ప్రాజెక్ట్ పరిశీలనకు, ప్రతిపక్ష పార్టీలను  కూడా ప్రభుత్వం అనుమతించడం లేదు. కాదని వెళితే అరెస్టులు చేసి వెనక్కి పంపుతోంది.   మరో వంక, పెండింగ్ బిల్లిలు పాపంలా పెరిగిపోతున్నాయని ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లు, ఇక మావల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న రూ. 800 కోట్ల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ తో ఆందోళన చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్ల సంఘం అన్ని ఇంజినీరింగ్, మెయింటెనెన్స్ పనులను నిలిపివేసింది. నిజానికి, ఒక జీహెచ్ఎంసీలోనే కాదు. స్కూల్ పిల్లలకు మధ్యాన్న భోజనం అందిస్తున్న కాంట్రాక్టర్లు మొదలు చిన్న కాంట్రాక్టర్లు అందరి పరిస్థితి ఇదే అనే ఆరోపణలున్నాయి. మరోవంక కేంద్ర ప్రభుత్వం కట్టడితో అప్పులు పుట్టే పరిస్థతి లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత ఆదాయ దారులు మూసుకు పోతున్నాయి. లిక్కర్, రిజిస్ట్రేషన్, మైనింగ్ తప్ప ఆదాయం వచ్చే మార్గాలు కనబడటం లేదు. అలాగే, అవినీతి, అక్రమాలకు సంబందించిన ఆరోపణలు ముఖ్యమంత్రి కుటుంబాన్ని చుట్టుముడు తున్నాయి.కేంద్ర దర్యాప్తు సంస్తు ఉచ్చు బిగుస్తున్నట్లు వార్త లొస్తున్నాయి.  ఒక విధంగా తెలంగాణ  ప్రభుత్వ పరిస్థితి ముందు నుయ్యి వెంక గొయ్యి అన్న విధంగా తయారైందని, అంటున్నారు.ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక గండం నుంచి బయట పడేందుకు భూముల అమ్మకానికి తెరతీసిందని అంటున్నారు. అందుకోసమే 111 జీవోను ఎత్తి వేసింది. అయితే, దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో..వ్రతం చెడినా ఫలితం దక్కకుండా పోయిందని అంటున్నారు. రాష్ట్ర హై కోర్టు ధర్మాసనం స్టే విధించింది. దీంతో, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు, చిన్న మధ్య తరహ పరిశ్రమల అభివృద్ధికి ఏర్పాటు చేసిన ఆజామాబాద్, బాలానగర్, హఫీజ్ పేట లో భారీగా భూములను విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి 2,849 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈమూడు పారిశ్రామిక వాడల్లోని భూముల అమ్మకం మూడు నెలల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా మరో ఐదారు మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు.నిజానికి ఇప్పటికే ప్రభుత్వం కోకాపేట సహా మరి కొన్ని ప్రాంతాలలో రెండు మూడు  విడతల్లో భూములను విక్రయించింది. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు భూముల అమ్మకాన్ని తీవ్రంగా విమర్శించిన తెరాస నాయకులు, ఇప్పుడు అదే పని చేయడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోందని అంటున్నారు.

మీకు మించిన వెన్నుపోటుదారులెవ‌రు?...నారా లోకేష్‌

ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై హీట్ కొనసాగుతోంది. పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్  ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్లింగ్‌ను షేర్ చూస్తూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. అందులో ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్సార్‌ను ప్రథమ ముద్దా యిని చేసింది స్వయంగా ఆయన కుమారుడేనని తెలిపారు. హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య పోస్ట్‌తో దుమారం మరింత రేగింది. బాలయ్య కాస్త ఘాటుగా స్పందిం చడంతో మంత్రులు కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యవహారం ఎన్టీఆర్‌ వెన్నుపోటుపై దారిమ‌ళ్లింది. బాల కృష్ణను టార్గెట్ చేస్తూ వైఎస్సార్‌సీపీ విమర్శలు చేస్తోంది. అంతేకాదు చంద్రబాబు గతంలో ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యల్ని కొందరు పోస్టర్ల రూపంలో వైరల్ చేస్తున్నారు.  ఈ వెన్నుపోటు ఎపిసోడ్‌పై టార్గెట్ చేయడంతో టీడీపీ కూడా కౌంటర్ ఇస్తోంది. పాత వీడియోలను తెరపైకి తెచ్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఈ వెన్నుపోటు విమర్శలపై గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జగన్ గురించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడిన పాత వీడియోను లోకేష్ ట్వీట్ చేశారు. ఇది నిజమైన వెన్నుపోటు అంటూ మండిపడ్డారు సుప్రీంకోర్టు వరకూ వెళ్లి రాజశేఖరరెడ్డి ఆయన మంత్రివర్గం కలిసి చేసిన తప్పిది.. నాకేంటి సంబంధం’ అని అప్పట్లో జగన్ అన్నారని ఉండవల్లి ఆ వీడియోలో పేర్కొన్నారు.  ఉండవల్లి అప్పట్లో మాట్లాడిన వీడియో క్లిప్‌ ను షేర్ చేసి నారా లోకేష్..పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి అవినీతి కేసుల్లో వైఎస్సార్ ని ముద్దాయిని చేసింది దుర్మార్గపు కొడుకు జగన్ రెడ్డి. మీలా ఆధా రాలు లేని ఆరోపణలు చెయ్యడం లేదు. పక్కా ఆధారాలతో బయటపెడుతున్నా. వైఎస్సార్‌ని ప్రథమ ముద్దాయిని చేసింది అబ్బాయ్ జగన్ రెడ్డేన‌ని నారా లోకేష్ ట్విటర్ వేదికగా చెప్పుకొచ్చారు. 

మై డాడ్ ఈజ్ గ్రేట్‌!

