Read more!

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం

 

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం

 

 

శనివారం ఆంజనేయ స్వామిని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయి. అన్ని వారాల్లోను మందవారం అని పిలువబడే శనివారం శ్రేష్టమైనది.
"సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః
హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః''

అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమవంతుడు అయ్యాడు అని అర్ధం. శ్రవణా నక్షత్రంతో కూడిన శనివారంనాడు రుద్రమంత్రాలతో తైలాభిషేకం చేయాలి. తైలంతో కూడిన గంధసింధూరాన్ని హనుమంతునికి పూస్తే ప్రీతి చెందుతాడు అని పురాణాలు చెబుతున్నాయి. అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధిబలం పెరుగుతుంది. శత్రు జయం కల్గి మిత్ర సమృద్ధి హెచ్చి, యశోవంతులైన పుత్రులు కలుగుతారు. మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలలో ఏ మాసంలోనైనా కాని,  కార్తీక శుద్ధ ద్వాదశినాడు కాని శనివార వ్రతం చేయాలి.

శనివారవ్రత విధానం :

 

 

 

ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని, కొత్త పాత్రలతో బయటి నుండి నీరు తెచ్చుకొని హనుమంతునికి అభిషేకం చేయాలి. అన్ని వర్ణాలవారు, స్త్రీలు కూడా చేయవచ్చు. నలభై రోజులు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. ఆంజనేయస్వామికి చెందిన అనేక మంత్రాలున్నాయి. అందులో ఒక దాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది యథావిధిగా జపించాలి. దీనివల్ల జనవశీకరణ కలుగుతుంది. ధనలాభం, ఉద్యోగప్రాప్తి, కారాగృహ విమోచనం లభిస్తాయి.

 

 

శనివార వ్రతానికి ఇంకో కారణం కూడా ఉంది. శనిగ్రహం ఎంత క్రూర స్వభావుడో అంతటి సౌమ్యమూ ఉన్నవాడు. ఒకసారి శనిదేవుడు హనుమను సమీపించి "మారుతీ! నేను శనిని, అందర్ని పట్టి బాధించాను. ఇంత వరకు నిన్ను పట్టుకోలేదు. ఇప్పుడు చిక్కావు.'' అన్నాడు. దానికి హనుమ "శనీశ్వరుడా! నన్ను పట్టుకొంటావా? లేక నాలో ఉంటావా? నాలో ఉండదలిస్తే ఎక్కడ ఉండాలని కోరి గా వుంది?'' అని ప్రశ్నించాడు. అప్పుడు శని, హనుమంతుని శిరస్సు మీద ఉంటానని చెప్పాడు. సరేనని శిరస్సు మీద శనిని చేర్చుకొన్నాడు ఆంజనేయుడు. ఆయనకు శనిని బాధించాలని మనసులో కోరిక కలిగింది. ఒక మహా పర్వతాన్ని పెకలించి నెత్తిమీదకు ఎత్తు కొన్నాడు.

 

 

కుయ్యో మొర్రో అని ఆ భారం భరించలేక శని గిలగిల తన్నుకొన్నాడు బరువు దించమని ప్రాధేయ పడ్డాడు. జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువుకు ప్రదక్షిణం చేయటం మొదలు పెట్టాడు. ఊపిరాడక శని వలవల ఏడ్చేశాడు. తోకలో బంధింపబడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ, ఏడుస్తూ ప్రార్ధించాడు. శని స్తోత్రాలకు పవన కుమారుడు సంతోషించి "మందా! నన్ను పట్టుకొని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు .అప్పుడే గిజ గిజలాడి పోతున్నావే?'' అని ప్రశ్నించాడు. "ప్రజలను బాధించటమే నీ ధర్మంగా ప్రవర్తిస్తున్నావు. అందుకని నిన్ను ఒక రకంగా శాశించి వదిలి పెడతాను'' అన్నాడు. గత్యంతరం లేక శని సరేనన్నాడు.

 

 

హనుమ "శనీశ్వరా! నా భక్తులను బాధించ రాదు, నన్ను పూజించే వారిని, నా మంత్రాన్ని జపించేవారిని, నా నామస్మరణ చేసే వారిని, నాకు ప్రదక్షిణం చేసేవారిని, నా దేవాలయాన్ని సందర్శించేవారిని, నాకు అభిషేకం చేసే వారిని ఏ కాలంలోనైనా ముట్టుకోకూడదు, బాధించ రాదు. మాట తప్పితే కఠినాతి కఠినంగా నిన్ను దండిస్తాను'' అని చెప్పి, శనితో వాగ్దానం చేయించుకొని వదిలి పెట్టాడు. అందుకే శనివారానికి ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది. శనిని తోకతో నేల మీద పడేసి లాగటం వల్ల శనీశ్వరుడి శరీరమంతా గాయాలై బాధించాయి. ఆ బాధా నివృత్తికే శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తారు. ఈ విధంగా తైలాభిషేకం చేసిన వారిని శనిదేవుడు బాధించడు.

 

 

"మంద వారేషు సంప్రాప్తే హనూమంతం ప్రపూజయేత్ –సర్వేశ్వాపిచ వారేషు మంద వారః ప్రశాస్యతే|
హనూమజ్జన్మనో హేతు స్తస్య ప్రాశస్త్య ముచ్చ్యతే –తస్మాత్తస్మిన్ కృతా పూజా సర్వ కామ ఫలప్రదా||''

శని వారం రాగానే హనుమంతుని పూజించాలి. ఆయన శనివారం జన్మించటం వల్ల దానికి అంత ప్రాముఖ్యత లభించింది. అందుకే శనివారం చేసే హనుమంతుని పూజ సర్వ కామ్యార్ధ సిద్ధి కల్గిస్తుంది సకల శ్రేయస్సును ఇస్తుంది.