వరద ఖర్చులు ఇవిగో ఫేక్ జగన్..!

వరద బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం చేసిన ఖర్చు విషయంలో వైసీపీ నాయకులు నోటికి వచ్చిన లెక్కలు చెబుతున్నారన్న అభిప్రాయాలను తెలుగుదేశం వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’ ద్వారా ఒక మెసేజ్ విడుదల చేశారు. ‘‘వరద బాధితులకు ఇస్తామన్న కోటి రూపాయలలో ఒక్క రూపాయి ఇప్పటికీ ఇవ్వలేదు ఫేక్ జగన్.. వరద బాధితులకు ఒక వాటర్ ప్యాకెట్ కానీ, ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ పంపిణీ చేయని ఫేక్ జగన్ వరద సహాయక చర్యలపై విషం కక్కుతున్నాడు. వరద ప్రాంతాల్లో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు 23 కోట్లు అంటూ  ఫేక్ ప్రచారం చేయిస్తున్నాడు. వీటికి ఖర్చు 23 లక్షలు కూడా కాలేదు. జగన్ చీకటి పాలనలో వెలువడిన చీకటి జీవోలు, చీకటి లెక్కలు కాదు కూటమి ప్రభుత్వానివి.. ఇవిగో ఖర్చుల లెక్కలు.. అన్నీ పారదర్శకంగా ఉన్నాయి.. చదువు వస్తే చదువుకో.. కళ్ళుంటే చూడు.. తాడేపల్లి ప్యాలెస్ కలుగులో దాక్కుని ప్రజాధనం కోట్లు పందికొక్కులా ఎగ్‌ పఫ్‌లు మెక్కి, నిమ్మకాయ నీళ్లులా తాగేసిన ఫేక్ జగన్ ఇకనైనా నీ ఫేక్ ప్రచారాలు ఆపు.. ...నారా లోకేష్, విద్య, ఐటి శాఖల మంత్రి’’ అని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. దానితోపాటు వరద ఖర్చుల జాబితాను కూడా విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు!

విభజిత ఆంధ్రప్రదేశ్ లో మరో సారి పారిశ్రామిక స్వర్ణయుగం రాబోతోందా అంటే బిజినెస్ ఎక్స్ పర్ట్స్ ఔననే అంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత 2014 నుంచి 2019 వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా నిలిచింది.  ప్రపంచ దేశాలలోని అగ్రశ్రేణి పరిశ్రమలన్నీ తమ పరిశ్రమల విస్తరణకు ఏపీవైపే చూసే వారు. కియా సహా పలు అగ్రశ్రేణి సంస్ధలు రాష్ట్రంలో  పెట్టుబడులకు ముందుకు వచ్చాయి.  కియా అయితే కార్యకలాపాలు ప్రారంభించేసింది. మరెన్నో సంస్థలు ఎంవోయూలు చేసుకున్నాయి. అయితే 2019లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయి, వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది.  జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కార్  ఐదేళ్ల  హయాంను రాష్ట్ర పారిశ్రామిక రంగానికి చీకటి కాలంగా చెప్పవచ్చు. జగన్ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక రంగం కుక్కలు చింపిన విస్తరిలా తయా రైంది. ఉన్న పరిశ్రమలు రాష్ట్రం దాటి తరలిపోయాయి. అంతకు ముందు అంటే 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి ఎంవోయూలు చేసుకున్న సంస్థలు  మొహం చాటేశాయి.  ఇప్పుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు సర్కార్ కొలువుదీరింది. దీంతో రాష్ట్ర పారిశ్రామిక రంగం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోనుంది. ఇందు కోసం చంద్రబాబు పట్టుదలతో కృషి చేస్తున్నారు. రాష్టరానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా కొత్త పారిశ్రామిక వధానాన్ని రూపొందించారు.  2014-19 మధ్య రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇచ్చిన రాయితీలు, పెట్టుబడులను ఆకర్షించేలా మౌలిక సదుపాయాలు, సులభతర వాణిజ్యంలో దేశంలో మొదటి స్థానాన్ని సాధించిన అప్పటి పరిస్థితులు మళ్లీ  తీసుకురావడం, వృద్ధి రేటు 15 శాతానికి తగ్గకుండా చూడటం లక్ష్యాలుగా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు.  ఆయన కృషి ఫలిస్తోందనడానికి స్పష్టమైన తార్కాణంగా  జగన్ హయాంలో ఆయన విధానాలతో విసిగిపోయి మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టేది లేదంటూ వెళ్లిపోయిన   లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ మళ్లీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడాన్ని చెప్పవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు సర్కార్ కొలువు దీరిన తరువాత రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా మారు తున్నది. తాజాగా  టాటా గ్రూప్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమెబైల్ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ ఆసక్తి కనబరుస్తోంది.   టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో గత నెలలో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్ రంగాలలో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఆ చర్చలకు కొనసాగింపుగా అన్నట్లు రాష్ట్ర ఐటీ, మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ముంబై వెళ్లి నటరాజన్ చంద్రశేఖరన్ తో మంగళవారం భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం లోకేష్ చేసిన ఓ ట్వీట్ రాష్ట్రంలో టాటా పెట్టు బడులు ఖాయమని తేల్చేసింది. నటరాజన్ చంద్రశేఖరన్తో భేటీ అద్భుతంగా జరిగింది. బుధవారం(అక్టోబర్ 9)న రాష్ట్రంలో టాటా పెట్టుబడులకు సంబంధించి ఓ ప్రకటన వెలువడుతుందని లోకేష్ చేసిన ట్వీట్ రాష్ట్రంలో టాటా గ్రూప్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనుందన్న హింట్ ఇచ్చింది. ఇక విశ్వసనీయ సమాచారం మేరకు అనంతపురంలో టీసీఎష్ క్యాంపస్, రాయలసీమలో సెమికండక్టర్ ప్లాంట్, అనంతపురం సమీపంలో విమానాల తయారీ సంస్థల ఏర్పాటుకు టాటా గ్రూపు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఇదే నిజమైతే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి గొప్ప ఊతంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థిక ప్రగతి, ఉద్యోగ, ఉపాధి కల్పనకు ఏపీలో తిరుగు ఉండదు.  

హర్యానాలో కాంగ్రెస్ కొంప ముంచిన ఆప్!

హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్సే కాదు.. స్వయంగా బీజేపీ సైతం రాష్ట్రంలో ఓటమి ఖాయమన్న అంచనాకు వచ్చేసింది. వరుసగా పదేళ్ల పాటు అధికారంలో ఉండటం, అలాగే ప్రధాని మోడీవి రైతాంగ వ్యతిరేక విధానాలంటూ రైతులలో వెల్లువెత్తిన తీవ్ర ఆగ్రహావేశాల నేపథ్యంలో పరిశీలకులు సైతం హర్యానాలో కాంగ్రెస్ విజయం నల్లేరు మీద బండినడకే నంటూ విశ్లేషణలు చేశారు. ఇక బీజేపీ అనుకూల  మీడియాగా అంతా భావించే మీడియా సంస్థలు కూడా హర్యానాలో మూడో సారి కమల వికాసం అనుమానమే అంటూ వార్తా కథనాలు ప్రచురించాయి. అయితే మంగళవారం (అక్టోబర్ 9) వెలువడిన ఫలితాలు మాత్రం అందరి అంచనాలనూ తల్లకిందులు చేసేశాయి. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తరువాత ఆరంభంలో కాంగ్రెస్ ఆధిక్యత కనబరిచినా ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ కాంగ్రెస్ ఆధిక్యత తగ్గి బీజేపీ విజయం దిశగా దూసుకు వెళ్లింది. చివరికి మ్యాజిక్ ఫిగర్ దాటేసి విజయాన్ని అందుకుంది.  ఇక ఫలితాల తరువాత విశ్లేషణలు చూస్తే హర్యానాలో కాంగ్రెస్ పరాజయానికి ప్రధాన కారణం ఆప్ అని తేలింది. చాలా నియోజకరవర్గాలలో ఆప్ కు వచ్చిన ఓట్లే కాంగ్రెస్ పరాజయానికి కారణంగా పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. హర్యానాలో బీజేపీ విజయం ఆ పార్టీ పట్ల ప్రజలలో ఉన్న అభిమానం కాదనీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్, ఆప్ మధ్య భారీగా చీలిపోవడమే కారణమని అంటున్నారు. అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం మాత్రం పూర్తిగా కాంగ్రెస్ స్వయంకృ తాపరాధమేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. విజయంపై అతి ధీమాయే కాంగ్రెస్ ఓటమికి కారణంగా చెబుతున్నారు. అతి విశ్వాసంతో కాంగ్రెస్ చేతికి అందేలా వచ్చిన విజయాన్ని చేజార్చుకుందని విశ్లేషిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీయే అయినా హర్యానాలో మాత్రం కాంగ్రెస్ ఆ పార్టీతో సీట్ల సర్దుబాటుకు ససేమిరా అంది. ఏక పక్ష విజయంపై ఉన్న అతి ధీమాతో ఆప్ తో కలిసి ఎన్నికలలో పోటీ చేసే అవకాశాన్ని చేజేతులా వదులు కుంది.  ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత చూస్తే కాంగ్రెస్ విజయానికి అడ్డంగా నిలిచినవి ఆప్ కు పడిన ఓట్లేనని తేలిపోవడంతో ఇప్పుడు అంటూ చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేని పరిస్థితిలో హస్తం పార్టీ పడింది. హర్యానా ఎన్నికలలో ఓట్ల పరంగా బీజేపీతో సమానంగా ఓట్లు సాధించిన కాంగ్రెస్.. సీట్ల విషయంలో మాత్రం భారీగా నష్టపోయింది. అందుకు కారణం ఆప్ కు వచ్చిన ఓట్లే. హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ కు రెండు శాతం ఓట్లు వచ్చాయి. ఆప్ తో పొత్తు పెట్టుకుని ఉంటే ఆ రెండు శాతం ఓట్లే కాంగ్రెస్ కు తిరుగులేని విజయాన్ని సాధించిపెట్టేవి. అయితే కాంగ్రెస్ ఆప్ తో పోత్తుకు వెనుకాడటంతో హర్యానాను ‘చే’ జార్చుకుంది.   కేవలం సర్వేలను నమ్ముకునే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకోవడానికి విముఖత చూపింది. అదే సమయంలో బీజేపీ ఎలక్షన్ మేనేజ్ మెంట్ ను తక్కువగా అంచనా వేసింది. ఫలితం అనుభవిస్తోంది. 

అప్పుడూ ఇప్పుడూ వలంటీర్లు జగన్ ఉద్యోగులే!

