రేవంత్ రెడ్డి కేసుపై స్పందించను: పవన్

  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొద్ది సేపటి క్రితం మీడియా సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య జరుగుతున్న గొడవల గురించి, ఇంకా అనేక ఇతర అంశాల గురించి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే: ఇరు రాష్ట్రాల మధ్య జరుగుతున్నా గొడవలన్నిటినీ నేను నిత్యం గమనిస్తూనే ఉన్నాను. వాటిపై నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. ఇంత జరుగుతున్నా నేను ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ యంపీ వీ. హనుమంత రావు గారు నన్ను నిలదీయాలనుకోవడం గురించి నాకు తెలుసు. కానీ మాట్లాడితే చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలనే ఉద్దేశ్యంతోనే నేను వెనక్కి తగ్గుతున్నాను.   తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు విజయనగరానికి చెందిన ఆనందసాయి అనే ఆర్కిటెక్ట్ ని నియమించి తెలుగు జాతి సమైక్యత అవసరమనే ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చేరు. అందుకు ఆయనకీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రేవంత్ రెడ్డి కేసుప్రస్తుతం కోర్టులో ఉంది కనుక దానిపై ఇప్పుడు నేను నా అభిప్రాయాలు చెప్పలేను. కానీ దానికి ముందు జరిగిన పరిణామాల గురించి మాట్లాడగలను. తెదేపా నేతలను తెరాసలోకి ఆకర్షించినందునే ఈ సమస్య మొదలయిందని నేను భావిస్తున్నాను. రాజకీయ నాయకులు తమ కంట్లో దూలాలు ఉంచుకొని ఎదుటవాడి కంట్లో నలుసుల గురించి మాట్లాడుతున్నారు.   రాష్ట్ర విభజన తరువాత అనేక సమస్యలు తలెత్తాయి. వాటిని పరిష్కరించుకొనేందుకు ప్రయత్నించకుండా ఈ విధమయిన అనవసరమయిన రాజకీయాలు చేయడం ఎవరికీ మంచిది కాదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ చాలా బాధ్యతగా వ్యవహరించుతూ ఈ సమస్యలను పరిష్కరించుకొనే ప్రయత్నం చేయాలి. ప్రజలు వారు తమ సమస్యలని తీర్చుతారనే ఉద్దేశ్యంతోనే వారిని ఎన్నుకొన్నారు. కానీ వారు ప్రజాసమస్యలను గాలికొదిలేసే ఇటువంటి సమస్యలు సృష్టించుకొని కోర్టులు, కేసులు అంటూ రోజులు దొర్లించేసినట్లయితే వారిని ఎన్నుకొన్న ప్రజలే వారికి తగిన గుణపాఠం నేర్పుతారు. తెదేపాకి చెందిన ప్రజా ప్రతినిధులను పార్టీలో చేర్చుకోగలరేమో గానీ వారితో బాటు ప్రజల అభిమానాన్ని ఓట్లను కూడా పోనగాలమని భావిస్తున్నారా?తలసాని శ్రీనివాస్ ని తెరాసలో చేర్చుకొన్నంత మాత్రాన్న హైదరాబాద్ లో స్థిరపడిన సీమాంధ్ర ప్రజలను ఆకర్షించగలరా?

త్వరలో తెలంగాణా మంత్రివర్గ ప్రక్షాళణ?

