నిందలు మోపిన ఏపీ బీజేపి! నితిన్ పొగడ్తల వర్షం!

ఈ మధ్య కాలంలో తెలంగాణ బీజేపికి ఓ చిక్కు సమస్య వచ్చిపడుతోంది. ఒక్కసారి కాదు. పదే పదే వస్తోంది! అదేంటంటే… రాష్ట్ర బీజేపి నాయకులు కేసీఆర్ ని ఎడాపెడా విమర్శిస్తారు. ఆయన పాలన, పథకాలు దండగంటారు. కానీ, అంతలోనే కేంద్ర మంత్రులో, బీజేపీ పెద్దలో తెలంగాణకి వచ్చి సీఎం భేష్ అంటారు. పథకాలు సూపర్ అంటారు! ఇంకేముంది, టీ బీజేపీ నాయకులది కుడితిలో పడ్డ వ్యవహారం అవుతుంది! అయితే, తాజాగా ఏపీ బీజేపీ నాయకులకి కూడా పరిస్థితి అలాగే తయారైంది.     చంద్రబాబు నాలుగేళ్లు కమలంతో చెలిమి చేసినప్పుడు ఏపీ బీజేపీ నాయకులకి పెద్ద ఇబ్బందులు వుండేవి కావు. చంద్రబాబుని మిత్ర ధర్మంతో విమర్శించే వారు కాదు. జగన్ ను కూడా ఏమంత పెద్దగా టార్గెట్ చేయకుండానే బండి లాగించేసే వారు. కానీ, ప్రత్యేక హోదా విషయంలో బాబు సీరియస్ అయ్యాక పరిస్థితి తలకిందులైంది. రాత్రింబవళ్లూ టీడీపీని టార్గెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అందుకే, పూర్తి స్థాయిలో సోము వీర్రాజు లాంటి వారు బాబు మీద నోరు చేసుకుంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ కూడా రోజుకో ప్రెస్ మీట్ తో విరుచుకుపడుతున్నాడు. అయితే, ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వటం లేదన్న చంబ్రాబాబు ప్రశ్నకి ఎవరి వద్దా సమాధానం లేదు. అది పక్కన పెడితే… ఎలాగో మాటల గారడి చేసి ఏపీ సీఎంను ఇరుకున పెట్టినా… బీజేపీ పార్టీ అగ్రనేతలే రాష్ట్ర పార్టీ నాయకుల విమర్శలపై నీళ్లు చల్లుతున్నారు!     ఆంధ్రాలో పర్యటించిన నితిన్ గడ్కరీ చాలా వరకూ పాజిటివ్ కామెంట్సే చేశారు. భారీ నీటి పారుదల శాఖా మంత్రి అయిన ఆయన పోలవరం ప్రత్యక్షంగా సందర్శించారు. పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత విశాఖలోనూ అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, వీటన్నటిలో ఏపీ బీజేపీ నాయకులకి పచ్చి వెలక్కాయల పరిణమించిన కామెంట్స్ … చంద్రబాబు గురించి నితిన్ గడ్కరీ అన్న మాటలే! గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పని చేసిన నితిన్ గడ్కరీ కేవలం మంత్రిగా మాట్లాడేస్తారని అనుకోలేం. కానీ, ఆయన ఎంతో రాజకీయ అనుభవం వున్నప్పటికీ చంద్రబాబుని నిజాయితీగా మెచ్చుకున్నారు. ఆయన విజనరీ అంటూ కితాబునిచ్చారు. పోలవరం విషయంలో బాబు పడుతోన్న తపన చాలా గొప్పదంటూ వ్యాఖ్యానించారు. ఇదంతా ప్రత్యేక హోదా విషయంలో జరుగుతోన్న రచ్చ తెలియకుండానే చేసి వుంటారా? అస్సలు కాదు. టీడీపీ ప్రత్యేక హోదా విషయంలో నేరుగా మోదీనే కారకుడ్ని చేస్తోందని తెలిసినా నితిన్ బాబుని మెచ్చుకున్నారు! ఇప్పుడు ఇదే ఏపీ బీజేపీ నాయకులకి మైండ్స్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది! తాము నిత్యం విమర్శిస్తోన్న అధికార పక్షాన్ని, సీఎంని తమ జాతీయ నేత, కేంద్ర మంత్రి పొగడ్తల్లో ముంచెత్తటం ఎవ్వరికీ జీర్ణం కావటం లేదు!     ఒకవైపు రాష్ట్ర నేతలతో తిట్టిస్తూ మరో వైపు జాతీయ నేతలతో పొగిడిస్తూ మోదీ, అమిత్ షా విచిత్ర రాజకీయమే నడిపిస్తున్నారు. దీని వల్ల చంద్రాబుకి వచ్చే నష్టమేం లేకున్నా ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఇరుకున పడుతున్నారు!

కేసీఆర్ తో కయ్యమా? వియ్యమా? తేల్చుకోలేకపోతోన్న టీ బీజేపీ!

అమిత్ షా మరోసారి తెలంగాణకి వచ్చారు! హైద్రాబాద్ లో ఒక్క రోజు పాటూ బిజి బిజీ పర్యటన చేస్తున్నారు. అసలు ఇంత హడావిడి టూర్ తో ఆయన ఏం ఆశిస్తున్నారు? ఇదే ఇప్పుడు పెద్దగా సమాధానాలు చిక్కని ప్రశ్న!     ఏ పార్టీ అయినా తమ ప్రభుత్వం ఏర్పడాలనే పావులు కదుపుతూ వుంటుంది. కానీ, ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దాదాపు అసాధ్యం. అంత బలహీనంగా వుంది పార్టీ పరిస్థితి. త్రిపురలో ఒక్క సర్పంచ్ కూడా లేకున్నా అధికారం చేపట్టామని బీజేపీ అభిమానులు వాదించవచ్చు. అయినా కూడా త్రిపుర, తెలంగాణ ఒక్కటి కాదు. ఇక్కడ టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీ బలంగా వుంది. రెండో స్థానంలో కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ కూడా తెలంగాణ వ్యాప్తంగా గట్టిగానే వుంది. ఇక మూడో స్థానానికి టీటీడీపీ, సీపీఎం, సీపీఐ లాంటి పార్టీలతో బీజేపీ పోటీ పడాల్సి వుంది. ఇటువంటి స్థితిలో కమలదళానికి మరో ఇబ్బందికర అంశం కూడా తెలంగాణలో వుంది!     అమిత్ షా గతంలో ఒకసారి తెలంగాణ పర్యటన చేసినప్పుడు కేసీఆర్ పైన ఘాటు విమర్శలే చేశారు. అందుకు ప్రతిగా స్వయంగా తెలంగాణ సీఎం ప్రతి దాడి చేశారు. కానీ, తరువాత రకరకాల సందర్భాల్లో పలువురు కేంద్ర మంత్రులు గులాబీ సర్కార్ ని మెచ్చుకుంటూ వస్తున్నారు. కేసీఆర్ పథకాల్ని బీజేపీ అగ్రనేతలు చాలా సందర్భాల్లో అభినందిస్తున్నారు. వీలైతే తమ పరిధిలో కాపీ చేస్తున్నారు కూడా! ఇదంతా చూస్తే … అసలు ఎన్డీఏలో లేనేలేని టీఆర్ఎస్ పట్లే దిల్లీ నేతల వైఖరి అనుకూలంగా వుంది. నాలుగేళ్లు కలిసున్న టీడీపీతో మాత్రం ఉప్పు నిప్పులా వుంది. ఇలా కేసీఆర్ గవర్నమెంట్ పై ఎందుకు మోదీ బృందం సానుకూలంగా వుంటోంది? రానున్న ఎన్నికల్లో మోదీకి ఎంపీలు తక్కువ పడితే ఆదుకునే ఎన్డీఏ యేతర పార్టీల్లో ప్రధానమైనవి టీఆర్ఎస్, వైసీపీలే. పోలింగ్ కి ముందు కాకున్నా తరువాతైనా కేసీఆర్, జగన్ మోదీకి అండగా నిలుస్తారని కమలదళం భావిస్తోంది. అందుకే, కేంద్ర మంత్రులు వీలైనప్పుడల్లా తెలంగాణ రథసారథని పొగిడేస్తూ వస్తున్నారు. కానీ, ఇదే తెలంగాణ బీజేపీకి తలనొప్పిగా మారింది!     తమ పార్టీ నేతలే కేసీఆర్ పథకాల్ని మెచ్చుకుంటూ వుంటే టీ బీజేపీ నాయకులకి ఎలా విమర్శలు చేయాలో తెలియని గందరగోళం ఏర్పడుతోంద. అలాగని, తెలంగాణలో ప్రతిపక్షానికే పరిమితం అయిన కాంగ్రెస్ ని కూడా వారు ఏమంత టార్గెట్ చేయలేరు. అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని ఏమనకుండా జనంలోకి ఎలా వెళ్లాల్లో తెలంగాణ బీజీపీకి అర్థం కావటం లేదు. ఈ డైలామా కారణంగానే తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పట్ల అసతంతృప్తిగా వున్న నేతలు సైతం కాషాయ కండువా కప్పుకోవటం లేదు. అసలు ఏ మాత్రం దిశా, దశా లేకుండా సాగుతోంది టీ బీజేపి! అంతా అయోమయంగా వున్న వేళ తెలంగాణలో కాలుమోపిన అమిత్ షా ఏం చేయనున్నారు? పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేసి హిందూత్వవాదుల వ్యతిరేకతకి కారణమైన కేసీఆర్ పై ముప్పేట దాడి చేయమని తన పార్టీ వారికి చెబుతారా? లేక ఎన్నికల ఫలితాల తరువాత మోదీ ప్రధాని అయ్యేందుకు కేసీఆర్ ఉపయోగపడతారని మెతక వైఖరి ప్రదర్శించమంటారా? ఇదే ఇప్పుడు తేలాల్సింది. అమిత్ షా ఇచ్చే ఆజ్ఞాలపైనే తెలంగాణ బీజేపీ యాక్షన్ ప్లాన్ ఆధారపడనుంది!   

కుల వివాదాలు పెరుగుతున్నాయి… కులం బలహీనపడుతోంది!