వలంటీర్ల వ్యవస్థ ఎందుకు పుట్టుకొచ్చిందో... వారు ఎవరి కోసం పని చేశారో తేలిపోయింది. ఇప్పటి వరకూ వలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అన్నది ఆరోపణల స్థాయిలోనే ఉంది. అయితే జగన్ సర్కార్ పతనమైన నాలుగు నెలల తరువాత ఆ వ్యవస్థ ఎందుకు పని చేసింది? ఎవరి కోసం పని చేసింది అన్న విషయాలను స్వయంగా వైసీపీ అధినేత జగన్ చెప్పేశారు. వలంటీర్లంతా వైసీపీ ఉద్యోగులేననీ, వారికి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదనీ ప్రకటించేశారు. అలా ప్రకటించి ఊరుకోకుండా.. వలంటీర్లందరికీ ఇక నుంచి వైసీపీయే వేతనాలు చెల్లిస్తుందని ప్రకటించేశారు. వరద సాయం కోటి రూపాయలులా ఆయన ప్రకటన మిగిలిపోతుందో? నిజంగానే వారికి ప్రతినెలా ఠంచనుగా జీతాలు ఇస్తారో చూడాల్సిందే కానీ.. జగన్ మానసపుత్రిక వాలంటీర్ వ్యవస్థ ఆవిర్బావ రహసం మాత్రం తేటతెల్లమైపొయింది. ఆ వ్యవస్థను జగన్ తన కొరకు తన చేత తానే ఏర్పాటు చేశారని ఆయనే స్వయంగా అంగీకరించేశారు.  ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోవడం లేదనీ, అందు చేత వారిని వైసీపీ ఉద్యోగులుగా గుర్తించి నెలనెలా వారికి ఒక్కొక్కరికీ ఐదేవేల చొప్పున  గౌరవ వేతనం చెల్లిస్తాననీ చెప్పారు. వైసీపీ సర్కార్ 2019లో రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తరువాత వాలంటీర్లను నియమించింది. వారందరినీ ప్రభుత్వోద్యోగులుగా ప్రకటించింది. ప్రతి 50 మంది జనాభాకు ఒకరు చొప్పున ఆ వాలంటీర్లను నియమించి ప్రభుత్వ పథకాల అమలు వారి ద్వారా జరిగేలా మార్గదర్శకాలు రూపొందించింది. తద్వారా ప్రభుత్వ యంత్రాంగానికి సమాంతరంగా వాలంటీర్ల వ్యవస్థ తయారైంది. జనం అధికారులపై కాకుండా వాలంటీర్లపై ఆధారపడేలా పరిస్థితుల ఏర్పడేలా చేసింది. అంతే కాకుండా వారికే ఎన్నికల విధులు అప్పగించి ఎన్నికలలో లబ్ధి పొందాలని జగన్ భావించారు. అయితే వాలంటీర్లను ఎన్నికల విధులకు వినియోగించడాన్ని ఈసీ అంగీకరించకపోవడంతో జగన్ వ్యూహం దెబ్బతింది. దీంతో వాలంటీర్లు రాజీనామా చేసి  పార్టీ కోసం పని చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ఎన్నికలలో గెలిచి మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందనీ, అప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లనందరినీ తిరిగి నియమిస్తాననీ అప్పట్లో జగన్ పేర్కొన్నారు. జగన్ పిలుపును నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. అయితే అలా చేయని వారు లక్షన్నర మందికి పైగా ఉంటారు. ఇప్పుడు వారి విషయంలోనే జగన్ ఈ ప్రకటన చేశారు.  వాలంటీర్లంతా వైసీపీ ఉద్యోగులేనని ప్రకటించారు. గతంలో వారు వైసీపీ కోసం పని చేశారనీ, ఇప్పుడు కూడా అదే చేయాలనీ, వైసీపీయే వారికి నెల నెలా వేతనం చెల్లిస్తుందనీ అన్నారు. తద్వారా వాలంటీర్ వ్యవస్థ ఎవరి కోసం ఎందుకు ఏర్పాటయ్యిందో శషబిషలకు తావు లేకుండా చెప్పేశారు.  

మద్య నిషేధం ఎత్తివేత.. ప్రశాంత్ కిశోర్ హామీ మందుబాబుల ఓట్ల కోసమేనా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోన్ సొంత కుంపటి జన్ సురాజ్ ను ప్రారంభించేశారు. ఇప్పుడు ఆయన పార్టీకి ఆయనే అధినేత, ఎన్నికల వ్యూహకర్త కూడా. ఆయన వ్యూహాల పదును పార్టీని ప్రారంభించిన మొదటి రోజే చూపారు. బీహార్ లో అత్యంత కీలకంగా మారిన మద్య నిషేధంపై ఆయన చేసిన ప్రకటన రాజకీయ పండితులను  సైతం విస్మయపరిచింది. బీహార్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికలలో తన పార్టీ జన్ సురాజ్ విజయం సాధించి అధికారం చేపడితే.. వెంటనే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తానని ప్రశాంత్ కిషోర్ ప్రకటన చేశారు.  సాధారణంగా ఏ పార్టీ అయినా సరే మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ప్రకటిస్తారు. కానీ నలుగురూ నడిచే దారిలో నేనసలు నడవను అనే ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో అమలులో ఉన్న మద్యపాన నిషేధాన్ని తాను అధికారంలోకి రాగానే ఎత్తి వేస్తానని ప్రకటించారు.  మహిళల ఓట్ల కోసం రాజకీయ పార్టీలూ తరచూ ఎత్తుకునే మద్యపాన నిషేధం నినాదాన్ని కాదని ఆయన ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తానని ప్రకటించడం రాజకీయంగా సాహసమనే చెప్పవచ్చు. మందుబాబుల ఓట్ల కోసమే ప్రశాంత్ కిశోర్ ఈ ప్రకటన చేశారా అన్న అనుమానాలు కొందరిలో వ్యక్తం అవుతున్నాయి. అయితే మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తానని తాను  చేసిన ప్రకటన పూర్తిగా ఆర్థిక కారణాలతోనేనని ప్రశాంత్ కిషోర్ వివరణ ఇచ్చారు.  మద్యపాననిషేధం ఎత్తి వేయడం ద్వారా రూ.20వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ అవుతుందన్నారు.వాటిని విద్యావ్యవస్థ పటిష్టం చేయడానికి ఖర్చు చేస్తామన్నారు. రానున్న పదేళ్లలో ప్రపంచస్థాయిలో విద్యావ్యవస్థ అభివృద్ధి చేయడానికి ఐదులక్షల కోట్లు వ్యయం చేస్తానని చెప్పారు. జన సురాజ్ మార్టీకి మాజీ ఐఏఎస్ అధికారిణి ని కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా నియమించిన ప్రశాంత్ కిషోర్..  విద్యా,ఉపాధి రంగాలు అభివృద్ధే తన ఎన్నికల ఎజెండాగా చెప్పారు. ఆయన రాజకీయ ఎజెండా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏమిటి? ఎలా ఉన్నాయన్నది పక్కన పెడితే మద్య నిషేధం ఎత్తివేత ప్రకటన ద్వారా ఆయన మందుబాబుల అభిమానానికి పాత్రుడయ్యారనడంలో ఎంత మాత్రం సందేహం లేదని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.   ఇక జనసురాజ్ విషయానికి వస్తే.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 (బుధవారం ) ఆయన తన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ సందర్భంగా మాట్లాడిన ఆయన తాను బీజేపీతో కలిసి పయనించే అవకాశం ఇసుమంతైనా లేదన్నారు. సొంతంగా, స్వతంత్రంగా జనసురాజ్ ఎదుగుతుందనీ, రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంత కాలం వేరే పార్టీలకు ఎన్నికల వ్యూహాలు రచించి అమలు చేసి వాటికి అధికారాన్ని కట్టబెట్టిన ప్రశాంత్ కిషోర్ తన పార్టీ జన సురాజ్ కోసం ఎటువంటి వ్యూహాలు రచిస్తారన్న ఆసక్తి బీహర్ కే పరిమితం కాలేదు. దేశ వ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ ద్వారా ఏ మేరకు సక్సెస్ అవుతారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  

మంత్రి కొండా సురేఖ మర్యాద గీత దాటేశారు!

తెలంగాణలో రాజకీయ రచ్చ రోత పుట్టిస్తోంది. బూతుల సంస్కృతి ప్రబలిపోతున్నది. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణల విషయంలో కనీస మర్యాద కూడా పాటించని పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో గతంలో అంటే జగన్ హయాంలో  వైసీపీ నేతలు, కొందరు మంత్రులు కూడా ప్రత్యర్థులపై బూతు పురాణాలతో విరుచుకుపడేవారు. ఆ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత రాజకీయాలలో ఒక రకమైన హుందా తనం గోచరిస్తోంది. అక్కడ వైసీపీ నేతలు నోరు జారినా, అధికార పార్టీ నేతలు మాత్రం సంయమనం పాటిస్తున్నారు. మర్యాదకు, విలువలకు పెద్ద పీట వేస్తున్నారు. అయితే అటువంటి సంయమనం తెలంగాణ రాజకీయాలలో ఇటు అధికార కాంగ్రెస్ లోనూ, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ లోనూ కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.   తాజాగా కొండా సురేఖ మర్యాద సరిహద్దులను దాటేశారు. అధికార కాంగ్రెస్ ప్రతిష్ఠను నిలువెత్తు గొయ్యి తీసి కప్పెట్టేశారు. నిజమే కొండా సురేఖపై సామాజిక మాధ్యమంలో ట్రోల్స్ ఎ మాత్రం సమర్ధనీయం కాదు. అందులో సందేహం లేదు. కానీ అందుకు ప్రతిగా ఆమె చేసిన విమర్శలు కూడా ఎంత మాత్రం సమర్ధనీయం కాదు.  ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాకలో  ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న కొండా సురేఖకు మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందనరావు చేనేత కార్మికుల సమస్యలను విన్నవిస్తూ నూలుపోగు దండను మంత్రి మెడలో వేశారు. దీనిపై కొందరు ట్రోల్స్ చేయడంతోపాటు అసభ్యకరంగా పోస్టులు చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టులు చేసిన వ్యక్తుల డీపీలో బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఫోటో ఉండటంతో  సురేఖపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారు బీఆర్‌ఎస్ కార్యకర్తలుగా కాంగ్రెస్ అనుమానించింది. బీఆర్‌ఎస్ నేతల ఆదేశాలతోనే ఈ పోస్టులు చేశారని, దీని వెనుక కేటీఆర్, హరీష్‌రావు ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అక్కడి వరకూ ఓకే.. కానీ కొండా సురేఖ తన విమర్శలతో మర్యాద హద్దులను దాటేశారు. ఆమె బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేసి ఊరుకోకుండా బాలీవుడ్ హీరోయిన్ల పేర్లను కూడా ఈ వివాదంలోకి లాగారు. సమంత, నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమంటూ ఆరోపణలు గుప్పించారు. అలాగే నటి రకుల్ ప్రీత్ సింగ్, మరి కొందరు హీరోయిన్ల పేర్లనూ లాగారు. కొందరు హీరోయిన్లకు కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేసి వారిని వైధింపులకు గురి చేశారంటూ ఆరోపణలు చేశారు. హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేశారని విమర్శించారు.  ఈ విమర్శలతో అప్పటి వరకూ కొండా సురేఖపై ప్రజలలో వ్యక్తం అవుతున్న సానుభూతి మొత్తం ఆవిరైపోయింది. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. ఆమెకే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చుట్టుకున్నాయి. సినీ పరిశ్రమ మొత్తం కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తోంది. కాంగ్రెస్ నేతలు సైతం సురేఖనే తప్పుపడుతున్నారు. కొండా సురేఖను కేబినెట్ నుంచి డిస్మిస్ చేయాలన్న డిమాండ్ వెల్లువెత్తుతోంది.  కొండా వ్యాఖ్యలపై  రేవంత్ స్పందించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. తన మాటలు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సమంతను ట్యాగ్ చేస్తూ కొండా సురేఖ ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు. తాను సమంత మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదనీ, స్వయం శక్తితో ఎదిగిన సమంత తనకు ఆదర్శం అనీ, ఆమె పట్ల తనకు ఎంతో గౌరవం ఉందనీ పేర్కొన్నారు. సమంత మనస్తాపానికి గురైతే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే అప్పటికే పరిస్థితి ‘చేయి’ దాటిపోయింది.  సినీ పరిశ్రమకు చెందిన పలువురు కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజకీయ అవసరాలు, విమర్శల కోసం సినీ రంగానికి చెందిన మహిళలను లాగడం సరికాదని పేర్కొన్నారు. నాగార్జున, అమల, నాగచైతన్య, సమంత, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు సినీ ప్రముఖులు కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టారు. 

సోము వీర్రాజు కంటే ఊసరవెల్లి నయం!

సోము వీర్రాజు.. పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నన్నాళ్లూ జగన్ భజన చేసి తరించారు. జగన్ అడ్డగోలు నిర్ణయాలను, విధానాలనూ రాజును మించిన రాజభక్తి అన్న స్థాయిలో మద్దతు తెలిపి పునీతులయ్యారు. ఒక సమయంలో ఆయన బీజేపీ అధిష్ఠానానికి రాసిన లేఖలో అప్పట్లో రాష్ట్రంలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కారణంగా ఏపీలో బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్లుగా తయారైందని పేర్కొన్నారు. ఆయన ఆ లేఖ రాసిన సమయంలో   తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు.. అధికారంలో ఉన్న వైసీపీతో సోము వీర్రాజు అంటకాగుతున్నారు. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా. ఆ హోదాలో ఉన్న ఆయన  రాష్ట్ర పార్టీ బలహీనం కావడానికి విపక్ష నేత కారణం అంటూ  అధిష్ఠానానికి లేఖ రాయడాన్ని బీజేపీ శ్రేణులే తప్పుపట్టాయి. అదొక్కటే కాదు.. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం ఆయన టార్గెట్ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నట్లుగా విమర్శలతో చెలరేగిపోయారు. జగన్ కు వంత పాడటం కోసం ఆయన ఒంటెత్తు పోకడలకు పోయారు. అప్పట్లో ఆయన తీరును సొంత పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులే జీర్ణించుకోలేకపోయారు. రాష్ట్రంలో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీని కనీసం ఉనికి మాత్రంగా కూడా లేకుండా చేయడమే లక్ష్యమా అన్నట్లుగా అప్పట్లో సోము వీర్రాజు తీరు ఉండేది.  సోము వీర్రాజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీజేపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం నుంచి ఒక ప్రతినిథి వర్గం హస్తినకు వెళ్లి మరీ సోము వీర్రాజుపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసింది. దానిపై సీరియస్ గా స్పందించిన   బీజేపీ హైకమాండ్ వెంటనే పార్టీ రాష్ట్ర వ్యవహారల ఇన్ చార్జ్, అప్పటి కేంద్ర మంత్రి మురళీధరన్ ను రాష్ట్రానికి పంపింది. ఆయన నేరుగా రాజమహేంద్ర వరం వచ్చి పార్టీ నేతలతో బేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా సోము వీర్రాజుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.  అప్పట్లో ఏపీలో జగన్ ప్రభుత్వ అవినీతిపై  చార్జిషీట్ దాఖలు చేయాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించినా సోము వీర్రాజు నేతృత్వంలోని పార్టీ రాష్ట్ర శాఖ ఆ పని చేయలేదు.  ఇదంతా ఎందుకుంటే సోము వీర్రాజు ఎంతగా జగన్ భజనలో తరించారో చెప్పడానికే.  అటువంటి సోము వీర్రాజు ఇప్పుడు స్వరం మార్చేశారు. చంద్రబాబు భజనకు రెడీ అయిపోయారు.  తిరుమలలో స్వచ్ఛమైన లడ్డు తయారు చేసి భక్తులకు అందించే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. అందుకు చంద్రబాబు తరఫున తానూ పూచీ అని వాకృచ్చారు.  తిరుమల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధోరణి హేయం అని విమర్శలు గుప్పించారు. జగన్ అధికారంలో ఉండగా మంచి చెడూ మరిచి ఆయనతో అంటకాగిని సోము వీర్రాజును ఇప్పుడు బీజేపీలో పట్టించుకునే నాథుడే లేరు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామే. ఏదో ఒక నామినేటెడ్ పోస్టు, కనీసం ఎమ్మెల్సీ అంటూ సోము వీర్రాజు వెంపర్లాడుతున్నా బీజేపీ హైకమాండ్ పట్టించుకోవడం లేదు. దీంతో మళ్లీ పార్టీ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకోవడానికే సోము వీర్రాజు స్వరం మార్చారని బీజేపీ  శ్రేణులే అంటున్నాయి. ఇక తెలుగుదేశం వర్గాలైతే సోము వీర్రాజును వీర లెవెల్లో ట్రోల్ చేస్తున్నాయి. 

ఇక అమరావతి పనులు 24X7!

ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం ఇక వేగం పుంజుకోనుంది. అమరావతి నిర్మాణ పనులు నిరంతరాయంగా సాగనున్నాయి. అమరావతి నిర్మాణానికి కేంద్రం అందించే సహాయం నేడో రేపో అందనుంది. ప్రపంచ బ్యాంకు ద్వారా కేంద్రం ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్ల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నిధులనను వచ్చే నెలలో విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఇక అమరావతి పనులను ఎలాంటి అవాంతరాలు, అవరోధాలు లేకుండా నిరంతరాయంగా సాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ లో నిధులు అందుతాయి కనుక ఆ మరుసటి నెల అంటే డిసెంబర్ నుంచి పనులను శరవేగంగా అంటే 24X7  కొనసాగించాలని నిర్ణయించింది. జగన్ ఐదేళ్ల పాలనలో అమరావతిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా వ్యవహరించిన తీరు కారణంగా.. రాష్ట్రరాజధాని ప్రాంతం ఓ అడవిలా తయారైంది. 80శాతానికి పైగా పూర్తయిన భవనాలు కళ తప్పాయి. రోడ్లు అధ్వానంగా మారాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అమరావతిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలవరం ప్రాజెక్టు తరువాతి ప్రాధాన్యత అమరావతికే ఇచ్చారు. చంద్రబాబు సీఎంగా పగ్టాలు చేపట్టగానే అమరాతిలో జంగిల్ క్లయరెన్స్ కు ఆదేశాలు జారీ చేశారు. ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జగన్ నిర్వాకం కారణంగా 80 శాతంపైగా పూర్తయిన నిర్మాణాలు కూడా పాడుబడ్డాయి. అటువంటి భవనాల సామర్ధ్యాన్ని, వాటిని కొనసాగించడానికి గల అవకాశాలను నిపుణులు పరీక్షించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు సాగనున్నారు.   ఇక అమరావతి పనులకు ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియ ఆరంభించే యోచనలో ప్రభుత్వం ఉంది.  

రేవంత్ స్పీడ్ కు అధిష్ఠానం బ్రేకులు!?

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఆపసోపాలు పడుతోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల విజయంతో పార్టీలో, పార్టీ క్యాడర్ లో కనిపించిన ఉత్సాహం నీరుగారిపోతోంది.  ఏ ముహూర్తాన హైడ్రా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూల్చివేతల పర్వానికి శ్రీకారం చుట్టారో కానీ, ఆ హైడ్రాయే ఇప్పుడు రేవంత్ సర్కార్ మెడకు చుట్టుకుంది. అప్పటి వరకూ రేవంత్ కు ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో తిరుగులేని ఆమోదం కనిపించింది. ఎప్పుడైతే హైడ్రా అంటూ రేవంత్ దూకుడు పెంచారో అప్పుడే పార్టీలో, ప్రభుత్వంలో ఆయనపై వ్యతిరేకతకు అంకురార్పణ అయ్యింది.  ఇక హైడ్రా కూల్చివేతలపై పార్టీ హైకమాండ్ కూడా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఆయనను ఢిల్లీకి పిలిపించుకుని మరీ అక్షింతలు వేసినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇక పార్టీలో సీనియర్ నాయకుడు, హైకమాండ్ కు సన్నిహితుడు అయిన మధుయాష్కీ తాజాగా కూల్చివేతలపై చేసిన వ్యాఖ్యలు, అవసరమైతే బాధితుల తరఫున పార్టీలో, కోర్టులో కూడా పోరాడుతానంటూ ఇచ్చిన హామీ చూస్తుంటే..రేవంత్ స్పీడ్ కు హైకమాండ్ బ్రేకులు వేసిందన్నది స్పష్టమౌతోంది.  నటుడు నాగార్జునకు చెందిన కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో  ముఖ్యమంత్రి రేవంత్ గ్రాఫ్, కాంగ్రెస్ సర్కార్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎప్పుడైతే ఆయన మూసీ  పక్కనే ఇళ్ళు నిర్మించుకొని దశాబ్ధాలుగా ఉంటున్న సామాన్య, మద్య తరగతి ప్రజల నివాసాలపై దృష్టి సారించారో అప్పుడే ప్రజా వ్యతిరేకత మొదలైంది.  మూసీవాసులకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయించి వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి చేసిన ప్రయత్నానికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.  హైకోర్టులో   20 పిటిషన్ల వరకూ దాఖలయ్యాయి.  ఈ ప్రాంతంలో ఇళ్ళ వ్యవహారం హైకోర్టులో ఉందంటూ ప్రతీ ఇంటి గోడపై ఫ్లెక్సీ బ్యానర్లు కనిపిస్తున్నాయి.    ఇక హైడ్రా కమషనర్ రంగనాథ్ కు హైకోర్టు అక్షింతలు వేసింది.  శనిఆదివారాలలో ఇళ్ల కూల్చివేతలపై నిలదీసింది.  హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరీ శని, ఆదివారాలలో కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారని సూటిగా ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలను నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, మరోసారి ఇలా చేస్తే కోర్టు ధిక్కారంగా పరిగణించి   చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.   హైడ్రా కూల్చివేతలతో ఒక్క హైదరాబాద్‌లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  ఎన్నికల హామీల అమలులో రేవంత్ సర్కార్ విఫలమైనా, పాలనలో ప్రజల అంచనాలను అందుకోలేకపోయినా ఇంత వరకూ ప్రభుత్వంపై పెద్ద వ్యతిరేకత కనిపించలేదు. కొంత సమయం ఇద్దామన్నట్లుగానే ప్రజలు ఉన్నట్లు కనిపించింది. అయితే ఎప్పుడైతే హైడ్రా సామాన్యుల నివాసాలపై దృష్టి పెట్టిందో అప్పుడే ప్రజాగ్రహం భగ్గుమంది. పార్టీలో, కేబినెట్ లో సైతం హైడ్రా తీరుపై, రేవంత్ దూకుడుపై ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ నుంచి రేవంత్ కు పిలుపు వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   

సిద్ధరామయ్యపై బిగుస్తున్న ‘ముడా’ ఉచ్చు!