    రసమయి బాలకృష్ణను త్వరలో మంత్రిగా చూడబోతున్నారని కొన్ని రోజుల క్రితం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మళ్ళీ మొన్నీ మధ్యనే చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ని కూడా క్యాబినెట్ లోకి తీసుకోబోతున్నట్లు తెలిపారు. అంటే త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళణ తధ్యమని స్పష్టమవుతోంది. మంత్రివర్గ విస్తరణకి బదులు ప్రక్షాళణ ఎందుకంటే పార్లమెంటరీ నియామలను అనుసరించి తెరాసకున్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం మంత్రివర్గంలో 18 మంది కంటే ఎక్కువ మంది మంత్రులను నియమించుకోవడానికి వీలులేదు. ప్రస్తుతం మంత్రివర్గంలో సరిగ్గా 18 మంది మంత్రులే ఉన్నారు. కనుక కొత్తవారిని తీసుకోవాలంటే మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసన పలుకక తప్పదు. కేసీఆర్ చెప్పినట్లు కేవలం ఇద్దరినే మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే ఎవరో ఇద్దరు మంత్రులకి ఉద్వాసన తప్పదు.   కానీ ఆ ఇద్దరిని నియమించడం కోసం ప్రయత్నిస్తే ఇంకా చాలా కూడికలు తీసివేతలు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం కేసీఆర్ క్యాబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడంతో విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. కనుక ఈసారి కనీసం ఒక్క మహిళకయినా మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సి ఉంటుంది. ఇక తెదేపా నుండి కొత్తగా పార్టీలోకి వచ్చి జేరిన కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావులకి మంత్రి పదవులు దక్కాయి. మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కి రాజ్య సభ సీటు లేదా ఎమ్మెయల్సీ సీటు కానీ ఇస్తారనే హామీతోనే ఆయన రేపు తెరాసలో చేరబోతున్నట్లు సమాచారం. ఇంకా మున్ముందు కాంగ్రెస్ పార్టీ నేతలను పార్టీలోకి ఆకర్షించడానికి కీలక పదవులు కట్టబెట్టే అవకాశం ఉంది.   ఈ కారణంగా ఎంతో కాలంగా పార్టీనే నమ్ముకొని పనిచేస్తున్న తెరాస నేతలకి అవకాశం దక్కకకపోవడంతో వారు చాలా అసంతృప్తిగా ఉన్నారు. కనుక ఒకవేళ మంత్రివర్గ ప్రక్షాళన చేసినట్లయితే వారందరూ కూడా మంత్రిపదవుల కోసం ఒత్తిడి చేయవచ్చును. అంటే కొత్తగా ఎంతమందిని మంత్రివర్గంలోకి తీసుకోదలిస్తే అంతకు సమానంగా పాత మంత్రులను తొలగించక తప్పదన్నమాట. ఒకరిద్దరిని సంతృప్తి పరిచేందుకు మంత్రివర్గ ప్రక్షాళన చేసినట్లయితే ఆ కారణంగా పదవులు కోల్పోయిన వారు, పదవులు ఆశించి భంగపడినవారు అందరూ అసంతృప్తి చెందడం తధ్యం. కనుక మంత్రివర్గ ప్రక్షాళన చేయడం అంటే కత్తి మీద సాము వంటిదేనని చెప్పవచ్చును. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సాము ఎప్పుడు చేస్తారో వేచి చూడాల్సిందే!

జపాన్‌లో చంద్రబాబు బిజీ

  జపాన్ పర్యటనలో వున్న ఏపీ ముఖ్యమంత్రి బిజీ షెడ్యూల్లో వున్నారు. ఆయన సోమవారం నాడు జపాన్ రాజధాని టోక్యో నగరంలో ఫుజి ఎలక్ట్రిక్ సంస్థ, మిత్సుబిషి కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఫుజి సంస్థ విజయవాడలో పైలెట్ ప్రాజెక్టు కింద స్మార్ట్ గ్రిడ్ నిర్మాణం చేపట్టింది. ఆ సంస్థకు ఏపీ ప్రభుత్వం స్థలం కూడా కేటాయించింది. నవంబర్‌లో జరిగిన ఎంఓయు పురోగతిని సంస్థ ప్రతినిధులు చంద్రబాబు బృందానికి వివరించారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోనూ ఫుజి సంస్థ ప్రధాన ప్రాజెక్టును చేపట్టనుంది. ఇక మిత్సుబిషి సంస్థ విశాఖలో సమాచార అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. కృష్ణాజిల్లాలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. కృష్ణపట్నంలో క్లస్టర్ ఏర్పాటుకు కూడా అవకాశాలు వున్నాయి. తాజా పర్యటన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తునిలో తమ పరిశ్రమకు రహదారిని నిర్మించాలని సంస్థ ప్రతినిధులు చంద్రబాబును కోరారు. దీనికి స్పందించిన ఆయన వంద రోజుల్లో రహదారిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణలో టీడీపీ అభ్యర్థుల విజయం

  తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారు. తాడ్వాయి మండలం ఊరట్టం ఎంపీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై 75 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో పరిధిలోని మద్దూరు మండలం బూనీడు ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘనవిజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి 692 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మోగించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయపల్లి ఎంపీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించారు.

