‘హస్తం’లో అంతర్మథనం!
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సర్వాధికారి.. అందులో సందేహం లేదు. ఇప్పుడే కాదు.. పార్టీలో ఆయనకు ఏ పదవీ లేనప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులకు ఆయన మాటే వేదం. ఆయన నందంటే నంది పందంటే పంది. కాదని ఎవరైనా కాసింత తోక జాడిస్తే అంతే సంగతులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో అయితే చేప్పనే అక్కర లేదు. ఇటు పార్టీకి అటు ప్రభుత్వానికి ఆయనే ‘బిగ్ బాస్’. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయితే.. రాహుల్ గాంధీ సూపర్ ప్రైమ్ మినిస్టర్ అన్నట్లు వ్యవహారం నడిచింది.
ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం.. అందరికి తెలిసిన, బాగా గుర్తున్న విషయమే. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఒకానొక ఆర్డినెన్సు రాహుల్ గాంధీకి నచ్చ లేదు. అందులో తప్పు లేదు. అది ఆయన విజ్ఞతకు సంబందించిన విషయం. ఆ ఒక్క ఆర్డినెన్సు అనే కాదు.. మరే ఆర్డినెన్సు లేదా చట్టం అయినా అందరికీ నచ్చాలని లేదు. నిజానికి.. ఆ ఆర్డినెన్సును ఆమోదించిన మంత్రి మండలిలోని మంత్రులు అందరికీ ఆ ఆర్డినెన్సు నచ్చిందని చెప్పలేము. అయి నా.. మంత్రి మండలి ఆమోదం పొందిన తర్వాత అందరూ ఆమోదించి నట్లే, భావించవలసి ఉంటుం ది. అందుకే మంత్రులే కాదు.. కాంగ్రెస్ ఎంపీలు ఎవరూ కూడా ఈ ఆర్డినెన్సు నాకు నచ్చలేదని బరబరా చించి పారేయలేదు. ఆ పని రాహుల్ గాంధీ చేశారు. అది కూడా.. ప్రధానమంత్రి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో. ప్రధానితో పాటుగా మొత్తంగా మంత్రివర్గాన్ని ప్రభుత్వాన్ని, పార్టీని అవమాన పరిచే విధంగా.. ఛీ నాన్సెన్స్ అంటూ మీడియా ఎదుట ఆర్డినెన్సు కాపీని పరపరా ముక్కలు ముక్కలుగా చించి పారేశారు.అయినా.. సోనియా, మన్మోహన్ సింగ్ సహా ఎవరూ పెదవి విప్పలేదు. ఇదేమిటని ప్రశ్నించలేదు. ఆ తర్వాత ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఆ సమయంలో రాజీనామా చేయాలని అనుకున్నారనీ, ఎవరో వారిస్తే సర్డుకున్నారనే ప్రచారం జరిగింది. అయితే.. అది నిజమో కాదో తెలియదు.
సరే.. ఆ విషయాన్ని అలా ఉంచితే కాంగ్రెస్ పార్టీ అనే కాదు, బీజేపీ సహా జాతీయ, ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా వ్యక్టి ఆరాధనకు అలవాటు పడ్డాయి. వ్యక్తి ఆధారిత పార్టీలుగా మారిపోయాయి. రాజకీయాలు వ్యక్తుల చుట్టూనే తిరుగు తున్నాయి. అయితే.. అన్ని పార్టీలు, అందరు నాయకుల కథ వేరు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ స్టోరీ వేరని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
నిజానికి గతంలో కాంగ్రెస్ సహా ఏ పార్టీలో అయినా ఎన్నికల గెలుపు ఓటముల లెక్కల ఆధారంగానే నాయకత్వ నిర్ణయం జరిగేది. ఎవరి దాకనో ఎందుకు.. అత్యవసర పరిస్థితి అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో,ఇందిరాగాంధీ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు వచ్చింది. ఇందిరా గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ బ్రహ్మానంద రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ (ఆర్) పుట్టుకొచ్చింది. అయితే.. జనతా ప్రభుత్వంలో తలెత్తిన అంతర్గత కుమ్ములాటలను ఆసరా చేసుకుని ఇందిరాగాంధీ, కేవలం 11 నెలలకే తిరిగి అధికారంలోకి వచ్చారు. ఆ విధంగా ఆమె తమ నాయకత్వ సత్తాచాటుకుని పార్టీపై పట్టు సాధించారు. అలాగే.. అద్వానీ విషయంలో బీజేపీ ఆయన్ని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించి రెండు (2004, 2009) ఎన్నికల్లో పోటీ చేసింది. రెండు ఎన్నికల్లోనూ ఓడి పోయింది. అందుకే, 2014 లో అద్వానీని తప్పించి, మోదీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించి విజయం సాధించింది.
ఇక మళ్ళీ రాహుల్ గాంధీ విషయానికి వస్తే.. రాహుల్ ప్రత్యక్ష పరోక్ష సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ వరసగా మూడు సార్వత్రిక ఎన్నికలలలో ఓడి పోయింది. అందులో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. సీట్ల సంఖ్య, రెండు అంకెల సంఖ్యను దాట లేదు. మూడవ సారి, ప్రతిపక్ష హోదా అయితే, దక్కింది కానీ సీట్ల సఖ్య మూడంకెలు చేరలేదు. 99 దగ్గరే ఆగిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో వరసగా మూడు అసెంబ్లీ, మూడు లోక్ సభ ఎన్నికలు మొత్తం కలిపి ఆరు వరస ఎన్నికల్లో కాంగ్రెస్ జీరో స్కోర్ హ్యాట్రిక్ సొంతం చేసుకుంది. అది కూడా ఒక సారి కాదు, వరసగా రండు జీరో హ్యాట్రిక్ లు సొంతం చేసుకుంది. మొత్తంగా చూస్తే.. రాహుల్ గాంధీ ప్రత్యక్ష , పరోక్ష సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 90 పైగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పోయింది. అంతే కాదు.. రాహుల్ గాంధీ అపరిపక్వ రాజకీయాల కారణంగా పార్టీ మళ్లీ బతికి బట్ట కట్టలేనంత భారీ మూల్యం చెల్లించింది. అయినా.. కాంగ్రెస్ పార్టీ ఇంకా రాహుల్ గాంధీని మోస్తూనే వుంది. మరో వంక రాహుల్ గాంధీ ఇంకా అదే పంథాలో అడుగులు వేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి గతమే కానీ, భవిష్యత్ లేదనీ.. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాల నేపధ్యంలో రాహుల్ గాంధీ.. ఆయన చుట్టూ చేరిన కోటరీ నేతలు చేస్తున్న దేశ వ్యతిరేక వ్యాఖ్యలు, విమర్శలు కాంగ్రెస్ పార్టీ స్థాయిని మరింతగా దిగజార్చి వేయడంతో పాటుగా, ప్రజల్లో పార్టీ ప్రతిష్టను మరింతగా దిగజార్చి వేసిందని అంటున్నారు. అందుకే కాంగ్రస్ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందని, చివరకు ఇలా మిగిలాం ..అనే అంతర్మథనం మొదలైందని అంటున్నారు.