Read more!

వైకుంఠ ఏకాదశి... వేద నారాయణ స్వామి...

 

 

వైకుంఠ ఏకాదశి... వేద నారాయణ స్వామి...

 



కొత్త సంవత్సరం మొదలవుతోంది.  కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు, కొత్త ఉత్సాహం, అన్నీ కొత్త కొత్తగా ఆనందోత్సాహాలు పరవళ్ళు తొక్కుతూ  వుంటాయి.  ఈమాటు ఇంకో విశేషమేమిటంటే నూతన సంవత్సరం మొదటిరోజే యువతలోనేకాక భక్తులకీ, దైవానురక్తులకీ శుభోదయం పలుకుతూ  ముక్కోటి ఏకాదశి కూడా వచ్చింది.  ఈ శుభ సందర్భంగా మరి మనం ముక్కోటి ఏకాదశి విశేషాలను తెలుసుకుని అలాగే చిత్తూరు జిల్లా  నాగలాపురంలోని శ్రీ వేద నారాయణస్వామి ఆలయాన్ని దర్శించి వద్దామా?

ముక్కోటి ఏకాదశి

 



పుష్యమాసంలో పూర్ణిమకు ముందువచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి.  శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమయిన ఈ ఏకాదశికి ఈ పేరు రావటానికి  కారణం వైకుంఠంలో ముక్కోటి దేవతలు ఈ రోజు శ్రీ మహా విష్ణువుని దర్శించి, సేవిస్తారు.  ఈ రోజు వైష్ణవాలయాలలో అత్యంత శోభాయమానంగా  ఉత్సవాలు జరుగుతాయి.  ఈ రోజు ఉత్తర ద్వారంగుండా వెళ్ళి స్వామిని దర్శిస్తే ఆ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని నమ్మకం.   సాధారణంగా ఈ రోజు తప్పితే మిగతా రోజులన్నీ దేవాలయాలలో ఉత్తర ద్వారాన్ని మూసి వుంచుతారు.  ఒక్క వైకుంఠ ఏకాదశి రోజునే ఈ ద్వారం  తెరుస్తారు.  దీనికి సంబంధించి ఒక కధ విష్ణు పురాణంలో వున్నది.  ఇద్దరు రాక్షసులకి శ్రీ మహా విష్ణువు ఉత్తర ద్వారంగుండా  వైకుంఠ ప్రవేశం  కల్పించాడుట.  వారిన వరం కోరుకోమంటే వారు ఆ రోజు ఉత్తర ద్వారంనుంచీ వచ్చి స్వామిని దర్శించినవారికి వైకుంఠ ప్రవేశం కల్పించమని కోరారుట.  అందుకనే ఈ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అనే పేరుకూడా వచ్చింది.  ఆ నమ్మకంతోనే నేటికీ భక్తులు  ఈ వైకుంఠ ఏకాదశి రోజు వైష్ణవాలయాలలో  ఉత్తర ద్వారంగుండా వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటారు.  చూశారా పూర్వం రాక్షసులు కూడా జన హితం కోసమే వరాలు కోరేవారు.  అలాంటి  కోరికలు, వరాలు ఎన్ని యుగాలు గడిచినా నిలిచివుంటాయి. పద్మ పురాణం ప్రకారం ఈ రోజు విష్ణు శక్తి  ముర అనే లోక కంటకుడైన రాక్షసుణ్ణి  హతమార్చింది.  అందుకే ఆ శక్తికి విష్ణు, ఏకాదశి అనే పేరుపెట్టి వరం కోరుకోమనగా, ఆమె  ఆ రోజు ఉపవాసం వున్నవాళ్ళ పాపాలు  హరింపజేయమని కోరుకున్నది.  అందుకే ఏకాదశి రోజు ఉపవాసం ఎంతో ముఖ్యం.  ఈ రోజు ఉపవాసం, జాగారం, జపం, ధ్యానం వగైరాలకు  ప్రశస్తమయినది. వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం తెలుసుకున్నాంగా…ఇంక మనం శ్రీ వేద నారాయణ స్వామిని దర్శిద్దాం పదండి.

శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం, నాగలాపురం

దశావతారాలలో మొదటిదైన మత్స్య రూపంలో శ్రీ మహావిష్ణువు వేదాలను కాపాడి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడుకదా.  ఆ అవతారంలోనే స్వామి  ఇక్కడ దర్శనమిస్తారు.  స్ధల పురాణం ప్రకారం...

 



బ్రహ్మదేవుడు భూమిమీద ప్రాణకోటి సృష్టి ప్రారంభించటానికి తగిన శక్తి కోసం తపస్సుచేయసాగాడు.  ఆ సమయంలో సోమకాసురుడనే రాక్షసుడు  బ్రహ్మదేవుని దగ్గరవున్న వేదాలను అపహరించి, సముద్ర గర్భంలో దాక్కున్నాడు.  వేదాలు లేకుండా సమస్త జీవ సృష్టి కష్టమని బ్రహ్మదేవుడు,  మిగిలిన దేవతలతో కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరకెళ్ళి విన్నవించుకున్నాడు.  వారి ప్రార్ధనమీద శ్రీ మహావిష్ణువు వేదాలను రక్షించటానికి,  సముద్రగర్భంలో వున్న సోమకాసురునితో యుధ్ధం చేయటానికి మత్స్యావతారమెత్తాడు.  కొన్ని సంవత్సరాల పోరాటం తర్వాత సోమకాసురుని  సంహరించి, వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించాడు.  శ్రీ మహావిష్ణువు వేదములను బ్రహ్మదేవునవికి అప్పగించిన స్ధలమే ఇది.  ఈ క్షేత్రానికి  ఇదివరకున్న పేర్లు వేదపురి, వేదారణ్య క్షేత్రం, హరికంఠాపురం.

చరిత్ర

చరిత్ర ప్రకారం  పల్లవులచే నిర్మింపబడిన ఈ ఆలయం మొదట్లో చిన్నగానే వుండేది.  స్వామి శ్రీ కరియ మాణిక్య పెరుమాళ్.  విజయనగర  సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు  కుంభకోణంలో జరిగే మహామఖి ఉత్సవానికి వెళ్తూ, దోవలో ఈ ఆలయాన్ని దర్శించారు.  ఆయన ఈ  ఆలయాన్ని శ్రీ వేదనారాయణస్వామి ఆలయంగా మార్చి, 12 ఎకరాల స్ధలంలో పంచ ప్రాకారాలు, సప్తద్వారాలతో, అత్యంత కళాత్మక శిలా నైపుణ్యంతో  అందమైన దేవాలయంగా పునర్నిర్మించటానికి భూదానాలు చేశాడు.  ఈ విషయం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయ ఉత్తర గోపుర ద్వార  కుడ్యముపై వున్న శాసనం ద్వారా తెలుస్తున్నది.  ఆ సమయంలోనే హరికంఠాపురం అనే ఆ ఊరి పేరును తన తల్లి పేరున నాగమాంబాపురంగా  మార్చినట్లు తెలుస్తున్నది.  రాను రాను నాగమాంబాపురం కాస్తా నాగలాపురంగా మారింది.

ఉపాలయాలు

ఆలయంలోనూ, ఉపాలయాలలోనూ విష్ణు దుర్గ, బ్రహ్మ, లక్ష్మీ భూవరాహస్వామి, విష్వక్సేనుడు, వేణు గోపాలస్వామి, లక్ష్మీనారాయణ, హయగ్రీవుడు,  వీరాంజనేయస్వామి, సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుడు వగైరా దేవతా మూర్తులను దర్శించకోవచ్చు.



విశేషాలు

ఆలయం దర్శించేటప్పుడు అక్కడి విశేషాలు కూడా తెలుసుకోవాలికదా మరి…
ఆలయంలో ప్రవేశించగానే ఎడమవైపు నాగరాజ గణేశుడు నుంచుని దర్శనమిస్తాడు.  ఈయన ఎడమ చేతిలో నాగరాజు కర్ర లాగా వుంటాడు.   అందుకే ఆయనకా పేరు.  పైగా ఈయనకి శ్రీ వెంకటేశ్వరస్వామికి మాదిరి తిరునామాలు వుంటాయి.
ఇక్కడ రెండు విష్ణు దుర్గ  విగ్రహాలు వున్నాయి, శంఖం, చక్రంతో.  ఒకటి చిన్న విగ్రహం, ఇంకొకటి కొంచెం పెద్దది.
గర్భ గుడిలో స్వామి విగ్రహం దాదాపు ఆరు అడుగుల ఎత్తున, నడుము కింద మత్స్య రూపం, పైన శ్రీ మహావిష్ణు రూపంతో, ఇరువైపుల శ్రీదేవి,  భూదేవులతో, అల్లంత దూరంనుంచే అత్యద్భుతంగా దర్శనమిస్తారు.

ముఖ్య విశేషం

ఈ ఆలయంలో ప్రధాన రాజగోపురంనుంచి 630 అడుగుల దూరంలో వున్న స్వామి మూల విరాట్టుపై సూర్యకిరణాలు నేరుగా మూడు రోజులపాటు   ప్రసరిస్తాయి.  ఇవి మొదటి రోజున స్వామి పాదముల మీద, రెండవ రోజు నాభి మీద, మూడవ రోజు స్వామి శిరస్సు మీద ప్రసరింపబడి స్వామి దివ్య  రూపాన్ని తేజోవంతం చేస్తాయి.
మత్స్యావతార రూపంలో శ్రీ మహావిష్ణువు సముద్ర గర్భంలో చాలా సంవత్సరాలు యుద్ధం చేసి వచ్చినందున  నీటి అడుగున వున్న ఆయన దివ్య  శరీరము వెచ్చదము కొరకు సూర్యభగవానుడు తన కిరణాలను స్వామిమీద ప్రసరింపచేశాడు.   అందువల్లనే నేటికీ సూర్యుని కిరణాలు స్వామిని తాకే  రోజులలో సూర్యపూజోత్సవాలుగా కొనియాడబడుతూ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.
 మనశ్శాంతి, నవగ్రహశాంతి, వివాహ, సంతాన, సౌభాగ్యాలకోసం కుటుంబ సమేతంగా దర్శించుకోవాల్సిన పుణ్య క్షేత్రంగా భక్తులచే  కొనియాడబడుతున్నదీ స్వయంభూ మత్స్యావతార శ్రీ వేదనారాయణస్వామి క్షేత్రం.                                              
ఉత్సవాలు

మార్చినెల 23, 24, 25 తేదీలలో సూర్య కిరణాలు స్వామిమీద ప్రసారమవుతాయి.  ఆ సందర్భంలో జరిగే  సూర్య పూజ ఉత్సవాలకు అనేక  ప్రాంతాలనుంచి భక్తులు విశేష సంఖ్యలో హాజరవుతారు.  ఏప్రిల్ లో 10 రోజులపాటు స్వామికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
24-9-1967నుంచి తిరుమల తిరుపతి దేవస్ధానంలో చేర్చబడి, సకల ఉత్సవాలు వైభవంగా నిర్వహింపబడుతున్నాయి.

మార్గము

చిత్తూరు జిల్లాలో వున్న ఈ ఆలయం తిరుపతి – మద్రాసు రహదారిలో (వయా ఊత్తుకోట) తిరుపతికి 68 కి.మీ. ల దూరంలోను, మద్రాసుకు 73  కి.మీ. దూరంలో వున్నది.  తిరుపతినుండి రోజూ ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖవారి ఆలయ దర్శన బస్సులు వుంటాయి.

- పి.యస్.యమ్. లక్ష్మి