పిల్ల‌ల పెంప‌కం అనేస‌రికి త‌ల్లి పాత్రే కీల‌కం అంటూంటారు. తండ్రి గ‌మ‌నిస్తుంటాడ‌న్న‌ది  అంద‌రి అభి ప్రాయం. కానీ తండ్రీ ఆ పిల్ల‌డికి త‌ల్లితో స‌మానంగా అంతే ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తాడు. కానీ అది అంత‌గా ప్ర‌చారం కాదు. కావ‌డం తండ్రికీ పెద్ద‌గా ఇష్టం ఉండ‌దు. ఇది దాదాపు అంద‌రికీ అనుభ‌వైక‌మే. పిల్ల‌లు న‌డ‌క నేర్చేవ‌ర‌కూ త‌ల్లి లానే పిల్లడిని ఆడించ‌డానికి తండ్రీ అంతే స్థాయిలో అన్ని స‌దుపా యాల ఏర్పా ట్ల‌లో  ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌లూ తీసుకుంటాడు.  పిల్ల‌డు జీవితంలో పైకి ఎద‌గాల‌ని తండ్రి ఎన్నో ఆశ‌లు పెట్టుకుంటాడు. అందుకు త‌గిన స‌హాయ స‌హ కారాలు చివ‌రంటా అందిస్తూనే ఉంటాడు. ఎవ‌రికి ఇష్టం ఉన్నా లేకున్నా. కానీ త‌ల్లి సేవ‌కే అధిక ప్రాధా న్యత‌, అత్య‌ధిక ప్ర‌చారం ల‌భిస్తుంటాయి. అదే చిత్రం!  ఓ తండ్రి పిల్ల‌డిని ఆడించ‌డానికి,  వాడికి బువ్వ తినిపిస్తూ ఆడిపించేందుకు కొత్త ఆట‌ను క‌నుగొన్నాడు. ప్లే హౌస్ త‌యారుచేశాడు. పిల్ల‌ల్ని ఆడించ‌డానికి ప్లేస్కూల్లో ప‌డేయ‌డం కాకుండా ఇలాంటి ఆలోచ‌న చేయ‌డం త‌ల్లిదండ్రుల ప్రేమ‌ను పంచ‌డ‌మే అవుతుంది. ఇంట్లో ఆట‌బొమ్మ‌ల‌తో ఆడించ‌డ‌మే కాకుండా ఇలా కొత్త‌గానూ ఆట‌పాటల్లో వారితో ఆనందం పంచుకోవ‌చ్చు.  అన్న‌ట్టు పైకి కింద‌కీ ఆడించ‌డానికి ఎలివేట‌ర్ కూడా ఏర్పాటు చేశాడు. పిల్ల‌డిని అందులో నిల‌బెట్టి లేదా కూర్చోబెట్టి ఎలివేట‌ర్ తాడు ప‌ట్టుకుని మెల్ల‌గా లాగుతూంటే ఉయ్యాల్లాంటి తొట్టి పైకి లేదా కింద‌కీ దిగు తూంటుంది. పిల్ల‌డికి మ‌హా మ‌జా, గొప్ప స‌ర‌దా! కానీ ఇది బాగా అల‌వాటు చేసినా ఇబ్బందే.. పిల్ల‌లు గ‌దా.. అక్క‌డే తినిపించ‌మ‌ని, ఆడించ‌మ‌నీ మారాం చేసినా చేయొచ్చు. మ‌రి మీ ఓపిక‌! కాస్త పెద్ద‌యితే ఈ ప్ర‌యోగం ఎలా చేస్తున్న‌దీ తండ్రి చెప్ప‌డంలో ఏకంగా పిల్లాడికి ఫిజిక్స్ నేర్పేస్తాడేమో అంటూ కొంద‌రు నెటిజ‌న్లు ఇప్ప‌టికే ఉత్సాహంగా కామెంట్లు పెట్టేశారు! ఏమో అదీ జ‌ర‌గ‌వ‌చ్చు.. ఇలాంటి  ప్రేమ‌గ‌ల తండ్రి ఉంటే!.. అంటూ ఒక మ‌హిళ కామెంట్ పెట్టింది!  పిల్ల‌డు ఆడుతూ, దాని మీద చేత్తో కొడుతూ ఆనందిస్తున్నాడు.. మా డాడ్ ఈజ్ గ్రేట్ అనేమో!

చిక్కుల్లో లాలూ , తేజస్వి

ఐఆర్‌సిటిసి హోట‌ల్‌ కుంభ‌కోణం లో ట్రయల్ కోర్టులో నిందితులపై అభియోగాల రూపకల్పనపై వాద నలు ప్రారంభించడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కి హైకోర్టు అనుమతినిచ్చింది. లాలూ ప్రసాద్ యాదవ్,  ఇతరులపై 2018 జూలైలో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను ప్రత్యేక సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసు కుంది. కానీ అభియోగాల రూపకల్పనపై చర్చ ప్రారంభం కాలేదు. మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీ దేవి, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మరియు ఇతర 11 మంది నిందితులకు సంబంధించిన ఐఆర్‌సిటిసి హోటల్ కుంభకోణంలో విచారణ నుండి ఢిల్లీ హైకోర్టు వర్చువల్ స్టేను ఉపసంహరించుకుంది. ట్రయల్ కోర్టులో నిందితులపై అభియో గాల రూపకల్పనపై వాదనలు ప్రారంభించడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి హైకోర్టు అనుమతినిచ్చింది. లాలూ ప్రసాద్ యాదవ్ మరియు ఇతరులపై 2018 జూలైలో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను ప్రత్యేక సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కానీ అభియోగాల రూపకల్పనపై చర్చ ప్రారం భం కాలేదు. ఫిబ్రవరి 2019లో, చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలనే ప్రత్యేక కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఒక నిందితుడు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు నిందితుడు వినోద్ కుమార్ అస్థానాకు ట్రయల్ కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపునిచ్చింది. మరో ఇద్దరు నిందితులు కూడా ట్రయల్ కోర్టులో ఇదే విధమైన దరఖాస్తులను దాఖలు చేశారు. ఈ పరిణామా లు విచారణను నిలిపివేసాయి మరియు ఇప్పటి వరకు అభియోగాల రూపకల్పనపై చర్చ జరగలేదు. లాలూ ప్రసాద్ యాదవ్ , ఇతరులపై 2017 జూలైలో సీబీఐ కేసు నమోదయిన సంగ‌తి తెలిసిందే. దాదాపు ఏడాదిపాటు విచారణ తర్వాత ఏజెన్సీ ఏప్రిల్ 2018లో తన ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 2019 ఆదేశాన్ని అనుసరించి, మార్చి 2020లో అస్థానా  అభ్యర్థనకు ప్రతిస్పందనగా సీబీఐ స్టేటస్ రిపోర్టును దాఖలు చేసింది. జూలై 2018లో నిందితుల్లో ఒకరిపై ప్రాసిక్యూషన్ మంజూరు చేయాలని కోరినట్లు సీబీఐ తన నివేదికలో పేర్కొంది. అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌తో పాటు మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక పదవిని దుర్వినియోగం చేస్తూ దొరికిపోయారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసే సమయంలో అతను సర్వీసులో లేనందున, అవినీతి నిరోధక చట్టం, 1988లోని నిబంధనల ప్రకారం అతనిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి అవసరం లేదు. సీబీఐ నివేదికలో రబ్రీ దేవి, తేజస్వి యాదవ్ మరియు ఇతర నిందితులకు సంబంధించి, వారిని ప్రాసి క్యూట్ చేయడానికి ఆంక్షలు అవసరం లేదని భావించారు. నిందితులపై ప్రాసిక్యూషన్‌ అనుమతి అవ సరం లేదన్న తన వైఖరికి మద్దతుగా మార్చి 2020లో అటార్నీ జనరల్‌ను సీబీఐ కోరింది. ఆమోదం పొందాల్సిన అవసరం లేదని ఏజెన్సీ తెలిపింది. అయినప్పటికీ, విచారణలో జాప్యాన్ని నివారించడానికి ఆస్థానా మరియు ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇతర ప్రభుత్వ ఉద్యోగులపై ప్రాసిక్యూషన్‌ను జూన్ 2020 లో కాంపిటెంట్ అథారిటీ ఆమోదించింది.

తిరుగుబాటా..ఫిక్స్‌డ్ మ్యాచ్‌?!

