కేదార్ నాథ్ ఆలయ మ్యూజియం నిర్మాణ నిపుణునిగా శివనాగిరెడ్డి

కేదార్ నాథ్ ఆలయం సమగ్ర అభివృద్ధి పథకంలో భాగంగా, ఆలయ సమీపంలో రూపుదిద్దుకోనున్న కేదార్ పరిచయ్ మ్యూజియం నిర్మాణ నిపునిగా డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని కేంద్ర సాంస్కృతిక శాఖ నియమించింది. మ్యూజియంలోని వివిధ విభాగాల్లో ఏర్పాటు చేయబోయే ప్రదర్శితాలను ఎంపిక చేసేందుకు బుధవారం (మే1)  ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని తగు సూచనలు చేశారు.  కేదార్ నాథ్ ఆలయం వెనుక నిర్మిస్తున్న శివ ఉద్యానవనంలో ప్రదర్శించే  శివరూప శిల్పాలపై జరిగిన చర్చలో పాల్గొని, వివిధ రాజవంశాలకు చెందిన చారిత్రక శివుని శిల్పాలను ఎంపిక చేయటంలో స్థపతిగా తన అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సమావేశంలో నిపుణుల కమిటీ సభ్యులు డా.చూడామణి నందగోపాల్, డా. మాన్వి శెఠ్, డా. ప్రీతి త్రివేది, మేఘ్ కళ్యాణ సుందరం, నిఖిల్ వర్మ, స్తపతి ఉమాపతి ఆచార్య, సహాయకులు కాజల్, దుర్గేష్ లు పాల్గొన్నారని శివనాగిరెడ్డి తెలిపారు.  కేదార్ పరిచయ మ్యూజియంలోని మూడు గ్యాలరీలో మొదటి గ్యాలరీలో తీర్థ స్థలంగా కేదార్నాథ్, రెండో గ్యాలరీలో శివుని కుటుంబం, శివారాధన, మూడో గ్యాలరీలో స్థానిక సాంప్రదాయాలు, సాంస్కృతిక అంశాలు, ఆలయ వెనక నిర్మించిన ప్రాకారంలో లోపలి వైపున శివుని వెయ్యి పేర్లు, శివుని ఆయుధాలు ప్రదర్శించబడతాయని ఆయన చెప్పారు.

బందరులో పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్ వీరంగం!

ఎద్దు చేలో పడి మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పరిస్థితి కూడా ఇలాగే వుంది. పేర్ని కిట్టు తండ్రి పేర్ని నాని నాటకాల్లో నటనను పండిస్తే, ఇప్పుడు పేర్ని కిట్టు రౌడీయిజంలో నటనను పండిస్తున్నాడు. పేర్ని నాని ఇంతకాలం నియోజకవర్గంలో అరాచకాలు చేశారు. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని అంది పుచ్చుకున్న పేర్ని కిట్టు ఆ అరాచకాలను కంటిన్యూ చేస్తున్నాడు. తండ్రి ఎమ్మెల్యే, మంత్రి అయ్యాక, కాస్త ముదిరాక  అరాచకాలు చేస్తే, పేర్ని కిట్టు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడే టాలెంట్ చూపించడం ప్రారంభించాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని ప్రూవ్ చేసుకుంటున్నాడు. ప్రశాంతంగా వుండే మచిలీపట్నంలో అరాచకాలకు శ్రీకారం చుట్టిందే పేర్ని నాని. ఇప్పుడు పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారం పేరుతో అరాచకాలకు అన్నప్రాశన చేసుకుంటున్నాడు. పేర్ని కిట్టు అభ్యర్థిత్వాన్ని వైసీపీ నాయకులలో చాలామంది అంగీకరించడం లేదు. అందుకే వారు పేర్ని కిట్టుతో కలసి ప్రచారం చేయడం ఇష్టం లేక దూరంగా వుంటున్నారు. మచిలీపట్నంలో గంజాయి బ్యాచ్‌తో స్నేహసంబంధాలు, వ్యాపార అనుబంధాలు కొనసాగిస్తున్న పేర్ని కిట్టు ఇప్పుడు ఆ బ్యాచ్‌నే వెంటేసుకుని మచిలీపట్నంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్‌తో కలసి చేస్తున్నది పేరుకే ప్రచారం. అతని ప్రధాన టార్గెట్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులే. ప్రచారం పేరుతో  కూటమి నాయకుల ఇళ్ళ దగ్గరకి వెళ్తున్న పేర్ని కిట్టు తన గంజాయి బ్యాచ్‌తో కూటమి నాయకుల ఇళ్ళముందు మందుగుండు సామగ్రి విసురుతూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అదేమని ప్రశ్నిస్తే కూటమి నాయకులతో గొడవకి దిగుతూ, వారి ఇళ్ళలోకి వెళ్ళి విధ్వంసం సృష్టిస్తున్నారు. మొన్నీమధ్య పోతేపల్లిలో జనసేన కార్యకర్త మీద దాడి చేశారు. నిన్న కోన గ్రామంలో తెలుగుదేశం నాయకుడి మీద దాడి చేశారు. ఈరోజు మచిలీపట్నం ఎనిమిదో డివిజన్లో జనసేన నేత కర్రి మహేష్ ఇంటి మీద మీద గంజాయి బ్యాచ్‌తో దాడి చేయించాడు. గురువారం నాడు మచిలీపట్నంలోని విశ్వబ్రాహ్మణ వీధిలోకి గంజాయి బ్యాచ్‌తో కలసి ప్రచారానికి వచ్చిన పేర్ని కిట్టు కర్రి మహేష్ ఇంటి ముందు బాణసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. ఇదేంటని ప్రశ్నించినందుకు పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్ మహేష్ ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేశారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ సందర్భంగా కర్రి మహేష్ కుటుంబ సభ్యులు, పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్ మధ్య తోపులాట జరిగింది.  తమ ఇంటి ముందు పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్ దాడి చేసిందని కర్రి మహేష్ కుటుంబ సభ్యులతో కలసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. దాంతో జనసేన శ్రేణులు, టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించాయి. ఆందోళన చేస్తున్న జనసేన, టీడీపీ కార్యకర్తలకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన నేత బండి రామకృష్ణ సంఘీభావం పలికారు. కర్రి మహేష్ ఇంటి మీద దాడి చేసిన పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్‌ మీద చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.  ఇదిలా వుంటే, అధికారంలోకి రాకముందే పేర్ని కిట్టు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు.. రేపు పొరపాటున అధికారంలోకి వస్తే పరిస్థితి ఇంకెంత దారుణంగా వుంటుందోనని మచిలీపట్నం ఓటర్లు భయపడుతున్నారు.

దేవగౌడ మనవడికి ‘మాస్ రేపిస్ట్’ బిరుదు!

మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, కర్నాటకలోని హసన్ నియోజకవర్గ ఎంపీ, మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణను రాహుల్ గాంధీ ‘మాస్ రేపిస్ట్’ అని సంబోధించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ గురువారం కర్నాటకలోని శివమొగ్గలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. ప్రజ్వల్ రేవణ్ణను ‘మాస్ రేపిస్ట్’ అని పేర్కొన్న రాహుల్ గాంధీ, ఇలాంటి వ్యక్తి ఓట్లు వేయాలని కోరిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ప్రజ్వల్ రేవణ్ణ నాలుగు వందల మంది మహిళల మీద అఘాయిత్యం చేశాడు. వారి వీడియోలు చిత్రీకరించాడు. ఇది దేశంలోనే అతి పెద్ద అత్యాచార ఘటన.. ప్రధాన మంత్రికి ప్రజ్వల్ రేవణ్ణ ఘనకార్యాల గురించి ముందే తెలుసు. అలాంటి వ్యక్తికి మద్దతుగా మోడీ మాట్లాడారు’ అని రాహుల్ గాంధీ అన్నారు.

