Read more!

శ్రీసాయిసచ్చరిత్రము పదవ అధ్యాయము

 

శ్రీసాయిసచ్చరిత్రము


పదవ అధ్యాయము

 

 

ఎల్లప్పుడు శ్రీసాయిబాబాను భక్తిప్రేమలతో జ్ఞాపకముంచుకొను. ఎలాగంటే బాబా ఎల్లప్పుడు తమ ఆత్మస్వరూపములోనే లీనమై, అందరికీ హితము చేయడానికే నిమగ్నమై ఉండేవారు. వారి స్మరణమే జీవన్మరణ రూపమైన సంసారమనే చిక్కుముడిని విప్పే తరుణోపాయము. ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టమైన, సులభతరమైన సాధనము. దీనిలో వ్యయప్రయాసలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితాన్ని పొందవచ్చు. అందుకే ఇక ఆలస్యము చేయకుండా, మన దేహ ఇంద్రియాలలో పటుత్వము ఉన్నంత వరకు ప్రతి నిమిషాన్ని ఈ సాధనము చేయడానికి వెచ్చించాలి. ఇతర దేవతలంతా ఉత్త భ్రమ. గురువొకడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొలిస్తే వారు మన అదృష్టమును బాగుచేయగలరు. వారిని శ్రద్ధగా సేవిస్తే సంసారబంధములనుండి తప్పించుకోవ్గలము. న్యాయమీమాంసవంటి షడ్దర్శనాలను చదివే పనిలేదు. మన జీవితమనే ఓడకు సద్గురువు సరంగుగా చేసుకుంటే, కష్టాలు, చింతలతో కూడుకున్న సంసారమనే సాగరాన్ని మనము సులభంగా దాటగలము. సముద్రాలు, నదులు దాటుతున్నప్పుడు మనము ఓడ నడిపేవాడిలో నమ్మకము ఉంచినట్లే, సంసారమనే సాగరాన్ని దాటడానికి సద్గురువనే సరంగుపై పూర్తి నమ్మకాన్ని ఉంచుకోవాలి. భక్తులయొక్క అంతరంగంలో ఉన్న భక్తిప్రేమలను బట్టి, సద్గురువు వారికి జ్ఞానాన్ని, శాశ్వత ఆనందాన్ని ప్రసాదిస్తారు. పోయిన అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటన, కొందరు భక్తుల అనుభవాలు మొదలైనవి చెప్పాను. ఈ అధ్యాయములో బాబా ఎక్కడ నివశించారు? ఎలా జీవించారు? ఎలా శయనించేవారు? బక్తులకు ఎలా భోదిస్తూ ఉండేవారు? మొదలైనవి చెబుతాను.

బాబావారి శయనలీల :

 

 

 

మొట్టమొదట బాబా ఎక్కడ పడుకునేవారో, ఎలా పడుకునోవారు చూద్దాము. ఒకసారి నానాసాహెబు డేంగలే, సుమారు నాలుగుమూరల పొడవు, ఒక జానెడు మాత్రమే వెడల్పు ఉన్న ఒక కర్రబల్లను బాబా పడకకని తెచ్చారు. ఆ బల్లను నేలపై వేసుకొని పడుకోవాడానికి కాకుండా, బాబా దానిని మసీదు దూలానికి ఊయలలా వ్రేలాడేలా చినిగిన పాతగుడ్డ పీలికలతో కట్టి, దానిపై పడుకోవడం మొదలుపెట్టారు. గుడ్డ పీలికలు పలుచగా ఉండేవి, ఏమాత్రం బలమైనవి కాదు. అవి ఆ కోయ్యబల్ల యొక్క బరువును మోయటమే గగనము. ఇంక బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎలా భరిస్తున్నాయో అనేది ఆశ్చర్య వినోదాలకు హేతువయింది. ఆ పాతగుడ్డ పీలికలు అంత బరువును మోయగలగడం, నిజంగా బాబా లీలే. బాబా ఆ బల్ల యొక్క నాలుగు మూలలలో నాలుగు దీపపు ప్రమిదలుంచి రాత్రి అంతా దీపాలు వెలిగిస్తూ ఉండేవారు. ఇది ఏమి చిత్రము! బల్లపై ఆజానుబాహువైన బాబా పడుకోవడానికే చోటు చాలనప్పుడు దీపాలు పెట్టడ్డానికి చోటు ఎక్కడిది? బాబా బల్లపైన పడుకొంటే ఆ దృశ్యాన్ని దేవతలు సహితం చూసి తీరవలసిందే! ఆ బల్లపైకి బాబా ఎలా ఎక్కేవారు? ఎలా దిగేవారు? అనేది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ ఉండేది. అనేకమంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కటం, దిగటం గమనించాలని కనిపెట్టుకుని ఉండేవారు. కాని బాబా ఎవరికీ ఆ వైనాన్ని అంటూ తెలియనివ్వలేదు. ఆ వింత చూడడానికి జనాలు గుంపులు గుంపులుగా గుమిగూడడంతో బాబా విసుగుచెంది ఒకరోజు ఆ బల్లను విరిచి పారేశారు. అష్టసిద్ధులు బాబా ఆధీనాలు. బాబా వాటిని ఉపెక్షించలేదు, వాటి కోసమే అభ్యాసము చేయలేదు. వారు పరిపూర్ణులు గనుక సహజంగానే అవి వారికి సిద్ధించాయి.

బ్రహ్మము యొక్క సగుణావతారము :

 

 

 

సాయిబాబా మూడున్నర మూరల మానవదేహంతో కనిపించినా వారు సర్వహృదయంతరస్థులు. అంతరంగంలో వారు పరమ నిరీహులు, నిస్పృహులు అయినప్పటికీ, బాహ్యమునకు లోకహితము కోరేవారిగా కనిపించేవారు. అంతరంగంలో వారు మమకార రహితులైనప్పటికీ, బాహ్యద్రుష్టికి మాత్రం తమ భక్తుల యోగక్షేమాల కోసం ఎంతగానో తాపత్రయపడుతున్న వారిలా కనిపించేవారు. వారి అంతరంగం శాంతికి ఉనికి పట్టయినా, బయటకు చంచల మనస్కునిలా కనిపిస్తుండేవారు. లోపల పరబ్రహ్మస్థితిలో ఉన్నప్పటికీ, బయటకు దయ్యంలా నటిస్తూ ఉండేవారు. లోపల అద్వైతి అయినా బయటకు ప్రపంచములో ఉన్నట్లు కనిపిస్తూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూసేవారు. ఇంకోక్కప్పుడు వారిపై రాళ్ళు విసురుతుండేవారు. ఒకొక్కప్పుడు వారిని తిడుతూ ఉండేవారు. ఇకోక్కప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకొని, ఎంతో నెమ్మదిగా, శాంతముగా, ఓపికగా సంయమనంతో వ్యవహరిస్తుండేవారు.

 

 

బాబా ఎప్పుడూ ఆత్మానుసంధానములోనే మునిగి ఉండేవారు. భక్తులపై కారుణ్యాన్ని చూపిస్తుండేవారు. వారు ఎప్పుడూ ఒకే ఆసనంలో స్థిరంగా ఉండేవారు. వారెక్కడికీ ప్రయాణాలు చేసేవారు కాదు. చిన్న చేతికర్ర (సటకా)యే వారు సదా ధరించే దండము. చింతారహితులై ఎల్లప్పుడూ శాంతంగా ఉండేవారు. సిరిసంపదలను గానీ, కీర్తిప్రతిష్టలుగానీ లక్ష్యపెట్టకుండా, భిక్షాటనతో నిరాడంబరంగా జీవించేవారు. అలాంటి పావన జీవనులు వారు. ఎల్లప్పుడూ బాబా 'అల్లామాలిక్'(భగవంతుడే యజమాని) అని అంటుండేవారు. భక్తులలో అవిచ్చమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు. ఆత్మజ్ఞానానికి ఆయన గని, దివ్యానందానికి వారు ఉనికిపట్టు. సాయిబాబా యొక్క దివ్యస్వరూపం అలాంటిది. ఆద్యంతాలు లేనటువంటిది. అక్షయము వంటిది, భేదరహితమైనటువంటిది, విశ్వమంతా ఆవరించినటువంటిది. ఆ పరబ్రహ్మ తత్త్వమే సాయిబాబాగా అవతరించినది. ఎంతో పుణ్యము చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగారు. గ్రహించగలుగుతుండే వారు. సాయిబాబా యొక్క నిజతత్త్వాన్ని గ్రహించలేక, వారిని ఒక సామాన్య మానవునిగా అనుకున్నవారు నిజంగా దురదృష్టవంతులు.

షిరిడీలో బాబా నివాసము - వారి జన్మతేదీ :

 

 

 

బాబా యొక్క తల్లిదండ్రుల గురించి గాని, వారి సరైన జన్మతేదీనిగాని ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో వున్న కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయించవచ్చు. బాబా 16 సంవత్సరాల ప్రాయంలో షిరిడీ వచ్చి మూడు సంవత్సరాలు అక్కడ ఉన్నారు. హఠాత్తుగా అక్కడినుండి అదృశ్యమై, కొంతకాలం తరువాత నైజాము రాజ్యములోని ఔరంగాబాదు సమీపంలో కనిపించారు. 20 సంవత్సరాల ప్రాయంలో చాంద్ పాటీలు పెళ్ళిగుంపుతో షిరిడీ చేరుకున్నారు. అప్పటినుండి 60 సంవసరాలు షిరిడీ వదలకుండా అక్కడే ఉండి, 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందారు దీనిని బట్టి బాబా సుమారు 1838వ సంవత్సర ప్రాతంలో జన్మించి ఉంటారని భావించవచ్చు.

బాబా లక్ష్యము వారి బోధలు :

 

 

 

17వ శతాబ్దములో రామదాస అనే యోగిపుంగవుడు (1608-81) వర్థిల్లాడు. గోబ్రాహ్మణులను, మహమ్మదీయులనుండి రక్షించే లక్ష్యాన్ని వారు చక్కగా నిర్వర్తించారు. వారు గతించిన 200ఏళ్ళ తరువాత హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరం ప్రబలింది. వారి మధ్య సమైక్యభావాన్ని నెలకొల్పటానికే సాయిబాబా అవతరించారు. ఎల్లప్పుడూ వారు చెప్పే హితవు :"హిందువుల దైవమైన శ్రీరాముడు, మహామ్మదీయుల దైవమైన రహీము ఒక్కరే. వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు. అలాంటప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహామాడటం ఎందుకు? ఓ అజ్ఞానురాలా! చేతులు చేతులు కలిపి రెండు జాతులను కలిసి మెలిసి వుండండి. బుద్ధితో ప్రవర్తించండి. జాతీయ ఐకమత్యాన్ని సమకూర్చండి. వివాదము వల్లగానీ, ఘర్షణవల్లగానీ ప్రయోజనము లేదు. అందుకే వివాదాన్ని విడవండి. ఇతరులతో పోటీ పడకండి. మీ యొక్క వృద్ధిని మేలును చూసుకోండి. భగవంతుడు మిమ్మల్మి రక్షిస్తాడు. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము, మోక్షానికి మార్గాలు. వీటిలో ఏదైనా అవలంచించి మోక్షాన్ని సంపాదించకపోతే మీ జీవితమూ వ్యర్థము. ఎవరైనా మీకు కీడు చేస్తే, ప్రత్యపకారము చేయకండి. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగితే ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయండి'' సంగ్రహంగా ఇదే బాబా యొక్క ప్రబోభము. ఇది ఇహపరసాధనము.

సాయిబాబా సద్గురువు :

 

 

 

గురువులమని చెప్పుకొని తిరిగేవారు అనేకమంది ఉన్నారు. వారు ఇంటింటికి తిరుగుతూ వీణ, చిరతలు చేతబట్టుకుని ఆధ్యాత్మిక ఆడంబరాన్ని చాటుతారు. శిష్యుల చెవులలో మంత్రాలు ఊది వారినుండి ధనాన్ని లాగుతారు. పవిత్రమార్గాన మతాన్ని భోధిస్తామని చెబుతారు. కాని మతమంటే వారికే తెలియదు. స్వయంగా వారు అపవిత్రులు. సాయిబాబా తన గొప్పతనం ఎప్పుడూ ప్రదర్శించాలని అనుకోలేదు. వారికి దేహాభిమానము ఏమాత్రం ఉండేది కాదు. కాని భక్తులలో అమితమైన ప్రేమ ఉండేది. నియత గురువులని, అనియత గురువులని గురువులు రెండు విధాలు. నియత గురువులంటే సమయానుకూలంగా నియమింపబడతారు. అనియత గురువులంటే సమయానుకూలంగా వచ్చి ఏదైనా సలహా యిచ్చి మన అంతరంగంలో ఉన్న సుగుణాన్ని వృద్ధిచేసి మోక్షమార్గంలో నడిచేలా చేసేవారు. నియత గురువుల సహవాసం 'నీవు నేను' అనే ద్వంద్వభావాన్ని పోగొట్టి, అంతరంగాన్ని యోగంలో ప్రతిష్టించి "తత్వమసి'' అయ్యేటట్లు చేస్తుంది. సర్వవిధముల ప్రపంచజ్ఞానాన్ని భోదించే గురువులు అనేకమంది ఉంటారు. కాని మనని ఎవరయితే సహజస్థితిలో నిలిచేలా చేసి మనల్ని ప్రపంచపు ఉనికికి అతీతంగా తీసికొని వెళతారో వారే సద్గురువులు. సాయిబాబా అలాంటి సద్గురువులు. వారి మహిమ వర్ణనాతీతం. ఎవరైనా వారిని దర్శిస్తే బాబా వారి యొక్క భూత భవిష్యత్, వర్తమానాలన్నిటినీ చెప్పేవారు. ప్రతి జీవిలో బాబా దైవత్వాన్ని చూసేవారు.

 

 

స్నేహితులు, విరోధులు వారికీ సామానమే. నిరభిమానము సమత్వము వారిలో మూర్తీభవించినవి. వారు దుర్మార్గుల అవసరాలను కూడా తీర్చేవారు. కలిమిలేములు వారికీ సమానము. మానవ దేహముతో సంచరించినప్పటికీ వారికి గృహ దేహముల పట్ల అభిమానమ్ము ఉండేదికాదు. శరీరదారులవలె కనిపించినా వారు నిజంగా నిశ్శరీరులు, జీవన్ముక్తులు.బాబాను భగవంతునిలా పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తింటున్నా, త్రాగుతున్నా తమ దొడ్లలోనో పోలాలలోనో పని చేసికుంటున్నా, వారు ఎల్లప్పుడూ సాయిని జ్ఞాపకం ఉంచుకుని సాయి మహిమను కీర్తిస్తూ ఉండేవారు. సాయి తప్ప యింకొక దైవాన్ని వారు ఎరిగి ఉండలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యాన్ని వర్ణించటానికి మాటలు చాలవు. వారు పామరులయినప్పటికీ వారికున్న స్వల్ప భాషాజ్ఞానంతోనే ప్రమతో బాబాపై పాటలను కూర్చుకుని పాడుకుంటూ ఉండేవారు. వారికి అక్షరజ్ఞానము శూన్యమయినప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వాన్ని చూడవచ్చును. యదార్థమైన కవిత్వాన్ని పాండిత్యం వల్ల రాదు. అది అసలైన ప్రమవలన వెలువడుతుంది. కవితం స్వచ్చమైన ప్రమభావమునుండి వెలువడుతుంది. అటువంటి సిసలైన కవిత్వాన్ని విభుదులైన శ్రోతలు ఆస్వాదించగలరు. ఈ పల్లె పదాలన్నీ సేకరింపదగినవి. సాయి అనుగ్రహముంటే ఎ భక్తుదయినా వీటిని శ్రీసయిలీల పత్రికలోనో లేదా పుస్తకరూపంలోనో ప్రకటించిన ఎంతో బాగుంటుంది.

బాబావారి అణుకువ :

 

 

 

భగవంతునికి ఆరు లక్షణాలు ఉంటాయి. (1) కీర్తి, (2) ధనము, (3) అభిమానాలు లేకుండుట, (4) జ్ఞానము, (5) మహిమ, (6) ఔదార్యము. ఈ గుణాలన్నీ బాబాలో ఉన్నాయి. భక్తుల కొరకు మానవరూపంలో అవతరించిన భగవతత్త్వమే సాయిబాబా. వారి కరుణ, అనుగ్రహము అద్భుతాలు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకోకపోతే, వారి మహత్యాన్ని తెలుసుకోగల శక్తి ఎవరికీ వుంది. భక్తుల కోసం బాబా నోట వెలువడిన పలుకులు పలకటానికి సరస్వతీదేవి కూడా వెరగు చెందుతుంది. ఒక ఉదాహరణ ... బాబా అత్యంత అణుకువతో యిలా అనేవారు "బానిసలకు బానిస అయిన నేను మీకు ఋణగ్రస్తుడను. మీ దర్శనంతో నేను తృప్తి చెందాను. మీ పాదములు దర్శించడం నా భాగ్యం. మీ యశుద్ధములో నేనొక పురుగును. అలా అవడం వలన నేను ధన్యుడను'' ఏమి వారి అణుకువ! బాబా యొక్క ఈ వాక్యాలు ప్రచురించటం ద్వారా బాబాను కించపరిచానని ఎవరైనా అంటే ఈ నా అపరాధాన్ని బాబాను క్షమాపణ కోరుకుంటాను; అటువంటి పాప పరిహార్థమై బాబా నామజపము చేస్తాను.

 

 

బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములను అనుభవించేవానిలా కనిపించినా, ఇంద్రియ అనుభవాలలో వారికి ఏమాత్రం అభిరుచి ఉండేది కాదు. అసలు ఇంద్రియ అనుభవాల స్పృహే వారికి ఉండేదికాదు. వారు భుజిస్తున్నప్పటికీ ఎందులోనూ వారికి రుచి ఉండేదికాదు. వారు ప్రపంచాన్ని చూస్తున్నట్టు కనిపించినా వారికి దానిలో ఏమాత్రము ఆసక్తి ఉండేదికాదు. కామమంటే వారు హనుమంతునిలా అస్ఖలిత బ్రహ్మచారులు. వారికి దేనిలోనూ మమకారము ఉండేది కాదు. వారు శుద్ధ చైతన్య పురుషులు. కోరికలు, కోపము మొదలైన భావి వికారాలు శాంతించి, స్వాస్థ్యము చెందే విశ్రాంతి ధామము. వేయేళ్ళ వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. దీన్ని వివరించటానికి ఒక ఉదాహరణ.

నానావలి :

 

నానావలి సమాధి

 

 

షిరిడీలో విచిత్ర పురుషుడు ఒకడు ఉండేవాడు. అతని పేరు నానావలి. అతను బాబా విషయాలను, పనులను చక్కపెడుతూ ఉండేవాడు. ఒకరోజు అతను బాబా దగ్గరికి వెళ్ళి, బాబాను వారి గద్దె (ఆసనం)నుండి లేవాలని, దానిపై తాను కూర్చోవాలని తనకు బుద్ధి పుట్టిందని అన్నాడు. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేశారు. నానావలి దానిపై కొంత సమయం కూర్చుని లేచి, బాబాను తిరిగి కూర్చోమన్నాడు. బాబా తన గద్దెపై కూర్చున్నారు. నానావలి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారము చేసి వెళ్ళిపోయాడు. తన గద్దె మీదనుండి దిగిపొమన్నా, దానిపై యింకొకరు కూర్చున్నా, బాబా ఎలాంటి అసంతృప్తి వెలిబుచ్చ లేదు. బాబాని, నానావలి ఎంతగా ప్రేమించేవాడంటే అతను బాబా మహాసమాధి చెందిన పదమూడవరోజు దేహత్యాగం చేశాడు.

మహాత్ముల కథాశ్రవణము, వారి సాంగత్యమే అతి సులభ మార్గము  :

 

 

 

సాయిబాబా సామాన్య మానవునిలా నటించినప్పటికీ, వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధికుశలతలు కల వారని తెలియవచ్చును. వారు చేసేదంతా తమ భక్తుల మేలు కొరకే. వారు ఆసనాలు గాని, యోగాభ్యాసాలు గానీ, మంత్రోపదేశాలు గానీ తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను ప్రక్కన పెట్టి 'సాయి సాయి' అనే నామాన్ని మాత్రం జ్ఞాపకం ఉంచుకోమన్నారు. అలా చేస్తే వారు సర్వ బంధములనుండి విముక్తులై, స్వాతంత్ర్యం పొందుతారని చెప్పారు. పంచాగ్నుల మధ్య కూర్చోవడం, యాగాలు చేయటం, మంత్రజపం చేయడం, అష్టాంగ యోగాలు మొదలైనవి బ్రాహ్మణులకే వీలుపడుతుంది. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తాలు కావు. ఆలోచించటమే మనస్సు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క నిముషమైనా ఉండలేదు. దానికేదైనా ఇంద్రియ విషయము జ్ఞాపకానికి తెస్తే దానినే చింతిస్తూ ఉంటుంది. గురువును జ్ఞాపకానికి తెస్తే గురువునే చింతిస్తూ ఉంటుంది. మీరు సాయిబాబా యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని శ్రద్ధగా విన్నారు. ఇదే వారికి జ్ఞాపకం ఉంచుకోవడానికి సహజమైన మార్గము. ఇదే వారి పూజ, కీర్తన.

