Read more!

మహేశ్వరునికి మహాప్రీతినికలిగించే మాసశివరాత్రి వ్రతం

 

మహేశ్వరునికి మహాప్రీతినికలిగించే మాసశివరాత్రి వ్రతం

 

 

పరమేశ్వరుడు భక్తసులభుడు. తలపై కొద్దిగ గంగనుపోసి విభూది రాస్తేచాలు పరవశుడై అడగకనే వరాలు గుప్పించే బోలా శంకరుడు. ఆస్వామిని కొలచి యక్ష, కిన్నెర, గంధర్వ ,దేవగణాలేకాదు రాక్షసులు సహితము శుభాలను పొందారు. ఇక మానవులకు ఆయన కరుణ లభించడము అత్యంతసులువు. ఆయన అర్చనలు నిరుపేదలు కూడా నిరభ్యంతరముగా చేసుకొనగలిగేలా తాను భక్తసులభుడయినాడు. ఆయన అర్చనకు మీరేమీ అధికముగా కష్టపడి సమకూర్చుకోవలసిన వస్తువులుకావు. కాసిని నీళ్ళు, నాలుగు మాఱేడు దళాలు, ఏ రకమయిన పిచ్చిపూలు తెచ్చినా మురిసిపోతాడా వెఱ్రితండ్రి.

 


ప్రతినెలలోనూ అమావాస్య ముందువచ్చే చతుర్ధశి నాడు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమయినరోజు. దానినే మాస శివరాత్రి అంటారు. మాఘమాసములో వచ్చేదాన్ని మాత్రం మహాశివరాత్రి అనిపిలుస్తారు. ప్రతినెలలో ఆరోజు పగటిపూటఉపవాసము వుండి సాయంత్రము మట్టితో శివలింగాన్ని చేసుకుని గాని, లేక మీకు అందుబాటులో వున్న శివ లింగమునుగాని పూజగదిలో ఒక పల్లెములో వుంచి. స్వామికి ఆవాహన పలికి, తండ్రీ నాపూజలందుకొమ్మని పిలచి, ఆర్ఘ్య పాద్యాదులను సమర్పించి తరువాత అభిషేకము చేయాలి. ఈ అభిషేకము శక్తివున్నవాళ్ళు ఋత్విక్కులను నియమించుకుని, ఆ శక్తిలేనివాళ్ళు తామే నమశ్శివాయ అనుకుంటూ స్వామిని మన తృప్తితీరా నీళ్ళతోనూ, పాలతోనూ అభిషేకించుకోవాలి. తరువాత వస్త్రము సమర్పించి, గంధము, కుంకుమలతో అలంకరించి పూలతో మారేడుదళములతో పూజించాలి.

 

 

చదవగలిగితే అష్టోత్తరాలు లేకుంటే ఓమ్ నమశ్శివాయ అనే పంచాక్షరిని జపిస్తూ పూజ చేయవచ్చు. తరువాత ధూపము దీపము చూపి మన శక్తికొలది నైవేద్యము సమర్పించి హారతి ఇవ్వాలి. తరువాత అంజలి ఘటించి పూలు మంత్రపుష్పముగా భావించి సమర్పించండి చాలు. ఆతరువాత మీకు వచ్చిన కీర్తనలతో స్వామిని సంతోషుని గావించి మనసులో తలచుకుని ధ్యానించండి. పరవశమయిన ఆతండ్రి మనసు వుర్రూతలూగి అక్కడివాతావరణము ఎంతో ప్రశాంతముగా మారటం మీకు అనుభవ మవుతుంది . మరుసటిరోజు పూజలో వుపయోగించిన ద్రవ్యాలను నదిలోకాని, లేక ఎవరూ తొక్కని చోటకానీ పడవేయాలి. శివమాలిన్యాన్ని తొక్కడము మహాపాపము అంతేకాదు, మహా కష్టాలను తెస్తుంది.
ఈవిధముగా భక్తిశ్రధ్ధలతో స్వామిని పూజించి చూడండి మీకోరికలు సత్వరమే నెరవేరుతాయి. సకలదోషాలూ పరిహరింపబడతాయి.