చేవెళ్ల లో గులాబీ పార్టీ హ్యాట్రిక్ కొడుతుందా? బీజేపీ, కాంగ్రెస్‌ బలహీనతలు ఏంటి?

ఒకవైపు పూర్తిగా గ్రామీణ వాతావరణం, మరోవైపు అత్యంత ఆధునిక జీవనం మిళితమైందే చేవెళ్ళ పార్లమెంటరీ నియోజకవర్గం. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, సాఫ్ట్‌వేర్ రంగానికి ఆయువుపట్టు హైటెక్ సిటీ కూడా చేవెళ్ళ పరిధిలోకే వస్తాయి. అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్‌ఎస్‌, బీజేపీలు నువ్వా-నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి.  చేవెళ్ళలో మూడు పార్టీల పరిస్థితి ఏంటి? ముఖ్యంగా  మూడు ప్ర‌ధాన పార్టీల బ‌లాబ‌లాలు ఏమిటి? బ‌ల‌హీన‌త‌లు ఏమిటో చూద్దాం.  చేవెళ్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి హేమాహేమీలు త‌ల‌ప‌డుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్ర‌స్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్‌ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వ‌ర్ రెడ్డి, జ్ఞానేశ్వ‌ర్ స్థానికులు.  బీజేపీ అభ్య‌ర్థి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిః 2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిపై, బీఆరెస్ అభ్య‌ర్థి రంజిత్ రెడ్డి గెలుపొందారు.  ఓడిపోయిన  విశ్వేశ్వ‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విడిచి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రంలో న‌రేంద్ర మోదీ స్వ‌చ్ఛ‌మైన పాల‌న‌ను చూసి త‌న‌ను గెలిపించాల‌ని విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఓట‌ర్ల‌ను కోరుతున్నారు.  విశ్వేశ్వరెడ్డి గెలుపుకోసం బీజేపీ అనుబంధ సంస్థలు క్షేత్రస్థాయిలోముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ముందుగానే అభ్యర్ధిగా ప్రకటించడం బీజేపీకి సానుకూలంగా మారింది. గతంలో ఆయన ఎంపీగా చేయడంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నివర్గాల వారితో సత్ససంబంధాలు కలిగి ఉండడం ఆయనకు కలిసివస్తోంది. ప్రధాని మోదీ పేరునే ప్రధాన ప్రచారస్త్రాంగా మలుచుకుని ఓట్లు అడుగుతున్నారు.  బీజేపీ శ్రేణులతో పాటు ఆర్ ఎస్ ఎస్‌ అనుబంధ సంస్థలు చాపకింద నీరులా పనిచేస్తున్నాయి. స్థానికంగానే బసచేస్తూ క్షేత్రస్థాయిలో ముమ్మర ప్రచారం చేస్తున్నాయి.  మోదీ ఛరిష్మా కలిసి వస్తుందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో రాజేంద్రనగర్, మహేశ్వరం అసెంబ్లీ స్థానాల్లో మైనార్టీ ఓట్లు చాలా కీలకంగా మారే ఛాన్స్ ఉంది. ఎంఐఎం పార్టీ ప్రత్యేకంగా అభ్యర్థిని నిలబెడితే ఇక్క‌డ బీజేపీ ఈజీగా గెలిచేది. కానీ ఎంఐఎం త‌న అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌లేదు. కాబ‌ట్టి పోటీ  కాంగ్రెస్ బీఆర్ ఎస్ మ‌ధ్య ముఖాముఖి పోటీ వుంది. బీఆర్ ఎస్ పార్టీకే ఇక్క‌డ క‌లిసి వ‌చ్చే అవకాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కాంగ్రెస్ అభ్య‌ర్థి రంజిత్ రెడ్డిః చేవెళ్ళ సిట్టింగ్ ఎంపి. కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. రెండోసారి విజ‌యం సాధించి త‌న అదృష్టాన్ని ప‌రిశీలించుకోవాల‌ని రంజిత్ రెడ్డి ఉన్నారు. త‌న‌కు ఉన్న వ్య‌క్తిగ‌త ప‌రిచ‌యాల‌తో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం ప్రారంభించారు.  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రంజిత్ రెడ్డి గెలుపుకోసం వ్యూహ‌ర‌చ‌న చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి.  చేవెళ్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించారు. అయితే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ ఎదురీదుతోంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటోంది. టీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి తో పాటు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ నేతలు కూడా తరలివస్తారని కాంగ్రెస్‌ నాయకత్వం భావించింది. కానీ ఇప్పటి వరకు ఆ స్థాయిలో చేరికలు జరడంగలేదు. దీంతో కాంగ్రెస్‌ ఆశించిన స్థాయిలో బలం పుంజుకోవడంలేదు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్ర‌కాష్ గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరతానని ప్రకటించినా తరువాత ఆయన వెనక్కి తగ్గారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన మరుసటి రోజే ఆయన వెనక్కి తగ్గి బీఆర్ ఎస్ లో కొనసాగుతానని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ నాయకత్వం అభాసుపాలైంది. పైగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విష‌యంలోనూ ఓట‌ర్ల‌లో అస‌హ‌నం వ్య‌క్తం అవుతుంది. కాబ‌ట్టి కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే బీఆర్ ఎస్ అభ్య‌ర్థి వైపే ఓట‌ర్లు మొగ్గు చూపుతున్నారు.   బీ ఆర్ ఎస్ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వ‌ర్ః తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత.. జరిగిన రెండు పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. 2014లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, 2019 ఎన్నికల్లో గ‌డ్డం రంజిత్ రెడ్డి గెలుపొందారు. గత రెండు ఎన్నికల్లోనూ రాజ‌కీయంగా అనుభ‌వం లేని నేత‌ల‌ను రంగంలోకి దింపి గెలిపించుకున్నారు గులాబీబాస్‌. ప్ర‌స్తుత బీఆరెస్ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వ‌ర్ స్థానికుడు. గ‌తంలో ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ప‌రిష‌త్ చైర్మన్‌గా జిల్లాలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేశారు.  ఎమ్మెల్సీగా జిల్లాకు సేవ చేశారు. బీసీ సామాజిక వ‌ర్గంలో మంచి ప‌ట్టు వుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీసీ జ‌నాభా కూడా 50 శాతానికి మించి వుంది. ఇవ‌న్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే కాసాని గెలిచిన‌ట్లేన‌ని స్థానిక ఓట‌ర్లు  చెప్పుకుంటున్నారు.  ఇక్క‌డ బీఆర్ఎస్‌కు బ‌ల‌మైన క్యాడ‌ర్ వుంది కాబ‌ట్టి ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి బీఆర్ ఎస్ చేవెళ్ళ‌లో హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని గులాబీ శ్రేణుల్లో ధీమా క‌నిపిస్తోంది.  స్థానికుడ‌నైన త‌న‌ను గెలిపించాల‌ని కాసాని కోరుతున్నారు. పైగా బీసీలంతా కాసానికే అండ‌గా వున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బీఆర్‌ఎస్‌ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. బీఆర్‌ఎస్ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్‌ ప్రణాళిక బద్ధంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు గెలుపుకోసం బీఆర్ ఎస్‌ అనుబంధ సంస్థలు, బీసీ కుల‌సంఘాలు క్షేత్రస్థాయిలోముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. కాసాని జ్ఞానేశ్వర్‌  అభ్యర్ధి గా వుండ‌టం బీఆర్ ఎస్‌కు సానుకూలంగా మారింది. గతంలో ఆయన జ‌డ్పీ ఛైర్మ‌న్‌గా, ఎమ్మెల్సీగా చేయడంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నివర్గాల వారితో సత్ససంబంధాలు కలిగి ఉండడం ఆయనకు కలిసివస్తోంది. కేసీఆర్ పాల‌నే  ప్రచారస్త్రాంగా మలుచుకుని ఓట్లు అడుగుతున్నారు. మరో వైపు  బీఆర్ ఎస్ సోషల్‌ మీడియా వింగ్‌ కూడా తెర వెనుక విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. బీఆర్ ఎస్‌ ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేసింది.   క్షేత్రస్థాయిలో ముమ్మర ప్రచారం చేస్తూ కాసాని ప్రచారంలో ముందంజలో ఉన్నారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్‌ పరిధిలో అత్యధిక ఓట్లు సాధించిన బీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికల్లో కూడా పట్టునిలుపుకునేయత్నం చేస్తోంది.  బీసీ కార్డును ప్రయోగిస్తోంది. మాజీ మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి రోజు వారీ నియోజకవర్గంపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార బాధ్యత సబితారెడ్డి తీసుకున్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

మెట్రో అధికారులు సామాన్యులనీ కరుణించాలి!

గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో వున్న రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. క్రికెట్ ప్రేమికుల సౌకర్యాన్ని దృష్టిలో వుంచుకుని గురువారం రాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో వుంటాయని మెట్రో అధికారులు ప్రకటించారు. సాధారణంగా రాత్రి పదిన్నర తర్వాత మెట్రోలు అందుబాటులో వుండవు. క్రికెట్ మ్యాచ్ కారణంగా రాత్రి 12:15కి ఎల్.బి.నగర్లో చివరి మెట్రో ప్రారంభమై, గమ్యస్థానమైన మియాపూర్‌కి 1:10 గంటలకు చేరుకుంటుదని ప్రకటించారు. ఉప్పల్, ఎన్జీఆర్ఐ స్టేషన్లలో మెట్రో ఎక్కడానికి మాత్రమే అనుమతి వుంటుందని, మిగతా స్టేషన్లలో దిగడానికి అనుమతి వుంటుందని మెట్రో అధికారులు తెలిపారు. అంతా బాగానే వుందిగానీ, క్రికెట్ ప్రేమికుల కోసం లేట్ నైట్ మెట్రో నడుపుతున్న అధికారులు ప్రతిరోజూ సామాన్య ప్రజల కోసం కూడా లేట్ నైట్ మెట్రో నడపితే బాగుంటుంది కదా అనే అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి. నిజానికి హైదరాబాద్ నిద్రపోని నగరాల జాబితాలోకి మెల్లగా ప్రవేశిస్తోంది. రాత్రి పదిన్నరకే మెట్రోని ఆపేయడం వల్ల చాలామంది  ఇబ్బంది పడుతున్నారు. రాత్రి పన్నెండు గంటల వరకు మెట్రో వుంటే చాలా సౌకర్యవంతంగా వుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ అంశం మీద మెట్రోకి విజ్ఞాపలను అందాయి. కానీ ఫలితమే రాలేదు. అందువల్ల క్రికెట్ లవర్స్ మీద కురిపించిన అభిమానాన్ని సాధారణ ప్రయాణికుల మీద కూడా చూపించండి అని పలువురు మెట్రో అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఏపీలో ప్రాణం తీసిన పెన్షన్!

భయపడినట్టే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన పెన్షన్‌ జగన్ పుణ్యమా అని బ్యాంకులకు వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.  మామూలు రోజుల్లో అయితే ఏలాగోలా సర్దుబాటు చేసుకునేవారే, ఎండలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పేలా చేయడం నిజంగా పాపం. ఆ పాపం శాపంలా మారి జగన్ ప్రభుత్వానికే తగలడం ఖాయం. రాయచోటిలో పెన్షన్ కోసం కెనరా బ్యాంకుకు వెళ్ళిన ముద్రగడ సుబ్బన్న అనే 80 సంవత్సరాల వృద్ధుడు బ్యాంక్ ఎదుట నిలబడి వుండగానే కిందపడిపోయి చనిపోయాడు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది.  వృద్ధుల ఇళ్ళకు వెళ్ళి పెన్షన్లు ఇవ్వడానికి సరిపోయేంత ప్రభుత్వ సిబ్బంది వున్నప్పటికీ అలా చేయకుండా అందరూ బ్యాంకులకు వెళ్ళాల్సిందే అనే రూల్ పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల ముందు అనేకమంది వృద్ధులు మండుటెండలో పడిగాపులు కాస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి బ్యాంకులకు వచ్చిన వృద్ధులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులకు వచ్చిన వృద్ధులు అందరికీ పెన్షన్ అందుతోందా అంటే అదీ లేదు. చాలామంది వృద్ధుల అకౌంట్లో పెన్షన్ డబ్బు జమ కాలేదు.. వాళ్ళని తర్వాత రమ్మని  చెప్పి పంపేస్తున్నారు. దాంతో వృద్ధులు ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. కొందరిని అయితే, మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్‌కి అనుసంధానం కాలేదంటూ పంపేస్తున్నారు. పెన్షన్ తీసుకున్నవారితోపాటు తీసుకోనివారు కూడా తమను ఇంత ఇబ్బంది పెట్టిన జగన్ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ శాపనార్థాలు పెడుతున్నారు.

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యం వెనుక ? సీబీఐ సుప్రీంకోర్టుకు ఏం చెప్పింది?

