ఫైళ్ళ దగ్ధం తీగ లాగితే లిక్కర్ స్కామ్ డొంక కదిలింది..!

తీగ లాగితే డొంక కదిలిందన్నది సామెత.. కానీ ఏపీలో ఒక తీగ లాగితే ఏకంగా రెండు డొంకలు కదిలాయి. జగన్ హయాంలో వైసీపీ నేతల అక్రమ సంపాదన, భూకబ్జాల వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందన్నది వెల్లడి అవుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డిల అక్రమాల జాబితా కొండవీటి చాంతాడును మించి పోయిందన్ని పోలీసుల దర్యాప్తులో వెల్లడౌతోంది. జగన్ హయాంలో పెద్దిరెడ్డి భూదందాల పర్వం అడ్డూ అదుపూ లేకుండా సాగిందనడానికి సాక్ష్యాలను మాయం చేసే క్రమంలో మదలపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లను దగ్ధం చేశారన్న ఆరోపణలపై పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. ఆ దర్యాప్తులో భూదందాలతో పాటు మద్యం కుంభకోణం గుట్టు కూడా బయటపడింది. ఫైళ్ల దగ్ధం కేసులో పోలీసులు చేసిన సోదాలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిల మద్యం దందా వెలుగులోనికి వచ్చింది. సోమవారం (ఆగస్టు 26) సీఐడీ ఉన్నతాధికారులు మదనపల్లె ఫైళ్లదగ్ధం కేసు దర్యాప్తులో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్ రెడ్డి సన్నిహితుల ఇళ్లలో నిర్వహించిన సోదాలలో దొరికిన పత్రాలలో వందల కోట్ల నగదు లావాదేవీలు వెలుగు చూశాయి. ఈ లావాదేవీలన్నీ మద్యం కుంభకోణంకు సంబంధించిందేనని తేలింది.   ఏపీలో మద్యం స్కాం మొత్తం.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని తేలింది. డిస్టిలరీలను లాక్కోవడం దగ్గర నుంచి విచిత్రమైన బ్రాండ్లను ప్రవేశ పెట్టడం వరకూ.. కమిషన్లు దండుకోవడం సహా పెద్ద ఎత్తున అవినీతి  జరిగింది. అంతే కాకుండా మద్యం విక్రయాలు మొత్తం నగదు లావాదేవీలు జరపడం వెనుక కూడా  కుట్ర ఉందని వెల్లడైంది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైర్ తర్వాత అధికారులు పెద్దిరెడ్డి సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు.  హైదరాబాద్ సహా పలు చోట్ల నిర్వహించిన సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే లిక్కర్ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా దొరికాయి. ఇప్పటికే వాసుదేవరెడ్డి దగ్గర తీసుకున్న వాంగ్మూలాల ఆధారంగా ఆ సాక్ష్యాలను విశ్లేషిస్తున్నారు. ఇంకా డిస్టిలరీలు పోగొట్టుకున్న పాత యజమానుల నుంచి కూడా పోలీసులు  వాంగ్మూలాలు రికార్డు చేశారు. ఏపీలో మ ద్యం కుంభకోణానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం సీఐడీ సంపాదించిందని తెలుస్తోంది.  ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్రపై పూర్తి స్థాయిలో ఆధారాలు, సమాచారం లభించింది. దీంతో సీఐడీ ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సో నేడో, రేపో ఏపీ  లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి అరెస్టు ఖాయమని వైసీపీ వర్గాలే అంటున్నాయి.  

తానా 2025 మహాసభల వేదిక డెట్రాయిట్‌...!

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 24వ మహాసభ డెట్రాయిట్లో నిర్వహించాలని నిర్ణయించారు. 2025 జులై మొదటి వారంలో ఈ వేడుకలు జరగనున్నాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ మహాసభలకు కో-ఆర్డినేటర్‌గా ఉదయ్ కుమార్ చాపలమడుగు, చైర్మన్‌గా గంగాధర్ నాదెళ్ల నియమితులైనట్లు ‘తానా’ సెక్రటరీ రాజా కసుకుర్తి తెలిపారు. ఈ మేరకు బోర్డు, ఎగ్జిక్యూటివ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ‘తానా’ 2025 మహాసభలు జరిగే నగరాన్ని ఎంపిక చేయడానికి ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ నివేదికను తానా ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఆమోదించారు. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీకి శ్రీనివాస్ కోనేరు ఛైర్మన్‌గా వ్యవహరించారు. నరహరి కొడాలి, శ్రీనివాస్ దాసరి సభ్యులు. ప్రతిపదేళ్ళకు ఒకసారి తానా మహాసభలు డెట్రాయిట్లో జరగడం సంప్రదాయంగా వస్తోంది. 2005, 2015 సంవత్సరాల్లోనూ డెట్రాయిట్ నగరంలోనే ‘తానా’ మహాసభలు జరిగాయి. ఇప్పుడు కూడా ఆ సంప్రదాయానికి కొనసాగింపుగా 2025 సంవత్సరం ‘తానా’ మహాసభలను కూడా అక్కడే నిర్వహించాలని ముగ్గురు సభ్యుల కమిటీ నిర్ణయించడం విశేషం. డెట్రాయిట్ తెలుగు వారికి దగ్గరగా ఉంటుందని, హాజరయ్యే అతిథులకు వసతి సౌకర్యాలు కల్పించడానికి వీలుగా వుంటుందని ‘తానా’ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. తానా ఛైర్మన్ గంగాధర్ నాదెళ్ల తానాలో పాత తరానికి, కొత్త తరానికి సుపరిచితులు. ఆయన పర్యవేక్షణలో తానా సభలు ఎలాంటి లోటు లేకుండా జరుగుతాయన్న అభిప్రాయాలు వున్నాయి. అలాగే సమన్వయకర్తగా నియమితులైన ఉదయ్ కుమార్ చాపలమడుగు కృష్ణా జిల్లాలోని చల్లపల్లి వాస్తవ్యులు. ‘తానా’లో అనేక కీలక పదవులు నిర్వహించారు. డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (డీటీఏ) కార్యనిర్వాహక కమిటీలోనూ ఆయన అనేక కీలక పదవులు నిర్వహించారు. ముఖ్యంగా, డీటీఏ 25, 40వ వార్షికోత్సవాల సందర్భంగా ఉదయ్ కుమార్ చేసిన కృషి అందరి ప్రశంసలను అందుకుంది. 2005 డెట్రాయిట్ తానా ద్వైవార్షిక సదస్సుకు డిప్యూటీ కో-ఆర్డినేటర్‌గానూ ఆయన పనిచేశారు.  2007లో తానా చైతన్య స్రవంతి కో-ఆర్డినేటర్‌గానూ పనిచేశారు. ఈయన ఎవరో కాదు... ప్రముఖ నటుడు, బాబాయ్, దివంగత చలపతి రావు అల్లుడు. అద్భుతమైన ప్రసంగ నైపుణ్యం ఆయన సొంతం. ఆయన ప్రసంగాలు తెలుగు ప్రజల్లో మంచి గుర్తింపు పొందాయి. డెట్రాయిట్లో జరగనున్న తానా సదస్సుకు ప్రతిభావంతులను బాధ్యులుగా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోందని ‘తానా’ కార్యదర్శి రాజా కసుకుర్తి తెలిపారు.

ఎవరీ క్యాష్‌గిరిబాబు..? పవర్ బ్రోకర్స్ యాక్టివ్ అయ్యారా? 

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్) వెల్‌కమ్ టు జర్నలిస్ట్ లాండ్రి. చంద్రబాబు పాలనలో ఒక అవినీతి అనకొండ గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం. ఎం.వి.శేషగిరిబాబు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి. శేషగిరిబాబును ఆయన కింద పనిచేసే సిబ్బంది ప్రేమతో ‘క్యాష్‌గిరిబాబు’ అని పిలుచుకుంటారంట. అత్యంత వివాదాస్పద అధికారిగా ఆయన పేరు గడించారు. తన శాఖలోని సిబ్బందిని అంతులేని వేధింపులకు గురిచేస్తారని ‘మంచి’ పేరు వుంది. గతంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసినప్పుడు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి మీ సామాజికవర్గం అంటే ఇష్టం వుండదు. మీకు మీరు కోరుకునే పోస్టింగ్‌లపై ఆశ వదులుకోండి అని అధికారుల మొహమ్మీదే చెప్పేంత తెంపరితనం ఈ ఐఏఎస్ సొంతం. కేవలం జగన్‌ రెడ్డికి ఆ సామాజికవర్గం అంటే ఇష్టం వుండదు కాబట్టి, శేషగిరి అలా మాట్లాడ్డం కాదు. ఈయనగారిక్కూడా కమ్మ సామాజికవర్గం అంటే నరనరానా అంతులేని ద్వేషం అని చెప్పుకుంటారు. నిజానికి ‘క్యాష్‌గిరిబాబు’ జగన్ రెడ్డికి వీరభక్తుడు. జగన్ పాలనలో కొత్త విద్యా విధానాలు, బడులకు రంగులు వేయడం వంటి జగన్ లేకి పనులకు గొప్ప సంస్కరణలు అంటూ బహిరంగ సమావేశంలో మైకు ముందు విపరీతంగా పొగిడిన వీరభక్తుడు ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి. ఒక బహిరంగ సమావేశంలో ‘క్యాష్‌గిరిబాబు’ నోటి నుంచి రాలిన ముత్యాలు ఇవిగో... ‘‘విద్యారంగంలో పలు విప్లవాత్మకమైన, వినూత్నమైన మార్పులు తీసుకువచ్చి, సామాన్యులకు కూడా నాణ్యమైన విద్య అందించాలనే తపనతో, ప్రత్యేక శ్రద్ధతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి, పాఠశాలలను, కళాశాలలను ఆధునీకరించడం, డిజిటల్ ఎడ్యుకేషన్, డిజిటల్ బోధనను ప్రవేశపెట్టడం లాంటి అనేక వినూత్న సంస్కరణలతో  ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యకు అనేక అంశాల్లో కేటాయింపులు చేసిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు’’. భజన పీక్స్‌లో వుంది కదూ! కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన స్థాయి తగ్గించుకుని మరీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కమిషనర్‌గా వచ్చారు. ఎవరైనా కావాలని స్థాయి తగ్గించుకుంటారా? మరి శేషగిరి ఎందుకు తగ్గించుకున్నారు? ఎందుకంటే, ముందే చెప్పుకున్నట్టు ఆయన క్యాష్‌గిరి కాబట్టి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ఏ స్థాయిలో అవినీతి వుంటుందో మీకు తెలియనిది కాదు. ఈయన గారిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కమిషనర్‌గా ఎవరి సిఫారసుతో నియమించారు? ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియకుండా లేదా రెవెన్యూ మంత్రికి తెలియకుండా నియామకం జరిగిందా? ఒక పవర్ బ్రోకర్‌కు పైసలు చెల్లించి ఈ స్థానంలోకి వచ్చారనే వార్త పెద్ద ఎత్తున ప్రచారంలో వుంది. కమిషనర్ పదవిలోకి వచ్చీ రాగానే సబ్ రిజిస్ట్రార్ల పోస్టింగ్‌లో కాసుల కమీషన్ల వేట ప్రారంభించారు. ఆ కలెక్షన్ కోసం తన సామాజికవర్గానికి చెందిన ఒక ఆడిట్ రిజిస్ట్రార్‌ను తన ఏజెంట్‌గా నియమించుకుని, రెవిన్యూ మంత్రికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియకుండా సబ్ రిజిస్ట్రార్ల బదిలీల ప్రక్రియ వేగవంతం చేశారు. రాష్ట్రంలో అత్యంత ఆదాయాన్నిచ్చే విజయవాడ బెంజ్ సర్కిల్ సబ్ రిజిస్ట్రార్‌ను బదిలీ చేశారు. దానికి పాత డిప్యుటేషన్లు రద్దు చేస్తున్నాం అని కలరింగ్ ఇచ్చారు. వాస్తవానికి అక్కడ పనిచేస్తున్న అధికారి గతంలో వైసీపీ వేధింపుల దాష్టీకానికి గురైన వ్యక్తి కావడం విశేషం. హైకోర్టు అతని సర్వీసు రికార్డును పరిశీలించి, ప్రభుత్వానికి అతని ద్వారా వందల కోట్ల పన్ను రాబడి తెచ్చిన తీరు చూసి, ఇటువంటి అధికారిని వేధించడమా అని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, మళ్ళీ అదే బెంజ్ సర్కిల్లో అతనికి పోస్టింగ్ ఇవ్వండి అంటూ ఆదేశించింది. జగన్ రెడ్డికి, శేషగిరిబాబుకు నచ్చని సామాజికవర్గం వ్యక్తి కాబట్టి బదిలీవేటు వేశారు. తనకు నచ్చినవారిని బెంజ్ సర్కిల్లో సబ్ రిజిస్ట్రార్‌గా పోస్టింగ్‌లోకి తెచ్చారు. ఈ ఒక్క పోస్టింగ్ కోసం ఎన్ని కోట్లు చేతులు మారాయో మీ ఊహకు అందదు. రెవిన్యూ మంత్రికి తెలిసే జరిగిందా? శేషగిరిబాబు మొత్తం క్యాష్ చేసుకున్నారా అనేది తెలియాల్సివుంది. అంతేకాదు, రాష్ట్రంలో జల్లెడ పట్టి మరీ తనకు నచ్చని సామాజికవర్గానికి చెందిన ఉద్యోగస్తులను వేధింపులకు గురిచేసే పనిలో నిమగ్నమైనట్టు విశ్వసనీయ సమాచారం.  విజయవాడలో గుణదల, గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేస్తున్న కృష్ణప్రసాద్, చైతన్యలను టార్గెట్ చేసి, ఆ స్థానాల నుంచి వారిని పంపించేందుకు కుట్ర జరుగుతోందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరూ కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. గతంలో వైసీపీ ప్రభుత్వానికి వీరిద్దరు అంటకాగి పనిచేసినట్టుగా వీరిద్దరిపై ఆకాశరామన్న లేఖతో ప్రచారం జరుగుతోంది. ఈ ఆకాశరామన్న ఉత్తరాన్ని గుణదల సబ్ రిజిస్ట్రార్ కృష్ణప్రసాద్‌కు రిజిస్టర్ పోస్టులో పంపించారు. ఆకాశరామన్న ఉత్తరం కవర్ మీద ఫ్రమ్ అడ్రస్ మాత్రం పి.సురేష్, గూడవల్లివారి వీధి, డోర్ నంబర్ 27-33-43, టూ టౌన్ గవర్నర్‌పేట అని అని వుంది. వాస్తవానికి ఇది ఫేక్ అడ్రస్. ఈ ఆకాశరామన్న ఉత్తరం వెనుక పెద్ద కుట్రే వున్నట్టు తెలుస్తోంది. ఉత్తరంలో ప్రభుత్వానికి, ఏసీబీకి నివేదించామని బెదిరింపులు వున్నాయి. బలవంతపు బదిలీలకు మానసికంగా సిద్ధం చేయడం కోసమే ఈ బెదిరింపులకు దిగినట్టు తెలుస్తోంది. ఈ ఆకాశరామన్న ఉత్తరంలో వీళ్ళిద్దరినీ టార్గెట్ చేయడానికి అందులో పొందుపరిచిన అంశాలే అందుకు కారణం.  ప్రధానంగా ఈ ఇద్దరినీ గత ప్రభుత్వానికి తొత్తులుగా అభివర్ణించడం పరమ వింత! రాష్ట్రంలో అధిక ఆదాయం వచ్చే రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా గుణదల, గాంధీనగర్‌లను పదే పదే ప్రస్తావించడం వెనుక కుట్రకోణం బయటపడుతోంది. వీరంతా కిందటి ఐజీగా పనిచేసిన రామకృష్ణకు శిష్యులుగా అపవాదు మోపారు. వైసీపీ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ముఖ్య అనుచరులంటూ పేర్కొన్నారు. మరోవైపు వీరు కమ్మకులం పేరు చెప్పుకుని, లోకేష్ పేరును చెడగొడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఇద్దరికీ కిందటి వైసీపీ ప్రభుత్వంలో మంచి పలుకుబడి వుందని, ఏసీపీని కూడా వీళ్ళు మేనేజ్ చేసేవారని చెప్పుకునేవారని... ఇలా ఒకదానికి మరొకదానికి పొంతన లేకుండా లేఖలో పొందుపరిచారు. ఈ ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి పేరు పర్వతనేని నాగరాజు, పటమట పేరుతో ముగించారు. పటమటలో పర్వతనేని నాగరాజు లేరు. రిజిస్ట్రేషన్ శాఖలో ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు కూడా లేవు. లేని వ్యక్తి ఎలా ఫిర్యాదు చేశారో తేలాల్సిన విషయం. కాపీ టు ఏసీబీ అని వున్న ఈ ఉత్తరం నిజంగా ఏసీబీకి పంపారో లేదో తెలియదుగానీ, గుణదల సబ్ రిజిస్ట్రార్ కృష్ణప్రసాద్‌కు పోస్టులో పంపారు. ఇలా పంపటం కూడా పైస్థాయి అవినీతి అధికారుల మైండ్ గేమ్‌లో భాగమని తెలుస్తోంది. 

జగన్ కు రెడ్ బుక్ జ్వరం.. జైలు భయం!

వైసీపీ  హ‌యాంలో  తెలుగుదేశం నేత‌ నారా లోకేశ్ పై  వైసీపీ నేత‌లు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రోల్స్ చేశారు.  మీడియా స‌మావేశాల్లో, స‌భ‌ల్లో  చంద్ర‌బాబు స‌హా నారా లోకేశ్‌ను టార్గెట్‌గా చేసుకొని ఇష్టారీతిలో మాట్లాడారు. ఇక  కొడాలి నాని, వల్ల‌భ‌నేని వంశీ, జోగి ర‌మేశ్‌, ఆర్కే రోజా, పేర్ని నాని వంటి నేత‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వాళ్లు లోకేశ్ ను తిట్ట‌ని రోజు లేదంటే అతిశయోక్తి కాదు.   ప‌ప్పు..  ఎమ్మెల్యేగా కూడా గెల‌వ‌లేడు.. అసెంబ్లీ గేట్లు కూడా తాక‌ లేడు అంటూ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌ల చేశారు. లోకేశ్ చేప‌ట్టిన యువ గ‌ళం పాద‌యాత్ర‌ను అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం అనేక ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ, ప్ర‌భుత్వ కుట్ర‌ల‌ను తిప్పికొడుతూ తెలుగుదేశం పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల అండ‌దండ‌ల‌తో లోకేశ్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేశారు. పాద‌యాత్ర స‌మ‌యంలో తెలుగుదేశం శ్రేణులు, ప్ర‌జ‌ల ప‌ట్ల వైసీపీ నేత‌లు, కొందరు అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో చ‌లించిపోయిన లోకేశ్‌.. రెడ్ బుక్‌ను ప్రారంభిచాడు. రాష్ట్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని హద్దులుదాటి ప్ర‌వ‌ర్తించిన వైసీపీ నేత‌లు, అధికారుల పేర్ల‌ను ఆ రెడ్ బుక్‌లో ఎంటర్ చేస్తూ వ‌చ్చారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో చివ‌రి స‌భ వ‌ర‌కు రెడ్ బుక్‌ను లోకేశ్ మెయింటెన్ చేశాడు. అప్ప‌ట్లో రెడ్ బుక్‌పై వైసీపీ నేత‌లు సెటైర్లు కూడా వేశారు. రెడ్‌బుక్ కు భ‌య‌ప‌డే వారెవరూ లేరు.  ఎన్ని రెడ్‌బుక్‌లైనా రాసుకో లోకేశ్.. అంటూ వైసీపీ నేత‌లు స‌వాళ్లు విసిరారు. కానీ సీన్ మారిపోయింది. లోకేశ్ రెడ్‌బుక్ అంటే వైసీపీ నేత‌లు, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భ‌క్త అధికారులు వ‌ణికిపోతున్నారు. లోకేశ్ రెడ్‌బుక్‌ పేరువింటేనే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సైతం వ‌ణికిపోతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నెల రోజుల‌కే ఏపీలో అరాచ‌క పాల‌న జ‌రుగుతుందంటూ జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లి ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఆ ధర్నా సమయంలో లోకేశ్ రెడ్‌బుక్‌ను జగన్ ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. ఆ త‌రువాత‌ కూడా వైసీపీ నేత‌ల స‌మావేశాల్లోనూ, మీడియాతో మాట్లాడిన స‌మాయాల్లోనూ పలుసార్లు రెడ్‌బుక్ గురించి జ‌గ‌న్ ప్ర‌స్తావిస్తూ వ‌చ్చారు. వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో జ‌రిగిన స‌మావేశంలోనూ రెడ్‌బుక్ గురించే ప్ర‌ధానంగా జ‌గ‌న్ చ‌ర్చించారు. రెడ్ బుక్‌తో వైసీపీ నేత‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, వారికి అండ‌గా వైసీపీ లీగ‌ల్ సెల్ ప్ర‌తినిధులు ఉండాల‌ని జ‌గ‌న్ సూచించిన‌ట్లు తెలిసింది. రెడ్‌బుక్.. రెడ్‌బుక్ అంటూ ప‌దేప‌దే జ‌గ‌న్ మాట్లాడుతుండటంతో వైసీపీ నేత‌లు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ు. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు రెడ్‌బుక్ అంటే ప‌ట్టించుకోని జ‌గ‌న్‌.. ఇప్పుడు మాట్లాడితే రెడ్‌బుక్ అంటూ వ‌ణికిపోతున్నారని వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.  వైసీపీ   హ‌యాంలో అవినీతి అక్ర‌మాలు, భూక‌ బ్జాల‌కు పాల్ప‌డిన వైసీపీ నేత‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం విచార‌ణ జ‌రుపుతోంది. ఇప్ప‌టికే మాజీ మంత్రి జోగి ర‌మేశ్ కుమారుడు అరెస్టు అయ్యారు. జోగి ర‌మేశ్ సైతం  నేడో రేపో అరెస్టు అవ్వడం ఖాయమం టున్నారు. అలాగే  మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి భూక‌బ్జాల ఆరోప‌ణ‌లపైనా  విచార‌ణ జ‌రుగుతోంది. త్వ‌ర‌లో పెద్దిరెడ్డీ జైలుకెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా ఇలా ఇలా వైసీపీ నేత‌లు ఒక్కొక్క‌రిపై వ‌రుస‌గా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో తొంద‌ర‌లోనే త‌న‌ వంతు కూడా వ‌స్తుంద‌ని జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారని వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేయ‌ని అరాచ‌కం లేదు. తెలుగుదేశం నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్టి.. పోలీసుల‌తో కొట్టించాడు. కొందరిని జైళ్లకు పంపించాడు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గ‌డిచిన ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం జెండా పట్టేందుకు సైతం ఎవరైనా భ‌య‌ప‌డాల్సి పరిస్థితులు ఉన్నాయి.  ప్ర‌భుత్వం తీరును ప్ర‌శ్నించిన ప్ర‌జ‌ల‌పైనా వైసీపీ నేతలు దాడులు చేశారు. ఈ క్ర‌మంలో ప‌లువురు ఆత్మ‌హ‌త్య చేసుకోగా.. పలువురు వైసీపీ నేత‌ల దాడుల్లో  మరణించారు. మరింత మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.  ఐదేళ్ల అరాచ‌క పాల‌న సాగించిన జ‌గ‌న్‌..  ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత తాను నీతివంత‌మైన పాల‌న సాగించాన‌ని చెప్పుకోవ‌టాన్ని చూసి వైసీపీ నేత‌లే ఆశ్చ‌ర్య‌పోతున్నారు.  వైసీపీ లీగ‌ల్ సెల్ ప్ర‌తినిధుల స‌మావేశంలో జ‌గ‌న్ మాట్లాడుతూ,  వైసీపీ హ‌యాంలో మనకు ఓటు వేయని వారికి కూడా  ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేశాం. మంచి జరిగే  పనులకు శ్రీకారం చుట్టాం. ఎక్కడా కూడా వివక్ష, అవినీతి చూపలేదు. న్యాయం, ధర్మం అన్నది అందరికీ ఒక్కటే అన్నట్లుగా మన  పాల‌న సాగింది, ఇవాళ మాత్రం న్యాయం కొందరికి మాత్రమే అన్న రీతిలో చంద్రబాబు పాలన ఉందని జ‌గ‌న్ చెప్పుకున్నారు.  జ‌గ‌న్ ప్రసంగం విన్న వైసీపీ నేతలు ఔరా అని ముక్కున వేలేసుకునేలా ఆయన ప్రసంగం సాగింది.  జ‌గ‌న‌న్న ఇంత నిస్సుగ్గుగా అబ‌ద్ధాలు ఎలా చెబుతారు అంటూ వారు నోరెళ్లబెట్టిన పరిస్థితి.  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన రెండు నెల‌ల కాలంలోనే ఏపీలో అభివృద్ధి ప‌రుగులు పెడుతోంది.. శాంతిభ‌ద్ర‌త‌లు అదుపులో ఉన్నాయి. రాష్ట్రానికి కుప్ప‌లు తెప్ప‌లుగా పెట్టుబ‌డులు వ‌స్తున్నాయి. అన్నిటికీ మించి అధికార పగ్గాలు అందుకున్న రెండు నెలలలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు టాప్ 5 సీఎంలలో ఒకరుగా నిలిచారు. అయితే జగన్ కు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు.  జగన్ నిత్యం ఏపీలో అరాచ‌క పాల‌న సాగుతున్నద‌ని ప్ర‌చారం చేయ‌డం, పదేపదే రెడ్ బుక్ గురించి తలచుకుని వణికిపోవడం చూస్తున్న   వైసీపీ నేత‌లు జగన్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తీ సంద‌ర్భంలోనూ జ‌గ‌న్ రెడ్‌బుక్ గురించి ప్ర‌స్తావ‌న తెస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ నేతలపై జరుగుతున్న విచారణ, నేతల అరెస్టులకు కారణం రెడ్ బుక్ అని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్ భయం చూసి  జ‌గ‌న్‌కూడా త్వ‌ర‌లో జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని, వైసీపీ రాబోయే రోజుల్లో క‌నుమ‌రుగు అవుతుందని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.

ఓ పతనమా? నీ పేరు సజ్జలా?

జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారీతిగా చెలరేగిపోయిన నేతలంత ఇప్పుడు తట్టాబుట్టా సర్దేసుకుని రాష్ట్రం వదిలి వెళ్లిపోతున్నారు. స్వయంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డే తాడేపల్లి, బెంగళూరుల మధ్య షటిల్ సర్వీస్ చేస్తూ ఏపీకి చుట్టపు చూపుగా వచ్చి వెడుతున్నారు. యధా నేత తథా పార్టీ అన్నట్లుగా వైసీపీ నేతలు కూడా రాష్ట్రం దాటేస్తున్నారు. అలా దాటేస్తున్న వారంతా జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకూ, దుర్మార్గాలకూ, అవినీతికీ పాల్పడిన వారే కావడం గమనార్హం. కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా  వీళ్లంతా అధికారం అండ చూసుకుని అడ్డగోలుగా చెలరేగిపోయిన వారే. ఇప్పుడు వీరెక్కడా కనిపించడం లేదు. రాష్ట్రం దాటేశారు. కొడాలి నాని ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. వల్లభనేని వంశీ ఎక్కడున్నారో తెలియడం లేదు. ముందస్తు బెయిలు కోసం మాత్రం కోర్టును ఆశ్రయించారు. ఇక ఆర్కే రోజా అయితే తన సహజ స్వభావానికి విరుద్ధంగా సైలెంటైపోయారు. చెన్నై చెక్కేశారని అంటున్నారు. ఇలా వైసీపీలో నోరున్న నేతలంతా నోరు కుట్టేసుకున్నారు.  ఇక జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ అధికారం కోల్పోయాక  మరీ నల్లపూస అయిపోయారు. అంతే కాదు.. పార్టీలోనే ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి కారణం సజ్జలేనని పార్టీ నేతలూ, శ్రేణులూ బాహాటంగానే చెబుతున్నారు. దీంతో సజ్జల సైలెంటైపోయారు. జగన్ కూడా పెద్దగా పట్టించుకోవడం మానేశారు.  పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత సజ్జలకు అతికినట్లుగా సరిపోతుందని చెప్పాలి.  నిజానికి ఒక జర్నలిస్ట్’గా, వ్యాపారవేత్తగా ఎదిగొచ్చిన సజ్జల రామకృష్ణా రెడ్డి గతం గురించి తెలిసిన ఎవరైనా, ఆయనొక జెంటిల్ మేన్, మంచి మనిషి అనే అంటారు. అయితే, రాజకీయ అరంగేట్రం తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చింది. సరే, అదలా ఉంచి, ప్రస్తుతంలోకి వస్తే, వైసీపీలో నెంబర్ 2 పొజిషన్’లో ఉన్నవిజయ సాయి రెడ్డిని ముఖ్యమత్రి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టడంతో తెరపైకొచ్చిన సజ్జల, ఇక అక్కడ నుంచి, జగన్ రెడ్డి కళ్ళు, చెవులు, నోరూ  అన్నీ తానే అన్నట్లు వ్యవహరించారు. అన్ని శాఖలకు ఆయనే మంత్రి అన్నట్లుగా వ్యవహారం నడిపించారు. ఆల్ ఇన్ వన్ సలహాదారుగా అవతరం ఎత్తారు.   ఇప్పుడు అదంతా గతం. జగన్ అధికారం కోల్పోయిన తరువాత ఆయనకు మౌత్ పీస్ గా వ్యవహరించిన సజ్జల ఇప్పుడు తననే కాదు తన కుమారుడు పిల్ల సజ్జల అదే సజ్జల భార్గవ రెడ్డిని కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో పడ్డారు. జగన్ అండ చూసుకుని ఇష్టారీతిగా దాడులు, దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతికి పాల్పడ్డ వైసీపీ నేతలపై కేసులు నమోదౌతున్నాయి. అలాగే సజ్జలపైనా కేసు నమోదైంది.   ఈ క్రమంలోనే ఆయన ఏపీ వదిలేసి హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయారు.  జగన్ అధికారంలో ఉన్నంత కాలం ప్రభుత్వం తరఫున అయినా, పార్టీ తరఫున అయినా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది సజ్జల మాత్రమే. జగన్ కేవలం బటన్ నొక్కుడు సభలకు మాత్రమే పరదాలు కట్టుకుని బయటకు వచ్చి మాట్లాడేవారు.   వైసీపీలో నోరున్న నేతలుగా గుర్తింపు పొందిన కొడాలి నాని,  అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్  వంటివారు సోషల్  ఎంత రెచ్చిపోయి మాట్లాడటం, బూతులతో చెలరేగి ప్రతిపక్ష నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికే పరిమితం అయ్యారు. సజ్జల మాత్రం ప్రభుత్వ వెర్షన్ కు పర్యాయపదంగా నిలిచారు. ఆయన మాటలకు  వెయిట్ ఉండేది.   వివేకా హత్య కేసైనా, జగన్‌పై గులకరాయి దాడి గురించైనా వైసీపి వెర్షన్ సజ్జల రామకృష్ణా రెడ్డి నోటి నుంచే వచ్చేది.  ఇప్పుడు వైసీపీ ఘోర పరాజయం తరువాత సజ్జల పార్టీకి శల్యసారథ్యం చేశారన్న విమర్శలు ఇంటా బయటా గట్టిగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద వైసీపీలో ఎంత వేగంగా ఎదిగారో అంతే వేగంగా పతనమయ్యారు సజ్జల. 

మోడీకి ఏమైంది? విపక్షాలకు భయపడుతున్నారా?

కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడుతోంది. గత పదేళ్లుగా భాగస్వామ్య పక్షాలనే కాదు, విపక్షాలను కూడా లెక్క చేయకుండా వ్యవహరించిన మోడీ తీరులో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.  కేంద్రం విపక్షాల డిమాండ్ల పట్ల స్పందిస్తోంది. కీలక అంశాల విషయంలో విపక్షాల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకుంటోంది. వారితో మాట్లాడుతోంది. విపక్షాలకు గౌరవం ఇస్తోంది. అవి ఇచ్చిన సలహాలూ సూచనలను వింటోది. చాలా వరకూ పాటిస్తోంది కూడా. విపక్షాల డిమాండ్లను తరచూ వింటున్నారు. అమలు చేస్తున్నారు కూడా.  ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టిన మోడీ సర్కార్ లో కనిపిస్తున్న మార్పు బీజేపీ నేతలనే కాదు, ప్రతిపక్షాలను కూడా విస్మయపరుస్తోంది.  లేటరల్ ఎంట్రీ  విషయంలో మోడీ సర్కార్  వెనక్కు తగ్గింది. లేటరల్ ఎంట్రీ పేరుతో… కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్నత ఉద్యోగాల భర్తీకి  ఇచ్చిన నోటిఫికేషన్ ను కేంద్రం ఆదేశాల మేరకు యూపీఎస్సీ వెనక్కు తీసుకుంది.  లేటరల్ ఎంట్రీ పేరుతో భర్తీ చేయాలనుకున్న కొలువులు నిపుణులకు సంబంధించినవి కావడం… అలాగే అవి పర్మినెంట్ ఉద్యోగాలు కాకపోవడంతో  రిజర్వేషన్లు ఉండకపోవడం వంటి కీలక అంశాల విషయంలో విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. లేటరల్ ఎంట్రీ పేరుతో ఐఏఎస్ లకు ప్రత్యామ్నాయ వ్యవస్థను తీసుకువచ్చేందుకు మోడీ సర్కార్ కుట్ర పన్నుతోందనీ, ఐఏఎస్ ల స్థానంలో తీసుకునే ఈ ఉద్యోగుల విషయంలో రిజర్వేషన్లకు అవకాశం లేకపోవడాన్ని తప్పుపట్టాయి.  దీంతో మోదీ వెంటనే లేటరల్ ఎంట్రీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ న ఆపేయాలని ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి లేటరల్ ఎంట్రీ విధానాన్ని గతంలో యూపీఏ సర్కార్ తీసుకు వచ్చింది. అయితే ఇప్పుడు అదే విధానాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది.  అయినా కూడా మోడీ ఈ విషయంలో వెనక్కు తగ్గడం పట్ల బీజేపీ వర్గాలలో విస్మయం వ్యక్తం అవుతోంది. అంతే కాకుండా ఇప్పుడు మోడీ రిమోట్ విపక్షాల చేతుల్లోకి వెళ్లిపోయిందా అంటూ సొంత పార్టీ నుంచే విమర్శలు వినవస్తున్నాయి. అలాగే ఇటీవల వక్ఫ్ బోర్డు బిల్లుపై భిన్నాభిప్రాయాలు వస్తే వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేశారు. ఇది గతంలో మోడీ వ్యవహరించిన తీరుకు పూర్తి భిన్నం. మోడీ 1.0, మోడీ 2.0లో ఎన్నడూ లేని విధంగా  బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ నిర్వహించారు. ఆ సమావేశంలో రాహుల్ గాంధీ   ప్రశ్నలకు విదేశాంగ మంత్రి ఓపిగ్గా బదులిచ్చారు.  ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో ప్రధాని మోడీకి తత్వం బోధపడినట్లు ఉందని  సామాజిక మాధ్యమలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సొంతంగా ప్రభుత్వాన్ని నడిపే బలం లేకపోయినా మోడీ విపక్షాల మాటకు ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారని తాము ఊహించలేదని బీజేపీ నాయకులే అంటున్నారు. భాగస్వామ్య పక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని సజావుగా నడిపేసే అవకాశం ఉందనీ, ప్రభుత్వం పతనమౌతుందన్న భయంతో విపక్షాల డిమాండ్లకు తానా తందానా అన్నట్లుగా వ్యవహరించడం తప్పుడు సంకేతాలను పంపుతోందని బీజేపీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది. అయితే పరిశీలకులు మాత్రం మోడీలో వచ్చిన ఈ మార్పు ప్రజాస్వామ్యానికి మంచిదేనని విశ్లేషిస్తున్నాయి. 

వచ్చే ఏడాది జనవరి నుంచి జన్మభూమి - 2!

గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధే లక్ష్యంగా జన్మభూమి 2 కార్యక్రమాన్ని వచ్చే ఏడాదిలోనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల  బలోపేతానికి నిధులు విడుదల చేశారు. జగన్ హయాంలో అభివృద్ధి ఆనవాళ్లే లేకుండా పోయాయి. గ్రామాల అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన నిధులను పక్కదారి పట్టించారు. దీంతో గ్రామాలలో పారిశుద్ధ్యం నుంచి రోడ్ల వరకూ అన్నీ అధ్వానంగా మారిపోయాయి. దీంతో గ్రామాలకు మళ్లీ పునర్వేభవం తీసుకురావడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ లో జన్మభూమి 2 కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షలో వెల్లడించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. అలాగే ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా  పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేస్తామని చెప్పారు.  2014-19 మధ్య చేపట్టిన వివిధ కార్యక్రమాల ద్వారా గ్రామాల రూపు రేఖలు మార్చేందుకు ప్రయత్నిస్తే,  గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసి గ్రామాలను సమస్యలకు కేంద్రాలుగా మార్చేసిందన్న చంద్రబాబు, మళ్లీ గ్రామాల్లో వెలుగు తెచ్చేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు పంచాయతీ రాజ్ శాఖకు జవసత్వాలు అందిస్తామన్నారు. అలాగే వచ్చే ఏడాది జనవరి నుంచి జన్మభూమి-2 మొదలు అవుతందనీ, ఆ కార్యక్రమం ద్వారా  ప్రతీ ఇల్లు, ప్రతి గ్రామంలో  ఎలాంటి మౌలిక సదుపాయాలు అవసరమో గుర్తించి అందుకు తగిన విధంగా  కార్యాచరణ చేపడతామన్నారు. విద్యుత్, గ్యాస్, మరుగుదొడ్ల,  కుళాయి లాంటి వాటిని అందిం చేందుకు ప్రణాళికా బద్దంగా పనిచేయాలన్నారు. అలాగే  గ్రామానికి అవ‌స‌ర‌మైన వీధి లైట్లు, డ్రైనేజీ కాలువ‌లు, సిమెంటు రోడ్లు, తాగునీటి సరఫరా, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ సెంటర్లు  వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. గ్రామం నుంచి సమీప ప్రాంతాల‌ అనుసంధానం కోసం రోడ్లు, మార్కెటింగ్ ప్రాంతాలను గుర్తించాలన్నారు. వీటిని కూడా కనీస అవసరాలుగా గుర్తించి అందించేందుకు పంచాయతీ రాజ్ శాఖ సమగ్రమైన ప్రణాళికతో పనిచేయాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.   వచ్చే ఐదేళ్లలో  రాష్ట్రంలో 17వేల500 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం చేయనున్నట్టు సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.  అలాగే 10 వేల కిలోమీటర్ల సీసీ డ్రైనేజీ కాల‌ువ‌ల‌ నిర్మాణం జరగాలన్నారు. వైసీపీ హయాంలో గ్రామాల్లో ఖర్చు చేయాల్సిన నిధులు దారి మళ్లాయన్నారు. దీని వల్ల కనీస స్థాయిలో కూడా మౌలిక‌ సదుపాయాల కల్పన జరగలేదన్నారు.  ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖకు రావాల్సిన 990 కోట్లను ఆర్థిక శాఖనుంచి విడుదల చేస్తున్నట్లు చెప్పారు.   ఇంటింటికీ కుళాయి ద్వారా మంచినీళ్లు అందించేందుకు కేంద్రం తీసుకొచ్చిన జల్‌జీవన్‌ మిషన్‌ పథకాన్ని గత ప్రభుత్వం ఉపయోగించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. జల్‌జీవన్‌ మిషన్ కోసం రాష్ట్ర వాటా కింద ఆర్థిక శాఖ నుంచి 500 కోట్లు వెంటనే విడుదల చేస్తామన్నారు.  గత ప్రభుత్వ తీరువల్ల మూలనపడ్డ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలను మళ్లీ ప్రారంభించాలని సీఎంఆదేశించారు. నరేగా పనులపై చర్చించడానికి రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం (ఆగస్టు 23)  గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు.  అక్టోబర్‌ 2  నుంచి చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల‌న్నిటినీ తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

ఫామ్ హౌస్ కే కేసీఆర్ పరిమితం.. ఆహంకారమా? .. కుంగుబాటా?

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం బీఆర్ఎస్ కు మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేతకు భారీ షాక్ అనే చెప్పాలి. తెలంగాణలో తన మాటకు తిరుగులేదు అన్న రీతిలో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని తన నోటి మాటతో, కను సైగతో శాశించిన కేసీఆర్ ఆ ఓటమి తరువాత సైలెంటైపోయారు. ఒక వేళ అయనా మాట్లాడినా పట్టించుకునే వారూ, లెక్క చేసే వారూ లేకుండా పోయారు. పార్టీ ఎమ్మెల్యేలను గంటల తరబడి  ప్రగతి భవన్ (ఇప్పుడు ప్రజాభవన్) గేట్ల మందు పడిగాపులు పడేలా చేసిన కేసీఆర్ కు ఇప్పుడు పిలిచినా సొంత పార్టీ ఎమ్మెల్యేలే కాదు ద్వితీయ శ్రేణి నేతలూ అందుబాటులోకి రాని పరిస్థితి ఎదురైంది.  తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు అందుకున్న కేసీఆర్ తనను తాను సర్వశక్తిమంతుడిగా ఊహించుకున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను నిర్వీర్యం చేసేయడంతో రాష్ట్రంలో ఇక తనకు తిరుగేలేదన్న భావనకు వచ్చారు.  గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు దిమ్మదిరిగేలా చేసింది. ఎందుకంటే.. రాష్ట్రంలో తమకు బీజేపీ నుంచి మాత్రమే నామమాత్రపు పోటీ ఉంటుందని, రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్ లకు అసలు చోటే లేదని కేసీఆర్ భావించారు. కాంగ్రెస్ పట్ల, ఆ పార్టీ నేతల పట్ల చాలా చులకన భావన వ్యక్తం చేశారు. అటువంటి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం, ఆ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు కనీసం ఒక్కటంటే ఒక్క స్థానం కూడా దక్కకపోవడంతో కేసీఆర్ డీలా పడిపోయారు. దీనికి తోడు తాను తానా అంటే తందానా అనే పలువురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పంచన చేరారు. ఇంకా పలువురు అదే బాట పట్టే అవకాశాలున్నాయనీ, బీఆర్ఎస్ ఇప్పుడో అప్పుడో బీజేపీలో వినీలమైపోతుందన్న చర్చ కూడా తెలంగాణలో జోరుగా సాగుతోంది.   ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ కేడర్ లో ధైర్యం, స్థైర్యం నింపాల్సిన కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమి తమైపోయారు. కేవలం ఒక్కటంటే ఒక్క రోజు మినహాయిస్తే ఆయన అసెంబ్లీకి కూడా గైర్హాజరయ్యారు.  పార్టీ పరాజయం తరువాత ఈ తొమ్మిది నెలల కాలంలో ఓ మూడు నాలుగు సార్లు మినహా ఆయన బహిరంగంగా కనిపించింది లేదు. ఇక్కడే పరిశీలకులలోనూ, పార్టీ నేతలు, శ్రేణులలోనూ కేసీఆర్ ది అహంకారమా, కుంగుబాటా అన్న అనుమానాలు వ్యక్తం ఔతున్నాయి. కేసీఆర్ సహజంగా దూకుడుగా వ్యవహరించే రాజకీయ వేత్త. కానీ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమి పాలై తాను ప్రతిపక్ష నేత పాత్రకు పరిమితమైన తరువాత ఆయన చాలా వరకూ ఫామ్ హౌస్ కే పరిమితమైపోయారు.   అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన బయటకు వచ్చి సభలలో మాట్లాడిన దాఖలాలు లేవు. కేవలం పార్లమెంటు ఎన్నికల ప్రచారం సందర్భంగా మాత్రమే ఆయన ప్రజా సమూహంలోకి వచ్చి గళం వినిపించారు. పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ జీరో పెర్ఫార్మెన్స్ తరువాత ఆయన మరీ నల్లపూసై పోయారు. తెలంగాణ పితగా తాను రాష్ట్రాన్ని శాశ్వతంగా పాలిస్తానని భావించేవారు. విపక్ష నేతలెవరూ తన కాలిగోటికి కూడా సరితూగరని భావించేవారు. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఆయన చాలా చులకనగా చూసేవారు. ముఖ్యమంత్రిగా తాను అధికారంలో ఉన్నంత కాలం కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడలేదు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమత్రి. కేసీఆర్ అహంకారపు కోట గోడల్ని బద్దలు కొట్టిన నాయకుడు.  ఇప్పుడు కేసీఆర్ మౌనానికీ, ప్రజా జీవితానికి దూరంగా ఉండడానికీ అదే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కారణమేదైతేనేం కేసీఆర్ క్రియాశీలంగా లేకపోవడం బీఆర్ఎస్ ను మరింత బలహీన పరుస్తోంది. కేటీఆర్, హరీష్రావు ఎంత ప్రయత్నించినా కేసీఆర్ క్రియాశీలంగా లేని లోటును పూడ్చ లేకపో తున్నారు.  బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, డిఫాక్టో సీఎంగా అత్యంత ప్రభావమంతంగా, శక్తిమంతంగా కనిపించిన కేటీఆర్ ఇప్పుడు తేలిపోతున్నారు. హరీష్ రావు పరిస్థితి కూడా దాదాపు అంతే. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ట్రబుల్ షూటర్ గా చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు స్వయంగా ఇబ్బం దుల్లో కూరుకు పోతున్నారు.  ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏ మాత్రంగానైనా నిలదొక్కుకోవాలన్నా, ప్రజా క్షేత్రంలో బలోపేతం కావాలన్న కేసీఆర్ తన మౌనం వీడి జనంలోకి రావాలి. అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఆయన ప్రజా జీవితంలో క్రియాశీలంగా వ్యవహరించకపోవడానికి కారణం ఏమిటన్నదానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. పరిశీలకులు అయితే  కేసీఆర్ మౌనానికి, ముఖం చాటేయడానికి  కారణం అయితే అహంకార లేకుంటే కుంగుబాటు అని విశ్లేషిస్తున్నారు.   

తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ!

తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గచ్చిబౌలీ లేదా హైదరాబాద్ శివార్లలో వున్న హకీంపేటలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదించారు. స్పోర్ట్స్, మెడిసిన్, స్పోర్ట్స్ సైన్స్ సహా పన్నెండుకు పైగా కోర్సులు ఆ యూనివర్సిటీలో ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల దక్షిణ కొరియాలోని సియోల్‌లో కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని (కేఎస్ఎన్‌యూ) సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీలో భాగస్వా్మ్యానికి కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రాథమికంగా అంగీకరించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 2028లో జరిగే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.లో తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ క్రీడాకారులు సత్తా చాటే విధంగా క్రీడా సదుపాయాల కల్పనలో సహకరించాలని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రను రేవంత్ రెడ్డి కోరారు.

ఏలూరు వైసీపీ ఆఫీసు కూల్చేసింది ఎందుకంటే...

ఏలూరులో గత ఏడాది కాలంగా వున్న వైసీపీ కార్యాలయాన్ని శుక్రవారం (ఆగస్టు 16) నాడు కూల్చేశారు. దీని వెనుక రాజకీయ కారణాలు వున్నాయని కొంతమంది అనుకున్నారు. కానీ, అలాంటివేమీ లేవని వైసీపీ నుంచి తాజాగా బయటకి వచ్చిన ఆళ్ళ నాని స్పష్టం చేస్తున్నారు. శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన, వైసీపీ కార్యాలయం కూల్చివేత వెనుక వున్న అసలు విషయాన్ని స్పష్టంగా చెప్పారు. మీడియా సమావేశంలో ఆళ్ళనాని ఏం చెప్పారంటే... ‘‘వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తున్నాను. ఇకపై వ్యక్తిగతంగా అందరికీ అందుబాటులో ఉంటాను. ఏలూరులో పార్టీ ఆఫీస్ కూల్చివేతపై వినిపిస్తున్న ఆరోపణలు అపోహ మాత్రమే.  గత ఏడాదిగా పార్టీ కార్యాలయం ఉన్న స్థలాన్ని యజమానికి తిరిగి ఇవ్వాలని కోరిన విషయం పార్టీ రీజినల్ కో - ఆర్డినేటర్  మిథున్ రెడ్డికి కూడా తెలుసు. ఆగస్టు 1వ తేదిన పార్టీ కార్యాలయ స్థలాన్ని యజమానికి హ్యాండోవర్ చేయటం జరిగింది. ఆగస్టు 15  కార్యక్రమం అనంతరం స్థల యజమాని స్థలాన్ని పూర్తి స్థాయిలో హ్యాండోవర్ చేసుకున్నారు. ఇందులో ఎలాంటి ఆరోపణలకి తావు లేదు. పార్టీ కార్యాలయ స్థలాన్ని ఎవరైతే లీజుకు ఇచ్చారో  అతను అమెరికాలో ఉంటారు. అతని పేరు రవిచంద్ర నా మిత్రుడు. రాజకీయ పార్టీకి కార్యాలయం అంటే ఎవరూ ముందుకు రారు. కానీ, నా అభ్యర్థన మేరకు 2 సంవత్సరాల లీజు కోసం 2017లో ఆ స్థలం తీసుకున్నాము. ఆ తర్వాత దాంట్లోనే తాత్కాలిక నిర్మాణాలు చేపట్టాము. కానీ గత ఏడాదిగా ఆ స్థలం తిరిగి ఇవ్వాలని, దాన్ని డెవలప్మెంట్‌కి ఇచ్చుకుంటాం అని స్థల యజమాని కొరటం జరిగింది. ఆ విషయం గత ఏడాది రీజినల్ కో - ఆర్డినేటర్ మిథున్ రెడ్డికి చెప్పటం జరిగింది. ఆయన ఎన్నికలకు 3 నెలల ముందే స్థలం యజమానికి ఇచ్చేయాలని చెప్పటం జరిగింది. కానీ ఎన్నికల వేళ కార్యాలయం తీసేస్తే మంచి విధానం కాదు అని సమయం తీసుకోవటం జరిగింది.  15 రోజుల క్రితమే స్థలాన్ని యజమానికి హ్యాండోవర్ చేయాలని పార్టీ నాయకులు నిర్ణయించటం జరిగింది.  ఆగస్టు 1వ తేదీన స్థలాన్ని హ్యాండోవర్ చేసాము. ఆగస్టు 15 కార్యక్రమం నిర్వహణ కోసం స్థల యజమాని అనుమతి తీసుకుని కార్యక్రమాన్ని నిర్వహించాం.  అనంతరం ఆగస్టు 16 వ తేదిన స్థలాన్ని స్థల యజమాని పూర్తి స్థాయిలో హ్యాండోవర్ చేసుకున్నారు. అందులో వున్న నిర్మాణాలను కూల్చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు... ప్రజలు నాయకులు గమనించాలి అని కోరుతున్నాను.. అలాగే కొద్ది రోజుల క్రితం నేను ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి, ఏలూరు ఇన్‌ఛార్జ్ పదవికి రాజీనామా చేశాను.  అప్పుడు నేను పార్టీకి రాజీనామా చేయలేదు.  ఇప్పుడు నా వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను..  గెలుపు ఓటములకి అతీతంగా ఏలూరు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’.

60 రోజుల్లో 6 సార్లు బెంగళూరుకు జగన్!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి, బెంగళూరుల మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నారు. అధికారం కోల్పోయిన 60 రోజుల వ్యవధిలో కనీసం అరడజను సార్లు ఆయన బెంగళూరు వెళ్లారు. ఆయన తరచుగా బెంగళూరు వెళ్లడంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే సమయంలో జగన్ ఆంధ్రప్రదేశ్ లో స్థిరంగా ఉండకపోవడం వైసీపీ శ్రేణుల స్థైర్యం, జగన్ పై నమ్మకం కోల్పోయేలా చేస్తున్నది.  ఇప్పటికే పార్టీ ఓటమి తరువాత వైసీపీలో ఫైర్ బ్రాండ్ లుగా గుర్తింపు పొందిన నేతలంతా సైలెంట్ అయిపోయారు. వీలైనంతగా పార్టీకీ, పార్టీ అధినేతకూ దూరం జరిగారు. వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో జగన్ కు కళ్లు, చెవులు, నోరుగా వ్యవహరించిన సకల శాఖల మంత్రిగా పెత్తనం చెలాయించిన సజ్జల మీడియా కంట పడకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అలాగే పార్టీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలు నిర్వహించిన ఆయన పుత్ర రత్నం పిల్ల సజ్జల పోలింగ్ అయిన మరునాటి నుంచే అయిపు లేకుండా పోయారు. ఇక విపక్షాలపై విమర్శలంటూ బూతులే అన్నట్లుగా వ్యవహరించి గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాలి ఇంచుమించు అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఇక గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయితే బయటకనిపిస్తే అరెస్టే అన్న భయంతో ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. మరో ఫైర్ బ్రాండ్ రోజా రాష్ట్రం దాటేశారని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇప్పుడు ఇక వైసీపీ తరఫున మాట్లాడేందుకు పేర్ని నాని, అంబటి వంటి వారు తప్ప మరెవరూ కనిపించడం లేదు. చాలా మంది సీనియర్లు ఇప్పటికే పార్టీ వీడి వెళ్లిపోయారు. మరి కొందరు రాజకీయాలకే స్వస్తి పలికారు. ఈ పరిస్థితుల్లో జగన్ రాజకీయంగా ఒంటరి అన్న భావనతో తాడేపల్లిలో స్థిమితంగా గడప లేకపోతున్నారనీ, అందుకే సందు దొరికినా, దొరకకపోయినా బెంగళూరు చెక్కేస్తున్నారని అంటున్నారు. దీనికి తోడు జగన్ హయాంలో అవకతవకలు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలపై దర్యాప్తు సాగుతోంది. ప్రాథమికంగా కొందరు నేతలు, అధికారుల పేర్లే బయటకు వస్తున్నప్పటికీ ముందు ముందు జగన్ కూడా విచారణ ఎదుర్కొనవలసి వస్తుందనీ, ఆ భయంతోనే సాధ్యమైనంత వరకూ రాష్ట్రం బయటే గడిపేయాలని జగన్ భావిస్తున్నారనీ పరిశీలకులు అంటున్నారు.  

ఐపీఎస్ లకు పనిష్మెంట్ ఓకే.. ఐఏఎస్ లను వదిలేశారా ఎంటి?

ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో  రాజారెడ్డి రాజ్యాంగం అమలయ్యిందే తప్ప భారత రాజ్యాంగం కాదు అనేలా పాలన సాగింది. జనం జగన్ పాలనకు తమ ఓటుతో చరమగీతం పాడడానికి అది ఒక ప్రధాన కారణం.  చరిత్రలో ఇంత వరకూ ఏ పార్టీకీ ఎదురు కానటువంటి ఘోర పరాజయాన్ని జగన్ కు అందించి ఇంటికి సాగనంపారు.  సర్వ వ్యవస్థలనూ నిర్వీర్యం చేసి జగన్ సాగించిన అరాచక పాలనకు కొందరు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు వంత పాడారు. సరే జగన్ సర్కార్ పతనమై.. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. జగన్ హయాంలో  నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా చంద్రబాబు సర్కార్  దూరంగా పెట్టింది.  జీఏడీలో రిపోర్టు చేయమని ఆదేశించింది. సరే పని అప్పగించకుండా అప్పనంగా జీతం ఇచ్చేసి ఊరుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్న తరుణంలో జగన్ తో  అంటకాగి పోస్టింగులు లభించక వెయిటింగ్ లో ఉన్న 16 మంది ఐపీఎస్ లకు రోజూ ఆఫీసుకు వచ్చి సంతకాలు పెట్టాలఆదేశాలు అందాయి. అంటే వారు ప్రతి రోజూ ఆఫీసుకు వచ్చి సంతకం చేయాలి. డ్యూటీ అవర్స్ ముగిసే వరకూ పని లేకుండా కార్యాలయంలో కూర్చుని సాయంత్రం వెళ్లే ముందు మరోసారి సంతకం చేయాలి.  ఏదైనా కేసులో నిందితుడికి కోర్టు బెయిలు మంజూరు చేస్తూ పెట్టే కండీషన్లు కూడా దాదాపు ఇలాగే ఉంటాయి. సాక్షులను ప్రభావితం చేయరాదు. కేసుకు సంబంధించి బయట ఎక్కడా నోరు విప్పకూడదు. నిత్యం అందుబాటులో ఉండాలి. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదు అన్నది సాధారణంగా కండీషన్డ్ బెయిలు నిబంధనలుగా ఉంటాయి. ఇప్పుడు పోస్టింగ్ లు లేని ఐపీఎస్ లకు కూడా పోలీస్ బాస్ జారీ చేసిన ఆదేశాలు ఆ కండీషన్డ్ బెయిలులాగే ఉన్నాయి. ఇదే విషయాన్ని తెలుగుదేశం సీనియర్ నాయకుడు జేసీ చెప్పారు. వారిని చూసి జాలి పడ్డారు.  ఇప్పుడు జగన్ తో అంటకాగి నిబంధనలకు తిలోదకాలిచ్చేసిన 16 మంది ఐపీఎస్ లకు  ఈ శిక్ష సమంజసమేనంటున్నారు ప్రజలు.  ఇక శాఖాపరమైన విచారణకు కూడా ఉపక్రమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎస్ ల విషయంలో తీసుకున్న చర్యను అభినందిస్తునే .. ఐఏఎస్ ల విషయం ఏమిటంటూ సర్కార్ ను జనం నిలదీస్తున్నారు.  నిబంధనలకు పాతరేసిన ఐఏఎస్ లపై చర్యలెప్పుడని ప్రశ్నిస్తున్నారు.  ఎందుకంటే ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా సర్వీసు నిబంధనలలో  తేడాలు ఉండవు. వెయిటింగ్‌లో ఉన్న అంటే పోస్టింగులు ఇవ్వని ఐపిఎస్‌లను రోజూ ఆఫీసుకు రావాలని పోలీసు బాసు ఆదే శించారు. మరి పోస్టింగులు ఇవ్వని, వెయిటింగ్ లో ఉన్న ఐఏఎస్ల విషయంలో సీఎస్ ఎందుకు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని సందేహం వ్యక్తం చేస్తున్నారు.   జగన్ సర్కారుతో అంటకాగిన 16 మంది ఐపిఎస్ అధికారులను ప్రతిరోజూ హెడ్‌క్వార్స్‌కు హాజర వాలన్న డీజీపీ నిర్ణయాన్ని.. ఐఏఎస్‌ల విషయంలో సీఎస్ ఎందుకు పాటించడం లేదంటూ తెలుగుదేశం శ్రేణులు కూడా నిలదీస్తున్నాయి.  జగన్ జమానాలో ఒక వెలుగు వెలిగి, ఇప్పుడు వెయిటింగ్‌లో ఉన్న ఐఏఎస్‌ల పట్ల ప్రత్యేక అభిమానం ఏమిటన్న సందేహాలు అధికార వర్గాలలో కూడా వ్యక్తం అవుతున్నాయి.   నిబంధనలను తుంగలోకి తొక్కి జగన్ కు వంత పాడిన  ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్, రజత్‌భార్గవ్, గోపాలకృష్ణ ద్వివేదీ, ముత్యాలరాజు, మురళీధర్‌రెడ్డి, నారాయణ్‌భరత్ గుప్తా, మాధవీలత, అనిల్‌కుమార్‌రెడ్డి, నీలకంఠారెడ్డి, హరితకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టారు. వీరిలో ప్రవీణ్ ప్రకాష్ కు మాత్రం వీఆర్‌ఎస్ ఇచ్చారు. మిగిలిన వారంతా జీఏడీకి రిపోర్టు చేసి, దర్జాగా వేతనంతో కూడిన సెలవలను ఎంజాయ్ చేస్తుంటే సీఎస్ ఎందుకు ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఈ ఐఏఎస్ లలో కొందరు ఇప్పటికీ వైసీపీ అగ్రనేతలతో టచ్ లో ఉన్నారన్న ఆరోపణలు తెలుగుదేశం నుంచే వస్తున్నాయి.   ఈవెయిటింగ్ ఐఏఎస్ లను కూడా ప్రతి రోజూ సెక్రటేరియెట్ కు వచ్చి సంతకాలు పెట్టాలన్న ఆదేశాలు వెంటనే జారీ చేయాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.   

జగన్ వ్యూహం ఇదేనా? కాంగ్రెస్ తో దోస్తీ కవచం అవుతుందా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలో ఉండగా ప్రజాపీడన పాలన సాగించారు. అందుకు ఫలితంగా అధికారం కోల్పోయారు. కనీసం విపక్ష హోదా కూడా దక్కకపోయినా వైసీపీ విధానాలు మాత్రం మారలేదు. జగన్ అదే ప్రజా పీడన పంధాతో అధికారం లేకపోయినా రాష్ట్రా అభివృద్ధిని అడ్డుకోవడానికి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవద్దంటూ ప్రముఖ పారిశ్రామిక సంస్థలను ట్యాగ్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా నెగటివ్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది.  ఇక మరో వైపు తన మెడపై వేళాడుతున్న కేసుల నుంచి బయటపడేందుకు జగన్ వ్యూహాలు పన్నుతున్నారు. ముందు చూపుతో జాతీయ స్థాయిలో పావులు కదుపుతున్నారు. ఆయన ఇండియా కూటమి పార్టీలతో టచ్ లోకి వెళ్లడం వెనుక ఉన్నది ఇదే వ్యూహమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ఆయన ఇటీవల ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన సమాజ్ వాదీ, తృణమూల్, శివసేనలకు చెందిన నాయకులు హాజరై జగన్ కు మద్దతు పలికారు. ఒక వైపు బీజేపీతో తన రహస్య మైత్రిని కొనసాగిస్తూనే.. మరో వైపు విపక్ష కూటమితో కూడా చేతులు కలిపేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాల వెనుక ఉన్న వ్యూహం ఒక్కటే. రాజకీయంగా అధికారం అన్నది ఇప్పట్లో కనీసం ఆలోచించడానికి కూడా వీల్లేని పరిస్థితి ఉండటంతో కనీసం కేసుల నుంచైనా రక్షణ ఉంటే చాలన్న భావనతో జగన్ జాతీయ స్థాయిలో పావులు కదుపుతున్నారని అంటున్నారు.  దీనికి తోడు బీజేపీకి రాజ్యసభలో  బలం లేదు కనుక తన పార్టీ సభ్యుల మద్దతు కోసం ఆ పార్టీ తన విషయంలో అంటే తన కేసుల విషయంలో దూకుడుగా వెళ్లదన్న ధీమా జగన్ లో కనిపిస్తోంది. కొద్ది రోజుల కిందట ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీకి వైసీపీ అవసరం ఉంది అనడం ఇందులో భాగమే. రాజ్యసభలో అవసరమైన ప్రతి సందర్బంలోనూ మద్దతు ఇస్తాం.. అందుకు ప్రతిగా మా అధినాయకుడి కేసుల విషయంలో మీ సహకారం కావాలన్న ప్రతిపాదనే ఉందని పరిశీలకులు అంటున్నారు.  తెలుగుదేశం పార్టీకి  పార్లమెంటులో 16 మంది ఎంపీలుంటే..  వైసీపీకి15 మంది ఎంపీలు ఉన్నారు. (రాజ్యసభలో 11, లోక్ సభలో 4) మేం ఎక్కడా తక్కువ కాదు అన్న సాయిరెడ్డి వ్యాఖ్యల వెనుక బీజేపీపై ఒత్తిడి తీసుకువచ్చే వ్యూహమే ఉందని చెబుతున్నారు.  రాజ్యసభలో ఎన్డీయేకు అవసరమైన బలం లేనందున సహజంగానే వైసీపీకి కలుపుకొని వెళ్లేందుకు బీజేపీ  ప్రయత్నిస్తుంది. స్పీకర్ ఎన్నిక సమయంలో బీజేపీ నుంచి వైసీపీకి ఫోన్ రావడానికి కారణం కూడా  ఇదే. అయితే ఈ పరిస్థితి ముందు ముందు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వచ్చే నెలలో 12రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలలో బీజేపీ సునాయాసంగా 11 స్థానాలను గెలుచుకుంటుంది. అప్పుడు ఇక కేంద్రంలోని మోడీ సర్కార్ కు జగన్ పార్టీ ఎంపీల అవసరం ఉండదు.  ఇక జగన్ క్విడ్ ప్రోకో ప్రతిపాదనలను లెక్క చేయాల్సిన అవసరం ఉండదు.   దీంతో జగన్ ఇక పూర్తిగా కాంగ్రెస్ కూటమితో చెట్టాపట్టాలేసుకుని బీజేపీకి వ్యతిరేకంగా నిలవడం ఒక్కటే మార్గం. తన కేసుల విషయంలో సత్వర విచారణ ఆరంభమైతే కాంగ్రెస్ కూటమిలో భాగస్వామిని కావడం వల్లనే రాజకీయ వేధింపులు అంటూ ఎదురు దాడికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో భేటీ లో కాంగ్రెస్ హైకమాండ్ తో సంప్రదింపులకు మార్గం సుగమం చేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే జగన్ వ్యూహాలు సక్సెస్ అవుతాయా లేదా? అన్న సంగతి ముందు ముందు తేలుతుంది. మొత్తం మీద ఏపీలో అధికారం కోల్పోయిన తరువాత తన కేసుల విషయంలో రాజకీయ కవచం లేకపోవడంతో జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారనీ, బయటపడే మార్గం కోసం డిస్పరేట్ గా వెతుకుతున్నారని పరిశీలకులు అంటున్నారు. 

దూకుడు పెంచిన రేవంత్ సర్కార్.. మ‌రో కీల‌క నిర్ణ‌యం!

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం దూకుడు పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త‌లు అందిస్తోంది. రేవంత్ రెడ్డి, ప‌లువురు మంత్రులు ప్ర‌స్తుతం అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. అగ్రరాజ్యంలో ప్ర‌ముఖ‌ కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో వారు భేటీ అవుతున్నారు. త‌ద్వారా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా రేవంత్ ముందుకు సాగుతున్నారు. మ‌రోవైపు ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌పైనా ప్ర‌భుత్వం వేగంగా నిర్ణ‌యాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, గృహ‌జ్యోతి కింద ప్ర‌తీ కుటుంబానికి రెండు వంద‌ల యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ అమ‌లు, రూ. 500కే గ్యాస్ సిలీండ‌ర్  ప‌థ‌కాల‌ను ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంది. ల‌బ్ధిదారులు ప‌థ‌కాల ఫ‌లాల‌ను అందుకుంటున్నారు. దీనికితోడు రూ.ల‌క్ష‌న్న‌ర లోపు రుణాలు క‌లిగిన రైతుల‌కు ఇటీవ‌ల ప్ర‌భుత్వం రుణ‌మాఫీ చేసింది. ఆగ‌స్టు 15వ తేదీ నాటికి రూ.ల‌క్ష‌న్న‌ర నుంచి రూ. 2ల‌క్ష‌ల రుణాలు క‌లిగిన రైతుల‌కు రుణ‌మాఫీని చేసేందుకు రెడీ అయ్యింది. ఇందుకు సంబంధించి నిధుల సమీకరణా పూర్తయ్యింది. ఇప్పుడు తాజాగా మ‌రో కీల‌క ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టేందుకు రేవంత్ స‌ర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది.  రాష్ట్రంలో ఏళ్లుగా తెల్ల రేషన్ కార్డుకోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్ర‌క‌టించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ఇదే అంశంపై రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో ఇతర మంత్రులు, సంబంధిత శాఖా అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో అర్హులైన ప్రజలందరికీ తెల్ల రేషన్ కార్డు జారీ చేస్తామని చెప్పారు. తెల్ల‌రేష‌న్ కార్డు పొందేందుకు విధివిధానాల‌ను ప్ర‌తిపాదించారు. గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నర, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు. అలాగే పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలుగా నిర్ణయించారు. కాగా, రేషన్ కార్డుల పంపిణీలో లబ్దిదారుల ఎంపికకు విధివిధానాల రూపకల్పనలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయనున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. తాజాగా ప్ర‌భుత్వం నిర్ణ‌యంతో తెల్ల రేష‌న్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకొని ఏళ్లుగా ఎదురు చూస్తున్న అర్హుల‌కు త్వ‌ర‌లో కార్డుల‌ను అంద‌నున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు ఆరు గ్యారెంటీల‌ను అర్హులైన ల‌బ్ధిదారుల‌కు అందించేలా రేవంత్ స‌ర్కార్ ఒక్కో అడుగు వేస్తోంది. ఈ క్ర‌మంలోనే మ‌రో హామీకి ప్ర‌భుత్వం త్వ‌ర‌లో శ్రీ‌కారం చుట్ట‌నుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకివ‌స్తే మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కం కింద  ప్ర‌తీ మ‌హిళ‌ల‌కు రూ. 2,500 చొప్పున ప్ర‌తీనెలా ఇస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆ హామీని అమ‌లు చేసేందుకు కార్యాచ‌ర‌ణను ప్ర‌భుత్వం సిద్ధం చేస్తోంది. తెల్ల రేష‌న్ కార్డు ఉన్న మ‌హిళ‌ల‌ను మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కానికి అర్హులుగా ఎంపిక చేసేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. వ‌చ్చే రెండు నెల‌ల్లో ఈ ప్ర‌క్రియ‌ను పూర్తిచేసి ల‌బ్ధిదారుల‌కు ప్ర‌తీనెలా రూ. 2500 ప్ర‌భుత్వం అందించ‌నుంది. అయితే, ఈ ప‌థ‌కంపై పూర్తిస్థాయిలో చ‌ర్చించిన తరువాత అమలు దిశగా విధివిధానాలు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌నుంది. మొత్తానికి ఒకవైపు రాష్ట్రంలో ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు దిశగా కూడా వేగంగా అడుగులు వేస్తోంది.

తెలంగాణ తెలుగుదేశం సారథి ఎవరు?

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరు? ఈ ప్రశ్న ఇప్పటి నుంచి కాదు.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందరి మనసులను తొలిచేస్తోంది. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవిని చాలా లైట్‌గా తీసుకున్నవారి లైమ్‌లైట్ ఈ పదవి మీద పడింది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిపిస్తూ వుండటంతో ఇలాంటి సమయంలో పార్టీ బాధ్యతలు అందుకునే అదృష్టవంతుడు / అదృష్టవంతురాలు ఎవరు అనే క్వశ్చన్ మార్కు అందరిలోనూ వుంది. ఎవరికికి తోచినట్టుగా వాళ్ళు తమ ఊహల్లో వున్న వ్యక్తి అధ్యక్ష పదవిని చేపడతారని అనుకుంటున్నారు. కానీ, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మనసులో ఏముంది అనేది ఇంతవరకు బయటకు రాలేదు. తాజాగా శనివారం (10-08-2024) నాడు చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం అయిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు రావడంతో మరొక్కసారి పార్టీ అధ్యక్ష పదవి అంశం చర్చనీయాంశంగా మారింది. మరి, ఊహాగానాల్లో ఎవరున్నారు? ఆశావహుల్లో ఎవరున్నారనే అంశంలోకి వెళ్ళేముందు, గతంలోకి కొంత వెళ్ళి రావడం సమంజసం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ అండ్ గ్యాంగ్ తెలుగుదేశం పార్టీ మీద తమకు సాధ్యమైనంత విషప్రచారం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీ... తెలంగాణలో బాంచెన్ దొరా సంస్కృతికి చరమగీతం పాడింది తెలుగుదేశం పార్టీ.. తెలంగాణలో బలహీన వర్గాలు రాజకీయాల్లో ముందడుగు వేయడానికి తోడ్పాటు అందించింది తెలుగుదేశం పార్టీ.  అలాంటి తెలుగుదేశం పార్టీ మీద ‘ఆంధ్ర’ ముద్ర వేసింది కేసీఆర్ గ్యాంగ్. ఆ తర్వాత ఎన్నికలలో గెలిచిన కొద్దిమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేశామని సంబరపడింది. తెలంగాణలో తెలుగుదేశం నాయకులు పార్టీ మారిపోయారుగానీ, కార్యకర్తలు మాత్రం తెలుగుదేశం పార్టీని గుండెల్లో పెట్టుకుని పూజిస్తూనే వున్నారు. తెలంగాణ ప్రజల్లో కూడా తెలుగుదేశం పార్టీ అంటే మంచి అభిమానం వుంది. అయితే పరిస్థితుల కారణంగా వారి అభిమానాన్ని బయటకి వ్యక్తం చేసే అవకాశం లేకుండా పోయింది. అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఊహించని ద్రోహం జరిగింది. ఎల్.రమణ అనే ఒక సాధారణ కార్యకర్తని నాయకుడిని చేసి, పార్టీ అధ్యక్షుడిని చేసి గౌరవిస్తే, ఆయన పార్టీ కష్టకాలంలో వున్నప్పుడు ద్రోహం చేసి కేసీఆర్‌తో చేతులు కలిపారు. ఆ తర్వాత కాసాని జ్ఞానేశ్వర్‌ని పార్టీ అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టారు. ఆయనకు పార్టీని బలోపేతం చేయడం కంటే, ఎప్పడు ఎన్నికలలో పోటీచేద్దామా.. ఎమ్మెల్యే అయిపోదామా.. ఇదే ధ్యాస. తెలుగుదేశం పార్టీని వాడుకుని పదవులు సంపాదించుకుందామనే ధ్యాసే తప్ప, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయన్న ఆలోచన ఆయనకు లేదు. మొన్నటి తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయకూడదని చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ప్రకటిస్తే, కాసాని జ్ఞానేశ్వర్‌కి ఎక్కడలేని ఆవేశం వచ్చింది. ఎన్నికలలో పోటీ చేయకపోతే పార్టీలోనే వుండనని చెప్పి ఆయన బంగారం లాంటి, బాధ్యతాయుతమైన అధ్యక్ష పదవిని వదిలి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన వేరే పార్టీలో చేరడం, ఎన్నికలలో పోటీ చేయడం, దారుణంగా ఓడిపోవడం.. అవన్నీ మనకి అనవసరం.. ఇలాంటి నేపథ్యంలో ఈసారి పార్టీ అధ్యక్ష స్థానంలో కూర్చునే వ్యక్తి పార్టీని మరింత బలోపేతం చేసే వ్యక్తి అవ్వాలే తప్ప, పార్టీ నెత్తిన ఎక్కి కూర్చునే వ్యక్తం కాకూడదు. పార్టీకి నేనేమి ఇవ్వాలి అని ఆలోచించే వ్యక్తి అవ్వాలే తప్ప.. పార్టీ నాకు ఏమిస్తుంది అని ఎదురుచూసే వ్యక్తి కాకూడదు. అందుకే, ఈసారి చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే వ్యక్తి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.  మరి చంద్రబాబు మనసులో ఏముందోగానీ, ఎవరి ఊహాగానాల్లో వారున్నారు. తెలుగుదేశానికి ద్రోహం చేసి, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో బొక్కబోర్లా పడివున్న మల్లారెడ్డి పార్టీ అధ్యక్షుడు కాబోతున్నారని కొంతకాలం పుకార్లు షికార్లు చేశాయి. అయితే మల్లారెడ్డి లాంటి ముళ్లకంపని తెచ్చి నెత్తిన పెట్టుకోవడం మంచిది కాదన్న అభిప్రాయం పార్టీలో ఏకగ్రీవంగా వినిపిస్తోంది.  ఇక అధ్యక్ష పదవికి వినిపిస్తున్న పేర్లను పరిశీలిస్తే, కొంతమంది నారా బ్రహ్మణి పార్టీ అధ్యక్షురాలు కావాలని ముచ్చటపడుతున్నారు. మరికొందరు హరికృష్ణ కుమార్తె సుహాసిని కన్ఫమ్ అని తమకు తెలిసినట్టే చెబుతున్నారు. అలాగే, తెలంగాణలో రాజకీయ ఉద్ధండుడు, ఎలాంటివారినైనా నోరు మూయించగల శక్తి వున్న గోనె ప్రకాశరావు అధ్యక్షుడు కాబోతున్నారన్న ఊహాగానాలు ఈమధ్యకాలంలో బలంగా వినిపిస్తున్నాయి. ఇంకా పొగాకు జయరాం చందర్, అరవింద్ కుమార్ గౌడ్, మాటల తూటాలు పేల్చే నన్నూరి నర్సిరెడ్డి, బక్కని నర్సింహులు, సామ భూపాల్‌రెడ్డి, కాట్రగడ్డ ప్రసూన, భవనం షకీలా రెడ్డి, పద్మావతి, ఆనంద్, తెలుగుదేశం పార్టీ వాయిస్‌ని ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో బలంగా వినిపించిన జ్యోత్స, ఏఎస్ రావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి.  ఉన్నది ఒక్క అధ్యక్ష పదవి.. ఇంతమంది ఊహావహులు, ఆశావహులు ఏంటబ్బా అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులను తయారుచేసే పార్టీ.. తెలంగాణ తెలుగుదేశంలో పార్టీ అధ్యక్ష పదవికి అర్హులైన వాళ్ళు ఇంతమంది వున్నారు. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. మరి ఇంతమంది అర్హులున్నారు.. పార్టీ అధ్యక్షుడయ్యే అదృష్టం ఎవరికి వుందో, అవకాశం ఎవరికి దక్కుతుందో, బాధ్యతలు ఎవరు మోయాల్సి వస్తుందో... మొత్తమ్మీద పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మదిలో ఏముందో.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఒక్కటే... అదేమిటో మీకు కూడా తెలుసు.... కాలం!

దువ్వాడ శ్రీనివాస్‌ని జగన్ ఓదార్చాలి!

శవం దొరికితే చాలు.. ఓదార్పు పేరుతో పీక్కుతినడానికి రెడీ అయిపోతున్న వైసీపీ నాయకుడు జగన్ ఇప్పుడు జస్ట్ ఫర్ ఛేంజ్ మరో ఓదార్పు యాత్ర చేపట్టాలి. అర్జెంటుగా టెక్కలికి బయల్దేరాలి. ఆయన ప్రస్తుతం ఓదార్చాల్సింది ఎవర్నో కాదు.. తన పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని. ‌ భర్త, ముగ్గురు ఆడపిల్లలు వున్న దివ్వెల మాధురి అనే వైసీపీ నాయకురాలిని పాపం దువ్వాడ శ్రీనివాస్ ఎంతో పెద్దమనసుతో, చక్కగా తన ఇంట్లోనే పెట్టుకుని ఆదుకుంటుంటే, ఓర్వలేని అతని భార్య, కూతుళ్ళు గొడవ పడుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్‌ని రోడ్డు మీదకి లాగుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఇద్దరూ రాసుకుని పూసుకుని తిరుగుతూ వుంటే, గుళ్ళో గోపురాలకు వెళ్తుంటే, విహారయాత్రలకు చెక్కేస్తుంటే చూసి ఓర్చుకోలేని దువ్వాడ శ్రీనివాస్ భార్య, కూతుళ్ళు వాళ్ళిద్దరికీ సంబంధం వుందని అన్యాయంగా ఆరోపించారు. దివ్వెల మాధురి కుటుంబం మొత్తం మాధురిని తిట్టారు. దాంతో దివ్వెల మాధురి బాగా హర్టయింది. ఆ తర్వాత దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఒక హోటల్ గదిలో కలిశారు. ‘‘ఏంటి సార్ ఈ అన్యాయం.. అన్నెం పున్నెం ఎరుగని నా మీద మీ భార్య లేనిపోని ఆరోపణలు చేస్తోంది. మనిద్దరం కలసి గుళ్ళూగోపురాలకి, విహారయాత్రలకి తిరిగామే తప్ప అంతకన్నా ఏమైనా చేశామా? నేనేమో సంప్రదాయిని.. మీరేమో సుద్దపూస. అలాంటి మనిద్దరికీ సంబంధం వుందని మీ భార్య వాణి ఆరోపిస్తోంది. నా కుటుంబంలో నేను బద్నామ్ అయిపోయాను. ఇక నాకు చావే శరణ్యం’’ అని వెంటనే తాడుతో ఉరేసుకోబోయింది. ఉరితాడులో తల పెట్టేసి కిందకి దూకేసింది. అది చూసి బిత్తరపోయిన దువ్వాడ శ్రీనివాస్ ఉరితాడుకి, దివ్వెల మాధురి గొంతుకి మధ్య తన చేతిని అడ్డుగా పెట్టాడు. ఆ తర్వాత చాలా తంటాలు పడి ఆమెని ఉరితాడు నుంచి తప్పించి కిందకి దించాడు. ఆత్మహత్య చేసుకోవడం తప్పు అని ఆమెని వారించాడు. నీకు ఎవరూ లేకుండా పోయారు కాబట్టి నీకు అండగా నేనుంటాను అని మాటిచ్చాడు. అప్పటి నుంచి ఆమెను తన ఇంట్లోనే వుంచుకుంటూ ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇద్దరు వివాహితులు వేరేవాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నా తప్పుకాదని సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పిందంట. ఆ సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ, ఇద్దరూ  ‘అడల్ట్రీ’ అనే సంబంధం పెట్టుకుని సంతోషంగా జీవిస్తుంటే, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ భార్య, పిల్లలు నానా రచ్చ చేస్తున్నారు. ఒక మంచి పని చేస్తుంటే ఇలా రచ్చ రంబోలా అవుతున్నందుకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎంత హర్టయ్యాడో ఏం పాడో.. మరోవైపు ఆ నిప్పులాంటి మహాతల్లి దివ్వెల మాధురి కూడా ఎంత బాధపడుతోందో ఏంటో! దివ్వెల మాధురి జగన్‌కి ఆల్రెడీ తెలుసు. 2022 అక్టోబర్‌లో ఆమెని జగన్‌కి దువ్వాడ శ్రీనివాస్ పరిచయం చేసి, పార్టీలో చేరిస్తే, జగన్ వెంటనే ఆమెకి శ్రీకాకుళం జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలి పదవి కూడా ఇచ్చేశాడు. దువ్వాడ శ్రీనివాస్‌తోపాటు అమె కూడా హర్టయి వుంటుంది కదా.. అందుకే ఆ ఇద్దరు పవిత్ర ప్రేమ పక్షులను ఓదార్చడానికి జగన్ అర్జెంటుగా టెక్కలికి బయల్దేరాలి. బెంగళూరు నుంచి టెక్కలికి ట్రావెల్ చేసే సమయంలోనే, ఈ ‘కేసు’లో టీడీపీని ఎలా ఇరికించవచ్చో కూడా ఆలోచించాలి.