Read more!

శ్రీసాయిసచ్చరిత్రము తొమ్మిదవ అధ్యాయము

 

శ్రీసాయిసచ్చరిత్రము 

తొమ్మిదవ అధ్యాయము

 

 

షిరిడీ సందర్శనములోని ఒక ప్రత్యేక విశేషం ఏమిటంటే, బాబా అనుమతి లేనిదే ఎవరును షిరిడీ విడువలేక పోయేవారు. బాబా అనుమతి లేకుండా ఎవరైనా షిరిడీ విడిచి వెళితే, వారు ఊహించని కష్టాలు కొనితెచ్చుకునే వారు. బాబా ఎవరినైనా బయలుదేరమని శలవిచ్చిన తరువాత, ఇక షిరిడీలో ఉండకూడదు. శలవు తీసుకోవడానికి బాబా దగ్గరకు భక్తులు వెళ్ళినప్పుడు బాబా వారికి స్పష్టంగానో లేక సూచనప్రాయంగానో కొన్ని సలహాలు ఇస్తుండేవారు. బాబా ఆదేశానుసారము నడవ వలసిందే. వ్యతిరేకంగా వెళితే ప్రమాదాలు ఏవో ఎదురయ్యేవి. దీనికి సంబంధించి ఒక ఉదాహరణాలు కొన్ని ఇస్తున్నాను.

తాత్యాకోతే పాటల్ :

 

 

 

తాత్యాకోతే పాటిల్ ఒకరోజు కోపర్ గాంవ్ లో జరిగే సంతకు బయలుదేరాడు. హడావుడిగా మసీదుకి వచ్చి, బాబాకు నమస్కరించి కోపర్ గాంవ్ సంతకు వెళ్తున్నాను అని చెప్పాడు. బాబా అతనితో "తొందర పడవద్దు! కొంచెము ఆగు, సంత సంగతి అలా వుండనివ్వు! ఊరు విడిచి అసలు బయటికి ఎక్కడికీ వెళ్ళరాదు'' అని అన్నారు. సంతకు వెళ్ళాలనే తాత్యా ఆతృతను చూసి కనీసము శామాని (మాధవరావు దేశపాండే) అయినా వెంట తీసుకెళ్ళమని బాబా చెప్పారు. బాబా మాటలను లెక్కచేయకుండా తాత్యా హుటాహుటిన టాంగా ఎక్కి కోపర్ గాంవ్ బయలుదేరాడు. టాంగాకు కట్టిం రెండు గుఱ్ఱాలలో ఒకటి మూడు వందల రూపాయల ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది. చాలా చురుకైనది. షిరిడీ వదిలి సావుల్ విహిర్ దాటిన వెంటనే అది అమిత వేగంగా పరుగెత్తసాగింది. కొంతదూరము వెళ్ళిన తరువాత కాలు మడతపడి అది కూలబడింది. తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగలలేదు కానీ, తల్లిలా ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞాపకానికి వచ్చింది. మరొకప్పుడు కూడా, ఇలాగే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కొల్హారు గ్రామానికి ప్రయాణమై, దారిలో టాంగా ప్రమాదానికి గురయ్యాడు.

ఐరోపాదేశస్థుని ఉదంతము :

 

 

 

బొంబాయి నుండి ఐరోపాదేశస్థుడొకడు ఏదో ఉద్దేశ్యంతో బాబా దర్శనార్థము షిరిడీ వచ్చాడు. తనతో నానాసాహెబు చాందోర్కరు దగ్గరనుంచి తనను గురించి ఒక పరిచయ పత్రాన్ని కూడా తెచ్చాడు. అతనికోసం ఒక ప్రత్యేక గుడారము వేసి, అందులో సౌకర్యంగా బస ఏర్పాటు చేశారు. బాబా ముందు మోకరిల్లి, వారి చేతిని ముద్దాడాలనే కోరికతో అతను మూడుసార్లు మసీదులో ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కాని బాబా అతన్ని మసీదులో ప్రవేశించడాన్ని నిషేదించారు. కింద మసీదు ముందు ఉన్న బహిరంగ ఆవరణలో కూర్చునే తనను దర్శించుకోవచ్చని చెప్పారు. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతృప్తి చెంది వెంటనే షిరిడీ వదిలి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. బాబా సెలవు పొందడానికి వచ్చాడు. తొందరపడక మరునాడు వెళ్ళమని బాబా చెప్పారు. ఆ సలహాలను ఖాతరు చేయకుండా అతను టాంగా ఎక్కి షిరిడీ నుండి బయలుదేరాడు. మొదట గుఱ్ఱాలు బాగానే పరిగెత్తాయి. సావుల్ విహిర్ దాటినా కొద్దిసేపటికి ఒక సైకిలు అతని టాంగాకి ఎదురువచ్చింది. దాన్ని చూచి గుఱ్ఱాలు బెదిరాయి. టాంగా తలక్రిందలయ్యింది. ఫలితంగా గాయాలను బాగు చేసుకోవడానికి కోపర్ గాంవ్ లో ఆసుపత్రి పాలయ్యాడు. ఇటుంటి అనేక సంఘటనల మూలంగా బాబా ఆజ్ఞను దిక్కరించినవారు ప్రమాదాలకు గురవుతారని, బాబా ఆజ్ఞానుసారము వెళ్ళేవారు సురక్షితంగా ఉంటారని ప్రజలు గ్రహించారు.

