ఇష్టంతో పనిచేస్తే కష్టమంతా మరచిపోవచ్చు!

ఆఫీసులో పనిచేస్తున్న వారిలో పనిపట్ల శ్రద్ధలేకపోయినా, పని చేయడంలో విసుగు చిరాకు ప్రదర్శిస్తున్నా వారి సమస్య ఒత్తిడికాదు... పని ఒత్తిడి ఎక్కువైందని...! పనితో అలసిపోతున్నామని చెప్పేవారి సమస్య ఏమిటంటే వారికి ఆ పనిపట్ల ఇష్టం లేకపోవడం. అందువల్ల పనిమీద శ్రద్ధ చూపించలేకపోయారు. దాని వలన వారు పని ఒత్తిడి ఎక్కువైందని భావిస్తారు. అయిష్టంతో పనిని చేయడం వలన ఏ వ్యక్తి అయినా, ఆ పనిని రెండుసార్లు చేస్తారు. ఎన్నిసార్లు చేసినా ఆ పనిలో వారు చురుకుదనంగా ఉండరు. ఆ పనిని అంత సమర్థవంతంగా చేయలేరు. ఆ పనిపట్ల అయిష్టతకు కారణం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు, లేక వేరే ఇంకేమైనా కావచ్చు. అందువల్ల ఆవ్యక్తి ఆ పని పట్ల ఆసక్తి చూపకపోవచ్చు.  ఎప్పుడైనా మనం ఒక ఫీల్డ్లోకి వెళ్ళినపుడు, మనం మన  వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టాలి. ఆ ఫీల్డ్కి మనం ఇష్టంతో అంకితమవ్వాలి. అప్పుడు ఆ ఫీల్డ్కి మనం న్యాయం చేసినవారం అవుతాము. వ్యక్తిగత జీవితంలో ఎవరు హుషారుగా ఆనందంగా గడుపుతారో అటువంటివారే ఎంత ఒత్తిడినైనా తట్టుకుని, ఎంత పనైనా చేయగలుగుతారు. జీవితంలో తృప్తిగలవారికే పనిలోనూ తృప్తి లభిస్తుంది. జీవితాన్ని ఆనందించలేనివారు చిన్నచిన్న పనుల్లో కూడా చాలావరకు తప్పులనే చేస్తూ వుంటారు. "పనులు నువ్వు చేయడంలేదు. జరుగుతున్నాయ" అనే మాటను  గ్రహించి నిరహంకారంగా ఎవరి  కర్తవ్యం వారు నిర్వర్తించాలి. ఈ పని తర్వాత ఇంకేం చెయ్యాలి అని ఆలోచించకూడదు కేవలం చరిస్తూ వెళ్ళాలి. అలా ఆచరిస్తూంటే, ఒకదానివెంట మరొకటి అవే వస్తుంటాయి. మొదలుపెట్టిన పని సక్రమంగా పూర్తయితే ఆ పనిపట్ల నీవు ఇష్టతను చూపించావు అని అర్థం. మొదలుపెట్టినపని అవలేదంటే నీవు ఆ పనిపట్ల అయిష్టతను చూపించావు అని అర్థం. కొంతమంది ఇష్టంతో చేసినా ఆ పని ఆపలేదంటే దానికి కారణం ఆ పనిని వాయిదా వేయడం. ఇలా వాయిదా వేయడం వలన క్రమేపీ ఆ పనిపట్ల శ్రద్ధ తగ్గిపోతుంది. దీని వలన ఆ పనులు పూర్తికావు. అందువలన ఎప్పుడూ పనులను వాయిదా వేయకూడదు. కాబట్టి మనం ఏదైనా పనిని మొదలు పెట్టినపుడు ఆ పనిని ఇష్టంతో వాయిదా వేయకుండా ఆ పనిని త్వరగా పూర్తిచేసుకోవాలి. ఎప్పుడైన ఒక పనిని ఇష్టంతో చేస్తే ఆ పని కష్టమనిపించదు ఆ పనిలో విజయాన్ని పొందుతారు. ఎప్పుడైనా ఒక పనిని కష్టపడి చేస్తే మనకి ఆ పని కష్టంగా వుంటుంది. ఆ పని విజయవంతం కాదు. ఓటమి, విఘ్నం, అనేవి బయటెక్కడో లేవు. నీలోనే వున్నాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు కొందరు, ఇంకేదో విషయంపై ఉత్సాహంతోనే పనులు మానేస్తారు మరికొందరు. ఎప్పుడైనా సరే మనం ఏదైనా పనిని తలపెడితే ఆ పని అయ్యేవరకూ ఆ పనిపట్ల ఇష్టాన్ని చూపించాలి. అప్పుడే ఆ పనిలో ఆనందాన్ని పొందగలం. అలా చేస్తే ఇక విజయం మన  సొంతమవుతుంది. ఒక సాకర్ ఆటలో ఆటగాళ్ళను మారుస్తూ, ఒకరు సరిగ్గా ఆడకపోతే వారికి బదులు ఇంకొకరిని అడటానికి పంపవచ్చు. కానీ - జీవితం అలాకాదు. ఒకసారి ఏదైనా తప్పుచేస్తే, దాన్ని వెనక్కి తీసుకుని, దానిస్థానే ఇంకోపని చెయ్యటం కుదరదు. మీ జీవితంలో సంభవించిన విషాద సంఘటనలని వెనక్కి తిప్పి సరిచూసుకోడానికి మీకు రెండో అవకాశం దొరకదు.                                      ◆నిశ్శబ్ద.
Publish Date: May 7, 2024 10:30AM

నవ్వుల  చిత్రాలు ఎన్నెన్నో..!

నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత అయిన జంధ్యాల. ఈయన నవ్వు గురించి చెప్పినప్పుడు ఆ నవ్వు ప్రాముఖ్యత ప్రజలకు అంతగా తెలియలేదు. కానీ ఇప్పుడూ లాఫింగ్ క్లబ్బులు పెట్టుకుని మరీ నవ్వేస్తున్నారు. నవ్వు ఓ గొప్ప ఔషధం అని వైద్యులు కూడా క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నారు. ఒక చిన్న నవ్వుతో ఎలాంటి వారిని అయినా గెలవచ్చు, ఎంత కఠిన హృదయం గలవారిని అయినా మార్చేయచ్చు అంటారు. అసలు నవ్వుకు ఇంత గొప్ప శక్తి ఉందంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నవ్వుకున్న గొప్పదనాన్ని గుర్తుచేసుకుంటూ, నవ్వుతో ప్రపంచాన్ని కాస్తో కూస్తూ మార్చాలనే తపనతో ప్రతి ఏడాది నవ్వుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు కూడా. ఒక మనిషి జీవితంలో నవ్వు ఎంత మార్పు తెస్తుందో.. ఎలాంటి మార్పు తెస్తుందో కాసింత వివరంగా తెలుసుకుంటే ఔషధం.. నవ్వును ఔషధం అంటుంటే చాలామందికి కామెడీగా అనిపిస్తుంది కానీ ఇది అక్షరాలా నిజం. సైన్సే కూడా ఇదే నిజమని చెప్పింది. నవ్వినప్పుడు శరీరంలో విడుదల అయ్యే హ్యాపీ హార్మోన్లు మనిషికి ఉన్న ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటి మానసిక రుగ్మతలను సులువుగా తగ్గిస్తుంది. అందుకే నవ్వును ఔషధం అన్నారు. ప్రతి రోజూ ఉదయాన్నే ఎలాంటి సంకోచం లేకుండా కొన్ని సెకెన్ల నుండి నిమిషాల పాటూ  అలా పెదవులు సాగదీసి నవ్వితే ఇక ఆ రోజంతా చాలా హ్యాపీ మూమెంట్లోనే గడిచిపోతుంది. పాజిటివ్.. మనిషి జీవితంలో పాజిటివ్, నెగిటివ్ అంటూ రెండూ ఉన్నాయి. పాజిటివ్ ఆలోచనలు మనిషి జీవితంలో ఉన్నతికి తోడ్పడతాయి. నెగిటివ్ ఆలోచనలు ఉంటే మనిషి పతనానికి కారణం అవుతాయి. పాజిటివ్ వైబ్రేషన్ ను కలిగించడంలో నవ్వుదే కీలక  పాత్ర. ఎవరితోనైనా బాగా గొడవ పడినప్పుడు వారితో విభేదాలు వచ్చినప్పుడు ఇక వారితో మాట్లాడకుండా ఉండిపోతారు. కానీ వారు ఎప్పుడైనా తారసపడినప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వి చూడండి. పాత గొడవలు, కలహాలు అన్నీ మర్చిపోయి వారు కూడా తిరిగి నవ్వుతారు. మళ్ళీ బంధం చిగురిస్తుంది. విజయానికి మెట్టు.. నవ్వు విజయానికి తొలిమెట్టు అవుతుంది. నవ్వు వల్ల జీవితంలో ఎంత కష్టాన్ని అయినా సునాయాసంగా అధిగమించగలుగుతారు. ఎక్కడలేని ఓర్పు, సహనం, నవ్వుతో వచ్చేస్తాయి. నవ్వుతూ ఇంకొకరిని ఎంకరేజ్ చేస్తే ఇంకొకరు విజయంలో భాగస్వాములు కూడా అవుతారు. సంబంధాలు.. పైన చెప్పుకున్నట్టు.. మనుషుల మధ్య ఎలాంటి సమస్యలున్నా నవ్వు పరిష్కరిస్తుంది. ఎంత గొడవ వచ్చినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నవ్వుతూ సర్థి చెప్పడం వల్ల పెద్దగా మారాల్సిన గొడవలను చిన్నగా ఉండగానే పరిష్కరించుకోవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతరులు, ఆఫీసులో కొలీగ్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే నవ్వు వల్ల బలంగా ఉండే బంధాలు బోలెడు.                                                   *నిశ్శబ్ద.
Publish Date: May 6, 2024 11:05AM