మామూలుగానే మన దేశంలో కులం అంటే అందరూ అలెర్ట్ అవుతారు. వందలాది ఏళ్లుగా వున్న కులం స్వతంత్రం వచ్చాక కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నికలు వస్తే మరింత మసాలా దట్టించుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రాజకీయ నాయకులు కులం పేరు చెప్పి ఓట్లు అడుగుతారు. పార్టీలు అభ్యర్థుల కులాలు చూసే సీట్లు ఇస్తుంటాయి. చివరకు, పోలింగ్ రోజున ఓటర్లు కూడా కులం ఆధారంగానే తీర్పునిస్తుంటారు! ఇంత వ్యవహారం వుంది కాబట్టే కులం ఎప్పుడూ హాట్ టాపిక్కే! కానీ, తాజాగా జరిగిన ఓ సర్వే ఇండియాలో ఆవిష్కృతం అవుతోన్న కొత్త కోణం బయటపెట్టింది!     కులం పుట్టినప్పటి నుంచీ చచ్చేదాకా చాలా ముఖ్యమే. చదువులో, ఉద్యోగంలో అంతటా కీలకమే. కానీ, పెళ్లి విషయానికి వచ్చే సరికి కులం మరింత ప్రాముఖ్యత వహిస్తుంది. వేరు వేరు కులాల వారు పెళ్లి చేసుకుంటే ఎంత రచ్చవుతుంటుందో మనం చూస్తూనే వుంటాం. పరువు హత్యల దాకా వెళుతుంటాయి కేసులు. కానీ, ఒకవైపు ఇంత కుల మౌఢ్యం వున్నా కూడా మరో వైపు ఆధునిక భారతదేశం కులాన్ని లైట్ తీసుకుంటోంది. ఇందుకు చక్కటి ఉదాహరణ ఇన్ షార్ట్ అనే యాప్ వారు నిర్వహించిన సర్వే ఫలితాలే!     ఈ ఆన్ లైన్ సర్వేలో ఒకరిద్దరు కాదు… ఏకంగా 1.3లక్షల మంది తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. అవేంటో వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతీ 10 మందిలో 8 మంది తమకు కులాంతర వివాహం ఓకే అని చెప్పారట! 70 శాతం అబ్బాయిలు పెళ్లయ్యాక అమ్మాయి తన ఇంటి పేరు మార్చుకోకున్నా ఫర్వాలేదు అన్నారట! ఇక ఎప్పుడూ అమ్మాయిల మీద జోకులేస్తూ… వాళ్లు బాగా డబ్బున్న అబ్బాయిలకి పడిపోతారని అంటూ వుంటారు. కానీ, ఈ సర్వే అది నిజం కాదని తేల్చింది. సర్వేలో పాల్గొన్న అమ్మాయిల్లో 84 శాతం మంది అబ్బాయి తమ కంటే ఎక్కువ సంపాదించాల్సిన అవసరం లేదని అన్నారట! ఇంకో విస్తుగొలిపే విషయం ఏంటంటే… నిన్న మొన్నటి దాకా వరకట్నం కోసం తహతహలాడిన అబ్బాయిలు ఇప్పుడు రూటు మార్చారు. కట్నం కాదు… పెళ్లి ఖర్చులు అమ్మాయి తరుఫు వారికి తగ్గించేందుకు సై అంటున్నారట! 90 శాతం అబ్బాయిలు వధువు తరుఫు వారికి పెళ్లి ఖర్చులు తగ్గిస్తామనీ, అవసరం అయితే తమ వంతుగా కొంత భరిస్తామనీ అన్నారట!     ఒక సర్వేలో ఇలాంటి అభిప్రాయాలు వస్తే దేశం మారిపోయినట్టు కాదు. అది అంగీకరించాల్సిన విషయమే. కానీ, అదే సమయంలో ఈ ఫలితాలు క్రమంగా పొడచూపుతున్న మార్పుకి మాత్రం ఖచ్చితంగా సంకేతమే! కులం రాజకీయాల్లో, మీడియా చర్చల్లో పెద్ద ఇంపార్టెంట్ గొడవగా కనిపించినా… ఆధునిక కార్పొరేట్ యువత రాను రాను లైట్ తీసుకుంటున్నారు. పెళ్లి విషయంలో కూడా పట్టింపుల కంటే సర్దుకుపోవటానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇలాంటి పాజిటివ్ ధోరణుల్ని ప్రభుత్వాలు, మీడియా, మేధావులు ఎంకరేజ్ చేయాలి. కానీ, దురదృష్టవశాత్తూ మన సమాజంలో రెచ్చగొట్టి పది మంది దృష్టి ఆకర్షించే వారు ఎక్కువవుతున్నారు.

పవన్ ఇమేజ్‌కు రేణు డ్యామేజ్ తప్పదా?

రాజకీయాల్లోకి దూకిన గబ్బర్ సింగ్ ఇప్పుడు ఫుల్ బిజీగా వున్నాడు. ఉత్తరాంధ్రలో తనదైన రాజకీయం చేస్తున్నాడు. యాత్ర చేస్తూ జనంతో మమేకం అవుతున్నాడు. దీని తరువాత ఆంధ్రలో మరిన్ని చోట్ల జనసేనాని కవాతు కొనసాగనుంది. అయితే, తీరా ఎన్నికల వేళ పోలింగ్ నాడు పవన్ ప్రభావం ఎంత వుంటుంది? ఇది చెప్పటం కష్టమే. ఎందుకంటే, పవన్ డ్యామేజ్ టీడీపీ, వైసీపీలకు ఎంత వుంటుందో ఎవరూ చెప్పలేని స్థితి ఏర్పడ్డది. అసలు వుంటుందా అనే అనుమానం వ్యక్తం చేసేవారూ లేకపోలేదు!     వచ్చే ఎన్నికల్లో జనసేన ఫలితాలు ఎలా వున్నా ఇప్పుడు మాత్రం పవన్ చుట్టూ వివాదాలు బాగానే ముసురుకుంటున్నాయి. రాజకీయాల్లోకి రావటం, అందులోనూ ఒక పార్టీ పెట్టి స్వంతంగా రణరంగంలోకి దిగటం మామూలు విషయం కాదు. ఇదే అదనుగా గత తప్పిదాలు, పొరపాట్లు అన్నీ బయటకు వస్తాయి. అదే జరుగుతోంది పవర్ స్టార్ విషయంలో కూడా! ఆయన గురించి ఏదైనా ఆరోపణ చేయాల్సి వస్తే ముఖ్యంగా వ్యక్తిగత జీవితమే ఈజీ టార్గెట్ అవుతుంటుంది. అందులోనూ ఆయన మూడు పెళ్లిల్లు ఎప్పుడూ వివాదాస్పదమే. విమర్శలకు కారణమే! ఎన్నికల ఫీవర్ మొదలైన ప్రస్తుత తరుణంలో కూడా మరోసారి ఆయన ట్రిపుల్ మ్యారెజెస్ తిప్పలు తెచ్చిపెట్టేలా వున్నాయి!     పవన్ రెండో భార్య రేణు దేశాయ్ చాలా కాలం సైలెంట్ గానే వున్నారు. కానీ, వున్నట్టుండీ ఈ మధ్య కామెంట్లపై కామెంట్లు చేస్తున్నారు. ఆమెను పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో టార్గెట్ చేయటం అసలు గొడవకి కారణం. అయితే, ఇదంతా పాత సంగతే. కానీ, ఈ మద్యే ఎంగేజ్ మెంట్ చేసుకుని రెండో పెళ్లికి సిద్ధమైన రేణు గతంలో ఎప్పుడూ బయటపెట్టని సంగతులు బయటపెట్టి పవన్ ను డిఫెన్స్ లోకి నెట్టేస్తున్నారు. పవన్, రేణు విడిపోవటం నిజానికి పెద్ద వివాదమేం కాదు. వారు బాహాటంగానే విడిపోయారు. డైవోర్స్ కూడా తీసేసుకున్నారు. కానీ, సమస్యంతా ఇప్పుడు ఆమె పవన్ మూడో భార్య మొదటి సంతానం గురించి చెప్పటంతోనే మొదలైంది.     పవన్ ని బాగా విమర్శిస్తూ, టీడీపీకి అనూకులంగా గొంతు వినిపించే ఓ ఛానల్లో రేణు తన బాధ వెళ్లగక్కారు. తనకి విడాకులు కూడా ఇవ్వకుండానే పవన్ మరో స్త్రీతో బిడ్డకు తండ్రయ్యాడని ఆమె చెప్పుకొచ్చారు. ఇది నిజంగా కొంత డ్యామేజింగ్ అంశమే! దానిపై యధావిధిగా సోషల్ మీడియాలో రచ్చ జరగటంతో తాజాగా రేణు దేశాయ్ పీఆర్ టీమ్ మరిన్ని వివరాలు బయటపెట్టింది. డేట్లతో సహా పవన్ తప్పును ఎత్తి చూపే ప్రయత్నం చేసింది!     2012 మార్చ్ 13న పవన్ మూడో భార్య లెజోనోవాకి పొలెనా పుట్టిందని ఫేస్బుక్ లో చెప్పిన రేణు పీఆర్ టీమ్… మార్చ్ 16న పవన్, రేణుల విడాకులు జరిగాయని గుర్తు చేసింది! అంటే, అంతకు ముందు సంవత్సర కాలం రేణు భార్యగా వుండగానే లెజోనోవా గర్భవతిగా వుందన్నమాట. ఇలా ఒకరితో చట్టబద్ధమైన వైవాహిక బంధంలోవుంటూ మరొకరితోనూ రిలేషన్ షిప్ మెయింటైన్ చేయటం… తప్పు, నేరమూ కూడా అవుతుంది! ఈ విషయంలో రేణు వ్యక్తిగతంగా పవన్ ను ఇప్పుడేం అనకపోయినా…. అదును చూసి విషయం బయటపెట్టడం… కాస్త ఆసక్తికరం, ఆందోళనకరమే! ఎన్నికలకి ముందు ఇలాంటి విషయాలు పవన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తాయనే చెప్పాలి. మరి ఓట్ల రూపంలో ఎంత నష్టం వాటిల్లుతుందో ప్రస్తుతానికైతే సస్పెన్సే!

కాశ్మీర్‌పై మోదీ సరికొత్త వ్యూహం… అసలుకే మోసమా?  

