సీఎం అనాలా? లేక బావగారు అనాలా..?

ఇటీవల విడుదలైన 'మహానటి' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరిపై ప్రశంసలు కురిపించారు. ఇక ఇప్పుడు తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  కూడా ‘మహానటి’ చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారు. అమరావతిలోని ప్రజాదర్బార్‌ హాల్‌లో ‘మహానటి’ చిత్రబృందం చంద్రబాబును కలిసింది. ఈ సందర్బంగా ఆయన  ‘మహానటి’ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సావిత్రి జీవితానికి సార్థకత తీసుకురావాలనే పట్టుదలతో ఈ సినిమాలో కీర్తి సురేష్ బాగా నటించారని కొనియాడారు. సావిత్రి తన జీవితంలో పడిన కష్టాలకు ఈ సినిమా అద్దం పట్టిందని... కష్టాల్లో కూడా ఇతరులకు సహాయ పడాలనే సావిత్రి జీవితం ప్రతిఒక్కరికీ ఆదర్శమని అన్నారు. ‘మహానటి’ సినిమాను చాలా చక్కగా తీసినందున నిర్మాతలు స్వప్న, ప్రియాంక దత్‌లను చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందించారు. రెండు సంవత్సరాలు ‘మహానటి’ జీవితాన్ని అధ్యయనం చేసి, మంచి సినిమాను తీసినందుకు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ను మెచ్చుకున్నారు. చిత్ర బృందం ఎంతో సాహసంతో ఈ సినిమాను తీసి మంచి విజయాన్ని అందుకుందని చంద్రబాబు అన్నారు. సావిత్రిది కూడా రాజధాని అమరావతిలోని గ్రామమే కావటం విశేషమని పేర్కొన్నారు.   అనంతరం చిత్ర యూనిట్ ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సన్మానించారు. ఇక తనకు సన్మానం అనంతరం సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ, ‘ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎం అనాలా? లేక బావగారు అని పిలివాలో’ తెలియడం లేదని అన్నారు. చంద్రబాబు కుటుంబంతో తమకు ఎంతో అనుబంధం ఉందని, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ‘అక్కా’ అని పిలిచే దానినని చెప్పారు. చిత్రయూనిట్ ని సన్మానించడంపై సంతోషం వ్యక్తం చేశారు.

ఎన్నికల నాటికి రాహుల్‌ పుంజుకుంటాడా!

ఒకప్పుడు రాహుల్ గాంధి ఓ అనామకుడు. ప్రజల దృష్టిలో తల్లి చాటు బిడ్డ, ప్రతిపక్షాల విమర్శలలో పప్పు. రాహుల్‌ గాంధి కామెడీ అని కొడితే యూట్యూబ్‌లో లెక్కలేనన్ని వీడియోలు కనిపించేవి. ఇక మోదీ అయితే చెప్పనే అక్కర్లేదు. ‘కొంతమందికి బాదం పప్పులు తిన్నా బుద్ధి పెరగదంటూ’ రాహుల్‌ని గడ్డిపోచలా తీసిపారేసేవారు. కానీ నిరంతరం శత్రువు మీదే ధ్యాస పెడితే, ఆ శత్రువుకి బలాన్ని అందిస్తూ మనం బలహీనులం అయిపోతామన్న ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోయారు మోదీ! పిల్లవాడిని రెచ్చగొట్టి పరిగెత్తించే తల్లిలాగా రాహుల్‌లో కసిని పెంచారు. ఫలితం ఇప్పుడు రాహుల్‌ పట్ల ప్రజాభిప్రాయంలో కాస్త మార్పు వస్తోంది. రాహుల్‌ ప్రసంగాలలో కాస్త పరిణతి, దూకుడు కనిపిస్తోంది. ఇక అతని ట్వీట్లు ఇప్పుడు టాక్ ఆఫ్‌ ద టౌన్‌గా మారుతున్నాయి.ఇంతకుముందు ప్రభావవంతమైన నేతల జాబితాలో ఎక్కడో కనిపించేవాడు కాస్తా ఇప్పుడు, మోదీ తర్వాతి స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు మోదీ స్థానం మాత్రం ఓ రెండడుగులు దిగజారినట్లు సర్వేలలో తెలుస్తోంది. మైనారటీల మీద దాడులు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, బ్యాంకు కుంభకోణాలు, నిరుద్యోగం... లాంటి సవాలక్ష సమస్యలు ఇప్పుడు మోదీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. ఈ మంటల్ని మరింతగా రగులుస్తూ పెట్రోలు ధరలు ఎలాగూ పెరుగుతున్నాయి. బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఇవన్నీ ప్రతిబంధకాలే! డైనమిక్‌ నేతగా ప్రతి విషయం మీద కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే మోదీ సమస్యల మీద నోరెత్తకపోవడం కూడా ప్రజల్ని అసహనానికి గురిచేస్తోంది. ఒకవేళ ఏదన్నా సమస్య గురించి మాట్లాడినా, దానికి యాభై ఏళ్ల నాటి నెహ్రూ పాలనే కారణం అని చెప్పడం మరింత చిరాకు తెప్పిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. తెరాస పాలనలో లోటుపాట్లు ఉన్నా కేసీఆర్‌, కేటీఆర్‌లు ఎంతో కొంత అభివృద్ధి చేస్తున్నారనే నమ్మకంలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఆంధ్రలో పెద్దగా అభివృద్ధి జరగకపోయినా, దానికి కారణం బీజేపీ చేసిన ద్రోహమే అన్న కసితో అక్కడి ప్రజలు ఉన్నారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో ఇలాంటి స్థానిక పరిస్థితులు బీజేపీకి ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి వచ్చే లోక్‌సభ్‌ ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్‌లు పెద్దగా లాభపడకపోయినా... ప్రాంతీయ పార్టీలు మాత్రం బలం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కర్ణాటకలో కనిపించిన దృశ్యమే వచ్చే జాతీయ ఎన్నికలలో పార్లమెంటులోనూ కనిపించవచ్చు. అప్పుడు ఎవరు ఎలాంటి ఎత్తులు వేస్తారనేదాని మీదే భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకప్పుడైతే ఇలాంటి సందర్భాలలో మోదీ- షా ద్వయం వేసే ఎత్తులదే పైచేయిగా ఉండేది. కానీ కర్ణాటకలో రాహుల్ చూపిన సమయస్ఫూర్తితో, ఒకప్పటి పప్పుని అంత తేలికగా అంచనా వేయడానికి లేకుండా పోయింది. ఏకు మేకవడం అనే సామెత రాజకీయానికి అతికినట్లు సరిపోతుందేమో!

