ఉండిలో ప్రచారం ఆపేసిన వైసీపీ.. ఎందుకంటే?

రఘురామకృష్ణం రాజు.. పరిచయం అక్కర్లేని పేరు. గత నాలుగున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వ అరాచకాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న వ్యక్తి. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా నరసాపురం లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించిన రఘురామకృష్ణం రోజు.. ఆ తరువాత కొద్ది రోజులకే జగన్ విధానాలతో విభేదించి రెబల్ గా మారారు. నిత్యం జగన్ అరాచకపాలనను విమర్శిస్తూ వచ్చారు. ఆ క్రమంలో ఆయనపై జగన్ సర్కార్ కేసులు బనాయించింది. ఆయనను కస్టడీలోకి తీసుకుని ధర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించింది. అయితే అన్నిటినీ తట్టుకుని జగన్ అస్తవ్యస్థ, అరాచక, అసమర్థ పాలనపై అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన కూటమి అభ్యర్థిగా నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా నరసాపురం లోక్ సభ స్థానం బీజేపీకి దక్కడంతో ఆయన ఆ పార్టీ నుంచే పోటీ చేస్తారని అంతా భావించినా, ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో చంద్రబాబు రంగంలోకి దిగి రఘురామకృష్ణం రాజును తెలుగుదేశంలో చేర్చుకుని ఆయనకు ఉండి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఉండిలో తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఆయనను బుజ్జగించి మరీ చంద్రబాబు ఉండి నుంచి రఘురామకృష్ణం రాజును బరిలోకి దింపారు. తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు రఘురామకృష్ణం రాజు విజయం కోసం చురుకుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఉండిలో తెలుగుదేశం టికెట్ ఆశించి భంగపడిన  శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.  తొలుత శివరామ రాజు వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధపడినప్పటికీ తెలుగుదేశం ఓట్లు చీల్చడం కోసం ఆయనను రెబల్ గా పోటీ చేయాలని జగన్ సూచించడంతో ఆయన ఇప్పుడు ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.  ఇంతలో ఏమైందో ఏమో కానీ గత కొన్ని రోజులుగా ఉండిలో వైసీపీ ప్రచారం నిలిచిపోయింది. విశ్వసనీయ సమాచారం మేరకు పార్టీ అధినేత జగన్ స్వయంగా ఉండిలో పార్టీ నేతలు, క్యాడర్ కు ప్రచారాన్ని నిలిపివేయాలనీ, అలాగో డబ్బులు కూడా వ్యయం చేయవద్దనీ ఆదేశించారు. జగన్ స్వయంగా వైసీపీ అభ్యర్థి నరసింహరాజుకు ఫోన్ చేసి నియోజకవర్గంలో ప్రచారాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. ఇందు వల్ల తెలుగుదేశం రెబల్ అభ్యర్థికి ప్రయోజనం చేకూరుతుందనీ, శివరామరాజు తన సొంత పలుకుబడితో తెలుగుదేశం ఓట్లను చీల్చే అవకాశం ఉంటుందనీ జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికీ నియోజకవర్గంలో రఘురామకృష్ణం రాజు ప్రచారంలో ముందున్నారు. ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. రెబల్ ఉనికి ఉండిలో నామమాత్రంగానే ఉందని పరిశీలకులు అంటున్నారు. ఈ స్థితిలో వైకాపా రెబల్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారాన్నిఆపివేయడం రఘురామకృష్ణం రాజుకే ప్లస్ అవుతుందని విశ్లేషిస్తున్నారు.  
Publish Date: May 8, 2024 6:04PM

ఏబీవీ సస్పెన్షన్ ను కొట్టేసిన క్యాట్!

సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్  ఏబీ  వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను క్యాట్ కొట్టేసింది. తనను రెండో సారి జగన్ సర్కార్ సస్పెండ్ చేయాడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ లో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఏబీవీ పిటిషన్ పై వాదనలు పూర్తై తీర్పు రిజర్వ్ చేసిన క్యాట్ ఆ తీర్పును రిజర్వ్ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావును రెండో సారి సస్పెండ్ చేయడం న్యాయ విరుద్ధమని క్యాట్ స్పష్టం చేసింది.  ఆయనను తక్షణమే సర్వీసులోనికి తీసుకుని   ఏరియర్స్ మొత్తం చెల్లించాలని ఆదేశించింది. ఏబీవెంకటేశ్వరరావు సస్పెన్షన్  చట్ట విరుద్ధమని దేశ సర్వెన్నత న్యాయస్థానం విస్పష్ట తీర్పు ఇచ్చిన తరువాత కూడా ఆయన రెండో సారి సస్పెండ్ చేయడం వేధింపుల కిందకే వస్తుందని క్యాట్ తన తీర్పులో పేర్కొంది.   నిఘా పరికరాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ రావుపై ఏసీబీ కేసు నమోదు చేయడంతో న్యాయ వివాదం మొదలైంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.  తన సస్పెన్షన్ ను ఏబీవీ క్యాట్ లో సవాల్ చేశారు. అయితే అప్పట్లో క్యాట్ ఏబీవీ సస్పెన్షన్ ను సమర్ధించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు క్యాట్  నిర్ణయాన్ని కొట్టివేసింది. ఆయనను విధుల్లోకి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పును జగన్ సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో సుప్రీం కోర్టు ఆదేశానుసారం రాష్ట్రప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేసి విధుల్లోకి తీసుకుంది. అయితే ఇలా విధుల్లోకి తీసుకున్నట్లే తీసుకుని మళ్లీ పాత ఆరోపణలతో రెండో సారి సస్పెండ్ చేసింది.  ఒకే ఆరోపణలపై రెండో సారి సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఏబీవీ క్యాట్ ను ఆశ్రయించారు. క్యాట్ ఆయన సస్పెన్షన్ ఎత్తివేసింది. 
Publish Date: May 8, 2024 5:41PM

ఏపీలో ల్యాండ్ మైన్‌లా పేలిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్!