వ్యక్తిత్వానికి అనుగుణంగా కెరీర్

మీ ఆసక్తి, వ్యక్తిత్వానికి సరిపోయే వృత్తిని ఎంచుకోవడం వ్యక్తిగత వృద్ధికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. జీవితంలో చాలా సార్లు డబ్బు కంటే ఆనందం, శాంతి ముఖ్యం. కాబట్టి, మీ అభిరుచులు, లక్షణాలను సరిగ్గా తెలుసుకుని కెరీర్‌ను ఎంచుకోండి. అందరూ ఇంజినీరింగ్ చేయలేరు. అందరూ డాక్టర్, లాయర్, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ కాలేరు. ప్రతి ఒక్కరూ బికామ్ లాగా కనీసం బ్యాచిలర్ డిగ్రీని కామర్స్‌లో పూర్తి చేయలేరు. మీరు ఏది చదివినా...అది జీవనోపాధి కోసమే పని చేయాలి. చాలామంది కొన్ని మంచి కోర్సులు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. చదువు తర్వాత ఉపాధిపరంగా కొన్ని కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ఉద్యోగం పొందడం సులభతరం చేసే అనేక విద్యా కోర్సులు ఉన్నాయి. కానీ, ఉద్యోగ సంతృప్తి కోసమే కాదు, వ్యక్తిత్వాన్ని కూడా వికసించాలి. చేసే పనిలో శాంతి ఉండాలి. అలా ఉండాలంటే మన వ్యక్తిత్వం, గుణం, స్వభావం, అభిరుచికి తగ్గట్టుగా ఉద్యోగం చేయాలి. ఈమధ్య ఈ కాన్సెప్ట్ బాగా పాపులర్ అయినప్పటికీ ఉద్యోగం సంపాదించాలనే కోరికతో ఏదో ఒకటి చేసేవాళ్ళు ఎక్కువ. దాంతో మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఏ వృత్తిని ఎంచుకున్నా మంచి వ్యక్తిత్వం ఉండాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. కానీ, ప్రస్తుతం అన్ని చోట్లా పోటీ నెలకొంది. అందువల్ల, చాలా మంది యువకులకు కెరీర్‌ను ఎంచుకోవడం డైలమాగా మారింది. అయితే ఉద్యోగం వస్తే చాలు అని ఆలోచించడం కంటే మీ అభిరుచికి, వ్యక్తిత్వానికి అనుగుణంగా ఉద్యోగాన్ని ఎంచుకోవడం సరైనది. దీని కోసం చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే మీ ఆసక్తుల గురించి స్పష్టంగా తెలుసుకోవడం. మీ సామర్థ్యాలను తెలుసుకోండి. మీరు మీ విలువలు, వ్యక్తిత్వానికి సరిపోయే ఉద్యోగాన్ని ఎంచుకుంటే విజయం సులభం అవుతుంది. ఏది నచ్చదు? మీకు నచ్చని వాటిని గుర్తించడం ఎంత ముఖ్యమో, మీకు ఏది ఇష్టమో గుర్తించడం కూడా అంతే ముఖ్యం. నలుగురితో కాలక్షేపం చేయనివారు మార్కెటింగ్ ఉద్యోగానికి సరిపోరు. నేడు సాధారణ విద్యను అభ్యసించిన వారికి అనేక రకాల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వాటిలో ఏది మీరు ఆనందించగలరో ఆలోచించండి. ఏది కష్టమో గ్రహించండి. బలహీనతలు ఏమిటి? ఒక వ్యక్తి ఎంత అవగాహన పెంచుకున్నా, కొన్ని స్వాభావిక గుణాలు పోవు. ఉదాహరణకు..మీది ఒంటరిగా ఉండే మనసతత్వం అయితే...ఒంటరిగా నిర్వహించగల ఉద్యోగం సరిపోతుంది. గ్రూప్ వర్క్ కు దూరంగా ఉండటం మంచిది. మీరు ఏ స్వభావాన్ని మార్చుకోలేరు అనేది మీ బలహీనత అని చెప్పవచ్చు. వాటిని గుర్తించండి. కార్యాలయంలో వారితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోండి. ఇలా చేయడం వల్ల లక్ష్యాన్ని చేరుకోవడం సులభం అవుతుంది. ఎక్కడ ఫిట్‌గా ఉంది..  కేవలం జీతం కోసం  ఇష్టం లేని ఉద్యోగం చేయనక్కర్లేదు. జీతం తక్కువే అయినా.. వేరే ఉద్యోగంలో ఆసక్తి ఉంటే.. ఆనందంగా అనిపిస్తే అక్కడికి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయవచ్చు. అయితే, ఎవరైనా ఆసక్తిని పదేపదే మార్చకూడదు. ఇది కాదు. ఒక నిర్దిష్ట వృత్తిలో ఒక సముచిత స్థానాన్ని కనుగొనాలి. అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు.
Publish Date: May 4, 2024 10:30AM

వైవాహిక జీవితం సంతోషంగా ఉండటానికి గోల్డెన్ రూల్స్ ఇవీ!

ప్రతి వ్యక్తి జీవితాన్ని పెళ్లికి ముందు, పెళ్ళి తర్వాత అని చాలా స్పష్టంగా విభజించి చెప్పవచ్చు.  ఎందుకంటే పెళ్లికి ముందు ఉన్న చాలా విషయాలు పెళ్ళి తర్వాత మారిపోతాయి. మరీ ముఖ్యంగా ఈ జనరేషన్లో  అమ్మాయిలు, అబ్బాయిలు వ్యక్తిత్వం పరంగా చాలా ఆత్మగౌరవం కలిగి ఉంటారు. ఏ చిన్న విషయాల్లోనూ రాజీ పడటానికి సిద్దంగా ఉండరు. ఈ కారణంగా ఇప్పటి కాలంలో పెళ్లవుతున్న వారి మధ్య గొడవలు, విడాకులు ఎక్కువ. పెళ్లయ్యాక భార్యాభర్తలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నా, వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ పెద్ద గొడవలకు దారి తీయకుండా సింపుల్ గా పరిష్కారం కావాలన్నా కొన్ని గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వాలి. రిలేషన్షిప్ నిపుణులు చెప్పిన ఆ గోల్డెన్ రూల్స్ ఏంటో తెలుసుకుంటే.. పెళ్ళి తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. అమ్మాయిలకు అయినా, అబ్బాయిలకు అయినా భాద్యతలు పెరుగుతాయి. ఇల్లు, ఉద్యోగం, స్నేహితులు, ఇతర పనులలో భార్యాభర్తలు ఒకరినొకరు నిర్లక్ష్యం చేయకూడదు. ఎన్ని పనులున్నా సరే.. భార్యాభర్తలిద్దరూ కొంతసమయం కేటాయించుకోవాలి.  కలసి మాట్లాడుకోవడం, కలసి భోజనం చేయడం, కలసి చర్చించడం,  ప్రతిరోజూ కనీసం గంటసేపు అయినా మాట్లాడాలనే నియమం పెట్టుకోవాలి. ఇలా చేస్తే వారి మధ్య  ఏ సమస్యలున్నా వాటిని మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు. అందుకే ఒకరికోసం ఒకరు సమయం కేటాయించుకోవడం ఎంతో ముఖ్యం. పెళ్ళికి ముందు కాబోయే జంట ఒకరి పట్ల మరొకరు చాలా ప్రేమగా ఉంటారు. ఒకరిని మరొకరు బుజ్జగించుకోవడం, ప్రేమ కురిపించడం, చాలా కేరింగ్ గా ఉండటం చేస్తారు. అయితే చాలామంది జీవతాలను గమనిస్తే పెళ్ళి తర్వాత ఈ సీన్ మొత్తం మారిపోతుంది.  కానీ ఇలా చేయడం మంచిది కాదు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు ప్రేమగా ఉండాలి. ఒకరి మీద మరొకరు అరుచుకోవడం, గొంతు పెంచి మాట్లాడటం వల్ల ఇద్దరి మధ్య  గొడవకు దారితీస్తుంది. భార్య చేసే ఏ పని అయినా భర్తకు నచ్చితే భార్యను మెచ్చుకోవడం అస్సలు మిస్ కాకూడదు.   భార్య వంట నచ్చినా, ఆమె ఇంటి పనిలో చలాకీగా ఉన్నా,  భర్తకు ప్రేమగా వడ్డించినా, ఇంటి పనిని, ఆఫీసు పనిని ఆమె సమర్థవంతంగా  బ్యాలెన్స్ చేస్తున్నా ఇలా ఏం చేసినా సరే భార్యను మెచ్చుకోవడానికి అస్సలు మొహమాటపడకూడదు. అలాగే  భర్త ప్రేమగా ఏం చేసినా భర్త వృత్తి, వ్యక్తిగతంగా ఏం చేసినా దాన్ని భార్య కూడా మెచ్చుకోవాలి. ఇలా చేస్తే భార్యాభర్తలకు ఒకరి మీద మరొకరికి ప్రేమ పెరుగుతుంది. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా మాట్లాడే తీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిని మరొకరు ఎలా మాట్లాడుతున్నారు అనేది వారి మధ్య బంధాన్ని నిర్ణయిస్తుంది. ఒకరితో ఒకరు మాట్లాడటం, ఒకరి మనసులో విషయాలు మరొకరితో షేర్ చేసుకోవడం, ఒకరు చెప్పేది మరొకరు శ్రద్దగా వినడం ఇవన్నీ బంధం పదిలంగా ఉండటానికి అవసరం. భార్యాభర్తల బంధం అంటే ఇక ఒకరి జీవితం మరొకరు చేతుల్లోకి వెళ్లినట్టే అని అనుకుంటారు కొందరు. కానీ భార్యాభర్తలు అలా ఉండకూడదు. స్పేస్ అనేది చాలా ముఖ్యం. స్పేస్ లేకపోతే బంధం కష్టంగా అనిపిస్తుంది. భాగస్వామి జీవితాన్ని మరీ గట్టిగా బంధించినట్టు, తనకు అన్ని విషయాలు తెలియాలి అన్నట్టు ఉండకూడదు. ముఖ్యంగా కంట్రోల్ చేయడం, కమాండ్ చేయడం అస్సలు మంచిది కాదు. ఎవరి సొంత అభిప్రాయాలు, ఆలోచనలు, సంతోషాలు వారికి ఉండటం మంచిది.                                             *రూపశ్రీ. 
Publish Date: May 3, 2024 12:15PM

ప్రమాదాలను కొనితెచ్చుకునే మనస్తత్వం!

