ముందే విషం చిమ్మిన కేసీఆర్

      రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాకముందే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మరోసారి విషం చిమ్మారు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య లేనిపోని విభేదాలను రేకెత్తించేలా వ్యాఖ్యలు చేశారు. రేపు రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత ఒకవేళ తాము అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉండబోతోందో కళ్లకు కట్టినట్లు చూపించారు. తమ ప్రాజెక్టులు నిండితేనే సీమాంధ్ర ప్రాజెక్టులకు నీళ్లిస్తామని కుండ బద్దలుకొట్టేశారు. ఆంధ్రా ఉద్యోగులకు ఆప్షన్లు లేవని, వాళ్లు తమతమ ప్రాంతాలకు వెళ్లి తీరాల్సిందేనని హుకుం జారీ చేశారు. ‘‘మా తెలంగాణ ప్రాజెక్టులు నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, భీమా, జూరాల-పాకాల, పాలమూరు ఎత్తిపోతల పథకం.. ఇవన్నీ నిండిన తరువాత నీళ్లు మిగిలితే..అక్కడి అక్రమ ప్రాజెక్టులకు నీళ్లు ఇస్తామే గానీ.. లేకపోతే నీళ్లు తీసుకుపోనీయం. పోలవరం కోసం సీమాంధ్రలో కలపాలని చెప్పి ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించిన ఏడు మండలాలు తెలంగాణలోనే ఉండాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తా ఉంది. మేం ప్రాజెక్టు యథాతథంగా కడతామంటే దానిని వ్యతిరేకిస్తాం. డిజైను మార్చాలని డిమాండ్ చేస్తున్నం. ఏడు మండలాలు ఖచ్చితంగా తెలంగాణలోనే ఉండాలే. సుప్రీంకోర్టుకు పోయి అయినా, ఉద్యమం చేసైనా సరే,  చివరిదాకా పోరాడతం. అక్కడ ఉన్న గిరిజనులను కాపాడతం. డిజైను మార్చకుండా ఆ ప్రాజెక్టును కట్టనీయం.తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ గవర్నమెంట్‌లో పనిచేయాలి. ఆంధ్ర ఉద్యోగులు వాళ్ల గవర్నమెంట్‌లో పనిచేయాలి.వేరే ఆప్షన్లు ఉండయి. చంద్రబాబూ.. ఇక్కడ కూడా నా గవర్నమెంట్ వస్తదంటున్నవు. నీ బొంద.. నీ గవర్నమెంట్ కాదు కదా, నెత్తి కొట్టుకున్నా ఈడ డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. కానీ ధాంధీం అని మాట్లాడి, ఒక అబద్ధం నూరుసార్లు చెప్పి, ఏదో చేయాలని ప్రయత్నంలో ఉన్నడు. చంద్రబాబు మనకు కొట్టిన గుండు చాలదా? ఇంకా మనం బుద్ధి లేకుండా ఉన్నామా? మన తలరాత మనమే రాసుకోవాలి. చంద్రబాబు ఓయ్ ఆరు చందమామలు, ఏడు సూర్యుళ్లు అని చెప్తుండు. జపాన్  పోయి వచ్చి జపాన్ చేస్తాన న్నాడు. చైనా పోయి వచ్చి చైనా చేస్తానన్నాడు. సింగ పూర్ పొయి వచ్చి సింగపూర్ చేస్తానన్నాడు. చివరకు ఆయనకు పిచ్చి లేచిపోయి స్క్రూ లూజ్ అయిపోయి మాట్లాడుతుండు. జపాన్, సింగ పూర్ కాలేదు కానీ, చంద్రబాబు మెంటల్ మాత్రం ఖరాబ్ అయింది. అన్నీ పిచ్చి కూతలు కూస్తున్నడు’’ అంటూ తనదైన శైలిలో, తనదైన స్థాయిలో కేసీఆర్ మాట్లాడారు.

తిలాపాపం తలా పిడికెడు.. సీమాంద్రాలో మాత్రమే

      కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన వ్యవహారం తలకెత్తుకొనప్పుడు మొదట తన అభిప్రాయం, వైఖరి చెప్పకుండా రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల నుండి లేఖలు తీసుకొంది. ఇప్పుడు వాటిని అడ్డంపెట్టుకొని తన రాజకీయ ప్రత్యర్ధులను బ్లాక్ మెయిల్ చేస్తోంది. అంతే గాక, అన్ని పార్టీలు విభజనకు అంగీకరించిన తరువాతనే తమ పార్టీ విభజనకు పూనుకొందని అందువల్ల ఎవరూ తమ పార్టీని తప్పు పట్టలేరని, ఒకవేళ తప్పు పట్టదలిస్తే లేఖలు ఇచ్చిన అన్ని పార్టీలను కూడా తప్పు పట్టాలని, ఈ వ్యవహారంలో తిలా పాపం తలా పిడికెడు అని వితండవాదం చేస్తోంది. కానీ, తెలంగాణా ప్రాంతంలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్దంగా వాదన చేస్తోంది. తెలంగాణా ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకొన్న సోనియా గాంధీ వారికిచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణా ఏర్పాటు చేసారని టీ-కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున చేస్తున్న ప్రచారం గురించి అందరికీ తెలుసు. సీమాంద్రాలో ఈ పాపంలో అందరికీ భాగం ఉందని వాదిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో మాత్రం ఆ పాపంలో (?)ఎవరికీ వాటా పంచి ఇచ్చేందుకు సిద్డంగా లేదు. తమది జాతీయ దృక్పధం ఉన్న గొప్ప పార్టీలని గర్వంగా చెప్పుకొనే కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా ఇదే రకమయిన ద్వంద విధానం అవలంభిస్తూ రెండు ప్రాంతాల ప్రజలను మభ్యపెడుతున్నాయి.   రెండు ప్రాంతాలలో తమ రాజకీయ ప్రత్యర్ధులను బట్టి వేర్వేరు వ్యూహాలు అమలుచేస్తూ, ప్రజల భావోద్వేగాలను అనుకూలంగా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నాయి. అందువల్ల ఉభయ ప్రాంతాల ప్రజలు కూడా వారి మాటల గారడీకి లొంగిపోకుండా, విజ్ఞతతో వ్యవహరించి తమ తమ ప్రాంతాలకు మేలు చేకూర్చగల ప్రతినిధులను, పార్టీలను మాత్రమే ఎన్నుకోవలసి ఉంది.   

శ్రీవారి కొండలపై ఆరని కార్చిచ్చు

      తిరుమల శేషాచలం అడవి మంటల్లో చిక్కుకుని బుగ్గి అవుతోంది. ప్రధాన ఆలయానికి కిలోమీటరు దూరంలోని ఉత్తర, ఈశాన్య దిశలో కాకుల కొండ వద్ద 40 అడుగుల ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. వివిధ శాఖలకు చెందిన 500 మంది సిబ్బంది, 15 ఫైరింజన్లు రంగంలోకి దిగినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, రక్షణ దళాల సహకారాన్ని కోరింది. గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీటీడీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. అనంతరం రక్షణ దళాలను రంగంలోకి దించే ఏర్పాట్లు చేశారు.   నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు చెందిన రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లను, నాలుగు హెలికాప్టర్లను, వంద మంది సిబ్బందిని తిరుపతికి తరలిస్తున్నారు. మంటల్లో చిక్కుకుని 10 కిలోమీటర్ల విస్తీర్ణంలోని సుమారు 2 వేల హెక్టార్ల అడవి బూడిద యింది. టీటీడీ పవన విద్యుత్ ప్లాంట్ దెబ్బతింది. నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. ఎన్ని ఫైరింజన్లు వచ్చినా మంటలు ఏమాత్రం అదుపులోకి రాకపోవడంతో ఇక హెలికాప్టర్లను రంగంలోకి దించక తప్పడంలేదు. నీరు, నురగతో కూడిన రసాయనాలను గగనతలం నుంచి చల్లి మంటలను ఆర్పేందుకు నేవీ, ఎయిర్‌ఫోర్సుకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఎంఐ-17 హెలికాప్టర్లు తిరుమలకు రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే బుధవారం ఓ హెలికాప్టర్ శేషాచలంపై చక్కర్లు కొట్టి అగ్నిప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో సర్వే చేసి వెళ్లింది. భక్తుల భద్రత కోసం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పాపవినాశనం, ఆకాశగంగ, జాపాలీతీర్థం, వేణుగోపాల స్వామి ఆలయాలకు  వెళ్లే మార్గాలను, అక్కడి దుకాణాలను మూసివేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అలిపిరి నుంచి తిరుమలకు వచ్చే కాలిబాటను కూడా మూసివేశారు.

కొత్త నేతలతో టికెట్ల గోల

      తమ పార్టీలోకి భారీగా వలసలు ఉంటున్నాయని నేతలు సంబరపడుతున్నా, అదే చివరకు ముప్పు తెచ్చిపెట్టేలా ఉంది. కొత్తగా వస్తున్న నాయకులు అప్పటికే రాజకీయాల్లో పండిపోయి ఉండటం, ఇప్పుడు ఏదో ఒకటో లేదా రెండు మూడు స్థానాల విషయంలో హామీలు తీసుకున్న తర్వాత మాత్రమే టీడీపీలోకి రావడం ఇందుకు అసలు కారణం. ఫలానా లోక్ సభ స్థానం, ఇన్ని అసెంబ్లీ నియోజకవర్గాల టికెట్లు ఇవ్వాలనే షరతుకు పార్టీ అంగీకరించిన తర్వాత మాత్రమే వాళ్లు వస్తున్నారు. కానీ, ఇది ఆయా పార్టీలలో అంతర్గత తగాదాలకు కారణం అవుతోంది.   కొండా సురేఖ, మురళి దంపతులకు టీఆర్ఎస్ టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం వరంగల్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. ఖిలా వరంగల్‌లో ఓ వ్యక్తి వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుని అతనిని ఆస్పత్రికి తరలించారు. ఇక రాయపాటి వచ్చినా, ఇంకెవరు వచ్చినా నర్సరావుపేట ఎంపీ టికెట్ మాత్రం తనదేనని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ తేల్చిచెప్పారు. సిట్టింగ్ ఎంపీనైన తనను కాదని కొత్తవారికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నర్సరావుపేట బరిలో దిగి తాడోపేడో తేల్చుకుంటానని వెల్లడించారు. ఇలా అన్ని పార్టీల్లోనూ కొత్త చేరికలతో తలనొప్పులు ఇప్పుడిప్పుడే మొదలువుతున్నాయి. ఇవి ఇంకెంత ముదురుతాయో, ఏ స్థాయికి వెళ్తాయో చూడాల్సిందే.

కమలం - సైకిల్ సీట్ల బేరాలు

      తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి మధ్య పొత్తు విషయం దాదాపుగా ఓ కొలిక్కి వచ్చేయడంతో ఇక సీట్ల సర్దుబాటు గురించిన బేరసారాలు మొదలయ్యాయి. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కూడా ఈ కూటమిలోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నా, ఆయన మాత్రం తనకు సీట్లు అక్కర్లేదని, తాను చెప్పిన విధానాలను మేనిఫెస్టోలో పెట్టి, అమలుచేస్తే చాలని అంటున్నట్లు సమాచారం. ఇక బీజేపీ మాత్రం తనకు రెండు రాష్ట్రాల్లో కలిపి 16 ఎంపీ సీట్లు, 75 అసెంబ్లీ స్థానాలు అడుగుతోందట. తెలంగాణాలో 8 ఎంపీ, 50 అసెంబ్లీ సీట్లు... ఆంధ్రప్రదేశ్‌లో 8 ఎంపీ సీట్లు, 25 అసెంబ్లీ సీట్లు కోరుతున్నారు. కానీ తెలుగుదేశం నేతలు మాత్రం ఇందుకు అబ్బే అనేస్తున్నారు. 2004 ఎన్నికల్లో పొత్తు సమయంలో బీజేపీకి మొత్తంగా ఆరు ఎంపీ, 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఇప్పుడు కూడా అంతకు మించి ఇవ్వలేమని చెబుతున్నారు. టీడీపీ ఇంతగా బెట్టు చేయడానికి కూడా కారణం ఉంది. బీజేపీ వల్ల తాము పెద్దగా పొందబోయే ఎన్నికల లబ్ధి ఏమీ ఉండబోదని, రేపు కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావాలంటే వాళ్లకు ఎంపీల సంఖ్య, మద్దతు అవసరం కాబట్టి వాళ్లకే తమ అవసరం ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. బీజేపీకి సొంతంగా నెగ్గగల సామర్థ్యం ఇక్కడ లేదు కాబట్టి, తాము చెప్పినట్లుగా వింటే, రేపు కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో తమకూ ఎంతో కొంత పాత్ర ఉంటుందని వాళ్లు అనుకుంటున్నారు.

పంచాయితీ అయిపోలేదంటున్న కేసీఆర్

      తెలంగాణా రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినన్నాళ్లూ నోటికి ఏ మాత్రం అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడిన కేసీఆర్.. మళ్లీ అదే స్థాయిలో ఇప్పుడు మాటలు మొదలుపెట్టారు. విభజన ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ కొనసాగించినన్నాళ్లు తాను మాట్లాడకుండా, మిగిలిన నాయకులను కూడా అదుపులో ఉంచిన ఆయన.. ఇప్పుడు ఎటూ పని అయిపోయింద కదా అనుకుంటున్నారో, ఏమో గానీ మళ్లీ సీమాంధ్ర ప్రాంతం గురించి మాట్లాడటం మొదలుపెట్టేశారు.   ఆంధ్రాతో పంచాయితీ పూర్తిగా అయిపోలేదని, చాలా అంశాల్లో ఇంకా పోరాడి సంపూర్ణ తెలంగాణ సాధించుకోవాల్సి ఉందని తాజాగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. రిటైర్డు డీజీ ఎస్.కె.జయచంద్ర, మాజీమంత్రి కొండా సురేఖ, కొండా మురళీ తదితరులు పార్టీలో చేరిన సందర్భంగా ఆయనీ మాటలు చెప్పారు. తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని చెప్పారు. వీటిలో పంపిణీ పూర్తయ్యేదాకా ఆంధ్రాతో పంచాయతీ పూర్తయినట్టు కాదన్నారు. భద్రాచలంలోని ఏడు మండలాలు కూడా తెలంగాణలో కలపాలని ఆయన డిమాం డు చేశారు. ‘‘పందిగూడులాగా ఒకటే గదిని కట్టించి ఇచ్చి బలహీనవర్గాలకు ఇళ్లు అంటూ గొప్పలు చెప్పుకుంటున్నరు. తెలంగాణ రాష్ట్రంలో రెండు బెడ్‌రూములు, ఒక హాలు, కిచెన్, బాత్‌రూములు, మరుగుదొడ్లను ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది. పూర్తిగా ప్రభుత్వమే ఈ ఖర్చును ఉచితంగా భరిస్తుంది. కుల రహిత వ్యవస్థ ఉండాలని చెబుతున్న ప్రభుత్వమే బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను ఎందుకు పెడుతోంది? తెలంగాణ ప్రభుత్వంలో కులరహిత రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటుచేస్తం. అటెండరు నుండి ఐఏఎస్‌దాకా, రిక్షా కార్మికుని నుండి మంత్రుల పిల్లల దాకా అదే హాస్టళ్లలో ఉంటరు. స్విమ్మింగ్‌పూల్, విశాలమైన ఆట మైదానంతో పాటు భోజనం వంటి అన్ని వసతులను ప్రభుత్వమే నిర్దేశిస్తుంది.ఐదేళ్లు దాటిన పిల్లగాడు బడికి పోకుంటే అక్కడ ఉన్న పోలీసు సబ్ ఇన్‌స్పెక్టరు ఉద్యోగం పోతుంది. దీనివల్ల ఉచిత నిర్బంధ విద్య కచ్చితంగా అమలు అవుతుంది’’ అని కూడా కేసీఆర్ తనదైన శైలిలో హామీలు ఇచ్చిపారేశారు.  

What is with these politicians’ sons?

      Last Sunday we had MP Anjan Kumar Yadav’s son, Arvind Yadav beating up a constable Vamsi of the Hussainialam Police station limits. What was the poor constable’s mistake? He asked him to move his vehicle which was obstructing others and what was the young man doing? Playing Holi at midnight on the middle of the road. The poor constable was beaten balck and blue by the MP’s son and was hospitalized by his colleagues and a case under sections 332 and 506 were filed for obstructing a govt official on duty and causing injury. He was “on the run” and was finally arrested today. Following suit was former minister Ganta Srinivasa Rao’s son Ravi Teja and his friend Indrajith who were caught drunk at the RGIA and manhandled the driver of an Airport Bus conductor and created a ruckus at the Airport on Monday . Surprisingly the Central Police force who handle the security did not take the matter into their hands. Now the gentleman was caught and was sent to 14 days in judicial remand. It’s time the politicians wake up and understand that this kind of behavior will not be tolerated by the public nor the police and with the elections round the corner, may be these politician progeny should be given some grooming sessions as to how to conduct themselves in public and not ruin the reputation of their parents and their political careers. People are more aware and watching what’s happening around them and these kind of irresponsible acts will not go down well with the public.

సైకిల్ - కమలం సర్దుబాటు ఓకే?

      వచ్చే ఎన్నికల్లో బీజేపీ,టీపీడీ మధ్య సీట్ల సర్దుబాట్లపై చర్చలు మొదలయ్యాయి. రెండు రోజులుగా ఇక్కడే ఉన్న ప్రకాశ్ జవదేకర్ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. పొత్తు విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి,సీనియర్లు ఇంద్రసేనారెడ్డి, బండారు దత్తాత్రేయ తదితరులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. గతంలో పొత్తు ప్రాతిపదికలను వీరి నుంచి తెలుసుకున్న అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోటరీలోని నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను ఫోన్‌లో సంప్రదించినట్టు తెలిసింది. ఈ వివరాలను కిషన్‌రెడ్డికి చెప్పగా... పొత్తును కొందరు వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. జవదేకర్ అసహనం వ్యక్తంచేస్తూ... ముగిసిన వ్యవహారాన్ని మళ్లీ తిరగదోడవద్దని సలహా ఇచ్చినట్టు సమాచారం. దీంతో తెలంగాణలో మెజారిటీ సీట్లన్నా దక్కేటట్లు చూడమని కోరడంతో జవదేకర్ మరోసారి సీఎం రమేష్‌ను సంప్రదించారని పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణలో బీజేపీ చెప్పినట్టు టీడీపీ, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ చెప్పినట్టు బీజేపీ వినాలన్న సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు బీజేపీ తెలంగాణలో 64 అసెంబ్లీ, 9 లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌లో 6 లోక్‌సభ, 25ఎమ్మెల్యేల సీట్లు కోరుతున్నట్టు తెలిసింది. కాగా, తెలంగాణ శాఖ సమ్మతించినా లేకున్నా తాము పొత్తుకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ నేతలు జవదేకర్‌కు స్పష్టం చేశారు.  

జోరందుకున్న సైకిల్ స్పీడు

      తెలుగుదేశం పార్టీలోకి భారీ స్థాయిలో నాయకులు వలస వెళ్తున్నారు. సీమాంధ్రలో సైకిల్ స్పీడు పెరిగింది. వివిధ పార్టీల నుంచి చేరికల జోరు ఊపందుకుంది. సోమవారం ఒక్కరోజే కాంగ్రెస్, జగన్ పార్టీలకు చెందిన సుమారు 20 మందికి పైగా నేతలు పచ్చ కండువాలు కప్పించుకున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కుతూహలమ్మ, అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తిప్పేస్వామి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తదితరులు టీడీపీలో చేరారు. పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎంఆర్‌సీ రెడ్డి (తిరుపతి), చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి జి. శంకర్ యాదవ్, తిరుపతి నియోజకవర్గానికి చెందిన హరిప్రసాద్, నరసాపురం కాంగ్రెస్ నేతలు పొత్తూరు రామాంజనేయరాజు, అన్నా రామచంద్రయ్య, హరికుమార్ టీడీపీ గూటికి చేరారు. అనంతపురం జిల్లాకు చెందిన వి.రామ్మూర్తి, మాజీ ఎంపీ డి. పుల్లయ్య కుమారుడు దరూరి రమేశ్ చేరారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తేళ్ల సుబ్బారావు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. పెద్దాపురం నుంచి దావూలూరి దొరబాబు, అమలాపురం నుంచి ఎస్. నాగేశ్వరరావు, హనుమాన్ జంక్షన్‌కు చెందిన వీరమాచినేని సత్యప్రసాద్, ఎనికపాడుకు చెందిన గోగం బాలకోటేశ్వరరావు కూడా దేశంలో చేరారు. తులసీ గ్రూప్ సంస్థల అధినేత తులసీ రామచంద్ర ప్రభు టీడీపీలో చేరేందుకు నిశ్చయించుకున్నారు. సోమవారం రాత్రి ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయనను గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈయన గత ఎన్నికల్లో పీఆర్పీ తరఫున పోటీచేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, ఆయన మేనల్లుడు, కురుపాం ఎమ్మెల్యే జనార్దన థాట్రాజ్ , నోవా విద్యాసంస్థల అధినేత, కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్తం శెట్టి కృష్ణారావు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