భిక్షయొక్క ఆవశ్యకత :

 

 

 

బాబాయే భగవంతుడయితే వారు భిక్షాటనతో ఎందుకు జీవితమంతా గడపాలి? అనే సందేహము చాలామందికి కలుగవచ్చును. దీనికి (1) భిక్షాటన చేసి జీవించే హక్కు ఎవరికుంటుంది? (2) పంచసూనములు వాటిని పోగొట్టుకొనే మార్గమేది? అనే రెండు ప్రశ్నలకు వచ్చే సమాధానంతో సమాధానపడుతుంది.సంతానము, ధనము, కీర్తి సంపాదించటంలో ఆపేక్ష వదులుకొని సన్యసించేవారు భిక్షాటనతో జీవించవచ్చని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. వారు ఇంటివద్ద వంట ప్రయత్నాలు చేసుకొని తినలేరు. వారికీ భోజనము పెట్టే బాధ్యత గృహస్థులపై ఉంది. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కూడా కారు, వారస్ఖలిత బ్రహ్మచారులు. బాల్యమునుంచి బ్రహ్మచర్యమునే అవలంభిస్తూ ఉన్నారు. ఈ సకల జగత్తంతా వారి గృహమే. ఈ జగత్తుకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మస్వరూపులు. కాబట్టి వారికి భిక్షాటన చేసే హక్కు సంపూర్ణంగా ఉంది.

 

 

పంచసూనములు, వాటిని తప్పించుకునే మార్గము గురించి ఆలోచిద్దాం. భోజనపదార్థాలు తయారు చేసుకోవడానికి గృహస్థులకు అయిదు పనులు తప్పకుండా చేయాలి. అవి ఏమిటంటే (1) దంచడం, రుబ్బటం (2) విసురుట (3) పాత్రలు తోమడం (4) ఇల్లు ఊడవడం, తుడవడం (5) పొయ్యి అంటించటం. ఈ అయిదు పనులు చేసేటప్పుడు అనేక క్రిమికీటకాదులు మరణించటం తప్పదు. గృహస్థులు ఈ పాపాన్ని అనుభవించాలి. ఈ పాపపరిహారానికి మన శాస్త్రాలు ఆరు మార్గాలు ప్రబోధిస్తున్నాయి. (1) బ్రహ్మయజ్ఞము (2) వేదాధ్యయనం (3) పితృయజ్ఞము (4) దేవయజ్ఞము (5) భూతయజ్ఞము (6) అతిథి యజ్ఞము. శాస్త్రాలు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తిస్తే గృహస్థుల మనస్సులు పాపరహితములు అవుతాయి. మోక్షసాధనానికి ఆత్మసాక్షాత్కారానికి యివి తోడ్పడతాయి. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడగటంలో, ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞాపకానికి తెచ్చినట్లు అయింది. తమ ఇంటి గుమ్మము దగ్గరే యింత గొప్ప ప్రబోధాన్ని పొందిన షిరిడీ ప్రజలు ఎంతటి ధన్యులు!

భక్తుల అనుభవాలు :

 

 

 

శ్రీకృష్ణుడు భగవద్గీత (9 అంకము 26 శ్లోకము)లో "శ్రద్ధాభక్తులతో ఎవ్వరైనా పత్రముగాని, పుష్పముగాని, ఫలముగాని లేదా నీరుగాని అర్పిస్తే దానిని నేను గ్రహిస్తాను'' అని చెప్పారు. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమైన విషయమి ఏమిటంటే, తమ భక్తుడు ఏదైనా తనకు సర్పించాలని అనుకొని, ఏ కారణము చేతనైనా ఆ సంగతి మరిచిపోతే, అలాంటివాడికి బాబా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించేవారు. అలాంటి ఉదాహరణాలు కొన్ని ఈ క్రింద చెప్పబోతున్నాను.

తర్ఖడ్ కుటుంబము :

 

 

 

రామచంద్ర ఆత్మారామ్ వురఫ్ బాబా సాహెబు తర్ఖడ్ ఒకానొకప్పుడు ప్రార్థనసమాజస్థుడు అయినా, తరువాత బాబా ప్రియభక్తుడు అయ్యాడు. వారి భార్యాపుత్రులు కూడా బాబాను అమితంగా ప్రేమిస్తూ ఉండేవారు. ఒకసారి తల్లీ, కొడుకులు షిరిడీకి వెళ్ళి అక్కడ వేసవి సెలవులు గడపాలని నిర్ణయించుకున్నారు. షిరిడీ వెళ్ళడానికి సంతోషదాయకమైనా, కొడుకు మాత్రం దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణము ఏమిటని తన తండ్రి ప్రార్థన సమాజానికి చెందినవాడు అవటంతో ఇంటివద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించాడు. కాని, బాబా పూజను తాను నియమానుసారము సక్రమంగా చేస్తానని తండ్రి వాగ్థానం చేయటంతో బయలుదేరాడు. శుక్రవారము రాత్రి తల్లీ, కొడుకు బయలుదేరి షిరిడీ చేరుకున్నారు.

 

 

ఆ మరునాడు శనివారం రోజు తండ్రి అయిన తర్ఖడ్ పెందలాడక ముందే నిద్రలేచి, స్నానముచేసి, పూజను ప్రారంభించటానికి ముందు బాబా పటానికి సాష్టాంగ నమస్కారము చేసి, ఏదో లాంచనంలా కాక, తన కుమారుడు చేసేలాగా పూజని శ్రద్ధగా తనతో చేయించ వలసిందని ప్రార్థించాడు. ఆనాటి పూజను సమాప్తము చేసి నైవేద్యంగా కలకండను అర్పించాడు. భోజన సమయంలో దాన్ని పంచిపెట్టాడు. ఆరోజు సాయంత్రము, ఆ మరుసటిదినం అంటే ఆదివారము రోజు, పూజ అంతా సవ్యంగా జరిగింది. సోమవారము కూడా చక్కగా గడిచింది. వాగ్థానం చేసినట్లు సరిగ్గా జరుగుతున్నందుకు సంతోషించాడు. మంగళవారము రోజు పూజను ఎప్పటిలా చేసి కచేరికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నము ఇంటికి వచ్చి భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకపోవటం గ్రహించాడు. నౌకరుని అడిగితే ఆనాడు నైవేద్యము ఇవ్వడం మరచిపోవటంతో ప్రసాదము లేదని బదులు చెప్పాడు. ఆ సంగతి వినగానే భోజనానికి కూర్చున్న ఆత్మారామ్ వెంటనే లేచి, బాబా పటానికి సాష్టాంగ నమస్కారం చేసి, బాబాను క్షమాపణ కోరాడు. బాబా తనకు ఆ విషయము జ్ఞాపకానికి తీసుకురానందుకు నిందించాడు. ఈ సంగతులన్నీ షిరిడీలో ఉన్న తన కొడుకుకి వ్రాసి, బాబాను క్షమాపణ వేడుకోమన్నాడు. ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు జరిగింది.