కొంతమందికి ఎప్పుడూ ఏదో ఒక దెబ్బ తగులుతూ ఉంటుంది! ఒంటి మీద ఎప్పుడూ ఏదో ఒక గాయం కనిపిస్తూనే ఉంటుంది. వాళ్లని చూసి పాపం దురదృష్టవంతులు అని మిగతావారు జాలిపడుతూ ఉంటారు. కానీ తరచూ ఏదో ఒక ప్రమాదానికి లోనవ్వడానికీ మన వ్యక్తిత్వానికీ సంబంధం ఉండవచ్చని ఊహిస్తున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఇలాంటి మనస్తత్వాన్ని ‘Accident Prone Psychology’ అంటున్నారు. అదేమిటో తెలుసుకుంటే మనకీ కాస్త ఉపయోగపడుతుందేమో... ఓ ఆలోచన! తరచూ కొంతమందే ఎందుకు దెబ్బలు తగిలించుకుంటారన్న అనుమానం 19వ శతాబ్ది మొదటిలోనే వచ్చింది. దీని మీద మరిన్ని పరిశోధనలు చేసిన గ్రీన్‌వుడ్ వంటి నిపుణులు మన ఆలోచనా విధానానికీ, ప్రమాదాలకి సంబంధం ఉండే అవకాశం ఉందని తేల్చారు. ఆ తరువాత వచ్చిన ఎన్నో పరిశోధనల్లో ఓ 20 శాతం మంది వ్యక్తులే అధికశాతం ప్రమాదాలకి కారణం అవుతూ ఉంటారనీ... మొత్తంగా మన చుట్టూ జరిగే ప్రమాదాలలో దాదాపు 75 శాతం ప్రమాదాలు మానవ తప్పిదం వల్లే ఏర్పడతాయని చెబుతూ వస్తున్నాయి. ఈ పరిశోధనల శాస్త్రీయతని చాలామంది కొట్టిపారేసినా, వీటిలో స్పృశించిన చాలా అంశాలు చాలా తార్కికమైనవే! అందుకనే కొన్ని భీమా కంపెనీలు ప్రమాదభీమాను చెల్లించేటప్పుడు, ఉత్పాదక సంస్థలు తమ ఉద్యోగులను హెచ్చరించేందుకూ ఈ పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి.   ప్రమాదాన్ని ఆశించే వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువగా ఉన్నారు, దూకుడుగా ఉండేవారు, నిరంతరం కోపంతో రగిలిపోయేవారు... పోయి పోయి ఏదో ఒక ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారని తేలింది. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు కూడా ప్రమాదాలకి త్వరగా లోనవుతారని చాలా పరిశోధనలు వెల్లడించాయి. ఏదన్నా కుటుంబంలో ఒకరి తరువాత ఒకరు ప్రమాదానికి లోనవడం మనం గమనిస్తూ ఉంటాము. ఆ కుటుంబానికి ఏదో శాపం తగిలిందనో, వారి గ్రహస్థితి బాగోలేదనో అనుకుంటాము. నిజానికి ఇలా కుటుంబంలో ఎవరన్నా ఒకరు తీవ్ర ప్రమాదానికి లోనైతే, ఆ ప్రభావం ఇతరుల మనసు మీద కూడా పడుతుందనీ... ఆ ఒత్తిడిలో మిగతా సభ్యులు కూడా ప్రమాదానికి లోనయ్యే అవకాశం 20 శాతం ఉంటుందనీ ఓ పరిశోధన తేల్చింది. ఎవరైతే ఇతరుల సలహాలను, సహాయాన్నీ స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారో... వారు త్వరగా ప్రమాదాలకు లోనుకారని తేలింది. అహంకారం లేకుండా, తొందరపడకుండా ఉండేవారికి ప్రమాదాలు కూడా ఆమడదూరంలో ఉంటాయని 2001లో జరిగిన ఒక పరిశోధన రుజువు చేసింది. అంటే నిదానమే ప్రధానం, నోరు మంచిదైతే ఊరు మంచిది లాంటి సామెతలు యాంత్రిక జీవితానికి కూడా వర్తిస్తాయన్నమాట.     ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా తొందరపాటు, దూకుడు, ద్వేషం, అహంకారం... మనిషి విచక్షణను దెబ్బతీస్తాయి. తన మీద తనకి ఉండాల్సిన నియంత్రణను ప్రభావితం చేస్తాయి. దాంతో ఒక అనర్థం జరగడం సహజమే! కానీ ఇలాంటివారు కేవలం తమకి మాత్రమే ప్రమాదాన్ని తెచ్చుకుంటే ఫర్వాలేదు. అలా కాకుండా ఈ ‘Accident Prone Psychology’ ఉన్నవారు ఏ విమానాన్నో నడుపుతుంటే! అందుకే ఈ తరహా వ్యక్తిత్వం గురించి నానాటికీ ప్రచారం పెరుగుతోంది. మీది ప్రమాదాన్ని కొని తెచ్చుకునే వ్యక్తిత్వమేమో గమనించుకోండి అంటూ కొన్ని వెబ్‌సైట్లు పరీక్షలు పెడుతున్నాయి. మున్ముందు ఉద్యోగులకు కూడా ఇలాంటి పరీక్షలను నిర్వహించి విధుల్లోకి తీసుకునే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు!   - నిర్జర.
Publish Date: May 2, 2024 10:30AM

అమ్మాయి లవ్ చేస్తోందో లేదో అని డౌటా.. ఈ 7 విషయాలు గమనించి ఇట్టే తెలుసుకోవచ్చు!

ప్రేమ అనేది  ఇప్పట్లో చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు ప్రేమ అంటే అబ్బాయిలు మాత్రమే ధైర్యం చేసి చెప్పేది.. అమ్మాయిలకు అంగీకారం ఉంటే తదుపరి వారి బంధం మరో మలుపు తిరిగేది.. కానీ ఇప్పుడు అట్లా కాదు.. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ ప్రేమ విషయంలో బాగా అడ్వాంటేజ్ గా ఉంటున్నారు. అయితే చిక్కల్లా ఒకమ్మాయి తమకు బాగా తెలిసి, తమతో సన్నిహితంగా ఉంటూ తమను లవ్ చేస్తుందా లేదా  అనే విషయం అర్థం కాక జట్టు  పీక్కునే అబ్బాయిల గురించే..   అయితే దీనికి ఈజీగానే చెక్ పెట్టవచ్చు అమ్మాయిలు తమను ప్రేమిస్తున్నారా లేదా అనే విషయాన్ని అబ్బాయిలు ఈ 7 విషయాల ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటంటే.. అమ్మాయిలు తమకు ఎంత పని ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా వారి మనసులో ఒక అబ్బాయి పట్ల ప్రేమ ఉంటే వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఫోన్ లో అయినా, మెసేజ్ లో అయినా, వ్యక్తిగతంగా కలవడంలో అయినా తను ప్రేమించిన అబ్బాయిని ఎప్పుడూ లైట్ తీసుకోదు. తను ఇష్టపడుతున్న అబ్బాయితో సన్నిహితంగా ఉండటానికి అమ్మాయిలు అబద్దాలు చెప్తారు. మాట్లాడటానికో, కలసి నడుస్తున్నప్పుడో, పక్కపక్కన కూర్చున్నప్పుడో తాకడం, చెయ్యి పట్టుకోవడం, నవ్వడం, నవ్వించడం వంటివి చేస్తారు. ప్రతి అమ్మాయికి తను ఇష్టపడే అబ్బాయి మరొకరితో సన్నిహితంగా మాట్లాడితే కోపం వస్తుంది. అలాగే అసూయ పడుతుంది. ఒకమ్మాయి తను ఇష్టపడుతున్న అబ్బాయి ఇతర అమ్మాయిలతో మాట్లాడుతుంటే అలాగే ఫీలవుతుంది. కొన్నిసార్లు తను ప్రేమించిన అబ్బాయి  ముందు కోపాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. అమ్మాయి తను ప్రేమిస్తున్న అబ్బాయి కళ్లలోకి చూసి మాట్లాడాలంటే చాలా ఇష్టపడుతుంది. అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్లలోకి చూస్తూ మాట్లాడుతుంటే ఆమెకు ప్రేమ ఉన్నట్టే. అమ్మాయిలు తాము ప్రేమిస్తున్న అబ్బాయిలు అందుబాటులో కాస్త దూరంగా ఉంటే ఇక చూపులన్నీ తను ప్రేమిస్తున్న అబ్బాయి వైపే ఉంచుతుంది. ఎలాంటి పరిస్థితిలో అయినా సరే.. అమ్మాయి తను ఇష్టపడే అబ్బాయి కదలికలను గమనించడానికి, అతన్ని చూడటానికి ఇష్టపడుతుంది. అబ్బాయికి నచ్చిన పని చేయడానికి, నచ్చిన వస్తువులు, నచ్చిన ఆహారం తీసుకొచ్చి ఇవ్వడానికి అమ్మాయి శ్రద్ద చూపిస్తున్నట్టైతే అది సాధారణ పరిచయం లేదా స్నేహం అనుకోవడానికి వీల్లేదు. ఏ మూలో అమ్మాయికి తప్పకుండా అబ్బాయి మీద ఇష్టముందని అర్థం. అమ్మాయిలు తమకు ఏ చిన్న బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా అబ్బాయితో చెబుతుంటే ఆమెకు అతను చాలా స్పెషలని అర్థం. అంతేకాదు తను ఇష్టపడుతున్న అబ్బాయి పక్కన ఉంటే ఆమె తన బాధలన్నీ మర్చిపోతుంది. అమ్మాయి ఇలా చేస్తుంటే ఆమె ప్రేమిస్తోందనే అర్థం.                                                         *నిశ్శబ్ద.  
Publish Date: May 1, 2024 11:17AM

ఈ  విషయాలు  ఎట్టి పరిస్థితిలో ఎవ్వరికీ చెప్పకూడదు!

