Read more!

ద్వాదశజ్యోతిర్లింగాల గురించి మీకు తెలుసా?

 

ద్వాదశజ్యోతిర్లింగాల గురించి మీకు తెలుసా?

 

 

 

 

మహాశివుడిని విగ్రహ రూపంలో దేవాలయాలలో పూజించటం బహు అరుదు. మనకు ఆ భోళాశంకరుడు లింగరూపంలోనే దర్శనమిస్తాడు. అటువంటి లింగాలలో ద్వాదశజ్యోతిర్లింగాలు అత్యంత ప్రసిద్ధమైనవి. అవి..

సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్

ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్
సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే

వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే
హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే

ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి
.


1. సోమనాధేశ్వరుడు

 

 

 


ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటది "సోమేశ్వర లింగం". ఇది మిక్కిలి ప్రఖ్యాతి చెందిన పురాతనమైన శైవ క్షేత్రం. పశ్చిమ భారతదేశంలో గుజరాత్ రాష్ట్రం (సౌరాష్ట్రం) లోని ప్రభాస పట్టణంలో ఈ ఆలయం ఉన్నది. సరస్వతీ నది ఇక్కడ సాగర సంగమం చేస్తుంది. ఈ సాగర సంగమంలోనే చంద్ర భగవానుడు స్నానం చేసి, శివారాధన చేసి, శాప విముక్తి పొందినాడు. దక్ష ప్రజాపతి కుమార్తెలు నూరుమంది. అందరిలోనూ పెద్ద కుమార్తె "సతీదేవి" శివుని భార్య. మిగిలిన కుమర్తెలలొ 27 మందిని (అశ్విని, భరణి మొదలగు నక్షత్రములు) చంద్రునుకి ఇచ్చి వివాహం చేశాడు. సవతులు అందరిలోనూ చిన్నదగు రేవతి యందు చంద్రునకు మిక్కిలి ప్రేమ యుండుట వలన, మిగిలిన వారు తమ తండ్రికి ఫిర్యాదు చేశారు. అంతట దక్ష ప్రజాపతి చంద్రునకు "క్షయ వ్యాధిని పొందు" అని శాపం ఇచ్చాడు. నారద ముని సలహాతో, చంద్రుడు ప్రభాసమునకు పోయి 40 దినములు శివ పంచాక్షరీ మంత్రాన్ని జపించాడు. అంత పర్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఈ ప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ట చేసి, పూజించిన, నీకు శాపఫలం క్షీణించగలదు. మొదటి 15 దినములు నా వర ప్రభావంబున వృద్ది పొంది, తరువాత 15 దినములు దక్ష ప్రజాపతి శాప ఫలంబున క్షీణించగలవు అని తెలియజేసాడు. చంద్రుడికి సోముడు అనే పేరు ఉంది. సోముడు చేత అర్పించబడిన ఈశ్వరుడు కాబట్టి సోమేశ్వరుడు అని పేరు వచ్చింది. ఈ సోమేశ్వరలింగాన్ని పూజించే వారికి సకల పాపములు, క్షయ మొదలగు వ్యాధులు తొలగిపోతాయి

2. శ్రీశైల మల్లికార్జునుడు

 

 

 


అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైయిన భ్రమరాంబికాదేవి, ద్వాదశజ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీశైల మల్లికార్జునుడు మనకు శ్రీశైలంలో దర్శనమిస్తారు. దక్షిణ భారతదేశాన, ఆంద్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లా, కృష్ణానదీ తీరాన నల్లమల కొండల్లో 'శ్రీశైలం' క్షేత్రం ఉంది. ద్రవిడ శైలిలో నిర్మించిన ఈ దేవాలయం చాలా విశాలమైంది. కోటగోడల్లాంటి అతి పెద్ద గోడలపై కుడ్యచిత్రాలు తీరి వుంటాయి. స్థంభాలతో సహా వాస్తుశిల్పంలో సంపన్నత, దర్పం తొణికిసలాడుతుంటాయి. విజయనగర రాజులనాటి వాస్తుకళకు ఇది నిదర్శనం. మహా శివరాత్రికి, ఉగాదికి, చైత్రమాసంలో జరిగే చండీయాగము, కుంభోత్సవము ప్రధానములు. శివరాత్రినాటి రాత్రి స్వామి వారి ఆలయంపైన ఉన్న శిఖర కలశం నుండి నాల్గు వైపుల ఉండేటట్లుగా మూరెడు వెడల్పు గలిగి - 360 మూరల గుడ్డను కడతారు. దీనినే పాగ చుట్టడం / మంగళపాగా అని అంటారు. ఈ వస్త్రాన్ని రోజుకొక మూర చొప్పున 360 రోజులు నేస్తారని చెప్పుకుంటారు. మంగళ పాగా రాత్రి వేళ లింగోద్భవ సమయానికి నేత ముగుస్తుంది. పాగా చుట్టే మనిషి దిగంబరుడై యుండి ఎవరికీ కానరాకుండా వుంటాడట. తరవాత ఈ మంగళపాగాను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ప్రసాదంగా ఇస్తారు.ఇక్కడకు ఇక 3 కి. మీ. దూరంలో కృష్ణా నది ఉత్తార వాహినియై ప్రవహిస్తూ వుంది. దీనిని పాతాళ గంగ అని అంటారు. శ్రీశైల జల విద్యుదుత్పాదక కేంద్రం కట్టిన తరువాత పాతాళ గంగకు వెళ్ళేందుకు గల మెట్లు చాల వరకు నీటిలో మునిగిపోయాయి. అయినా యాత్రికులు పాతాళగంగ - దగ్గరలో వున్న ' లింగాల గట్టు ' వగైరాలను దర్శించుకుని గాని మరలరు.

