Read more!

కొంగుబంగారం – శ్రీరామ నామం (SriRama Namam)

 

కొంగుబంగారం – శ్రీరామ నామం (Srirama Namam)

 

సకల లోకాలలో ఆదర్శగుణాలు రాశిగా పోస్తే మనకు కనిపించేవాడు శ్రీరాముడు. రాముడు గొప్పవాడా? రామ నామం గొప్పదా అంటే రామని కంటే రామనామమే గొప్పదని చాటే కథలు చాలా ఉన్నాయి. రామ నామం గొప్పతనం గురించి ముందు తెలుసుకుందాం. రామనామ గొప్పతనాన్ని వివరించే ఈ గాథ చదవండి.

లంకానగరంపై దండెత్తేందుకు రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మిస్తూ వుంది. రాయిపై ‘రామ’ అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తే అది తేలిపోతూ వుంది. ఇదంతా చూస్తూ వున్న రాముడిలో ‘నా పేరు రాసిన రాయి తేలుతూ వుంది కదా, నేనే రాయి వేస్తే’ అనే ఆలోచన కలిగింది. అంతే శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోనికి వేసాడు. ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది. దీనిని చూసి ఆశ్చర్యానికి లోనైన రాముడు పక్కనే ఉన్న హనుమంతుడికి ఈ విషయాన్ని వివరించి ఎందుకిలా జరిగిందని ప్రశ్నించాడు

అందుకు హనుమంతుడు “రామ” అనే నామం రాసివున్న రాళ్ళే పైకి తేలుతాయి. మీరు వేసిన రాయిపైన రామనామం రాయలేదు కదా! అందుకే మునిగిపోయింది” అని సమాధానం యిచ్చాడు.

అంటే రాముడికంటే కూడా రామనామం మహా శక్తివంతమైందన్నమాట!

 

రామాయణం కంటే బలమైన రామనామం

రావణాసుర సంహారానంతరం అయోధ్యనగరం చేరుకుని శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేపట్టాక, అయోధ్యానగరంలో రామసభ కొలువుదీరి వున్న సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి సభకు వచ్చాడు. మహర్షిని చూస్తూనే రాముడితో సహా సభలోని అందరూ లేచి నిలబడి మహర్షికి నమస్కరించారు. కానీ ఆంజనేయుడు రామనామ జపంలో మునిగి వుండటం వల్ల విశ్వామిత్రుడి రాకను గమనించక నిలబడలేదు, నమస్కరించలేదు. దీనిని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై “రామా! నీ సేవకుడు నన్ను అవమానించాడు. నీవు అతడిని శిక్షించు” అని రాముడిని ఆదేశించాడు. విశ్వామిత్రుడి మాటను జవదాటలేని శ్రీరాముడు హనుమంతుడిని శిక్షించేందుకు సిద్దమయ్యాడు. ఈ విషయం తెలిసిన హనుమంతుడు నారద మహర్షి సలహా మేరకు ‘రామ’ నామాన్ని జపించడం ప్రారంభించాడు. ఈ విషయంలోనే విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుడిపై బాణాల వర్షం కురిపించసాగాడు. ‘రామ’ నామ జపంలో నిమగ్నమైన ఆంజనేయుని రామబాణాలు ఏమీ చేయలేకపోయాయి. అలసిపోయిన శ్రీరాముడికి పట్టుదల అధికంకాగా చివరకు బ్రహ్మాస్త్రం ప్రయోగించేందుకు సిద్దమయ్యాడు.

ఇంతలో నారదమహర్షి అక్కడకు చేరుకుని “మహర్షీ! హనుమంతుడు నీ రాకను రామనామ జపం వల్ల గమనించక నమస్కరించనంత మాత్రమున మీరు మరణదండన విధించడమా? ‘రామ’ నామ జపం హనుమంతుడిని రామ బాణాల నుంచి రక్షిస్తూ వుంది. యిప్పటికైనా మీ ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకుని ఆజ్ఞను ఉపసంహరించండి” అని విశ్వామిత్రుడితో పలికాడు.