  మనసులో ఏదీ దాచుకోలేకపోవడం చాలా మంది బలహీనత. బాధ అయినా, సంతోషం అయినా, దుఃఖం అయినా తనకు తెలిసిన వారికో లేక స్నేహితులు, ఆత్మీయులకో ఏదో ఒక  సందర్భంలో చెప్పుకుని తీరతారు. అయితే ఇలా చెప్పడం తప్పని కాదు కానీ.. కొన్ని విషయాలు మాత్రం ఇతరులతో అస్సలు చెప్పడం మంచిది కాదని అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేష నిపుణులు. ఏ వ్యక్తి అయినా ఇతరులతో అస్సలు చెప్పకూడని 5 విషయాలేంటో తెలుసుకుని వాటిని పాటిస్తే  వారి జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది. ఆ అయిదు విషయాలేంటో తెలుసుకుంటే.. ఆర్థిక స్థితి.. ఉద్యోగం చేసేవారు అయినా వ్యాపారం చేసేవారు అయినా పొదుపు చేసేవారు అయినా తమ ఆర్థిక స్థితి గురించి మరో వ్యక్తికి చెప్పడం మంచిది కాదు. ప్రతి వ్యక్తి ఆర్థిక స్థితి సామాజిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. డబ్బును చూసి మనుషులు మసలుకునే కాలమిది. ఎవరిదగ్గరైనా డబ్బు ఎక్కువ ఉందని తెలిసినా, ఎక్కువ సంపాదిస్తున్నారని తెలిసినా అప్పు కోసం, సహాయాల కోసం సులువుగా చుట్టూ చేరతారు. పక్క మనిషి గురించి పట్టించుకోని ఈ కాలంలో ఆర్థిక సహాయాలు చెయ్యడం అంత మంచిది కాదు. అందుకే ఆర్థిక స్థితి గురించి ఎవరికీ చెప్పకూడదు. ఇంటి సమస్యలు.. ప్రతి ఇంట్లోనూ సమస్యలుంటాయి. ఇంటి సమస్యలను ఇంటి వారితో చర్చించి వాటిని చక్కబెట్టుకోవడం శ్రేయస్కరం. అలా కాకుండా సలహాలు, సూచనలు ఇస్తారనో లేదా మనసులో భారం దించుకోవాలనే ఆలోచనతోనో ఇంటి సమస్యలు బయటి వారికి, తెలిసిన వారికి చెప్పడం మంచిది కాదు. రిలేషన్ గొడవలు..  నిజానికి తోబుట్టువులు, చుట్టాలు, బాగా దగ్గరి వారైనా సరే.. భార్యాభర్తల సమస్యలలో జోక్యం చేసుకోవడం, తీర్పులు ఇవ్వడం మంచిది కాదు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గొడవలు, సమస్యలు వారే పరిష్కరించుకుంటే వారిద్దరికి ఒకరి మీద మరొకరికి గౌరవం పెరుగుతుంది. ఏ సమస్యకైనా ప్రతి వ్యక్తి స్పందన వేరుగా ఉంటుంది. అనుభవాలు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి సమస్యలను బయటకు, లేదా ఇతరుల దగ్గరకు తీసుకెళ్లడం, చెప్పడం మంచిది కాదు. మూడవ వ్యక్తికి భార్యాభర్తల సమస్యలు చెబితే వారు దాన్ని ఎంటర్టైన్మెంట్ గా చూస్తారు. బలహీనతలు.. ప్రతి వ్యక్తిలోనూ బలాలతో పాటూ బలహీనతలు ఉంటాయి. చాలామంది వ్యక్తులలో లోపాలు, బలహీనతలను వెతుకుతారు. వాటిని వేలెత్తి చూపిస్తారు. విమర్శిస్తారు. అందుకే వ్యక్తులలో బలాలు బయటపెట్టినా సమస్య లేదు కానీ బలహీనతల గురించి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరికీ చెప్పకూడదు. ప్రణాళికలు.. పెద్ద పెద్ద విషయాల గురించి నిర్ణయాలు తీసుకునే ముందు, పెద్ద ప్రణాళికలు వేసుకునేటప్పుడు వాటిని మరొక వ్యక్తితో చెప్పకూడదు. జీవితంలో ఇంకా ఎదిగే దశలో వేసుకునే ప్రణాళికలు ఇతరులతో చెప్పకూడదు.                                                      *రూపశ్రీ.  
Publish Date: Apr 30, 2024 11:29AM

స్లీపింగ్ డైవొర్స్.. ఇదో కొత్త విడాకుల పోకడ.. భార్యాభర్తలకు దీంతో ఎంత లాస్ అంటే...

మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అయ్యాయని ఒకప్పుడు చెప్పుకునేవాళ్లం. అది ఇప్పటికీ ఉంది కానీ.. మానవ సంబంధాలు మరికొన్ని కొత్త రూపాలకు దారి మళ్లాయి. ఒకప్పుడు వైవాహిక జీవితంలో ఏ సమస్య వచ్చినా  దాన్ని పరిష్కరించుకోవడం, సర్థుకోవడం చేసేవారు. కానీ ఇప్పుడలా కాదు.. ఏ సమస్య వచ్చినా దాన్ని తెగెవరకు లాగి అదే సమస్యకు పరిష్కారం అని అనుకుంటున్నారు. ప్రస్తుతం చాలా వైరల్ అవుతున్న విషయం స్లీపింగ్ డైవొర్స్.. అసలు స్లీపింగ్ డైవొర్స్ అంటే ఏంటి? దీనివల్ల భార్యాభర్తలకు జరిగే నష్టం ఏంటి తెలుసుకుంటే.. పెళ్లైన భార్యాభర్తలు  ఒకే గదిలో ఉన్నప్పుడు వారు కలిసి నిద్రపోతారు.  ఇద్దరూ విడివిడిగా పడుకోవడం ప్రారంభిస్తే వారి మధ్య ఏదో సరిగ్గా జరగడం లేదనే అనుమానం వస్తుంది.  సాధారణంగా భార్యాభర్తలు ఇక ఇద్దరూ కలిసి జీవించలేమని నిర్ణయించుకున్న తరువాత విడాకులు తీసుకుంటారు. కానీ ఈ స్లీపింగ్ డైవొర్స్ అనేవి బంధాన్ని తెంచుకునే విడాకులు కాదు.. నాణ్యమైన నిద్ర పొందడానికి భాగస్వాములు విడివిడిగా నిద్రపోవడానికి తీసుకునే విడాకులు. సాధారణంగా భాగస్వాములు నిద్రలో చేతులు,  కాళ్లను కదిలించడం వల్ల, గురకకు అలవాటు పడడం వల్ల లేదా ఏదైనా నిద్ర రుగ్మత కారణంగా పక్కవారి నిద్రకు డిస్టర్బ్ కలిగిస్తూ ఉంటారు. కానీ ఈ స్లీపింగ్ డైవొర్స్ కారణంగా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, ఇద్దరు హాయిగా నిద్రపోతారని  అనుకుంటున్నారు. కానీ  ఇది సమస్యను పరిష్కరించడానికి బదులుగా వారి మధ్య బంధాన్నిబలహీనపరుస్తుంది. నిద్ర కోసం ఈ స్లీపింగ్ డైవొర్స్ తీసుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. అయినా సరే ఈ డైవొర్స్ స్లీపింగ్ వల్ల జంట మధ్య బంధం బలహీనపడుతుందని రిలేషన్షిప్ నిపుణులు నొక్కి వక్కాణిస్తున్నారు. ఇద్దరూ విడివిడిగా పడుకోవడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా వారిని ఎప్పటికీ కలిపి ఉంచేది వారిద్దరి మధ్య శారీరక స్పర్శే.. అది కూడా వారిమధ్య లేనప్పుడు  ఇక ఇద్దరినీ కలిపి ఉంచే మార్గమేదీ ఉండదు. ఒకే ఇంట్లో ఇద్దరూ అపరిచితుల్లా చాలా  కొద్ది కాలంలోనే మారిపోతారు. మరొక విషయం ఏమిటంటే ఇలా ఇద్దరూ విడివిడిగా పడుకోవడం అనేది దీర్ఘకాలం జరిగితే వైవాహిక బంధాలు విచ్చిన్నమై వాటి విలువ కూడా తగ్గిపోతుంది. ఆరోగ్యకరమైన నిద్రకోసం భార్యాభర్తలు ఇద్దరూ ఆరోగ్యకరమైన పద్దతులు ఎంచుకోవాలి. వైద్యుల సలహా తీసుకుని నిద్రకు బంగం కలిగించే సమస్యలను పరిష్కించుకోవాలి.                                              *రూపశ్రీ.  
Publish Date: Apr 29, 2024 10:30AM

సమ్మర్ కి ఇద్దాం షేక్ హ్యాండ్!