గులాబీ కారులో సీట్ల కోసం ఫైట్

  ఎన్నికల దారిలో కనిపించిన కాంగ్రెస్ వారందరికీ లిఫ్ట్ ఇచ్చి మరీ కారు ఎక్కించుకుంటున్న కేసీ..యార్.. టికెట్ కోసం వెనుక సీట్లో జరుగుతున్న ఫైట్ చూసి డ్రైవింగ్ పై దృష్టి పెట్టలేకపోతున్నారు. తెలుగు తమ్ముళ్ళు, ఇతరుల వలసలతో బెంబేలెత్తిపోతున్న టీఆర్ఎస్ నేతల అసంతృప్తి ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి రెండు సార్లు టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన సయ్యద్ ఇబ్రహీంను కాదని టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ కు గులాబీ దళపతి టికెట్ కేటాయించారు. దీనిపై టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ కూడా అయిన ఇబ్రహీం తీవ్రమైన ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఇస్తామని కేసీయార్ ప్రకటించినా..ఇబ్రహీమ్ వర్గీయులు సంతృప్తిచెందలేదు. దీంతో ఎన్నికల సమయానికి సమీకరణాలు మారే అవకాశం ఉంది.   నల్గొండ జిల్లాలో ముఖ్యనేతగా, టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా సేవలందిస్తున్న చెరకు సుధాకర్ అసెంబ్లీ టికెట్ కోసం వినూత్న నిరసనలు దిగారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెరకు సుధాకర్ బెదిరించారు. ప్రత్యెక తెలంగాణా ఉద్యమం సమయంలో పీడీయాక్ట్ కింద చెరుకు సుధాకర్ ను పోలీసులు అరెస్ట్ చేయడం వివాదస్పదమైంది. రాష్ట్ర హైకోర్టు జోక్యంతో సుధాకర్ ను విడుదల చేశారు. అయితే చెరుకు సుధాకర్ కు కాకుండా ఇతరులకు టికెట్ ఇస్తున్నారనే సమాచారం అందుకున్న అనుచరులు నకిరేకల్ లో సెల్ టవర్ ఎక్కి హల్చల్ సృష్టించారు.   తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లి తనకు టీఆర్ఎస్ తరుపున పోటీ చేసే అవకాశం కల్పించాలని కేసీఆర్ ను కోరినా అటునుంచి ఎటువంటి స్పందన లేదు. తనకు నచ్చిన వాళ్లకు సీట్లు ఇచ్చేందుకు సొంత సర్వేల పేరుతో ఉద్యమకారులను, అమరుల బంధువులను, పదేళ్లకు పైగా టీఆర్ఎస్ కష్టనష్టాల్లో వెన్నంటి ఉన్న తమకు అన్యాయం చేస్తున్నారని తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నారు ఆశావహులు.

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సభ

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపిస్తూ చేసిన రెండు గంటల ప్రసంగం ప్రజల్నిఆకట్టుకోనెలా వుంది. జెండా వుంది కాని ఎజెండా గురుంచి ఎక్కువగా మాట్లాడలేదు. పార్టీ కార్యాచరణ, పార్టీ కోసం కార్యకర్తలు, ఫాన్స్ ఏం చేయాలి అనే దానిపై దిశానిర్దేశం చేయలేదు. దీనిని పార్టీ ఆవిర్భావ సభ అనే కంటే పవన్ వ్యక్తిగత సభ అని అనుకోవచ్చు. సామాన్య ప్రజలకు దగ్గరయ్యేందుకు పవన్ ఎక్కువగా ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. చాలా సహజమైన దోరణిలో..యూత్ ని ఆకట్టుకోనేలా ప్రసంగించారు. కాంగ్రెస్ తో తప్ప ఇతరపార్టీలతో పోత్తుకు రెడీగా వున్నానని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీతో పోత్తు పెట్టుకోవాలి అనే దానిపై ఆయనకి స్పష్టత లేనట్లుగా తెలుస్తోంది. వలసలను ప్రోత్సహించనని అన్నారు. చిరంజీవి పెట్టిన పీఆర్పీ పార్టీకి 17శాతం ఓట్లు వస్తే, పవన్ కళ్యాణ్ కి మాత్రం 3 లేదా నాలుగు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు మాత్రమే వున్నాయి. పవన్ తెలంగాణకు ఎక్కువగా ప్రధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. కేసిఆర్ ను టార్గెట్ చేసి..సీమాంధ్ర ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. పవన్ కళ్యాణ్ నిర్ద్వందంగా తనకు ఏ (కాపు) కులస్థుల మద్దతు అవసరం లేదని, ఎందుకంటే తను పదవులకోసమో, అధికారం కోసమో రాజకీయాలలోకి రాలేదని, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుండి దేశం నుండి తరిమికొట్టి మళ్ళీ పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకే రాజకీయాలలో ప్రవేశించానని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పి, ఒకేసారి కాంగ్రెస్ పార్టీకి, తను అభిమానించే అన్న చిరంజీవికి, కాపు కుల నేతలకూ కూడా గట్టిగా చురకలు వేశారు. తన పార్టీ విధానాలను జనంలోకి తీసుకెళ్లడానికి మాత్రం పవన్ ఈ రెండు గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని విమర్శకులు అంటున్నారు. అయితే ఆయన పార్టీకి జనాల్లో  క్రేజ్ వచ్చిన కానీ కలెక్షన్లు (ఓట్లు) మాత్రం నీల్ అనే అభిప్రాయాలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.  