2011లో నమోదైన జగన్ అక్ర‌మ ఆస్థుల కేసుపై  రెండేళ్లలో ద‌ర్యాఫ్తు పూర్తి చేసిన సీబీఐ, 2013లోనే  ఛార్జిషీట్లు దాఖలు చేసింది. అయితే ఈ ఛార్జిషీట్లపై విచారణలో ఎలాంటి పురోగతి లేద‌ని, వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రఘురామకృష్ణంరాజు పిటీష‌న్‌పై  విచారణ సందర్భంగా, సుప్రీంకోర్టు సీబీఐకి చీవాట్లు పెట్టింది. కోర్టు చీవాట్ల‌తో క‌దిలిన‌ సీబీఐ, ఈ కేసు తాజా పరిస్ధితిపై సుప్రీంకోర్టుకు వివ‌ర‌ణ ఇచ్చింది.  2013లో చివరి ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత నుంచి,  ఇప్ప‌ట్టి వ‌ర‌కు జ‌రిగిన పరిణామాల‌న్నింటినీ క్షుణ్ణంగా వివరించింది.  1) విచారణను అడ్డుకునే లక్ష్యంతోనే, నిందితులు 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది.  2) నిందితులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లలో ఒకటి హైకోర్టు ముందు, 8 సుప్రీంకోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని సీబీఐ పేర్కొంది. 3) నిందితులంతా ఆర్థికంగా, రాజ‌కీయంగా బాగా శక్తిమంతులని, ఏదో ఒక కారణం చూపుతూ పిటిషన్లు దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. ఏదో ఒక కారణంతో ఒక దాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ... దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, అత్యంత సీనియర్ అఖిల భారత సర్వీసు అధికారులు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్‌లు, అత్యంత ధనవంతులైన వ్యాపారులున్నారు.  నిందితులుగా ఉన్న వ్యక్తులు, కంపెనీలు దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను ఉపయోగించుకుంటూ.. కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారు.   4) ఏదో ఒక కారణం చూపుతూ కింది కోర్టులో విచారణ ప్రక్రియ సాగకుండా, తీర్పులు వెలువరించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు 2018 సెప్టెంబర్ 10న జారీ చేసిన ఉత్తర్వుల్లోనే స్పష్టంగా చెప్పిందని సీబీఐ పేర్కొంది.  కేసుల విచారణలో జాప్యానికి కారణం, కోర్టులు కాదని.... అందుకు పిటిషనర్, ఇతర నిందితులే కారణమని ఆ తీర్పులో ఉన్నత న్యాయస్థానం చెప్పినట్లు సీబీఐ పేర్కొంది.  5) క్వాష్ పిటిషన్లు, డిశ్చార్జ్ పిటిషన్లను విచారించి సీబీఐ కోర్టు తీర్పులివ్వకముందే జడ్జీలు బదిలీ అయిపోయారు. ఇలా ఆరుగురు జడ్డీలు బదిలీ అయ్యారు.  6) ఈ పిటిషన్లను విచారించిన చివరి న్యాయమూర్తి సైతం కనీసం రెండేళ్లు కూడా కాకుండానే బదిలీ అయ్యారు.  7) జగన్ అక్రమాస్తుల కేసుల్లో మొత్తం 911 మంది సాక్ష్యులున్నారు. వారంతా 50 ఏళ్ల పైబడిన వాళ్లే.  కాబట్టి పిటిషనర్ రఘురామ కోరినట్లుగా ఈ విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయొద్దని సీబీఐ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.  విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తే సాక్ష్యులకు ఇబ్బందులు తప్పవని సీబీఐ తెలిపింది.  8) ప్రస్తుతం సీబీఐ కోర్టులో ఉన్న న్యాయమూర్తులు సరిపోవడం లేదు. అదనపు న్యాయమూర్తులను కేటాయించి, రోజువారీ విచారణ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును సీబీఐ కోరింది.  విచారణ వేగంగా జరగాలంటే సీబీఐ కోర్టులో ఖాళీలు భర్తీచేయాలి.  9) ఒక ప్రిన్సిపల్ కోర్టుకు ఈ కేసు రోజువారీ విచారణ బాధ్యతలు అప్పగించాలి.  జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు  ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది.  10) ప్రస్తుతం హైదరాబాద్ సీఐబీ కోర్టుకు ఒక ముఖ్య ప్రత్యేక న్యాయమూర్తి, ముగ్గురు అదనపు ప్రత్యేక న్యాయమూర్తులను కేటాయించారు.  ప్రస్తుతం అక్కడున్న మూడు ప్రత్యేక కోర్టుల బాధ్యతలనూ ఒకే ఒక అదనపు న్యాయమూర్తి మాత్రమే నిర్వర్తిస్తున్నారని సీబీఐ తెలిపింది.  ప్రిన్సిపల్ జడ్జి మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ గనుల తవ్వకాల కేసుపై రోజువారీగా విచారణ చేపట్టారు.   ఎమ్మార్, వివేకానందరెడ్డి హత్యలాంటి సున్నిత కేసులతోపాటు, హైదరాబాద్ లోని సీబీఐ, ఏసీబీ విభాగం, బెంగుళూరులోని సీబీఐ బీఎస్ఎఫ్‌బి విభాగం, చెన్నైలోని సీబీఐ ఈఓడబ్ల్యూ విభాగాలు దర్యాప్తు చేస్తున్న కేసులనూ ప్రిన్సిపల్‌ జడ్జే విచారిస్తున్నారు.  ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఉన్న రెండు అదనపు న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయడంతోపాటు, ప్రిన్సిపల్ జడ్జి కోర్టును వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులను రోజువారీగా విచారించే ప్రత్యేక కోర్టుగా ప్రకటించాలి.  11) ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లలో.... 911 మంది సాక్షులు, లక్షల పేజీలున్న 1,671 డాక్యుమెంట్లు ఉన్నాయి.  వాటన్నింటినీ ట్రయల్ కోర్టు పరిశీలించి విచారించాల్సి ఉంది.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌

నాలుగు కంటైనర్లు... 2 వేల కోట్ల క్యాష్!

అనంతపురం జిల్లాలో పామిడి హైవే.. నాలుగు పెద్ద పెద్ద కంటైనర్లు వున్న నాలుగు లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళ్తున్నాయి. ఆ లారీల మీద వున్నవి పెద్దపెద్ద కంటైనర్లు కాబట్టి లారీలు చాలా మెల్లగా ప్రయాణిస్తున్నాయి. ఈ లారీల ముందు ‘POLICE’ అనే బోర్డు కనిపిస్తోంది.  నాలుగు లారీల్లో చివరి లారీని డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ యథాలాపంగా రేర్ వ్యూ మిర్రర్లోంచి చూశాడు.. వెనుక తమ లారీల వైపు దూసుకొస్తున్న పోలీస్ వెహికల్ కనిపించింది. అందులో పదిమందికి పైగా పోలీసులు వున్నారు. పోలీసు వెహికల్ని చూసి లారీ డ్రైవర్ ఎంతమాత్రం భయపడలేదు.. పోలీసు వెహికల్ వేగంగా ముందుకు వచ్చింది. లారీలన్నిటి ముందుకు వెళ్ళి రోడ్డు మధ్యలో సడన్ బ్రేక్‌తో ఆగింది. వెంటనే అందులోంచి పోలీసులు బిలబిలమంటూ కిందకి దిగారు. వస్తున్న లారీలను ఆపాలన్నట్టు సైగ చేశారు. కొందరు సిన్సియర్ పోలీసులయితే ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్టుగా రివాల్వర్స్ తీసి లారీలకు ఎయిమ్ చేసి నిల్చున్నారు. పోలీసుల దగ్గరకు వచ్చిన లారీలు ఆగాయి. సాధారణంగా లారీ డ్రైవర్లు అంతమంది పోలీసులను చూస్తే కిందకి దిగి నమస్తే సార్ అంటారు. కానీ ఈ నాలుగు కంటైనర్లను డ్రైవ్ చేస్తున్న డ్రైవర్లు ‘పోలీసులా.. అయితే ఏందంట’ అన్నట్టుగా డ్రైవింగ్ సీట్లోనే కూర్చుని వున్నారు. పోలీసులు వాళ్ళని కిందకి దించారు. కంటైనర్లలో ఏముందో చెక్ చేసి షాకయ్యారు.. ఆ నాలుగు కంటైనర్లలో మొత్తం రెండు వేల రూపాయల క్యాష్ వుంది. పోలీసులకు అప్పుడెప్పుడో విడుదలైన మణిరత్నం సినిమా ‘దొంగ.. దొంగ’లో వున్న క్యాష్ కంటైనర్ గుర్తొచ్చింది. దాంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పై అధికారులకు సమాచారం అందించారు. నాలుగు కంటైనర్లలో మొత్తం రెండు వేల కోట్ల రూపాయల క్యాష్ వుంది కదా.. ఆ రెండు వేల కోట్ల రూపాయల క్యాష్ మరేదో కాదు.. రద్దయిన 5 వందల నోట్లు.. లారీలో వున్న వ్యక్తులను ప్రశ్నించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఆ కంటైనర్లు మొత్తం రిజర్వ్ బ్యాంక్ ఇండియాకి చెందినవి. నోట్ల రద్దు సందర్భంగా కేరళలో కలెక్ట్ చేసిన 5 వందల రూపాయల నోట్లను హైదరాబాద్‌లోని ఆర్బీఐ కార్యాలయానికి తీసుకెళ్తున్నారు. అంతే.. అంతకంటే పెద్ద మేటరేం లేదు. భలే కేసు పట్టుకున్నామని అప్పటి వరకు మురిసిపోయిన ఏపీ పోలీసులు నిట్టూర్చారు. ఆర్బీఐ అధికారుల నుంచి కన్ఫర్మేషన్‌ తీసుకుని కంటైనర్లని వదిలేశారు.