ఈ మాటలను విని విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని నిలుపుదల చేయించి హనుమంతుడి రామభక్తిని మెచ్చుకున్నాడు.

దీనిని బట్టి రామబాణం కంటే కూడా రామనామం గొప్పదని సృష్టమవుతూవుంది. యుగయుగాలను, సర్వలోకాలను తరింపజేసిన మహిమాన్వితమైన నామం – ‘రామనామం’.

అందుకే-

‘రామత్తత్వో అధికం నామ

మితి మన్యా మహేమయమ్

త్వయై కాతౌతారి తాయోధ్యా

నామ్నుతు భువన త్రయమ్

అని స్వయంగా రామభక్తుడైన హనుమంతుడు పేర్కొన్నాడు. అంటే శ్రీరాముడి చేత అయోధ్య తరింపబడింది. రామనామం చేత మూడు లోకాలు తరించాయని అర్థం!

‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరి మంత్రంలోని ‘రా’ అనే ఐదవ అక్షరం ‘ఓం నమశ్శివాయ’ అనే పంచాక్షరీ మంత్రంలోని ‘మ’ అనే రెండవ అక్షరం కలిస్తే ‘రామ’ అనే నామం అయింది. అంటే హరిహరతత్త్వాలు రెండింటిని ఇముడ్చుకున్న నామం రామనామం!

రామ’ అనే పదాన్ని గమనిస్తే ర, మ,లు కలిస్తే (అమ్మ) ‘రామ’ అవుతుంది ‘ర’ అంటే అగ్ని. ‘ఆ’ అంటే సూర్యుడు. ‘మ’ అంటే చంద్రుడు అని అర్థం. అంటే ‘రామ’ అనే పదంలో విశ్వాసానికి మూలమైన మూడు శక్తులు వున్నాయని చెప్పబడుతూ వుంది. అంతేకాకుండా ‘రామ’ అనే నామంలోని ‘రా’ అనే అక్షరం భక్తులను సంసారసాగరం నుంచి రక్షిస్తుందనీ ‘మ’ అనే అక్షరం భక్తుల మనోరథాలను నెరవేరుస్తుందని మహర్షులు పేర్కొనగా ‘రామ’ అనే పదంలోని ‘రా’ అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకుని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నిజ్వాలల్లో పడి దహించుకుపోతాయనీ, ‘మ’ అనే అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకుని బయటి పాపాలని మనలోనికి ప్రవేశించవని ఇందులోని అంతరార్థం.

అందువల్ల త్రిమూర్తులలో లయకారుడైన పరమశివుడు-

‘శ్రీరామ రామ రామేతి

రమే రామే మనోరమే

సహస్రనాయ తత్తుల్యం

రామనామ వరాననే’

అని పేర్కొన్నాడు. ‘రామ రామ రామ’ అని మూడుసార్లు నామ జపం చేస్తే శ్రీ విష్ణుసహస్రనామం చేసినంత ఫలం లభిస్తుందట. కాగామ కటపయాది వర్గసూత్రం ప్రకారం ‘య’ వర్గంలో ‘రా’ రెండవ అక్షరం కాగా ‘ప’ వర్గంలో ‘మ’ అయిదో అక్షరం. అంటే 2 X 5=10. దీనిని బట్టి ‘రామ’ అనే పదం పది సంఖ్యకు సంకేతం. ఇక మూడుసార్లు అంటే (10 X 10 X 10 = 1000) వెయ్యికి సమానమవుతుంది. అందుకే శివుడు ‘రామ’ అనే నామం మూడుసార్లు పలికితే సహస్త్రనామంతో సమానమని చెప్పినట్లు కథనం.

అటువంటి మహిమాన్వితమైన రామనామ గొప్పదనాన్ని చాటే నిదర్శనాలు ఎన్నో మనకు పురాణాల్లో కనిపిస్తాయి.