నేను మాత్రం సోనియాగాంధీ పటాన్ని తీసేయను.. డిఎస్

కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ రెండు రోజుల క్రితమే ఆపార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ చేరుతున్నట్టు తెలియజేశారు కానీ ఎప్పుడు చేరతారో అన్నది మాత్రం అప్పుడు చెప్పలేదు. అయితే ఇప్పుడు ఆయన ఈనెల 8 వ తేదీన తెరాసలో చేరుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. నిజామాబాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పదవులు ఆశించి తెరాసలో చేరలేదని తెలంగాణ అభివృద్ధికి పాటుపడదామని చేరానని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ అప్పగించిన ప్రతి బాధ్యతను నెరవేరుస్తానని తెలిపారు. అయితే గాంధీభవన్ లో ఫొటోలు తీసేసిన విషయంపై స్పందిస్తూ ఫొటోలు తీసేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అని అన్నారు. తను మాత్రం తన ఇంట్లో ఉన్న సోనియాగాంధీ పటాన్ని తీసేయనని స్పష్టం చేశారు.

కపిల్ సిబల్ కు సుప్రీంకోర్టు చురక

  రేవంత్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు బెయిల్ రద్దు పిటిషన్ రద్దు చేస్తూ రేవంత్ రెడ్డిని ఇన్ని రోజులు జైల్లోనే ఉంచుకున్నారు.. ఇంకా ఉంచుకొని ఏం చేస్తారు అని చెప్పి తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ తరపు న్యాయవాదులలో ఒకరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కు సుప్రీంకోర్టు చురకలు అంటించింది.   రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసి అతనిని దాదాపు నెల రోజుల నుండి జైలులోనే ఉంచారు.. నాలుగు రోజులు విచారణ జరిపారు.. అయినా బెయిల్ ఇవ్వడం సరికాదని అంటున్నారు.. కొన్ని కేసుల్లో నిందితుడు అరెస్ట్ అయిన ఒక్క రోజుకే బెయిల్ మంజూరు చేయాలని మీరు వాదించిన రోజులు లేవా అని సుప్రీంకోర్టు జడ్డి హెచ్.ఎల్. దత్తు కపిల్ ను ప్రశ్నించారు.   న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు కపిల్ ఖంగుతిన్నట్టు సమాచారం. అంతేకాక నిందితుడు నాలుగు రోజులు మీ కస్టడీలోనే ఉన్నాడు. అతని వాంగ్మూలం కూడా తీసుకున్నారు. అయినా నెల రోజులు జైల్లో ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని ఎందుకు అడుగుతున్నారు? మళ్లీ అతన్ని జైల్లో పెట్టడం ఎందుకు?' అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించే సరికి మిన్నకుండిపోయారట.

సండ్రకు మళ్లీ నోటీసులు

ఓటుకు నోటు కేసులో నిందితుడిగా భావించి గతంలో తెలంగాణ ఏసీబీ అధికారులు సండ్ర వెంకటయ్యని విచారణలో పాల్గొనాలని నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు అతనికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో విచారణకు పదిరోజులు గడువు తీసుకొని తరువాత విచారణలో పాల్గొంటానని చెప్పడంతో ఏసీబీ అందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో సండ్ర కూడా ఏసీబీకి లేఖ రాశాడు. ఇప్పుడు తన ఆరోగ్యం బాగానే ఉందని ఎప్పుడు విచారణకు రమ్మన్నా సిద్ధంగా ఉన్నానని లేఖలో పేర్కొన్నారు. అయితే టీ ఏసీబీ మళ్లీ ఇప్పుడు సండ్రకు నోటీసులు జారీ చేసింది. సోమవారం సాయంత్రం 6 గంటలలోపు ఏసీబీ కార్యాలయానికి రావాలని సూచించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లిన ఏసిబి అధికారులు, సండ్ర వెంకటవీరయ్య ఇంటి వద్ద లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు.

