Read more!

జటాయువు చెప్పిన కశ్యపుడి వంశచరిత్ర!!

 

జటాయువు చెప్పిన కశ్యపుడి వంశచరిత్ర!!

రామాయణంలో రాముడు అగస్త్య మునితో ఆశ్రమం నిర్మించుకోవడానికి మంచి ప్రదేశం చెప్పమని అడుగుతాడు. అప్పుడు అగస్త్య మహాముని రాముడితో పంచవటి అనే అడవి ఉంటుంది. అక్కడ ఎంతో బాగుంటుంది. అక్కడికి వెళ్లి మీరు ఆశ్రమం నిర్మించుకోవచ్చు అని చెప్పి విష్ణువు ధనస్సును, బ్రహ్మ ఇచ్చిన సూర్యతేజస్సు కలిగిన బాణాన్ని, ఇంద్రుడు ఇచ్చిన అక్షయబాణాలు, ఒక పెద్ద పిడి కలిగిన ఖడ్గం ఇచ్చి వీటి ద్వారా నువ్వు విజయాన్ని పొందుతావు. వీటిని నీతో ఉంచుకో అని చెప్పాడు.

అవన్నీ తీసుకుని వెళ్తుండగా సీతారమలక్ష్మణులకు ఒకచోట ఒక చెట్టు మీద పెద్ద పక్షి కనబడింది. అది రాముడితో నేను మీతో వస్తాను అని అడిగింది. 

అప్పుడు రాముడు "నువ్వు ఎవరు" అని అడిగాడు.

"నేను మీ నాన్నగారైన దశరథ మహారాజుకి స్నేహితుడిని. ప్రజాపతులలో చిట్ట చివరివాడు కశ్యప ప్రజాపతి. ఆయన దక్ష ప్రజాపతి యొక్క 60 కుమార్తెలలో 8 మందిని వివాహం చేసుకున్నాడు. ఆ ఎనిమిదిమందే అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మను, అసలా. అప్పుడు కశ్యపుడు తన 8 మంది భార్యలని పిలిచి "మీరు క్షేత్రములు కనుక, నా యొక్క తేజస్సు చేత, నాతో సమానులైన వారిని కనండి' అన్నాడు. ఆయన మాటలని కొంతమంది భార్యలు విన్నారు. కొంతమంది వినలేదు.

అదితికి 12 మంది ఆదిత్యులు, 8 వసువులు, 11 రుద్రులు, ఇద్దరు అశ్వినులు జన్మించారు. అలా మొత్తం 33 దేవతలు అదితికి జన్మించారు. దితికి దైత్యులు జన్మించారు. ధనువుకి హయగ్రీవుడు జన్మించాడు. ఈ ముగ్గురు భార్యలు కశ్యప ప్రజాపతి మాట విన్నారు. కశ్యపుడి మాట వినని భార్యలైన కాళికకి నరకుడు, కాలకుడు అనే ఇద్దరు జన్మించారు. తామ్రకి క్రించి, భాసి, శ్యేని, ధృతరాష్ట్రీ, శుకి అనే  అయిదు మంది కన్యలు జన్మించారు. మళ్ళి క్రౌంచికి గుడ్లగూబలు పుట్టాయి. భాసికి భాస పక్షులు పుట్టాయి. శ్యేనికి డేగలు, గ్రద్దలు పుట్టాయి. ధృతరాష్టీకి హంసలు, చక్రవాకములు పుట్టాయి. శుకికి నత అనే పిల్ల పుట్టింది. నతకి వినత అనే పిల్ల పుట్టింది. ఆ వినతకి గరుడుడు, అరుణుడు అనే ఇద్దరు పుట్టారు. నేను ఆ అరుణుడి కుమారుడిని, నా పేరు జటాయువు. నా అన్నగారి పేరు సంపాతి.

అలాగే క్రోధవశకి మృగీ, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రువ అనే 10 మంది ఆడపిల్లలు పుట్టారు. మృగికి లేళ్ళు పుట్టాయి. మృగమందకి ఎలుగుబంట్లు పుట్టాయి. హరికి సింహాలు, బలమైన వానరాలు పుట్టాయి, భద్రమదకి ఇరావతి అనే పిల్ల పుట్టింది. ఆ ఇరావతికి ఐరావతం పుట్టింది, - మాతంగికి ఏనుగులు పుట్టాయి. శార్దూలికి కొండముచ్చులు, పులులు పుట్టాయి. శ్వేతకి దిగ్గజాలు పుట్టాయి, సురభికి రోహిణి, గోవులు, గంధర్వులు మొదలైనవి పుట్టాయి. సురసకి అనేక పడగలు కలిగిన నాగపాములు పుట్టాయి, కద్రువకి సాధారణమైన సర్పములు పుట్టాయి.

రామా! ఇంతకీ ఇవన్నీ నీకు ఎందుకు చెప్పానో తెలుసా, కనబడేటటువంటి ఈ పక్షులు, మృగాలు, పశువులు అన్నీ కశ్యప ప్రజాపతి సంతానము నుండి వచ్చినవే" అని అన్నాడు ఆ జటాయువు.

◆వెంకటేష్ పువ్వాడ.