ఏపీ ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్  ప్రచారాస్త్రంగా మారింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023ను రాష్ట్రంలో ఎంపిక చేసిన 16 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మంగా అమలు చేస్తున్నారు. ఇటీవల ఏపీ రిజిస్ట్రేషన్ కమిషనర్ ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎంపిక చేసిన 16 సబ్ రిజిస్టర్ ఆఫీసుల పరిధిలో స్థిరాస్తుల కొనుగోలుదారులకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ బదులు జిరాక్స్ పత్రాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వివాదం అలుముకుంది. దేశంలో తొలిసారి అమలవుతున్న ఈ చట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తం అవుతోంది.  ఈ చట్టం భూకబ్జాదారులకు వరంగా మారుతుందని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇప్పటికే చేసిన సర్వేలో తమ భూమి పరిణామం తగ్గిపోయిందని గగ్గోలు పెడుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. ఇవన్నీ కలిసి వైసీపీ సర్కార్ కు ఘోర ప‌రాభ‌వం త‌ప్పేట‌ట్లు లేదు. భూములు జోలికి వచ్చిన ఏ ప్రభుత్వానికైనా ప్ర‌జ‌లు బుద్ధి చెబుతారు. తెలంగాణాలో అదే జ‌రిగింది. కేసీఆర్ ఓడిపోవ‌డానికి  ధరణి కూడా ఒక కార‌ణం.  ఈ చట్టం వల్ల కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ప్రచారం ఉద్ధృతంగా సాగింది. గ్రామాల్లోనూ లెక్కకు మించి  సమస్యలు వచ్చాయి. రెవిన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగిన రైతులు పడిన బాధలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేశారు.  ఇప్పుడు ఏపీలో అదే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణాలో ధ‌ర‌ణి లాగే, ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..  ఏపీ పాలిటిక్స్‌లో ల్యాండ్ మైన్‌లా పేలింది. ప్రభుత్వం భూములు గుంజుకునేందుకే ఈ చట్టాన్ని తెచ్చిందని విపక్షాలు. లేదు మీ భూముల పరిరక్షణకే ఈ చట్టమని అధికార పక్షం ఇలా ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. ఈ చట్టంలోని లొసుగులపై విస్తృత చర్చ జరుగుతోంది. ఒక్కో అంశం.. ఎంత ప్రమాదకమైనదో లాయర్ల విశ్లేషణలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ భయం ఏర్పడుతోంది. ఇది వైసీపీకి పెను సవాల్ గా మారింది.   సంక్షేమ పథకాలను అమలు పర్చినా, కేసీఆర్ ఇటీవ‌ల‌ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కేసీఆర్ పదేళ్ల నుంచి అమలు చేసిన సంక్షేమ పథకాలు, గతంలో తెలంగాణ ప్రజలు ఏ ప్రభుత్వం నుంచి అందుకోలేదు. ఒకటా.. రెండా.. చివరకు దళితబంధు కింద పది లక్ష రూపాయలను కూడా ఇస్తూ ఆ ఓటు బ్యాంకును సొంతం చేసుకునే ప్రయత్నాలు చేశారు. ఇక రైతు భరోసా కింద నిధులు ఒక ఎకరం నుంచి ఎన్ని ఎకరాలున్నా అందచేశారు.  అయినా ఓడిపోయారు.  ఓడిపోవ‌డానికి అనేక కారణాలున్నాయి. అందులో ఒకటి ధరణి పోర్టల్ అని చెప్ప‌వ‌చ్చు. ధరణి పోర్టల్ తెచ్చి భూములను గుంజుకోవడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నమేనని కాంగ్రెస్ చేసిన ప్రచారానికి ప్రజలు పడిపోయారు. కేసీఆర్ ఓటమికి ధరణి పోర్టల్ ప్ర‌ధాన కారణమని చెప్పుకోవ‌చ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై... ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ తెలుగుదేశం పార్టీ రైతులను ఆకట్టుకునేందుకు అలాంటి అంశాన్నే భుజానకెత్తుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తెచ్చి జగన్ ఏపీ ప్రజల భూములను దోచుకోవడానికి ప్లాన్ వేశారంటూ పెద్దయెత్తున ప్రచారం చేస్తుంది.   ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టమని, దీనివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని వైసీపీ చెబుతున్నప్పటికీ అది ఎంత మేరకు రైతుల మైండ్ కు చేరుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.  పట్టాదారు పాస్ పుస్తకాలపై... ఇప్పటికే పట్టాదారు పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి జగన్ ఫొటోను ముద్రించడాన్ని కూడా టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. ప్రభుత్వాలు శాశ్వతమని, ముఖ్యమంత్రులు కారని, అలాంటిది పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోను ఎలా ముద్రిస్తారంటూ టీడీపీ నేతలు పెద్దయెత్తున ప్రచారం చేస్తున్నారు.  జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే పల్లవి అందుకున్నారు. దీంతో వైసీపీకి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.  బడా పారిశ్రామికవేత్తలకు భూ సేకరణలో వివాదాలు లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని న్యాయవాదులు చెబుతున్నారు.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: May 8, 2024 5:31PM

జగన్‌కి ఓటు వేస్తే... వీటికి ఒప్పుకున్నట్లే!

