శివతాండవం - 65
65వ భాగం
శివుడింటి ముందు కారాగింది. అందులోంచి శివుడూ, పంకజం, సుభద్ర, ఆవిడ భర్తా దిగారు.
ఆ జనాభాని చూడగానే నిప్పల్సామి గుండెలు బాదుకుంటూ అంటున్నాడు.
"అయిపోయింద్సార్ ! అంతా అయిపోయింది!"
"ఏవైంది అప్పల్సామీ!" అని ఆందోళనగా అడిగాడు శివుడు.
"చిత్తం! ఇంకో అయిదు నిమిషాల్లో కిష్టుడుగారూ, వసుంధరమ్మా ఇద్దరూ ప్రాణాలిడిచేసారండి!"
అప్పల్సామి కన్నీరు పెట్టుకుంటూ, ఇంకేమీ చెప్పలేక ఉరి సందేశం శివుడికి అందజేశాడు.
ఆ ఉత్తరాన్ని శివుడు చదువుకున్నాడు.
కైలాసాన్నీ జ్యోతినీ చితగోట్టేసి, ఆ ఇద్దరీ ఒక స్థంభానికి కట్టేశాడు డేవిడ్.
అప్పటికే ఆ ఇద్దరికీ స్పృహపోనేపోయింది.!
డేవిడ్ వాచీ చూసుకున్నాడు. టైమెంది!
అతను గబగబా గంట స్థంభం ఎక్కుతున్నాడు!
"ఆగు!" అనే శబ్దం వినిపించగానే అకస్మాత్తుగా ఆగిపోయాడు.
మళ్ళీ ఎవరో వచ్చి వుంటారనే ఉద్దేశంతో వెనక్కితిరిగి చూశాడు.
శివుడూ అతని పక్క పంకజం.
డేవిడ్ కి పిచ్చెక్కినట్టయింది! పగబట్టి నట్టు జంటలు జంటలుగా ఈ గంటల మీద దాడిచేస్తున్నందుకు కోపం కూడా కలిగింది. అందుకే సీరియస్ గా అడిగాడు.
"మీది మూడోజంట ! మీ జంట కూడా గంటల కోసమే వచ్చారా?"
"అవును డేవిడ్! నువ్వు గంటలు కొట్టొద్దు.!" అన్నాడు శివుడు.
డేవిడ్ కోపంగా అన్నాడు.
"నేను మిలట్రీని! ఎక్స్ మిలట్రీని! నీ మాయమాటలు లంచాలు నా దగ్గిర పని చేయవు. నాకు డ్యూటీయే ముఖ్యం వెళ్ళిపోండి!" అంటూ డేవిడ్ గంటను చేరుకున్నాడు.