ముడా కుంభకోణంలో కర్నాటక సీఎం సిద్దరామయ్యకు ఉచ్చు బిగుస్తోంది.  కర్ణాటకలోకి సీబీఐ దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడంతో ఈడీ రంగంలోకి దిగింది. ముడా వివాదంలో సిద్ధరామయ్యపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.  కాగా, ఇప్పటికే ముడా స్థలం కేటాయింపు కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య, మరో ఇద్దరిపై మైసూరు లోకాయుక్త పోలీసులు శుక్రవారమే కేసు నమోదు చేశారు. సీఎం సిద్ధరామయ్యను ఏ1గా, ఆయన భార్య పార్వతిని ఏ2గా చేర్చారు. తాజాగా సిద్దరామయ్య భార్య మైసూరు అప్‌మార్కెట్ ప్రాంతంలో తనకు కేటాయించిన 14 ప్రత్యామ్నాయ స్థలాలను ప్రభుత్వానికి తిరిగి అప్పగించినట్టు మంగళవారం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీ నేతలు తన కుటుంబాన్ని వివాదాల్లోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కేజ్రీవాల్ శపథం వర్కవుట్ అయ్యేనా?

మళ్ళీ ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగుపెడతానంటూ చంద్రబాబు చేసిన శపథం వర్కవుట్ అయింది. మొన్నటి ఎన్నికలలో ఘన విజయం సాధించిన ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ‘చాణక్య శపథం’ తరహాలోనే ‘చంద్రబాబు శపథం’ అనే కొత్త టర్మ్.ని కూడా ఆయన క్రియేట్ చేశారు. ఇప్పుడు అచ్చం అలాంటి శపథాన్నే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్న ఆయన మొన్నటి  వరకూ సీఎం హోదాలోనే రిమాండ్‌లో వున్నారు. జైలు నుంచే ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించారు. జైల్లో వున్నంతకాలం ముఖ్యమంత్రి పీఠాన్ని విడిచిపెట్టని ఆయన, అదేంటోగానీ బెయిల్ వచ్చిన తర్వాత తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. కేజ్రీవాల్ జైల్లో వున్నప్పుడు పరిపాలన బాధ్యతలను సమర్థంగా నెరవేర్చిన విద్యాశాఖ మంత్రిణి ఆశితిని తన స్థానంలో ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడుతున్నానని ప్రకటించారు. వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. డిసెంబర్లోనే ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ కోరుకుంటున్నారు. ఈసారి జరిగే ఎన్నికలలో తన ప్రజాబలాన్ని నిరూపించుకుని, ఆ తర్వాతే ముఖ్యమంత్రి స్థానం మీద కూర్చుంటానని కేజ్రీవాల్ శపథం చేశారు. ‘కేజ్రీవాల్ శపథం’ బాగానే వుందిగానీ, ఆయన శపథం నెరవేరే అవకాశం ఎంతవరకు వుందనేదే ప్రశ్న! ‘ఒకే ఒక్కడు’ సినిమాలో హీరో అర్జున్‌కి ఒక్కరోజు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని రఘువరన్ కల్పిస్తాడు. అర్జున్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న తర్వాత రఘువరన్ చాలా కాజువల్‌గా ఈ ఒక్కరోజు ముఖ్యమంత్రిగా చేసి నీ దారిన నువ్వు వెళ్ళు అంటాడు. దానికి అర్జున్ నాకు చెప్పడానికి మీరెవరు? ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని అంటాడు. ఆ తర్వాత రఘువరన్‌కి జలక్ ఇస్తాడు. దాంతో రఘువరన్ జీవితంలో మరోసారి ముఖ్యమంత్రి అవ్వడు. కేజ్రీవాల్ పరిస్థితి కూడా అలాగే అయ్యే అవకాశం వుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న ఆశితి ఆ పదవి మీద మమకారం పెంచుకుని, పార్టీ మొత్తాన్నీ తన అధీనంలోకి తెచ్చుకుని, కేజ్రీవాల్‌కి జలక్ ఇస్తే పరిస్థితి ఏమిటి? అందరూ జయలలిత చెప్పినట్టల్లా వినే పన్నీరుసెల్వం తరహాలో వుండరు కదా. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండేల్లాంటి వాళ్ళు కూడా వుంటారు. ఈసారి ఢిల్లీ ఎన్నికలలో కేజ్రీవాల్ గెలుస్తారని ఏమైనా రాసిపెట్టి వుందా? ఎన్నికలలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో ఎవరికీ తెలియదు. కేజ్రీవాల్ అందుకు భిన్నమేమీ కాదు. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎన్ని ట్రిక్కులు ప్లే చేయనుందో ఎవరికి ఎరుక? సరే, ఒకవేళ కేజ్రీవాల్ పార్టీ గెలిచినా, ముఖ్యమంత్రి స్థానంలో వున్న ఆశితి, ఆ స్థానంలోనే తాను వుండాలని ముచ్చటపడి పార్టీలో చీలిక తీసుకురారని నమ్మకమేంటి? అందువల్ల కేజ్రీవాల్ చేసిన శపథం అంత ఈజీగా నెరవేరే అవకాశాలైతే కనిపించడం లేదు. కేజ్రీవాల్ శపథం... శపథంలా వుంటుందో, తనకు తానే విధించుకున్న శాపంలా మారుతుందో కాలమే చెప్పాలి.

జగన్ కోవర్ట్ రాజకీయాలు ఫలిస్తున్నాయా?.. ఒంగోలు కూటమిలో బీటలు అందుకేనా?

ఏపీలో ఎన్డీయే కూట‌మికి బీట‌లు వారుతున్నాయా.. జ‌న‌సేన‌, టీడీపీ నేత‌ల మ‌ధ్య విబేధాలు పొడ‌చూపుతున్నాయా.. మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోవర్ట్ రాజకీయ వ్యూహంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిక్కుకుంటున్నారా? జ‌న‌సైనికులు, టీడీపీ శ్రేణులు అప్ర‌మ‌త్తం కాకుంటే త్వ‌ర‌లో ఎన్డీయే కూట‌మిలో   లుకలుకలు తార స్థాయికి చేరుకోవ‌టం ఖాయ‌మా?  అంటే అవున‌నే స‌మాధానమే  వినిపిస్తోంది. కూట‌మి నేత‌లు ఏ మాత్రం తొంద‌ర‌పాటుగా వ్యవహరించినా, టీడీపీ, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య పూడ్చ‌లేని అగాధం ఏర్ప‌డ‌టం ఖాయ‌మ‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2024 ఎన్నిక‌ల ముందు   తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన పార్టీలు కూట‌మిగా జ‌ట్టు క‌ట్టాయి.   ఐదేళ్ల‌లో వైసీపీ  అరాచ‌క పాల‌న‌కు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు మూడు పార్టీలూ ఏక‌మ‌య్యాయి. ప్ర‌జ‌లు సైతం జ‌గ‌న్‌రెడ్డి అరాచ‌క, దోపిడీ పాల‌న‌తో విసిగిపోయారు. దీంతో గ‌త ఎన్నిక‌ల్లో కూట‌మికి భారీ మెజార్టీ  క‌ట్ట‌బెట్టారు. వైసీపీని కేవ‌లం 11 స్థానాల‌కే ప్ర‌జ‌లు ప‌రిమితం చేశారు. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదాకూడా ఇవ్వ‌లేదు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో సీఎంగా చంద్ర‌బాబు నాయుడు అధికార పగ్గాలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పలు కీలక శాఖల బాధ్యతలను జనసేనాని పవన్ కల్యాణ్ కు చంద్రబాబు అప్పగించారు.  కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి100 రోజులు పూర్తి అయ్యింది.   వంద రోజుల్లో గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల వ‌ల్ల ఎదురైన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుంటూ, రాష్ట్ర  అభివృద్ధిని సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌రుగులు పెట్టిస్తున్నారు. ప్ర‌జ‌లుసైతం ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జీవ‌నం సాగిస్తున్నారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డిన అధికారులు, వైసీపీ నేత‌ల‌పై కొర‌డా ఝుళిపిస్తున్నారు. ముఖ్యంగా ముంబై న‌టి జ‌త్వానీ కేసులో ముగ్గురు పోలీస్ ఉన్న‌తాధికారుల‌ను స‌స్పెండ్ చేశారు. ఆ కేసులో కీలక నిందితుడు, వైసీపీ నాయకుడు అయిన కుక్కల విద్యాసాగర్ అరెస్టయ్యారు. కోర్టు ఆయనకు అక్టోబర్ 4 వరకూ రిమాండ్ విధించింది. అలాగే వైసీపీ హ‌యాంలో ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లుగా వ్యవహరించిన అధికారులను  చంద్ర‌బాబు నిర్దాక్ష్యిణ్యంగా ప‌క్క‌న పెట్టారు.  వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో అవినీతి అక్ర‌మాల‌ను కూట‌మి ప్ర‌భుత్వం వెలికి తీస్తుండ‌టంతో వైసీపీ నేత‌ల్లో ద‌డ‌పుడుతోంది. ఎప్పుడు ఎవ‌రు జైలు కెళ్లాల్సి వ‌స్తుందోన‌న్న ఆందోళ‌న వైసీపీ నేత‌ల్లో నెల‌కొంది. మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సైతం తాడేపల్లికి చుట్టపు చూపుగానే వస్తున్నారు. ఎక్కువ‌గా ఆయన బెంగ‌ళూరులోనే మకాం వేస్తున్నారు. మ‌రోవైపు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌లిసి నిర్ణ‌యాలు తీసుకుంటూ ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నారు. ఒక‌రినొక‌రు గౌర‌వించుకుంటూ ప్ర‌భుత్వం, కూట‌మిలో పార్టీల నేత‌ల మ‌ధ్య విబేధాలు త‌లెత్తకుండా అవసరమైన అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుంటున్నారు. ప‌వ‌న్‌, చంద్ర‌బాబు మ‌ధ్య స‌ఖ్య‌త‌ను చూసి వైసీపీ నేత‌లు జీర్ణించుకోలేక పోతున్నారు. వీ రిద్ద‌రూ క‌లిసి ఉంటే  తన పార్టీ ఉనికికే ప్రమాదం అని గ్రహించిన  మాజీ సీఎం, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. జ‌న‌సేన‌, టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య విబేధాలు సృష్టించేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేస్తున్న‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీలో తన సన్నిహితులుగా ఉన్న నేతలను కోవర్టులుగా కూటమి పార్టీలలోకి పంపాలన్నదే ఆ ప్రాణాళిక అంటున్నారు.  సీఎం చంద్ర‌బాబు నాయుడు దూకుడైన పాల‌న‌తో రాబోయే కాలంలో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని జ‌గ‌న్ స‌హా, వైసీపీ నేత‌లు ఆందోళ‌న‌లో ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు క‌లిసి ఉంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు రాబోయే కాలంలో వైసీపీ ప‌ట్టు కోల్పోవడం ఖాయమనీ, అదే జరిగితే పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం మాట అటుంచి వైసీపీ ఉనికి మాత్రంగా కూడా మిగిలే అవకాశం ఉండదనీ   జ‌గ‌న్ ఆందోళ‌న చెందుతున్న‌ట్లు తెలుస్తోంది. కూట‌మిలో చీలిక‌లు తెస్తే త‌ప్ప రాబోయేకాలంలో రాజ‌కీయంగా మ‌నుగ‌డ సాగించ‌లేమ‌ని భావిస్తున్న జగన్  కూట‌మిలోని పార్టీల కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య విబేధాలు సృష్టించేలా జ‌గ‌న్ ప‌క్కా వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి ప‌లువురు నేత‌లు జ‌న‌సేనలో చేర‌బోతున్నారు.  ఇప్ప‌టికే బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి,  సామినేని ఉదయభాను, కిలారు రోశ‌య్య వంటి నేత‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ తో భేటీ అయ్యారు. వారు ఈనెల 26న జ‌న‌సేన పార్టీలో చేరే అవ‌కాశం ఉంది. వీరితోపాటు మ‌రికొంద‌రు వైసీపీ నేత‌లు జ‌న‌సేన పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. వీరంద‌రి చేరిక‌ల వెనుక జ‌గ‌న్ వ్యూహం ఉంద‌ని ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. దాదాపు ప‌ది మంది వ‌ర‌కు వైసీపీ కీలక నేత‌ల‌ను జ‌న‌సేన‌లోకి పంపించ‌డం ద్వారా.. టీడీపీ, జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య విబేధాలు సృష్టించ‌డంతోపాటు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆ రెండు పార్టీల కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే స్థాయిలో ఘ‌ర్ష‌ణ‌లు సృష్టించ‌డం జ‌గ‌న్ ప్లాన్ గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జ‌గ‌న్ వ్యూహంలో ప‌వ‌న్ చిక్కుకున్నార‌ని, కూట‌మి  బీట‌లు వారుతోందనీ, మ‌రికొద్ది నెల‌ల్లోనే టీడీపీ, జ‌న‌సేన పార్టీలు విడిపోవ‌టం ఖాయ‌మ‌న్న వాద‌న వైసీపీ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది.  ఇప్ప‌టికే ఒంగోలులో రాజ‌కీయ ర‌చ్చ మొద‌లైంది. బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి జ‌న‌సేన పార్టీలో చేరుతున్నారు. ఆయ‌న చేరిక‌ను స్థానికంగా కొంద‌రు జ‌న‌సేన నేత‌ల‌తో పాటు, టీడీపీ నేత‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  ఈ క్ర‌మంలోనే బాలినేని ఒంగోలుకు వస్తుండటంతో ఆయ‌న అనుచరులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీల్లో టీడీపీ ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్‌తోపాటు తెలుగుదేశం ఎంపీ మాగుంటి శ్రీ‌నివాసులు ఫొటోల‌ను కూడా ఉంచారు. దీంతో  తెలుగుదేశం నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఆ ప్లెక్సీల‌ను తొల‌గించారు. ఫ‌లితంగా ఒంగోలులో మ‌రోసారి బాలినేని వర్సెస్ దామచర్ల అన్నట్లుగా రాజకీయాలు మారాయి. బాలినేని జ‌న‌సేన పార్టీకి వ‌స్తే ఆ పార్టీ నేత‌లు త‌ప్ప‌నిస‌రిగా బాలినేనికి స‌పోర్ట్ చేస్తారు. తెలుగుదేశం నేత‌లు దామ‌చ‌ర్ల‌కు మ‌ద్ద‌తుగా ఉంటారు. దీంతో జ‌న‌సేన‌,తెలుగుదేశం శ్రేణుల మ‌ధ్య విబేధాలు తార స్థాయికి చేరుతాయి. ఈ రెండు పార్టీల మ‌ధ్య విబేధాల‌ను వైసీపీ స‌ద్వినియోగం చేసుకుంటుందన్నది  రాజ‌కీయ  పరిశీలకుల విశ్లేషణ. జ‌గ‌న్ వ్యూహంలో భాగంగానే బాలినేని జ‌న‌సేన‌లోకి వ‌స్తున్నారని, రెండు పార్టీల మ‌ధ్య పూడ్చ‌లేని అగాధాన్ని ఏర్ప‌ర్చి.. ఎన్నిక‌ల స‌మ‌యానికి మ‌ళ్లీ జ‌గ‌న్ వ‌ద్ద‌కే బాలినేని వెళ్తార‌ని ప‌లువురు తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌లు అంటున్నారు. జ‌న‌సేన పార్టీలో చేరుతున్న వారిలో అధిక‌శాతం మంది వైసీపీ నేత‌లు జ‌గ‌న్ సూచ‌న‌ల‌తోనే పార్టీని వీడుతున్నార‌ని.. వీరిప‌ట్ల ప‌వ‌న్ క‌ల్యాణ్ జాగ్ర‌త్త‌గా ఉండ‌కుంటే కూట‌మి ప్ర‌భుత్వంలో చీల‌క రావ‌డం ఖాయ‌మ‌న్న వాద‌న ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. 

లడ్డూ వివాదం తరువాత కూడా జగన్ పట్ల బీజేపీ సాఫ్ట్ గానే ఉందా?

తిరుమల లడ్డూ వివాదం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగే అవకాశాలు కనిపించడం లేదు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం అంశం విషయంలో కేంద్రం సీరియస్ అయ్యిందన్న వార్తలు వినవస్తున్నాయి. హిందుత్వను భుజాన వేసుకునే బీజేపీలో కూడా జగన్ సర్కార్ నిర్వాకంపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. కఠిన చర్యలకు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లడ్డూ వివాదం వెలుగు చూసిన తరువాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి  జేపీ నడ్డా చంద్రబాబుకు పోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. చంద్రబాబుతో ఫోన్ సంభాషణ తరువాత నడ్డా లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో ఎంతటి వారున్నా వదిలేది లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక కేంద్ర మంత్రులు బండి సంజయ్, శోభా కరంద్లాజే అయితే ఈ విషయంపై సీరియస్ గా స్పందించారు. జగన్ హిందూ వ్యతిరేకి అని చాటారు. తిరుమలలోని విద్యాసంస్థల్లో వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవారి ఫోటోలను తొలగించేందుకు జగన్ హయాంలో ఆయన ప్రయత్నించారని   తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఎక్స్ వేదికగా స్పందించిన శోభా కరంద్లాజే జగన్ హయాంలో తిరుమల కొండపై ధార్మిక వాతావరణానికి భంగం కలిగించారనీ, కొండపై అన్యమత చిహ్నాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు గుప్పించారు. తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్ గా హిందూయేతర వ్యక్తిని నియమించారని, శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు ఉన్న నెయ్యి వినియోగానికి అనుమతించారని విమర్శలు గుప్పించారు. అలాగే  మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి లడ్డూ వివాదంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్రం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  అయితే లడ్డూ వివాదం విషయంలో ఆంధ్రప్రదేశ్ లోని జగన్ అనుకూల బీజేపీ నేతల మౌనం పలు అనుమానాలకు తావిస్తోంది. గత ఐదేళ్లుగా రాష్ట్ర బీజేపీలో జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన జీవీఎల్ నరసింహారావు కానీ, సోము వీర్రాజు కానీ, విష్ణువర్దన్ రెడ్డి కానీ లడ్డూ వివాదంలో వైసీపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక వైపు పార్టీ జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర మంత్రులు లడ్డూ వివాదంపై తమ ఆగ్రహాన్ని విస్పష్టంగా వ్యక్తం చేస్తుంటే రాష్ట్ర బీజేపీకి చెందిన ఈ ముగ్గురు నాయకులు మౌనం పలు అనుమానాలు తావిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత కూడా జీవీఎల్, సోము వంటి వారు కూటమి సర్కార్ ను ఇరుకున పెట్టేలా ప్రకటనలు చేసినా బీజేపీ హై కమాండ్ వారిపై చర్యలు తీసుకోకపోవడం, పైపెచ్చు త్వరలో చంద్రబాబు భర్తీ చేయనున్న నామినేటెడ్ పోస్టుల విషయంలో బీజేపీ తన కోటాలో వచ్చే పోస్టులకు సోము వీర్రాజు వంటి వారిని సిఫారసు చేయడం చూస్తుంటే ఇప్పటికీ కమలనాథులకు జగన్ పట్ట సాఫ్ట్ కార్నరే ఉందా అన్న సందేహాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.  ఇందుకు గత ఐదేళ్లుగా కేంద్రంలోని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం జగన్ పట్ల చూపిన అభిమానం, అందించిన సహాకారాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. జగన్ హయాంలో అడ్డగోలు అప్పులకు ఆర్బీఐ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా అనుమతులివ్వడం దగ్గర నుంచి జగన్ అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆమోదయోగ్యం కాని మౌనాన్ని ఆశ్రయించడం,  వివేకా హత్య కేసులో జగన్ సర్కార్ వ్యవహరించిన తీరును తప్పుపట్టకపోవడం వంటి వాటిని జగన్ పట్ల గతంలో  మోడీ సర్కార్ ఎంత సానుకూలంగా వ్యవహరించిందో అర్ధం చేసుకోవచ్చునంటున్నారు. అయినా బీజేపీ రాష్ట్ర నేతలలో వైసీపీ అనుకూల నేతల మౌనం, వారికి పార్టీ హైకాండ్ మద్దతు చూస్తుంటే జగన్ పట్ల బీజేపీకి ఇంకా సాఫ్ట్ కార్నరే ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.   