ఈ ఎన్నికలలో ఎవరైనా ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ ఓటరు ఈ క్రింది విషయాలను ఒప్పుకున్నట్లే అని సోషల్ మీడియాలో ఒక బాధ్యతగల పౌరుడు స్పందించాడు. నిప్పులాంటి నిజాలను గుర్తు చేశాడు. మీరు ఆంధ్రప్రదేశ్ ఓటరా? మీ మనసులో ఏ మూలనైనా జగన్‌కి ఓటు వేయాలన్న ప్రమాదకరమైన ఆలోచన వుందా? అయితే ఆ బాధ్యత గల పౌరుడు చేస్తున్న హెచ్చరికలు చూడండి.. ఆలోచించి ఓటు వేయండి. ఈసారి జగన్‌కి ఓటు వేస్తే.... * మాకు డెవలప్‌మెంట్ అక్కర్లేదు అని ఒప్పుకున్నట్లే... * మా రాష్ట్రానికి రాజధాని అవసరం లేదని ఒప్పుకున్నట్లే.... * మా ఆస్తులు మీ దగ్గర తాకట్టు పెట్టుకోవచ్చని ఒప్పుకున్నట్లే... * పోలవరం ప్రాజెక్టు కట్టనవసరం లేదని ఒప్పుకున్నట్లే.... * పరిశ్రమలు అవసరం లేదని ఒప్పుకున్నట్లే..... * మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్లేదు అని ఒప్పుకున్నట్లే... * కడప స్టీల్ ప్లాంట్ అవసరం లేదని ఒప్పుకున్నట్లే.... * ప్రత్యేక హోదా అనేది ఒక ముగిసిన అధ్యాయం అని ఒప్పుకున్నట్లే.... * కేంద్రం నుండి మాకు ఒక్క రూపాయి రాకపోయినా పర్లేదు మేము ఊడిగం చేస్తాం అని ఒప్పుకున్నట్లే..... * సిపిఎస్ అవసరమే లేదు మీరు ఎంతిస్తే అంత అదే మాకు పదివేలు అని ఒప్పుకున్నట్లే.... * పీఆర్సీలు, అరియర్స్ అవసరం లేదు.. మీకు బుద్ధి పుట్టినప్పుడు ఇవ్వండి అని ఒప్పుకున్నట్లే..... * రోడ్లు మాకు అక్కర్లేదు మాకు ఇలాగే బాగున్నాయి అని ఒప్పుకున్నట్లే.... * రైల్వే జోన్ అవసరం లేదని ఒప్పుకున్నట్లే..... * మా రాష్ట్రాన్ని పులివెందుల తోడేళ్ళకు రాసిచ్చేశాం అని ఒప్పుకున్నట్లే.... * మాకు మంచి మద్యం వద్దు, ఇలా బూమ్ బూమ్ లాంటి కల్తీ మద్యం కావాలని ఒప్పుకున్నట్లే.... * మేము స్వేచ్ఛగా మాకు కావలసినది అడగం, మీ కింద బానిసలాగా బతుకుతాం అని ఒప్పుకున్నట్లే.... * రాష్ట్రంలో మీకు నచ్చినవి తాకట్టు పెట్టుకోండి అని ఒప్పుకున్నట్లే.... * కావలసిన అప్పులు చేసుకొమ్మని ఒప్పుకున్నట్లే.... * ప్రజా సమస్యల మీద కాకుండా ప్రశ్నించే వారిని అరెస్ట్ చేసుకొమ్మని ఒప్పుకున్నట్లే.... * ఇసుక దందా చేసుకొమ్మని ఒప్పుకున్నట్టే.... * డిఎస్సీ మాకు అవసరం లేదని ఒప్పుకున్నట్లే..... * మా బతుకులకి 5 వేల వాలంటీర్ జాబులు చాలా ఎక్కువ అని ఒప్పుకున్నట్లే... * మిగతా నీటి ప్రాజెక్టులు కట్టకపోయినా పర్వాలేదు అని ఒప్పుకున్నట్టే.... * మీ ఇష్టం వచ్చినట్లు కబ్జాలు చేసుకోండి, మేమేమీ అనం అని ఒప్పుకున్నట్లే.... * ఎంతమందినైనా హత్య చేసుకోండి మేం ఏమీ అడగమని ఒప్పుకున్నట్లే...
Publish Date: May 8, 2024 5:14PM

ఉదయగిరి గడ్డ కాకర్ల సురేష్‌ అడ్డ! ఉద‌య‌గిరి కోట‌పై టీడీపీ జెండా!