 

కిరాతకుని వాల్మీకిగా మార్చిన రామనామం

వాల్మీకి మహర్షి జీవితమే రామనామ మహిమకు చక్కని నిదర్శనం. నిజానికి ఆయన కిరాతకుడు. మహర్షులు చెప్పినట్లుగా’మారా’ అనే మాటకు జపం చేస్తూ కొంతకాలానికి ‘మరా’ అనే పదం ‘రామ’ గా మారింది. ఆయనపై వాల్మీకం(పుట్ట) పెరిగింది. చివరికి నారదమహర్షి ఉపదేశంతో వెలికి వచ్చి రామ నామ గొప్పదనాన్ని తెలుసుకుని ‘వాల్మీకి’ అయి రామయాణాన్ని మనకు అందించాడు. రాముడికంటే రామ నామం గొప్పది.

 

శనిబాధలు చేరనివ్వని రామనామం

పూర్వం ఒకసారి శనీశ్వరుడు ఎలాగైనా హనుమంతుడిని ఆవహించి కష్టాలపాలు చేయాలని భావించి హనుమంతుడి వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో హనుమంతుడు రామనామాన్ని జపిస్తూ వున్నాడు. హనుమంతుని సమీపించి శనీశ్వరుడు తన మనస్సులోని కోరికను వెలిబుచ్చగా “నేను ప్రస్తుతం రామనామజపంలో మునిగి వున్నాను. రామనామ జపం ముగిసిన తర్వాత నీవు నన్ను ఆవహించు” అని సమాధానం యిచ్చాడు. అందుకు అంగీకరించిన శనీశ్వరుడు నిరీక్షించసాగాడు. రామనామజపాన్ని హనుమంతుడు ఎప్పుడు ముగిస్తాడా అని శనిదేవుడు ఆతృతగా ఎదురుచూడసాగాడు. గుండెల నిండుగా సీతారాములనే నింపుకున్న హనుమంతుడు రామనామం ఆపేదెన్నడు? చివరకు నిరీక్షించి... నిరీక్షించి విసుగు చెందిన శనిదేవుడు రామనామం జపించేవారి దరిచేరడం కష్టమని తెలుసుకుని వెనక్కు వెళ్ళిపోయాడు. అంటే శనీశ్వరుడిని దరి చేరనీయని శక్తివంతమైన నామం – ‘రామనామం!’ కాబట్టి ‘రామ’ నామాన్ని జపించేవారి శని బాధలతో పాటు ఎటువంటి గ్రహబాధలు వుండవని చెప్తున్నారు. హనుమంతుని రక్షగా వుంచే రామనామం

‘యత్ర యత్ర రఘునాధ కీర్తనం

తత్ర తత్ర కృత మస్తకాంజలి

బాష్ప వారి పరిపూర్ణలోచనం

మారుతీం సమత రాక్షసాంతకం’

అంటే ఎక్కడ రామనామం వినిపిస్తూ వుంటుందో అక్కడ కళ్ళనిండా ఆనందబాష్పాలు నింపుకుని తలవంచి నమస్కరిస్తూ నిలబడి వుంటారట రాక్షసులను దోమల లాగా నలిపి నశింపజేసే రామభక్తుడైన హనుమంతుడు. దీనిని బట్టి రామ నామాన్ని జపించడం వల్ల హనుమంతుడు ఎప్పుడూ పక్కనే వుంటాడు. మనలను రక్షిస్తూ వుంటాడు. అనగా రామనామ జపం కేవలం ‘రాముడి కృపనే కాకుండా హనుమంతుడి కృపను కూడా ప్రసాదింపజేస్తుంది రామనామ సంకీర్తన

‘రామనామము రామనామము రమ్యమైనది రామనామము

రామనామము రామనామము రామనామము రామనామము

శ్రీమదఖిల రహస్తమంత్ర విశేషధామము శ్రీరామనామము

దారి నొంటిగ నడుచువారికి తోడు నీడే శ్రీరామ నామము...’