కారులో కయ్యం

      కారు ఎక్కాలన్న సరదా అందరికీ ఉన్నా, అందులో పట్టేది కొందరే. సరిగ్గా ఇదే అంశంపై టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల లొల్లి మొదలైంది. కరీంనగర్ జిల్లాలో రెండు ఎంపీ స్థానాలతో పాటు 13 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అన్ని చోట్లా టికెట్లను ఆశిస్తున్నవారు పెరిగిపోతుండడంతో గొడవలు ముదురుతున్నాయి. పార్టీలో కొత్తగా చేరేవాళ్లకు టికెట్లు ఇస్తే ఊరుకొనేది లేదని.. సామూహికంగా రాజీనావూలు చేస్తామని మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి హెచ్చరించారు. దీంతో టీఆర్‌ఎస్ టికెట్ల పోరు బజారుకెక్కింది. మంథని నుంచి రాంరెడ్డి, ఆయన తనయుడు సునీల్‌రెడ్డి పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. తమకే టికెట్ వస్తుందని నమ్మకంతో ఉన్న రాంరెడ్డి కుటుంబానికి, అదేస్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పుట్ట మధు టీఆర్‌ఎస్‌లో చేరుతుండడం ఇబ్బందిగా మారింది. కేసీఆర్‌తో పాటు ముఖ్య నేతలతో మధు చర్చలు జరపడం, పార్టీ కూడా ఆయనకు టిక్కెటు ఇచ్చేందుకు మొగ్గు చూపుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రాంరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. రామగుండంలోనూ అదే పరిస్థితి. ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కోరుకంటి చందర్ పార్టీ టికెట్ కోసం పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లో కోరుకంటి చందర్ టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేయగా, పొత్తును ఉల్లంఘించి సోమారపు సత్యనారాయణ టీడీపీ నుంచి నామినేషన్ వేయడానికి రావడం, సకాలంలో బీ-ఫారం రాక స్వతంత్రుడిగా బరిలోకి దిగి విజయం సాధించడం తెలిసిందే. ఈసారి ఇరువురు ఒకే పార్టీలో ఉన్నా సమాంతరంగా గ్రూపులకు సారథ్యం వహిస్తున్నారు. చొప్పదండి నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జి బొడిగె శోభ టికెట్ ఆశిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య టీఆర్‌ఎస్‌లోకి వస్తారని, లేదంటే టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్ కు టికెట్ వస్తుందనే ప్రచారంతో శోభ పార్టీపై గుర్రుగా ఉన్నారు. జగిత్యాలలో నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.జితేందర్‌రావు, వి.రమణారావుల నడుమ టికెట్ కోసం పోరు కొనసాగుతోంది.  కోరుట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు టికెట్ తనకే అనే ధీమాతో ఉండగా, టీఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ సైతం ఇదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నారు.

జనసేన రాకతో రాజకీయ కలకలం

  పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ జనసేన రాకతో రాష్ట్ర రాజకీయాలలో మళ్ళీ ఒక కుదుపు వచ్చింది. ఆయన కాంగ్రెస్ పార్టీ పట్ల తనకున్న అసహ్యాన్ని ఏమాత్రం దాచుకొనే ప్రయత్నం చేయలేదు. దానిని తరిమికొట్టడమే తన లక్ష్యమని ప్రకటించేశారు గనుక ఇక నేటి నుండి కాంగ్రెస్ నేతలందరూ తమ విభేదాలను పక్కన బెట్టి మరీ ఆయనపై విమర్శల వర్షం కురిపించడం ఖాయం. ఇక, బీజేపీకి తాను దూరంగా ఉంటానని స్పష్టంగా చెప్పకపోయినా ఆయన మాటలని బట్టి ఆయన దూరంగానే ఉంటారని అర్ధమవుతోంది. కానీ ఆయన తెదేపాతో పొత్తులకు సిద్దమన్నట్లు సూచించారు గనుక, ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని భావిస్తున్న బీజేపీ ఆయన, తమను వ్యతిరేఖిస్తున్నట్లు విస్పష్టంగా ప్రకటన చేసే వరకు కూడా ఆయనను తమ మిత్రుడుగానే భావించవచ్చును. ఈ కారణంగా వైకాపా, జై సమైక్యాంధ్ర పార్టీలు కూడా ఆయనను తమ శత్రువులాగే భావిస్తాయి. అదేవిధంగా ఆయన తెలంగాణాలో కూడా తన పార్టీని నిర్మించి అక్కడ కూడా పోటీ చేసేందుకు సిద్దపడున్నందున తెరాస కూడా ఆయనపై యుద్ధం ప్రకటించడం ఖాయమే. బహుశః ఈ పాటికే తెరాస నేతలు యుద్ధం ప్రకటించి ఉండవచ్చును. అయితే, ఒకవేళ ఆయన బీజేపీకి ఏ మాత్రం సానుకూలంగా ప్రకటన చేసినా బీజేపీ ఆయన రాకను స్వాగతించే అవకాశం ఉంది. పవన్, చంద్రబాబు, నరేంద్ర మోడీ ముగ్గురు చేతులు కలిపినట్లయితే, సీమాంధ్రలోనే కాక తెలంగాణాలో కూడా ఒక బలీయమయిన శక్తిగా అవతరించగలరు.   పవన్ కళ్యాణ్ కాపుల మద్దతు కోసం తాను తహతహ లాడటం లేదని చెప్పినప్పటికీ, ఒకవేళ ఆయన తెదేపాతో పొత్తులు పెట్టుకొన్నట్లయితే, ఆ పార్టీకే మద్దతు ఇస్తామని చెపుతున్న కాపు సామాజిక వర్గం నేతలు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకే మద్దతు ఈయవచ్చును. అయితే పవన్ కళ్యాణ్ జంపింగ్ జిలానీలను, రాజకీయ బఫూన్లను తాను వ్యతిరేఖిస్తున్నాని, కాంగ్రెస్ పార్టీని ఓడించడానికే రాజకీయాలలోకి వస్తున్నానని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పినందున, అటువంటి వారితోనే పూర్తిగా నిండిపోయున్న తెలుగుదేశం పార్టీతో ఆయన ఏవిధంగా పొత్తులు పెట్టుకోగలరో వేచి చూడాలి.   రాష్ట్ర విభజనకు కారణమయిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కండువాలు, జెండాలు, టోపీలు మార్చేసి సరికొత్త వేషాలతో ప్రజల ముందుకు వస్తున్న సంగతి పవన్ కళ్యాణ్ కు కూడా తెలుసు. మరి అటువంటి వారిని ఓడించాలని భావిస్తున్న ఆయన తెదేపాతో సహా కిరణ్, జగన్ పార్టీలలో ఉన్న కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకొంటే, అన్ని పార్టీలతో ఆయన ఒకేసారి యుద్ధం చేయవలసి ఉంటుంది. అయితే ఆయన తను పదవుల కోసమో అధికారం కోసమో రాజకీయాలలోకి రాలేదని స్పష్టం చేస్తున్నందున, ఆయన అందుకు వెనుకాడకపోవచ్చును. అదే జరిగితే కాంగ్రెస్ నేతలు ఏ కండువా కప్పుకొని పోటీ చేసినా వారికి పవన గండం తప్పదని చెప్పవచ్చును.   అయితే పవన్ కళ్యాణ్ ఈ వేడిని ఎంతకాలం నిలుపుకోగలడనే దానిపైనే ఆయన పార్టీ భవిష్యత్త్ మరియు ఇతర పార్టీలపై ఆయన ప్రభావం కూడా ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా అతను ఎంత త్వరగా, ఎంత సమర్ధంగా, బలంగా తన పార్టీని నిర్మించుకోగలడనే దానిపైన పవన్ కళ్యాణ్, జనసేనల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

మెగా అన్నదమ్ముల సవాల్..

  పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి ప్రవేశిస్తాడని కాంగ్రెస్ పార్టీ గ్రహించినందునే చాల దురాలోచనతో పదవి కోసం తహతహలాడిపోతున్న చిరంజీవిని రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీకి చైర్మన్ గా నియమించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతలు తనకే కట్టబెట్టినందుకు బహుశః చిరంజీవి హనుమంతుడిలా పొంగి పోయుండవచ్చును. కానీ తన ద్వారానే లక్షమణుడు వంటి తమ్ముడు పవన్ కళ్యాణ్ న్ని దూరం చేసి అతనికి చెక్ పెట్టించాలని పధకం పన్నిందని ఆయన గ్రహించలేకపోయారు. గ్రహించలేకపోయారు అనే కంటే పదవి కోసమే ఆయన గ్రహించలేదని చెప్పుకోవడమే సముచితంగా ఉంటుందేమో! కాంగ్రెస్ అధిష్టానం చిరంజీవికున్న మెగా ఇమేజ్ ద్వారా ప్రజలను, అభిమానులను, చివరికి తన కాపు కులస్తులను కూడా చీల్చి సోదరుడు పవన్ కళ్యాణ్ నుండి దూరం చేయగల సమర్ధుడనే ఆయనకు ఆ పదవి కట్టబెట్టింది.   అయితే పవన్ కళ్యాణ్ నిర్ద్వందంగా తనకు ఏ (కాపు) కులస్థుల మద్దతు అవసరం లేదని, ఎందుకంటే తను పదవులకోసమో, అధికారం కోసమో రాజకీయాలలోకి రాలేదని, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుండి దేశం నుండి తరిమికొట్టి మళ్ళీ పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకే రాజకీయాలలో ప్రవేశించానని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పి, ఒకేసారి కాంగ్రెస్ పార్టీకి, తను అభిమానించే అన్న చిరంజీవికి, కాపు కుల నేతలకూ కూడా గట్టిగా చురకలు వేసారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు చిరంజీవి బయలు దేరితే, దానిని తుడిచి పెట్టేస్తానని తమ్ముడు పవన్ కళ్యాణ్ శపదం చేయడం విశేషం. వీరిద్దరి పోరాటంలో ప్రజలు, అభిమానులు, మీడియా చివరికి ఆయన వద్దన్న కాపు కులస్తులు కూడా పవన్ కళ్యాణ్ పక్షాన్నే నిలివడం తధ్యం. ఎందుకంటే ఆయన మాటలలో నీజాయితీ కొట్టవచ్చినట్లు కనబడుతోంది. ఆయన మాటలలో తమ ఆవేదన స్పష్టంగా కనబడుతోంది. కాంగ్రెస్ పట్ల తమలో రగులుతున్న కసినే వారు ఆయనలో కూడా చూడగలిగారు. ఇదంతా చూస్తే మూలిగే ముసలి నక్క మీద తాటి పండు పడినట్లుగా ఇప్పటికే సగం చచ్చి జీవచ్చవంలా మారిన కాంగ్రెస్ పార్టీకి పవన్ కళ్యాణ్ పాడి కట్టడానికే వచ్చాడేమో.. అనిపిస్తోంది. ఇక సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని ఏ జీవీ రక్షించాలేదని ఖచ్చితంగా చెప్పవచ్చును.

అన్నపట్ల అదే అభిమానం గౌరవం...

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...ఎవరి అంచనాలకు అందనంత ఎత్తులో...అభిమానుల అంచనాలను నిజం చేస్తూ ప్రసంగించి, అందరి నోళ్లకు, బుర్రలకు పని కల్పించారు. తన సభకు అడ్డంకులు సృష్టించిన అన్న చిరంజీవిని ఏకి పారేస్తారని రాజకీయ నాయకులు భావిస్తే, అభిమానులు మాత్రం ఆయన ఆ పని ఎన్నడూ చేయడనే బలంగా నమ్మారు. వారూహించినట్లే తన ప్రసంగం మొదట్లోనే అన్నయ్య చిరంజీవి పట్ల అపారమయిన ప్రేమ, అభిమానం, తనకు తండ్రి వంటివాడు అని చెప్పుకొని ఆయన పట్ల హనుమంతుడిలా భక్తి ప్రదర్శించడంతో పవన్ అభిమానులే కాదు చిరంజీవి అభిమానులు, ప్రజలు కూడా ఆయనను హర్షించాకుండా ఉండలేక పోయారు.   పవన్ నిశిత దృష్టి నుండి జైరామ్ రమేష్ తన అన్నయ్యకు వ్యతిరేఖంగా చేసిన వ్యాఖలు సైతం తప్పించుకాకపోవడం గమనిస్తే ఆయన ఎంత నిశితంగా రాజకీయాలను పరిశీలిస్తున్నారో అర్ధమవుతుంది. కేంద్రమంత్రి అయిన జైరామ్ రమేష్, తనతోటి కేంద్రమంత్రి అయిన చిరంజీవి గురించి అనుచితంగా మాట్లాడితే, ఆయన తమ్ముడిగా చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే తాను తను ప్రేమించే, అభిమానించే అన్నకు వ్యతిరేఖంగా పోరాడే దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేసారు.    తమ్ముడి ఈ ప్రసంగం విన్న తరువాతయినా చిరంజీవిలో పశ్చాతాపం కలిగితే  పవన్ తన పోరాటంలో తొలి విజయం సాధించినట్లే. కానీ చిరంజీవి వంటి పదవీ లాలసుడిలో అంత త్వరగా మార్పు ఆశించడం అత్యసే అవుతుంది.

పవన్ ప్రసంగంలో ప్రధానాంశాలు నాలుగైదే

  ‘‘చట్టం అందరికీ సమానంగా ఉండేలా చూస్తాం, బ్లాక్ మార్కెటింగ్ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా అరికడతాం, స్త్రీ రాత్రి వేళ కాకపోయినా కనీసం పట్టపగలు అయినా క్షేమంగా బయటకు వచ్చి తిరిగి వెళ్లేలా వచ్చే సమాజాన్ని స్థాపిస్తా. ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరుస్తాం. కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరితోనైనా చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నా‘‘. ఇదీ స్థూలంగా పవన్ కళ్యాణ్ రెండు గంటలకు పైగా చేసిన ప్రసంగం సారాంశం.   తాను పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పే ప్రయత్నం, టీఆర్ఎస్ నాయకుల మీద రివ్వురివ్వున సంధించిన శస్త్రాలు, కాంగ్రెసోళ్ల పంచెలు ఊడదీయాలని కాకపోయినా.. దాదాపు అదే స్థాయిలో ఆ పార్టీ మీద చేసిన విమర్శలు, మధ్యమధ్యలో పిట్ట కథలు.. ఇవన్నీ కలిసి తొలి భేటీలో అభిమానులను ఉర్రూతలూగించాయి. అయితే, మామూలుగా పది రూపాయలు కూడా చేయని కప్పు కాఫీ 200 రూపాయలుండే నోవోటెల్ హోటల్లో, కేవలం తాను ఆహ్వానించినవారి మధ్య మాత్రమే, అదికూడా రాసుకొచ్చిన ప్రసంగాన్ని, పేదవాళ్ల గురించి చెప్పడం పట్ల మాత్రం కొన్ని విమర్శలు కూడా లేకపోలేవు.   అమ్మ తిడుతుంది, కొట్టినా కొడుతుందని, అన్నయ్యకు ఎదురెళ్తున్నానని కుటుంబకథా చిత్రాన్ని కూడా పవన్ ఆవిష్కరించారు. అయితే తన చిన్నతనంలో పోలీసు స్టేషన్ సంఘటనను మాత్రం పూర్తిస్థాయిలో ఆవిష్కరించడంలో కాస్త విఫలమైనట్లే కనిపించింది.   కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీల మీద చేసిన విమర్శలకు మాత్రం జనం నుంచి మంచి స్పందన వచ్చింది. ‘‘తగలబెట్టండి, నాలుకలు కోస్తాం, అడ్డంగా నరికేయండి అనే పదజాలం తెలంగాణ మాండలికం కాదు. కంచె ఐలయ్య మాటల్లో చెప్పాలంటే అది ప్యూడలిస్టు భావజాలం. ఎకరాకు కోటి రూపాయలు ఆయన ఎలా సంపాదించారో తెలంగాణాలో రైతులందరికీ చెబితే వాళ్లు కూడా సంపాదిస్తారు.   అమ్మా... కవితా.. నీవు నా చెల్లెలులాంటి దానివి. నీ వేదనను అన్నయ్యలా అర్థం చేసుకున్నా. తెలంగాణా జాగృతి కోసం దేశ విదేశాల్లో సేకరించిన కోట్ల రూపాయల విరాళాలు ఏమయ్యాయో వెల్లడించు‘‘ అని పవన్ చెప్పినప్పుడు జనం అది నోవోటెల్ అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఈలలు, కేకలు వేశారు.   ‘‘జంపింగ్ జోకర్స్‌కు నా దగ్గర చోటులేదు. వాళ్లంటే నాకు చిరాకు. అలాంటివాళ్లను నా దగ్గరకు రానివ్వను. వాళ్ల కంటే ఒక సిద్ధాంతానికి కట్టుబడి, మొదట్నుంచి ఇప్పటివరకు ఒకేచోట పనిచేసిన టీఆర్‌ఎస్ నాయకులకు మాత్రం సలాం. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఒకలా, ఆయన వెళ్లిపోయాక మరోలా కొత్త వాదంతో మాట్లాడే కాంగ్రెస్ నేతలు నాకు నచ్చరు. వాళ్లను క్షమించను‘‘ అన్నప్పుడు కూడా ప్రజలు బాగానే స్పందించారు.   అయితే తన పార్టీ విధానాలను జనంలోకి తీసుకెళ్లడానికి మాత్రం పవన్ ఈ రెండు గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని విమర్శకులు అంటున్నారు. 9.10 గంటల సమయంలోనే ఆయన తన ప్రసంగం ముగించి, చివర్లో కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో అంటూ ఆవేశం నినాదం ఇచ్చి, వేగంగా వెళ్లిపోతూ.. మర్చిపోయినట్లు మళ్లీ వెనక్కొచ్చి తన ప్రసంగం పుస్తకాన్ని తీసుకుని నవ్వుకుంటూ వేదిక దిగిపోయారు.

పవన్ కళ్యాణ్ స్పీచ్ హైలైట్స్-1

  కేసీఆర్ ఎకరా పొలానికి కోటి రూపాయలు ఆదాయం ఏవిధంగా సంపాదిస్తున్నారో అదేవిధంగా తెలంగాణా రైతన్నలకి కూడా సంపాదించుకొనేలా చేయగలిగితే నేను కూడా ఆయనకే జై కొడతాను.   కేసీఆర్ కుమార్తె కవిత నేను తెలంగాణా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోరినట్లు విన్నాను. నేను ప్రేమించే నా తెలంగాణా ప్రజలకు క్షమాపణలు చెప్పమని అడిగేందుకు నువ్వెవరు? వాళ్ళు నావాళ్ళు. నా వాళ్ళకి నేను క్షమాపణలు చెప్పమని ఎవరో సలాహా ఈయడం ఏమిటి? నువ్వు నా చెల్లిలాంటి దానివి. ఒక అన్నగా నీ ఆవేదనను అర్ధం చేసుకోగలను. కానీ ఇటువంటి సలహాలు నీ నుండి నేను కోరుకోవడం లేదు. నువ్వు విదేశాల నుండి ఉద్యమాల కోసం పోగేసిన డబ్బుకు జమాఖర్చుల లెక్కలున్నాయా?   స్త్రీల మీద అనేక ఏళ్లుగా అత్యాచారాలు జరుగుతున్నపటికీ నిర్భయ కేసు తరువాతనే మెలుకువ వచ్చిందా? అంతవరకు కళ్ళు మూసుకుపోయాయా మీకు?   కులం కోసం, మతం కోసం కొట్టుకొని చచ్చిపోయే వారిని చూసి ఉండవచ్చేమో కానీ దేశం కోసం చచ్చిపోవాలనుకొన్న నాలాంటి పిచ్చివాడిని ఎవరూ చూసుండరేమో... దేశ సమగ్రతకు భంగం కలిగించే వాళ్ళ తాట తీస్తా.   రాజకీయ జంపర్స్, బఫూన్ గాళ్ళకి నా పార్టీలో స్థానం లేదు.   కాంగ్రెస్ పార్టీ హటావ్..దేశ్ కొ బచావ్..