రాయలవారి కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఉదయగిరి జ‌గ‌న్ పాల‌న‌లో కళావిహీనంగా మారింది.  పట్టణ ముఖ ద్వారంలోని  ఉదయగిరి ఆనకట్ట చెరువు ఆధునికీకరణ పనులు నిధులులేక ఆగిపోయాయి. గండిపాళెం జలాశయం రూపురేఖలు కోల్పోయింది.  ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు, మర్రిపాడు, కొండాపురం మండలాల్లోని ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించటానికి వీలుగా గండిపాళెం జలాశయం వద్ద ఏర్పాటు చేసిన సబ్‌ మిషన్‌ ప్రాజెక్టు జ‌గ‌న్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నీరుగారిపోయింది. 2002లో సబ్‌ మిషన్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ప్రారంభంలో 46 ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాలకు నీటిని సరఫరా చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిధుల మంజూరును నిలిపేసింది. దీన్ని వినియోగంలోకి తెచ్చేందుకు  పంపిన ప్రతిపాదనలు  బుట్టదాఖలయ్యాయి.  గ్రామీణ ప్రాంత క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీయటానికి వీలుగా పట్టణంలోని గండిపాళెం మార్గంలో 2018 తెదేపా ప్రభుత్వ హయాంలో రూ. 2 కోట్ల నిధులతో మినీ స్టేడియం మంజూరైంది. అయితే ప్రభుత్వం మారటంతో ఈ మినీ స్టేడియం నిర్మాణ పనులకు నిధులు నిలిపేశారు. తాగునీటి సమస్య తో పాటు, ఇరిగేషన్ ప్రాజెక్టులు  కూటమి అధికారం లోకి రాగానే పూర్తి చేస్తామ‌ని తెలుగుదేశం పార్టీ హామీనిస్తూ ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తోంది.  కూట‌మి అభ్య‌ర్థి కాక‌ర్ల సురేష్ గెలుపు కోసం ఆయ‌న తల్లి మస్తానమ్మ, సతీమణి ప్రవీణ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విఆర్ లక్ష్మీ శ్యామల  ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక ప్ర‌జ‌లు  వారికి కర్పూర హారతులు ఇచ్చి పూలను వేదజల్లుతూ అపూర్వ స్వాగతం పలికారు.  టీడీపీతోనే ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని,  ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్‌ను, ఎంపీ అభ్యర్థి వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను అఖండ మెజారిటీ తో గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా వున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విఆర్ లక్ష్మీ శ్యామల తెలిపారు.  వినూత్నంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను, కాకర్ల సురేష్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన సేవా కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని అభ్యర్థించారు.  వైసీపీ గెలిచే అవకాశాలు లేవు కాబట్టి.. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ఓట్లను వేయించుకోవాలనే కుట్రలకు అధికార పార్టీ పాల్పడుతోంద‌ని,  మద్యం, నగదు పంపిణీతో పాటు పోలింగ్‌ రోజు గొడవలతో భయోత్పాత  సృష్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విఆర్ లక్ష్మీ శ్యామల ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు.   వైసీపీకి ఇవే చివరి ఎన్నికలంటూ అభ్యర్థి కాకర్ల సురేష్ త‌న దైన స్టైల్‌లో ప్ర‌చారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ టీడీపీ కూట‌మికే జైకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే, అన్నీ స‌ర్వేల్లో తేలిపోయింది.  ఉదయగిరి నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్ గా మారుస్తానని, ఉదయగిరి కోటను, సిద్దేశ్వరం, శ్రీ వెంగమాంబ టెంపుల్, గండిపాలెం రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా మార్చి ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు సురేష్ హామీలు ఇస్తున్నారు.
Publish Date: May 8, 2024 5:06PM

నెల్లూరు విజయసాయికి అందని ద్రాక్షే.. దేశం కూటమిలో జోష్.. జగన్ శిబిరంలో నైరాశ్యం!