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన వారసుడిని ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన శాసనసభా పక్ష సమావేశాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విధేయులైన ఎమ్మెల్యేలు బహిష్కరించడంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై ప్రశ్నార్థకంగా మారింది.  పార్టీ విధేయుడి నేతృత్వంలో జరిగిన అనూహ్య సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది, కాంగ్రెస్ వర్గాల్లోని ప్రజలు రెండు అవకాశాల గురించి చర్చించుకుంటున్నారు. ఇది ముఖ్యమంత్రి పదవి లో ఉండగానే తన వారసుడిని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్న నాయకత్వం ద్వారా అవమానకరమైన వ్యక్తి  తిరుగుబాటు అని, లేదా అదంతా ఒక "ఫిక్స్‌డ్ మ్యాచ్" అని, అతని స్థానంలో దూకుడుగా ఉన్న సచిన్ పైలట్‌ను సంస్థలో పరిమిత ఆమోదయోగ్యతను స్ప‌ష్టంగా పేర్కొన‌ డం ద్వారా అతని స్థానంలోకి తేవ‌డానికి రూపొందించింది. సచిన్ పైలట్‌ను అడ్డుకునే ప్రయత్నంలో అశోక్ గెహ్లాట్ క్యాంపు ఎమ్మెల్యే లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్‌కు విధేయులైన శాసనసభ్యులు,  మంత్రులు ఆదివారం అర్థరాత్రి సిఎల్‌పి సమావేశానికి ముందు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని అసెంబ్లీ స్పీకర్ నివాసానికి  క్యూ క‌ట్టారు, కాంగ్రెస్ హైకమాండ్  సచిన్  పైలట్‌ను చీఫ్‌గా ఎంపిక చేయకుండా ముందస్తుగా కోరింది. రాష్ట్ర అత్యున్నత పదవికి తన వారసుడిని ఎన్నుకోవడంపై శాసనసభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవ డానికి జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్షం (సిఎల్‌పి) సమావేశానికి ముందు, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ "కొత్త తరానికి" అవకాశం కల్పించాలని అన్నారు. పైలట్‌ను తదుపరి ముఖ్యమంత్రిగా హైకమాండ్ ఎంచుకోవచ్చనే ఆందోళనల మధ్య దాదాపు మొత్తం పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేయడం, గెహ్లాట్ స్వతంత్ర మార్గాన్ని కొట్టేశారని సూచిస్తుంది. ఇది ఢిల్లీకి వెళ్లడానికి అతని సుముఖతతో పాటు గాంధీలలో అతని ఆమోదయోగ్యత ప్రశ్నార్థకమయ్యే విపరీతమైన పరిస్థితిని సృష్టిస్తుంది. సెప్టెంబర్ 28 లేదా 29న పార్టీ అధ్యక్ష ఎన్నికలకు గెహ్లాట్ నామి నేషన్ దాఖ లు చేసే అవకాశం ఉంది. అది ఇప్పుడు జరుగుతుందో లేదో చూడాలి. సోనియా గాంధీ స్థానంలో పార్టీ అధినేత్రిగా గెహ్లాట్ అంతర్గత ఎన్నికలలో పోటీ చేస్తే, తిరుగుబాటు అని పిలవబడేది వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారుల మధ్య "ఫిక్స్డ్ మ్యాచ్" అనే సందేశం ఉంటుం దని చాలామంది భావిస్తున్నారు. రాజస్థాన్‌లో పార్టీని నడిపించడానికి ఆమోదయోగ్యం, చేయి దాటి పోయిన బహిరంగ లాబీయింగ్‌ను అంతం చేయడం. గెహ్లాట్ వెనక్కి తగ్గితే, అది నిజమైన తిరుగుబాటుగా పరిగణించబడుతుంది, దీని ద్వారా రాష్ట్ర నాయక త్వం ఇప్పటికే బలహీనంగా ఉన్న హైకమాండ్ నుండి వాస్తవంగా విడిపోయింది. దాని రిట్‌ను అంగీకరిం చ డానికి నిరాకరించింది. అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు గెహ్లాట్‌కు విధేయత చూపడం మరియు 2020 మధ్యలో పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వ్యక్తి  అని పైలట్‌ను దూషించడం రాష్ట్ర యూనిట్,  కేంద్ర నాయకత్వ ఆలోచనలో తీవ్రమైన వైరుధ్యాన్ని బహిర్గతం చేస్తుంది.

నితీష్ నాయ‌క‌త్వంతో విప‌క్షాల‌ఐక్యత క‌ష్టం...సుశీల్ మోదీ

కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తమ పాత పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక  తర్వాత బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మరోసారి కలవాలనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఐక్య ప్రతిపక్షంగా ఏర్పడే అవకాశాలను బీజేపీ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ క‌ష్ట‌మ‌న్నారు. బీహార్ ముఖ్యమంత్రి జనతాదళ్ (యు నైటెడ్) నాయ కుడు నితీష్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ తాత్కా లిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఢిల్లీలోని ఆమె 10 జనపథ్ నివాసంలో కలిసిన నిమిషాల తర్వాత ఆయన ప్రకటన వెలువడింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు ప్రతి పక్షాల ఐక్య తపై గాంధీతో వీరిద్దరూ భేటీ అయ్యారు. అన్ని రాజకీయ పార్టీలకు చాలా భిన్నమైన ఆసక్తులు ఉన్నాయని, అలాగే "ప్రతి రాష్ట్ర రాజకీయ  పరిస్థి తులు భిన్నంగా ఉంటాయి" అని బిజెపి ఎంపి అన్నారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బాస్ అరవింద్ కేజ్రీవాల్‌ను నితీష్ కుమార్  కలిసి కూర్చోబెట్టగలరా అని బిజెపి నాయకుడు అడిగారు. నితీష్ కుమార్ ఓపీ చౌతాలా (ఇండియన్ నేషనల్ లోక్ దళ్ చీఫ్) కాంగ్రెస్‌ను కలిసి ఉంచగలరా?  సీపీ ఎం, కాంగ్రెస్‌లను 'కేరళలో కలిసి కూర్చునేలా చేయగలిగితే' అని మోదీ అన్నారు. కేరళలోని కాంగ్రెస్, సిపిఎం, బిజెపికి  'ఎ టీమ్' అని చెబుతోంది...కుమార్, యాదవ్ లు కోరుకున్నప్ప టికీ, వారు అన్ని పార్టీలను ఏకం చేయలేర‌ని ఈమ‌ద్య‌నే మోదీ అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్‌లోని పాత పార్టీ ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ పడగొట్ట డంతో, కాంగ్రెస్ మరియు ఆప్‌ తరచుగా వివిధ సమస్యలపై విభేదిస్తాయి. కేరళలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ దక్షిణాది రాష్ట్రంలోని వివిధ సమస్యలపై అధికార సీపీఎంతో విభేదిస్తూనే ఉంది. కుమార్ యాదవ్ 2024 సార్వత్రిక ఎన్నికల ముందు వ్యూహం గురించి చర్చించడానికి గాంధీని కలిశారు. ఐదేళ్లలో ముగ్గురి మధ్య ఇది ​​మొదటి సమావేశం, మరియు కుమార్ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీ ఏ) నుండి నిష్క్రమించిన తర్వాత, బీహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో సంబంధాలను పునరుద్ధరించిన తర్వాత కూడా ఇది మొదటి సమా వేశం. తరువాత, బీహార్ సిఎం, ఆర్జెడి చీఫ్ అందరూ చిరునవ్వుతో కనిపించారు మరియు మీడియా ప్రతి నిధుల ముందు బలప్రదర్శనలో చేతులు ఎత్తారు. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్న తర్వాత మళ్లీ కలవాలని గాంధీ కోరినట్లు నేతలు తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ శిబిరాన్ని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయాల్సిన అవస రాన్ని కుమార్ మరియు యాదవ్ ఇద్దరూ హైలైట్ చేశారు. అంతకుముందు రోజు, హర్యానాలోని ఫతేహా బాద్‌లో జరిగిన ఐఎన్‌ఎల్‌డి ర్యాలీలో, కుమార్, ఎన్‌సిపి బాస్ శరద్ పవార్ మరియు ఆర్‌జెడి తేజస్వి యాదవ్తో సహా పలువురు ప్రతిపక్ష నాయకులు మరో బల ప్రదర్శనలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా, కుమార్ 2024లో తాను ప్రధానమంత్రి అభ్యర్థి అవుతాడనే చర్చల గురించి గాలిని క్లియర్ చేసాడు. అతను అభ్యర్థిని కాదని, మూడవ ఫ్రంట్ లేదని చెప్పాడు. కాంగ్రెస్‌తో సహా ఒక ఫ్రంట్ ఉండాలి, అప్పుడు మేము 2024 లో బిజెపిని ఓడించగలము" అని బీహార్ సిఎం జోడించారు.

హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ట్వీట్ల జోరు.. వైసీపీ మంత్రుల స్పందన దిగజారు!

రాజకీయ అజెండాలను నిర్దేశించి అత్యంత ప్రముఖమైన మాధ్యమం(మీడియా)గా ట్విట్టర్ అవతరించిందనడంలో సందేహం లేదు. రాజకీయ నాయకులు తన అభిప్రాయాలను, భావాలను ప్రజలలో వాయువేగంతా వ్యాప్తి చేయడానికి ట్విట్టర్ ని వేదిక చేసుకోవడం ఇటీవల కాలంలో మామూలు అయిపోయింది. అలాగే ఒక రాజకీయ వివాదంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కూడా ట్విట్టర్ ఒక సాధనంగా మారిపోయింది. సామాజిక మాధ్యమం ప్రాధాన్యత పెరుగుతున్న కొద్దీ  ఒక్క ట్వీట్ రాజకీయ నేతల వ్యాఖ్యల్లోని బలాన్ని, డొల్ల తనాన్ని ఇట్టే బయటపెట్టేస్తోంది. ఇంతకీ ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకు అంటారా? ఏపీలో జగన్ సర్కార్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును మారుస్తూ తీసుకున్న నిర్ణయం పెను వివాదం సృష్టించింది. రాజకీయ, సామాజిక, ప్రాంతీయ బేధాలకు అతీతంగా అందరూ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ట్విట్లర్ వేదికగా తమ స్పందనను తెలియ జేశారు.  ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు విషయంలో వైసీపీ నేతల సమర్థన ట్వీట్లు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో ట్రోల్ అవుతున్నాయి. ఎలాంటి హేతుబద్ధతా లేని ఆ సమర్థింపు వ్యాఖ్యలపై నెటిజన్లు జోకులు వేస్తున్నారు. మంత్రుల లోకజ్ణానమిదేనా అని నిలదీస్తున్నారు.అయితే ఒకే ఒక్క ట్వీట్ జగన్ సర్కార్ నిర్ణయంలోని ఔచిత్యాన్ని నిలదీసింది, నిగ్గదీసి అడిగింది. కడిగి పారేసింది. బదులివ్వనేనంతగా కార్నర్ చేసేసింది. అదే హిందుపురం ఎమ్మెల్యే, నందమూరు తారకరామారావు కుమారుడు నందమూరి బాలకృష్ణ చేసిన ట్వీట్. రాజకీయ నాయకుడిగా మారిన బాలకృష్ణ సినిమాలు పంచ్ డైలాగులకు, భారీ యాక్షన్ డ్రామాకు పెట్టింది పేరు. ఆయన ఇంత వరకూ ఎన్నికల ప్రచారంలో తప్ప విడిగా ఎక్కడా బయట పెద్దగా ప్రసంగాలు చేసింది లేదు. అలాగే సామాజిక మాధ్యమంలో పెద్దగా యాక్టివ్ గా ఉన్నదీ లేదు. కానీ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో ఆయన స్పందించిన తీరు మాత్రం మహామహా రాజకీయ వేత్తలను సైతం సంభ్రమాశ్చర్యలకు గురి చేసింది. సినిమా షూటింగ్ కోసం ఆయన విదేశాలలో ఉండటంతో నేరుగా స్పందించే అవకాశం లేకపోవడంతో ఆయన తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పును ఖండిస్తూ బాలయ్య చేసిన ట్వీట్ అధికార వైసీపీ కాళ్ల కింద నేతను కదిపేసింది. జగన్ నిర్ణయంలోని డొల్ల తనాన్ని, రాజకీయ దివాళాకోరు తనాన్ని వెల్లడించింది. ఈ విషయంపై అనుకూల వాదనే తప్ప ప్రతికూల వాదనలకు అవకాశమే లేని కచ్చితత్వం ఈ ట్వీట్ ద్వారా వచ్చింది. వైసీపీలోనే ఎన్టీఆర్ హెల్త వర్సిటీ పేరు మార్పు నిర్ణయం పట్ల వ్యక్తమౌతున్న వ్యతిరేకతకు ఈ ట్వీట్ బలాన్నిచ్చింది.  ఇక వైసీపీ నుంచి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని సమర్థిస్తూ మంత్రులు  రోజా, విడదల రజనీ, తదితరులు చేసిన ట్వీట్లు కానీ, కర్రా విరగొద్దు, పామూ చావద్దు అన్నట్లుగా బీజేపీ నాయకుడు జీవీఎల్ చేసిన ట్వీట్ కానీ ట్రోలింగ్ కు గురి కావడం వినా సాధించిందేమీ లేదు.  న్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పును రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలూ తప్పుపడుతున్నాయి. సమాజంలో సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలన్న సంకుచితత్వంతో ఒక యుగపురుషుడిని అవమానించేందుకు చేసిన దుస్సాహసంగా అభివర్ణిస్తున్నాయి. అయితే బాలకృష్ణ ట్వీట్ కు కౌంటర్ గా కొందరు రాష్ట్ర మంత్రులు చేసిన ట్వీట్ లను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ భిక్ష పొంది..  ఇప్పుడు ఆ మహానుభావుడి పేరు మార్పును సమర్ధించడం.. పదవి కాపాడుకోవడానికి ఎంతకైనా దిగజారే వారి మనస్తత్వాన్ని ఎత్తి చూపుతోందని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.  ‘మార్చేయడానికీ, తీసేయడానికీ  ఎన్టీఆర్ ఒక పేరు కాదు ఓ సంస్కృతి, ఓ నాగరికత, తెలుగుజాతి  వెన్నెముక..తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్టు పేరు మార్చాడు కొడుకు గద్దెనెక్కి హెల్త్ వర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారు.. పంచ భూతాలున్నాయి.. తస్మాత్ జాగ్రత్త.. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి.. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..’అంటూ బాలకృష్ణ చేసిన ట్వీట్ లో రాజకీయ ప్రస్తావన కంటే ఎన్టీఆర్ కు తెలుగు ప్రజల గుండెల్లో ఉన్న స్థానం ఏమిటన్నదే ప్రధానంగా ఉటంకించారు. రాజకీయాలతో సంబంధం లేకండా తెలుగువాడి ఆత్మగౌరవ ప్రతీకగా నిలువెత్తు తేజోమయ మూర్తిగా ఎన్టీఆర్ కు జనం గుండెల్లో ఉన్న స్థానం ఏమిటన్నది చెప్పారు.  అయితే హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడాన్ని సమర్ధిస్తూ బాలయ్య సినిమాలోని డైలాగులతో రోజా చేసిన ట్వీట్ ఖాళీ డబ్బాలో గులకరాళ్ల మాదిరిగా ఉందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఏ పర్యటనకు వెళ్లినా రహదారులకు పరదాలు కప్పుకుని జనానికి మొహం చాటేసే జగన్ ను గన్ అనడమేమిటని ఎద్దేవా చేస్తున్నారు. ఇక విడదల రజనీ ట్వీట్ విషయానికి వస్తే గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో రోగులను ఎలుకలు కొరికిన సంఘటన ఎవరి హయాంలో జరిగిందో గుర్తులేదా అని నిలదీస్తున్నారు. ఇక మరో మంత్రి కారుమూరి వ్యాఖ్యలు కూడా ఆడ లేక మద్దెలు ఓడు సామెతనే గుర్తుకు తెస్తున్నాయంటున్నారు. ఆరోగ్య శ్రీ వైఎస్సార్ అనడానికి ఇదేం సందర్భం అని నిలదీస్తున్నారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కంటే ఎంతో ముందుగానే దార్శనికతతో ఆలోచించి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీని స్థాపించారని వారు గుర్తు చేస్తున్నారు. కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చిన ఆరోగ్య శ్రీతో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీని పోల్చడం దిగజారుడుతనానికి పరాకాష్టగా అభివర్ణిస్తున్నారు. ఇక బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహరావు అయితే కర్రా విరగొద్దు, పామూ చావోద్దు అన్నట్లుగా స్పందించారని సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతోంది.  ఒక వైపు బీజేపీ నేతలంతా ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై నిప్పులు చెరుగుతుంటే.. జీవీఎల్ మాత్రం ఎవరి మెప్పు కోసం అటూ ఇటూ కాని ధోరణి అవలంబిస్తున్నారని నిలదీస్తున్నారు.

