కొలనుపాక శ్రీ చండీ సమేత సోమేశ్వర స్వామి క్షేత్రం

 

కొలనుపాక శ్రీ చండీ సమేత సోమేశ్వర స్వామి

 

క్షేత్రం

 

 

 

 

నల్గొండజిల్లా ఆలేరుమండలంలోని కొలనుపాక వీరశైవ సిద్ధ క్షేత్రం. శైవమతస్థాపకుడుగా పూజింపబడుచున్న శ్రీ రేణుకాచార్య  ఇక్కడే లింగోద్భవం పొంది వేయి సంవత్సరాలు భూమండలం మీద శైవ మతప్రచారము చేసి,  మళ్ళీ ఇక్కడే లింగైక్యంపొందినట్టు సిద్ధాంత శిఖామణి అనే గ్రంథంలో వ్రాయబడి వుందని స్థలపురాణం. దేవాలయ ఆవరణనిండా ఎన్నో శిథిలమైన శాసనాలు, ఛిద్రమైన విగ్రహాలు మనకు కన్పిస్తాయి.  దేవాలయ ప్రాంగణాన్ని, ప్రాకార మండపాలనే మ్యూజియంగా ఏర్పాటుచేశారు పురావస్తుశాఖ వారు. ఈ ఆలయం క్రీ.శ 1070 - 1126 మధ్య నిర్మాణం జరిగినట్లు భావించబడుతోంది. పశ్చిమ చాళుక్యుల పాలనలో నిర్మించబడి ఉంటుందని  చరిత్ర కారులు భావిస్తున్నారు.                
 
 పూర్వచరిత్ర

ఈ కొలనుపాకనే పూర్వం దక్షిణకాశి, బింబావతి పట్నం, పంచకోశ నగరంగా పిలిచేవారట. దీనినే కొలియపాక, కొల్లిపాక, కల్లియపాక, కుల్యపాక, కొల్లిపాకేయ మొదలైన పేర్లతో పిలిచే వారట. ఇప్పడు కొలనుపాక, కుల్పాక్ గా వ్యవహరిస్తున్నారు.                    
            

 

ఆలయ ప్రవేశ ద్వారం      



ఇక్కడ సోమేశ్వర లింగాన్ని పుట్టులింగం, లేక స్వయంభూలింగంగా చెపుతున్నారు. ఈ లింగం నాలుగు యుగాలనాడే వెలసింది. కృతయుగంలో స్వర్ణలింగంగాను, త్రేతాయుగంలో రజితలింగంగాను, ద్వాపరయుగంలో,  తామ్రలింగంగాను పూజలంది కలియుగంలో శిలాలింగంగా దర్శనమిస్తున్నట్లు స్థలపురాణం. ఈ లింగమే రెండుగా  చీలి, దానిలో నుండి ఆది జగద్గురువు రేణుకాచార్య ఆవిర్భవించి,1000 సం.రాలు భూమిపై  వీరశైవ మతప్రచారం చేసి, మరల తిరిగి ఇదే లింగం లో లీనమైనట్లు చెప్పబడుతోంది. ఈయనకే రేణుకుడు, రేవణ, నేవణ, నేవణ సిద్ధేశ్వరుడు అనే పేర్లు ఉన్నాయి.


                                  శ్రీమత్ రేవణ సిద్దస్య కుల్యపాక పురోత్తమే !


                                  సోమేశ లింగ జననం  నివాసే కదళీ పురీ !!


అని  రేణుకాచార్య  స్తుతి.          

పంచపీఠాలు :

 

ఈ సోమేశ్వర లింగం పంచ పీఠాలలో మొదటిదిగా వీరశైవులు పూజిస్తారు.              
 1. సోమేశ్వరస్వామి – కొలనుపాక  2. సిద్దేశ్వర స్వామి - ఉజ్జయిని 3. భీమనాథస్వామి - కేదారనాథ్ 4. మల్లిఖార్జున స్వామి – శ్రీశైలమ్ 5. విశ్వేశ్వరస్వామి – కాశి     

 

ప్రవేశ ద్వారంఎదురుగా వినాయకుడు 

           
                                  
              
అతి పురాతనమైన  ఈ ఆలయప్రాగణంలోకి ప్రవేశించిన భక్తులకు అనిర్వచ నీయమైన భక్తితో పాటు ఏదో ఒక ఆవేశంవంటిది కలుగుతుంది. దీనినే వీరశైవంలో భక్త్యావేశం అని పిలిచేవారేమో అనిపిస్తుంది. అక్కడ కన్పించే భక్తులు కూడ ఎక్కువగా కర్నాటకనుండి వచ్చినవారే ఎక్కువగా కన్పిస్తారు. తలస్నానాలు చేసి, జుట్టు ఆరబోసుకొని, ముఖంమీద బండారు, కుంకుమ, విభూతులను దట్టంగా అలంకరించుకున్న ఆడవారిలో అక్కడ చండీమాతే  కన్పిస్తుంది. ఆలయప్రవేశం తోరణద్వారంతో చాలాఎత్తుగా కన్పిస్తుంది. తోరణ ద్వారానికి అటుఇటు ద్వారపాలకులు, ఎడమ వైపు నలుచదరపు కందకంలో నంది శివలింగాలు. ఆ పైన దూరంగా కొన్ని శాసనాలు దర్శనమిస్తాయి. తోరణ ద్వారానికి కుడి వైపు కొంచెం దూరంలో నేల లోపలికి నలభై, ఏభైమెట్లతో మెలికలు తిరిగిన నేలమాళిగ ఉంటుంది. ఆ మార్గాన్ని మూసివేయడం జరిగింది                   

 

 

మ్యూజియంలోని గజలక్ష్మి


      
 
ప్రథానాలయం :-

మ్యూజియాన్ని, వీరభద్ర మండపాన్ని దాటి వెళితే  ప్రథానాలయాన్ని చేరుకుంటాం. ఈ నడుమ ప్రమాణ మండపంలో నందీశ్వరుడు మనల్ని పలకరిస్తున్నట్లు గా కన్పిస్తున్నాడు.    ప్రథానాలయం ప్రాకార మండపాలనుండి వేరుగా నిర్మించబడింది. ముఖమండపంలో మనకు  పంచముఖేశ్వరుడు దర్శనమిస్తాడు.                                    

 

 

 వీరభద్ర మండపం

 


చంద్రుడు ఈయన అనుగ్రహాన్ని పొంది తరించినట్లు, అందువలన ఈ స్వామి సోమేశ్వరుడుగా పిలువబడబతున్నట్లు స్థలపురాణం

 

 

స్వయంభువు డైన సోమేశ్వరుడు , వెనుక ఆదిజగద్గురు రేణుకాచార్య ఆవిర్భావ దృశ్యం



చండీమాత .:- ఎడమవైపు ఉపాలయంలో మల్లిఖార్జునుడు ఆ ప్రక్కనే నాలుగుమెట్లు ఎక్కి కుడువైపుకు తిరిగితే ఉపాలయంలో చండీమాత కొలువు తీరి ఉంది.

 

శ్రీ చండీమాత



ఆ ఆలయానికి ఎడమవైపు కుందమాంబ దివ్యమంగళవిగ్రహం కన్పిస్తుంది. చండీమాత భక్తులు ముడుపులు కట్టి, కోరికలు తీరిన తరువాత మొక్కులు చెల్లించుకుంటారు. అందుకే చండీమాత ముఖమండపం పైకప్పంతా ఈ ముడుపుల మూటలతో నిండివుంటుంది

 

 

ముడుపుల మూటలు

 



చండీమాత ఆలయ ద్వారం వద్ద ఉన్న వినాయకుడు

 

 


                    
కోటిలింగేశ్వరాలయం:- ఎడమవైపు ద్వారం నుండి వెలుపలికి వస్తే నైరుతి లో కన్పిస్తుంది కోటిలింగేశ్వరాలయం. పంచకోసు నగరంగా పిలువబడే ఈక్షేత్రంలో  కోటిలింగాలను ప్రతిష్ఠించే సమయంలో వెయ్యిలింగాలు తక్కువ అవడంతో ఒకే రాయిపై  వేయిలింగాలను చెక్కి ప్రతిష్టించారట. అదే ఈ కోటిలింగేశ్వరాలయంగా ప్రసిద్ధి  కెక్కింది
                      

 

 

వెయ్యిలింగాలు

 



సూర్యగంగ :-

 

 

సూర్యగంగ

 

ప్రథానాలయ ముఖమండపము యొక్క కుడివైపు ద్వారం నుండి వెలుపలికి వస్తే కన్పించేది సూర్యగంగగా పిలువబడే అత్యంత లోతైన కోనేరు.


ఏకాదశ రుద్రులు :-

 

 

ఏకాదశ రుద్రులు

 

అటునుంచి తిరిగి పడమరకు తిరిగి నాలుగు మెట్లెక్కితే ఏకాదశరుద్రుల సాక్షాత్కారం లభిస్తుంది. ప్రక్కనే కొంచెందూరంలో ఉత్తరాభిముఖుడై  విఘ్నరాజు కొలువు తీరి ఉన్నాడు.  