ఇలా ప్రారంభమై సాగే రామనామ సంకీర్తనను ప్రతిరోజూ ‘ఉభయ’ సంధ్యలలో పఠించడం వల్ల మానసిక శాంతి చేకూరుకుంది. ఎటువంటి సమస్యల నుండి అయినా గట్టెక్కే ధ్యైర్యం కలుగుతుంది. అంతేకాకుండా అనేకసార్లు విష్ణు సహస్ర నామ పారాయణం చేసిన ఫలం లభిస్తుంది. దీనిని ప్రతి ఒక్కరూ చేయవచ్చు. వీలున్నవారు సామూహికంగా కూడా చేయడం మంచిది.

నామమంత్రం

‘శ్రీరామ జయరామ జయజయ రామ’ అనేది పదమూడు అక్షరాల నామ మంత్రం. దీనిని పఠించడం వల్ల కూడా విశేషమైన పుణ్యఫలాలు కలుగుతాయి. సమర్థరామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్లసార్లు జపించి శ్రీరాముడి దర్శనాన్ని పొందినట్లు పురాణకథనం. వీలున్నప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తూ వుండడం శ్రీరామ రక్ష!

రామకోటి

‘చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం

ఏకైక మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం’

అంటే ‘రామ’ నామాన్ని కోటిసార్లు రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. ‘రామకోటి’ రాయడం అనాది నుంచి మనదేశంలో వున్న ఆచారం. చాలామంది శ్రీరామనవమినాడు రామకోటిని రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమినాడు ముగిస్తారు. శ్రీరామ నవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలుపెట్టవచ్చు. రాసేవారు కొన్ని నియమాలను పాటిస్తే శ్రీరాముడి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.

1. రామకోటిని రాయడం ప్రారంభించే రోజు ఉదయం పుస్తకాలకి పసుపు రాసి, కుంకుమ పెట్టి దేవుడి వద్ద వుంచి శ్రేరాముడిని అష్టోత్తరాలతో పూజించి, రామకోటిని నిర్మలమైన మనస్సుతో రాసేందుకు అవసరమైన శక్తిని ప్రసాదించవలసిందిగా ప్రార్ధించాలి. పూజానంతరం దేవుడి వద్దే కూర్చుని రామకోటి రాయడం మొదలుపెట్టాలి.

2. రామకోటిని రోజులో ఏ సమయంలోనైనా రాయవచ్చు. శుభ్రత, పవిత్రత ముఖ్యం.

3. రామకోటిని రాసే సమయంలో ఏకాగ్రతతో వుంటూ ‘శ్రీరామ’ అని మనస్సులో స్మరిస్తూ రాయాలి.

4. రామకోటి పుస్తకంలో ఇతర విషయాలు ఏమీ రాయకూడదు. పుస్తకాన్ని ఎక్కడపడితే అక్కడ పెట్టకుండా పవిత్రంగా వుంచాలి. శ్రీరామకోటిని రాసేందుకు కలాన్ని కూడా ప్రత్యేకంగా వుంచడం మంచిది.

5. ఒక లక్ష పూర్తి అవుతూనే పుస్తకాన్ని దేవుడి వద్ద వుండి పూజలు చేయడంతో పాటు రామాలయాలను దర్శించడం మంచిది.

6. రామకోటిని రాయడం పూర్తవుతూనే పని అయిపోయిందని పుస్తకాన్ని ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు. భద్రాచలం ఆలయానికిగానీ, రామకోటి పుస్తకాలను స్వీకరించే ఇతర ఆలయాలకు గానీ, ధార్మిక సంస్థలకుగానీ సమర్పించాలి. ఇదేదీ వీలుకాకుంటే ఏదైనా పవిత్ర నదిలో పుస్తకాన్ని నిమర్జనం చేయవచ్చు.

ఈ విధంగా రామకోటి వ్రాయడం వల్ల కష్టాలు దరిచేరవు. సకల రోగాలు, పాపాలు నశించి అనంతమైన పుణ్యఫలాలు లభించడంతోపాటు సర్వాభీష్టలు నెరవేరుతాయని శాస్త్రాలు చెప్తువున్నాయి.

అంతటి శక్తివంతమైన రామనామ జపం వీలున్నప్పుడు చేద్దాం. శ్రీరామ, హనుమంతుల కృపకు పాత్రులమవుదాం.