పవన్ కళ్యాణ్ స్పీచ్ హైలైట్స్-2

  పవన్ కళ్యాణ్ ప్రసంగమంతా హైలైట్. అవి ఏ స్క్రిప్టులో కనబడవు, దొరకవు. ఎందుకంటే అవి ఆయన హృదయంలో నుండి వచ్చినవి. వాటిలో మళ్ళీ కొన్ని హైలైట్స్ అని వేరు చేసి చెప్పడం చాలా కష్టమే! అయినా కొన్ని ప్రత్యేకంగా చెప్పుకోవలసినవీ ఉన్నాయి.   ఎవరన్నారు...నేను అన్నయ్యను వ్యతిరేఖిస్తున్నానని? అన్నయ్యను వ్యతిరేఖించడం లేదు. ఆయన పార్టీని మాత్రమే వ్యతిరేఖిస్తున్నాను. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పుణ్యమాని తండ్రి వంటి అన్నయను రాజకీయాలలో ఎదుర్కోవలసివస్తోంది. కేంద్రమంత్రిగా ఉన్న జైరామ్ మరో కేంద్ర మంత్రి అయిన అన్నయను గౌరవించడం నేర్చుకోవడం మంచిది.   నా వ్యక్తిగత, వైవాహిక జీవితం గురించి ఎవరయినా విమర్శలు చేయదలిస్తే వారు కూడా అటువంటి ప్రతివిమర్శలకు సిద్దంగా ఉండాలి. రాహుల్ గాంధీ అయినా రాబర్ట్ వాద్రా అయినా ఐ డోంట్ కేర్..ఎవరినీ వదిలిపెట్టను..   జగ్గారెడ్డి వంటి వ్యక్తి తెలంగాణా ఉద్యమానికి నాయకత్వం వహించి ఉండి ఉంటే, రాష్ట్ర ప్రజలు విడిపోతూ స్వీట్లు పంచుకొనేవారు. ఆయనకున్న జాతీయ దృక్పదం మరే కాంగ్రెస్ నేతలో లేడు. అరవై ఏళ్లుగా జరుగుతున్నా తెలంగాణా ఉద్యమాలు, పదేళ్లుగా సాగుతున్న తెలంగాణా ఉద్యామాలు, వందల మంది అమాయకులయిన యువకులు చనిపోయిన తరువాత కానీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా ఇవ్వాల్సిన అవసరం ఉందని అర్ధంకాలేదా? సినిమాలలో వేషాలు వేసుకొనే నాకే ఆర్ధమయిన సంగతి రాజకీయాలలో తలలు పండిపోయిన మీకెందుకు అర్ధంకాలేదు. అర్ధం అయిన తరువాత పార్లమెంటులో కేవలం 26నిమిషాలలోనే ఎలా పూర్తి చేసారు? చేసినా ఆంధ్ర, తెలంగాణా ప్రజలు సంతోషంగా ఉండేలా ఎందుకు చేయలేకపోయారు?      

పొత్తులకు ఇంకా ముహూర్తం కుదరలేదా?

  ప్రస్తుతం తెలంగాణాలో కాంగ్రెస్-తెరాసాలు పొత్తుల విషయం తేల్చుకోలేక ఆపసోపాలు పడుతున్నాయి. రెండు పార్టీలు కూడా తెలంగాణాలో ఉన్న 119 అసెంబ్లీ సీట్లలో తమకే 75 సీట్లు కావాలని పట్టుబడుతుండటంతో పొత్తులు కుదరడం లేదు. బహుశః ఒకటి రెండు రోజుల్లో ఆ సంగతీ తేలిపోవచ్చును. అదేవిధంగా తెరాస-మజ్లిస్-సీపీఐలు ఎన్నికల పొత్తులకు సిద్దపడుతున్నట్లు సమాచారం. కానీ, కాంగ్రెస్-తెరాసల మధ్య పొత్తుల కధ ముగిస్తే తప్ప, వాటి గురించి ఆలోచించలేదు. ఇక తెదేపా-బీజేపీలు కూడా పొత్తులపై నోరుమేదపలేని పరిస్థితిలో ఉన్నాయి. ఆంధ్రాలో బీజేపీకి ఉన్న వ్యతిరేఖత కారణంగా తెదేపా వెనుకాడుతుంటే, తెలంగాణాలో బీజేపీ నేతలే తెదేపాతో పొత్తులను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. అందువల్ల త్వరలో నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన తరువాతనే ఆ రెండు పార్టీల మధ్య పొత్తుల విషయం తేలవచ్చును. అంతవరకు వారు శత్రువులుగానే వ్యవహరిస్తారేమో.   వైకాపా-సీపీయం పార్టీలు ఇంకా పొత్తులు కుదుర్చుకోకపోయినప్పటికీ ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా వామపక్ష పార్టీలు రెండూ మున్సిపల్ ఎన్నికల వరకు మాత్రం కలిసి పనిచేయాలని నిర్ణయించుకొన్నాయి. అయితే ఈరోజు సీపీఐ నారాయణ తెలంగాణా ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపే సాకుతూ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ను కలవడం చాలా ఆసక్తికరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేఖించే ఆయన స్వయంగా వెళ్లి అభినందనలు ఎందుకు చెపుతున్నారో త్వరలోనే బయటపడవచ్చును.   ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా కొత్త పార్టీ ప్రకటించబోతున్నందున, ఆయన పార్టీ విధి విధానాలు వగైరా చూసిన తరువాత ఏఏ రాజకీయ పార్టీలు ఎవరితో పొత్తుల పెట్టుకోవాలనే విషయంలో మరికొంత స్పష్టత రావచ్చును. పవన్ కళ్యాణ్ వామపక్ష భావజాలం పట్ల ఆసక్తి కలిగి ఉన్నందున లెఫ్ట్ పార్టీలతో పొత్తులకు అంగీకరిస్తే అంగీకరించవచ్చును. అదే జరిగితే, లెఫ్ట్ పార్టీలకు దశ తిరిగినట్లే. పవన్ కళ్యాణ్ కున్న అశేషజనాదారణ వల్ల అవి లాభాపడవచ్చును. అదేవిధంగా వాటికున్న బలమయిన క్యాడర్ వలన పవన్ కళ్యాణ్ పార్టీకి కూడా లబ్ది పొందవచ్చును.   పవన్ విషయంలో సీపీఐ నారాయణ సానుకూలంగా స్పందించగా, సీపీయం రాఘవులు మాత్రం అది ప్రజా రాజ్యం పార్టీలా కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతుందని ముందే జోస్యం చెప్పడంతో, సీపీయం పవన్ పార్టీ పట్ల ఆసక్తి లేదని అర్ధమవుతోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఏ పార్టీతోను పొత్తులకు ఆసక్తి చూపకపోయినట్లయితే, అన్ని పార్టీలు శత్రువులుగా మారడం తధ్యం. ఇప్పటికిప్పుడు ఆయనపై ఎవరూ దండయాత్ర చేయకపోయినా, మున్ముందు ఎన్నికల ప్రచారం మొదలయిన తరువాత, ఇతర పార్టీలు ఆయన వ్యక్తిగత విషయాలను సైతం కెలకకుండా వదిలిపెట్టవు.   ఇక కిరణ్ కుమార్ రెడ్డి ‘జై సమైక్యాంధ్ర’ పార్టీని స్థాపించినప్పటికీ, ఆ పార్టీతో ఎన్నికల పొత్తుల గురించి ఏ పార్టీ ఆసక్తి చూపలేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమయినా ఆ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీతో కూడా పొత్తులు పెట్టుకొనే పరిస్థితిలో లేదు. మహా అయితే తమలాగే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకొన్న సీపీయంతో పొత్తులు ఆశించవచ్చును, కానీ ఆ పార్టీ ఇప్పటికే వైకాపా వైపు మొగ్గు చూపుతోంది గనుక ఆ అవకాశం కూడా లేదనే చెప్పాలి.