వేసవికాలం వచ్చిందంటే వామ్మో అంటాము. మండిపోయే ఎండలు, మగ్గబెట్టే ఉక్కపోత, వీటికి తోడు కరెంట్ కోతలు. ఉదయం, సాయంత్రం తప్ప ఏ మధ్యాహ్నపు ఎండలోనో బయటకు వెళ్లాల్సిన అవసరం వచ్చిందంటే గుండె గుభేలుమంటుంది. అందుకే ఎండ అంటే చెప్పలేనంత మంట అందరికీ. కానీ సమయం గడుస్తూ ఉంటే ఈ కాలాలు అదేనండి వర్షాకాలం, చలికాలం వచ్చినట్టు ఎండాకాలం కూడా రాక తప్పదు. అది తన ప్రతాపం చూపించక తప్పదు. అయితే ఈ వేసవిని చూసి భయపడటానికి ఎన్ని కారణాలు ఉన్నాయో, దీన్ని ఎంజాయ్ చేయడానికి అన్నే మార్గాలు ఉన్నాయి. ఓసారి తెలుసుకుంటే సమ్మర్ మీద హమ్మర్ తో ఓ మోస్తరు సౌండ్ చేయచ్చు. ఒకప్పుడు!! సంవత్సరకాలం అంతా పిల్లలు ఎదురుచూసేరోజులు ఇవే అంటే ఆశ్చర్యమేస్తుంది. నిజంగానే వేసవి కోసం పిల్లలు అర్రులు చాచేవాళ్ళు. ఒక పూట బడి ముగియగానే ఎండను కూడా లెక్కచేయకుండా బావుల వెంట, చేల వెంట వెల్తూ ఎన్నో మధురస్మృతులను మూటగట్టుకునేవాళ్ళు. ఓ ముప్పై సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళను పిలిచి బాల్యం గురించి చెప్పమంటే కళ్ళు మెరవడం, చిరునవ్వు బయటకు రావడం ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి.  అందుకే అన్ని కాలలను ఒకేలా పుస్తకాల మధ్య కాకుండా కాసింత ప్రత్యేకంగా గడిపేలా మీ పిల్లలకు ఏర్పాటు చేయండి. అది వాళ్లకు ఆసక్తికరమై, వాళ్ళ సంతోషానికి కారణమయ్యేది అయ్యుండాలి సుమా!! ప్రకృతి ఆతిథ్యం!! నిజంగా నిజమే. వేసవిలో ప్రకృతి ఎంత గొప్ప ఆతిథ్యం ఇస్తుందని. అవన్నీ చాలా వరకు ఇప్పటి తరానికి తెలియకుండా ఉన్నాయి. వాళ్లకు ఓసారి పరిచయం చేసి చూడండి. నాచురల్ లైఫ్ మీద లవ్ లో పడతారు వాళ్ళు. పుల్లని విందు!! బలే బలే పసందు ఈ పుల్లని విందు. అదే అదే ఫలాల రాజు మామిడి గారు ఎంతో ఠీవిగా చెట్లలో పెరిగి అందరినీ పలకరించడానికి ఇంటింటికి వస్తాడు. అందరి నోర్లు జలపాతాలు చేస్తాడు.  చెరకు చరిష్మా!! చిన్నప్పటి దంతాల రహస్యం. నోటితోనే చెరకు పొట్టు తీసి, కొరికి, కసకస నమిలి, రసాన్ని జుర్రుకుంటూ పిప్పిని పడేస్తే ఆహా ఉంటుంది ఆ నాలుగు అదృష్టం ఎంతో అనిపిస్తుంది. ఇప్పట్లో అంత సీన్లు లేకపోయినా ఎంచక్కా రోడ్ సైడ్ దొరికే చెరకు రసం తాగేసి హాయి హాయిగా వెళ్లిపోవచ్చు.  ఇవి మచ్చుకు రెండు మాత్రమే. ఇంకా చింతచిగురు వేరే లెవెల్. తాటి ముంజలు మరొక ఎత్తు, చల్ల చల్లటి మజ్జిగ, శరీర తాపాన్ని తగ్గించే పుదీనా శరబత్ ఇవన్నీ హైలైట్.  అయితే మరొక మ్యాజిక్ కూడా ఉంది. అదే కేవలం రాయలసీమ ప్రాంతంలో లభ్యమయ్యే సుగంధి సిరప్. కేవలం కడప జిల్లాలో అడవులలో మాత్రమే పెరిగే సుగంధ మొక్కల వేర్లను ఉడికించి పంచదార కలిపి సిరప్ చేసి అమ్ముతుంటారు. సువాసన అద్భుతంగా ఉంటుంది. చల్లని నీళ్లు, లేదా షోడాతో ఈ సిరప్ కలిపి తీసుకుంటే వేసవి కాలం వెంట తీసుకొచ్చే వడదెబ్బ వంద కిలోమీటర్లు పరిగెత్తి పరిగెత్తి పారిపోతుంది. శరీర వేడిని తక్షణమే తగ్గిస్తుంది.  వేసవి భయం అసలు వద్దు!! ఎవరు ఎన్ని చెప్పుకున్నా బయటకు వెళ్ళేవాళ్లకు అదొక భయం. సర్రుమని కాలిపోతున్న రోడ్లన్నీ నరకంలో యమధర్మరాజు ఏర్పాటు చేసినట్టు అనుభూతి కలుగుతుంది. అందుకే సులువైన, మరియు అందరూ ఆచరించగల జాగ్రత్తలు. బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. మరి నీళ్లు అయిపోతే?? ఏముంది ఏకంగా బాటల్  కొనే పని తప్పుతుంది ఎక్కడో ఒక చోట అయిదు రూపాయల్లో బాటల్ నింపుకోవచ్చు. లేదు కాదు అంటే 20 నుండి 30 పెట్టి వాటర్ బాటిల్ కొనేబదులు ఎంచక్కా ఫ్రూట్ జ్యూస్, లేదా నిమ్మ షోడా వంటివి తాగడం హాయి. వేసవి తాపాన్ని తగ్గిస్తాయి ఇవి. ఇవి కాకుండా మరొక సలహా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కీరా దోస, పుచ్చకాయ వంటి నీరు అధికంగా ఉన్నవి తినడం లేదా జ్యూస్ తాగడం మంచిది. ఉప్పు, కారం, మసాలాలు వంటివి తగ్గించుకోవాలి ఈ కాలంలో. శరీర ఉష్ణోగ్రత మీద అవి ప్రభావం చూపిస్తాయి.  వెంట గొడుగు ఉంచుకోవడం మర్చిపోకండి. లేదంటే టోపి, లేదా స్పార్క్ ఇలా ఎదో ఒకటి నెత్తిని కప్పి ఉంచేలా జాగ్రత్త పడాలి. వీలైనంత వరకు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు వెళ్లేలా చూసుకోవాలి. మధ్యలో సమయం అంతా ఇంటి పట్టున లేదా ఉద్యోగాలు చేసే ప్రాంతాలలో ఉండటం మంచిది. ఇలా చెప్పుకుంటూ పోతే వేసవి కోసం బోలెడు మార్గాలు. అయితే మనం ఎంత డాబు చెప్పుకున్నా ఈ ఎండల కొరడా దెబ్బకు ఒళ్ళు చురుక్కుమనడం సాధారణం. అందుకే దాని నుండి జాగ్రత్త మరి. జాగ్రత్తగా షేక్ హాండ్ ఇచ్చి కూల్ గా డీల్ చేసి పంపిద్దాం.                                     ◆వెంకటేష్ పువ్వాడ.
Publish Date: Apr 28, 2024 10:30AM

ఇంట్రోవర్ట్ లను తక్కువ అంచనా వేయకండి.. వీళ్ల గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు!