ఉత్తర ద్వారం గుండా వెలుపలికి వస్తే  కాకతీయ కళాసంప్రదాయంతో నిర్మితమైన మరో శిథిలశివాలయం మన కంటపడుతుంది. సోమేశ్వర ఆలయమంతా చాళుక్య, హోయసల నిర్మాణ సంప్రదాయం  కన్పిస్తే, ఈ ఆలయం నిర్మాణంలో కాకతీయశైలి ప్రతిబింబిస్తోంది. దీనిలో శివలింగం, ముఖమండపంలో నంది మిగిలున్నాయి, ఆ ప్రక్కనే కేతేశ్వర స్వామి ఆలయం నూతన నిర్మాణంగా కన్పిస్తోంది. అలాగే కనుచూపుమేర వరకు శిథిలమైన ఒరిగిపోయిన ఆలయ సముదాయాలే ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఉపాలయాల్లో కాలభైరవుడు, వీరభద్రుడు, కుమారస్వామి  రూపాలతో పాటు, ఒక మండపంలో ఆంజనేయుడు కూడ కొలువు తీరి ఉన్నాడు.

 

 

 

శిథిలశివాలయం

 

                                           
వీరశైవ క్షేత్రాల్లో ఆంజనేయుడు కనపడటం ఆంజనేయుడు శివాంశ సంభూతుడుగా పూజించబడటమే కారణమై ఉండవచ్చు. ఇంకా ఎక్కువ సమాచారం చెప్పడానికి, మనం తెలుసుకోవడానికి అక్కడ సరైన  గైడ్ కాని, ముద్రిత సమాచారం కాని లేకపోవడం కొంచెం బాధ కల్గిస్తుంది. సుదూర ప్రాంతాలనుంచి అంటే ఇతర రాష్ట్రాలనుంచి ఇక్కడ కొచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. యాత్రికుల వసతి సముదాయం ఇటువంటి వారికోసం అందుబాటులో ఉంది.                                                                

ఆంజనేయుడు

 

 

ఆంజనేయుడు

 



 

మ్యూజియం లోని అపురూపమైన కోదండరాముని విగ్రహం

 



శ్రీ మహాలక్ష్మీ సమేత వీరనారాయణ స్వామి

 

 

శ్రీ మహాలక్ష్మీ సమేత వీరనారాయణ స్వామి :- ఈ సోమేశ్వరాలయానికి  దక్షిణంగా కొద్దిదూరంలో ఉన్నమరొక ప్రాచీన ప్రసిద్ధ ఆలయం శ్రీ వీరనారాయణస్వామి ఆలయం. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక వీరుడు శతృవులను ఓడించి తన విజయానికి కారకుడైన నారాయణుని స్మరిస్తూ నూరుమెట్ల పెద్దకొలనును తవ్వించి, దానిలో స్నానంచేసి, ఒక్కోక్క మెట్టుకు ఒక్క పద్యం చెప్పుకుంటూ పైకి వచ్చి, ఆకొలను ఒడ్డున పాకను నిర్మించుకొని తపస్సు చేసి తరించాడు. తనకు సాక్షాత్కరించిన నారాయణుని మహాలక్ష్మీ సమేతంగా అక్కడే ప్రతిష్ఠించి ముక్తిని పొందాడట. కొలను గట్టున పాక వేసుకున్న వీరుని తప: ఫలితంగా ఈ గ్రామం కొలనుపాక అయ్యిందట. ఆ వీరుడు ప్రతిష్ఠించిన నారాయణుడే ఈ వీరనారయణుడై, మహాలక్ష్మీ సమేతంగా పూజలందుకుంటున్నాడు. 


 

వీరనారాయణ స్వామి ఆలయ శిఖరం

 


చాళుక్య సంప్రదాయశైలిలో నిర్మితమైన ప్రాచీన దేవాలయం ఇది. శ్రీ వీరనారాయణ స్వామి ప్రక్కనే స్వామికి ఎడమవైపులక్ష్మీ దేవి ఒకే పీఠంపై నిలుచుని కన్పిస్తారు.  చాలా అందమైన విగ్రహాలు. అయితే పైన కథలో చెప్పినట్లు ఇక్కడ వందమెట్ల కోనేరు మాత్రం లేదు. ఆలయానికి ప్రాకారం  కూడలేని స్థితిలో వీరనారాయణుడున్నాడు. దీని వెనుకనే నూతనంగా రేణుకామాత ఆలయం, ఆ ప్రక్కనే షిర్డీ సాయి ఆలయం నిర్మించబడ్డాయి.

 

 

 

 



కొలనుపాక  హైదరాబాద్ వరంగల్లు మార్గంలో ఆలేరు నుండి బచ్చన్నపేటకు వెళ్లే దారిలో 8 కి.మీ దూరంలో ఉంది. హైదరాబాదు నుండి సుమారు 80 కి.మీ  దూరంలో ఉంది.