 

 

అదే సమయంలో షిరిడీలో, మధ్యాహ్నహారతి ప్రారంభించటానికి ముందు, ఆత్మారాముని భార్యతో ఇలా అన్నారు : "తల్లీ! ఏమయినా తినాలనే ఉద్దేశ్యంతో బాంద్రాలో మీ ఇంటికి వెళ్లాను. తలుపుకి తాళము వేసి ఉంది. ఎలాగోలా లోపలికి ప్రవేశించాను. కాని అక్కడ తినడానికి ఏమీ లేకపోవటంతో తిరిగి వచ్చాను'' అన్నారు. బాబా మాటలు ఆమెకేమీ బోధపడలేదు. కాని ప్రక్కనే వున్న కుమారుడు మాత్రము ఇంటివద్ద పూజలో ఏదో లోటుపాట్లు జరిగాయని గ్రహించి, యింటికి వెళ్ళడానికి సెలవు యివ్వమని బాబాను వేడుకున్నాడు. అందుకు బాబా పూజను అక్కడే చేయమనీ, యింటికి వెళ్ళవలసిన అవసరం లేదని చెప్పారు. వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయాన్నంతా వివరంగా తండ్రికి ఉత్తరం వ్రాసి, బాబాపూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకున్నాడు. ఈ రెండు ఉత్తరాలు ఒకదానికొకటి మార్గమధ్యంలో తటస్థపడి తమ తమ గమ్యస్థానాలకు చేరుకున్నాయి. ఇది ఆశ్చర్యము కదా!

ఆత్మారాముని భార్య :

 

 

 

ఇక ఆత్మారాముని భార్య విషయం. ఒకసారి ఆమె మూడు పదార్థాలను బాబాకు నైవేద్యము పెడతానని సంకల్పించుకుంది. అవి : (1) వంకాయ పెరుగుపచ్చడి (2) వంకాయ వేపుడు కూర (3) పేడా. బాబా వీటిని ఎలా గ్రహించారో చూద్దాము.
బాంద్రా నివాసి అయిన రఘువీర భాస్కర పురందరే బాబాకు అత్యంత భక్తురాలు. అతను ఒకసారి భార్యతో షిరిడీకి బయలుదేరుతున్నాడు. ఆత్మారాముని భార్య పెద్దవంకాయలు రెండింటిని అత్యంత ప్రేమతో తెచ్చి పురందరుని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగుపచ్చడి, రెండవదానితో వేపుడు చేసి బాబాకు వడ్డించమని వేడుకుంది. షిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగుపచ్చడి మాత్రమే చేసి బాబా భోజనానికి కూర్చున్నప్పుడు తీసుకొని వెళ్ళింది. బాబాకి ఆ పచ్చడి చాలా రుచిగా వుంది. కాబట్టి దాన్ని అందరికీ పంచిపెట్టారు. వెంటనే, తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని బాబా అడిగారు. ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయికి తెలియపరిచారు. అది వంకాయల కాలము కాదు కనుక ఆమెకి ఏమి తోచలేకుండా అయింది. వంకాయలు సంపాదించడం అనేది ఆమెకు సమస్య అయ్యింది. వంకాయపచ్చడి తెచ్చినది ఎవరని కనుగొంటే పురందరుని భార్య అని తెలియటంతో వంకాయ వేపుడు కూడా ఆమె చేసి పెట్టాలని ఆమెకు కబురు పంపారు. అప్పుదందరికీ వంకాయ వేపుడుని బాబా ఎందుకు కోరారో తెలిసింది. బాబా సర్వజ్ఞతకు ఆనందాశ్చర్య పడ్డారు.

 

 

1915 డిసెంబరులో గోవింద బలరాంమాన్ కర్ అనేవాడు షిరిడీకి వెళ్ళి తన తండ్రికి ఉత్తరక్రియలు చేయాలని అనుకున్నాడు. ప్రయాణానికి పూర్వము ఆత్మారాముని దగ్గరకు వచ్చాడు. ఆత్మారాం భార్య బాబా కొరకు ఏమైనా పంపాలనుకొని ఇల్లంతా వెదికింది. కాని ఒక్క పేడా తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పేడా కూడా అప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పించబడి ఉంది. తండ్రి మరణించటంతో గోవిందుడు విచారగ్రస్తుడై ఉన్నాడు. కాని బాబా అంటే ఉన్న భక్తీ ప్రేమలతో ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపించింది. బాబా దాన్ని పుచ్చుకొని తింటారని నమకం వుంది. గోవిందుడు షిరిడీ చేరాడు; బాబాను దర్శించుకున్నాడు. కానీ, పేడా తీసికొని వెళ్లటం మరచిపోయాడు. బాబా అప్పటికి ఊరుకున్నారు. సాయంత్రము బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా అతను పేడా తీసుకొని వెళ్లటం మరిచిపోయాడు. అప్పుడు బాబా ఓపిక పట్టకుండా తనకోసం ఏమి తెచ్చావు అని అడిగారు. ఏమీ తీసుకొని రాలేదని గోవిందుడు జవాబిచ్చాడు. వెంటనే బాబా "నీవు ఇంటివద్ద బయలుదేరుతున్నప్పుడు ఆత్మారాముని భార్య నాకోసం నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా?'' అని అడిగారు. కుర్రవాడు అదంతా జ్ఞాపకానికి తెచ్చుకొని సిగ్గుపడ్డాడు. బాబాను క్షమాపణ కోరాడు. బసకు పరుగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చాడు. చేతిలో పడిన వెంటనే బాబా దాన్ని గుటుక్కున మ్రింగేశారు. ఈ విధంగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకంగా స్వీకరించారు. "నా భక్తులు నన్నెలా భావిస్తారో, నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను'' అనే గీతావాక్యము (4-11) నిరూపించారు.

బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టటం ఎలా?

 

 

 

ఒకప్పుడు ఆత్మారామ్ తర్ఖడ్ భార్య షిరిడీలో ఒక ఇంటిముందు దిగింది. మధ్యాహ్న భోజనము తయారయ్యింది. అందరికీ వడ్డించారు. ఆకలితో ఉన్న ఒక కుక్క ఒకటి వచ్చి మొరగటం ప్రారంభించింది. వెంటనే తర్ఖడ్ భార్య లేచి ఒక రొట్టెముక్కను విసిరింది. ఆ కుక్క ఏంటో మక్కువగా ఆ రొట్టెముక్కను తినేసింది. ఆనాడు సాయంకాలము ఆమె మసీదుకు వెళ్ళగా బాబా ఆమెతో ఇలా అన్నారు "తల్లీ! నాకు కడుపునిండా గొంతువరకు భోజనము పెట్టావు. నా జీవశక్తులు సంతృప్తి చెందాయి. ఎల్లప్పుడూ ఇలాగే చెయ్యి. ఇది నీకు సద్గతి కలుగజేస్తుంది. ఈ మసీదులో కూర్చుని నేను ఎప్పుడూ అసత్యము చెప్పను. నాయందు ఇలాగే దయ ఉంచుము. మొదటి ఆకలితోనున్న జీవికి భోజనము పెట్టిన తరువాత నీవు భుజించు. దీనిని జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకో.'' ఇదంతా ఆమెకు బోధపడలేదు. కాబట్టి ఆమె యిలా జవాబిచ్చింది. "బాబా! నేను నీకెలా భోజనము పెట్టగలను? నా భోజనము కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బులిచ్చి భోజనము చేస్తున్నాను''

 

 

అందుకు బాబా ఇలా జవాబిచ్చారు "నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఆ రొట్టేముక్కను తిని ఇప్పటికీ త్రేస్పులు తీస్తున్నాను. నీ భోజనానికి ముందే ఆ కుక్కను నీవు చూసి రొట్టె పెట్టావో అదీ నేను ఒక్కటే. అలాగే, పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలైనవన్నీ నా అంశాలే. నేనే వాటి ఆకారములో తిరుగుతున్నాను. కాబట్టి నేను వేరు తక్కున జీవరాశి అంతా వేరు అనే ద్వంద్వభావమనే భేదము విడిచి నన్ను సేవించు'' ఈ అమృత తుల్యమైన మాటలు ఆమె హృదయాన్ని ఎంతగానో కదిలించాయి. ఆమె నేత్రాలు అశ్రువులతో నిండాయి. గొంతు గద్గదమయ్యింది. ఆమె ఆనందానికి అంతులేకుండా పోయింది.

నీతి :

 

 

 

"జీవులన్నిటిలో భగవంతుని దర్శింపుము'' అనేది ఈ అధ్యాయములో నేర్చుకోవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలైనవన్నీ భగవంతుని ప్రతిజీవిలో చూడమని ప్రభోదిస్తున్నాయి. ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణ వల్ల, ఇతర అనేక భక్తుల అనుభవముల వలన, సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోదాలను, తమ ఆచరణ రూపంలో చూపి, అనుభవపూర్వకంగా నిర్థారణ చేసి ఉన్నారని స్పష్టమవుతుంది. ఉపనిషది గ్రంథాలలో ప్రతిపాదింపబడిన తత్వాన్ని అనుభవపూర్వకంగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీసాయిబాబా.

తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము