Next Page 
ఇంటింటి కధ పేజి 1

           
                                           ఇంటింటి కధ

                                                                                                         డి. కామేశ్వరి

                                                 

   
    తూరుపు తెల్లబడింది చల్లటి గాలి తిరిగింది. రాత్రంతా వేడి గాడ్పులతో, ఉక్కతో, చెమటతో , దోమలతో నిద్రలేక దొర్లిన అందరూ ఆదమరచి హాయిగా నిద్రపోతున్నారు. పాల వ్యాను చప్పుడు చేసుకుంటూ అప్పుడే వెళ్ళింది.
    ఎంత నిద్రలో వున్నా కాంతమ్మకి పాలవ్యాను చప్పుడికి మెలకువ వచ్చేస్తుంది. 'అబ్బ కళ్ళు మూసినట్టే లేదు అప్పుడే నాలుగున్నరయిపోయింది' అనుకుంది ఆవిడ. 'నాయనా ప్రసాదూ ....లేవరా, పాలు వచ్చేయి తెచ్చి పెట్టారా ' అంటూ కొడుకుని పిలిచింది. ప్రసాదు నిద్దర్లోనే ఊ...ఊ.... అంటూ మూలిగి మరోవైపు తిరిగి దుప్పటి ముసుగు పెట్టేశాడు. హాయిగా నిద్దర్లు పోతున్న పిల్లలని అంత తెల్లారే లేపి పంపడానికి కాంతమ్మకీ అయ్యో పాపం అనిపిస్తుంది. పాపం రాత్రంతా ఎవరికి నిద్దర్లు లేవు ఉక్కతో, దోమలతో , అయినా పాలు తెచ్చుకోకపోతే తెల్లారదు గదా కొంపలో..."లేవరా బాబూ, మళ్ళీ అయిపోతాయి పాలు తెచ్చిచ్చి మళ్ళీ పడుకుందువుగాని లే....వెళ్ళండిరా నాయనా రోజు మిమ్మల్ని మేలు కొలుపులు పాడలేను" ఆవిడ ఆవలిస్తూ బద్దకంగా అంది. "అబ్బ, శంకర్ గాడిని వెళ్ళమనమ్మా." ప్రసాదు మూలిగాడు. "వాడి వారం గాందే వాడు వేడతాడా లేరా. చప్పున వెళ్లిరా...' అందావిడ విసుగ్గా "ఏమిటీ గోల' అన్నట్లుగా నిద్దట్లోనే గట్టిగా మూలిగాడు వెంకట్రావు గారు. తండ్రి గొంతు వినగానే నిద్రమత్తు వదిలింది ప్రసాద్ కి. దుప్పటి తీసిపారేసి విసురుగా మంచం కింద తల్లి రాత్రి పెట్టిన బ్యాగు డబ్బులు తీసుకుని వెళ్ళాడు. రోజూ యీగోల , వీళ్ళని బతిమాలుకునే కంటే పాలు తెచ్చిపెట్టే మనిషిని పెట్టుకుందా మనుకుందావిడ ఎన్నోసార్లు. 'యింట్లో యిద్దరు మగపిల్లల్ని పెట్టుకుని మరో పదిరూపాయలు తగలేస్తావా, ఏం ఆ మాత్రం పాలు తేలేని సుకుమరులా నీ కొడుకులు, పిచ్చి వేషాలు వేయకుండా యిద్దర్నీ చెరో రోజు వెళ్ళమను' కసిరాడు వెంకట్రావుగారు. తండ్రి భయానికి యిద్దరన్నదమ్ములు నీవేళ్ళు అంటూ నీవేళ్ళు అంటూ తగూలాడుకుంటూ ఆఖరికి ఒక్కొక్కరోక్క వారం తేవాలన్న నిర్ణయానికి వచ్చారు. అ పది రూపాయలుంటే నాల్గు రోజుల కూర ఖర్చుకి వస్తుంది. నాలుగు పత్రికలు కొనుక్కోవచ్చు ఓ సినిమాకి వెళ్ళవచ్చు అని, లెక్కలు పెట్టుకోవాల్సిన మధ్యతరగతి సంసారం వారిది. ఐదుగురు పిల్లలతో ఆ పట్టణంలో గుట్టుగా సంసారం సాగించాలంటే , పెరుగుతున్న ధరల మధ్య ప్రతి యిల్లాలికి తలకిమించిన బరువయ్యే లోవర్ మిడిల్ క్లాసు సంసారం నడిపే సారధులు - వెంకట్రావు - కాంతమ్మ దంపతులు.
    వెంకట్రావు ఏబైయ్యోవడిలో పడినాయన. లోవర్ డివిజన్ క్లర్కుగా చేరి యిప్పుడు పబ్లిక్ వర్క్సు దిపార్టు మెంటు లో హెడ్ అసిస్టెంట్ స్థాయికి ఎదిగాడు. అయన ఉద్యోగంతో పాటు సంసారం ఎదిగింది. ఖర్చులూ పెరిగాయి. యిరవై పాతికేళ్ళ క్రితం నూటఎబై రూపాయలతో ఏ స్థాయిలో బతికారో యిప్పుడు ఏడు ఎనిమిది వందలు తెచ్చుకుంటున్నా అంతకన్న స్థాయి దిగిపోయింది . ఆకాలం నాటి కోరికలు వేరు యిప్పటి అవసరాలు వేరు ప్రతివాళ్ళకి , ఏ ఫ్యానూ లేకుండా హాయిగా నిద్దర్లు పట్టేవి ఆనాడు అందరికీ. రేడియో అనేది ఎక్కడో చూడడం తప్ప అవసరం అనుకోలేదు ఆనాటి వాళ్ళు. చెప్పులన్నా లేకుండా నడిచి పోవడం నామోషి అనుకోలేదు ఆనాడు ఎవరూ. ఫ్యానులు, రేడియోలు, గ్యాస్ స్టపులు, ప్రెషర్ కుక్కర్లు యిప్పుడు లగ్జరీస్ కాకుండా నిత్యావసర వస్తువులయి పోయాయి. ఇన్ని రకాల బట్టలు, యిన్ని రకాల వేషాలు మాకు లేవు అంటారు. ఆనాటి వాళ్ళు. లేకపోతే మీ ఖర్మ యివన్నీ మాకు కావాల్సిందే అంటారు ఈనాటి పిల్లలు. పండుగో పబ్బమో వస్తే యింటిల్లిపాది సినిమాకి వెళ్ళి ఆ ముచ్చట మరో పండుగ దాకా చెప్పుకునే ఆనాటి వాళ్ళు యినాడు వారానికి రెండు సినిమాలు చూస్తున్నారు. పత్రికలు కొని చదవటం హాబి కాదు అలవాటుగా మారిపోయింది ప్రతి సంసారంలో , సినిమాలు పత్రికలు జీవితంలో ఒక భాగం అయిపోయాయి అందరికీ. అడ, మగ అందరూ చదువులే. మగపిల్లలతో పాటు ఆడపిల్లలకి చదువులే కాకుండ వేలకి వేలు కట్నాలు పోసి పెళ్ళిళ్ళు చెయ్యాల్సి వస్తుంది ప్రతివాళ్ళకి. యీ పెరుగుతున్న ధరల మధ్య ఖర్చుల స్థాయిలో జీతాలు ఎదగక , ఎంత తెచ్చుకున్నా చాలక ప్రతిరోజూ రేపెలాగా గడుస్తుంది. అవి బెంగ పెట్టుకునే వేలాది మధ్య తరగతి సంసారాల్లో వెంకట్రావు గారి సంసారం ఒకటి.
    ఈ ఆర్ధిక చిక్కులో ఆయన్ని వయసుని మించినవాడిగా తయారుచేసాయి. ఏబై నిండకుండానే మూడొంతులు జుత్తు తెల్లబడింది. మీసాల దగ్గర నించి కలగలపు రంగులో తయారయ్యాయి. ఎప్పుడూ ఏదో సమస్యలతో సతమతమయ్యే అయన మొహంలో సాధారణంగా నవ్వే కనపడదు. అయన తినే తిండిని సమస్యలే మింగి కూర్చున్నట్టు అయన దవడలు పీక్కు పోయి, కళ్ళు లోతుకు పోయి వుంటాయి. ఆయనకున్న సమస్యలు చాలనట్టు పెళ్ళయిన పెద్ద కూతురు వెళ్ళిన అర్నేల్లకే పుట్టిల్లు చేరింది. వెంట తనతో పాటు మరో ప్రాణిని మోస్తూ, ఆ దెబ్బకి వెంకట్రావుగారు మరి లేవలేనంతగా కృంగిపోయారు. పదివేలు ఖర్చు పెట్టి చేసిన పెళ్ళి ముచ్చట పదిరోజులు సంబరం అయి పాతికేళ్ళు కాకుండానే అన్ని ఆనందాలు కోల్పోయి తిరిగి వచ్చిన కూతురి మొహం చూచి ఓర్చుకునే శక్తి లేక యింటి పట్టునే వుండడం మానుకున్నారు. తినే నోరు ఒకటి తగ్గి ఒక బాధ్యత తీరిందన్న సంతోషం నాల్గు రోజులే అయి ఒకరికి యిద్దరయి వచ్చిన కూతురి బాధ్యత. పుట్టబోయే బిడ్డ బాధ్యత జన్మంతా తనదే అనుకునేసరికి అయన కాళ్ళు, చేతులు చచ్చుపడినట్లయి పోయాయి. సంపాదించేది ఒకడు తినేది ఏడుగురు. ఆ భారం రోజు రోజుకి పెరిగి అయన ఆ బరువు మోయలేనివాడిలా కృంగిపోసాగాడు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS