కచుడు
కచుడు
పూర్వం దేవతలకు రాక్షసులకు తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. రాక్షస గురువు శుక్రాచార్యుడు సంజీవని విద్య సాధించి దానితో యుద్ధంలో మరణించిన రాక్షసులను మళ్లీ బతికిస్తూ ఉండేవాడు. దీనితో దేవతలకు బాగా ఇబ్బంది కలిగి బాగా ఆలోచించి బృహస్పతి కుమారుడైన కచుడి దగ్గరకు వెళ్లి కర్తవ్య ఉపదేశం చేశారు. శుక్రాచార్యుడి దగ్గర ఉన్న సంజీవని విద్య నేర్చుకుని రమ్మని పంపారు. శుక్రాచార్యుడికి దేవయాని అనే సౌందర్యవతి అయిన కూతురు ఉంది. శుక్రుడి దగ్గరకు వెళ్లి తాను బృహస్పతి కొడుకునని విద్యాభ్యాసం కోంస వచ్చానని కచుడు నమస్కరించాడు. కచుడి వినయం, తేజస్సు శుక్రాచార్యుడిని బాగా ఆకర్షించాయి. శిష్యుడిగా కచుడు అక్కడ స్థిరపడ్డాడు. శుక్రాచార్యుడి కూతురు దేవయానికి, కచుడికి పరిచయం నానాటికీ పెరుగుతోంది. ఆమె కోసం అతడు అడవికి వెళ్లి పూలు తేవడం, కొన్ని సందర్భాల్లో పూలమాలలు కట్టి ఆమె జడలో తురమడం దేవయానికి ఆనందదాయకాలయ్యాయి. కానీ శుక్రుడి ఆశ్రమంలో అంతకుముందే ఉన్న రాక్షస జాతికి చెందిన శిష్యులకు కచదేవయానుల కలుపుగోలుతనం నచ్చలేదు.
ఒకనాడు అడవికి వెళ్లిన కచుడిని వాళ్లు మాటువేసి వధించారు. సాయంత్రం ఎంత సమయమైనా కచుడు తిరిగి ఆశ్రమానికి రాలేదు. దేవయాని మనసు కీడు శంకించింది. తన తండ్రికి విషయం వివరించింది. శుక్రడు దివ్యదృష్టితో జరిగింది తెలుసుకున్నాడు తన సంజీవని విద్యతో శిష్యుడికి మళ్లీ జీవం పోశాడు. దేవయాని ఆనందానికి అవధుల్లేవు. కానీ రాక్షసులకు మాత్రం కచుడి మీద కోపం విపరీతంగా పెరిగింది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి కచుడు పూలకోసం అడవికి వెళ్లిన సమయం బాగా కలిసివచ్చింది. ఈసారి అతడిని వధించడంతోపాటు పూర్తిగా బూడిద అయ్యేలా చేసి ఆ బూడిదను గురువు తాగే మద్యంలో కలిపి ఇచ్చారు. దేవయానికి కచుడు తిరిగి రాకపోవడం రాక్షసులమీద అనుమానాన్ని పెంచింది. ఆమె తన తండ్రి వద్దకు వెళ్లి మొర పెట్టుకుంది. శుక్రుడు దివ్యదృష్టితో మరోసారి వెదికాడు. ఏ లోకంలోనూ అతడు కనిపించలేదు. చివరకు అతడు తన పొట్టలోనే ఉన్నాడని తెలుసుకొని అతడికి సంజీవననీ విద్యను నేర్పి తన పొట్ట చీల్చుకుని బయటకు వచ్చి తాను నేర్పిన విద్యతో తనను బతికించమని శుక్రడు శిష్యుడికి చెప్పాడు దేవతల కోరిక ఏరకు కష్టాలకోర్చి కచుడు ఇలా సంజీవని విద్యను సంపాదించగలిగాడు. కచుడు శుక్రుడి పొట్ట చీల్చుకుని బయటకు వచ్చి కృతజ్ఞత ప్రకటిస్తూ గురువును మళ్లీ బతికించాడు.