పూనమ్ సంచలన కామెంట్లు... జల్సా చూపిస్తాడు.. అజ్ఞాతవాసంలో వేస్తాడు..

  నిన్నటి వరకూ శ్రీరెడ్డి, కత్తి మహేశ్ లు సినీ పరిశ్రమ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే గత కొద్దిరోజుల నుండి ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగిందని చెప్పొచ్చు. ఓ రకంగా దీనంతటికీ పవన్ కళ్యాణే కారణమని చెప్పొచ్చు. మీడియాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. మీడియా కూడా కాస్త వెనక్కి తగ్గి.. అదే పనిగా డిబెట్లు పెట్టడం ఆపేశారు. ఇక డిబెట్లు లేకపోవడం.. ఇంటర్వ్యూలు లేకపోవడం వల్ల సోషల్ మీడియాకు కూడా పెద్దగా వార్తలు లేకుండా పోయాయి. అయితే మరోసారి నెటిజన్లకు మంచి న్యూస్ దొరికింది. ఈసారి ఈ న్యూస్ కు కారణమయ్యింది ఎవరో కాదు పూనమ్ కౌర్.   నిజానికి అందాల కథానాయికే అయినా టాలీవుడ్ లో సరైన హిట్ కొట్టి నిలబడలేకపోయింది పూనమ్ కౌర్. ఫేడవుట్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా పవన్ కళ్యాణ్, కత్తి మహేశ్ ఇష్యూతో వెలుగులోకి వచ్చింది. కత్తి మహేశ్ పవన్ పై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో పవన్ సపోర్ట్ చేసి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఇక ఆ తరువాత పూనమ్ కౌర్ ను ఉద్దేశించి కూడా కత్తి మహేశ్ పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, పూనమ్ కౌర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక కొన్ని రోజులు ఈ విషయంపై చర్చలు జరిగినా... ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా తన ట్విట్టర్లో ఒక స్టార్ డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి ఈ భామ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. జల్సాలు చూపిస్తూ.. అజ్ఞాతవాసంలో వేసేస్తాడు జాగ్రత్త... నమ్మకద్రోహి అని పూనమ్ చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. అంతేకాదు... ఆ నాలుగు కుటుంబాలకు దగ్గరగా ఉంటూ... ఎన్నారై హీరోయిన్లను అవకాశాలు ఇవ్వడం ఆ దర్శకుడికి అలవాడు... నాకు హిట్లు లేవనే సాకులు చెప్పి... ఆ ఎన్నారై హీరోయిన్ కు అవకాశం ఇచ్చాడు. మరి ఆ ఎన్నారై హీరోయిన్ కు హిట్లు ఉన్నాయా..? ఆ ఎన్నారై హీరోయిన్ మీరు ఏ పని చెప్పినా చాలా శ్రద్దగా చేస్తారట... నేను విన్నాను.. అలాంటి ఉద్యోగాలు చేయకపోవడమే మంచిది అంటూ పూనమ్ తన ట్విట్టర్లో చాలా ఘాటుగానే కామెంట్లు విసిరింది. ఇక పూనమ్ కామెంట్లు చేసిన ఆ దర్శకుడు కూడా ఎవరికో దాదాపు క్లారిటీ వచ్చింది. మరి ముందు ముందు పూనమ్ ఇంకెంత మంది గురించి ఇలా కామెంట్లు చేస్తుందా.. లేకపోతే...దీంతో ఆపేస్తుందా చూద్దాం ఏం జరుగుతుందో..

దీదీ దెబ్బకి డీజీపీ బదిలీ...

  కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే కదా. ఈ కార్యక్రమానికి వచ్చిన మమతా బెనర్జీ.. విధాన సౌధకు వెళ్లే దారిలో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. కారు ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడంతో కొంతదూరం నడిచి విధాన సౌధకు చేరుకున్నారు. దీంతో ట్రాఫిక్ నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె.. ప్రమాణ స్వీకార వేదిక వద్దకు రాగానే డీజీపీ నీలమణిపై విరుచుకుపడ్డారు. వేదికపైనే డీజీపీకి చీవాట్లు పెట్టారు. అంతేకాదు... అదే ఆవేశంతో దేవెగౌడకు ఫిర్యాదు చేశారు. ఇకేముంది...ట్రాఫిక్ నిర్వహణ తీరుపై స్వయంగా ముఖ్యమంత్రి మమత నుంచే ఫిర్యాదు రావడంతో తక్షణం నివేదిక సమర్పించాల్సిందిగా సీఎం కుమారస్వామి డీజీపీని ఆదేశించారు. భారీ వర్షం కారణంగానే సమస్య తలెత్తిందని, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ కార్లు ఒక్కసారిగా విధాన సౌధ ప్రాంగణానికి రావడంతో ఇబ్బంది తలెత్తిందని డీజీపీ తెలిపారు. ఆఖరికి మమతా బెనర్జీకి జరిగిన అవమానంపై తీవ్రంగా స్పందించిన కుమారస్వామి ప్రభుత్వం డీజీపీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పవన్ కు బాబుకు అక్కడే చెడిందట..!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్సల తీవ్రత పెంచారు. గత ఏడాది ఈ టైంలో టీడీపీ-జనసేన కలిసే ఉన్నాయి. కానీ ఏడాదికి వచ్చే సరికి పరిస్థితి మొత్తం మారిపోయింది. నిన్నటి వరకూ మిత్రులు అనుకున్నవాళ్లే ఇప్పుడు శత్రువులుగా తయారయ్యారు. ఎప్పుడైతే జనసేన పార్టీ ఆవిర్భావం దినోత్సవం రోజున టీడీపీని విమర్శించి అందరికీ షాకిచ్చారో ఆ రోజు నుండి ఏదో ఒక సందర్భంలో టీడీపీపై చంద్రబాబు పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు వైసీపీ అధినేత జగన్ మాత్రమే చంద్రబాబు ను తిట్టేవాడు. రాష్ట్రంలో ఏం జరిగినా దానికి చంద్రబాబే కారణమంటూ టైం దొరికినప్పుడల్లా చంద్రబాబుపై విమర్శలు గుప్పించేవాడు. ఇక ఇప్పుడు పాదయాత్ర నేపథ్యంలో మొత్తం చంద్రబాబునే టార్గెట్ చేశారనుకోండి. అది వేరే విషయం. అయితే ఇప్పుడు పవన్ జగనే మించి పోయాడు. చంద్రబాబుపై విమర్శలు గుప్పించడంలో జగన్ కు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం పవన్ శ్రీకాకుళం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై తీవ్రస్థాయిలోనే విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు ఏకంగా  తనపై దాడి చెయ్యడానికి ముఖ్యమంత్రి కిరాయిగూండాలను పంపించారు అని అభియోగించారు. చంద్రబాబు బద్దశత్రువులు కూడా ఎప్పుడు ఇటువంటి ఆరోపణలు చెయ్యలేదు. అయితే ఉన్నట్టుండి చంద్రబాబుపై పవన్ ఇంతలా విమర్శలు చేయడానికి కారణం ఏంటీ.. అసలు వీరిద్దరికీ ఎక్కడ చెడింది అన్న చర్చల నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం బయటపడింది. జనసేన టీడీపీ పొత్తు చర్చలు విఫలం అవ్వడమే దీనికి కారణం అంటున్నారు. టీడీపీని జనసేన 50 సీట్లు అడగగా, చంద్రబాబు కేవలం 16 ఇస్తా అన్నారట. దీనిని పవన్ కళ్యాణ్ అవమానంగా ఫీల్ అయ్యారట పవన్. అందుకే చంద్రబాబుపై పవన్ ఇంతలా విరుచుకుపడుతున్నారట. ఈ నేపథ్యంలోనే నేను గెలవకపోయినా టీడీపీని ఓడిస్తా అని శబధం చేసి చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారట. మరి ముందు ముందుపవన్ ఇంకెన్ని విమర్శలు గుప్పిస్తారో చూద్దాం... 

నీ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నా కోహ్లీ...

విరాట్ కోహ్లీ ఛాలెంజ్ ను ప్రధాని నరేంద్ర మోడీ స్వీకరించారు. విరాట్ కోహ్లీ ఏంటీ..? ప్రధానికి సవాల్ విసరడం ఏంటీ..?దాన్ని మోడీ కూడా స్వీకరించడం ఏంటీ.. అసలు మోడీకి కోహ్లీ విసిరిన సవాల్ ఏంటీ అనుకుంటున్నారా... ? అదేంటంటే... మోదీకి కోహ్లీ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ విసిరాడు. అసలు సంగతేంటంటే...రెండు రోజుల క్రితం కేంద్రమంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’ అనే ఛాలెంజ్‌లో ఆయన స్వయంగా పుషప్స్‌ చేస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు దానితో పాటు రాట్‌ కోహ్లీ, సైనా నెహ్వాల్‌, హృతిక్‌ రోషన్‌ కు ఈ ఫిట్‌నెస్‌ సవాల్ ను విసిరారు. దీంతో సైనా, హృతిక్‌ రోషన్‌ ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి మరికొందరికి ఈ సవాలును విసిరారు. తాజాగా కోహ్లీ కూడా రాథోడ్‌ సవాలును స్వీకరించాడు. తాను కసరత్తులు చేసిన వీడియోను పోస్త్ చేస్తూ.. తన భార్య అనుష్క శర్మ, ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ధోనీ ఈ సవాలును స్వీకరించాల్సిందిగా కోరాడు. ఆశ్చర్యం ఏంటంటే.. కోహ్లీ సవాలుకు ప్రధాని మోదీ స్పందించారు. ‘నీ సవాలును స్వీకరిస్తున్నాను. త్వరలోనే నా ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ వీడియోను పంచుకుంటాను’ అని తన మోదీ ట్విటర్‌లో తెలిపారు.

నన్ను ఏదైనా అంటే వెంకన్న ఊరుకోడు..

  తిరుమల ప్రధానార్చకుడు రమణ దీక్షితులు ఏపీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంలో ఇప్పటికే రమణ దీక్షితులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశారు. ఇక ఇప్పుడు ఈ విషయంపై స్పందించిన చంద్రబాబు.. తనపై బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే  రమణ దీక్షితులు ఆరోపణలు చేస్తున్నారని, అమిత్ షా, మోదీలు దగ్గరుండి ఆయనతో మాట్లాడిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని, తనను అప్రదిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతో రమణ దీక్షితులుని ఢిల్లీకి పిలిపించుకుని, తనపై లేనిపోని ఆరోపణలు చేయించిందని అన్నారు. అంతేకాదు పరమ పవిత్రమైన, దేశంలోనే నంబర్ వన్ ఆలయంగా ఉన్న టీటీడీని తమ అధీనంలోకి తీసుకోవాలన్నదే బీజేపీ అభిమతమని, బీజేపీ పార్టీ అనుకున్నది ఎప్పటికీ జరగబోదని.. నేను దాన్ని ఎన్నటికీ జరగనీయబోనని హెచ్చరించారు.   ఇంకా రమణ దీక్షితులు గురించి మాట్లాడుతూ.. "ఈయన (రమణ దీక్షితులు) కూడా ఈయనింట్లో వెంకటేశ్వరస్వామి పక్కనే రాజశేఖరరెడ్డి ఫొటో పెట్టుకునే పరిస్థితికి వచ్చాడంటే, ఈయన ఎలాంటి స్వామో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను మీకు తెలియజేసుకుంటున్నాను" అని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ప్రతి ఆరోపణలపైనా తాను టీటీడీ ఈఓ నుంచి వివరణ కోరానని, అన్నీ బాగున్నాయని, స్వామిని ఎన్నడూ పస్తు పెట్టలేదని అనిల్ సింఘాల్ తనకు చెప్పారని చంద్రబాబు అన్నారు. తనపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే వెంకన్న ఊరుకోబోడని హెచ్చరించారు. మరి ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళుతుందో... దీనిపై కేంద్రం ఏం స్టెప్ తీసుకుంటుందో చూద్దాం..

కుమారస్వామి పదవి ఎన్నాళ్లుంటుందో!

  కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ కూటమి తరపున కుమారస్వామి ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దేశంలోని ప్రాంతీయ పార్టీల ముఖ్యులంతా సంబరపడిపోతున్నారు. కానీ ఈ సంబరాలు ఎన్నాళ్లు నిలుస్తాయన్నదే అసలు ప్రశ్న. అందుకు కుమారస్వామే కారణం. అధికారం కోసం ఎలాంటి ఎత్తుగడకైనా సిద్ధపడతారన్నది కుమారస్వామి మీద ఉన్న ఓ ఆరోపణ. ఆయన గతాన్ని చూస్తే, ఈ ఆరోపణని ఏమంత తేలికగా కొట్టి పారేయలేం అనిపిస్తుంది. 2004లో కర్ణాటకలో మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటిలాగానే అది కూడా జేడీఎస్- కాంగ్రెస్ పొత్తుతోనే ఏర్పడింది. ఆ ప్రభుత్వంలో భాగంగా ఉన్న కుమారస్వామి తన తండ్రిని సైతం కాదని 2006లో ప్రభుత్వాన్ని కూలదోశాడు. అంతటితో ఊరుకోలేదు. బీజేపీతో కలిసి మరో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు. ఆ ప్రభుత్వంలో జేడీఎస్ తరపున 20 నెలలు కుమారస్వామి, 20 నెలలు బీజేపీ తరపున యడ్యూరప్ప ముఖ్యమంత్రులుగా ఉండాలన్నది ఒప్పందం. కానీ తన పదవీకాలం ముగియగానే, ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకునేందుకు కుమారస్వామి ఒప్పుకోలేదు. ఆ నిర్ణయమే 2014 ఎన్నికలలో బీజేపీకి లాభించి యెడ్యూరప్పను ముఖ్యమంత్రిగా నిలబెట్టింది. కుమారస్వామికి ముఖ్యమంత్రి పీఠం మీద ఇంత మోజు ఉండబట్టే కాంగ్రెస్‌ పార్టీ తనకు ఎక్కువ సీట్లు వచ్చినా కూడా అతనికే సీఎం పదవిని వదులుకుంది. ఇక సిద్ధరామయ్యతో కూడా కుమారస్వామిది ఉప్పూనిప్పూ వ్యవహారమే! ఒకప్పుడు సిద్ధరామయ్య దేవగౌడకి వీరవిధేయుడిగా ఉంది అన్ని సందర్భాలలో చేదోడుగా నిలిచాడు. కానీ కుమారస్వామి రాకతో అతని ప్రాధాన్యత తగ్గిపోవడమే కాకుండా పార్టీ నుంచి కూడా వెలివేయబడ్డాడు. ఎన్నికల ముందు వరకూ సిద్ధరామయ్య కుమారస్వామి మీదా, కుమారస్వామి సిద్ధరామయ్య మీదా నిప్పులు చెరిగారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకోవైపు బీజేపీ కూడా కుమారస్వామి ప్రభుత్వాన్ని ఎలాగొలా అస్థిరపరచాలనే ఆలోచనలో ఉండక మానదు. మోదీ- షా ద్వయం తమకు జరిగిన గర్వభంగాన్ని అంత తేలికగా మర్చిపోతారనుకోలేం. ఇన్ని పడగల నడుమ కుమారస్వామి ప్రభుత్వం నిండు ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపించగలదా అన్నదే కోటి రూపాయల ప్రశ్న!

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న బూచాడి భయం

    వాళ్లు మనకి అర్థం కాని భాషలో మాట్లాడుకుంటారు. ఎవరన్నా మనుషులు ఒంటరిగా కనిపిస్తే దాడి చేస్తారు. ఆ తర్వాత అతని మెదడుని ఒలుచుకుని తినేస్తారు. ఇదేదో ఇంగ్లిష్‌ హారర్‌ మూవీ కాదు! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యమేలుతోన్న బూచాళ్ల భయం. బీహార్‌ నుంచి వచ్చిన కొంతమంది సైకోలు ఇలా దాడులకు పాల్పడుతున్నారంటూ కొద్ది రోజులుగా వాట్సప్‌లో సందేశాలు వ్యాపిస్తున్నాయి. దాంతో చాలా గ్రామాల్లో పిల్లలను గదుల్లో ఉంచి తాళం వేసేస్తున్నారు. కొత్తవాళ్లు ఎవరన్నా కనిపిస్తే చితకబాదేస్తున్నారు. వింతగా ఎవరు ఉన్నా వెంటపడుతున్నారు. చివరికి పోలీసులు రంగంలోకి తిరిగి ఊరూరా తిరిగి ప్రజలను సముదాయించాల్సి వస్తోంది. తమిళనాడులో ఇలాగే ఓ కారులో దిగినవారిని, పిల్లలు ఎత్తుకుపోయేవారుగా స్థానికులు అనుమానించారు. ఈ విషయాన్ని వాట్సప్‌లో షేర్‌ చేసుకుని, ఊరు బయట వాళ్లని అడ్డగించారు. అమాయకులం అని మొత్తుకున్నా వినకుండా వాళ్లలో ముగ్గురిని కొట్టి చంపేశారు. బూచాడి భయంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని పోలీసులు భయపడుతున్నారు. అందుకే ఓ పక్క బూచాడి భయం లేదని బుజ్జగిస్తూనే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించాల్సి వస్తోంది. మనిషి సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్లినా, ఆలోచన మాత్రం ఆటవిక స్థాయిలోనే మిగిలిపోతే ఎలా ఉంటుందో బూచాడి భయం మరోసారి నిరూపిస్తోంది. వెర్రితనానికి వాట్సప్‌ తోడై విచక్షణను మంటకలిపేస్తోంది.

"జనసేన"లోకి సుజనా.. అందుకే ఇలా..!