తూర్పు గోదావరి జిల్లాలో రూ 2.40 కోట్ల నగదు సీజ్ 

తూర్పు గోదావరి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు సీజ్‌ చేశారు. ఈరోజు ఉదయం గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో రూ.2.40 కోట్ల నగదు తరలి వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ మొత్తానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్‌ చేసినట్లు దేవరపల్లి సర్కిల్‌ సీఐ బాలసురేష్‌బాబు తెలిపారు. హైదరాబాద్ నుంచి విశాఖ పట్నం వెళుతున్న వీరాంజనేయ అనే ట్రావెల్ బస్సులో డబ్బు దొరికింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఇది హవాలా డబ్బా..లేక ఎన్నికల కోసం తరలిస్తున్నారా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎవరు తీసుకెళుతున్నారు, ఎవరి కోసం తీసుకెళుతున్నారు అనే అంశాలు కూడా ఇంకా తెలియలేదు. డబ్బును తీసుకెళ్ళుతున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. వీరి దగ్గర పోలీసులకు ఎలాంటి అనుమతి పత్రాలు లభించలేదు. ఎన్నికల నేపథ్యంలో గ్రామాలు, సరిహద్దుల్లో పోలీసులు ఎక్కడి క్కడ చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. ఇలాంటి అధిక మొత్తంలో ఎవరు డబ్బులు పట్టుకెళ్ళినా వారిని పట్టుకుంటూ చర్యలు తీసుకుంటున్నారు.

షర్మిల ఎఫెక్ట్.. కడపలో అవినాష్ సీన్ సితారేనా?

వైఎస్ షర్మిలా రెడ్డి.. రాజకీయాలలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. వైసీపీ అధినేత జగన్ కు స్వయానా సోదరి. వైఎస్ జగన్ విపక్షంలో ఉన్న సమయంలో షర్మిల అన్న కోసం.. అన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రమంతా చుట్టేశారు. పార్టీ అధినేత అందుబాటులో లేని లోటు పార్టీకి కనబడకుండా చేశారు.  అయితే షర్మిల పుణ్యమా అని అధికారంలోకి వచ్చిన జగన్.. సీఎంగా రాష్ట్రపగ్గాలు అందుకున్నాకా.. తనకు అధికార అందలం అందించడం కోసం రాష్ట్రమంతటా కాళ్లరిగేలా తిరిగిన షర్మిలను దూరం పెట్టేశారు. రాజకీయ అధికారంలో కానీ, కుటుంబ ఆస్తుల పంపకం విషయంలో కానీ ఆమెకు తీవ్ర నష్టం కలిగించారు. అన్న వైఖరితో విభేదించిన షర్మిల చివరికి పొరుగు రాష్ట్రం వెళ్లి కొత్త పార్టీ ఏర్పాటు చేసుకునే పరిస్థితి కల్పించారు. అక్కడా ఆమెను స్థిమితంగా ఉండనీయలేదు. వైఎస్ పై అభిమానంతో ఆ రాష్ట్రంలో షర్మిలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ముందుకు వచ్చిన వారిని కూడా జగన్ వారించారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న హెచ్చరికలతో అటువంటి వారిని షర్మిలకు దూరం చేశారు. పొంగులేటి వంటి వారు షర్మిలకు సహాయం చేయలేమంటూ నిస్సహాయత వ్యక్తం చేయడమే ఇందుకు నిదర్శనంగా అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు.  చివరకు ఆమె తెలంగాణ ఎన్నికల బరి నుంచి పార్టీని దూరంగా ఉంచి.. ఆ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ రాష్ట్ర పగ్గాలు అందుకున్నారు. వైసీపీతో ఢీ అంటే డీ అంటున్నారు.  స్వయంగా కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె ప్రచారం కడప రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. అవినాష్ కు నిద్రపట్టకుండా చేస్తోంది. తమ కుటుంబానికి పెట్టని కోటలాంటి కడప జిల్లాలో షర్మిల ప్రభావం వైసీపీకి అడుగడుగునా గండంగా మారింది. కడప ఎంపీగా  గెలిచేందుకు ఆమె సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఆమె ప్రచార సరళి, ప్రచార వేగం, మాటల తూటాలూ   వైసీపీ నేతల  మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి.  ఎన్నికల ప్రచారంలో ఆమె నేరుగా అవినాష్ రెడ్డి, జగన్ లనే అటాక్ చేస్తున్నారు. ఎలాంటి శషబిషలూ, మొహమాటాలూ లేకుండా  మనుషు పీకలు కోసే వాళ్లకు ఓట్లేసి గెలిపిస్తారా అంటూ ప్రజలను నేరుగా ప్రశ్నిస్తున్నారు. బాబాయ్ వైఎస్ వివేకా హంతకులను పక్కన పెట్టుకుని ఓట్లడగడానికి ఎలా వస్తున్నావంటూ జగన్ ను నిలదీసి ప్రశ్నిస్తున్నారు.   షర్మిల కడప లోక్ సభ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల నుంచి మరీ ముఖ్యంగా మహి ళల నుంచి విశేష  స్పందన వస్తున్నది.   ఈ స్థాయిలో షర్మిల  ప్రచారానికి ప్రజాస్పందన వస్తున్నదంటే వైసీపీ చేతులు ఎత్తేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎందుకంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా.. రాష్ట్రంలో  కాంగ్రెస్ కు లీడర్, క్యాడర్ లేరు. ఈ మాత్రంగానైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పేరు వినపడుతోందంటే అందుకు కారణం వైఎస్ కుమార్తె షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడమేనని అంగీకరించి తీరాలి. అటువంటి కాంగ్రెస్ ప్రచార సభలకు కడప జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే.. షర్మిలకు లోపాయికారిగా వైసీపీ క్యాడర్ సహకారం అందిస్తున్నట్టేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వైఎస్ వివేకా హత్యపై మాట్లాడకుండా వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చు కోవడం కూడా  అవినాష్ రెడ్డికి కడపలో బిగ్ మైనస్గా మారిందని చెబుతున్నారు. సీబీఐ చార్జిషీటులో చెప్పిన విషయాలను మాట్లాడవద్దని.. పబ్లిక్ డోమైన్ లో ఉన్న వాటిని ప్రస్తావించకూడదని కోర్టులు ఆదేశాలు ఇవ్వజాలవు. అందుకే  వైఎస్ వివేకా హత్య పై చర్చ కొనసాగుతూనే ఉంది. షర్మిల ఆ విష యాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. కడప కోర్టు గ్యాగ్ ఆర్డర్ కారణంగా జరిగింది ఏమైనా ఉందంటే జనం అవినాష్ రెడ్డి వైపు తప్పు ఉంది కనుకనే కోర్టును ఆశ్రయించారు అని జనం చర్చించుకోవడం మాత్రమే. 

అమిత్ షా ఫేక్ వీడియోల కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతల అరెస్ట్ 

ఎన్నికలకు ఇంకా 11 రోజుల వ్యవధి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికారపార్టీ నేతల  అరెస్ట్ సంచలనమైంది.  కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోల కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ బీజేపీ నేత ప్రేమేందర్‌ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ మన్నె సతీశ్, నవీన్, తస్లీమాను అరెస్ట్ చేసి సెంట్రల్ క్రైం స్టేషన్‌కు తరలించారు. కాగా, ఇదే కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మొన్ననే ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అస్సాం కాంగ్రెస్ యూనిట్ వార్ రూమ్ కోఆర్టినేటర్ రితోమ్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా మరో 10 మంది కాంగ్రెస్ నాయకులకు నోటీసులు జారీ చేశారు. తాజాగా, ప్రేమేందర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు ముగ్గురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

జగన్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన టిడిపి 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ప్రతిపక్ష అభ్యర్థులపై వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా జగన్ పై తక్షణం బ్యాన్ విధించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు ఏపీ ఎలక్షన్ కమిషనర్ కు జగన్ పై ఫిర్యాదు చేసినట్లు మీడియాకు వివరించారు.ఎన్నికల ప్రచారంలో అలవోకగా అబద్ధాలు చెబుతూ ప్రతిపక్షాలపై జగన్ బురద జల్లుతున్నాడని ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. రాష్ట్రంలోని మహిళలను కించపరిచేలా జగన్ మాట్లాడుతున్నారని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తన స్థాయి మరిచి చంద్రబాబు, పవన్‌ లపై తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు. ఇది ఎన్నికల కోడ్ కు విరుద్ధమని, కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన జగన్ ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ పై ఎన్నికల ప్రచారం చేయకుండా ఈసీ 48 గంటల పాటు బ్యాన్ విధించినట్లు ఏపీ సీఎంపైనా చర్యలు తీసుకోవాలని ప్రత్తిపాటి పుల్లారావు కోరారు.మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని ఈసీ పేర్కొంది. సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఈ చర్యలు తీసుకుంది. సిరిసిల్ల ప్రచారంలో కేసీఆర్ చవటలు, దద్దమలు, నిరోధులు అమ్ముకొండి అంటూ వ్యాఖ్యలు చేశారని…. ఇవి ఎన్నికల సంఘం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నిరంజన్ చేసిన ఫిర్యాదుపై ఈసీ ఈ చర్యలు తీసుకుంది.

సంప్రదాయబద్ధంగా జరిగిందే పెళ్ళి!!

‘మా ఇద్దరి మనసులు కలిశాయి.. పంచభూతాల సాక్షిగా, ముక్కోటి దేవతల సాక్షిగా పెళ్ళి చేసుకున్నాం’ అని సినిమా డైలాగులు చెబితే కుదరదని, ఏ హిందూ జంటకి అయినా ‘పెళ్ళి అయింది’ అని గుర్తించాలంటే వాళ్ళిద్దరికీ జీలకర్ర, బెల్లం, తాళిబొట్టు, ఏడడుగులు లాంటి సంప్రదాయాలను పాటిస్తూ పెళ్ళి జరిగి తీరాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పుడెప్పుడో మేమిద్దరం మాకు తోచినట్టు పెళ్ళి చేసుకున్నాం, మేమిద్దరం ఇప్పుడు తన్నుకు చస్తున్నాం. మాకు విడాకులు ఇచ్చేయండి’ అని ఓ జంట సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వీరి వివాహం జరిగిన పద్ధతి గురించి తెలుసుకున్న సుప్రీం కోర్టు.. అసలు మీకు జరిగింది పెళ్ళే కాదు.. ఇక విడాకులు ఇవ్వడం ఏమిటి? ఎవరి దారిన వాళ్ళు వెళ్ళండి అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తనకున్న అధికారాలను వినియోగిస్తూ ఆ దంపతుల పెళ్లి చెల్లదని తీర్పు వెలువరించింది. ఆ కేసుని డిస్మిస్ చేసింది. సంప్రదాయాలు, ఆచారాలు పాటించకుండా జరిగే హిందూ వివాహం చెల్లదు అని సుప్రీం కోర్టు స్పష్టంగా పేర్కొంది.  ‘హిందూ ధర్మంలో వున్న అనేక సంస్కారాల్లో వివాహం కూడా ఒకటి. దానికి పవిత్రత ఉంది. భారతీయ సమాజంలో దానికి ఆ గౌరవం, హోదా ఇవ్వాల్సిందే’ అని జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘పెళ్ళి అంటే ఆటపాటల కార్యక్రమమో, కట్నకానుకలు ఇచ్చిపుచ్చుకొనే వాణిజ్య లావాదేవీనో కాదు. హిందూ ధర్మంలో పెళ్లికి పవిత్రత ఉంది. దానికి ఆ హోదా ఇవ్వాల్సిందే. హిందూ ధర్మ పద్ధతి ప్రకారం పెళ్లి తంతు లేకుండా ఒక్కటైన దంపతులు నిజానికి దంపతులే కాదు.. చట్టం వారిని దంపతులుగా గుర్తించదు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం పెళ్లిలో కచ్చితంగా సంప్రదాయ ఆచారాలు, క్రతువులను నిర్వహించాల్సిందే.  అలాంటి ఆచార పద్ధతులను నిర్వహించకుండా జరిగిన పెళ్ళిని రిజిస్టర్ చేసినా అది చట్టబద్ధంగా చెల్లదు’ అని సుప్రీం కోర్టు పేర్కొంది.

తెలుగుదేశం కూటమి ఫిర్యాదులు బుట్టదాఖలేనా? ఎన్నికల సంఘం మౌనం సంకేతమదేనా?

కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక్క ఆంధ్ర ప్రదేశ్ విషయంలోనే నిబంధనలు గుర్తుకురావా?  లేక ఏపీకి సంబంధించి ఎన్నికల సంఘానికి ఏమైనా ప్రత్యేక గైడ్ లైన్స్ ఉన్నాయా?  ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అన్ని పార్టీల విషయంలో సమానంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందా? విపక్ష కూటమి ఫిర్యాదులను బుట్టదాఖలు చేసి తమాషా చూస్తోందా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఔననే సమాధానమే వస్తున్నది. సీఎస్-డీజీపీలను బదిలీ విషయంలో ఈసీ కిమ్మనకపోవడం?  చివరాఖరికి ఇన్ చార్జి డీజీపీ ఆధ్వ ర్యంలో  ఎన్నికలు జరగడం విధాయకం కాకపోయినా పట్టించుకోకపోవడం చూస్తుంటే.. వారి బదిలీ విషయం అటకెక్కనట్లేకనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ డిజీపీ విషయంలో ఇలా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే అలా మార్చేయడాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే  గత ఎన్నికల ముందు అప్పటికి ప్రతిపక్ష వైసీపీ ఫిర్యాదు ఇచ్చిన మరుసటిరోజే  ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయడాన్ని ప్రస్తావిస్తున్నారు.  అలాగే అప్పటి విపక్షం ఫిర్యాదుపై ఆఘమేఘాలపై స్పందించి అప్పటి సీఎస్ పునేఠాను బదిలీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదే ఎన్నికల సంఘం ఇప్పుడు విపక్షంలో ఉన్న తెలుగుదేశం, ఆ పార్టీ మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ ఫిర్యాదులిచ్చి నెలరోజులవుతున్నా, పోలింగ్ సమయం రోజుల వ్యవధిలోకి వచ్చేసినా  ఎందుకు స్పందించడం లేదని  ప్రశ్నిస్తున్నారు. ఇక సామాన్య జనంలో అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని పట్టించుకోకుండా అధిష్ఠానం ఇంకా వైసీపీ తోనే అంటకాగుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   గత ఎన్నికల ముందు బీజేపీతో విబేధించిన తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టే విధంగా వాయువేగంతో చర్యలు తీసుకున్న ఇదే ఎన్నికల సంఘం ఇప్పుడు  డీపీ-జనసేన ఎన్డీయే కూటమి ఉన్నా, తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు సీఎస్, ఇన్ చార్జి డీజీపీల బదిలీ విషయంలో ఎందుకు స్పందించడం లేదన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. టీటీడీ ఈఓ ధర్మారెడ్డిని తప్పించాలని స్వయంగా, కూటమిలో పెద్దపార్టీ అయిన బీజేపీ రాష్ట్ర అధ్య క్షురాలు పురందేశ్వరి ఫిర్యాదుచేశారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి కూడా ఫిర్యాదుచేశారు. సహజంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలే ఫిర్యాదుచేసినందున, ధర్మారెడ్డి డెప్యుటేషన్‌ను నిలిపివేసి, ఆయనను బదిలీ చేస్తారని అంతా భావించారు. అయితే ఆశ్చర్యకరంగా ధర్మారెడ్డి డెప్యూటేషన్ ను కొనసాగించాలంటూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ లేఖను కేంద్రంలోని బీజేపీ సర్కార్  ఆమోదించింది.  సొంత పార్టీ అధ్యక్షురాలి ఫిర్యాదులను పట్టిం చుకోకుండా బీజేపీ జగన్ వినతికి తలూపడం బీజేపీ, వైసీపీ బంధం కొనసాగుతోందా అన్న అను మానాలకు బలం చేకూర్చేలా ఉంది..  

కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఊచలు లెక్కబెడుతున్న బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ తనయ కవితకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశాలు కనిపించడం లేదు.  తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై తీర్పును కోర్టు వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు పూర్తికాగా.. గురువారం  తీర్పు వెలువరించనున్నట్లు కోర్టు గత విచారణలో తెలిపింది. అయితే, నేటి ఉదయం మరోమారు తీర్పును వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై ఈ నెల 6న తీర్పు వెలువరిస్తామని జడ్జి వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత జైలుపాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవిత.. తనను సీబీఐ అరెస్టు చేయడంపై న్యాయపోరాటం చేస్తున్నారు.  లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మార్చి 15 న అరెస్టు చేశారు. ఢిల్లీ కోర్టు కస్టడీ విధించడంతో ఆమెను తీహార్ జైలుకు పంపించారు. జైలులో ఉన్న కవితను ఇదే కేసులో ఈ నెల 11న సీబీఐ కూడా అరెస్టు చేసింది. కోర్టు అనుమతితో అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ అరెస్టులపై కోర్టులో కవిత పోరాడుతున్నారు. ఈడీ, సీబీఐ కేసులలో బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

ఏపీ అధికారులు కళ్ళు తెరవాలి!!

‘అధికారం శాశ్వతం కాదు’... దారిన పోతున్న ఏ దానయ్యని ఆపి ‘అధికారం’ అనే పాయింట్ గురించి అడిగితే ఈ సమాధానమే చెబుతాడు. ఇంత చిన్న లాజికల్ పాయింట్ ఆంధ్రప్రదేశ్‌లోని కొంతమంది అధికారులకు అర్థం కావడం లేదు. ఆ అధికారులలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు పలువురు ద్వితీయ, తృతీయ స్థాయి అధికారులు కూడా వున్నారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో వున్న వైసీపీ త్వరలో అధికారం కోల్పోబోతోందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. కానీ, కొంతమంది అధికారులకు మాత్రం ఆ విషయం తెలియడం లేదు.. వైపీపీ శాశ్వతంగా అధికారంలో వుంటుందన్న భ్రమల్లో బతుకుతూ ఆ పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు.  ఐదేళ్ళుగా వైసీపీ సేవలో తరించిన అధికారగణం ఎలక్షన్ కోడ్ అమల్లో వున్న ప్రస్తుత తరుణంలో కూడా నిస్పక్షపాతంగా పనిచేయడానికి మనసు రాక జగన్ ప్రభుత్వం సేవలో పునీతమవుతున్నారు. రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో అనే భయం ఎంతమాత్రం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి అధికారులందరూ తెలంగాణ రాష్ట్రంలోని అధికారులను చూసి, వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసి మారాల్సిన అవసరం వుంది. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ తప్పిదాన్ని చేయించిన కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడు ఏమంటున్నారు? మాకేమీ సంబంధం లేదని అంటున్నారు. మొన్నటి వరకు అధికారం వెలగబెట్టిన ఇద్దరూ ఇప్పుడు చేతులు ఎత్తేశారు. ఒకవేళ ట్యాపింగ్ జరిగి వుంటే, దానికి సంబంధించిన అధికారులను శిక్షించాలి అంటున్నారు తప్ప.. మేమే ట్యాపింగ్ చేయమన్నాం అని చెప్పడం లేదు. కేసీఆర్ అయితే మరింత దారుణంగా మాట్లాడారు. ప్రభుత్వ అధినేతగా నేను సమాచారం అడుగుతాను. అధికారులు ఏ మార్గంలో సమాచారం తెలుసుకుని తెచ్చి ఇస్తారో నాకు అవసరం లేదు.. నాకు సంబంధం లేదని చెప్పేశారు. అంటే, ట్యాపింగ్ చేయించిన కేసీఆర్, కేటీఆర్ చాలా తెలివిగా తప్పంగా అధికారుల మీదకి నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సీన్ రేపు ఏపీలో కూడా రిపీట్ అవుతుంది. ఇప్పుడు జగన్ మెప్పు కోసం పనిచేస్తే, రేపు అధికారం పోయిన తర్వాత జగన్ కూడా చేతులు దులుపుకుంటాడు.. నాకేం సంబంధం.. అధికారులే బాధ్యులు అనేస్తాడు. అప్పుడు దోషుల్లా నిలబడాల్సింది అధికారులే. ఒక్క ఛాన్స్ అంటే నమ్మి ఓటేసిన ప్రజల్నే మోసం చేసిన వ్యక్తి జగన్. అలాంటి వ్యక్తి మమ్మల్ని మోసం చేయడులే అనుకోవడం అధికారుల అమాయకత్వం.

మోడీ అహంభావం.. జనం తిరస్కారం! తొలి రెండు విడతల పోలింగ్ సరళి సంకేతం అదేనా?