రాజకీయ అవినీతిని రూపుమాపాలి!

జగన్ ఆర్థిక నేరాల కేసు దర్యాప్తు సందర్భంగా అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఎన్నో బెదరింపులను ఎదుర్కొన్నారు. కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదరింపుల లేఖలు వచ్చాయి. ఒక సారైతే ఆయనపై ఏకంగా దాడి యత్నమే జరిగింది. అయితే నాడు కేసు దర్యాప్తు సందర్భంగా ఆయన ఈ విషయాలను స్వయంగా ఎన్నడూ ఎక్కడా బయటపెట్టలేదు. నిజాయితీగా పని చేయడమే ముఖ్యమనుకున్నారు. అన్ని బెదరింపులను, దాడి యత్నాలనూ మౌనంగానే ఎదుర్కొన్నారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. జగన్ అరెస్టు కూడా అయ్యారు. అదంతా గతం. అయితే తాను గతంలో ఎదుర్కొన్న బెదరింపుల విషయాన్ని జేడీ తాజాగా బయటపెట్టారు. అది కూడా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఆధ్వర్యంలో తనకు ఆదివారం జరిగిన సత్కార కార్యక్రమంలో ఆయనీ విషయాన్ని వెల్లడించారు. నిజాయితీగా ఉండాలనుకునే వారికి కష్టాలు తప్పవని చెప్పారు. నిజాయితీగా ఉన్న తనకూ ఆ బాధలు తప్పలేదని వెల్లడించారు. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు సందర్భంగా అప్పట్లో తనకు తీవ్రంగా బెదరింపులు వచ్చాయనీ, దాడి యత్నాలు కూడా జరిగాయనీ వెల్లడించారు. తననే కాదు, తన కుటుంబాన్ని కూడా చంపేస్తామంటూ రెడ్ ఇంక్ తో రాసిన బెదరింపు లేఖలు వచ్చాయన్నారు. రాజకీయ అవినీతిని రూపుమాపితే తప్ప సమాజంలో మార్పు రాదని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. రాజకీయాలలో ప్రజా సేవ కంటే అవినీతి, స్వార్థం పెచ్చరిల్లాయనీ, వాటిపై దృష్టి సారించాలని అన్నారు. రాజకీయ అవినీతిని రూపు మాపితే అన్నీ దారిలోకి వస్తాయన్నారు.    

మహిళల క్రికెట్ లో మన్కడింగ్ వివాదం!