ఇంట్రోవర్ట్.. ఎవ్వరితోనూ ఎక్కువ కలవరు. ఎవరైనా పలకరించినా, మాట్లాడినా ఎప్పుడెప్పుడు అక్కడి నుండి పారిపోదామా అని ఎదురు చూస్తుంటారు. ఎప్పుడూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు.  ఒంటరిగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతారు. ఈ కారణంగానే ఇంట్రోవర్ట్ అనే మాట బయటకు తెలిస్తే అదేదో వాళ్లకు ఏదో జబ్బు ఉందన్నట్టు ట్రీట్ చేస్తూ ఉంటుంది సమాజం. అయితే ఇంట్రోవర్ట్ లను తేలిగ్గా తీసిపడేయకూడదని, ఇంట్రోవర్ట్ లు గా ఉండి ప్రపంచాన్ని తమ ప్రతిభ ద్వారా, విజయాల ద్వారా ఆకర్షించిన వారి గురించి తెలిస్తే వాళ్లను తక్కువ అంచనా అస్సలు వేయకూడదని అనిపిస్తుంది. ఇంట్రోవర్ట్ ల గురించి.. మనిషన్నాక సందర్భాన్ని బట్టి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అయితే అందరూ మాట్లాడటం అస్సలు అవసరం లేదు. కొంతమంది మౌనంగా ఉండి తమ ఎనర్జీ లెవెల్‌ని మెయింటైన్ చేసి దానిని తమ శక్తిగా మార్చుకోవడానికి ఇష్టపడతారు. ఇది ఏదో మాటవరుసకు చెబుతున్నది కాదు. సాక్షాత్తూ మైయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్ పరిశోధన ఇలా చెబుతోంది. గ్లోబల్ శాంపిల్‌పై అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని 56.8% మంది వ్యక్తులు అంతర్ముఖులుగా ఉన్నారు.  అంటే తమతో తాము ఉండటానికి  లేదా మౌనంగా ఉండటానికి వీరు ఇష్టపడతారు. బహిర్ముఖ వ్యక్తుల కంటే  అంతర్ముఖులే ఎక్కువ విజయాలు సాధిస్తారని, ప్రపంచ రూపురేఖలను మార్చిన ఎంతో మంది ప్రసిద్ద వ్యక్తులు అంతర్ముఖులే అని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. తక్కువ మాట్లాడటం.. సమయానికి మాట్లాడటం.. కొందరు వ్యక్తులు అంతర్ముఖులతో వ్యవహరించడం కొంచెం కష్టమని అంటుంటారు. ఎందుకంటే అంతర్ముఖులు తమ భావాలను ఎవరికీ చెప్పరు. కానీ తక్కువ మాట్లాడటం అంటే ఏదో దాచడం అని కాదు. పరిశోధన ప్రకారం అంతర్ముఖులు ఆలోచనాత్మకంగా మాట్లాడతారు. వారి  మాటలు చాలా విస్తృతంగా సరైన కారణాలతో కూడుకుని ఉంటాయి. వీరు ఎవరికీ త్వరగా స్పందించరు. ఎమోషనల్ అటాచ్మెంట్ తక్కువగా ఉంటుంది.  అందుకే  ఇతర వ్యక్తుల కంటే వీళ్లు   సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వీరు వారికి నచ్చింది మాత్రమే మాట్లాడుతారు. ఒంటరితనమే బలం.. మానసిక  రోగుల వైద్యుల అభిప్రాయం ప్రకారం అంతర్ముఖ వ్యక్తులు బహిర్ముఖుల కంటే బలంగా , శక్తివంతంగా ఉంటారు. ఎందుకంటే వారు ప్రతి పరిస్థితిని ప్రశాంతంగా, తెలివిగా ఆలోచిస్తారు. దానికి తగినట్టే నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రశాంత స్వభావం కారణంగా ఇంట్రోవర్ట్ లు  ఎప్పుడూ కోపం తెచ్చుకోరు. లేదా దూషించే మాటలు మాట్లాడరు.  సాధారణంగా వీరు ఇతరులకు చాలా పొగరు వ్యక్తులుగా అనిపిస్తారు. కానీ వీరు అర్థమయ్యే కొద్దీ.. వీరి మీద గౌరవం పెరుగుతుంది. మానసికంగా దృఢంగా.. అంతర్ముఖులు తమ భావోద్వేగాలను బయటకు  వ్యక్తం చేయకపోవచ్చు. కానీ వారు మానసికంగా బలంగా ఉంటారు. వీరు సులభంగా ఎవరికీ  భయపడరు. తక్కువ మాట్లాడటం వల్ల  వీరిని చాలామంది పిరికివాళ్లు అని అంటూ ఉంటారు. కానీ అంతర్ముఖుల శక్తి అసాధ్యం. వారు మానసికంగా దృఢంగా ఉంటారు. జ్ఞాపకశక్తి ఎక్కువ.. 2007లో రష్యాలో అంతర్ముఖులపై నిర్వహించిన పరిశోధనలో   వీరు ఏవైనా సంఘటనలు, విషయాలను చాలా కాలంపాటూ గుర్తుంచుకుంటారని తెలిసింది. ఎందుకంటే ఇంట్రోవర్ట్ వ్యక్తులకు ఫ్రంటల్ లోబ్‌లో ఎక్కువ రక్త ప్రసరణ ఉంటుంది. ఫ్రంటల్ లోబ్ అనేది మెదడులోని జ్ఞాపకాలను నిల్వ చేసే భాగం. ఇది సమస్యలకు పరిష్కాలు ఆలోచించడం, సరైన ప్రణాళికలు రచించడం వంటి విషయాలలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల అంతర్ముఖులు బాగా ప్రణాళిక వేయడంలో ,సమస్యలను పరిష్కరించడంలో కూడా తెలివిగా ఉంటారు.  లాజిక్‌పై దృష్టి పెట్టడంతో పాటు, వీరు  సృజనాత్మకంగా , శక్తివంతంగా ఉంటారు.                                          *నిశ్శబ్ద.
Publish Date: Apr 27, 2024 11:29AM

స్నేహం, ప్రేమ మధ్య తేడా గుర్తించడం ఎలా.. ఇదిగో ఇలా!

ప్రేమ, స్నేహం రెండు కవలపిల్లల లాంటివి. చూడ్డానికి రెండు ఒకేలా ఉంటాయి. కానీ చాలా సున్నితమైన వ్యత్యాసాలు దాగుంటాయి. స్నేహం ప్రేమ లానూ, ప్రేమ స్నేహం లానూ అనిపించి చాలా మందిని గందరగోళ పెడుతుంది. మరీ ముఖ్యంగా నేటి కాలంలో జెండర్ తో సంబంధం లేకుండా అమ్మాయిలు, అబ్బాయిలు ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. అమ్మాయిలు స్నేహం అనుకున్నా. దాన్ని ప్రేమగా భావించే అబ్బాయిలు, అబ్బాయిలు స్నేహం అనుకుంటే దాన్ని ప్రేమగా భ్రమ పడే అమ్మాయిలు బోలెడుమంది ఉన్నారు. నిజానికి ఈ వ్యత్యాసం తెలుసుకోలేక చాలామంది స్నేహాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తమది స్నేహమా?? లేక ప్రేమా?? అనే విషయం గురించి అమ్మాయిలలో ఉండే సందేహాలు క్లియర్ చేసుకుంటే.. అసూయ చూపిస్తున్నారా? ఒక వ్యక్తికి చాలా మంది స్నేహితులు ఉండవచ్చు, కానీ మీరు మీ స్నేహితుడికి దగ్గరగా ఉన్న వారిని చూసి మీకు అసూయగా అనిపించినప్పుడు, లేదా మీరు ఇతరులతో చాలా దగ్గరగా ఉన్నప్పుడు మీ స్నేహితుడు అసూయగా ఫీలవుతుంటే మీ మధ్య స్నేహం ప్రేమగా మారుతుందని అర్థం. ఉదాహరణకు  ఇతరులకు దగ్గర ఉండటం, వారితో సినిమాలు, పార్టీలు, మొదలైన వాటికి ఆసక్తి చూపిస్తూ వెళ్ళడం చేస్తే అవన్నీ చూసి స్నేహితుడు లేదా స్నేహితురాలు చిటపటలాడుతున్నా, కోప్పడుతున్నా, అలుగుతున్నా  వారితో స్నేహం కంటే ఎక్కువ అనుభూతి చెందుతున్నారని అర్థం. ఏకాంతం కోరుకుంటున్నారా? సాధారణంగా స్నేహితులు అంటే ఒక బ్యాచ్ గా ఉంటారు. వీళ్లలో కొందరు అమ్మయిలు, మరికొందరు అబ్బాయిలు కూడా ఉంటారు. అయితే ఇంతమంది స్నేహితులలో కేవలం ఒక్కరితోనే ఏకాంతంగా ఉండాలని అనిపిస్తుంటే అది స్నేహం కంటే ఎక్కువ భావనను సూచిస్తుంది.  పదే పదే గుర్తుచేసుకోవడం.. చాలా వరకు స్నేహితులతో సమయం గడిపిన తరువాత ఇంటి పనుల్లోనూ ఇతర కార్యకలాపాలలోను మునిగిపోతుంటారు. కానీ అలా కాకుండా కేవలం ఒకే ఒక్కరి గురించి పదే పదే ఆలోచిస్తున్నా, వారితో మాట్లాడాలని అనిపిస్తున్నా వారు మిగిలిన వారికంటే చాలా స్పెషల్ అని అర్థం.  ప్రాధాన్యత.. ఎంతమందిలో ఎప్పుడు ఏ విషయం గురించి మాట్లాడుతున్న తమ స్నేహితుడు లేదా స్నేహితురాలి గురించి ప్రస్తావిస్తూ, తమ మధ్య ఉండే సాన్నిత్యన్ని బయటకు గర్వంగా చెప్పుకుంటున్నా, ఇతరులకంటే వారిని ఎక్కువగా పరిచయం చేస్తున్నా, వారికి అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, వారంటే ప్రత్యేక భావన అని అర్థం. ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిల మధ్య జెండర్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఈ కారణంగా చాలామంది తొందరగా ఫ్రెండ్స్ అయిపోతారు. అయితే ఈ ఆకర్షణ కారణంగా ఏర్పడే స్నేహం, ఆకర్షణ ఉన్నంత వరకు ఉంటుంది. ఈలోపు నిజంగా స్నేహం వెల్లివిరిస్తే.. అది ప్రత్యేక సాన్నిత్యం కోరుకుండా..  కష్టసుఖాలు చెప్పుకోవడానికి, కష్టసమయంలో సాయం చేసుకోవడానికి తోడుగా ఉండేది అయితే స్నేహమే.. ప్రేమకు, స్నేహానికి  మధ్య సన్నని గీతను గుర్తెరగాలి.                                   *నిశ్శబ్ద.
Publish Date: Apr 26, 2024 10:30AM

భార్యలు భర్తల నుండి ఏం కోరుకుంటారు...బంధం దృఢంగా ఉండటానికి ఏది ముఖ్యం?

విజయవంతమైన,  సంతోషకరమైన వివాహా బంధానికి ప్రేమ మాత్రమే ముఖ్యం  కాదు. బంధంలో  భార్యను సంతోషంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం.  ప్రతి భార్యకు తన భర్త నుండి కొన్ని అంచనాలు ఉంటాయి.  అవి నెరవేరితే బంధంలో తగాదాలు తగ్గుతాయి.   బంధం కూడా బలపడుతుంది. అవి నేరవేరకపోతే మాత్రం బంధం బలహీనంగా మారుతుంది. చిన్న ప్రయత్నాలు మానవ సంబంధాలలో దేనినైనా బలోపేతం చేయగలవు.  భార్యాభర్తల సంబంధం విషయానికి వస్తే అది మరింత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వివాహం అనేది ఒక పవిత్ర బంధం. దీనిలో ప్రేమ, గౌరవం,  అవగాహన అనే పునాదిపై కలిసి జీవితాన్నిగడపాల్సి ఉంటుంది.   ఇది పరస్పర అవగాహనతోనూ, బంధంలో పలు విషయాల పట్ల సహనంతో ఉండటం ద్వారా జరుగుతుంది. స్త్రీలు తమ భర్తల గురించి కొన్ని అంచనాలను కలిగి ఉంటారు. వాటిని నెరవేర్చడం ద్వారా ఏ భర్త అయినా తన భార్యను సంతోషంగా ఉంచగలడు. భార్యలు భర్తల నుంచి ఏమి ఆశిస్తారో తెలుసుకుంటే.. ప్రేమ.. ప్రతి స్త్రీ తన భర్త నుండి ప్రేమ,  ఎమోషనల్ సపోర్ట్ ఆశిస్తుంది. ఉద్యోగం చేసే మహిళ అయినా లేదా గృహిణి అయినా.. ఇద్దరూ తమ జీవిత భాగస్వామి అడుగడుగునా తమకు తోడ్పాటు అందించాలని కోరుకుంటారు. ప్రేమను వ్యక్తపరచడం కూడా వారికి ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా భార్యాభర్తల బంధం లోతుగా, దృఢంగా మారుతుంది. శ్రద్ద..  ఒకరిని ఎంతగా ప్రేమిస్తున్నారో వ్యక్తం చేయడానికి ఉత్తమ మార్గం వారి పట్ల శ్రద్ధ వహించడం.  భార్యకు ఇంటి పనిలో సహాయం చేయడం, ఆమె మానసిక స్థితి సరిగా లేకుంటే ఆమె ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి ప్రయత్నించడం, ఆమె అనారోగ్యంతో లేదా ఇతర పనులలో బాగా బిజీగా ఉన్నట్లయితే ఆమెకు ఇష్టమైన ఆహారాన్ని వండడం లేదా ఆర్డర్ చేయడం,  ఆమెకు తినిపించడం, ఆమె చెప్పేది శ్రద్ధగా వినడం, ఆమె కోసం సమయం కేటాయించడం..  ఇవన్నీ చిన్నవి కానీ శ్రద్ధ చూపిస్తున్నామని చెప్పడానికి ఇవి చాలా మంచి మార్గాలు. గౌరవం.. ఏదైనా సంబంధానికి పునాది గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. భార్యలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వని భర్తలు ఎందరో ఉన్నారు. వివాహిత సంబంధంలో దీనిని పొందడానికి భార్యలు ఎక్కువగా పోరాడవలసి ఉంటుంది. భార్యలు తమ భర్తలను ప్రేమించడమే కాకుండా వారి అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని, సమానంగా చూడాలని,  తమ ఆత్మగౌరవాన్ని తమకు ఇష్టమైనవారి దగ్గర   దెబ్బతీయకూడదని భార్యలు కోరుకుంటారు. భర్త ఇవన్నీ చేస్తే భార్యలు తమను ఎంతగా గౌరవిస్తారో గ్రహించగలుగుతారు కమ్యూనికేషన్.. భార్యాభర్తల మధ్య ఎలాంటి సంకోచం లేకుండా ఓపెన్ కమ్యూనికేషన్ ఉండటం చాలా ముఖ్యం. భార్య తన భర్త తనతో ప్రతిదీ పంచుకోవాలని,  జడ్జ్ చేయకుండా జాగ్రత్తగా వినాలని కోరుకుంటుంది. భార్యాభర్తల బంధంలో  ఒకరికొకరు నిజాయితీగా,  మంచి  నమ్మకంతో  కలిగి ఉండటం చాలా ముఖ్యం. కానీ ఫలానా వ్యక్తి వల్ల భార్య అభద్రతా భావంతో బాధపడుతుంటే, భర్త ఆమెను పట్టించుకోకుండా ఉండటం సరికాదు.  ఈ భావాన్ని తొలగించడానికి భర్త ప్రయత్నించాలి. తద్వారా వారి మధ్య నమ్మకం బలపడుతుంది. అవగాహన.. భార్యాభర్తల మధ్య సంబంధాలలో పరస్పర అవగాహన చాలా ముఖ్యం. చాలా మంది మహిళలు తమ భర్తలు తమను అర్థం చేసుకోవడం లేదని భార్యలను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని మనస్తత్వంతో ఉంటారని ఫిర్యాదు చేస్తారు. కానీ ప్రతి భర్త తన భార్య ఇష్టాలు,  అభిరుచులను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇదే వారి బంధానికి శ్రీరామ రక్ష.                                                             *నిశ్శబ్ద.
Publish Date: Apr 25, 2024 11:34AM

భార్యాభర్తలలో ఉండే ఈ అలవాట్లు ఏకంగా విడిపోవడానికి దారితీస్తాయ్!

  ఈ ప్రపంచంలో భార్యభర్తల బంధం చాలా గొప్పది. ఈ బంధాన్ని పదిలంగా ఉంచుకోవాల్సిన బాధ్యత భార్యాభర్తల మీదనే  ఆధారపడి ఉంటుంది.  సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపడానికి, పరస్పర అవగాహన, ప్రేమ,  నమ్మకం వంటివి అవసరం. సహజంగానే విభిన్న స్వభావం గల ఇద్దరు వ్యక్తులు ఒకచోట ఉన్నప్పుడు  అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. కానీ వాటిని పరిష్కరించడానికి భార్యాభర్తలిద్దరూ కూర్చుని అవగాహనతో నెమ్మదిగా మాట్లాడుకోవడం ముఖ్యం.  సంబంధాలలో చిన్న చిన్న తగాదాలు సాధారణం. కానీ ఇవి  ఎప్పుడో ఒకసారి జరిగితే పర్లేదు. కానీ ఎప్పుడూ ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటే మాత్రం దీని గురించి ఆలోచించాల్సిందే.. ముఖ్యంగా భార్యాభర్తలలో ఉండే కొన్ని అలవాట్ల కారణంగా గొడవలు ఎక్కువగా అవుతుంటాయి. వీటి గురించి భార్యాభర్తలు జాగ్రత్త తీసుకుంటే వారి బంధం పదిలంగా ఉంటుంది. కమ్యూనికేషన్ లేకపోవడం.. ఏదైనా సమస్యను పరిష్కరించడానికి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అవసరం. ఇద్దరి మధ్య  తగాదాలు ఉన్నా  దాన్ని ఆపకుండా   ఉంటే లేదా  సమస్యను వదిలి అప్పటికే ముందుగా ఉన్న తగాదా గురించే మాటిమాటికి మాట్లాడుతూ ఉంటే అది బంధం విచ్చిన్నం కావడానికి దారితీస్తుంది. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగుంటేనే సమస్యలు ఏవైనా పరిష్కారం అవుతాయి. బాధ్యతల నుండి తప్పించుకోవడం.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసినా లేదా ఒకరే ఉద్యోగం చేసినా ఇంటిపని, బయటి పని అనే బాధ్యతలను విభజించుకోవాలి. పనిని ఎగ్గొట్టడం, తప్పించుకోవడం, పని లేకుండా ప్లాన్ చేయడం వంటివి   ఇద్దరి మధ్య గొడవకు దారితీస్తుంది. దీని కారణంగా  చాలా గొడవలు జరుగుతాయి. గౌరవించకపోవడం..  వైవాహిక జీవితం అనే బండి  సజావుగా నడవడానికి అవసరమైన మరొక విషయం ఒకరినొకరు గౌరవించడం. ఒకరి పనిని మెచ్చుకోండి,  ఇద్దరి బంధంలో ఒకరి ప్రాధాన్యతను మరొకరు గుర్తించాలి.  భాగస్వామిలో లోపాలను వెతుకుతూ, వారిలో మంచి విషయాన్ని గ్రహించకుండా ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటే వైవాహిక బంధం నాశనం అవుతుంది. అనవసర కోపాలు.. కొందరికి చిన్న విషయాలకు చటుక్కున కోపం వస్తుంది. చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం, అనవసరంగా కోపం తెచ్చుకోవడం... ఇవి  భార్యాభర్తల బంధంలో   గొడవలకు కారణం కావచ్చు. ఎప్పుడూ  కోపంగా ఉండే భాగస్వామితో మాట్లాడటం  కష్టం.  కోపం ఎెందుకు వస్తుందనే విషయం గురించి ఓపెన్ గా మాట్లాడాలి తప్పితే భాగస్వామి ముందు అనవసరంగా కోపం తెచ్చుకుంటే బంధం నిలవదు.                                           *రూపశ్రీ.  
Publish Date: Apr 24, 2024 11:00AM

పిల్లలు బాగా ఎమోషన్ అవుతున్నారా? ఇలా హ్యాండిల్ చేయండి!