  గత కొద్దిరోజులుగా సుజనా చౌదరి పార్టీ మార్పుపై వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి పదవికి తాను ఎప్పుడైతే రాజీనామా చేశారో అప్పటినుండి  ఆయన టీడీపీని వీడి బీజేపీలోకి చేరుతున్నారన్న వార్తలు తెగ హల్ చల్ చేశాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. అదేంటంటే 'సుజనాచౌదరి' పవన్‌ కళ్యాణ్‌ పార్టీలోకి వెళతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే..దీనికి సంబంధించి...చర్చలు పూర్తి అయ్యాయని...ఆయన త్వరలో అధికారికంగా 'జనసేన' పార్టీలోకి చేరతారని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. నిజానికి తన పదవికి రాజీనామా చేసిన తరువాత సుజనాచౌదరి పార్టీ కార్యక్రమాల్లో మునుపటిలా పాల్గొనటంలేదనే చెప్పొచ్చు. టిడిపి కార్యక్రమాల్లో 'సుజనా' మొక్కుబడిగా పాల్గొంటున్నారు.ఏ కార్యక్రమంలోనూ..ఆయన పాల్లోవడం లేదు. టిడిపి విజయవాడలో నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలోనూ 'సుజనా' పాల్గొనలేదు. ఇక తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో కూడా ఏదో నామ్ కే వాస్త్ పాల్గొని చంద్రబాబు రాకముందే ప్రసంగించి... ఆయన రాకముందే వెళ్లిపోయారు.   దీనికి పలు కారణాలు కూడా వినిపిస్తున్నాయి. బిజెపితో...పొత్తు తెంచుకోవడం 'సుజనా'కు ఇష్టం లేదట. వారితోనే కలసి వెళ్లాలనేది ఆయన ఉద్దేశ్యమట. కానీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా.. ఇంకా బీజేపీతో ఉంటే ఏపీ ప్రజల్లో టీడీపీపై వ్యతిరేకత ఇంకా పెరుగుతుందని భావించి చంద్రబాబు వారితో తెగదెంపులు తెంచుకున్నారు. అందుకే సుజనా కాస్త అసంతృప్తితో ఉన్నారట. అందుకే పార్టీ కార్యక్రమాల్లో గతంలో పాల్గొన్నంత ఇంట్రస్టింగ్ గా పాల్గొనడం లేదట. ప్రస్తుతం తనకు సంబందించిన వ్యాపార విషయాలపై ఎక్కువ శ్రద్దపెడుతున్నారని, ఢిల్లీలో బిజెపి నాయకులతో కలసి తిరుగుతున్నారని... ఆయన పార్టీలో ఉండడం కష్టమేనని..ఓ సీనియర్‌ టిడిపి నేత వ్యాఖ్యానించారు. ఇక ఆయన మాటలను నిజం చేస్తూ... .'సుజనా' 'జనసేన' పార్టీలోకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపిలోకి ఆయన వెళ్లలేరు...అందుకే 'జనసేన'ను ఎంపిక చేసుకున్నారని... ఇప్పటికే..తనకు చెందిన ఛానెల్‌ను..'జనసేన'కు అనుకూలంగా మార్చారని...'ప్రస్తుతం 'పవన్‌' సభలకు, కార్యక్రమాలకు ఆయన ఆర్థిక సహాయం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

శ్రీకృష్ణుని ఆలయంపై పాకిస్తాన్ సంచలన నిర్ణయం....

పాకిస్తాన్ లో ఉన్న శ్రీకృష్ణుని ఆలయంపై ఆదేశం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం అక్కడి హిందువులను షాక్‌తో పాటు, ఒకింత ఆనందానికి గురిచేసింది. అదేంటంటే..  రావల్పిండి, ఇస్లామాబాద్‌ జంటనగరాల్లో పురాతన శ్రీకృష్ణుడి ఆలయం ఉంది ఒక్కటే. శ్రీకృష్ణుడి ఆలయ అభివృద్ధికి దాదాపు 20 మిలియన్ల రూపాయలు కేటాయించి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రావిన్స్‌ అసెంబ్లీలో హిందూ సభ్యుడి సిఫార్సు మేరకు ఈ నిధులు మంజూరు చేసినట్లు అదనపు పరిపాలనాధికారి మహ్మద్‌ ఆసిఫ్‌ తెలిపారు. నూతన ఆలయ నిర్మాణం పూర్తైయ్యంత వరకూ విగ్రహాలను భద్రపరుస్తామని ఆసిఫ్‌ పేర్కొన్నారు.   కాగా 1897లో కంజీమాల్, రామ్‌ రచ్‌పాల్‌ అనే ఇద్దరు ఈ గుడిని నిర్మించారు. 1970లో పాక్‌ ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ట్రస్టు ప్రాపర్టీ బోర్డు పరిధిలోకి ఈ ఆలయం వెళ్లింది. ఇక్కడ ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం ఈ దేవాలయంలో పూజలు జరుగుతుంటాయి. ఈ గుడికి సంబంధించిన ప్రాంత పరిధిని పెంచాలని స్థానిక హిందువులు గత కొంత కాలంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్న నేపథ్యంలో పాక్‌ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ అభివృద్ధికి త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గుడి  కనీసం 100 మంది భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉందని, దాన్ని విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు వెల్లడించారు.

యాడ్యురప్ప బేరసారాలు.. బయటపెట్టిన కాంగ్రెస్

ఇప్పటికే కర్ణాటకలో బలపరీక్షలో ఏం జరగుతుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక బలపరీక్ష సమయం దగ్గర పడుతున్న కొద్ది కొత్త కొత్త ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా యడ్యూరప్ప కాంగ్రెస్ పార్టీ నేతలపై బేరాసారాలకు దిగిన ఆడియో టేపులు బయటపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఆడియో టేపులను బయటపెడుతోంది. ఆడియో టేపులో ఉందంటే.. యడ్యూరప్ప: ఎక్కడున్నారు? పాటిల్: బస్సులో ఉన్నాం. కొచ్చికి వెళుతున్నాం. యడ్యూరప్ప: కొచ్చికి వెళ్లకు. వెనక్కి వచ్చేయ్. పాటిల్: నా పొజిషన్ ఏమిటో ముందు చెప్పండి. యడ్యూరప్ప: యూ విల్ బికమ్ మినిస్టర్. కావాల్సినంత సాయం కూడా చేస్తాం. పాటిల్: నాతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. యడ్యూరప్ప: వాళ్లను కూడా పిలుచుకుని రా. ఇంకా ఏమైనా కావాలంటే శ్రీరాములుతో మాట్లాడతా. పాటిల్: అలాగే అన్నా. యడ్యూరప్ప: ఏం చేయాలనుకుంటున్నావు? పాటిల్:  మీరు చెప్పినట్టే చేద్దాం. ఐదు నిమిషాల్లో మళ్లీ ఫోన్ చేస్తా.