దేశంలో చాలా చోట్ల వలస రాజకీయాలు జరుగుతున్నాయి. ఒక పార్టీ నుంచీ గెలిచి మరో పార్టీలోకి దూకేవారు మరీ ఎక్కువైపోతున్నారు. ఇందుకు తెలుగు రాష్ట్రాలు కూడా మినహాయింపేం కాదు. అయితే, దేశాన్ని ఏలుతోన్న బీజేపీ కూడా ఈ విషయంలో తక్కువేం తినలేదు. ఎంపీల విషయంలో బేరసారాలు చేసే అవసరం మోదీ సర్కార్ కు లేదు. కానీ, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాల విషయంలో చాలా చోట్ల ఎమ్మెల్యేల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతూనే వున్నాయి. దక్షిణాదిలో తమిళనాడులో, కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు ఓ రేంజ్లో నడవటం మనం చూశాం. అయితే, ఉత్తరాదిలోనూ కమలం జంప్ జిలానీలతో రాజకీయం రక్తి కట్టిస్తోంది. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను దారుణంగా దెబ్బతీశారు అమిత్ షా. ఎన్నికలకు ముందు తరువాత అన్న భేదం లేకుండా వలలు వేసి పట్టేశారు. తమ ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లో అయితే అధికారంలో వున్న కాంగ్రెస్ ని అమాంతం కూల్చేశారు! ఇక ఇప్పుడు ఇదే అమిత్ షా మార్కు రాజకీయం వివాదాస్పద జమ్మూ కాశ్మీర్ కు మారటంతో అందరి దృష్టి పార్టీ ఫిరాయింపు పాలిటిక్స్ పై పడింది!     కాశ్మీర్ దేశంలోనే అత్యంత సున్నితమైన సమస్యాత్మక రాష్ట్రం. దానితో పదే పదే మన కేంద్ర ప్రభుత్వాలు తప్పుగా వవ్యహరించి సమస్య మరింత జటిలం చేస్తూ వచ్చాయి. గతంలో అనేక సార్లు కాశ్మీర్ అంశంతో కాంగ్రెస్ ఆటలాడింది. ఇప్పుడు బీజేపీ సర్కార్ కూడా వివాదాస్పద ధోరణి ప్రదర్శిస్తూ ముందుకు సాగుతోంది. చివరకు దీని ఫలితం మంచా? చెడా? తెలియని విధంగా పరిస్థితి నెలకొంటోంది. తాజాగా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చేసిన ఘాటు కామెంట్ అందుకు నిదర్శనం! దిల్లీ పెద్దలు పీడీపీ పార్టీని చీల్చాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా వుంటాయని ముఫ్తీ హెచ్చరించారు. ఇందుకు కారణం పీడీపీలోని అనేక మంది అసంతృప్త ఎమ్మెల్యేలతో రామ్ మాధవ్ లాంటి బీజేపీ నేతలు టచ్ లో వుండటమే. ఈ మధ్యే పొత్తుకు స్వస్తి చెప్పి ప్రభుత్వాన్ని కూల్చిన కమలదళం ఇప్పుడు కొత్త ఎత్తులు వేస్తోంది. మెహబూబా ముఫ్తీ పార్టీని చీల్చి తమ స్వంత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తోంది. అదే జరిగితే పీడీపీ ఇక చరిత్రలో కలిసిపోవాల్సిందే. అందుకే, తాము హింసకైనా సిద్దమన్నట్టు మాట్లాడుతోంది మెహబూబా.     దేశంలోని ఇతర రాష్ట్రాల్లో బీజేపీ తమ ప్రభుత్వాలు వుండాలనుకోవటం వేరు. కాశ్మీర్ విషయంలోనూ అదే నీతి ప్రద్రర్శించటం వేరు. ఎందుకంటే, సమస్యాత్మకంగా వున్న రాష్ట్రంలో ఎమ్మెల్యేలతో బేరాసారాలు నడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే జనం రెచ్చిపోయే ప్రమాదం వుంది. వేర్పాటు వాదులు మరింత రెచ్చగొట్టే అవకాశమూ వుంది. ఇక పాకిస్తాన్ ఎలాగూ గోతి కాడి నక్కలా చూస్తూనే వుంటుంది. కాబట్టి ప్రస్తుతం గవర్నర్ పాలన విధించిన కేంద్ర ప్రభుత్వం అదే కొనసాగించి సాధ్యమైనంత త్వరగా జమ్మూ కాశ్మర్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా గోడ దూకిన ఎమ్మెల్యేలతో సర్కార్ ఏర్పాటు చేస్తే నిత్యం రాష్ట్రమంతా గందరగోళం నెలకొనవచ్చు. దాని పై సరైన అంచనా వుండాల్సిందే! కొందరి అభిప్రాయం ప్రకారం బీజేపీ పీడీపీ పార్టీని చీల్చి తమ ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి కారణం… ఆర్టికల్ 370 నిర్మూలనట! రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం లేనిదే ఆ ఆర్టికల్ తీసేయటం కుదరదు. కాబట్టి తమ ప్రభుత్వం ఏర్పాటు చేసి తీర్మానం చేయించి ఆర్టికల్ 370 తొలగిద్దామని మోదీ ఆలోచిస్తున్నారట. ఇది హర్షించదగిని వ్యూహమే అయినా సులవైంది మాత్రం కాదు. ప్రజా వ్యతిరేకత, దాన్ని తమకు అనుకూలంగా వాడుకునే ఉగ్రవాదులు పెను సవాళ్లు అయ్యే ప్రమాదం పొంచి వుంది. కాబట్టి మోదీ ఏం చేసినా ఆచితూచి చేయాలి. లేదంటే లాభం కంటే ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదముంది. పైగా పాకిస్తాన్ ఈ వ్యవహారమంతా అంతర్జాతీయంగా తనకు అనుకూలం చేసుకునే వీలు కూడా వుంది!

కేటుగాడు.. కోట్లు కొట్టేసాడు.

  'మేడి పండు చూడు మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడు పురుగులుండు' అన్నట్టుగా.. ఓ వ్యక్తి ఉన్నాడు.. మెడలో భారీ గోల్డ్ చైన్, చేతికి బ్రాస్ లెట్, అన్ని వేళ్లకు ఉంగరాలు, వంటిమీద ఖద్దరు డ్రెస్, తిరగడానికి ఖరీదైన కార్లు.. అబ్బో, అతను పైకి చూడటానికి అంబానీలా కనిపిస్తాడు.. కానీ లోపల ఒరిజినల్ క్యారక్టర్ పెద్ద మోసగాడు, కేటుగాడు.. అతనే ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన నైనాల చంద్రశేఖర్‌.. ఒకప్పుడు గ్రానైట్‌ కంపెనీల వద్ద లారీ డ్రైవర్‌ గా పనిచేసిన ఇతను.. తరువాత గ్రానైట్ కంపెనీ కొనే స్థాయికి ఎదిగాడు.. అతను ఆ స్థాయికి చేరడానికి కష్టాన్ని నమ్ముకోలేదు మోసాన్ని నమ్ముకున్నాడు.. డ్రైవర్ గా పనిచేసేటప్పుడు లారీలో గ్రానైట్‌ లోడుతో ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు.. దొంగ బండ్లు కొని, అమ్మే అక్కడి ముఠాలతో పరిచయం ఏర్పడింది.. ఆ ముఠాలతో కలిసి జేసీబీలను కాజేసి అమ్మడం చేసేవాడు.. వాటికి తప్పుడు పత్రాలు సృష్టించి, వాటిని ఆర్‌టీఏ కార్యాలయంలో అందజేసి సుమారు రూ.లక్ష వరకు రోడ్డు ట్యాక్స్‌ చెల్లించి స్థానిక రిజిస్ట్రేషన్‌ పొందేవాడు.. ఆ తరువాత ఆ వాహనం అమ్మేసేవాడు.. తర్వాతర్వాత ఆ మోసాన్ని కార్లు, జీపులకు కూడా విస్తరించాడు.. ఇలా చూస్తుండగానే కోట్ల రూపాయల సొమ్ము వెనుకేసుకొన్నాడు.. ఏడాది తిరిగేసరికి ఒక గ్రానైట్‌ కంపెనీనే కొనేసే స్థాయికి ఎదిగిపోయాడు.. 2015లో తన భార్య అపర్ణ పేరిట చీమకుర్తిలో ఒక కంపెనీ ఏర్పాటుచేశాడు.. ఒంగోలులో రెండు కోట్లు పెట్టి ఒక ఇల్లు కూడా కట్టాడు. మరి చంద్రశేఖర్ కి కొన్నాళ్ళకు ఇలా వాహనాలు కొట్టేయడం అమ్మడం బోర్ కొట్టిందేమో.. కొత్త తరహా మోసం మొదలు పెట్టాడు.. ముందుగా షోరూమ్ కు వెళ్లి ఓ ఖరీదైన వాహనాన్ని కొనుగోలు చేస్తాడు.. ఆ తరువాత ఆ వాహనంపై ఏదో ఒక ఫైనాన్స్‌ సంస్థ నుంచి రుణం తీసుకుంటాడు.. అయితే దొంగ పత్రాల సృష్టి అనుభవంతో దానిపై అప్పు తీర్చకుండానే, అంతా డబ్బు కట్టేసినట్టు ఓ నకిలీ ఎన్‌వోసీ సృష్టిస్తాడు.. ఆ పత్రాలు ఆర్‌టీఏ కార్యాలయంలో చూపించి, దానికి క్లియరెన్స్‌ పొందుతాడు.. తిరిగి అవే పత్రాలతో మరో ఫైనాన్స్‌ సంస్థను సంప్రదించి, అక్కడ నుంచి మరోసారి రుణం పొందుతాడు.. ఇలా మూడు నాలుగు సంస్థల నుండి రుణాలు పొందుతాడు.. అతనికి కోట్ల రూపాయల డబ్బు వచ్చిపడుతుంది.. ఇదంతా ఓ సినిమా కథని తలపిస్తుంది కదా.. సముద్రమంతా ఈది ఇంటిముందు మురికి కాలువలో పడి చనిపోయినట్టు.. చంద్రశేఖర్ కూడా మోసాలు చేస్తూ కోట్లు సంపాదించి, చివరికి చిక్కాడు.. చంద్రశేఖర్ ఇటీవల గుంటూరుకు చెందిన ఓ వ్యక్తికి 30 లక్షలకు రెండు ఇన్నోవా కార్లను అమ్మాడు.. అమ్మేటప్పుడు ఈ వాహనాలకు రిజిష్ట్రేషన్‌ తో సహా అన్ని డాక్యుమెంట్లూ ఉన్నాయని చెప్పాడు.. అయితే ఎన్నిరోజులైనా క్లియరెన్స్‌ డాక్యుమెంట్లు ఇవ్వకపోతుండటంతో ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది.. దీంతో నేరుగా ఆర్‌టీఏ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా అనుకోకుండా ఇతగాడు చేస్తున్న మోసం బయటపడింది.. వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

ఆంధ్రా కాంగ్రెస్‌కు ఓ ఆశాకిరణం!

సమైక్యాంధ్ర చివరి ముఖ్యమంత్రి ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి! చరిత్రలో ఇలా శాశ్వతంగా తనకంటూ స్థానం సంపాదించుకున్నారు మాజీ సీఎం! విభజన సమయంలో ఆయన ఒక విధంగా కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. కాకపోతే, ఒకవైపు తెలంగాణ జనం ఆయనని సమైక్యవాదిగా చూశారు. ఆంద్రా జనం విభజన అడ్డుకోలేకపోయిన కాంగ్రెస్ సీఎంగా చూశారు. ఇలా రెండు వైపులా డ్యామేజ్ అయింది కిరణ్ కుమార్ రెడ్డి ఇమేజ్! అందుకే, గత నాలుగేళ్లుగా నిశ్శబ్ధంగా వుండిపోయారు. అయితే, తరుముకొస్తున్న ఎన్నికల నేపథ్యంలో ఆయన మరోమారు యాక్టివ్ అయ్యారు. దిల్లీ ఫ్లైట్ ఎక్కి వెళ్లి మరోమారు తన ఓల్డ్ బాస్… రాహుల్ ని కలవనున్నారు!     కాంగ్రెస్ లో కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ చేరతారా? ఇప్పుడు ఇది పెద్దగా సందేహించాల్సిన పరిణామం కాదు. దాదాపు ఖరారు అయిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ తో భేటీ తరువాత స్వయంగా ప్రకటించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే, కిరణ్ చేరిక కాంగ్రెస్ కు లాభమా? కాంగ్రెస్ లో చేరిక కిరణ్ కు లాభమా? ఇవే అసలు ప్రశ్నలు!     విభజనను తీవ్రంగా వ్యతిరేకించి ఆఖరుకు స్వంత పార్టీ పెట్టుకుని బొక్క బోర్లా పడ్డారు కిరణ్. ఇప్పుడు ఆ పార్టీని, సమైక్యాంధ్ర నినాదాన్ని పక్కనపెట్టి మళ్లీ కాంగ్రెస్ లో చేరుతున్నారు! కానీ, విభజన చేసిన పార్టీలోనే ఎందుకు చేరుతున్నారు? ఇది సమాధానం లేని ప్రశ్నే! తెలుగుదేశం, వైసీపీల్లో చేరతారని కూడా ప్రచారం జరిగింది. ఒక దశలో బీజేపీ అని కూడా అన్నారు. ఇవేవీ కాకుండా కిరణ్ కుమార్ రెడ్డి దయనీయ స్థితిలో వున్న ఏపీ కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇందులో ఆయన గుర్తించిన లాభం ఏంటో దేవుడికే తెలియాలి!     కాంగ్రెస్‌లో చేరిక వల్ల కిరణ్ కుమార్ రెడ్డికి కనుచూపు మేరలో పెద్ద లాభాలేం లేవు. కాకపోతే, ఆయన వల్ల పార్టీకి కొంత మేర లాభమే! మాజీ సీఎంగా ఆయనకు జనంలో కొంత గుర్తింపు వుంది. అది హస్తానికి కలిసి రావచ్చు. అయితే, చిత్తూరు జిల్లా నాయకుడైన నల్లారి ఏపీలోని పదమూడు జిల్లాల్లో ప్రభావం చూపే నాయకుడేం కాదు. కాబట్టి కాంగ్రెస్ కు ఆయన వల్ల కలిగే లాభం కూడా చాలా పరిమితమే! ఇలా కిరణ్, కాంగ్రెస్ ల పునః కలయిక రాజకీయంగా ఏమంత విశేషం కాదనే చెప్పాలి!     వచ్చే ఎన్నికల్లో ఏపీలో రాహుల్ గాంధీ దళం అద్భుతాలు సృష్టించే అవకాశాలు అస్సలు కనిపించటం లేదు! బీజేపీకి ఎంత గడ్డు కాలం వుందో… అంతకంటే ఎక్కువే కాంగ్రెస్ కు కూడా ఆంద్రాలో వుంది. కాబట్టి తెలుగుదేశం, వైసీపీల జోరులో రెండు జాతీయ పార్టీలు అల్లాడిపోవటం గ్యారెంటీగానే కనిపిస్తోంది. కొత్తగా వచ్చిన జనసేన ఎలాగూ వుండనే వుంది! మొత్తంగా ఇంకా ఓటర్ల దృష్టిలో విభజన చేసిన పార్టీగా మచ్చ పడ్డ కాంగ్రెస్ ఇప్పుడప్పుడే తేరుకునే స్థితిలో లేదు! మరి అటువంటి పార్టీలో కిరణ్ ముందు ముందు ఏం చేయనున్నారో! 

లోకేష్ బాబు శకం మొదలైనట్టేనా?

రాజకీయాలు నది లాంటివి! ఇలా ఎందుకు అనాలి అంటే… అయిదేళ్లకోసారి వచ్చే ఎన్నికలతో పాటూ పాలిటిక్స్ లోకి కొత్త నీరు వస్తూనే వుంటుంది. అచ్చం నదీ ప్రవాహంలో లాగే నిరంతరం కొత్త నాయకత్వం పుట్టుకొస్తుంటుంది. ఇప్పుడు అదే పరిస్థితి ఏపీలోనూ వచ్చినట్లు కనిపిస్తోంది! ప్రస్తుతం నడుస్తోన్న చంద్రబాబు శకం… 2019తో ముగిసి… లోకేష్ శకం అరంభం అవ్వనుందా? తాజా పరిణామాలు ఆ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.     లోకేష్ ఓ మీటింగ్ లో సంచలన ప్రకటన చేశారు! కర్నూల్ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు బహిరంగ సభలో అభ్యర్థుల్ని ప్రకటించేశారు. ఇది నిజానికి టీడీపీ సంప్రదాయాలకి, చంద్రబాబు స్టైల్ కి భిన్నం! బాబు తన అపార అనుభవం, ఆచితూచి వ్యవహరించే నైజం వల్ల ఎప్పుడూ ఇలాంటివి చేయరు. కానీ, యువ నేత లోకేష్ దూకుడుగా ఇటు మోహన్ రెడ్డిని, అటు బుట్టూ రేణుకని టీడీపీ అభ్యర్థులుగా ప్రకటించారు.దీనిపై బాబు ఎలా స్పందిస్తారో చూడాలి. తండ్రితో మాట్లాడకుండా లోకేష్ అభ్యర్థుల్ని ప్రకటించేంత నిర్ణయం చేయరనే అనుకోవాలి. అయితే, ఇందులో అసలు గుర్తించాల్సిన విషయం… రానున్న కాలంలో చినబాబు పోషించబోయే పాత్ర! ఒక బహిరంగ సభలో ఇద్దరు నేతల పేర్లు లోకేష్ పేర్కొనటం పెద్ద విశేషం ఏం కాదు. కాకపోతే, టీడీపీలో చంద్రబాబు కాకుండా ఇలా అభ్యర్థుల్ని మరొకరు ప్రకటించటం అస్సలు ఊహించలేం. కానీ, లోకేష్ బాబు ఇలా ఎందుకు చేసుంటారు? ప్లాన్డ్ గానే ఇదంతా జరుగుతోందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కీ రోల్ చినబాబుదేనని వారంటున్నారు. ఆయన సీఎం అభ్యర్థిగా వుంటారా ? లేదా? లాంటి ప్రశ్నలు పక్కన పెడితే … పార్టీ పరంగా మాత్రం రానున్న రోజుల్లో లోకేష్ పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టవచ్చు. ములాయం అఖిలేష్ ని, సోనియా రాహుల్ ని రంగంలోకి దించేసినట్టే చంద్రబాబు కూడా ఫుల్ టైం రెస్పాన్సిబిలిటి లోకేష్ భుజాలపైన పెట్టవచ్చు! ఇక మరికొందరు రాజకీయ పండితులైతే మరో అడుగు ముందుకేసి… దిల్లీ రాజకీయాలు మోదీకి వ్యతిరేకంగా మారితే… ఖచ్చితంగా చంద్రబాబు అక్కడ వుండాల్సి వస్తుంది. ఏ కూటమి అధికారంలోకి వచ్చినా బాబు పాత్ర ముఖ్యంగానే వుండబోతోంది. ఆయనే ప్రధాని అవ్వటం మొదలు కూటమిని ఒక్క తాటిపై నడిపే వరకూ ఆయన ఏ బాద్యతలైనా చేపట్టాల్సి రావచ్చు. అందుకే, దేశ రాజధానిలో తన మున్ముందు ఎజెండాను దృష్టిలో పెట్టుకనే బాబు లోకేష్ ను యాక్టివేట్ చేశారంటున్నారు. వారి ఉద్దేశ్యమైతే… దేశరాజధానికి బాబు, అమరావతిలో చినబాబు అని! చూడాలి మరి… లోకేష్ దూకుడు ముందు ముందు ఎలా వుండబోతోందో!

మోదీ, చంద్రబాబుల కంటే ముందే కేసీఆర్ రెడీ అయిపోతున్నారా?

గత ఎన్నికలు 2014లో జరిగాయి. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు? 2019లో! పార్లమెంట్, తెలంగాణ, ఏపీ అసెంబ్లీలకి ఒకేసారి ఎన్నికలు రావటం గత కొన్ని దఫాలుగా జరుగుతూ వస్తోంది. అయితే, ఈసారి మాత్రం పరిస్థితి సస్పెన్స్ థ్రిల్లర్ గా మారిపోయింది. ఎలక్షన్స్ రేపో, మాపో అన్నట్టు వుంటోంది కేసీఆర్, మోదీల వ్యవహార శైలి! చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 ఎండా కాలంలోనే ఎన్నికలు అంటుంటే… ప్రధాని, తెలంగాణ సీఎంలు మాత్రం ముందస్తుకు సంకేతాలు ఇస్తూ మీడియాలో కలకలం రేపుతున్నారు. కాకపోతే, ఇంత వరకూ అదికారిక స్టేట్మెంట్లు మాత్రం రాలేదు!     దేశం మొత్తం మోదీ జరపాలని భావిస్తోన్న జమిలి ఎన్నికలు, పార్లమెంట్ ముందస్తు ఎన్నికలు పక్కన పెడితే తెలంగాణ అసెంబ్లీకి మాత్రం ముందస్తు కంటే ముందస్తు ఎన్నికలు తేవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారా? అవుననే అంటున్నారు గులాబీ నేతలు! తాజాగా ప్రగతి భవన్ నుంచి వెళ్లిన ఫోన్ల సంగతి పెద్ద చర్చగా మారింది. ప్రస్తుతం టీఆర్ఎస్ కి దాదాపు తొంభై మంది ఎమ్మెల్యేలు వున్నారు. కొందరు కార్ గుర్తుపై గెలిచిన వారు, మరి కొందరు జంప్ జిలానీలు. వీరంతా వచ్చే ఎన్నికల్లో సహజంగానే టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. కానీ, అందులో కొంత మందికి మొండి చేయి తప్పదని వార్త వస్తోంది. అదే కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల వెన్నులో వణకు పుట్టిస్తోంది.   టికెట్ వస్తుందా లేదా అన్న అనుమానంలో వున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి కేసీఆర్ తాజాగా ఫోన్లు చేయటం మరింత టెన్షన్ పుట్టిస్తోందట. కొందరికి స్వయంగా గులాబీ బాస్ ఫోన్ చేసి ఎన్నికలకు సిద్ధం అవ్వండని చెప్పారట. ముందుగా వచ్చినా, టైముకే వచ్చినా, జమిలి ఎన్నికలైనా… అన్నిటికీ రెడీగా వుండాలని సీఎం చెప్పారట. అభివృద్ధి కార్యక్రమాలు చకచకా పూర్తి చేసి, ఎన్నికలకి నిధులు సమకూర్చుకుని పోరు సన్నద్ధం కావాలిన ఫోన్ కాల్స్ సారాంశమట!     కేసీఆర్ ఫోన్ చేసి మళ్లీ ఎన్నికలకి సిద్ధం అవ్వమన్న వారు హ్యాపీనే! ఫోన్లు రాని వారి పరిస్థితే అయోమయంగా మారింది. తమకు బాస్ ఫోన్ చేయలేదంటే మళ్లీ టికెట్ ఇచ్చే ఆలోచన లేదేమోనని వారు భయపడుతున్నారట. ఒకవేళ అదే జరిగితే ఏం చేయాలన్నది ప్రస్తుత అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మనోవేదన! సహజంగానే వారు రెబెల్స్ గా బరిలోకి దిగే అవకాశాలుంటాయి. ఒకరిద్దరూ కేసీఆర్ నచ్చజెబితే ఊరుకుంటారుగానీ… సాధారణంగా ఇతర పార్టీల్లోకి జంపు చేసి అయినా పోటీలో వుంటారు. ఎందుకంటే, సాధారణ ఎన్నికలు అయిదేళ్ల దాకా మళ్లీ రావు. అందుకే, పార్టీలు, కండువాలు మార్చేసైనా సమరానికి సై అంటారు! మొత్తం మీద కేసీఆర్ పార్లమెంట్ కంటే కూడా ముందుగానే ఎన్నికలకు తెర తీస్తే పార్టీ ఫిరాయింపుల పర్వం కూడా మొదలవ్వచ్చు! అసతంతృప్తులు, రెబెల్స్ ని ఎంత మందిని తెలంగాణ ప్రతిపక్షం … కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటోందో చూడాలి. అలాగే, తెలంగాణలో పర్యటనకు సిద్ధమైన అమిత్ షా కూడా ఎంత మందికి కాషాయ కండువాలు కప్పుతారో? ఏది ఏమైనా… తెలంగాణలో ఆషాధ మహంకాళీ జాతర పూర్తవ్వగానే ఎన్నికల జాతర మొదలయ్యేలా కనిపిస్తోంది!

కత్తి Vs స్వామీ… తప్పెవరిది?

ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో బాబూ గోగినేని అనే ఒక నాస్తికుడు రాముడ్ని దుర్భాషలాడాడు. నిజానికి దాన్నెవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే, తరువాత అదే విషయమై ఓ ఛానల్ చర్చ పెట్టడంతో కత్తి మహేష్ పోన్ ఇన్ లోకి వచ్చాడు. అప్పుడు ఆయన బాబూ గోగినేని రాముడ్ని అన్న మాటల్నే రిపీట్ చేశాడు. ఇది పెద్ద దుమారానికి కారణమైంది. ఇక చివరకు, ఇప్పుడది నగర బహిష్కరణల దాకా వెళ్లింది. కత్తి మహేష్, స్వామీ పరిపూర్ణానంద ఇద్దరూ భాగ్యనగరానికి దూరంగా వుండాల్సిన స్థితి ఏర్పడింది! ఈ కేసు మొత్తాన్నీ కాస్త ఓపిగ్గా విశ్లేషిస్తే బోలెడు విడ్డూరాలు కనిపిస్తాయి! అసలు సమస్య ఈ విపరీతాలే! రాముడ్ని దుర్భాషలాడటం కన్నా ఇవి ఆందోళనకరం…     బాబూ గోగినేని తన భావ ప్రకటనా స్వేచ్ఛ ఉపయోగించుకుని రాముడ్ని తిట్టిపోశాడు. అది కొందరు సమర్థిస్తారు. కొందరు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే, భావ ప్రకటన స్వేచ్ఛ ఇతరుల మత పరమైన విశ్వాసాల్ని కించపర్చటం కాదు కదా! అయితే, ఆయనెక్కడో అన్న మాటలు అత్యధిక జనానికి తెల్సింది ఎలక్ట్రానిక్ మీడియా వల్ల. ఇలాంటి పెద్దగా ఎలాంటి సామాజిక, రాజకీయ ప్రాముఖ్యం లేని అంశాల్ని లైవ్ లో చర్చకెందుకు పెట్టాలి? జనానికి ఏంటి లాభం? రెచ్చగొట్టడమే మీడియా ఉద్దేశమా అన్నట్టుగా తయారైపోయింది పరిస్థితి. ఆ మధ్య శ్రీరెడ్డి వ్యవహారంలో కూడా అనేక ఛానల్స్ వ్యవహరించిన తీరు ఆలోచించే వారికి ఎవరికైనా వెగటు పుట్టిస్తుంది. పెద్ద పెద్ద సామాజిక సమస్యలు వున్నప్పటికీ ఏమంత ప్రభావితం చేయని అంశాల్ని రచ్చకీడుస్తోంది మన మీడియా! దాని ఫలితమే ఈ తాజా దగుల్భాజీ వివాదం కూడా!     మీడియా ఉద్దేశ్యపూర్వకంగానో , ఉద్దేశ్యం లేకుండానో వివాదం రేపితే… ప్రభుత్వాలు కూడా అదే కోవలో స్పందిస్తున్నాయి. సమస్య జటిలం అవ్వటానికి ఇది మరో కారణం. కత్తి మహేష్ కామెంట్స్ హిందూ సంస్థల ఆగ్రహానికి కారణం అయ్యి వుండవచ్చు. అతను అలా మాట్లాడవచ్చా లేదా అన్నది కోర్టులు నిర్ణయించాలి. కత్తి మహేష్ పై కేసులు నమోదైతే అరెస్ట్ చేయాలి. అవసరం లేదనుకుంటే అతడికి రక్షణ కల్పించి అరెస్ట్ చేయకుండా అయినా వుండాలి. ఇదేదీ చేయకుండా ప్రభుత్వం నగర బహిష్కరణ అనే కొత్త తంతు ముందుకు తీసుకు వచ్చేటప్పటికి వివాదం మరింత ముదిరింది. కత్తిని హైద్రాబాద్ నుంచి తరలించటంతో దళిత సంఘాలు, నేతలు, ఇతర అభ్యుదయవాదులు రోడ్డెక్కారు. వార్ని శాంత పరిచేందుకా అన్నట్టు ధర్మాగ్రహ దీక్ష అన్న పరిపూర్ణానందని నగరం బయటకి తరలించారు. ఇది ఇప్పుడు హిందూ సంస్థలకి కోపం తెప్పిస్తోంది. మొత్తంగా నగర బహిష్కరణల పర్యవసానం ఏంటి? వివాదంలోని ఇరు వర్గాలకి ప్రభుత్వంపై అసతంతృప్తి మిగిలింది!     కత్తి మహేష్, పరిపూర్ణానందల బహిష్కరణల వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలు వున్నాయో మనకు తెలియదు కానీ… మీడియా, ప్రభుత్వం చేసిన వ్యవహారం వల్ల సమాజంలో కొన్ని వర్గాల నడుమ దూరం పెరిగిపోయింది. ఇలా కాకుండా వుంటేనే ముందు ముందు మంచిది. తెలుగు మీడియా జాతీయ, అంతర్జాతీయ మీడియాలను చూసి ఏ అంశాలు నిజంగా చర్చకు పెట్టాలో పునరాలోచించుకుంటే మంచిది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టపరమైన చర్యలు తీసుకునేటప్పుడు సమస్య పరిష్కారం అయ్యే విధంగా చేస్తే బావుంటుంది. అంతే తప్ప జటిలం అయ్యేలా ప్రవర్తిస్తే సమాజానికి, దేశానికి మంచిది కాదు. నగర బహిష్కరణలే మార్గమైతే దేశాన్ని ఏలే కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద వ్యాఖ్యాలు చేసే వారందర్నీ ఒక నగరం నుంచీ మరో రాష్ట్రానికి పంపించేస్తూ కాలం గడపాల్సి వుంటుంది. ప్రభుత్వాలు భావ ప్రకటనే ముఖ్యం అనుకుంటే వ్యాఖ్యలు చేసిన వారికి పోలీసు రక్షణ కల్పించాలి. మనోభావాలు , మత విశ్వాసాలు ముఖ్యం అనుకుంటే వ్యాఖ్యలు చేసిన వార్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు వుంచాలి. చట్టానికి, రాజ్యాంగానికి లోబడి సమాజ శ్రేయస్సుకి పని చేయటమే అంతిమంగా చెప్పదగింది… 

పవన్‌ను టార్గెట్ చేస్తోన్న టీడీపీ... జగన్‌కు డ్యామేజ్ తప్పదా?

ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలుపెవరిది? ఇది ఇప్పుడే చెప్పటం కష్టం. కానీ, రానున్న ఎన్నికల్లో యుద్ధం ఎవరెవరి మధ్యా అన్నది మాత్రం అంతకంతకూ స్పష్టమైపోతోంది. అధికార పక్షం టీడీపీ, ప్రతిపక్షం వైసీపీ నడుమ పోరాటం వుంటుందని అందరికీ తెలిసిందే! అయితే, పోయిన ఎన్నికల్లో సీన్ వేరుగా వుండింది. ఒకవైపు టీడీపీ, బీజేపీ, పవన్ మోహరించారు. మరోవైపు వైసీపీ, ఇక కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఒంటరి పోరు చేసి బొక్క బోర్లపడ్డాయి. కానీ, అయిదేళ్లలో అంతా మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో పరిస్థితి చూస్తుంటే ఏ ఒక్కరూ మరొకరితో కలిసే పరిస్థితి లేనట్లు కనిపిస్తోంది. తాజాగా టీడీపీ అగ్ర నాయకత్వం పవన్ ను ఏమాత్రం ఊపేక్షించవద్దని తమ కింది స్థాయి నాయకులకి చెప్పటం … ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తోంది!     ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా జగన్ పాదయాత్ర చేస్తున్నారు. మరో వైపు సీఎంగా వున్న చంద్రబాబు తమకు చేతనైంది కొత్త రాష్ట్రానికి చేస్తూనే… మిగతాదంతా కేంద్రం వైఫల్యంగా జనానికి చూపిస్తున్నారు. ప్రధానంగా ప్రత్యేక హోదా విషయంలో మోదీ సర్కార్ ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టగలిగారు. ఇది చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బాగానే కలిసొచ్చే విషయం. ఆయన పై సానుభూతి , మోదీపై ఆగ్రహం జనాల్లో పెల్లుబుకవచ్చు. అయితే, వైసీపీని కాదని టీడీపీకి మళ్లీ జనం ఓటు వేస్తారా? పరిస్థితి చూస్తుంటే అలాగే కనిపిస్తోంది! రోజు రోజుకు టీడీపీకి కలిసి వస్తోన్న అంశాల్లో ప్రధానమైంది… ప్రతిపక్షాల అనైక్యత! ఏ రాష్ట్రంలో అయినా, మొత్తం దేశంలో అయినా శత్రువులు విడివిడిగా పోరాడటం అధికార పక్షానికి మేలు చేస్తుంది. ఇది ఎన్నో సార్లు నిరూపితమైంది కూడా. 2014 ఎన్నికల్లో మోదీని గెలిచిపించింది, మొన్నటి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో యోగిని గెలిపించింది అపోజిషన్ అనైక్యతే! ఇప్పుడు అదే చంద్రబాబుకు వరంగా మారేలా వుంది!     పవన్ ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ తన స్టాండ్ పూర్తిగా క్లియర్ చేసేశాడు. టీడీపీకి బద్ధ వ్యతిరేకిగా తాను ఎన్నికల బరిలో దిగనున్నట్టు ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇక గతంలో కలిసి పని చేసిన బీజేపీ కూడా ఇప్పుడు టీడీపీకి దూరంగానే వుంటోంది. కన్నా లక్ష్మీనారాయణ యాత్రలో దాడుల దాకా వెళ్లింది వ్యవహారం. ఇక మిగిలిన కమ్యూనిస్టుల్లో సీపీఐ పవన్ తో కలవవచ్చని ప్రచారం నడుస్తోంది. సీపీఎం సంగతి అస్సలు తెలియదు. కాంగ్రెస్ కూడా ఏపీలో ఎవరితోనూ కలిసే స్థితిలో, గతిలో లేదు! ఒంటరి పోరు చేసి ఈసారన్నా సున్నా సీట్లు తెచ్చుకోకుంటే ఆ పార్టీకి అదే పదివేలు! మరిక టీడీపీ, వైసీపీలతో కలిసేది ఎవరు? ఎవ్వరూ లేరనే చెప్పాలి!       టీడీపీ, వైసీపీ రెండు ఒంటరిగానే బరిలో దిగినప్పటికీ… జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ వేటికవి సింగిల్ గా ఫైటింగ్ చేస్తే… డ్యామేజ్ జగన్ కే! ఎందుకంటే, అన్ని పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుకుంటూ పోతే… ప్రధాన ప్రతిపక్షానికి లాభం అంతకంతకూ తగ్గిపోతుంది. అంటే, అంతిమంగా టీడీపీకి లాభమన్నమాటే!  బహుశా ఈ వ్యూహంతోనే పవన్ పై ఎదురు దాడికి సిద్ధం అవ్వమని టీడీపీ తన నాయకులకి, క్యాడర్ కి ఆదేశాలు ఇచ్చి వుంటుంది!

కేటీఆర్ ట్వీట్... లోకేష్ రీట్వీట్… మారుతోన్న రాజకీయం!

రాజకీయాలు మారిపోతున్నాయి. మన పాలిటిక్స్ లో పాత తరం నేతలు తమ వారసుల్ని వేగంగా దించేస్తున్నారు. కొత్త నేతల రాకతో పాలిటిక్స్ నడిచే తీరు కూడా మారుతోంది. తాజాగా ట్విట్టర్ లో తెలంగాణ సీఎం వారసుడు కేటీఆర్, ఆంధ్రా సీఎం వారసుడు లోకేష్ మధ్య జరిగిన సంభాషణ దానికే అద్దం పడుతుంది! ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లిస్ట్ లో రెండు తెలుగు రాష్ట్రాలు తొలి రెండు స్థానాలు గెలుచుకుని దేశం దృష్టిని ఆకర్షించాయి. దానిపైనే యువ నేతలిద్దరూ ట్వీట్లు పోస్టు చేశారు.   నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ కు శుభాకాంక్షలు చెబుతూనే కేటీఆర్ జస్ట్ మిస్ అన్నారు. కేవలం 0.09 శాతం తేడాతో ఫస్ట్ ర్యాంక్ మిస్సయ్యాం అన్నారు. దానికి స్పందించిన లోకేష్ రెండు తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో వున్నాయన్నారు! ఇది తెలుగు ప్రజల మంచికే తప్ప ర్యాంకుల రేస్ మన మధ్య ఏం లేదని అభిప్రాయం వెలిబుచ్చారు. ఇది నిజంగా పరిణతి చెందిన సమాధానం అనే చెప్పాలి. నిజానికి కేటీఆర్ ఆంద్రప్రదేశ్ కు శుభాకాంక్షలు చెప్పటం హర్షనీయం. అంతకంటే ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటేనన్న భావం ధ్వనించేలా లోకేష్ స్పందించటం మరింత ఆనందదాయకం. ఈ సందర్భంగా మనం ఒక్కసారి విభజనకు ముందు పరిస్థితి గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఆశ్చర్యమనిపిస్తుంది. అప్పట్లో తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చినా కూడా కేసీఆర్ పదే పదే టీడీపీని టార్గెట్ చేసేవారు. అప్పుడు తెలుగు దేశం నేతలు ఘాటుగానే ప్రతి దాడి చేసేవారు. అటువంటి స్థితి నుంచీ ఇప్పుడు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకుని వెన్నుతట్టి ప్రొత్సహించుకునే స్థితికి రావటం ఖచ్చితంగా గుణాత్మక మార్పే!   ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల ప్రకటన మరో విషయం కూడా తేటతెల్లం చేసింది. విభజన ఎంత మాత్రం మంచిది కాదన్న వాదన తప్పని నిరూపించింది. దేశంలో ఎన్నో రాష్ట్రాలు వుండగా కొత్తగా ఏర్పడ్డ మన రెండు రాష్ట్రాలే టాప్ లో వుండటం విభజన కారణంగానే! విడిపోవటం వల్ల ఏపీ ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నప్పటికీ నెంబర్ వన్ గా నిలవటం నిస్సందేహంగా గొప్ప విషయం. ఇక్కడ వాణిజ్యానికి వున్న పుష్కలమైన అవకాశాలకి ఇది సంకేతం. అలాగే, హైద్రాబాద్ లాంటి బిజినెస్ హబ్ తో సహా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ సహజంగానే టాప్ గేర్లో దూసుకుపోతోంది. ఇదంతా విభజన వల్ల సాధ్యమైందనే చెప్పాలి!   మొత్తానికి… అనేక సంక్షోభాలు, గందరగోళాల నడుమ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు నేల ఇప్పుడు యావత్ దేశం చూపుని కట్టిపడేస్తోంది. కేసీఆర్, చంద్రబాబు శకంలో ఉప్పు, నిప్పుగా వున్న టీఆర్ఎస్, టీడీపీ ఇప్పుడు సుహృద్బావంతో మెలుగుతున్నాయి. కేటీఆర్, లోకేష్ లు మంత్రులుగా, కాబోయే ముఖ్యమంత్రులుగా కొత్త రాజకీయంతో నవశకంలోకి తీసుకెళుతున్నారు. ఇదంతా తెలుగు వారికి ఒక విధంగా సంతోషదాయకమైన పరిణామమే! 

కత్తి రాజకీయ కలలకు గండి..!!

ఒకప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేవాళ్ళు.. ఇప్పుడు కొత్తగా, నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే నగర బహిష్కరణ అవుతారు అంటున్నారు.. ఇది కత్తి మహేష్ కు కరెక్ట్ గా సరిపోతుంది.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ కత్తి మహేష్.. ఫిలిం క్రిటిక్ గా కొందరికి పరిచయమైన మహేష్, బిగ్ బాస్ పుణ్యమా అని చాలా మందికి పరిచయం అయ్యారు.. ఆ ఫేమ్ ని అలా కంటిన్యూ చేసుకుంటే బాగుండేది.. కాని అలా ఉంటే కత్తి ఎందుకు అవుతాడు.. వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియా, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకున్నాడు. పవన్ మీద వ్యాఖ్యలు, పవన్ ఫ్యాన్స్ తో వివాదం.. దీంతో కొన్ని రోజులు మీడియాలో నానాడు.. తరువాత మూడు వ్యాఖ్యలు ఆరు విమర్శలతో గాలి వానలో పడవ ప్రయాణంలా సాగిపోయింది మహేష్ జీవితం.. ఇదే ఉత్సహంతో ఆయన రాజకీయ రంగప్రవేశం కూడా చేయాలనుకున్నారు.. వైసీపీ తరుపున చిత్తూర్ ఎంపీగా కత్తి పోటీ చేస్తున్నాడనే వార్తలు కూడా వచ్చాయి.. ఇక కత్తి రేపో మాపో పొలిటికల్ ఎంట్రీ అనుకుంటుండగా ఆయన నోటి దూలతో సిటీ నుండి ఎగ్జిట్ అయ్యాడు. ఒక టీవీ ఛానెల్ డిబేట్ లో పాల్గొన్న కత్తి, శ్రీ రాముడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసాడు.. ఈ వ్యాఖ్యలకు ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత, విమర్శలు వ్యక్తమయ్యాయి.. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కత్తి వ్యాఖ్యలను వ్యతిరేకించాయి.. ఇప్పుడు కత్తి మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు టికెట్ ఇచ్చే సాహసం ఏ పార్టీ చేయదు.. ఎవరి కర్మకు వారే బాధ్యులు అన్నట్టుగా, కత్తి మహేష్ తన రాజకీయ కలలకు తన వ్యాఖ్యలతో గండి కొట్టుకున్నాడు.