పిల్లలు ఎదిగే కొద్దీ తమ చుట్టూ ఉన్న పరిస్థితులకు అణుగుణంగా తామూ కనెక్ట్ అవుతారు. ఈ కారణంగా వారు భావోద్వేగాలకు లోను కావడం జరుగుతుంది.  పిల్లల ముఖంలో సంతోషమైనా, సరదా అయినా అందరూ ఎంజాయ్ చేస్తారు. కానీ వారు బాధపడినా, ఏడ్చినా, కోపాన్ని వ్యక్తం చేసినా, బయటకు చెప్పుకోలేని బాధకు లోనైనా అవి తల్లిదండ్రులు భరించలేరు. మరొక విషయం ఏమిటంటే ఈ భావోద్వేగాలు ఒక పరిధి వరకు ఉంటే పర్వాలేదు. కానీ పరిధికి మించిన భావోద్వేగాలు ఉంటే వాటిని హ్యండిల్ చేయడం తల్లిదండ్రుల కర్తవ్యం.  బాగా ఎమోషన్ అయ్యే పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుంటే..  పిల్లల భావోద్వేగాలను నియంత్రించడానికి ముందు తల్లిదండ్రులు  స్వంతంగా తమ భావోద్వేగాలను  నియంత్రించుకోవాలి. లోతైన శ్వాస తీసుకోవాలి. తమ మీద తాము దృష్టి కేంద్రీకరించుకోవాలి.  సహనం,  అవగాహనతో పరిస్థితిని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని  ప్రశాంతంగా ఉన్నప్పుడు పిల్లలే తమ బాధను ఓపెన్ గా చెప్పుకోవడానికి తల్లిదండ్రులే బెస్ట్ అని అర్థం చేసుకుంటారు. తల్లిదండ్రులు బ్యాలెన్స్డ్  గా ఉన్నప్పుడు పిల్లలను కూడా బ్యాలెన్స్ చెయ్యగలుగుతారు. పిల్లలు భావోద్వేగానికి లోనవుతున్నప్పుడు పిల్లలకు బాధపడద్దని, ఇదేమంత పెద్ద వియం కాదు ఎందుకు బాధపడుతున్నావని  చెప్పకూడదు. ఇలా చెప్తే వారిలో నిరుత్సాహం కలుగుతుంది. నా బాధ నా తల్లిదండ్రులకు అర్థం కావడం లేదు అని వారు ఫీలవుతారు. అలా కాకుండా పిల్లలు బాధపడుతున్నప్పుడు దాని వెనుక విషయాన్ని నెమ్మదిగా అడిగి అది ఎంత వరకు బాధపడాల్సిన సందర్భమో వారికి వివరించి చెప్తే వారి ఎమోషన్ ఎంతవరకు కరెక్టో వారికి అర్థమవుతుంది. చిన్నపిల్లలకు భావోద్వేగాలను మాటల్లో వ్యక్తం చెయ్యడం రాదు. వారికి తెలిసిందల్లా ఏడవడం, దిగులుగా కూర్చోవడం మాత్రమే. అలా కాకుండా పిల్లలకు భావోద్వేగాలను ఎలా వ్యక్తం చెయ్యలో.. భావోద్వేగాలను వ్యక్తం చెయ్యడానికి ఎలాంటి మాటలు ఉపయోగిస్తారో అవి మెల్లిగా నేర్పించాలి.దీనివల్ల పిల్లల భావోద్వేగం, వారి బాధ ఎంత స్థాయిలో ఉందో అందరికీ అర్థమవుతుంది.  దాన్ని బట్టి తల్లిదండ్రులు పిల్లలను ఊరడించవచ్చు. పిల్లల భావోద్వేగాలకు గల కారణాలను గుర్తించడం, వాటి పరిష్కార దిశగా ఆలోచించడం, ఎలా పరిష్కరించాలో పిల్లలకే నేర్పించడం తల్లిదండ్రులు చెయ్యాలి. దీనివల్ల పిల్లలు భవిష్యత్తులో వారి సమస్యలను వారే పరిష్కరించుకునే దిశగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. పిల్లల మనసులో భావోద్వేగాలు ఏమున్నా వాటిని స్వంతంగా ఎలాంటి ఎమోషన్స్ ఉపయోగించకుండా చాలా సాధారణంగా వాటిని వ్యక్తం చేసేలా చూడాలి. అలా చేస్తే పిల్లలు వారి భావోద్వేగాలను కూడా నియంత్రణలో ఉంచుకుంటారు. భావోద్వేగాలను ఎక్కడ బయటపెట్టాలి?  ఎక్కడ బయటపెట్టకూడదు? వంటి విషయాలను పిల్లలు తెలుసుకుంటారు.                                              *రూపశ్రీ.  
Publish Date: Apr 23, 2024 11:04AM

పరులకు ఉపకారం చెయ్యడం ఎందుకంత గొప్ప??

జీవితాలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటాయి. అన్నీ సానుకూలంగా అమరిన భద్రమైన జీవితాలు చాలామందికి అసాధ్యం. అలాంటి వారి సమస్యల్లో 1ఏ ఒక్కటైనా మనం తీర్చే ప్రయత్నం చేసినప్పుడే మనకు అసలైన ఆత్మసంతృప్తి లభిస్తుంది. కళాశాలలో చదువుకునే రోజుల్లో, తన తోటి విద్యార్థులకు ఫీజు డబ్బులు లేనప్పుడు స్వామి వివేకానంద తనే ముందుండి ఆ సమస్యను తీర్చేవారు. ఎదుటి వారి ఏ చిన్న కష్టాన్నైనా తనదిగానే భావించి తపించిపోయేవారు. మరొకరి కాలికి ముల్లు గుచ్చుకుంటే, తన కంటిలో గుచ్చుకున్నంత విలవిల్లాడిపోయేవారు. అందుకే ఆయన మహానుభావులయ్యారు. ఇప్పటికీ కొంతమంది యువతీ యువకులు తమ జీతంలో కొంత మిగుల్చుకొని, అనాథలకు, అభాగ్యులకు సహాయపడుతూ ఉంటారు. తమ సరదాలను కొన్నింటిని త్యాగం చేసుకొని, అవసరమైన చిన్నారులకు, ఆర్తులకు పంచుతూ ఉంటారు. వారు నిజంగా అభినందనీయులు, ధన్యులు! ఇలాంటి పునాదిరాళ్ళయిన యువతరంపైనే నవసమాజం నిర్మాణమవుతుంది. ఆధారం లేక అలమటించే వారికి ఏ కొంత చేయూతనిచ్చి, వారి ముఖాన చిరునవ్వులు చిందింపజేసినా అది మంచి మనస్సులకు చిరాయువు నిస్తుంది. అందుకే రాల్ఫ్ వాడో ఎమర్సన్ Make yourself necessary to somebody' అంటారు. మనకున్నదాన్ని ఒకరితో పంచుకోవడానికి, మనస్సు ముందు కాస్త గింజుకుంటుంది. అయినా ఇవ్వడంలోని ఆనందాన్ని మనస్సుకు అలవాటు చేయాలి. ఆనక అది పొందే ఉల్లాసాన్ని అనుభూతి చెందమనాలి.    ఊపిరున్నప్పుడే ఇచ్ఛగా నీవు ఇవ్వగలిగినంతా ఇచ్చేయ్. ఇవ్వలేనని పిడికిట్లో దాచుకొని కూర్చుంటే, మృత్యువు బలవంతంగా నీ మణికట్టు పట్టుకొని పిడికిలి విడిపించి మరీ ఇప్పించేస్తుంది అంటోంది దివ్య ఖురాన్, ఇలా బాధగా ఇవ్వడం కన్నా ఇష్టంతో ముందే నలుగురికి పంచి ఇవ్వడంలో ఎంతో ఆనందం దాగి ఉంటుంది. ఒకరి నుంచి మనం ఏదైనా స్వీకరిస్తున్నప్పటి కన్నా, ఒకరికి మనం ఇస్తున్నప్పుడే ఎక్కువ ఆత్మవిశ్వాసం, ఆనందం కలుగుతాయని.. ఆధునిక మానసిక శాస్త్రవేత్తలు కూడా తమ పరిశోధనలో స్పష్టం చేశారు. అదేవిధంగా ఒకరికి ఇవ్వకుండా, తామొక్కరే దాచుకొని తినే అలవాటు భవిష్యత్తులో ఒక రకమైన మానసిక వ్యాధికి కూడా దారితీస్తుందని వైద్యులు తమ పరిశీలనలో తేల్చారు. మన మనుగడలో విలువైన, చెప్పుకోదగ్గ సందర్భాలు, గుర్తుచేసుకొని గర్వపడే సంఘటనలు ఏవైనా ఉన్నాయంటే, అవి కేవలం ఇతరులకు మనం సహాయపడ్డ క్షణాలే! భగవంతుడు కూడా పరిగణనలోకి తీసుకునేది ఆ మంచి పనుల్నే! అయితే మితిమీరుతున్న మన ఆశలు దేనినీ వదులుకోనీయడం లేదు. కాస్త కూర మిగిలినా ఫ్రిజ్లో పెట్టుకొని రేపు తిందామనీ, పాతబట్టలుంటే స్టీల్ సామగ్రికి మార్చుకుందామనేంత కక్కుర్తికి దారితీస్తున్నాయి. ఇలాంటి ధోరణి మనల్నే కాదు, ఇంట్లో మనల్ని గమనిస్తున్న చిన్నారులను కూడా సంకుచిత స్వభావులుగా మార్చేస్తుంది. మనకు సరిపడ్డాకనైనా ఇతరులకు ఇద్దామన్న దయాగుణం, పరోపకార తత్త్వం మనకు లేకపోతే మనల్ని చూసి మూగజీవాలు కూడా తలదించుకుంటాయి. మన సనాతన ధర్మం పరోపకారానికి ప్రముఖమైన స్థానాన్ని కల్పిస్తూ...  పరోపకారః కర్తవ్యః ప్రాణై రపి ధనై రపి|  పరోపకారం పుణ్యం న స్యా త్రతు శతై రపి ॥  'కష్టపడి సంపాదించిన ధనమిచ్చి అయినా, చివరకు ప్రాణమిచ్చి అయినా పరోపకారం చేయాలి. నూరుయజ్ఞాల వల్ల కలిగే పుణ్యం కూడా పరోపకారంతో సమానం కాదు'అని హితవు పలుకుతోంది.                                       *నిశ్శబ్ద.
Publish Date: Apr 22, 2024 10:30AM