కేకే, బొత్స ఫోటోలు ఉండటానికి వీల్లేదు.. వీహెచ్

ఇరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి అంతగా లేకపోయేసరికి ఆపార్టీలో నేతలంతా వేరే పార్టీలోకి వలసలు కట్టారు. ఇప్పటికే చాలామంది వేరే పార్టీల తీర్ధం పుచ్చుకున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలపై రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మండిపడుతున్నారు. పార్టీ లో ఉన్నంతకాలం పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి ఉండకుండా వేరే పార్టీలోకి మారడం చాలా దుర్మార్గమని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఆయన గాంధీభవన్‌లోని కేకే, బొత్స ఫోటోలను తొలగించారు. కష్టకాలంలో పార్టీని వీడిన నేతల ఫొటోలు గాంధీభవన్‌లో ఉండటానికి వీల్లేదని వీహెచ్‌ అన్నారు. మరో కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కూడా పార్టీ ఫిరాయించిన వాళ్లపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ డిఎస్ కు చాలా చేసిందని.. అలాంటి డిఎస్ కాంగ్రెస్ పార్టీని వీడతారని అనుకోలేదని.. కానీ తాను కూడా పదవి మీద వ్యామోహంతో పార్టీ మారరని ఎద్దేవ చేశారు. అసలు తెలంగాణ ఉద్యమంలోనే పాల్గొనని ఆయన బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్ లో చేరుతున్నానని అనడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ని నేతలు వీడినా.. కార్యకర్తలు ఉన్నారని.. నేతలను చూసి కార్యకర్తలు ఛీ కొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు.

జైల్లో రేవంత్ ను ప్రలోభపెట్టే ప్రయత్నం జరిగిందా?

ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించిన నేపథ్యంలో ఆయన అక్కడ ఏంచేశారు.. ఆయన ఆ సమయంలో కనీసం తెదేపా నేతలను కూడా కలవడానికి నిరాకరించారు.. కానీ జైల్లో ఉన్న రేవంత్ రెడ్డిని ప్రలోభ పెట్టడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి అన్న వార్తలు ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతున్నాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని తీవ్ర ఒత్తిడికి గురైనట్టు.. ఆయనను తీవ్ర ఒత్తిడికి గురిచేసినట్టు భావిస్తున్నారు. తెదేపాను ఎలాగైనా దెబ్బతీయాలనే.. తెలంగాణలో తెదేపా లేకుండా చేయాలనే కుట్రతో ఒక పథకం ప్రకారం రేవంత్ రెడ్డిని ఈ కేసులో ఇరికించిన టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అనే బ్రహ్మస్త్రాన్ని ఉపయోగించి పార్టీ అధినేతను ఈ కేసులో ఇరికించాలని ప్రయత్నించింది. దీనిలో భాగంగానే జైలులో ఉన్న రేవంత్ రెడ్డిని ఈ కేసు వ్యవహారంలో తెదేపా పార్టీ అధినేత పేరు చెప్పాలని.. అప్రూవర్ గా మారాలని.. అలా మారిన నేపథ్యంలో 300 కోట్ల తో పాటు ఒక మంత్రి పదవి కూడా ఇస్తామని ఆఫర్ చేశారని తెలుగు వర్గాలు అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇదిగో చంద్రబాబు అరెస్ట్.. అదిగో చంద్రబాబు అరెస్ట్ అంటూ.. నోటీసులు జారీ చేస్తామంటూ తెగ సంబరిపడిపోతూ స్టేట్ మెంట్ లు ఇచ్చింది. కానీ వారిపప్పులేమి రేవంత్ రెడ్డి దగ్గర ఉడకలేదని.. తెదేపా పార్టీకి నమ్మినబంటు కాబట్టి.. అలాంటి తప్పుడు పనులు చేయనని ఖండిస్తూ గట్టిగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. దీంతో టీ ప్రభుత్వం ఏం చేయాలో తెలీక వెనక్కి తగ్గిందని ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిందని అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసి వాళ్లకి గట్టిగా బుద్ధి చెప్పింది.

