Read more!

న్యగ్రోధం వృక్ష వృత్తాంతం!!

 

న్యగ్రోధం వృక్ష వృత్తాంతం!!


కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవాళ్ళు. వాళ్లలో వినత గరుత్మంతుడిని కనింది. కద్రువ సర్పజాతి అయిన పాములను కనింది. కద్రువకు వినత దాస్యం చేస్తుండేది. అమృతాన్ని తీసుకుని వస్తే దాస్యం నుండి విముక్తి కల్పిస్తారని తన తల్లి అయిన వినతకి దాస్య విముక్తి చెయ్యడానికి గరుత్మంతుడు అమృతం తేవడానికి బయలుదేరేముందు తన తండ్రి అయిన కశ్యపుడి దగ్గరకు వెళ్లి "నేను మా అమ్మ వినతకు దాస్య విముక్తి కలిగించడానికి వెళ్తున్నాను.  నేను ప్రయాణం చేసేటప్పుడు ఆకలి వేస్తుంది కదా, అప్పుడు ఆహారం ఎక్కడ దొరుకుతుంది??" అని అడిగాడు. 


అప్పుడా కశ్యపుడు "గరుత్మంతా అమృతం తీసుకుని రావాలి అంటే హిమాలయ పరిసర ప్రాంతాలకు వెళ్ళాలి. నువ్వు హిమాలయ పర్వతాలకి దగ్గరగా వెళుతున్నప్పుడు ఒక పెద్ద సరోవరం కనబడుతుంది. ఆ సరోవరం ఒడ్డున రెండు గజకచ్ఛపాలు కొట్టుకుంటూ ఉంటాయి" అన్నాడు కశ్యపుడు.


"గజకచ్ఛపాలా?? అవేంటి?? వాటి గురించి చెప్పండి" అని అడిగాడు గరుత్మంతుడు.


"అవి ఒక తాబేలు ఒక ఏనుగు. పూర్వకాలంలో, ఒక బ్రాహ్మణుడికి విభాసుడు, సుప్రతీకుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.  ఆ బ్రాహ్మణుడు అనారోగ్యం కారణంగా కొన్నిరోజుల బాధపడ్డాడు, ఆ తరువాత మరణించాడు. ఆయన మరణించిన కొంత కాలానికి ఆ అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలలో తేడాలు వచ్చి, ఒకరిని ఒకరు శపించుకున్నారు. విభాసుడు సుప్రతీకుడిని ఒక పెద్ద ఏనుగుగా అవ్వమని, సుప్రతీకుడు విభాసుడిని ఒక పెద్ద తాబేలుగా అవ్వమని శపించుకున్నారు. ఆ తాబేలు చుట్టుకొలత 10 యోజనములు, మందం 3 యోజనములు ఉంటుంది. ఆ ఏనుగు 6 యోజనముల ఎత్తు, 12 యోజనముల పొడువు ఉంటుంది.  ఏనుగు సరోవరంలో ఉన్న తాబేలుని బయటకి లాగాలని చూస్తుంటుంది. తాబేలేమో ఏనుగుని నీళ్ళల్లోకి లాగెయ్యాలని చూస్తుంది, అవి అలా కొన్ని వేల సంవత్సరముల నుండి కొట్టుకుంటూ ఉన్నాయి. అవి అలా కొట్టుకుంటూ ఉండడం వలన ఆ చుట్టుపక్కల ఎవరూ ఉండడంలేదు. కనుక నీకు ఆకలి వేస్తే ఆ రెండిటినీ తినేసెయ్యి" అని కశ్యప ప్రజాపతి అన్నాడు.


గరుత్మంతుడు సరే అని బయలుదేరాడు. అలా వెళుతూ వెళుతూ ఆ ఏనుగుని, తాబేలుని చూశాడు. ఆ రెండింటినీ తన కాలి గోళ్ళతో పైకి ఎత్తి, కనిపించిన ఒక మహావృక్షం యొక్క కొమ్మ మీద ఆ రెండిటినీ పెట్టాడు. ఆ గజకచ్ఛపాల బరువుకి ఆ కొమ్మ విరిగిపోతుండగా, గరుక్మంతుడు తన ముక్కుతో ఆ కొమ్మని పైకి ఎత్తి ఒక భద్రమైన స్థానానికి చేర్చాడు. తరువాత ఆ గజకచ్ఛపాలని ఒక పర్వతం మీద పెట్టుకొని తినేశాడు. ఆ తరువాత ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అమృతాన్ని తెచ్చి వినతని దాస్యం నుండి విముక్తురాలిని చేశాడు. అలా గరుక్మంతుడు అమృతం తీసుకురావడానికి చేసిన ప్రయాణంలో ఆ గజకచ్ఛపాలని పెట్టిన వృక్షం పేరే న్యగ్రోధం.


                            ◆ వెంకటేష్ పువ్వాడ.