 

 

మహాత్ముల కథలను వినటం పైన చెప్పిన ఇతర సాధనములలా కష్టమైనది కాదు. ఇది అత్యంత సులభసాధ్యమైనది. వారి కథలు సంసారములో గల భయాలన్నిటినీ పారద్రోలి పారమార్థిక మార్గానికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి మహాత్ముల చరిత్రలను శ్రవణం చేయండి. వాటినే మననం చేసుకొంది. వాటిలోని సారాంశాన్ని జీర్ణించుకోండి. ఇంతమాత్రము చేస్తే బ్రాహ్మణులే కాక స్త్రీ శుద్రాది అన్ని వర్ణములవారు కూడా పవిత్రులు అవుతారు. ప్రాపంచిక బాధ్యతలలో ఇరుకుని ఉన్నా మీ మనస్సును సాయిబాబాకీ అర్పించండి. వారి కథలు వినండి. వారు తప్పక మనల్ని అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభ ఉపాయము. అయినా మరి దీనిని ఎందుకు అందరూ అవలంభించ లేకపోతున్నారు? అని అడగవచ్చు. కారణం ఏమిటంటే; భగవంతుని కృపాకటాక్షము లేకపోతే మహాత్ముల చరిత్రలను వినడానికి కూడా మనస్సు అంగీకరించదు భగవంతుని చేతనే సర్వము నిరాటంకము, సుగమము అవుతుంది. మహాత్ముల కథలు వినటం అంటే వారి సాంగత్యం చేయడమే.మహాత్ముల సాంగత్యముతో కలిగే ప్రాముఖ్యము చాలా గొప్పది. అది అహంకారాన్ని, దేహాభిమానాన్ని నశింపచేస్తుంది, హృదయ గ్రంథులను తెగగొడుతుంది. చివరికి శుద్ధ చైతన్య రూపుడిగా భగవంతుని సాన్నిధ్యానికి తీసుకొని వెడుతుంది.

 

 

విషయ వ్యామోహాలలో మనకు గల అభిమానాన్ని తగ్గించి ప్రాపంచిక కష్టసుఖాలలో విరక్తి కలగజేసి పారమార్థిక మార్గంలో నడుపుతుంది. మీకు భగవన్నామ స్మరణం పూజ, భక్తీ వంటి యితర సాధనాలు ఏమీ లేకపోయినా, కేవలము హృదయపూర్వకంగా మహాత్ముల ఆశ్రయిస్తే చాలు. వారు మనల్ని భవసాగరమునుండి తరింప చేస్తారు. మహాత్ములు అందుకోసమే అవతరిస్తారు. ప్రపంచ పాపముల తొలగించే గంగా, గోదావరీ, కృష్ణా, కావేరీ మొదలైన పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసే తమని పావనము చేయాలని వాంఛిస్తూ ఉంటాయి. మహాత్ముల మహిమ అలాంటిది. మన పూర్వజన్మ సుకృతంతో మనకు సాయిబాబా పాదాలను ఆశ్రయించే భాగ్యం లభించింది.
మసీదుగోడకు ఆనుకొని ఊదీ మహాప్రసాదాన్ని తన భక్తుల యోగక్షేమాలకై పంచిపెట్టే సుందరస్వరూపుడూ, ఈ ప్రపంచం యొక్క అభావాన్ని చింతించువాడూ, సదా పూర్ణానందంలో మునిగి ఉండేవాడూ సాయి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను .

 

పదవ అధ్యాయము సంపూర్ణము