 

 

 


ఆలయం చుట్టూ ప్రాకారం గోడలు చాల ఎత్తుగాను వివిధ గోపురాల్తో శోభిల్లుతుంటాయి. ప్రాకారనిర్మాణానికి వినియోగించబడిన రాళ్ళు సుమారు 20 అ. వైశాల్యంలో దీర్ఘ చతురస్రాకారంలో ఉండి వాని మీద చతురంగ బలాల చిత్రాలు, రామాయణ, మహాభారత కథా చిత్రాలు - భక్త చరిత్రలు - భగవల్లీలలు చెక్కబడి విశిష్టంగా గోచరిస్తాయి. మల్లికార్జున స్వామి వారి ఆలయానికి సరిగ్గా వెనుక భాగంలో భ్రమరాంబా అమ్మవారి ఆలయంలోని అమ్మవారి దృష్టి నేరుగా శివలింగముపై ఉండేటట్లుగా నిర్మించబడింది. ఆది శంకరాచార్యులవారు ఆలయమునకు శ్రీ చక్రప్రతిష్ట చేశారని ప్రతీతి. చైత్రమాసంలో ' అంబ తిరునాళ్ళ ' అని గొప్ప ఉత్సవం జరుగుతుంది.
వెనుక వైపున భ్రమరాంబికాలయంతో పాటు - ఎడమ వైపున పార్వతీదేవి ఆలయం ఉంది. సంక్రాంతికి పార్వతీదేవి కల్యాణోత్సవం, శివరాత్రినాడు శ్రీభ్రమరాంబా కళ్యాణోత్సవం జరుగుతాయి. ఈ రకంగా ఒకే సంవత్సరం రెండు కళ్యాణోత్సవాలు జరిగే విశేషం దేశం మొత్తం మీద శైవ క్షేత్రాల్లో ఇక్కడే.
"మల్లికార్జునస్వామిని చేతులతో తాకి పునర్జన్మ లేకుండా ముక్తిని పొందవచ్చు". "కాశీ క్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవన్నామస్మరణం, శ్రీశైలంలో దైవదర్శనం ముక్తిదాయకాలు".
" శ్రీశైలం యొక్క శిఖర దర్శనమే సమస్త పాపహరణం జన్మరాహిత్య" మని వెదోక్తి .

3. మహాకాళేశ్వరుడు

 

 

 


మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్‌కి 80 కి . మీ దూరంలో ఉజ్జయిని నగరంలో క్షిప్రా నదీతీరాన " శ్రీ మహాకాళేశ్వర స్వామి " జ్యోతిర్లింగరూపమున దర్శనమిస్తారు.
ఈ ఆలయం మూడు అంతస్తులుండి, ఏడు గోపురాలుండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. మొదటి అంతస్తులో  మహాకాళేశ్వరుడు, రెండవ అంతస్తులో ఓం కారేశ్వరుడు, మూడ వ అంతస్తులో నాగచంద్రేశ్వరుడు కొలువై వుంటారు. ఈ మూడవ అంతస్తు మాత్రం నాగపంచమి నాడు మాత్రమే తెరిచి పూజాది కాలు చేస్తూవుంటారు. మిగిలిన రోజుల్లో ఈ అంతస్తు మూసివుంటుంది. ఇక ఈ ఆలయంలో 3 అడుగుల వ్యాసంతో 21/2 అడుగుల ఎత్తున్న జ్యోతిర్లింగే శ్వరుడు పశ్చిమ దిక్కుగా ప్రతిష్టితు డయ్యాడు. ఇక్కడ చితాభస్మంతో చేసే అభిషేకం చాలా ప్రాశస్య్తమైనది. పూర్వం ఒక సాధువు స్మశానం నుంచి చితాభస్మాన్ని తెచ్చి అభిషేకించి వెళ్ళిపోయేవాడట. ఆయనని ఎవరూ దర్శించలేకపోయారు. ఇప్పుడుడు మాత్రం ఇక్కడ అగ్నిహోమం లోనున్చి వచ్చిన భస్మంతో స్వామిని అభిషేకిస్తున్నారు. .
ఇక్కడ తాంత్రిక విద్యలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అఘోరకులు, కాపాలికులు, తాంత్రికోపాసన చేస్తూ ఇక్కడ గుహలలో నేటికీ కనిపిస్తూంటారు. వీరిని చూడడానికి కొంత భయం కలుగుతుంది. వీరి ఉపాసనా చర్యలు కూడా మనకి భయం పుట్టిస్తాయి.