వైసీపీలో కొన్ని రోజుల నుంచీ ఒక విధమైన నైరాశ్యం కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్ నుంచి, కీలక నేతలైన విజయసాయిరెడ్డి వంటి వారి వరకూ అందరూ అన్యాపదేశంగా తమ పార్టీ ఓటమి తథ్యమన్న సంకేతాలే ఇస్తున్నారు.  ముందుగా జగన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లపై నమ్మకం పోయిందంటూ చేతులెత్తేశారు. ఎన్నికల కమిషన్ తమ పథకాలను నిలిపివేస్తోందనీ, తమకు మద్దతుగా ఉన్న అధికారులపై బదలీ వేటు వేసి.. అధికారులెవరూ అధికార పార్టీకి సహకరించకుండా చేస్తోందనీ వ్యాఖ్యానించి. అటువంటి అనుచిత సహకారం లేకపోతే గెలుపు సాధ్యం కాదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఇక తొలి సారిగా ప్రత్యక్ష ఎన్నికలలోకి అడుగుపెట్టిన విజయసాయిరెడ్డి పరిస్థితి అయితే మరీ దారుణంగా మారిపోయింది. ఆయన ప్రచారానికి జనం సంగతి పక్కన పెడితే సొంత పార్టీ క్యాడర్ కూడా పెద్దగా రావడం లేదు. సొమ్ములిచ్చి రప్పించుకున్న వారు కూడా ఇలా కనిపించి అలా మాయమై పోతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి తన ఓటమి తానే ఓప్పుకునేలా చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణులను సైతం నైరాశ్యంలో ముంచేశాయి. ఇంతకీ ఆయన సమాజిక మాధ్యమం వేదికగా ఏమన్నారంటే.. నిజాయితీగా పని చేస్తున్న అనంత రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని, అనంతపురం డీజీపీని ఎన్నికల కమిషన్ బదిలీ చేసేసింది. ఇదేక్కడి న్యాయం. వాస్తవానికి తెలుగుదేశం కదిరి అభ్యర్థి కందికుంట ప్రసాద్ కారులో  రూ. 2 కోట్ల భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నందుకు పోలీసులు వారిని అభినందించాలి అని పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా ఎన్నికల సంఘం అనంత పోలీసు అధికారులను బదిలీ చేయడం వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడని పేర్కొన్నారు.   సాధారణంగా ఇలాంటి బేల మాటలు.. ఓటమి బాటలో ఉన్నప్పుడే నేతల నోట వస్తాయని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో గత ఎన్నికలలో ఎన్నికల సంఘం తీరును అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు విమర్శించిన సందర్భంలో చంద్రబాబు ఓటమి భయంతో  మాట్లాడుతున్నారంటూ ఇదే విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.   అదలా ఉంచితే విజయసాయి రెడ్డి జగన్ సర్కార్ లో, వైసీపీలో అత్యంత కీలకమైన నాయకుడు. వరుసగా రెండు సార్లు జగన్ ఏరి కోరి ఆయనను రాజ్యసభకు పంపారు. అయితే ఇప్పుడు తన సొంత జిల్లా అంటూ చెప్పుకుని తగదునమ్మా నెల్లూరు లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయసాయి జిల్లాకు చేసింది మాత్రం శూన్యం.  కూటమి తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీలక పోటీదారుగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థి విజయసాయి తాను స్థానికుడిననని ఎంత గట్టిగా చెప్పుకుంటున్నా సొంత పార్టీలోని కీలక నేతలే ఆయనకు మద్దతుగా నిలవడం లేదు. నుంచి పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి స్థానిక అభ్యర్థి అయినప్పటికీ ఆయనకు కీలక నేతలు, ప్రజల నుంచి గట్టి మద్దతు లేదు. ఇటీవలే జగన్ తో విభేదించి వైసీపీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం గూటికి చేరిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి మద్దతుగా   చాలా వరకూ వైసీపీ క్యాడర్ ఆయనతో పాటే తెలుగుదేశం వైపు వచ్చేసింది.  
Publish Date: May 8, 2024 4:23PM