ఏడువిడతల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకూ జరిగిన రెండు విడతల ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అనూహ్యంగా వెనుకబడింది. తమ ఎక్స్ పెక్టేషన్స్ కంటే సీట్లు భారీగా తగ్గనున్నాయని బీజేపీ నాయకులే చెబుతున్నారు. తోలి విడతలో 102, రెండో విడతలో 88 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 60 శాతం, రెండో విడతలో 62 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రెండు విడతల ఎన్నికలపై బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. తీరా పోలింగ్ పూర్తి అయిన తరువాత ఆ ఆశలు ఆవిరయ్యాయని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. బీజేపీ వెనుకబాటుకు కారణాలేమిటని ఆలోచిస్తే అతి ఆత్మవిశ్వాసం, అహంభావం కారణాలుగా కనిపిస్తాయి.  బీజేపీకి ప్రజాదరణ తగ్గడానికి, లేదా ప్రజావ్యతిరేకత పెల్లుబకడానికి ప్రధాన కారణం మోడీ అహంభావ పూరిత వైఖరిగా పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వస్తామనీ, ఈ సారి తమ సీట్ల సంఖ్య ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలతో కలుపుకుని  400 మార్కు దాటుతుందని మోడీ ఘనంగా ప్రకటించారు. 2004లో వాజపేయి ప్రభుత్వం   భారత్ వెలిగిపోతోంది అన్న నినాదంతో  ఎన్నికలకు వెళ్లి చతికిల పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలలో తొలి రెండు విడతల పోలింగ్ ముగిసిన తరువాత   2004 ఫలితమే పునరావృతమయ్యే పరిస్థితులు కానవస్తున్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. ఎన్నికలకు ముందే మోడీ ఈ సారి మరిన్ని కఠోర నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. అలాగే హిందూ ఓట్లను ఆకర్షించేందుకు కామన్ సివిల్ కోడ్, ముస్లిం రిజర్వేషన్ల రద్దు, సీఏఏ( ను పక్కాగా అమలు చేస్తామని ప్రకటించారు. ఎన్నికలకు ముందు ఈ ప్రకటనలు ఒక విధంగా దుస్సాహసంగానే చెప్పాలి. హిందూ ఓట్ల పోలరైజేషన్ కు దేశంలో మత పరమైన చీలకకు కూడా వెనుకాడబోమని మోడీ చెప్పకనే చెప్పారని అంటున్నారు.ఇది కూడా మోడీ సర్కార్ కు ప్రతికూలంగానే మారిందని అంటున్నారు.  ఇక ప్రాంతీయ పార్టీల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చేందుకు మోడీ సర్కార్ గత పదేళ్లుగా అవలంబించిన విధానాల కారణంగా ప్రజలలో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత వ్యక్తమౌతోంది.   తన ప్రభుత్వ విధానాలతో విభేదించే విపక్ష పార్టీల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడి,సీబీఐ లను ప్రయోగించి విధేయులుగా మార్చుకోవడానికి మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలను జనం విశ్వసించేలా పరిస్థితులు ఉండటం కూడా బీజేపీ పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణమైందన్నది పరిశీలకుల విశ్లేషణ.  బీజేపీ ఆర్థిక, రాజకీయ విధానాలపై విమర్శనాత్మకంగా మాట్లాడే మేధావులను అర్బన్ నక్సలైట్లుగా  ముద్ర వేయడం మధ్య తరగతి వర్గంలో మోడీ సర్కార్ పట్ల విముఖత ఏర్పడేందుకు కారణమైందంటున్నారు. ఇక  రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించించడం కూడా ప్రజాస్వామ్య వాదులలో ఆందోళన రేకెత్తిం చిందని అంటున్నారు. రెండోవిడత పోలింగ్ జరిగి 88 లోక్ సభ స్థానాలలో బీజేపీ మహా అయితే 28 స్థానాలలో విజయం సాధిం చే అవకాశాలు ఉన్నాయనీ, ఈ విడతలో పోటీలో ఉన్న   బీజేపీ సీనియర్ నేతలు అరుణ్ గోవెల్, హేమమాలినీ,రాజీవ్ చంద్రశేఖర్, ఓం బిర్లా, తేజస్వీ సూర్య వంటి వారి విషయంలో ఫలితాలు రాకముందే ఓటమి ఖరారైపోయిందని అంటున్నారు. అదే విధంగా మొదటి విడత  102 స్థానాలకు జరి గిన పోలింగ్ లో బీజేపీ 30 స్థానాలలో విజయం సాధిస్తే గొప్పే అన్న అంచనాలు ఉన్నాయి. రాజపుట్, జాట్, ఠాగూర్ సామాజికవర్గాల పట్ల టికెట్ల విషయంలో బీజేపీ వివక్షా పూరితంగా వ్యవహరించిందన్న ఆగ్రహం ఆయా వర్గాలలో బలంగా కనిపిస్తోంది. రాజస్తాన్ లో వసుంధరా రాజే, మహారాష్ట్ర లో చౌహన్ లను పక్కన పెట్టడం కూడా బీజేపీకి ప్రతికూలంగా మారిందని అంటున్నారు. యూపీ, రాజ స్థాన్, ఎంపీ, చత్తీస్గఢ్, మహారాష్ట్ర లలో దళితులు,ఆదివాసీలు ఇండియా కూటమి వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక ఈశాన్య రాష్ట్రాల ప్రజలు మొదటి నుంచీ బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. మోదీ ఈసారి మోడీ తన అద్భుత వాగ్ధాటితో చేస్తున్న వాగ్దానాలను కూడా ప్రజలు నమ్మేపరిస్థితి లేదంటున్నారు.  నల్లధనం వెలికి తీస్తా నని, అలా విదేశాలలో మగ్గుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకువచ్చి పేదల ఖాతాలలో వేస్తామని మోడీ చెప్పిన మాటల డొల్లతనాన్ని జనం అర్ధం చేసుకున్నారని, ఈ సారి అటువంటి వాగ్దానాలను జనం విశ్వసించే పరిస్థితి లేదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రైతుల ఆదాయం రెట్టింపు అని గత ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన మోడీ.. రెండో సారి అధకారంలోకి వచ్చిన తరువాత ఆదాయం రెట్టింపు మాట అటుంచి రైతుల కష్టాలను రెట్టింపు చేశారన్న ఆగ్రహం వ్యవసాయ దారులలో తీవ్రంగా ఉందంటున్నారు. అలాగే పెద్ద నోట్ల రద్దు విషయంలో ఆయన అనాలోచిత నిర్ణయం,  సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన వాగ్దానాన్ని విస్మరించడం, కరోనా సమయంలో వలస కూలీల ఆకలి కేకలు,  వంటి మోదీ ప్రభుత్వ వైఫల్యాలు ఈ ఎన్నికలలో ప్రభావం చూపనున్నాయని అంటున్నారు.   ఇక చివరి క్షణంలో  హిందూత్వ అంశాన్ని మోదీ తన ఆఖరి ఆయుధంగా ప్రయోగించి లబ్ధి పొందాలని చూస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకా శాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ నిషేధం

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతూ.. నల్లమల అభయారణ్యంలో కొండగుట్టల మధ్య శ్రీశైల భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి ఆలయం వెలసి ఉంది. ఈ ఆలయానికి నిరంతరం భక్తులు స్వామి వారి దర్శనానికి అధికంగా వస్తుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాక, ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇలా వచ్చే భక్తులు ఇప్పటి నుండి ఈ నిబంధన పాటించి సహకరించాలని ఆలయ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ ఆలయానికి ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు తీసుకువచ్చారో.. ఇక జరిమానాలు తప్పవు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ నిబంధన పాటించక పోతే చర్యలు తీసుకోనున్నారు ఆలయ అధికారులు. అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సైతం అధికారులు సిద్దం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైల క్షేత్రం పరిధిలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వచ్చింది. నిన్నటి నుంచి అంటే మే ఒకటో తేదీ నుంచి అధికారులు ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని బ్యాన్ చేశారు.  పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్లాస్టిక్‌ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. దేవస్థానం బోర్డు ఆదేశంతో పారిశుద్ధ్య సిబ్బంది రంగంలోకి దిగారు. చెక్‌పోస్టు పరిసరాల్లో పడి ఉన్న ప్లాస్టిక్‌ బాటిళ్లు, కవర్లతోపాటు చెత్తను తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రపరుస్తున్నారు.  అలాగే దైవ దర్శనానికి వచ్చే భక్తుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్లాస్టిక్‌ బాటిళ్లను ఎవరూ క్షేత్ర పరిధిలోకి తీసుకురాకుండా కట్టుదిట్టంగా ప్లాక్టిక్ బ్యాన్ ను అమలు చేస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ఆలయ అధికారులు, అటవీ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే స్థానిక వ్యాపారులు, హోటల్‌ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, అటవీ జంతువుల సంరక్షణ కోసం ప్లాస్టిక్‌ మంచినీటి సీసాలకు బదులుగా గాజు సీసాలనే విక్రయించాలని స్పష్టం చేశారు. అలాగే మట్టి, స్టీల్‌, రాగితో తయారైన బాటిళ్లను కూడా విక్రయించవచ్చని సూచించారు. అలాగే ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా కాగితపు కవర్లు, గుడ్డ సంచులు, జూట్‌ బ్యాగులు ఉపయోగించాలన్నారు. ప్లాస్టిక్‌ నిషేధంపై దేవస్థానానికి సహకరించాలని స్థానికులు, వ్యాపారులు, హోటళ్లు, సత్రాల నిర్వాహకులను కోరారు.

బీఆర్‌ఎస్‌కి గుండుసున్నా ఇచ్చిన రవిప్రకాష్ సర్వే

ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక్క ఎంపీ స్థానం.. అది కూడా మెదక్ ఎంపీ స్థానం దక్కుతుందన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో వున్నాయి. అయితే బిఆర్ఎస్ వర్గాల్లో ఆ ఒక్క స్థానం ఆశలను కూడా జర్నలిస్టు రవిప్రకాష్ తుస్సుమనిపించారు. బుధవారం నాడు ఆయన తన సొంత మీడియా ఛానల్లో తెలంగాణలో ఏయే పార్టీకి ఎన్నెన్ని స్థానాలు వస్తాయన్న అంశాలతో కూడిన కథనాన్ని ప్రసారం చేశారు. ఇందులో ఆయన తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు, భారతీయ జనతాపార్టీకి 8 స్థానాలు దక్కుతాయని, ఎం.ఐ.ఎం. హైదరాబాద్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందని తేల్చారు. బిఆర్ఎస్‌కి ఒక్క స్థానం కూడా దక్కదని బాంబు పేల్చారు. ఇలాంటి దయనీయ పరిస్థితిలో ఏ పార్టీ వున్నా ఎవరైనా సరే  ‘అయ్యోపాపం’ అంటారు. బిఆర్ఎస్ విషయంలో మాత్రం ఎవరూ ఆ మాట అనడం లేదు.. అంత పాతాళానికి పడిపోయింది బిఆర్ఎస్ పార్టీ.