4. ఓంకారేశ్వరుడు

 

 

 


ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాల్గవది "ఓంకార లింగము". మధ్యప్రదేశ్ రాష్ట్రములో ఇండోర్ కు సుమారు 80కి.మీ దూరంలో "ఓంకారేశ్వర లింగము" ఉంది. దీనినే అమలేశ్వర లింగము అని కూడా అంటారు.
పర్వతములన్నిటి యందు " మేరువు " అను పర్వతము గొప్పది. మేరువు మీద మంగళప్రదుడైన శివమూర్తి ప్రమధగాణాలతో గౌరీ సామేతంగ నివసించియున్నాడు. వింధ్యుడు అనే పర్వత రాజుకు మేరువ రాజుకు ఉన్నంత గొప్పతనము పొందవలెనని సంకల్పముతో, "ఓం నమః శివాయ" మంత్ర జపం చేయుట మిన్నునంట ఎత్తు పెరుగుచుండును. దీనిని చూచిన అగస్త్యముని చేయినడ్డుపెట్టి "వింధ్య రాజా! నేను కైలాసపతితో సంప్రదించి, నీకు ప్రసన్నుడగునట్లుగా చేయుదును. నీవు పెరగక నిలిచియుండు" అని చెప్పెను. అగస్త్య ముని పరమేశ్వరునితో "స్వామీ నీ అనుగ్రహమును సంపాదించుకోరి, వింధ్యా పర్వత రాజు మిన్నునంటగా పెరుగుచున్నాడు, అతని కోరికను ఫలింప జేయుము" అని ప్రార్ధించాడు. శంకరుడు వింధ్యునకు ప్రత్యక్షమై, వింధ్య పర్వతరాజు అభీష్టము అనుసరించి, ఆ పర్వతము పై సువర్ణ రూప లింగముగా వెలిశాడు.

5. వైద్యనాధేశ్వరుడు

 

 

 


పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసంతం గిరిజాసమేతం |
సురాసురారాధితపాదపద్మం ష్రీవైద్యనాథం తమహం నమామి ||


బీహార్ రాష్ట్రములోని, బీడ్ జిల్లాకు 26కి.మి దూరాములో, పర్లి అనే గ్రామంలో వైద్యనాధేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ గ్రామాన్నే కాంతిపూర్/మధ్యరేఖ వైజయంతి/ జయంతి అని కూడా పిలుస్తారు. కన్యాకుమరి నుండి, ఉజ్జయిని కి ఒక రేఖను గీస్తే, ఈ పర్లి గ్రామం స్పష్టంగా ఆ రేఖపై కనిపిస్తుంది. మేరు/నాగనారయణ పర్వతాల కి దగ్గర్లో ఉంది ఈ గ్రామం. బ్రహ్మ, వేణు, సరస్వతి అనే నదులు ఇక్కడ మనకు కనిపిస్తాయి. మహా శివ భక్తుడైన రావణుడు, శివ అనుగ్రహం కోసం తపస్సు చేయసాగాడు. ఎండనక, వాననక సంవత్సరాలు తరబడి తపస్సు చేసినా ఆ భోళా శంకరుడు అనుగ్రహించలేదు. రావణుడు తన తలను శివునికి అర్పించాడు. ఆ సమయంలో భక్తవ శంకరుడు అనుగ్రహించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు, దానికి రావణు డు, "నిన్నే నా లంకకు తీసుకొని వెళ్ళి అక్కడ పూజించుకుంటాను, ఆ వరం ప్రసాదించు" అని కోరాడు. దానికి శివుడు, "నేను ప్రసాదించే లింగాన్ని నువ్వు తీసుకొనివెళ్ళు, ఎట్టి పరిస్థితులలో మధ్యలో కింద పెట్టవద్దు" అని హెచ్చరించాడు. శివ ప్రసాదంతో బయలుదేరిన రావణు డు, మర్గమద్యలో నదీ తీరంలో సంధ్యావందనం చేయతలచి, దగ్గర్లో ఓ బాలుడుని పిలిచి, తాను వచ్చేవరకు లింగాన్ని కింద పెట్టవద్దన్ని చెప్పి వెళ్ళాడు. రావణుడు అటు వెళ్ళగానే, ఆ బాలుడు రెండుసార్లు రావణుడిని పిలిచి, అతను రాకపోయేసరికి లింగాన్ని కిందపెట్టేసాడు. ఆ లింగమే వైద్యనాధేశ్వర లింగం. ఆ బాలుడేవరో కాదు, గణాధీశుడు.
ఇంకో కథనం ప్రకారం. సాగరమధనంలో శ్రీమహావిష్ణువు అమృతమును, ధన్వంతరిని శివలింగంలో దాచాడు. ఆ లింగాన్ని తాకిన అసురులు, లింగం నుండి వెలువడే మంటల తాకిడికి తాళలేక పోయారు. అదే శివభక్తులు తసకితే లింగం నుండి అమృతం కురవ సాగింది. అందుకే ఈ లింగానికి వైద్యనాధేశ్వర లింగం/అమృతేశ్వర లింగమని పేరు వచ్చింది. ఇప్పటికీ ఇక్కడ ప్రతి ఒక్కరు లింగాన్ని త్రాకి భక్తితో పూజించుకుంటారు.

6. భీమశంకరుడు

 

 

 


యం ఢాకినిశాకినికాసమాజె నిషేవ్యమాణం పిషితాషనైష్చ |
సదైవ భీమాదిపదప్రసిద్దం తం షణ్కరం భక్తహితం నమామి


మహారాష్ట్రంలో పూనె పట్టణానికి కొద్ది దూరంలో భీమానది తీరాన సహ్యాద్రి పర్వత శ్రేణిలో డాకినీ అనే అరణ్యంలో భీమశంకరుడు వెలిసాడు. త్రిపురాసురుడి ఆగడాలను అరికట్టడానికి శివుడూ రుద్రావతారుడైనాడు. శివునితో యుద్ధానికి పాల్పడిన త్రిపురాసురుడు, శివునిచే సం హరించబడ్డాడు. యుద్ధం చేసి అలసిన శంకరుడు ఎత్తైన సహ్యాద్రి పర్వతాలపైన విశ్రమించాడు. శివుని శరీరం నుండి స్వేద బిందువుల ధారే చిన్న కొలనుగా ఏర్పడింది. అక్కడనుండే భీమానది ఏర్పడింది అని పురాణాలు చెబుతున్నాయి.

మరో కథనం ప్రకారం, పూర్వము కామరూప రాజ్యం నందలి "ఢాకినీ" అను ప్రదేశములో భీమాసురుడు అను రాక్షసుడు
ఉండేవాడు. తన తల్లి కోరికపై బ్రహ్మ దేవుని గురించి తపస్సు చేసి, అనేక వరాలు పొంది, దేవేంద్రాదులను జయించాడు. భీమాసురుడు కామరూప రాజ్యముపై దండెత్తి, కామరూప రాజు సురక్షణను, అతని భార్య సురణాదేవిని బంధించెను. సురక్షణ, సురణాదేవి శివ భక్తులైనందున, వారు చెరశాలలో పార్ధివ లింగమును పూజించు చుండిరి. భీమాసురుడు శైవుడైనందు వలన రాజదంపతులను పరమేశ్వరుని సేవింపరాదని శాసించాడు. ఆ రాజదంపతులు భీమాసురునకు భయపడక, పరమేశ్వరుడిని పూజించిరి. భీమాసురుడు రాజ దంపతులను సంహరించుటకు తన కత్తిని ఎత్తాడు. అంతట పరమేశ్వరుడు ఆ మట్టి లింగము నుండి వచ్చి, భీమసురుడును సంహరించెను. రాజ దంపతులు పూజించిన ఆ లింగమును భీమశంకర లింగము అంటారు.

7. రామేశ్వరుడు

 

 

 


తమిళనాడులోని రామనాధపురం జిల్లాలో రామేశ్వం వుంది. శ్రీరాముడు స్థాపించడంవలన ఇది రామేశ్వరమైంది. శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖమైంది. ఈ క్షేత్ర మహిమను స్కందపురాణం, రామాయణం, రామచరితమానస్, శివపురాణం మొదలగు గ్రంథాలుచె ప్తున్నాయ. లంకపైకి యుద్ధానికి వెళ్లేముందు శ్రీరాముడు ఇక్కడే శివపూజ చేసి ఆశీర్వాదం పొందాడు. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు తిరిగి వచ్చేటప్పుడు సీతతో కలిసి ఇక్కడ పూజలు నిర్వహించాడు. హనుమంతుడు కైలాసంనుండి తెచ్చిన శివలింగం ఇక్కడే ప్రతిష్టితమైంది. లంకకు వెళ్లే వారధిని విభీషణునికి కోరిక మేరకు శ్రీరాముడు తన ధనస్సుతో ఛిన్నాభిన్నం చేసాడు. ఇదే స్థలంలో "ధనుష్కోటి" తీర్థం ఇప్పుడు జనులను ఆకర్షిస్తోంది. మహా శివరాత్రిలాంటిపర్వదినాలలో ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు. లక్ష్మణశిల, పంచముఖి హనుమాన్, శ్రీరామ-జానకీ మందిరాలు ఇక్కడ నెలవైయున్నాయ. గుడికి దగ్గరలో వున్న సముద్ర ప్రాంతంను అగ్ని తీర్ధము అంటారు. ఇక్కడ స్నానము చేసిన తర్వాతనే గుడికి వెళ్ళాలి. భారతదేశములో నాలుగు మూలల వున్న నాలుగు దామాలలో మొదటిది రామేశ్వరం. మిగతావి ద్వారక, పురీ జగన్నాధ్, బదరీనాధ్.

8. నాగేశ్వరుడు

 

 

 


గుజరాత్ రాష్ట్రంలో ద్వారక నుంచి గోపితలావ్ వెళ్లే బస్సులో నాగనాధ్ వద్ద దిగి వెళ్ళవలెను. (గోమతి ద్వారక నుంచి సుమారు 14కి. మీ దూరము) చాలా చిన్న గ్రామం.
దారుకావనమున తారకాసురుడు తన పరివారముతో నివసించి , ఆ వనమున పోవు ప్రయాణికుల ధనమును దోచి, నానాహింసలు పెట్టుచున్నారు. సుప్రియుడను వైశ్యుడు గొప్ప వ్యాపారి, గొప్ప శివ భక్తుడు. సుప్రియుడు వ్యాపార నిమిత్తం ద్వారకా వనమున పోవు చుండగా, తారకుని అనుచరులు సుప్రియుడును, అతని సిబ్బందిని బంధించుకుపోయి, కారాగారమున ఉంచిరి. మహా భక్తుడగు సుప్రియుడు శివలింగధారి, మెడయందున్న లింగమును తీసి, అరచేతి యందుంచుకుని, పూజ చెయుచుండెను. దానిని చూచిన రాక్షస సేవకులు తారకాసురుడుకు చెప్పిరి. తారకాసురుడు సుప్రియునితో "నీవు దైవారాధన చేయవద్దు" అని చెప్పినా, శివ పంచాక్షరీ మంత్ర జపము చేయుచున్న సుప్రియుడు సమాధానము చెప్పలేదు. తారకాసరుడు కోపామును పట్టలేక తన చేతిలోని గదచె సుప్రియుని తలపై కొట్టబోవునంతలో, శంకరుడు అక్కడనే జ్యోతి రూపమున ఆవిర్భవించి, తారకుని సంహరించెను. సుప్రియుడు కోరికపై దారుకా వనమునందే "నాగలింగేశ్వర" నామముతో లింగరుపము ధరించెను. ఈ ప్రదేశమున పూర్వకాలమున నాగజాతి ప్రజలు నివసించేవారు. కావున ఈ జ్యోతిర్లింగమునకు "నాగేశ్వర లింగము" అని పేరు వచ్చింది.
ఈ గుడి నిర్మాణ తీరు వర్ణనాతీతం. పాండవకాలంలో చేసిన రాతి కట్టడం. నాలుగు స్థంబాల మీద నిర్మించిన ఈ గుడిలో, నాగేశ్వరుడు గర్భ గుడిలో పూజలందుకుంటాడు. ఇక్కడ చెప్పదగ్గ విశేషం ఎంటి అంటే, నందీశ్వరుడు మనకు శివునికి ఎదురుగా కనిపించడు. ఈ గుడి వెనుక వైపు నందీశ్వరునికి ప్రత్యేక దేవాలయం ఉంది. ఈ గుడికి చుట్టూరా 12జ్యోతిర్లింగాలను, 12దేవాలయాలలో ప్రతిష్ఠించి పూజిస్తున్నారు.