దూసుకెళ్తున్న బాలశౌరి ... ఎన్నికల ప్రచారంలో బందరు పోర్టు  కీలకాంశం 

రాజ‌కీయంగా సీనియ‌ర్ కూడా అయిన మ‌చిలీప‌ట్నం ఎంపీ వ‌ల్లభ‌నేని బాల‌శౌరి త‌న మార్కు రాజ‌కీయాలు చేస్తున్నారు. బాలశౌరికి రాజ‌కీయంగా ఎంతో అనుభ‌వం ఉంది. ముఖ్యంగా ప్రజ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంలోనూ ఆయ‌న నేర్పుగా ముందుకు సాగుతార‌నే పేరు తెచ్చుకున్నారు.గత  ఎన్నిక‌ల్లో మ‌చిలీప‌ట్నం నుంచి  ఎంపీగా పోటీ చేసి గెలిచిన వ‌ల్లభ‌నేని బాల‌శౌరి ఇక్కడి నుంచి  వ‌రుసగా రెండోసారి విజయం సాధిస్తారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో  టీడీపీ నాయ‌కుడు కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌ను ఓడించి విజ‌యం ద‌క్కించుకున్న బాలశౌరి త్రి కూటమి అభ్యర్థిగా మచిలీ పట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  ఆ వెంట‌నే ఆయ‌న కార్యరంగంలోకి దిగిపోయారు.బందరు పోర్టు విషయంలో బాలశౌరి  రాజీ లేని పోరాటం కొనసాగిస్తున్నారు. స‌మ‌స్యలున్న చోట తాను ఉన్నానంటూ నిరూపించుకుంటున్నారు. కీల‌క బందరు ప్రాజెక్టు విషయంలో బాలశౌరికి  మంచి పేరు తెస్తోంది. కృష్ణా జిల్లా వాసుల చిరకాల కల అయిన బందరు పోర్టు విషయంలో ఆయన హాయంలోనే  కదలిక వచ్చింది. గత  ఏడాది ఆగస్టులో పోర్టు నిర్మాణ బాధ్యతల నుంచి నవయుగ సంస్థను తప్పిస్తూ వైకాపా  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పోర్టు నిర్మాణంపై జిల్లావాసుల్లో ఆశలు సన్నగిల్లాయి. పోర్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని మంత్రులు ప్రకటిస్తూ వచ్చినా దానిపై స్పష్టత లేకుండాపోయింది.  తాజాగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చొరవ తీసుకోవడంతో కెనరా బ్యాంకు పోర్టు నిర్మాణానికి రుణ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. కెనరా బ్యాంకు ఎండీ ఆర్‌ఏ శంకర్‌నారాయణను బాల‌శౌరి స్వయంగా తీసుకువ‌చ్చి.. సీఎం జగన్‌ను సచివాలయంలో కలిసేలా ఏర్పాటు చేశారు. వీరి నడుమ సుమారు అరగంటకుపైగా భేటీ జరిగింది. ఈ భేటీలో బాలశౌరి కీల‌కంగా వ్యవ‌హ‌రించారు. బందరు పోర్టు నిర్మాణానికి సుమారు రూ.4వేల కోట్ల రుణసాయం చేసేందుకు కెనరా బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది.   పోర్టు నిర్మాణం త్వరలో మొదలవుతుందని వ‌ల్లభ‌నేని బాల‌శౌరి స్పష్టం చేస్తున్నారు.  దీంతో బందరు పోర్టు నిర్మాణంపై మళ్లీ ఆశలు చిగురించినట్లయింది. దీని వెనుక బాల‌శౌరి క‌ష్టం ఉండ‌డంతో ఆయ‌న అనుచ‌రులు హ‌ర్షం వ్యక్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.త్రి కూటమి కి చెందిన నేతలు, కార్యకర్తలతో బాటు వైకాపాలో ఆయన అనుచరులు ఎక్కువగానే ఉన్నారు. వీళ్లంతా సైలెంట్ గా బాలశౌరికి మద్దత్తు వహిస్తున్నారు.  అయితే, రెండు నెల‌ల కింద‌ట కూడా రాష్ట్ర స‌మ‌స్యల‌ను కేంద్రానికి వివ‌రించ‌డంలోను, లేఖలు రాయ‌డంలోనూ వల్లభనేని బాల‌శౌరి దూకుడు ప్రద‌ర్శించి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. పోర్టుకు సుదీర్ఘ చరిత్ర ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా కేంద్రమైన మ‌చిలీప‌ట్నం ఒక‌ప్పుడు బ్రిటిష్ హ‌యంలో పెద్ద తీర ప్రాంత ప‌ట్ట‌ణం. ఇక్కడనుంచి ఎన్నో ఎగుమ‌తులు, దిగుమ‌తులు జరిగేవి. అంతకు ముందే రెండు వేల సంవత్సరాల పూర్వం నుంచే ఇక్కడ నుంచి విదేశాలకు ఎగుమతులు, దిగుమతులు జరిగేవి. మచిపలీట్నం లోక్‌సభ నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉంది. ఈ నియోజకవర్గం నుంచి పలవురు సీనియర్ రాజకీయ నేతలు ఎంపీగా గెలిచారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైన సత్తా చాటాలని ప్రధాన పార్టీలు పట్టుదలతో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో మచిలీపట్నం ఒకటి. అవనిగడ్డ, గన్నవరం, గుడివాడ, పామర్రు (ఎస్ సి), పెడన, పెనుమలూరు, మచీలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తాయి. మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి రాజకీయంగా చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్లుగా ఉన్న పలువురు నేతలు ఇక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీల హవా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,518,826మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 737,936కాగా.. మహిళలు 780,825మంది ఉన్నారు. మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం చరిత్రను గమనిస్తే.. 