దేవతలకు ఆహారం అందించేదెవరు

 

దేవతలకు ఆహారం అందించేదెవరు

 

దేవతలకు ఆహారం అందించేది కాకులు. సూర్యపురాణం, పద్మపురాణం లో ఈ విషయం ప్రస్థావించారు.

అస్పృశ్యత,వర్ణ వివక్ష ఈనాటిది కాదు. అనాది కాలం నుండి వస్తుంది. పక్షులలో కాకి కూడా ఇలాంటి అవమానాలనే ఎదురుకుంది. అయితే ఎప్పటికప్పుడు ఆయా కాలాల పరిస్థితులకు తగినట్లు ఈ వర్ణ వివక్ష, అస్పృశ్యతను రూపుమాపే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

ఒక కాకి మనసుకి బాధ కలిగి సూర్యుడు గురించి తపస్సు చేస్తుంది. సూర్యుడు ప్రత్యక్షమయ్యి

"ఏం కాకయ్య. ఎందుకు ఈ తపస్సు. ఏం కావాలి నీకు?"

అని అడుగుతాడు సూర్యుడు.

కాకి " ఏం చెప్పమంటారు స్వామి. మా రంగు, గొంతు శబ్దం చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు. లోకంలో మలిన పదార్ధాలను తిని కాలం వెళ్లదీస్తున్నాము. లోకంలో ప్రతి జంతువు, పక్షి ఎవరో ఒకరికి వాహనంగా ఉండి కీర్తి గడించారు. అలా మమ్మల్ని కూడా దీవించి గుర్తింపు కలిగేలా దీవించండి స్వామి. అదే నా కోరిక అంటుంది కాకి. సూర్యుడు ఆలోచించి పితృ దేవతలకు పెట్టే పిండము నీవు తప్ప మరే పక్షులు తినవు. ఆ పిండము నీవు తింటేనే ఆ ఆహారం పితృదేవతల ఆకలి తీరుతుందని వరమిస్తాడు. ఇంకో వరం ఏమంటే సూర్యుడు కొడుకు శనీశ్వరుడు. ఆయనకు వాహనంగా ఉండటానికి ఏ జంతువులు, పక్షులు ముందుకు రావడం లేదు. నువ్వు వాహనంగా ఉండు. ఎలాంటి ఇబ్బందీ లేదు. అని వరమిస్తాడు. అలా నువ్వు గుర్తింపు పొందుతావు అని రెండు వరాలు ఇస్తాడు కాకికి. అలా కాకి శనీశ్వరుడికి వాహనం అవుతుంది.

కొంత కాలం గడిచాక శనీశ్వరుణ్ణి ప్రార్ధించి, స్వామి కేవలం ఈ పిండం తిని పితృ దేవతలకు ఆకలి తీర్చడం వలన సరి అయిన గౌరవ మర్యాదలు అందడం లేదు. ఇది ఒక్కటే సరిపోవడం లేదు. నా కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరిగేలా వరం ఇవ్వండి స్వామీ! అని అడుగుతుంది కాకి. అప్పుడు శనీశ్వరుడు  ఆలోచించి నీవు తీసుకునే ఆహారం దేవతలకు ఆహారం అవుతుంది అని వరమిస్తాడు. అప్పటినుంచి కాకి కి ఆహారం పెడితే అది దేవతలకు వెలుతుంది.
అందుకే దేవాలయాలలో పెట్టిన నైవేద్యం కొంచెం కాకికి ఆహారంగా పెడతారు. కాకి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే దేవతలకు అందినట్లు అందరూ భావిస్తారు. అలా కాకి తను కోరుకున్న కీర్తిని పొందుతుంది.


- వెంకటేష్ పువ్వాడ