తప్పులెన్ను జగన్ కు తన తప్పులు కనిపించవు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరయా అన్నట్లు ఉంది.  తిరుమల లడ్డూ వివాదం నుంచి బయటపడేందుకు జగన్ ఎదురు దాడిని ఎన్నుకున్నారు. ఎన్నికల వాగ్దానాల అమలులో చంద్రబాబు ఫెయిల్ అందుకే డైవర్షన్ పాలిటిక్స్ అంటూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ తో పబ్బం గడుపుకుంటోందని ఆరోపించడం ద్వారా తానేం చేస్తున్నాడో దానిని చంద్రబాబు సర్కార్ కు ఆపాదించి విమర్శల జడివాన నుంచి రక్షణ పొందాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన మరచిపోతున్నదేంటంటే.. చంద్రబాబు సర్కార్ కు డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రభుత్వం కొలువుదీరి మూడు నెలలైంది. కనీవినీ ఎరుగని మెజారిటీతో ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు. అంత వరకూ ఐదేళ్ల పాటు అధకారం చెలాయించిన జగన్ కు కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని తమ తీర్పు ద్వారా తేటతెల్లం చేశారు. అటువంటప్పుడు చంద్రబాబు సర్కార్ కు తమ విధానాలను అమలు చేసే విషయంలో  డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడాల్సిన అవసరమే లేదు.  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 స్థానాలకు గానే 165 స్థానాలలో తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలే విజయం సాధించారు. అంటే తిరుగులేని మెజారిటీ చంద్రబాబు సర్కార్ కు ఉంది.  తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ విషయంలో ప్రభుత్వానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఇసుమంతైనా లేదు. లడ్డూ ప్రసాదం నాణ్యతా లోపానికి జగన్ హయాంలో జరిగిన అవక తవకలు, అస్మదీయుల కోసం అడ్డగోలుగా కాంట్రాక్టర్లను మార్చేయడం వంటివే కారణాలు అని ల్యాబ్ రిపోర్టుతో విస్ఫష్టంగా తేలిపోయింది. అదే ఇప్పుడు జగన్ ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో పాతాళానికి పడిపోయేలా చేసింది. ఈ తరుణంలో  చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్దానాల అమలులో విఫలమై..  దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆరోపించారు.  దీంతో జగన్ తీరు పట్ల సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టి వంద రోజులు మాత్రమే అయ్యింది. ఈ వంద రోజుల్లోనే అమరావతి, పోలవరం, సామాజిక పింఛన్లు, ఉద్యోగుల వేతనాలు వంటి ఎన్నో విషయాలలో ఆయన ప్రజా మన్ననలు పొందేలా నిర్ణయాలు తీసుకుని అమలు చేసి చూపించారు. బెజవాడను కనీవినీ ఎరుగని రీతిలో ముంచెత్తిన వరదలో చంద్రబాబు సర్కార్ ప్రజలకు అండదండగా నిలబడి వారిలో మనోధైర్యాన్ని నింపింది. వరదలకు సర్వం కోల్పోయి బెజారైన ప్రజలను స్వల్ప వ్యవధిలోనే ఆదుకుని వారు సాధారణ జీవనం గడిపేలా చేయగలిగింది చంద్రబాబు సర్కార్.  ఎన్నికల వాగ్దానాల అమలు విషయంలో కూడా చంద్రబాబు సర్కార్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు హామీల అమలులో ముందడుగు వేసిన చంద్రబాబు అక్టోబర్ నుంచి వంటగ్యాస్ సిలెం డర్ల హామీ అమలు చేయనున్నారు. అది వేరే సంగతి.. ప్రజల నుంచీ కూడా చంద్రబాబుపై వాగ్దానాల అమలు కోసం ఒత్తిడి రావడం లేదన్న విషయం జగన్ గ్రహించడం లేదు.  సంపద సృష్టి ద్వారానే సంక్షేమ పథకాల అమలు నిరాటంకంగా సాగుతుందని వారు గ్రహించారు. అభివృద్ధి ఆనవాలే కనిపించకుండా ఐదేళ్ల పాటు అధకారం చెలాయించిన జగన్ కారణంగా రాష్ట్రం ఎలా వెనకబడి పోయిందో కళ్లారా చూసిన జనం.. పథకాల లబ్ధి కోసం తొందరపడటం లేదు.  ఆ విషయాన్ని గుర్తించకుండా వాగ్దానాల అమలులో బాబు విఫలం అంటూ విమర్శలు గుప్పించడం ద్వారా జగన్ జనం దృష్టిలో మరింత పలుచన అవుతున్నారు.  ఇక లడ్డూ ప్రసాదం వివాదం వద్దకు వస్తే.. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందన్న నివేదిక జూలై 17న వచ్చింది. దానిని ఇంత వరకూ ఎందుకు బయటపెట్టలేదంటూ ఇప్పుడు జగన్ చంద్రబాబును నిలదీస్తున్నారు. జీవోలను ఐదేళ్ల పాటు దాచిపెట్టిన చరిత్ర జగన్ ది. ఇక లడ్డూ ప్రసాదం కల్తీపై వచ్చిన రిపోర్టును రెండు నెలలు ఎందుకు తొక్కిపెట్టారని ఎలా ప్రశ్నిస్తారు. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరయా అన్నట్లు ఉంది జగన్ తీరు. 

చెడిపోయిన వాళ్ళని చేరదీస్తున్న పవన్!

ప్రేమనగర్ సినిమాలో అక్కినేని నాగేశ్వర్రావు ఏమంటారంటే, ‘‘చెడిపోయినవాళ్ళని చేరదీశానే తప్ప, నేనెవర్నీ చెడగొట్టలేదు’’ అని. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే వుంది. రాజకీయాల్లో ఆయన ఇంతవరకు ఎవర్నీ చెడగొట్టకపోయినప్పటికీ, చెడిపోయినవాళ్ళని మాత్రం చేరదీస్తున్నారు. అలా చేరదీస్తూ తాను రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నానని అనుకుంటున్నారో ఏమోగానీ, ఆయన తన పార్టీని మాత్రమే కాకుండా, కూటమి ప్రభుత్వంలో వున్న ప్రశాంత వాతావరణాన్ని చేతులారా చెడగొట్టబోతున్నారన్న అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.  ప్రస్తుతం వైసీపీ అవసానదశలో వుంది. ఆ పార్టీ అధికారంలో వున్నంతకాలం రాజభోగాలు అనుభవించినవారు ఇప్పుడు ఎప్పుడెప్పుడు వైసీపీని వదిలేసి కూటమిలోని ఏదో ఒక పార్టీని ఆశ్రయించాలా అని ఎదురుచూస్తున్నారు. వైసీపీ నాయకులను చేర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఎంతమాత్రం ఆసక్తి చూపించడం లేదు. బీజేపీలో చేరాలంటే, ఎప్పుడైనా బీజేపీకి తనకు ఉపయోగపడేవాళ్ళే కావాలితప్ప.. తనను ఉపయోగించుకునేవాళ్ళు అవసరం లేదు. అందువల్ల బీజేపీలో కూడా అవకాశాలు తక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పునరావాసాన్ని కోరుకుంటున్న వాళ్ళకి ఆశాజ్యోతిలాగా జనసేన పార్టీ కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత కూడా చేతిలో పంచపాత్ర, ఉద్ధరిణి పట్టుకుని తన పార్టీ తలుపు తట్టినవాళ్ళకి ‘తీర్థం’ ఇస్తున్నారు. వాళ్ళని ఉద్ధరిస్తున్నారు. ఆ ఉద్ధరణ కార్యక్రమంలో భాగంగానే బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈనెల 22న బాలినేని, ఆయన అనుచరగణం మొత్తం జనసేనలో చేరబోతోంది.  జగన్ బంధువు, ఇంతకాలం ప్రకాశం జిల్లాలో జరిగిన అన్యాయాలు, అక్రమాలకు కేంద్రబిందువు. ఈ ఐదేళ్ళలో కబ్జాలతో కాకలు తీరిపోయారాయన. మొన్న జరిగిన ఎన్నికలలో ఆయన పార్టీతోపాటు ఆయన కూడా ఓడిపోయారు. వైసీపీలోనే వుంటే వచ్చే ఐదేళ్ళ వరకు ఆయనకి పనేమీ లేదు. పైగా ఆయన చేసిన అన్యాయాలు, అక్రమాల తాలూకు రియాక్షన్లు కూడా ఎదుర్కోవలసి వుంటుంది. ఈ ఐదేళ్ళు అధికార పార్టీలో వుంటే కేసుల గొడవ వుండదని అనుకున్నారో ఏమోగానీ, అధికారంలో భాగం పంచుకుంటున్న జనసేనలో చేరుతున్నారు. ఇలాంటి నాయకులను చేర్చుకోవడం వల్ల టీడీపీ - జనసేన పార్టీల మధ్య దూరం పెరిగే ప్రమాదం వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఐదేళ్ళపాటు ఆయన చేసిన తప్పులకు తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తే, రేపటి రోజున జనసేన ఎలా స్పందిస్తుంది? ప్రస్తుతం తమ పార్టీలో వున్నారు కాబట్టి క్షమించేసేయాలని అంటుందా? అవన్నీ గతంలో చేసిన నేరాలు కాబట్టి చూసీ చూడనట్టు ఊరుకుంటుందా? చట్టం ముందు దోషులుగా నిలబడేవాళ్ళని పార్టీలో చేర్చుకోవడం ఎందుకు... వాళ్ళు చేసిన నేరాల వల్ల ఇరుకున పడటం ఎందుకనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడం అనే విషయాన్ని ఒక కోవర్ట్ ఆపరేషన్‌గా కొంతమంది అభివర్ణిస్తున్నారు. ఒక పథకం ప్రకారమే శ్రీనివాసరెడ్డిని జగన్ జనసేనకు పంపించారని అంటున్నారు. కీలక సమయంలో శ్రీనివాసరెడ్డి కూటమిలో వున్న ఐకమత్యాన్ని దెబ్బతీసేలా, కూటమి ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టేలా వ్యవహరించే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. మరి ఇన్ని మైనస్‌లు వున్న బాలినేని శ్రీనివాసరెడ్డిని పవన్ కళ్యాణ్ ఎందుకు చేరదీస్తున్నారో మరి!

జగన్‌కి మానసిక చికిత్స.. ప్రభుత్వానిదే బాధ్యత!

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మానసిక ఆరోగ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందన్నది ఒక ఆరోపణ. జగన్మోహన్‌రెడ్డి ఒక్క ఛాన్స్ అని రిక్వెస్ట్ చేసి అధికారంలోకి వచ్చి, ఐదేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు నరకం చూపించి వుండవచ్చు... జగన్‌తోపాటు ఆయన పార్టీ నాయకులు లక్షల కోట్ల రూపాయలు గుటకాయస్వాహా చేసి వుండొచ్చు. ఇసుక, మట్టి లాంటి ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా దోచుకుని వుండొచ్చు. తప్పుడు కేసులు పెట్టి ఎంతోమందిని... సాక్షాత్తూ అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించి వుండొచ్చు. రఘురామకృష్ణంరాజు దగ్గర్నుంచి ముంబై హీరోయిన్ వరకు ఎంతోమందిని చిత్రహింసలకు గురిచేసి వుండొచ్చు. జగన్ పరిపాలించిన ఐదేళ్ళకాలంలో వైసీపీ నాయకులు, కార్యకర్తల చేతిలో ఎన్నో వందల మంది హత్యకు గురై వుండవచ్చు. ఎంతోమంది ప్రతిభావంతులైన అధికారులను కులాన్ని సాకుగా చూపించి వేధింపులకు గురిచేసి వుండొచ్చు. బటన్ నొక్కుతా అంటూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చి వుండవచ్చు. జగన్‌తో సహా వైసీపీ నాయకులు చాలామంది తమ మాటలతో, చేతలతో నీతి నియమాలను, నైతిక విలువలను సర్వనాశనం చేసి వుండవచ్చు... అయినప్పటికీ, ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఆయన భద్రత విషయంలోగానీ, ఆరోగ్యం విషయంలోగానీ ప్రభుత్వం ఎలాంటి లోటు చేయడానికి వీలు లేదు. అలా లోటు చేయడానికి ప్రయత్నించడం కూడా భావ్యం కాదు.  జగన్‌కి గతంలో 986 మంది సిబ్బంది సెక్యూరిటీగా వుండేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సెక్యూరిటీ సిబ్బందిని 58 మందికి తగ్గించారు. అధికారంలో వున్నంతకాలం 986 మంది సిబ్బంది కల్పించిన సెక్యూరిటీతో ఆయన నిశ్చింతగా వుండేవారు. ఆ నిశ్చింతలోనే అద్భుతమైన ఆలోచనలు చేసి బటన్లు నొక్కుతూ వుండేవారు. అలాంటి మనిషికి కేవలం 58 మందితో సెక్యూరిటీ ఇవ్వడం ఎంతవరకు భావ్యమో ప్రభుత్వం ఆలోచించాలి. అదేంటంటే, ప్రభుత్వాధికారులు రూల్స్ ప్రకారమే వ్యవహరించాం అంటారు. గత ఐదేళ్ళుగా ఏ రూల్సూ పాటించని జగనన్నని ఇప్పుడు కొత్తగా రూల్స్ చట్రంలో ఇరికించాలని చూడటం ప్రభుత్వానికి న్యాయమా? కాబట్టి ప్రభుత్వం బాగా ఆలోచించి అంతగా అవసరం అనుకుంటే గతంలో వున్న సెక్యూరిటీ సిబ్బందిలో ఒక్కర్నో, ఇద్దర్నో తగ్గించి 980 ప్లస్ సిబ్బందితో సెక్యూరిటీ అందించాలి. జగన్ తాడేపల్లి ఇంటి దగ్గర అంతకు ముందు వున్న సెక్యూరిటీ ఏర్పాట్లు తగ్గించారు కాబట్టే ఆయన బెంగళూరు వెళ్ళిపోతున్నారు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే. అలాగే ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాల్సిన సమయం వచ్చింది. అదేంటంటే, అధికారం పోవడం వల్ల జగన్‌కి మెంటల్ ఎక్కింది అని కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు. మెంటల్ ఎక్కడం వల్లే జగన్ పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడని  ఆరోపిస్తున్నారు. నిన్నగాక మొన్న జగన్ పిఠాపురం వెళ్ళి మీడియా ముందు ‘‘ఈ పాపకి పదిహేను వేలు... ఈ బాబుకు పదిహేను వేలు.. ఇలారా.. ఇలారా’’ అంటూ విచిత్రంగా ప్రవర్తించిన సంఘటనను కూడా వాళ్ళు సాకుగా చూపిస్తున్నారు. ఇలా విచిత్రంగా ప్రవర్తించినంత మాత్రానికే ‘అధికారం పోయినందువల్ల జగన్‌కి మెంటలెక్కింది’ అనడం కరెక్ట్ కాదు కదా? జగన్ ఇలా విచిత్రంగా ప్రవర్తించడం అధికారం పోయినందువల్ల కాదు అనే విషయాన్ని ఈ విమర్శలు చేస్తున్నవారు గ్రహించాలి. ఎందుకంటే, జగన్ అధికారంలో వున్నప్పుడు కూడా ఇలా విచిత్రంగా ప్రవర్తించేవారు. అందువల్ల జగన్ ప్రవర్తనకి, అధికారం పోవడానికి సంబంధం లేదన్న విషయాన్ని జగన్‌ని విమర్శిస్తున్నవాళ్ళు తెలుసుకుంటే మంచిది. వరద బాధితులను పరామర్శించడానికి పిఠాపురం వెళ్ళిన జగన్, అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడ్డం జగన్‌కి ఎక్కిన పిచ్చికి పరాకాష్ట అని కూడా పరుష పదాలు వాడుతున్నారు. ఇది ఎంతమాత్రం క్షమించరాని విషయం. ఎలా వుండే మనిషి ఎలా అయిపోయాడని జాలి చూపించాలే తప్ప ‘మెంటల్’ అనడమేంటి? తప్పు కదా? ‘మెంటల్’ లాంటి దారుణమైన మాటలు ఉపయోగించడం కరెక్ట్ కాదు.. అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో అస్సలు కరెక్ట్ కాదు. జగన్మోహన్‌రెడ్డి వ్యవహారశైలి ఆయనకు మానసికంగా ఏవో సమస్యలు వున్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్న మాట వాస్తవమే. అయితే అది పూర్తిగా సానుభూతితో పరిశీలించాల్సిన అంశం. తనకు మానసిక సమస్యలు వున్నాయని జగన్‌కి కూడా తెలిసే వుంటుందని, అందుకే ఆయన లండన్ మందులు వాడుతున్నారని, ఆ మందుల కోసం, ట్రీట్‌మెంట్ కోసమే జగన్ లండన్ టూర్‌కి వెళ్తూ వుంటారనే అభిప్రాయాలు వున్నాయి. జగన్‌ని ఎంతో అభిమానించే సీమరాజా కూడా ఈ విషయాన్ని చెబుతూ వుంటారు. తనకు మానసిక సమస్యలు వున్నాయని తెలుసుకుని, వాటిని తగ్గించుకోవడానికి అధికారంలో వున్నప్పటి నుంచి ప్రయత్నిస్తున్న జగన్‌ని అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడ్డం ఎంతవరకు సబబో అధికార పార్టీ నాయకులే ఆలోచించుకోవాలి. అప్పుడెప్పులో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే జగన్ లండన్ వెళ్ళారు. ఇప్పటికి మూడు నెలలు అయిపోయాయి. పాపం ఆయన మళ్ళీ తన రొటీన్ చెకప్ కోసమో, మందుల కోసమో లండన్ టూర్ పెట్టుకున్నారు. ఆయన దారిన ఆయనని వెళ్లనివ్వకుండా పాస్‌పోర్టు కేసు క్రియేట్ చేసి లండన్ టూర్‌కి బ్రేక్ వేశారు. మందులు అయిపోవడం వల్ల ఆయన పిఠాపురంలోగాని, విజయవాడలోగానీ, జైళ్ళ దగ్గర గానీ విచిత్రంగా ప్రవర్తిస్తే ప్రవర్తించి వుండొచ్చు. ఆ ప్రవర్తనని సానుభూతిలో అర్థం చేసుకోవాలే తప్ప వేరే రకంగా ఆలోచించడం మాత్రం చాలా తప్పు. ఆయన దారిన ఆయన లండన్ వెళ్తుంటే ఆపేదీ మీరే.. ఇప్పుడు ఆయన విచిత్రంగా ప్రవర్తిస్తుంటే విమర్శించేదీ మీరే... ఇదెక్కడి న్యాయమయ్యా? నిజానికి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఆరోగ్య బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. జగన్ మానసిక ఆరోగ్యం బాగుపడటానికి అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. జగన్ మానసిక చికిత్స అనేది నూటికి నూరుశాతం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఈ బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తే చరిత్ర క్షమించదు. అమ్మ పెట్టదు.. అడుక్కుని తిననివ్వదు అన్నట్టు.. ప్రభుత్వం ట్రీట్‌మెంట్ చేయించదు.. ఆయన దారిన ఆయన లండన్ వెళ్తుంటే అవరోధాలు క్రియేట్ చేస్తుంది. ఇదెక్కడి సంస్కారం? అందువల్ల ఆ లండన్ టూర్ ఖర్చులు, మెడికల్ చెకప్పుల ఖర్చులు, మందుల కొనుగోలు ఖర్చులు... ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వమే బేషరతుగా భరించాలి. జగన్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా ఎలా నాశనం చేయాలా? రాజధాని అమరావతిని ఇంకా ఎలా భ్రష్టు పట్టించాలా? పోలవరాన్ని ఇంకా పనికిరాకుండా ఎలా చేయాలా? ఇంకా నేరాలూ ఘోరాలు ఎలా చేయాలా, ప్రకృతిని ఇంకా ఎలా ధ్వంసం చేయాలా అని ఆలోచించీ ఆలోచించి బ్రెయిన్లో ఫిలమెంట్ ఎగిరిపోయి వుండొచ్చు. అధికారంలో వున్నప్పుడే జగన్ బ్రెయిన్ ఫిలమెంట్ ఎగిరిపోయింది కాబట్టి, ఆ ఫిలమెంట్‌ని బాగు చేయాల్సిన బాధ్యత నూటికి నూరుశాతం రాష్ట్ర ప్రభుత్వానిదే. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. జగన్ సెక్యూరిటీ విషయంలో, మానసిక ఆరోగ్యం విషయంలో మొండి పట్టుదలకు పోకుండా సానుభూతితో వ్యవహరించాలి. ఒకవేళ లండన్ రేంజ్‌లో ట్రీట్‌మెంట్ చేయించడానికి బడ్జెట్ లేకపోతే, జగన్‌కి ఎంతో ఇష్టమైన, జగన్‌కి మాత్రమే రాజధాని అయిన వైజాగ్‌లో అయినా ట్రీట్‌మెంట్ చేయించాలి. తన బాధ్యతను నిర్వర్తించాలి.

తెలంగాణ సెంటిమెంటుతో పబ్బం ఇంకానా..?