కర్ణాటకలో బీజేపీ నెగ్గేస్తుందా!

  ఇప్పుడు దేశం అంతా కర్ణాటక వైపే చూస్తోంది. అక్కడ ప్రజాస్వామ్యం ఎన్ని మెలికలు తిరుగుతోందో గమనిస్తోంది. మోదీ ప్రచారం పుణ్యమా అని బీజేపీ 100 మార్కుల దాటేసింది. కానీ మ్యాజిక్‌ ఫిగర్‌కు మరో 8 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీనికి తెలుగువారి ఓట్లే కారణం అన్న చర్చ లేకపోలేదు. అయినా బీజేపీ పెద్దలు ప్రజా తీర్పుని ఆమోదించే పరిస్థితుల్లో లేరు. ఎలాగైనా దక్షిణాదిన పాగా వేయాలనే పట్టుదలతో వారు సామదానబేధదండోపాయాలను అమ్ములపొదిలోంచి బయటకు తీస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శిబిరం నుంచి జంప్‌ అయిపోయినట్లు వార్తలు వచ్చేశాయి. మరికొంతమంది తీరు కూడా అనుమానాస్పదంగానే ఉంది. దీనికి తోడు కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలను మభ్యపెట్టేందుకు గాలిలాంటి దళారులు రంగంలోకి దిగారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే పక్షపాతిగా పేర్కొన్న బోపయ్యను స్పీకర్‌గా నియమించడం మరో ఎత్తు. బోపయ్య యడ్యూరప్పకు వీరవిధేయుడు. యడ్యూరప్పను కాపాడేందుకు ఉచ్చనీచాలను పెద్దగా పట్టించుకోనివాడు. ఇలాంటి దశలో ఎలాగొలా తమను బోపయ్య కాపాడేస్తాడనే నమ్మకంలో బీజేపీ శ్రేణులు ఉన్నాయి. అప్పటికప్పుడు ఏదో ఒక వంకతో కొందరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి పరిస్థితులను తిరగతిప్పేయడంలో బోపయ్య సిద్ధహస్తుడు. కొందరు ఎమ్మెల్యేలు గట్టు దాటినా, కొందరు గైర్హాజరైనా ఆయన పని మరింత సులువైపోతుంది. ఇలాంటి వాతావరణం మధ్య ఇవాళ తలపెట్టే కర్ణటక బలపరీక్షలో బీజేపీనే నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఆ తర్వాత మళ్లీ రచ్చ మొదలవ్వకా తప్పదు. సుప్రీం తలుపులు బాదకా తప్పదు! ప్రజాస్వామ్యానికి ఎన్ని కష్టాలో!

బీజేపీ గుట్టు రట్టు... గోడ దూకేయ్.. బయటే కారుంది

  కన్నడ రాజకీయాల్లో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీజేపీ అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. అలా అధికారం చేపట్టారో లేదో అప్పుడే బల నిరూపణ కోసం కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలకు గాలం వేయడం స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరు నగర శివారులోని ఈగల్టన్‌ రిసార్టులో బస చేస్తున్న జేడీఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు పోలీసులు ఆకస్మికంగా భద్రత ఉపసంహరించుకున్నారు. ఇదంతా బీజేపీ కుట్రలో భాగమే అని.. తమ ఎమ్మెల్యేలను తమవైపుకు లాక్కోవడానికే ఇలాంటి చర్యలు చేపడుతున్నరాని ఆరోపించాయి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు. ఈ ఆరోపణలు నిజమని తాజాగా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.   కాంగ్రెస్ చెప్పిన దాని ప్రకారం.. నేను రిసార్టులో ఉండగా.. నన్ను గోడ దూకి ఎలాగైనా బయటికి రావాలని ఓ ఫోన్ వచ్చింది. అంతేగాక. రిసార్టు బయటే ఓ కారు మీ కోసం వేచి ఉందని చెప్పారు' అని తనకు వచ్చిన ఫోన్ కాల్ గురించి చెప్పారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన రెండు పార్టీలు వెంటనే..  తమ ఎమ్మెల్యేలను కేరళకు తరలించాలనుకున్నారు. ప్రత్యేక విమానంలో కేరళకు తరలించాలనుకున్నారు కానీ.. పౌరవిమానయాన శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో ప్లాన్‌ మార్చారు. ఎమ్మెల్యేలందరినీ ప్రత్యేక బస్సుల్లో ఎక్కించి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య హైదరాబాద్‌కు తరలించారు. ఎమ్మెల్యేలను సురక్షితంగా కాపాడుకోవడానికి హైదరాబాదే సరైన ప్రదేశమని కాంగ్రెస్‌, జేడీఎస్‌ భావించి ఇక్కడికి తరలించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముందుగా పార్క్‌ హయత్‌కు వెళ్లాలని భావించిన ఎమ్మెల్యేలు.. భద్రతా పరంగా అనుమానాలు వ్యక్తం కావడంలో ప్లాన్‌ మార్చుకున్నారు. దీంతో జేడీఎస్‌ ఎమ్మెల్యేలు నోవాటెల్‌ హోటల్‌కు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తాజ్‌కృష్ణకు చేరుకున్నారు. కర్ణాటక ఎమ్మెల్యేలు బస చేసిన హోటళ్ల‌ వద్ద హైదరాబాద్‌ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. హోటళ్లలోకి ఇతరులెవరినీ పంపించడం లేదు. ముఖ్యమైన వారిని సైతం క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. మొత్తానికి బీజేపీ బలనిరూపణలో ఎలాగైనా గెలవాలని అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు బాగానే కష్టపడుతున్నాయి. బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇంకా ఏడుగురు ఎమ్మెల్యేలను ఎలాగైనా తమ వైపుకు లాక్కోవాలని విశ్వ ప్రయత్నాలే చేస్తోంది. మరోపక్క కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలు బీజేపీకి ప్రలోభపడకుండా.. వారిని కాపాడుకునే పనిలో ఉన్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో..

కర్ణాటక బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై పవన్...నాకు ముందే తెలుసు..

  కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దాంతో జేడీఎస్ పార్టీ కీలకంగా మారిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు జేడీఎస్ తో పొత్తుపెట్టుకోవడానికి బాగానే ప్రయత్నాలు చేసింది. అయితే జేడీఎస్ మాత్రం బీజేపీకి షాకిచ్చి.. కాంగ్రెస్ కు మద్దతిచ్చిందనుకోండి. కాంగ్రెస్ కూడా తాము అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు.. బీజేపీ మాత్రం రాకూడదూ అన్న నేపథ్యంలో కుమార స్వామికి ఏకంగా ముఖ్యమంత్రి పదవినే ఆఫర్ చేశారు. దాంతో జేడీఎస్ కూడా కాంగ్రెస్ కు మద్దతిచ్చింది. కానీ కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు మొత్తం బూడిదలో పోసిన పన్నీరైపోయాయి. కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉంది కాబట్టి.. బీజేపీ పెద్దలు చక్రం తిప్పారు. మ్యాజిక్ ఫిగర్ దాటకపోయినా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుకు చేయడానికి గవర్నర్ గారు అనుమతిచ్చేశారు. ఇక బీజేపీ చేసిన పనికి ఇప్పుడు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలతో పాటు.. బీజేపీ విపక్ష పార్టీలన్నీ మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   ఇదిలా ఉండగా ఇప్పుడు కర్ణటాకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ విషయం తనకు ముందే తెలుసని అన్నారు. ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... నెల రోజుల క్రితమే తాను కొంత మంది అధికారులను కలిసినప్పుడు తనతో ఈ విషయంపై పలు విషయాలు పంచుకున్నారని అన్నారు. కర్ణాటకలో బీజేపీకి 90లోపు సీట్లు వచ్చినప్పటికీ బీజేపీయే అధికారంలోకి వస్తుందని అన్నారని, వారి విధానాలు వారికి ఉన్నాయని...అవేంటో అందరికీ తెలుసని, దాని గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదని అన్నారు. అంతేకాదు... దీనిని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు.. ఎందుకంటే.. అన్ని పార్టీల్లోనూ లోపాలు ఉన్నాయి..ఎమ్మెల్యేల కొనుగోలు అనేది అన్ని పార్టీలు అనుసరిస్తున్నాయని..దశాబ్దాల నుంచి ప్రజాస్వామ్య పద్ధతులని నీరు గార్చుతూ తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఒక్క బీజేపీ మాత్రమే కాదని, టీడీపీ, వైసీపీ కూడా ఎమ్మెల్యేలను కొంటున్నాయని, అన్ని పార్టీలు బేరసారాలు చేస్తూనే ఉన్నాయని, ఈ పరిస్థితికి చరమగీతం పాడాలని కోరుకునే వారిలో తానూ ఒకరినని అన్నారు.

చంద్రబాబు, కేసీఆర్ సహకరించాలి..

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఎంత ఉత్కంఠ రేకెత్తించాయో తెలుసు. ఇక ఫలితాలు వచ్చిన తరువాత హంగ్ ఏర్పడటంతో ఎవరు అధికారం పడుతారో కూడా అందరూ ఆసక్తికరంగా ఎదురుచూశారు. బీజేపీ 104 స్థానాలు, కాంగ్రెస్ 78 స్థానాలు, జేడీఎస్ 38 రావడంతో.. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోకపోవడంతో హంగ్ ఏర్పిడింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేశారు. కానీ జేడీఎస్ మాత్రం బీజేపీకి షాకిచ్చి కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది. దీంతో ఇంకేముంది కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది అనుకున్నారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీదే హవా కాబట్టి.. వాళ్లు చక్రం తిప్పేశారు. దానిలో భాగంగానే గవర్నర్ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కూడా ఇచ్చేశారు. దీంతో యడ్యూరప్ప సీఎంగా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు.  బెంగళూరులోని రాజ్ భవన్ లో గవర్నర్ వాజూభాయ్ ఆయనతో ప్రమాణం చేయించారు.   ఇదిలా ఉండగా బీజేపీ చేసిన పనికి జేడీఎస్ నేత కుమారస్వామి కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ కలసి ఐకమత్యంతో పోరాడాల్సిన సమయం వచ్చిందని, తమ పోరాటానికి కలసి రావాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, టీఆర్ఎస్ నేత కేసీఆర్ తమకు సహకరించాలని జేడీఎస్ నేత కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. ఇటీవల కేసీఆర్ స్వయంగా బెంగళూరుకు వెళ్లి కుమారస్వామి, దేవెగౌడలతో తృతీయ కూటమిపై చర్చలు జరిపి వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా కలసి పోరాడాలని నిర్ణయించుకున్నందునే ఇప్పుడు తమకు మద్దతివ్వాలని కేసీఆర్ ను కుమారస్వామి కోరినట్టు తెలుస్తోంది. ఇక చంద్రబాబు కూడా బీజేపీతో తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో, ఆయన వైపు నుంచి కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కుమారస్వామి భావిస్తున్నట్టు సమాచారం. మరి కేసీఆర్, చంద్రబాబు దీనిపై ఎలా స్పందిస్తారో మరి చూద్దాం..

ఇవి సర్కారు హత్యలే...

  తూర్పుగోదావరి జిల్లా మంటూరు పశ్చిమగోదావరి జిల్లా కోండ్రుకోట సమీపంలోని వాడపల్లి మధ్య గోదావరి నదిలో పడవ మునిగిపోయి ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ భారీ వర్షం, గాలుల ధాటికి నీట మునిగింది. ఇక ఈ ప్రమాదంలో 40మందికి పైగా గల్లంతయ్యారు. లాంచీ అరవై అడుగుల లోతులో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నీటిలో ఉన్న లాంచీ అద్దాలు పగలగొట్టినా దాని లోపలకి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని, లాంచీ తలుపులు తెరిచేందుకు ఎంత యత్నించినా సాధ్యం కాలేదని కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. మృతదేహాలు కూడా పడవలోనే చిక్కుకుని ఉండిపోవడంతో సహాయ బృందాలకు సవాల్‌గా మారింది. అయితే  పడవకు తాళ్లు కట్టి భారీ క్రేన్ల సాయంతో దాన్ని ఎట్టకేలకు ఒడ్డుకు తీసుకొచ్చారు. అందులో చిక్కుకుని ఉన్న మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికితీస్తున్నారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దసేపటి క్రితం హెలికాప్టర్లో ప్రమాద స్థలానికి చేరుకుని సహాయచర్యలను పరిశీలిస్తున్నారు. ఆయన వెంట పలువురు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.     ఇక ఈఘటనపై స్పందించిన ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి ఎప్పటిలాగే  ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన ఆయన... "ఇది చాలా బాధ కలిగించిన ఘటన. దాదాపు 40 మంది మృతి చెందారు. వీటిని సర్కారు హత్యలుగానే పరిగణించాలి. గతేడాది నవంబరులో కృష్ణా జిల్లాలో చంద్రబాబు ఇంటికి కొద్ది దూరంలోనే ఓ బోటు మునిగింది. అప్పట్లో 20 మందికి పైగా చనిపోయారు. ఇప్పటికీ ప్రభుత్వం మేల్కోలేదు. లైసెన్సులు లేకుండా బోట్లను తిప్పుతున్నారు. వారు లంచాలు ఇస్తున్నారు... అందుకే ముఖ్యమంత్రి ఇటువంటి ఘటనలపై స్పందించరు. ఐదు రోజుల కిందటే ఓ బోటులో అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎవ్వరూ చనిపోలేదు. అది జరిగిన ఐదురోజులకే మళ్లీ మరో బోటు నీళ్లలో మునిగిపోయింది. దాదాపు 40 మంది చనిపోయారు. మంత్రుల దగ్గరనుంచి చంద్రబాబు వరకు లంచాలు అందుతున్నాయని మండిపడ్డారు.

ఆళ్లకు ఏసీబీ నోటీసులు.. ఇప్పుడేమంటావ్ సామి...!

  బినామీ ఆస్తుల కేసుల విచారణలో భాగంగా ఏపీ ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఏసీబీకి అది కామన్ ధింగే కదా అని అనుకుంటున్నారా..? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇంతకీ నోటీసులు పంపించింది ఎవరికి అనుకుంటున్నారా..? ఆయనెవరో కాదు.. తానో సత్య హరిశ్చంద్రుడిలా.. అసలు ఏ తప్పు చేయనివాడిలా మాట్లాడే వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. బినామీ ఆస్తుల కేసులో విచారణలో హాజరు కావాలంటూ ఏపీ ఏసీబీ ఈయనకు నోటీసులు జారీ చేసింది. అసలు సంగతేంటంటే..   డీఎస్పీ దుర్గాప్రసాద్ ఆస్తులపై తనిఖీలు జరిపిన ఏసీబీ పలు అక్రమాస్తులను వెలికి తీసిన సంగతి తెలిసిందే. గుంటూర, చీరాల, ఒంగోలు, హైదరాబాద్ సహా 14 చోట్ల తనిఖీలు చేసి.. ఇళ్లు, ఫ్లాట్లతో పాటు కార్లు, బంగారం 3 కిలోల వెండి ఇంకా పలు అక్రమాస్తులు బయటకు తీశారు. అంతేకాదు.. ఈ తనిఖీల్లో పలు ఆసక్తికర విషయాలు కూడా బయటపడ్డాయి. ఆయన తిరిగే కారు ఆ జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడి పేరుతో ఉంటే.. ఆయన బినామీ ఆస్తులు ప్రతిపక్ష ఎమ్మెల్యే భార్య పేరిట ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దుర్గాప్రసాద్ కు చెందిన పలు ఆస్తులకు ఆళ్ల బినామీగా ఉన్నారని ఏసీబీకి సమాచారం ఉంది. దీంతో విచారణకు హాజరుకావాలని ఐపీసీ సెక్షన్ 160 కింద అళ్లకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. మొత్తానికి ఇన్ని రోజులు నీతి కబుర్లు చెబుతూ.. జగన్ కు బినామీగా కోర్టుల్లో.. ట్రిబ్యునళ్లలో పిటీషన్లు వేసి ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతున్న ఆళ్ల ఇప్పుడు అవినీతి అధికారులకు కూడా బినామీ అని తేలిపోయింది. మరి ఇప్పుడు దీనిపై ఆళ్ల ఎలా స్పందిస్తాడో.. ఎలా కవర్ చేస్తాడో చూద్దాం...

బీజేపీ చెప్పేదంతా అబద్దం.. మేమంతా ఒకటే...

  అనుకున్నట్టుగానే కర్ణాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో జేడీఎస్ కీలకంగా మారిన సంగతి కూడా విదితమే. మరోపక్క బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జేడీఎస్ పార్టీని తమవైపు లాక్కునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఇప్పటికే జేడీఎస్ తో సంప్రదింపులు జరిపిన కాంగ్రెస్ జేడీఎస్ కు బయట నుంచి మద్దతు ఇస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పేశారు. అంతేకాదు కుమార స్వామిని ముక్యమంత్రిగా చేసేందుకు కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసింది.  బీజేపీ కూడా రంగంలోకి దిగి ఎలాగైన అధికారం చేపట్టాలని చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేస్తే  బీజేపీ దేవెగౌడ పెద్ద కొడుకు రేవణ్ణకు డిప్యూటీ సీఎం పదవిని ఇస్తామని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. రేవణ్ణ వెనకాల దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన 12 మంది ఎమ్మెల్యేలతో తమకు మద్దతు ఇస్తున్నారని కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిసిన బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప ప్రకటించారు. దీంతో ఇప్పుడు జేడీఎస్ లో చీలిక ఏర్పడే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి.   అయితే ఇప్పుడు ఈ వార్తలపై స్పందించిన జేడీఎస్ అధినేత దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ మీడియాతో మాట్లాడుతూ... తామంతా ఒక్కటేనని, తమలో చీలిక లేదని రేవణ్ణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి కూడా మాట్లాడుతూ... తనను జేడీఎస్ శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు. మత విద్వేషాలు రెచ్చకొట్టి బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందిందని చెప్పారు. ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీతో కలవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వైపు రాకపోతే ఇన్కమ్ టాక్స్ రైడ్ లు వంటివి చేయిస్తామని కేంద్రప్రభుత్వ సంస్థలతో తమ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీజేపీని నిరోధించేందుకు తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తామన్నారు. మరి దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూద్దాం...