టీజీ టీడీపీని వీడుతారా..?

  తాజాగా కర్నూలు ఉస్మానియా కళాశాలలో జరిగిన డ్వాక్రా మహిళల సమావేశంలో మంత్రి లోకేష్‌ అనూహ్యంగా.. కర్నూలు పార్లమెంట్ మరియు కర్నూలు అసెంబ్లీ స్థానానికి అభ్యర్థులను ప్రకటించారు.. రాబోయే ఎన్నికల్లో మీకు రెండు ఓట్లు ఉంటాయి.. ఒక ఓటు మోహన్‌రెడ్డికి.. మరో ఓటు బుట్టా రేణుకకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి.. మోహన్‌రెడ్డిని శాసనభకు, బుట్టా రేణుకను లోక్‌సభకు పంపే బాధ్యత మీదే అని లోకేష్ అన్నారు.. ఇప్పుడిదే కర్నూల్ రాజకీయాల్లో చర్చకు తెరదీసింది.. ముఖ్యంగా కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ విషయంపై టీడీపీలో చాలా గందరగోళం ఉంది.. 2014లో ఈ స్థానం నుంచి టీడీపీ తరపున టీజీ వెంకటేశ్ పోటీ చేసి ఓడిపోయారు.. తర్వాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు.. ఇప్పుడా అసెంబ్లీ సీటు నుంచి తన కుమారుడు టీజీ భరత్‌ను నిలబెట్టాలనుకుంటున్నారు.. కానీ వైసీపీ తరపున గెలిచిన.. ఎస్వీ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు.. అప్పటి నుంచి కర్నూలు టీడీపీలో వర్గపోరు ప్రారంభమైంది.. రెండు వర్గాలు తమకే టిక్కెటన్న నమ్మకంతో ఉన్నాయి.. లోకేష్ రాక సందర్బంగా రెండు వర్గాలు బలప్రదర్శన కూడా చేశాయి.. బైక్‌ ర్యాలీలు నిర్వహించాయి.. అయితే మంత్రి లోకేష్‌ అభ్యర్థులను బహిరంగంగా ప్రకటించడంతో టీజీ వర్గం ఒక్కసారిగా డీలా పడింది.. టీజీ వెంకటేష్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది.. ఎస్వీ మోహన్ రెడ్డికి రూట్ క్లియర్ చేయాడానికేనన్న ప్రచారం మొదట్లో సాగింది. అయితే కర్నూలు స్థానాన్ని ఎట్టి పరిస్థితు ల్లోనూ వదులుకోనని, తన తనయుడు టీజీ భరత్‌ బరిలో ఉంటాడని ఎంపీ టీజీ తన సన్నిహితులతో చెబుతూ వచ్చారు.. మరి లోకేష్ తాజా ప్రకటనతో టీజీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే చర్చ మొదలైంది.. తనయుడి భవిష్యత్తు కోసం టీడీపీని వీడతారు అనే భావన కూడా వ్యక్తమవుతోంది.. చూద్దాం ఏం జగురుతుందో.

మోడీజీ.. జమిలి ఎన్నికలు ఉన్నాయా? లేవా?

  ఒక దేశం ఒకే ఎన్నిక విధానం అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది.. దానిలో భాగంగానే వచ్చే లోక్‌సభతో పాటు, అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని తాపత్రయపడుతోంది.. అయితే జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ ఎప్పుడో ప్రకటించింది.. కానీ బీజేపీ మాత్రం జమిలి దిశగా అడుగులు వేస్తుంది.. బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుంది.. వాటిని కాదని బీజేపీ ఏకపక్షంగా జమిలి ఎన్నికలకు వెళ్లే సాహసం చేయదు.. అందుకే లా కమిషన్ ద్వారా జమిలీ కలను సాకారం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.. లా కమిషన్ కేంద్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా.. వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుపుతూ, సిఫార్సులు చేస్తూ వస్తోంది.. ఇప్పుడు రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంది. లా కమిషన్ జరిపిన అభిప్రాయ సేకరణలో కొన్ని పార్టీలు మాత్రమే జమిలి ఎన్నికలకు పూర్తి స్థాయి సానుకూలత తెలిపాయి.. మెజారిటీ పార్టీలు వ్యతిరేకత తెలిపాయి.. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జమిలి ముసుగులో ముందస్తు ఎన్నికలకు సహకరించేది లేదని తేల్చి చెప్పింది.. ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస, ఒకేసారి పార్లమెంట్‌, అసెంబ్లీలకు ఎన్నికలు జరిపేందుకు తాము అనుకూలమని స్పష్టం చేసింది.. మరోవైపు తమిళనాడు డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ మాట్లాడుతూ.. తమ పార్టీ జమిలి ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నదని, ఇలాంటి ఒక ఆలోచన లా కమిషన్‌ చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.. ఇది సమాఖ్య విధానానికి విఘాతంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.. ఇక యూపీలోని సమాజ్‌వాది పార్టీ, బీహార్ లోని జేడీయూ జమిలి ఎన్నికలకు మద్దతు తెలిపాయి.. మరో ప్రధాన పక్షమైన తృణమూల్‌ కాంగ్రెస్‌ మాత్రం చాలా బలంగా తాము జమిలి విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది.. వామపక్షాలు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.. అసలు జమిలి ఎన్నికల అంశం లా కమిషన్‌ పరిధిలోనే ఉండదని, పూర్తిగా పార్లమెంట్‌కే ఆ అధికారం ఉంటుందని తెలిపాయి. 2019 ప్రారంభంలో లో పన్నెండు రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించాలని మోడీ పట్టుదలతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.. 2024కు దేశవ్యాప్తంగా ఒకే సారి జమిలి నిర్వహించాలనేది ఆయన ఆలోచన.. దాని ప్రకారమే ప్రస్తుతం, కసరత్తు నడుస్తోంది.. చివరిగా లా కమిషన్ పార్టీల అభిప్రాయాలు తెలుసుకుంది.. మరి, కొన్ని పార్టీలకు ఇష్టంగా, కొన్ని పార్టీలకు కష్టంగా ఉన్న ఈ జమిలి ఎన్నికలను మోడీ ప్రభుత్వం కొన్ని పార్టీలను కష్టపెట్టి నిర్వహిస్తుందో లేక ఎప్పటిలానే ఎన్నికలకు వెళ్ళడానికి అంగీకరిస్తుందో చూడాలి.

పవన్ తో విడాకులు.. రేణూదేశాయ్ సంచలన వ్యాఖ్యలు.!!

  ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు రేణూదేశాయ్.. హీరోయిన్ గా, పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా మనకి సుపరిచితురాలు.. పవన్, రేణూదేశాయ్ విడాకులు తీసుకున్న తరువాత.. పవన్ మరో పెళ్లి చేసుకొని ఆయన జీవితం ఆయన బ్రతుకున్నారు.. రేణూదేశాయ్ పిల్లల్ని చూసుకుంటూ ఇన్నాళ్లు ఒంటరిగా బ్రతికారు.. కానీ ఇప్పుడు తన పిల్లల భవిష్యత్తు కోసం రెండో పెళ్ళికి సిద్ధమయ్యారు.. ఇది జీర్ణించుకోలేని కొందరు పవన్ ఫ్యాన్స్ ఆమెని సోషల్ మీడియాలో బెదిరించడం మొదలుపెట్టారు.. దాంతో భయపడిన రేణూదేశాయ్ ఆమెకి కాబోయే భర్త వివరాలు వెల్లడించలేదు.. నిశ్చితార్థం అయిన విషయం మాత్రం వెల్లడించారు.. దీంతో ఫ్యాన్స్ ఇంకా రెచ్చిపోయారు.. ఆమె విడాకుల తరువాత ఎవరి లైఫ్ వారికి ఉంటుంది అని ఫ్యాన్స్ కి అర్ధమయేలా చెప్పే ప్రయత్నం చేసారు..  అయినా ఫ్యాన్స్ వినలేదు.. పవన్ కూడా రేణూదేశాయ్ కి శుభాకాంక్షలు చెప్తూ పాజిటివ్ గా పోస్ట్ చేసారు.. వారు అభిమానించే పవన్ పోస్ట్ కూడా కొందరికి పట్టలేదు.. ఆమెని అలానే బెదిరిస్తూ విమర్శలు చేస్తూ వస్తున్నారు.. ఆమె చాలావరకు సహనంగా ఉంటూ వచ్చారు.. ఇక లాభం లేదని ఒక ఇంటర్వ్యూ ద్వారా తన మనసులో ఉన్న బాధని, కోపాన్ని బయటపెడుతూ ఫ్యాన్స్ కి అదిరిపోయే సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే ఇన్నాళ్లూ సైలెంట్ గా వున్నాను.. కానీ ఇక భరించలేను అని చెప్పిన రేణూదేశాయ్.. అసలు విడాకులు కావాలన్న కోరిక ముందుగా పవన్ కళ్యాణ్ వైపు నుంచే వచ్చింది, నేనెప్పుడూ డివోర్స్ అడగలేదు అని స్పష్టం చేసారు.. పవన్ కళ్యాణ్ గారి ఫిమేల్ ఫ్యాన్స్‌ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా..  మీరే ఆయన భార్యగా వుండి.. 11 సంవత్సరాలు కాపురం చేసి.. మీకు తెలీకుండా అతడు మరొకావిడతో బిడ్డను కంటే మీకు ఎలా ఉంటుంది..? అని ప్రశ్నించారు.. పిల్లల కోసం పెళ్లి నిర్ణయం తీసుకున్నాను అన్నారు.. అకీరాను జూనియర్ పవన్ కళ్యాణ్ అని పిలవడం.. అకీరాతో పాటు పవన్ కళ్యాణ్‌కి కూడా ఇష్టం లేదు.. అందుకే వద్దన్నా అని తెలిపారు.. పవన్ ఫ్యాన్స్ విమర్శలు ఆపకపోవడం వల్లే ఇలా ఇంటర్వ్యూ ద్వారా నా గురించి చెప్పుకోవాలనిపించింది అని ఆవేదన వ్యక్తం చేసారు.. అలానే 'అమ్మాయిలూ గట్టిగా వుండండి.. ప్రేమ ముఖ్యమే..  కానీ ప్రేమే జీవితం కాదు.. ఎవ్వరూ ఆ మాయలో పడొద్దు' అని అన్నారు.. ఇన్ని రోజులు సహనంగా ఉన్న రేణూదేశాయ్ ఇలా మాట్లాడటానికి ఖచ్చితంగా పవన్ ఫ్యాన్సే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి.. విడాకుల తరువాత పవన్ కి ఒక జీవితం ఉన్నట్టే, రేణూదేశాయ్ కి కూడా ఒక జీవితం ఉంటుందని అర్ధం చేసుకోకుండా ఆమె మీద విమర్శలు చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.. అలానే పవన్ కూడా రేణుదేశాయ్ కి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు, రేణుదేశాయ్ ని ఇబ్బంది పెట్టొద్దని ఒక్కమాట చెప్తే ఫ్యాన్స్ ఆగేవారు కాదా? అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

పవన్ జగన్ కలిస్తే.. బాబు గెలుపే.!!

  ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాజీ ఎంపీ సబ్బం హరి తన అభిప్రాయాలు వ్యక్తం చేసారు.. గత ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు తన వల్లే గెలిచారని పవన్ మాట్లాడినందుకే, పవన్ పై ఉత్తరాంధ్రలో వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు.. 1983 నుంచి 2014 వరకు అశోక్ గజపతిరాజు గెలుస్తూ వస్తున్నారు.. అప్పుడు కూడా అశోక్ గజపతిరాజును పవనే గెలిపించారా? అని సబ్బం ప్రశ్నించారు.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీని బతికించడం కోసమే వైసీపీ, జనసేన పార్టీలు కలుస్తాయని అభిప్రాయపడ్డారు.. ఈ విషయంలో ఎటువంటి అనుమానం లేదు.. బీజేపీ చెప్పినట్టు ఈ రెండు పార్టీలు చేస్తాయనడానికి గత నెలరోజులుగా ఈ పార్టీల నేతలు చేస్తున్న ప్రసంగాలే నిదర్శనమని విమర్శించారు.. 'వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్, పవన్ మాకు మద్దతిస్తానని చెప్పాడని ప్రకటన చేసారు కదా' అని సబ్బం గుర్తు చేసారు.. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిన కారణంగా ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చిన తర్వాత.. ఏపీ ప్రజల్లో బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. అదే సమయంలో వైసీపీ, జనసేన పార్టీలు బీజేపీని వ్యతిరేకించకపోవడాన్ని ఏపీ ప్రజలు స్పష్టంగా గమనించారని అన్నారు.. ఏపీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. జగన్, పవన్ కలిసి పనిచేస్తున్నారనే విషయం అందరికీ తెలుసని, రాబోయే రోజుల్లో ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, జనసేన కలిసి పోటీ చేసే వాతావరణాన్ని బీజేపీ సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు.. అలా జరిగినప్పుడు మాత్రమే, చంద్రబాబుని ఎదుర్కోగలరనేది వారి అభిప్రాయమని అన్నారు.. అయితే జగన్, పవన్ కలిసి పోటీ చేస్తే చంద్రబాబు గెలుపు నల్లేరు మీద నడకే, ఖచ్చితంగా టీడీపీయే గెలుస్తుంది.. కానీ వైసీపీ,జనసేన కలిసి పోటీచేస్తే కొత్త వ్యూహాలకు టీడీపీ వెళ్లాల్సిన అవసరముంది.. ఆ వ్యూహాలకు టీడీపీ రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది అని సబ్బం హరి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.  

జగన్ కొంప ముంచబోతున్న కాంగ్రెస్..!

విభజన అనంతరం ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ ఊసే లేదు.. విభజన ఎఫెక్ట్ తో ఏపీలో కాంగ్రెస్ ఉనికికే ప్రమాదం వచ్చింది.. చాలావరకు నేతలంతా కాంగ్రెస్ ని వీడి ఇతర పార్టీలలో చేరారు.. ఇక కొందరు నేతలైతే రాజకీయాలకే దూరంగా ఉంటున్నారు.. 'రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీసింది' అని విమర్శిస్తూ అప్పుడప్పుడు ఇతర పార్టీ నేతలు గుర్తు చేసుకోవడమే తప్ప, ఇంచుమించు ఏపీలో అందరూ కాంగ్రెస్ ని మర్చిపోయారు.. ఇక ఏపీలో కాంగ్రెస్ ఎప్పటికీ కోలుకోలేదు అనుకున్నారు.. కానీ కాంగ్రెస్ తిరిగి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.. ఏపీ లో బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఏపీ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది.. ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీతో కలిసి పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహాలు రచిస్తోంది..  ఇప్పటికే పార్టీని వీడిన సీనియర్ నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.. రేపో మాపో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో సహా పలువురు నేతలు తిరిగి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. వీరి చేరిక వల్ల 'కార్యకర్తల్లో ఉత్సహం వస్తుంది.. అలానే పార్టీని వీడిన కేడర్ ఎంతో కొంత తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉంది' అని అధిష్టానం భావిస్తోంది. ఉమెన్ చాందీ ఏపీలో ప్రతి నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి అనుకుంటున్నారు.. వచ్చే ఎన్నికల్లో సీట్లు గెలవకపోయినా ప్రతి నియోజకవర్గంలో కనీసం పదివేల ఓట్లు నుంచి 50 వేల ఓట్లు సాధించేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు.. ఒక్కో నియోజక వర్గంలో పదివేల ఓట్లు అంటే కాంగ్రెస్ పుంజుకున్నట్టే.. ఇంకేంటి కాంగ్రెస్ హ్యాపీ..  ఇంతవరకు బాగానే ఉంది కానీ కాంగ్రెస్ పుంజుకుంటే వైసీపీ కొంప మునిగినట్టే అంటున్నారు విశ్లేషకులు.. విభజన అనంతరం కాంగ్రెస్ ని వీడిన మెజారిటీ కేడర్ అంతా వైసీపీలో చేరింది.. ఇప్పుడు వైసీపీ బీజేపీకి దగ్గరవుతోంది.. ఇది జీర్ణించుకోలేని కొందరు కార్యకర్తలు,ఎస్సీలు, మైనార్టీలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలని చూస్తున్నారట.. ఆ కేడర్ ఎంతో కొంత తిరిగి కాంగ్రెస్ లో చేరితే.. ప్రతి నియోజక వర్గంలో వైసీపీ ఓటు బ్యాంకు పదివేలు తగ్గితే.. వైసీపీ పరిస్థితి ఏంటి?.. అసలే గత ఎన్నికల్లో 5 వేలు లోపు మెజారిటీతో గెలిచిన స్థానాలు చాలా ఉన్నాయి.. వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పదివేల ఓట్లు సాధిస్తే, సీఎం అవ్వాలన్న జగన్ ఆశలు మీద నీళ్లు జల్లినట్టేనా.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంటే జగన్ కొంప మునిగేలా ఉందిగా అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

మహాత్మాగాంధీ పోటీ చేసిన నోట్లు పంచాల్సిందే..!!

  ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే.. నాయకుడు అంటే నలుగురిని నడిపించేవాడు కాదు, నలుగురికి నోట్లు పంచేవాడు అనిపిస్తుంది.. ఒకప్పుడు ఎన్నికల ప్రచారంలో నాయకులు, మేము గెలిస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని ప్రచార పత్రాలు పంచేవారు.. కానీ ఇప్పుడు ఏం చేస్తారో చెప్పినా చెప్పకపోయినా.. ఎంతిస్తే ఓటేస్తారని అడిగి మరీ నోట్లు పంచుతున్నారు.. ప్రజలు నోట్లు తీసుకొని ఓట్లేస్తున్నారు.. తరువాత నాయకులు పని చెయ్యట్లేదు, అవినీతి పెరిగిపోయింది అంటూ బాధపడుతున్నారు.. పోనీ వచ్చే ఎన్నికల్లో అయినా నోట్లిచ్చే నాయుడు కాదు మంచి చేసే నాయుడుకి ఓటేద్దాం అనుకుంటారా?.. అబ్బే లేదు.. అదే పాత పాట.. ఇప్పుడు చెప్పండి తప్పు ఎవరిది?.. నోట్లు పంచే నాయకుడుది కాదు, ఆ నోట్లు తీసుకుని ఓటేసే ప్రజలది.. ప్రజలు నోట్లకి అలవాటు పడిపోయారు కాబట్టే, కొందరు మంచి నాయకులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో నోట్లు పంచుతున్నారు, నోట్లు పంచలేని మంచి నాయకులు సాధారణ ఓటర్లులా మిగిలిపోతున్నారు.. ఈ నిజం నాయకులకి కూడా తెల్సు.. కానీ ప్రజలకి చెప్పలేరు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి కర్ణాటక ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం సంచలన వ్యాఖ్యలు చేశారు..  ప్రస్తుతం ఎన్నికలు ఎంతో ఖరీదైపోయాయి.. స్వయంగా మహాత్మాగాంధీ ఎన్నికల బరిలోకి దిగినా నోట్ల కట్టలు పట్టుకోవాల్సిందేనని అన్నారు.. దేశంలో ప్రజాస్వామ్యం రోజురోజుకు మరింత ఖరీదైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటేనే దాదాపు రూ.10 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని, గాంధీ పోటీచేసినా అంత మొత్తం ఖర్చు చేయక తప్పదన్నారు.. ప్రజల కోసం ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నా వారికి పట్టడం లేదని, పోలింగ్ రోజు నాయకులు పంచే తాయిలాల గురించే వారు ఆలోచిస్తున్నారంటూ ఇబ్రహీం అభిప్రాయపడ్డారు.. ఇది అందరికీ తెల్సిన నిజమే.. కొందరు ఆయనలా బయటపడతారు, మిగతావారు బయటపడరు అంతే తేడా.. దేశం మారాలంటే ముందు ప్రజలు మారాలి.. ప్రజలు మారితే మంచి నాయకులు వస్తారు.. ఆటోమేటిక్ గా దేశం మారుతుంది.