ఆసక్తికరమైన భీష్ముడి జన్మ రహస్యం!!

 

ఆసక్తికరమైన భీష్ముడి జన్మ రహస్యం!! 

మహాభారతం ఎంత గొప్ప గ్రంథమో తెలిసిందే. అందులో ప్రతి పాత్ర ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఇక  అందులో కృష్ణార్జునుల సాంగత్యం, యుద్ధ సమయంలో అర్జునుడు భయపడితే కృష్ణుడు ధైర్యం చెబుతూ, విషయాన్ని కూలంకషంగా విశ్లేషించి చెబితే అది యావత్ మానవాళికి భగవద్గీతగా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అనుసరించే మనోవిజ్ఞాన గ్రంథంగా కూడా అందరికి వర్తిస్తుంది. అలాంటి మహాభారతంలో గొప్ప పాత్ర భీష్ముడు. ఈయన శంతన మహారాజు, గంగాదేవిల కుమారుడు. సకల విద్యలు అభ్యసించి ధైర్య, సాహసాలలోనూ, యుద్ధ విద్యలోనూ, కళలోనూ ఎంతో ప్రావీణ్యం సంపాదించినవాడు. 

ముఖ్యంగా మహాభారతంలో ఉన్న ప్రతి పాత్ర మరణం వెనుక యుద్ధమో, కుట్రలో, కుతంత్రాలొ ఉంటాయి. కానీ అలాంటివి ఏమీ లేకుండా స్వచ్చంధ మరణం పొందినవాడు ఎవరైనా ఉన్నారా అంటే అది భీష్ముడే. మాట మీద నిలబడుతూ, న్యాయానికి తన ఓటు వేస్తూ చరిత్రలో భీష్మ పితామహుడిగా మిగిలిపోయిన ఈయన గత జన్మ గురించి తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.

ప్రభాసుడు…… భీష్ముడు!!

ప్రభాసుడు ఎవరు అని చాలా మందికి అనుమానం వస్తుంది. దేవతలలో కూడా జాతులు ఉన్నాయి. వారిలో వసువులు కూడా ఒక జాతి. ఆ వసువులు అష్టవసువులు అంటారు. ఈ అష్ట వసువులలో చివరి వాడు ప్రభాసుడు. ఈ ప్రభాసుడు తన అన్నలు, వారి భార్యలతో కలసి భూలోకానికి వచ్చినపుడు వశిష్ఠ ముని ఆశ్రమంలో తిరుగుతూ అక్కడ కనిపించిన దేవతా రూపమైన ఆవును చూసి దాన్ని ఎత్తుకుని పోతారు. అవును ఎత్తుకుని పోయినందుకు  వశిష్టముని కోపం చేసుకుని వసువులను భూమీ మీద మనుషులుగా పుట్టమని శపిస్తాడు. అయితే తరువాత వాళ్ళు బతిమాలుకునేసరికి ఆవును తీసుకెళ్లడానికి ముఖ్య కారణమైన ప్రభాసుడిని తప్ప మిగిలిన ఏడు మందికి తొందరగా జన్మ ముగిసి శాపం పోయేలా చేస్తాడు. 

అయితే ఘోరమైన శాపం పొందిన ప్రభాసుడు కూడా భీష్ముడిగా పుట్టడం వెనుక ఒక రహస్యం ఉంది, ప్రభాసుడి భార్య అయిన యోగసక్త, తన స్నేహితురాలి కోసమే ఆవును దొంగిలించమని అడుగుతుంది. వశిష్ఠుని శాపం గురించి తెలిసిన తరువాత యోగసక్త స్నేహితురాలు ఎన్నో కష్టాలు పడి ప్రయాణం చేసి, వశిష్ఠ మునిని చేరుకుని, ఆవు దొంగిలించడానికి ముఖ్య కారణం నేనే అని చెప్పి, ఆ శాపాన్ని నాకు ఇవ్వమని, ప్రభాసుడికి శాపం తొలగించమని అడుగుతుంది. ఆమె నిజయితీకి మెచ్చుకున్న వశిష్ఠుడు ప్రభాసుడు చరిత్రలో నిలిచిపోయే క్షత్రీయ రాజుగా పుడతాడని శాపంలోనే వరాన్ని ప్రసాదిస్తాడు.

అలా భూమి మీద శంతన మహారాజుకు, గంగాదేవికి పుట్టిన భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు.  గంగాదేవి మాయమైపోయిన తరువాత శంతనుడు సత్యవతిని పెళ్లిచేసుకోవాలని అనుకున్నప్పుడు సత్యవతి తల్లిదండ్రులు దేవవ్రతుడు ఉన్నాడు కాబట్టి మేము నీకు మా కూతురుని ఇవ్వము, అతను రాజు అయితే నా కూతురి పిల్లలకు న్యాయం జరగదు అంటారు. అప్పుడు దేవవ్రతుడు నేను జీవితాంతం పెళ్లి చేసుకొనని, అలాగే రాజ్య పాలన విషయాల్లో సహాయంగా ఉంటాను తప్ప అధికారం తీసుకొనని చెప్పి తండ్రికి రెండో పెళ్లి చేస్తాడు. అలా అతను జీవితాంతం పెళ్లి లేకుండా ఉంటాడు. భీష్మించు అంటే ప్రతిజ్ఞ చేయడం. అలా ప్రతిజ్ఞ చేశాడని దేవవ్రతుడికి భీష్ముడు అనే పేరు స్థిరపడిపోయింది.

భీష్మ నీతి, భీష్ముడి పోరాట పటిమ ఎలాంటిదంటే తన మాయోపాయంతో అందరినీ ఆడించే శ్రీకృష్ణుడు ఆ భీష్ముడి భక్తుడు, ఆయన మాట జవదాటని వాడు.

ఇంత గొప్ప వీరుడి గురించి విన్న, తెలుసుకున్నా వారి నీతిలో నడిచినా జన్మ ధన్యమవుతుంది. జీవితం సంతోషమయమవుతుంది.

◆ వెంకటేష్ పువ్వాడ