సోనియా, రాహుల్‌కు హైకోర్టు నోటీసులు

 

నేషనల్ హెరాల్డ్ కేసులో  కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసుకు అనుమతి ఇవ్వాలంటూ ఈడీ దాఖలు చేసుకున్న అప్పీల్‌ఫై సమాధానం ఇవ్వాలని సోనియా, రాహుల్ గాంధీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణన జనవరికి వాయిదా వేసింది. కాగా నేషనల్ హెరాల్డ్  మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఇతరులపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. 

ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా కేసులో వేసిన ఛార్జ్‌షీటు కూడా చట్టపరంగా నిలవదని డిసెంబర్ 16న న్యాయమూర్తి ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈడీ అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 

అనంతపురం, ఏలూరు కోర్టులకు బాంబు బెదిరింపులు

  అనంతపురం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. రికార్డ్ అసిస్టెంట్, ఫస్ట్ క్లాస్ జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్‌లకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడకు చేరుకుని డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో కలిసి జిల్లా కోర్టు పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కోర్టు భవనం అంతా పోలీసులు గాలింపు చర్యలు నిర్వహించారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టులో ఉన్న ప్రజలందరినీ బయటికి పంపి మరీ తనిఖీలను కొనసాగించారు.  బాంబు బెదిరింపు మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ మెయిల్ ఎవరు పంపారు?.. ఎక్కడి నుంచి వచ్చింది? అనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ ఘటనతో అనంతపురం జిల్లా కోర్టు పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల తనిఖీలు పూర్తయ్యే వరకు కోర్టు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. బాంబు బెదిరింపునకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అటు ఏలూరు కోర్టు కాంప్లెక్స్‌కు కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. మధ్యాహ్నం 1:35 గంటలకు మెయిల్ రావడంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు కోర్టు కాంప్లెక్స్‌కు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అలాగే బాంబు స్క్వాడ్‌కు సమాచారం అందించారు. కోర్టులో ఉన్న న్యాయాధికారులు, సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులు అందరినీ పోలీసులు బయటకు పంపించేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు

  ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ నేతలపై దృష్టి సారించిన సిట్, కీలక నేతలకు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టింది. ఇప్పటికే పలువురు నేతలను ప్రశ్నించిన సిట్, తాజాగా బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను విచారణ కు పిలిచింది. నోటిసీలకు స్పందించిన జైపాల్ యాదవ్ సిట్ ఎదుట హాజరై వివరాలు వెల్లడించారు.గత ఏడాది నవంబర్ 17న కూడా జైపాల్ యాదవ్ సిట్ విచారణకు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.  అప్పట్లో ఇచ్చిన వాంగ్మూలంతో పాటు తాజా విచారణలో వెల్లడైన అంశాలను సిట్ సమగ్రంగా పరిశీలిస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ తిరుప తన్నతో జైపాల్ యాదవ్‌కు ఎన్నికల సమయంలో ఫోన్ సంభాషణలు జరిగినట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం. ఆ కాల్స్  ఉద్దేశం, పరిస్థితులపై సిట్ లోతుగా విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఒక కేసుకు సంబంధించి భార్యాభర్తల మధ్య నెలకొన్న సమస్యపై తిరుపతన్నతో జైపాల్ యాదవ్ మాట్లాడి నట్లు సిట్‌కు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంభాషణలు వ్యక్తిగత అంశాలకే పరిమితమా? లేక అధికార దుర్వినియోగం జరిగిందా? అనే కోణంలో సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు.  ముఖ్యంగా ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ కాల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించి, కాల్ డేటా రికార్డులు, టైమింగ్, కాల్ వ్యవధి వంటి అంశాలను విశ్లేషిస్తున్నారు. ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగం పాత్రపై ఇప్పటికే తీవ్ర చర్చ జరుగు తున్న నేపథ్యంలో, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో సిట్ అధికా రులు జైపాల్ యాదవ్ నుంచి విస్తృతంగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.  కేసుకు సంబంధించిన అన్ని కోణాలను స్పష్టంగా తెలుసుకునే దిశగా విచారణ కొనసాగుతోంది.ఇదే సమయంలో బీఆర్‌ఎస్ మరో మాజీ ఎమ్మెల్యే చిరు మర్తి లింగయ్య కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన నుంచి కూడా కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇంకా పలువురు నేతలు, అధికారులు విచారణ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. దర్యాప్తు పూర్తయ్యాక మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు.

అర్ధరాత్రి మాజీ ఐపీఎస్ ఇంటి ముందు యువకుడు హల్‌చల్

  హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి వి.కే.సింగ్ నివాసం ముందు ఓ యువకుడు నానా రచ్చ రచ్చ చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. జూబ్లీహిల్స్‌లోని మాజీ ఐపీఎస్ వి.కే.సింగ్ ఇంటి ముందు రోడ్డు నిర్మాణ పనుల నేపథ్యంలో అధికారులు భారీ కేట్లను ఏర్పాటు చేసి రహదారిని తాత్కాలికంగా మూసి వేశారు. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి సమయంలో తర్బీజ్ అనే యువకుడు అక్కడికి చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోడ్డు బ్లాక్ కావడంతో ఆగ్రహా నికి గురైన యువకుడు తర్బీజ్, మాజీ ఐపీఎస్ వి.కే.సింగ్ ఇంటి గేటును కొడుతూ నోటికి వచ్చినట్లు దుర్భాషలాడాడు. అంతేకాకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ అక్కడ తీవ్ర గందరగోళం సృష్టించాడు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వికేసింగ్ గేటు ముందు హల్చల్ సృష్టిస్తున్న యువకుడిని భద్రతా సిబ్బంది గమనించారు. యువకుడు లోపలికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భద్రత సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు.  ఈ సమయంలో తర్బీజ్ మరింత దూకుడుగా ప్రవర్తిస్తూ భద్రతా సిబ్బంది వద్ద ఉన్న వెపన్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే యువకుడిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ క్రమంలోనే యువకుడు తర్బీజ్, “500 మందితో నీ ఇంటిపైకి వస్తా” అంటూ మాజీ ఐపీఎస్ వి.కే.సింగ్‌ను బెదిరించాడు.  అర్ధరాత్రి సమయంలో హడావుడి సృష్టించిన యువకుడు అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై మాజీ ఐపీఎస్ వి.కే.సింగ్ పర్సనల్ సెక్రటరీ జస్వంత్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారం భించారు. యువకుడి ప్రవర్తన, నేపథ్యం, గతంలో ఏవైనా వివాదాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.  

ఆస్తులు పెరుగుదల అంటే వైసీపీ ఎంపీలదే!

  టీడీపీ ఎంపీల పనితీరు శాతంలో ఎంత పెరుగుదల ఉందో తెలీదు. కానీ, వారి వారి ఆస్తుల్లో మాత్రం భారీ పెరుగుదల ఉన్నట్టు కనిపించింది. వీరిలో టాప్ ఎవరు? బాటమ్ లో ఎవరున్నారని చూస్తే.. వైసీపీ నేత, రాజంపేట సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి 2014 నుంచి 2024 మధ్య కాలం వరకూ తన ఆస్తులకు సంబంధించిన లెక్కలు ఎన్నికల సంఘానికి సమర్పించారు. వాటి ప్రకారం చూస్తే 2014లో ఆయన పోటీ చేసినపుడు ఆస్తుల విలువ రూ. 22. 59 కోట్లు కాగా.. 2024 ఎన్నికల నాటికి వాటి విలువ అమాంతం పెరిగిపోయింది. రూ. 146. 85 కోట్లకు చేరుకుంది. అంటే ఈ పదేళ్ల కాలంలో మిథున్ రెడ్డి ఆస్తి రూ. 124. 25 కోట్ల వరకూ పెరిగింది. ఎంపీల ఆస్తుల పెరుగుదల జాబితాలో మిథున్ దేశంలోనే థార్డ్ ప్లేస్ లో నిలిచారు. 2014 నుంచి 19 వరకూ మిథున్ ఆస్తుల విలువ రూ. 44 కోట్లు పెరగగా.. వైసీపీ అధికారంలో ఉన్న టైంలో రూ. 80 కోట్లకు పైగా పెరిగింది. ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. రూ. 47. 54 కోట్ల చరాస్తులు రూ. 99. 30 కోట్లు స్థిరాస్తులున్నాయి. అదే సమయంలో 56. 09 కోట్ల వరకూ అప్పులు కూడా ఉన్నట్టు అఫిడవిట్ లో సమర్పించారు. మొత్తానికి ఈ పదేళ్లలో మిథున్ రెడ్డి ఆస్తులు సుమారు 550 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. 2014 నుంచి 2024 వరకూ లోక్ సభ ఎన్నికల మధ్య తిరిగి ఎంపికైన ఎంపీల ఆస్తుల వివరాల విశ్లేషణ చేసింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. దీని ప్రకారం చూస్తే.. అత్యధికంగా ఆస్తులు పెరిగిన సిట్టింగ్ ఎంపీల్లో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ఒకరు. అవినాష్ ఆస్తులు 2014లో రూ. 7 కోట్ల మేర ఉండేవి. అదే 2019 నాటికి రూ. 18 కోట్లకు పెరిగాయి. ఇక 2024 నాటికి ఈ ఆస్తుల విలువ రూ. 40 కోట్లకు చేరాయి. ఆస్తుల వృద్ధి పరంగా చూస్తే ఈయన 15వ స్థానంలో ఉన్నారు. ఇక అవినాష్‌రెడ్డి ఆస్తుల పెరుగుదల శాతం 474గా ఉంది. ఇదిలా ఉంటే.. దేశంలోనే ఎంపీల ఆస్తుల శాతంలో టాప్ లో జార్ఖండ్ ముక్తి మోర్చా 804 శాతంతో టాప్ లో ఉండగా.. 532 శాతంతో రెండో స్థానంలో ఉన్న పార్టీ వైసీపీ.  ఎంఐఎం పార్టీ తరఫున గత మూడు ఎన్నికల్లో గెలిచిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆస్తులు ఈ పదేళ్లలో 488 శాతం పెరిగింది. ఎంపీల ఆస్తుల పెరుగుదల ప్రకారం- 24వ స్థానంలో నిలిచారు అసద్. టీడీపీ తరఫున గత మూడు ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి ఆస్తుల పెరుగుదల ఎలా ఉందో చూస్తే- 177 శాతం మేర పెరిగాయి. ఆస్తుల పెరుగుదల జాబితాలో రామ్మోహన్ 28వ స్థానంలో ఉన్నారు. గత మూడు ఎన్నికల్లో వరుసగా గెలిచిన 102 మంది ఎంపీల ఆస్తుల విలువ పదేళ్లలో సగటున 110 శాతం పెరగ్గా, కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆస్తి మాత్రం తగ్గిపోయింది. గుజరాత్ లోని నవ్ సారీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడో సారి దేశంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తూ వచ్చిన ఆయన ఆస్తి 2014లో 74. 47 కోట్లుండగా 2019 నాటికది రూ. 44. 06 కోట్లకు, 2024 నాటికి రూ. 39. 49 కోట్లకు పడిపోయింది. పదేళ్లలో ఆయన ఆస్తి 47 శాతం మేర తగ్గినట్టు గుర్తించారు. ADR రిపోర్ట్ ప్రకారం గత మూడు ఎన్నికల్లో బీజేపీ నుంచి వరుసగా గెలిచిన 65 మంది ఎంపీల ఆస్తులు సగటున 108 శాతం పెరగ్గా.. కాంగ్రెస్ కి చెందిన 8 మంది ఎంపీల ఆస్తులు 135 శాతం వృద్ధి చెందాయి. రాహుల్ ఆస్తుల విషయం చూస్తే.. రూ. 10. 99 కోట్ల పెరుగుదల నమోదైంది. 2014లో రూ. 9. 40 కోట్ల మేర ఉన్న ఆస్తులు 2019 నాటికి రూ. 15. 88 కోట్లు పెరిగాయి. ఇవే ఆస్తులు 2024 నాటికి రూ. 20. 39 కోట్లకు చేరాయి. ఈ మొత్తం శాతంలో చూస్తే 117 పర్సెంట్ హైక్ కనిపించింది. ఆస్తులు పెరిగిన ఎంపీల లిస్టులో రాహుల్ 38వ స్థానంలో నిలిచారు. ఇక ప్రధాని మోడీ ఆస్తులు 82 శాతం మేర పెరిగినట్టు కనిపించింది. 2019లో రూ. 1. 65 కోట్లున్న మోడీ ఆస్తుల విలువ 2019నాటికది రూ. 2. 15 కోట్లకు, 2024నాటికది రూ. 3. 02 కోట్లకు పెరిగాయి. ఆస్తులు పెరిగిన ఎంపీల్లో మోడీ 94 వ స్థానంలో నిలిచారు. అత్యధిక ఆస్తుల విలువ పెరిగిన టాప్ టెన్ ఎంపీల్లో ఐదుగురు బీజేపీ వారే ఉండటం గమనార్హం.  

భరతమాత కాళ్ల వద్దకు తీసుకొచ్చి పడేస్తా… యూట్యూబర్ అన్వేష్ పై ఉక్రెయిన్ మహిళ ఆగ్రహం

భారత సంప్రదాయాలు, సనాతన ధర్మంపై ఇటీవల సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారు తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల యూట్యూబర్ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విదాదాస్పదమయ్యాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఓ మహిళ మండి పడ్డారు.  తనకు అనుమతిస్తే యూట్యూబర్ అన్వేష్ ను  భరతమాత కాళ్ల దగ్గరకు తీసుకొచ్చి పడేస్తానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి.  ఉక్రెయిన్ మహిళ భారత సంప్రదాయాలు, సనాతన ధర్మానికి మద్దతుగా నిలబడటం విశేషం.  ఉక్రెయిన్‌లో జన్మించి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తుమ్మపాల వెంకట్‌ను వివాహమాడిన లిడియా లక్ష్మి   ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మాన్ని లోతుగా అధ్యయనం చేశారు.   హిందూ ధర్మం, ఆచారాలు, కుటుంబ వ్యవస్థ తనను ఎంతో ప్రభావితం చేశాయని ఆమె పలు సందర్భాల్లో వెల్లడించారు.భారతీయ సంస్కృతి పట్ల తనకున్న గౌరవాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తూ, సనాతన ధర్మంపై అన్వేష్ చేస్తున్న వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. అవగాహన లేకుండా, కేవలం వ్యూస్ కోసం చేసే వ్యాఖ్యలు భారతదేశ సంస్కృతిని కించపరు స్తున్నాయంటూ  అంటూ లిడియా లక్ష్మి యూట్యూబర్ అన్వేష్ పై మండిపడ్డారు. యూట్యూబ్ వేదికగా భారతీయ సంప్రదాయాలు, సనాతన ధర్మంపై అన్వేష్ చేసిన వ్యాఖ్యల పట్ల  దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లిడియా లక్ష్మి.. “ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని వదిలిపెట్టకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్రస్తుతం థాయిలాండ్ ఎంబసీలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న లిడియా లక్ష్మి, అన్వేష్ మరో దేశానికి పారిపోయే అవకాశం ఉందనీ, అతడిపై సరైన సమయంలో చర్యలు తీసుకోవాలన్నారు.  లిడియా లక్ష్మి  యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విడుదల చేసిన చేసిన వీడియో   సోషల్ మీడియాలో వైరల్  అయ్యింది. నెటిజనులు ఆమెకు పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్నారు.  విదేశీ మహిళ అయినప్పటికీ భారతీయ సంస్కృతి పట్ల ఆమె చూపుతున్న నిబద్ధతకు ఫిదా అవుతున్నారు. సనాతన ధర్మాన్ని అవమానించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ  డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణపై పెద్ద చర్చ మొదలైంది. విదేశీయులే సనాతన ధర్మ విలువలను గౌరవిస్తుంటే, దేశంలోనే కొందరు వాటిని కించప రచడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినీనటి కరాటే కళ్యాణి నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి వైసీపీ ఏం చేసిందంటే?..

తిరుమల పవిత్రతను దెబ్బతీయడం, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించడమే లక్ష్యంగా జరిగిన కుట్రను పోలీసులు ఛేదించారు. తిరుమలలొ ఓ  గెస్ట్ హౌస్ వద్ద ఖాళీ మద్యం సీసాల కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు వారిని బుధవారం (జనవరి 7) మీడియా ముందు ప్రవేశ పెట్టారు.   ఈ నెల 4న సామాజిక మాధ్యమంలో తిరుమలలో పోలీసు గెస్ట్ హౌస్ సమీపంలో ఖాళీ మద్యం సీసాలు అంటూ, ఫొటోలతో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా ఖాళీ మద్యం సీసాలను  వైసీపీ నేతలు,  ఆ పార్టీకి చెందిన   మీడియా వ్యక్తులు  కుట్రపూరితంగా తిరుపతి నుంచి తీసుకువచ్చి కౌస్తుభం గెస్ట్ హౌస్ పక్కన పొదల్లో పడేశారని తేల్చారు.   వైసీపీ   మీడియా ప్రతినిధులతో పాటు తిరుపతిలోని వైసీపీ నేతలే ఈ కుట్రను అమలు చేసినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు   కమాండ్ కంట్రోల్ తో పాటు, వివిధ ప్రదేశాలలో సిసి కెమెరాలు పరిశీలించారు. అలాగే    ఎక్సైజ్ డిపార్టుమెంటు  సహకారంతో ఖాళీ సీసాల పైన వున్న ఆధారాల ద్వారా,  వాటిని కొనుగోలు చేసిన దుకాణాలను గుర్తించారు.  తిరుమల పవిత్రతను దెబ్బతీసి.. తద్వారా టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీయడానికే  వైసీపీ నేతలు ఈ పని చేశారని నిర్ధారించారు.  సీసీ కెమెరాలు, ఫాస్టాగ్ నివేదిక, నిందితుల వాహనాల రాక పోకలు, ఫోన్ సిగ్నల్స్‌ సహా ఇతర సాంకేతిక ఆధారాలతో ఈ కుట్రను ఛేదించినట్లు తిరుపతి పోలీసులు మీడియాకు వివరించారు.  ఈ కేసుకు సంబంధించి    వైసీపీ కార్యకర్త కోటి, ఆ పార్టీ అధికారిక మీడియా ప్రతినిధి మోహన్ కృష్ణ ను అరెస్టు చేసినట్లు తెలిపిన పోలీసులు, వైసీపీ సోషల్ మీడియా   కార్యకర్త నవీన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడనీ, అతడి కోసం గాలిస్తున్నామనీ తెలిపారు. ఇలా ఉండగా అరెస్టు చేసిన ఇద్దరినీ,  కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు వారికి పదివేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిలు మంజూరు చేసింది. 

స్టీల్ ప్లాంట్ భూములపై లోకేష్ క్లారిటీ

  విశాఖపట్నం స్టీల్ ప్టాంట్ ప్రైవేటీకరణ జరగదని  మంత్రి నారా లోకేశ్ పునరుద్ఘాటించారు. ఈ స్టీల్ ప్లాంట్ భూములు విషయంలో ఎవరైనా స్టేట్‌మెంట్ ఇచ్చారా? అని విలేకర్లను ఆయన సూటిగా ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ భూములను వాటి అవసరాలకు తప్ప, మరే ఇతర అవసరాలకు వినియోగించ లేదని.. వినియోగించబోమని ఆయన స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్టాంట్ లాభాల బాటలో నడవాలని.. అందుకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా లోకేశ్ పిలుపునిచ్చారు.  బుధవారం విశాఖపట్నంలో మంత్రి విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ కోసం ఎవరూ పోరాటాలు చేయడం లేదని లోకేశ్ పేర్కొన్నారు. ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ పోర్టు ఎందుకని గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో జీఎంఆర్‌కు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ ఆ భూములను జీఎంఆర్‌కు కేటాయించామని వివరించారు.  భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్ కావాలంటే తీసుకోవచ్చంటూ వైసీపీ వాళ్లకు లోకేశ్ సూచించారు. చిత్తూరు జిల్లా నుంచి అమర్ రాజా బ్యాటరీస్ వెళ్లగొట్టిడం, పీపీలు రద్దు, పలు కంపెనీలను రాష్ట్రం నుంచి పంపేయడం, ఆఫీస్ అద్దాలు పగలగొట్టడం వంటి సంఘటనల క్రెడిట్ అంతా వైసీపీకే దక్కుతుందని లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకటి రెండు నెలల్లో విశాఖపట్నం వేదికగా గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభమవుతాయని లోకేశ్ చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టు కనెక్టింగ్ రోడ్లపై దృష్టి సారించామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క 108 వాహనం ఆగలేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చాలా 108 వాహనాలు ఆగిపోయాయని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు

ఆహార కల్తీకి పాల్పడితే కేసులే : సీపీ సజ్జనార్

  హైదరాబాద్‌లో జరుగుతున్న ఆహార కల్తీపై కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా కల్తీ ఆహారాన్ని తయారుచేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కల్తీ నిరోధానికి పోలీస్‌ శాఖ, ఫుడ్‌ సేఫ్టీ అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కఠినంగా ఎస్‌వోపీ అమలు చేస్తామని తెలిపారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘించి కల్తీకి పాల్పడే వ్యాపారులపై లైసెన్సులు రద్దు చేయడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య రక్షణే తమ ప్రధాన లక్ష్యమని సీపీ స్పష్టం చేశారు.  

దిల్‍సుఖ్‍నగర్‌లో నిరుద్యోగుల ఆందోళన

  జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు దిల్‍సుఖ్‍నగర్‌లో రోడ్డెక్కారు. ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ ప్రకటించి, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి రోడ్డు మీద బైఠాయించారు. భారీ సంఖ్యలో నిరుద్యోగులు  రోడ్లపైకి రావడంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది.  ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తమకు ప్రభుత్వం వెంటనే స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని వారు నినాదాలతో హోరెత్తించారు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు, వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఆందోళనకారులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల ముందస్తు మోహరింపు, అరెస్టుల పర్వంతో దిల్‍సుఖ్‍నగర్ ప్రాంతం మొత్తం కాసేపు హైడ్రామా నడిచింది.