ఐసీసీ ఎన్ని సార్లు వివరణ ఇచ్చినా క్రికెట్ లో మన్కడింగ్ వ్యవహారం మాత్రం వివాదాస్పదంగానే ఉంటోంది. మన్కడింగ్ అంటే బౌలర్ బంతి వేయడానికి ముందే నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ క్రీజ్ దాటి బయటకు వెళితే బౌలర్ బాల్ డెలివరీ చేయడానికి ముందే స్టంప్ చేసి రనౌట్ చేయడం. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని క్రీడా పండితులు, ఆటగాళ్లు అంటుంటారు. కానీ నిబంధనల మేరకు బౌలర్ బంతి విసరడానికి ముందే నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ క్రీజ్ దాటడానికి వీల్లేదు. అలా దాటితే బౌలర్ స్టంప్ చేసి ఔట్ చేయవచ్చు. అయితే ఇది బౌలర్ నైపుణ్యానికీ, బ్యాటర్ వైఫల్యానికీ సంబంధించిన ఔట్ కాదు కనుక ఇలా ఒక బ్యాటర్ ను ఔట్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని అంటుంటారు. నిబంధనల మేరకు ఇది సరైనదే అయినా, ఇలాంటి ఔట్ చేసిన బౌలర్ పై విమర్శలు వెల్లువెత్తడం సాధారణమైపోయింది. ఇంతకీ ఈ తరహా రనౌట్ ను మన్కడింగ్ అని ఎందుకంటారంటే.. 1947-48లో భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్ బిల్ బ్రౌన్ ను భారత్ బౌలర్ వినూమన్కడ్ ఈ రీతిలోనే ఔట్ చేశాడు. క్రికెట్ చరిత్రలో ఈ తరహాలో ఒక బ్యాటర్ రనౌట్ కావడం ఇదే మొదటి సారి. దీంతో ఈ తరహా రనౌట్ ను మన్కడింగ్ అంటారు. తాజాగా ఈ మన్కడింగ్ మహిళల క్రికట్ లో నూ వివాదాన్ని రేపింది. ఇంగ్లండ్ తో చివరి వన్డే సందర్భంగా భారత్ బౌలర్ దీప్తి శర్మ ఇంగ్లాండ్ బ్యాటర్ చార్లీ డీన్ ను మన్కడింగ్ చేసింది. దీనిపై ఇంగ్లాండ్ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా దీప్తి శర్మ వ్యవహరించారని నిందలేస్తున్నారు. వాస్తవానికి ఈ తరహాలో ప్రత్యర్థి బ్యాటర్ ను ఔట్ చేయడంలో అనుచితమేమీ లేదనీ క్రికెట్ నిబంధనలు విస్పష్టంగా చెబుతున్నాయి. పైగా క్రికెట్ జంటిల్ మెన్ గేమ్ నుంచి ప్రొఫెషనల్ గేమ్ గా మారిపోయిన తరువాత ప్రతి పరుగూ, ప్రతి బంతీ, ప్రతి వికెట్ జట్లకు అత్యంత ప్రాధాన్యమైపోయాయి. విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డాల్సిన అవసరం వచ్చింది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ తెరపైకి స్లెడ్జింగ్ వచ్చింది. ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగ్రతను చెడగొట్టడానికి నోటికి పని చెప్పడం సర్వసాధారణమైపోయింది. ఈ స్లెడ్జంగ్ లో ఆస్ట్రేలియా, ఆ తరువాత ఇంగ్లాండ్ సిద్ధ హస్తుల్లా పేరొందాయి. స్లెడ్జింగ్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధం కానప్పుడు.. నిబంధనల ప్రకారం తప్పుకాని మన్కడింగ్ విషయంలోనే క్రీడాస్ఫూర్తి అంశాన్ని ఎందుకు బయటకు తీసుకువస్తారన్నది అర్ధం కాని విషయం. ఎందుకంటే.. ప్రతి పరుగూ విజయాన్ని నిర్దేశించేటంత పోటీ తత్వంతో జరుగుతున్న మ్యాచ్ లో బౌలర్ బంతి వేయడానికి ముందే క్రీజ్ దాటి వెళ్లి వేగంగా ఎక్సట్రా రన్ సాధించేందుకు ప్రయత్నించడం ఎందుకు క్రీడాస్ఫూర్తికి విరుద్ధం కాదో మన్కడింగ్ ను విమర్శించే వారు చెప్పాల్సిన అవసరం ఉంది. మన్కడింగ్ ఎంత మాత్రం వివాదం కాదని ఐసీసీ విస్పష్ట వివరణ ఇచ్చిన తరువాత కూడా వివాదాన్ని కొనసాగించడం అర్ధరహితమని క్రీడా పండితులు అంటున్నారు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా దీప్తి శర్మ చార్లీ డీన్ ను మన్కడింగ్ చేయడంపై నిప్పులు చెరుగుతున్న ఇంగ్లాండ్..ఇదే సిరీస్ లో  ఇంగ్లాండ్‌ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ ఎమీ  జోన్స్‌.. స్మృతి మంధాన క్యాచ్‌ను అందుకునే క్రమంలో బంతి గ్రౌండ్ కు తాకినా ఆ విషయాన్ని బయటపెట్టకుండా స్ట్రాంగ్ అప్పీల్ కేసింది. స్మృతి మంథాన  ఔట్‌ అయ్యానని డిసైడ్ అయి పెవిలియన్ వైపు కదిలినా ఏమీ జోన్స్ తాను క్యాచ్ డ్రాప్ చేసిన విషయం చెప్పి ఆమెను వెనక్కు పిలవలేదు.  అయితే రీప్లేలో విషయం బయటపడటంతో అంపైర్లు స్మృతిని వెనక్కు పిలిచారు అది వేరే సంగతి. మరి క్యాచ్ డ్రాప్ చేసినా అప్పీల్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం కాదా? అన్న ప్రశ్నకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు జవాబు చెప్పాలి. తాము చేస్తే రైట్..ప్రత్యర్థులు చేస్తే రాంగ్ అనే తీరే   క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని తెలుసుకోవాలి. 

వికేంద్రీకరణ అంటే పంచాయతీ నిధులను దారి మళ్లించడమేనా?

నోటితో వికేంద్రీకరణ అంటూ చేతల్లో అధికారాలన్నీ గంపగుత్తగా అధీనంలో ఉంచుకుంటున్నది జగన్ సర్కార్. స్థానిక సంస్థల నిధులు, విధులను హరించేసి.. పంచాయతీలను నిర్వీర్యం చేయడం ద్వారా స్థానిక ప్రజా ప్రతినిథులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేస్తోందని తెలుగుదేశం ధ్వజమెత్తింది. అమరావతిని నిర్వీర్యం చేయడానికే వికేంద్రీకరణ పాట పాడుతోంది కానీ వాస్తవానికి జగన్ సర్కార్ తీరు నియంతృత్వాన్ని తలపిస్తోందని విమర్శిస్తున్నది.  కేంద్రం రాష్ట్రంలోని పంచాయతీలకు పంపిన 14, 15 ఆర్థిక సంఘం నిధులను రహస్యంగా దొడ్డిదారిన మళ్లించి, నిలదీస్తే కరెంటు బిల్లులు కట్టామంటూ చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని నిలదీస్తోంది. తెలుగుదేశం నాయకుడు బూబా రాజేంద్ర ప్రసాద్ సర్పంచ్ ల సమావేశంలో మాట్లాడుతూ..ఆర్ధిక సంఘం నిధులను దొడ్డిదారిన డ్రా చేసి,  నిజంగానే విద్యుత్ బిల్లులు కట్టి ఉంటే ఆ రసీదులను సర్పంచ్ లకు పంపాలని డిమాండ్ చేశారు. ఇష్టారీతిగా అప్పులు చేయడం, నిధులను దారి మళ్లించడం, ఏ పని చేయాలన్నా సొమ్ములు లేవంటూ బీద అరుపులు అరవడం ఈ సర్కార్ కు ఒక అలవాటుగా మారిపోయిందని రాజేంద్ర ప్రసాద్ ధ్వజమెత్తారు.   పంచాయతీల నిధులను దారి మళ్లించి ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లులు కట్టామన్న మాట శుద్ధ అబద్ధమనీ, ఇప్పటికీ బకాయిల కోసం విద్యుత్ అధికారులు సర్పంచ్ లపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన ప్రభుత్వం చరిత్రలో వైసీపీ ఒక్కటేననీ, బుకాయింపులు వినా ఈ మూడేళ్ల కాలంలో జగన్ సర్కార్ రాష్ట్రం కోసం చేసినదేమీ లేదని ఆయన ధ్వజమెత్తారు.  సర్పంచుల సంతకాలు లేకుండా, గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా, కేంద్ర ప్రభుత్వం పంపిన ఆర్థిక సంఘం నిధులు దొడ్డిదారిన దారి మళ్ళించడం నిబంధనల ఉల్లంఘనేనని ఆయన అన్నారు.   అసలు  గ్రామపంచాయితీలలో నిధులు సర్పంచ్ సంతకం లేకుండా మీరు ఎలా డ్రా చేశారు, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ నిథులకు కేంద్రం మీకు సమాచారం లేకుండా దొడ్డిదారిన డ్రా చేస్తే మీరు అంగీకరిస్తారా? రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో గ్రామ పంచాయతీకి సర్పంచ్ అంతే కదా? మరి సర్పంచ్ ల సంతకం లేకుండా, సర్పంచ్ కు సమాచారం లేకుండా నిధులు ఎలా డ్రా చేశారో వివరణ ఇవ్వాలని రాజేంద్ర ప్రసాద్ నిలదీశారు. గత ముఖ్యమంత్రులు మైనర్ పంచాయతీలకు విద్యుత్ ఉచితంగా ఇచ్చిన సంగతి మీకు తెలుసా ఆర్థిక మంత్రిగారూ అని రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు.  కేంద్ర ప్రభుత్వం పంపిన ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.    ఆర్థిక సంఘం నిధులు రూ. 7660 కోట్ల ను వెంటనే   గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. 