పేదల కోసం ఎనలేని కృషి చేశారు.. చంద్రబాబు

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అల్లూరి సీతారామరాజుకి నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు 118 వ జయంతి హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు కీర్తి తెలుగు వారి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుందని అన్నారు. పేదల కోసం ఆయన ఎనలేని కృషి చేశారని అన్నారు. అంతేకాదు త్వరలోనే అల్లూరి సీతారామరాజు విగ్రహం ఒకటి అసెంబ్లీలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. గిరిజనాభివృద్ధికి అల్లూరి సీతారామరాజు విశేష కృషి చేశారని.. అదే స్ఫూర్తితో మేము కూడా గిరిజనాభివృద్ధికి పాటుపడుతున్నామని అన్నారు.

రేవంత్ కి బెయిల్ రాకుండా చేయాడానికి ఖర్చు 2కోట్లా?

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా పథకం ప్రకారం ఈ కేసులో ఇరికించారని అందరికీ అర్ధమయ్యే విషయమే. ఎంత తెలివిగా ఈ కేసులో ఇరికించాలని చూశారో అంతే జాగ్రత్తగా రేవంత్ కు బెయిల్ రాకుండా చేయడానికి కష్టపడ్డారు. ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన దగ్గరనుండి దాదాపు నెల రోజులు జైలులో ఉంచి.. నాలుగు రోజులు కస్టడీలో విచారణ జరిపిన తరువాత కూడా ఇంకా విచారణ జరపాలి.. అంటూ చెప్పి బెయిల్ రాకుండా చేశారు. కానీ రేవంత్ రెడ్డి తాను చెప్పాల్సిందంతా విచారణలోనే చెప్పానని చెప్పడానికి ఇంకా ఏం లేదని ఏసీబీ అధికారులు కావాలనే బెయిల్ రాకుండా చేస్తున్నారని తెలుసుకొని హైకోర్టు తలుపులు తట్టారు. హైకోర్టు ఏసీబీ అధికారులకు మొట్టికాయ వేస్తూ రేవంత్ కు బెయిల్ మంజూరు చేసింది. కానీ టీ ఏసీబీ అంతటితో ఆగిందా లేదు. ఏకంగా హైకోర్టు రేవంత్ బెయిల్ పై ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. పాపం అక్కడ కూడా ఏసీబీకి చుక్కెదురైంది. ఇప్పటికి వరకూ రేవంత్ రెడ్డిని జైల్లోనే ఉంచుకున్నారు కదా.. ఇంకా ఉంచుకొని ఏంచేస్తారు అని దిమ్మతిరిగి పోయే సమాధానం చెప్పింది. రేవంత్ బెయిల్ రద్దు చేసేది లేదు.. ఒకవేళ రేవంత్ ఏదైనా బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తే అప్పుడు రండి అని సూచించింది.   ఇదంతా ఒక ఎత్తయితే రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా చేయడానికి టీ ప్రభుత్వం 2కోట్లు ఖర్చు చేసిందని ఇప్పుడు రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఒక వ్యక్తి మీద ఉన్న కక్ష్య కారణంగా ప్రజల సొమ్మును టీ ప్రభుత్వం ఇలా దుర్వినియోగం పరచడం నేరమని ఇప్పుడు రాజకీయ నాయకులు భావిస్తున్నారు. కేవలం రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా చేయాడానికి ఏసీబీ తరుపు న్యాయవాదులకు ఇంత ఖర్చు చేయడం అవసరమా అని అనుకుంటున్నారు ప్రజానీకం.. పోనీ ఇంతా చేసినా ఏసీబీకి ఒరిగింది ఏమైనా ఉందా అంటే అదీ లేదు.. ఎప్పటికైనా న్యాయమే గెలిచితీరుతుంది అన్నట్టు కొంచెం లేటయినా రేవంత్ రెడ్డికి బెయిల్ ఇచ్చి ఏసీబీకి చెంపదెబ్బకొట్టేట్టు చేశారు. ఏదేమైనా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాల్నిస ప్రభుత్వం రాజకీయ కక్ష్యల వల్ల ప్రజాధనాన్ని తమ స్వార్ధం కోసం ఉపయోగించడమనేది అనైతికం.

వంగవీటి పయనం ఎటు!

  కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఇప్పుడు పార్టీ మారే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి లేని కారణంగా తాను కూడా కాంగ్రెస్ ను వీడి వైకాపాలోకి చేరడానికి ప్రయత్నిస్తున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే వచ్చిన చిక్కేంటంటే ఇప్పుడు దేవినేని నెహ్రూ వైకాపాలోకి చేరడం వల్ల ఆపార్టీలో ఉన్న వంగవీటి రాధా కుటుంబం పరిస్థితి ఎంటని రాజకీయవర్గాలు చెవులుకొరుక్కుంటున్నాయి. ఎందుకంటే దేవినేని నెహ్రూ, వంగవీటి కుటుంబానికి పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే అంత శత్రుత్వం ఉంది. అయితే ఇప్పుడు దేవినేని నెహ్రూ వైకాపాలో చేరితే వంగవీటి కుటుంబం ఎటువైపు పయనిస్తుందా అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రెండు కత్తులు ఒక ఒరలో ఉండవన్నట్టు దేవినేని నెహ్రూ వైకాపాలో చేరితే వంగవీటి కుటుంబం మాత్రం వైకాపాను వీడటం కచ్చితమని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. అయితే ఈ విషయంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది చూడాల్సిన విషయం. ఎందుకంటే గతంలో కూడా బొత్స సత్యనారాయణ వైకాపాలోని చేరడం ఎంతమాత్రం ఇష్టంలేని సుజయ్ సోదరులు కూడా అప్పట్లో పార్టీని వీడతారు అనే వార్తలు బాగా ప్రచారం చేశాయి. కానీ అలాంటిది జరగలేదు.. సుజయ్ కృష్ణా రంగారావు కూడా పార్టీనీ వీడే ప్రసక్తే లేదని.. వైకాపాలోనే ఉంటామని స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. కానీ అప్పటి పరిస్థితి వేరు.. ఇప్పుటి పరిస్థితి వేరు.     ఎందుకంటే దేవినేని నెహ్రూ కుటుంబానికి.. వంగవీటి రాధా కుంటుబానికి మధ్య ఉన్న శత్రుత్వం అలాంటిది. ఈ నేపథ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి తాతను చంపిన కుటుంబంతో కలిసి జగన్ కూర్చోగలడా.. అలాగే నేను కూడా వీళ్లతో కలిసి ఎలా కూర్చోగలను అని అన్నట్టు తెలుస్తోంది. అందుకే జగన్ విజయవాడ పర్యటనకి కూడా రాధా డుమ్మాకొట్టే ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటున్నారు. మరోవైపు జగన్, విజయ్ సాయిరెడ్డి, వై సుబ్బారెడ్డిలు కలిసి వంగవీటి కుటుంబానికి నచ్చేజెప్పడానికి ప్రయత్నించగా రాధా మాత్రం వారికి టచ్ లోకి రాలేదు. దీంతో జగన్ కొడాలి నానికి రంగంలోకి దించి ఆయన చేత నచ్చజెప్పే ప్రయత్నం చేయించినా ఆ ప్రయత్నంలో నాని కూడా విఫలమయినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ విషయంలో మాత్రం రాధా చాలా పట్టుదలగా ఉన్నారని.. ఒకవేళ దేవినేని నెహ్రూ కనుక వైకాపా లోకి వస్తే వంగవీటి రాధా బీజేపీలోకి కాని.. టీడీపీ లోకి చేరే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ వర్గాలు చెవులుకొరుక్కుంటున్నాయి. చూడాలి ఇంతకీ వంగవీటి పయనం ఎటు సాగుతుందో..