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా ఆంధ్రోళ్ల పెత్తనం వంటి మాటలు వినాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి తలెత్తడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా చేస్తున్న దుష్ట పన్నాగాలేనని చెప్పక తప్పదు. ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి  రాష్ట్ర సాధన ఉద్యమానికి నేతృత్వం వహించిన టీఆర్ఎస్.. రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ వాదానికి చెల్లు చీటీ పాడేసి, ఫక్తు రాజకీయ పార్టీగా మారింది. అది అవసరం, అనివార్యం కూడా. పైగా ఇక తమది ఫక్తు రాజకీయపార్టీయేననీ, తెలంగాణ సాధనతోనే టీఆర్ఎస్ పని పూర్తయ్యిందనీ స్వయంగా అప్పట్లో ఆ పార్టీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించిన సంగతి కూడా తెలిసిదే.  అయితే అధికారం తలకెక్కి అహంకారం అవధులు దాటడంతో  తెలంగాణ కాదు.. దేశం మొత్తం పాలించేయాలన్న అత్యాశతో కేసీఆర్..  తెలంగాణ అన్న పదానికే పార్టీలో స్థానం లేకుండా చేసేశారు. భారత రాష్ట్ర సమితిగా పార్టీ పేరును మార్చేసి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా జాతీయ రాజకీయాలలోకి దూకేశారు.   ఫలితం దేశ రాజకీయాలలో ప్రభావం చూపడం అటుంచి తెలంగాణలో ఉన్న పునాదులు కూడా కదిలిపోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో పార్టీ పరాజయం పాలై ప్రతిపక్షానికి పరిమితమైపోయింది. ఎన్నికలలో పార్టీ పరాజయానికి కారణమయ్యాయి. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం అన్న విషయాన్ని గుర్తించకుండా, తమ ఓటమి తెలంగాణ ఓటమిగా చెప్పుకోవడానికి ఇప్పుడు ఆ పార్టీ నాయకులు నేల విడిచి సాము చేస్తున్నారు. తమను ఓడించిన ప్రజలను నిందిస్తున్నారు. దాంతో పార్టీ ప్రతిష్ట మరింత మసకబారుతోంది. సావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన తనను జనం కాదంటారా అంటూ కేసీఆర్ ప్రజల ముఖమే చూడటం మానేశారు.  ఓటమి గల కారణాలను విశ్లేషించుకోకుండా, లోపాలను సరిచేసుకునే ప్రయత్నాలు చేసుకోకుండా మళ్లీ ఆంధ్రా, తెలంగాణ అంటూ తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నది.  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీ మధ్య జరుగుతున్న వివాదం వెనుక బీఆర్ఎస్ కుట్ర విద్వేషాలు రెచ్చగట్టడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక్కడ ఒక్కసారి గతంలోకి వెళ్లాలి. కేసీఆర్ సీఎంగా ఉన్న కాలంలో ఆపరేషన్ ఆకర్ష్ అంటూ విపక్ష పార్టీల నుంచి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని వాటిని బలహీనపరిచారు. ఆయా పార్టీల శాసనసభాపక్షాన్ని పార్టీలో విలీనం చేసుకున్నారు. అప్పుడు తప్పుగా కనిపించని ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చే సరికి బీఆర్ఎస్ నేతలకు తప్పుగా కనిపిస్తోంది. మహాపరాధంగా కనిపిస్తోంది. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడాన్ని తెలంగాణ ద్రోహం అన్నట్లుగా చెబుతున్నారు.  ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చాలా క్లారిటీతో ఉన్నారు. బీఆర్ఎస్ వ్యూహాన్ని, కుట్రను చాలా క్లారిటీగా వివరించారు.  తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయాలు చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని ఆయన విమర్శించారు.  తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని బీఆర్ఎస్ చూస్తోంది. రేవంత్ రెడ్డి మాటలలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు.   అరెకపూడి గాంధీ పదేళ్ల పాటు బీఆర్ఎస్ (టీఆర్ఎస్) సభ్యుడిగానే ఉన్నారు. ఆ పార్టీ టికెట్ పైనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా గాంధీ బీఆర్ఎస్ టికెట్ పైనే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు. లేదూ కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. దీన్ని ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్ ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంటును రాజేయాలని చూస్తోంది. అరెకపూడి గాంధీని ఆంధ్రా వ్యక్తి, ఆయనను గాజులు, చీరలు పంపిస్తాను అంటూ కౌశిక్ రెడ్డి  మాట్లాడారు. అరెకపూడి ఆంధ్రా మూలాలున్న వ్యక్తి అని ఇప్పుడు కౌశిక్ రెడ్డి అంటుంటే కేసీఆర్, కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు. అరెకపూడికి చీరలు, గాజులు అంటూ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు?  గ్రేటర్ హైదరాబాద్  లోని 27 శాసనసభ స్థానాల్లో 18 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుందంటే అందుకు ఆంధ్రా సెటిలర్ల మద్దతు, వారి ఓట్లు కారణం కాదా?   గ్రేటర్ పరిధిలో 18 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ గ్రామీణ ప్రాంతాల్లో ఘోర పరాజయానికి కారణం ఆ పార్టీ అవలంబించిన తెలంగాణ వ్యతిరేక విధానాలే కారణం కాదా?  ఇవన్నీ పక్కన పెడితే  ఇంకా బీఆర్ఎస్ లో ఉన్న ఆంధ్ర  ప్రాంతానికి  చెందిన కొంత మంది ఎమ్మెల్యేల గురించి ఏం చెబుతారు?   వాస్తవం ఏమిటంటే.. తెలంగాణ సెంటిమెంట్ పనికి వస్తుందని కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఇంకా భావిస్తుంటే అది వారి అజ్ణానం తప్ప మరొకటి కాదు.  కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల పట్ల, వారి ఆకాంక్షల పట్ల నిజాయితీతో వ్యవహరించిన దాఖలాలు లేవు. అందుకే తెలంగాణ ప్రజల మద్దతును కోల్పోయింది. కారణాలు ఏవైతేనే బీఆర్ఎస్ కు గత ఎన్నికలలో ఆ మాత్రం స్థానాలు రావడానికి ఇప్పుడు  ఆంధ్రా సెటిలర్ల ఓట్లే కారణం. ఇప్పుడు బీఆర్ఎస్ నేతల తీరు వారినీ బీఆర్ఎస్ కు దూరం చేయడం ఖాయం.  

ఆంధ్రుల మీద కేసీఆర్ ద్వేషం రావణకాష్ఠమే!

  రావణకాష్ఠం అనేది ఎలా చల్లారకుండా నిరంతరం మండుతూనే వుంటుందో కేసీఆర్‌కి ఆంధ్రుల మీద వున్న ద్వేషం, చులకనభావం నిరంతరం మండుతూనే వుంటాయి. తెలంగాణ ఉద్యమంలో మిగతా అందరూ స్వరాష్ట్రం అనే ఆకాంక్ష మీద తమ ఉద్యమ పునాదులు కట్టుకుంటే, కేసీఆర్ మాత్రం ఆంధ్రుల మీద ద్వేషం అనే పునాది మీద తన ఉద్యమ ప్రస్థానాన్ని సాగించారు. ఆంధ్రుల మీద విద్వేషం చల్లారిపోకుండా ఎప్పటికప్పుడు ఎగదోస్తూ వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో మిగతా పార్టీల వారు, ప్రజా సంఘాల వారు కూడా టీఆర్ఎస్ కంటే ఎక్కువగానే తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించారు. కానీ వాళ్ళెవరూ ఏనాడూ ఆంధ్రులను కించపరిచేలా మాట్లాడలేదు. మా తెలంగాణ మాకు కావాలని ఉద్యమించారే తప్ప, ఆంధ్రుల మీద విషం కక్కలేదు. కానీ కేసీఆర్, ఆయన పార్టీ నాయకులు ఆంధ్రుల మీద విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు.  తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, కేసీఆర్ అధికారం చెలాయించిన దాదాపు పదేళ్ళ కాలంలో పైకి ‘మాకు ఆంధ్రుల మీద ద్వేషం లేదు’ అనే మాట పైపైకి చెబుతున్నప్పటికీ, ఈ పదేళ్ల కాలంలో హైదరాబాద్‌లోని ఆంధ్రులు గుండెలు గుప్పిట్లో పెట్టుకుని జీవించారన్నమాట మాత్రం వాస్తవం. అధికారంలోకి వచ్చిన కొత్తలో కేసీఆర్ నిర్వహించిన ‘సమగ్ర సర్వే’ కార్యక్రమం ఆంధ్రులకు ఎంత ఆందోళన కలిగించిందో అందరికీ తెలిసిందే. కేసీఆర్ పాలన ముగిసి, కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత హైదరాబాద్‌లోని ఆంధ్రులు కొంత ప్రశాంతతను సాధించారు. కేసీఆర్ అండ్ గ్యాంగ్ ఆంధ్రులను ఎంత తిట్టినా, హైదరాబాద్‌లో ఆంధ్రులు హైదరాబాద్‌లో జరిగిన ప్రగతిని పరిగణనలోకి తీసుకుని బీఆర్ఎస్ అభ్యర్థులనే అసెంబ్లీ ఎన్నికలలో గెలిపించారు. అయితే ఆ కృతజ్ఞత కూడా బీఆర్ఎస్ నాయకులు చూపించడం లేదు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా కేసీఆర్, కేటీఆర్ పలు సందర్భాలలో ఆంధ్రుల మీద తమ ద్వేషాన్ని వెళ్ళగక్కారు. బీఆర్ఎస్ నరనరాల్లో జీర్ణించుకునిపోయి వున్న ఆంధ్రుల మీద ద్వేషం ఇప్పుడు తాజాగా మరోసారి బయటపడింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆంధ్ర మూలాలు వున్న వ్యక్తి. గతంలో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ మీద గెలిచిన ఆయన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన ఎన్నికలలో, 2023లో జరిగిన ఎన్నికలలో ఆయన కేసీఆర్ పార్టీ అభ్యర్థిగానే గెలిచారు. 2023లో ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరడం నేరం కాదుగానీ, బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం మాత్రం నేరం అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచి కేసీఆర్ పార్టీలోకి మారిన కౌశిక్ రెడ్డి నానా రచ్చ చేస్తున్నారు. సరే, వీళ్ళ రాజకీయాల సంగతి ఎలా వున్నా, ఈ వివాదం నేపథ్యంలో ఆంధ్రుల మీద బీఆర్ఎస్ నాయకులకు వున్న ద్వేషం మరోసారి బయటపడింది. ఆరెకపూడి గాంధీని కౌశిక్ రెడ్డి ‘ఎక్కడి నుంచో బతకడానికి వచ్చి’ అనే మాటను ఉపయోగించి విమర్శించడం అనేది తెలంగాణలో వున్న ఆంధ్రులను అవమానించడమే. ఆంధ్రుల మీద ద్వేషాన్ని వెదజల్లడం అనేది బీఆర్ఎస్ పార్టీ సంస్కృతి కాబట్టి కౌశిక్ రెడ్డి ఆ మాటను ఎలాంటి జంకూ గొంకూ లేకుండా ఉపయోగించగలిగారు. ఆరెకపూడి గాంధీ బతకడానికి వచ్చిన వ్యక్తి అయినట్టయితే, ఆయన్ని తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు టీఆర్ఎస్‌లోకి తీసుకున్నట్టు? రెండుసార్లు తమ పార్టీ అభ్యర్థిగా ఎందుకు పోటీగా నిలిపినట్టు? కేసీఆర్ తన పార్టీ టిక్కెట్‌ని ఎక్కడినుంచో బతకడానికి వచ్చిన వ్యక్తికి కాకుండా ఇక్కడే భూమిలోంచి బయటకి వచ్చిన వ్యక్తికే ఇచ్చి గెలిపించుకోవచ్చుగా?  కౌశిక్‌రెడ్డి ఉపయోగించిన మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. అలా బతకడానికి వచ్చినవాళ్ళు వేసిన ఓట్లతోనే హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అన్ని స్థానాలను గెలవగలిగిందని ఆయన అన్నారు. ఈ విషయంలో కేసీఆర్ ఆంధ్రులకు క్షమాపణ చెప్పాలని అన్నారు. అయితే బీఆర్ఎస్ అధినేత నుంచి గానీ, జూనియర్ అధినేత నుంచి గానీ, దారుణమైన కామెంట్ చేసిన కౌశిక్ రెడ్డి నుంచి గానీ క్షమాపణ చెప్పే సూచనలు కనిపించడం లేదు. ఏది ఏమైనప్పటికీ రావణకాష్ఠంలా బీఆర్ఎస్ పార్టీ మండిస్తున్న ఆంధ్ర ద్వేషాన్ని తెలంగాణలోని ఆంధ్రులు గమనిస్తున్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా బుద్ధి చెబుతారు.