బొత్స కన్నెర్ర చేస్తే అమరావతి రైతుల యాత్ర ఆగిపోతుందా?

గిల్లి జోల పాట పాట పాడుతున్నట్లు ఉంది మంత్రి బొత్స తీరు. విశాఖలో ఆదివారం ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన రైతుల మహాపాదయాత్రపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము కన్నెర్ర చేస్తే పాదయాత్ర ఆగిపోతుందని హెచ్చరించారు. అదే నోటితో పాదయాత్రలను అడ్డుకోవడం సరికాదంటూ జోలపాట పాడారు. ఒక వైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే మరో వైపు యాత్రలను అడ్డుకోవడం సరికాదని బొత్స అంటున్నారు. అమరావతి రైతుల పాదయాత్రను ఆపాలనుకుంటే తమకు ఐదు నిమిషాలు చాల మంత్రి బొత్స సత్యనారాయణ  అది ప్రజాస్వామ్య పద్ధతి కాదన్న ఉద్దేశంతోనే తామా పని చేయడం లేదని  ‘వికేంద్రీకరణకు మద్దతుగా’ అన్న అంశంపై  జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారు.   అమరావతి రైతులు చేస్తున్నది ఏ యాత్రో తనకు అర్ధం కావడం లేదన్నారు. అది రాజకీయ యాత్రా, పాదయాత్రా.. రియల్‌ ఎస్టేట్‌ యాత్రా అన్నది తెలియడం లేదనీ.. ఎందుకంటే అమరావతినే రాజధాని చేయాలన్న ఒప్పందం ఏమీ లేదని బొత్స సూత్రీకరించారు. అయినా అసలు విశాఖను పరిపాలనా రాజధాని చేస్తే ఎవరికైనా వచ్చే నష్టమేమిటని ప్రశ్నించారు. దోచుకోవడమే తమ విధానమైతే ఇప్పటికి సగం విశాఖ తన ఖాతాలోనే ఉండేదని బొత్స అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతితో తాము రైతుల పాదయాత్రను అడ్డుకోవడం లేదని.. రైతులు కూడా అలాగే రెచ్చగొట్టే ధోరణి విడనాడి శాంతియుతంగా ముందుకు సాగాలని హితవు పలికారు. అదే సమయంలో మూడు రాజధానులకు, వికేంద్రీకరణకు అనుగుణంగా పోరాటానికి సిద్ధం కావాలని వైసీపీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు   వీధి ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు, అవసరమైతే యాత్రలు నిర్వహించాలని బొత్స అన్నారు. అయితే బొత్స వ్యాఖ్యలపై విపక్షాలు మండి పడుతున్నాయి. అమరావతి రైతుల యాత్రకు పోటీగా విశాఖలో ర్యాలీల నిర్వహణ ద్వారా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా చేసి రైతుల యాత్రను అడ్డుకోవాలన్నదే బొత్స పిలుపు వెనుక ఉన్న కుట్ర అని ఆరోపిస్తున్నారు. మంత్రిగా ఉండి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అమరావతి యాత్రను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు. బొత్స తీరు నోటితోనూ, నొసటితోనూ వెక్కిరింపే అన్నట్లుగా ఉందని అభివర్ణిస్తున్నారు.  