పురందేశ్వరికి జాతీయ స్థాయికి ప్రమోషన్

  ఆంద్రప్రదేశ్ బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి గత ఎన్నికలలో ఊహించని విధంగా ఓడిపోయిన తరువాత ఆమె రాజకీయ జీవితంలో కొంచెం స్తబ్దత ఏర్పడింది. అయినప్పటికీ ఆమె నిరాశ చెందకుండా రాష్ట్రంలో బీజేపీని బలపరిచేందుకు తన ప్రయత్నాలు తను చేసుకుపోతున్నారు. ఆమె సేవలను, ప్రతిభను, చిత్తశుద్దిని గుర్తించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆమెని రాష్ట్ర స్థాయి నుండి జాతీయస్థాయికి ప్రమోషన్ చేశారు. ఆమెను జాతీయ మహిళా మోర్చా ఇన్-ఛార్జ్ గా నియమించారు. దానితో బాటు ఆమెకు అదనంగా కర్ణాటక రాష్ట్ర మహిళా మోర్చా బాధ్యతలను కూడా అప్పజెప్పారు.   అదే విధంగా మురళీధర్ రావుకి కూడా జాతీయ స్థాయికి పదోన్నతి కల్పించారు. ఆయనను జాతీయ యువ మోర్చా ఇన్-ఛార్జ్ గా నియమించారు. దానితో బాటు అదనంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల యువమోర్చా బాధ్యతలు కూడా ఆయనకి అప్పగించారు. బీజేపీ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ గా సిద్దార్థ్ నాద్ సింగ్ ని, తెలంగాణా రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ గా క్రిష్ణదాసుని నియమించారు.

వైకాపా ఎమ్మెల్యే భూమా అరెస్ట్

వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భూమా నాగిరెడ్డి పోలీసు అధికారులను దూషించారని అతనిపై 353, 506 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదయ్యాయి. వివరాల ప్రకారం స్థానిక సంస్థల కోటాకింద కర్నూలు జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు వేసేందుకు భూమా అఖిలప్రియ పోలింగ్ కేంద్రానికి వెళ్లగా అక్కడ పోలీసుల ఆమెతో దురుసుగా ప్రవర్తించారని.. ఈ విషయం తెలుసుకున్న భూమా నాగిరెడ్డి అక్కడకి వచ్చి పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసు అధికారులు అతనిని అదుపులోకి తీసుకొని వాహనంలో నంద్యాల మూడో పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. భూమా అరెస్ట్ తో అతని ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఆప్ పార్టీకి నకిలీ సర్టిఫికేట్ల తంటాలు

ఆప్ పార్టీ రోజు రోజుకి చాలా ఫెమస్ అయిపోతుంది. అది అదరగొట్టే పరిపాలన చేసి కాదు.. రోజుకో ఆరోపణలు ఎదుర్కొంటూ. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుపోతూనే కేజ్రీవాల్ ను చిక్కుల్లో పడేస్తుంది. ఈ పార్టీలో ఇప్పుడు నకిలీ సర్టిఫికెట్ల వివాదాలు ఎక్కువైపోయాయి. మొన్నటి వరకూ నకిలీ సర్టిఫికేట్లతో మాజీ న్యాయశాఖ మంత్రి జితేందర్ తోమర్ సింగ్ పార్టీని, ప్రజలను మోసం ఆఖరికి పదవిని వీడాల్సి వచ్చింది. ఇప్పుడు మరో ఆప్ నేత భావనా గౌర్ అనే మహిళ నకిలీ సర్టిఫికేట్ల ఆరోపణలో చిక్కుకున్నారు. సుమరేంద్రనాథ్ వర్మ అనే ఆర్ టీఐ కార్యాకర్త బావనా గౌర్ నకిలి సర్టిఫికెట్లు సమర్పించారని.. 2013లో సమర్పించిన అఫిడవిట్ లో, 2015లో సమర్పించిన అఫిడవిట్ లో తేడాలున్నాయని కోర్టులో పిటిషన్ వేశారు. 2013లో తాను ఇంటర్ వరకే చదివానని అఫిడవిట్లు సమర్పించగా... 2015 లో మాత్రం బీఏ చదివానని అఫిడవిట్లు సమర్పించారని కేవలం 14 నెలల వ్యవధిలో బీఏ, బీఈడీ పూర్తి చెయ్యడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. దీనిని బట్టి ఆమె సర్టిఫికేట్లలో ఏదో తేడా ఉందని తెలుస్తోందని.. ఆమె తప్పుడు సర్టిఫికేట్లు సమర్పించారని అర్ధమవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తానికి ఆప్ పార్టీలో నుండి రోజుకో నేత నకిలీ సర్టిఫికేట్ల వివాదంతో బయటపడుతున్నారు. ఇంకా ఎంతమంది బయటపడతారో చూడాలి..