ఉప్ప‌ల్‌లో  రెచ్చిపోయిన కింగ్ కోహ్లీ, సూర్య‌.. భార‌త్ విజ‌యం

చాలా రోజుల త‌ర్వాత హైద‌రా బాద్ క్రికెట్ అభిమానుల‌కు ఆదివారం భార‌త్‌, ఆస్ట్రేలియా మ్యాచ్ పండ‌గ ఆనందాన్ని చ్చింది. మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు గెలిచి భార‌త్ ఈ సిరీస్ కైవ‌సం చేసుకుంది. నాగ‌పూర్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో సునాయా సంగా గెలిచిన భార‌త్ హైద‌రాబాద్‌ లోనూ పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే గెలిచింది. ముఖ్యంగా కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్‌, పాండ్యా ల వీర‌బాదుడుతో ఆసీస్పై ఆరు వికెట్ల తేడాతో భార‌త్ మూడో మ్యాచ్ గెలిచింది. ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మ‌న్ గ్రీన్‌, టిమ్ డేవిడ్‌లు విజృం భించి ఆడ‌టంతో 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగులు చేసింది. ముఖ్యంగా గ్రీన్ అద్బుత బ్యాటింగ్ నైపుణ్యంతో కేవ‌లం 21 బంతుల్లో 52 ప‌రుగులు చేసి ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. మొద‌ట బ్యాట్ చేసిన ఆసీస్ ఆరంభం నుంచే ఫించ్, గ్రీన్‌లు వీరావేశంతో ఆడేరు. భార‌త్ పేస‌ర్ల ప‌ని ప‌ట్టార‌నాలి. సునాయాసంగా ఫోర్లు కొట్ట‌డంతో వారిని అడ్డుకునేందుకు చేసిన య‌త్నాలు విఫ‌లమ‌య్యాయి. మొద‌టి 3 ఓవ‌ర్ల‌లోనే 35 ప‌రుగులు దంచారు. నాలుగో ఓవ‌ర్లో స్పిన్న‌ర్ అక్ష‌ర్ ఆసీస్ కెప్టెన్‌ను పెవిలియ‌న్ దారి ప‌ట్టించాడు. అప్ప‌టికి కాస్తంత ఊపిరిపీల్చుకున్నారు. ఫించ్ 7 ప‌రుగులే చేసాడు.కానీ మ‌రో ఎండ్‌లో గ్రీన్ వీర‌బాదుడు కొన‌సాగించి 50 ప‌రుగులు పూర్తిచేశాడు. కాగా 5వ ఓవ‌ర్ భువీ చేతిలో గ్రీన్ వెనుదిరిగాడు. గ్రీన్ కేవ‌లం 19 బంతుల్లో 52 దంచాడు. ప‌వ‌ర్ ప్లే పూర్త‌య్యే స‌రికి ఆసీస్ 2 వికెట్ల న‌ష్టానికి 66 ప‌రుగుల చేసింది. త‌ర్వాత వ‌చ్చిన స్మిత్ మొద‌టి బాల్ నుంచి ఎంతో దూకుడుగా ఆడి జ‌ట్టుస్కోర్ 71కి చేర్చాడు. ఆ త‌ర్వాతి ఓవ‌ర్లో మాక్స్ వెల్ ని చాహ‌ల్ అవుట్ చేయ‌డంతో ఇక పెద్ద‌గా భారీ షాట్స్ ఆడేవారు ఉండ‌ర‌న్న ధైర్యం వ‌చ్చింది. ప‌దో ఓవ‌ర్లో స్మిత్ కూడా  వెనుదిర‌గ‌డం బౌల‌ర్ల విజ‌యంగా భావించాలి. స్మిత్ 9 ప‌రుగులేచేశాడు. 10 ఓవ‌ర్ల‌కి ఆసీస్ 4 వికెట్ల న‌ష్టానికి 86 ప‌రుగు లు చేసింది. 12ఓవ‌ర్లో ఆసీస్ 100 రుగులు పూర్తిచేసింది. కాగా, అక్ష‌ర్ వేసిన 14ఓవ‌ర్లో రెండు వికెట్లు తీయ‌డంతో ఆసీస్ భారీ స్కోర్ అవ‌కాశాలు త‌గ్గాయ‌నాలి. అంత‌కుముందు మ్యాచ్‌లు ధాటిగా ఆడిన వేడ్ కేవ‌లం ఒక్క‌ప‌రుగుకే వెనుదిర‌గ‌డం ఆశ్చ‌ర్య ప‌రిచింది. ఆసీస్ 15 ఓవ‌ర్ల‌కి 6 వికెట్ల న‌ష్ట‌పోయి 123 ప‌రుగులు చేసింది. అయితే చివ‌ర్లో సామ్స్‌, డేవిడ్‌లు ఎంతో నిల‌క‌డ‌గా ఆడి 28 బంతుల్లో 56 పుగులుచేసి జ‌ట్టు స్కోరు 180కి చేర్చ‌గ‌లిగారు. 19వ ఓవ‌ర్లో బుమ్రా ఊహించ‌నివిధంగా ఏకంగా 18 ప‌రుగులు ఇచ్చి నిరాశ‌ప‌రిచాడు. చివ‌రిది 20వ ఓవ‌ర్లో డేవిడ్ వెనుదిరి గాడు.  డేవిడ్ 54 రుగులు చేశాడు.  187 ప‌రుగుల ల‌క్ష్యంతో బ్యాటిం గ్‌కి దిగిన భార‌త్ మొద‌టి ఓవ‌ ర్లోనే రాహుల్ వెనుదిరిగాడు. అత‌ను ఒక్క ప‌రుగే చేశాడు. 4వ ఓవ‌ర్లో కెప్టెన్ శ‌ర్మ వెనుదిరిగాడు. శ‌ర్మ 14 బంతుల్లో 17 రుగులు చేశాడు. అప్ప‌టికి జ‌ట్టు స‌కోర్ 2 వికెట్ల న‌ష్టానికి 30 ప‌రుగులే ఉంది. 6 ఓవ‌ర్లు పూర్త‌య్యే స‌రికి భార‌త్ 2 వికెట్ల న‌ష్టానికి 50 ప‌రుగులు చేసింది. అక్క‌డ నుంచి కింగ్ కోహ్లీ, డాషింగ్ బ్యాట్స్‌మ‌న్ సూర్య‌కుమార్ రెచ్చి పోయి ఆడారు. ఆసీస్ బౌల‌ర్ల‌కు ఏమాత్రం అంద‌కుండా వీర బాదు డుతో జ‌ట్టుస్కోరును ప‌రు గులు పెట్టించారు. కోహ్లీ చూస్తుండ‌ గానే సూర్య వేగంగా ప‌రుగులు చేయ‌డం గ‌మ‌నార్హం. 11వ ఓవ‌ర్‌ కొ భార‌త్ 100 ప‌రుగులు పూర్తి చేసింది. 13వ ఓవ‌ర్లో సూర్య‌ కుమార్ వెనుదిరిగాడు. అప్ప‌టికి అతను కేవ‌లం 29 బంతుల్లోనే 50 ప‌రుగులు చేశాడు. కోహ్లీ, సూర్య‌ల జోడి 61 బంతుల్లో 104 ప‌రుగులు చేయ‌డం ప్రేక్ష‌కు లకు ఫుల్ పైసా వ‌సూల్ అయిం ది. సూర్య స్థానంలో వ‌చ్చిన పాండ్యా వ‌స్తూనే దూకుడుగా ఆడాడు. 14వ ఓవ‌ర్‌కి భార‌త్ 134 ప‌రుగులు చేసింది. 15 ఓవ‌ర్లు పూర్త‌య్యేస‌రికి భార‌త్ 3 వికెట్ల న‌ష్టానికి 143 ప‌రుగులు చేసింది. ఇన్నింగ్స్ 16వ ఓవ‌ర్లో కోహ్లీ అర్ధ‌సెంచ‌రీ పూర్తి చేశాడు. కింగ్ త‌న అర్ధ‌సెంచ‌రీని 31 బంతుల్లో చేశాడు. కాగా 18వ ఓవ‌ర్ క‌మిన్స్ వేసిన ఓవ‌ర్లో భార‌త్ అత్య‌ధికంగా 21 పరుగులు సాధించింది. పాండ్యా వీర‌బాదుడుతో క‌మిన్స్‌కు ఏమీ అర్ధంకాలేదు. 19వ ఓవ‌ర్లో 11 ప‌రుగులు వ‌చ్చాయి. 20 ఓవ‌ర్లో రెండో బంతికి కోహ్ల వెనుదిర‌గ‌డంతో ప్రేక్ష‌కులు కాస్తంత ఖంగారు ప‌డ్డారు. కింగ్ 48 బంతుల్లో 63 ప‌రుగులు చేశాడు.  అత‌ని స్థానంలో ఫినిష‌ర్ కార్తీక్ వ‌చ్చాడు. కానీ అప్ప‌టికే పాండ్యా మంచి దూకుడు మీద ఉండ‌డంతో జ‌ట్టు విజ‌యానికి కావ‌ల‌సిన ప‌రుగులు అత‌నే చేయ‌గ‌లిగాడు. పాండ్యా 16 బంతుల్లో 25 ప‌రుగుల చేసి అజేయంగా నిలిచాడు. ఈ విజ‌యంతో ఈ సిరీస్ 2-1 తేడాతో భార‌త్ కైవ‌సం చేసుకుంది.