1952లో తొలిసారి ఎన్నికలు జరగ్గా.. సీపీఐ నుంచి పోటీచేసిన సనక బుచ్చికోటయ్య గెలిచారు. 1957లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మండలి వెంకట కృష్ణారావు విజయం సాధించారు. 1962లో మండలి వెంకటస్వామి ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలుపొందడం విశేషం. 1967లో కాంగ్రెస్ నుంచి వై.అంకినీడు ప్రసాద్ విజయాన్ని అందుకున్నారు. 1971లో కాంగ్రెస్ నుంచి మేడూరి నాగేశ్వరరావు గెలిచారు. 1977లో కాంగ్రెస్ అభ్యర్థి మాగంటి అంకినీడు విజయం సాధించారు.. 1980లో తిరిగి ఆయనే గెలిచారు. 1984, 1989, 1991లో కాంగ్రెస్ నుంచి కావూరి సాంబశివరావు విజయం సాధించారు. 1996లో కైకాల సత్యనారాయణ (నటుగు) తెలుగు దేశం పార్టీ నుంచి పోటీచేసి గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘమైన సముద్రతీరం ఉండడంతో దానిని ఆసరాగా చేసుకుని అభివృద్ధి చేయాలని వరుసగా ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్నాయి. కానీ, ఆచరణ మాత్రం అందుకు తగ్గట్టుగా లేదు. సుదీర్ఘ చరిత్ర కలిగిన మచిలీపట్నంలోని పోర్టు నిర్మాణం రెండడుగులు ముందుకు, మూడడుగులు వెనక్కి అన్న చందంగా కనిపిస్తోంది. పోర్టు నిర్మాణానికి నవయుగ కంపెనీతో వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2007లో చేసుకున్న ఒప్పందాన్ని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రద్దు చేశారు.  ఏపీలో ఇప్పటికే పోర్టుల ఆధారంగా ఎగుమతులు ఊపందుకున్నాయి. కరోనావైరస్ మహమ్మారి తర్వాత విశాఖ, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల ద్వారా ఎగుమతులు పెరిగాయి. ఉదాహరకు కాకినాడ పోర్ట్ నుంచి 2020-21తో పోలిస్తే 2021-22 లో బియ్యం ఎగుమతులు 25 శాతం పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2019లో వల్లభనేని బాలశౌరి విజయం 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీకి చెందిన వల్లభనేని బాలశౌరి గెలిచారు. ఆయన 60వేలకుపైగా మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావుపై విజయం సాధించారు. వల్లభనేని బాలశౌరి వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచినా.. రెండు నెలల క్రితం పార్టీకి దూరమయ్యారు. ఆయన వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు.. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఉండటంతో మచిలీపట్నం టికెట్ జనసేన పార్టీకి దక్కింది. . సిట్టింగ్ ఎంపీ బాలశౌరి మరోసారి జనసేన పార్టీ నుంచి మచిలీపట్నం గెలుస్తారని ప్రచారం జరుగుతోంది.ఇటు వైఎస్సార్‌సీపీ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావును మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా నియమించింది. వైకాపా కార్యకర్తలు ఇటీవల జనసేన నేత కర్రి మహేశ్ ఇంటిపై దాడి చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కిమ్మనకుండా వ్యవహరిస్తోంది. వైకాపా అరాచకాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైందని జనసేన నేత వాడ వీర ప్రతాప్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బాలశౌరి విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
Publish Date: May 8, 2024 3:35PM

ఏపీ ఎన్నికల ప్రచారానికి నాని.. వైసీపీకి టిట్ ఫర్ టాట్!

గదిలో బంధించి కొడితే పిల్లి కూడా  పులిలా తిరగబడుతుందన్నది సామెత. సినీ పరిశ్రమలు అన్ని విధాలుగా అవమానించిన ఏపీ సీఎం జగన్ కు సరిగ్గా ఎన్నికల వేళ ఆ సినీ పరిశ్రమ నుంచి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.  సినీ పరిశ్రమ నుంచి ఒక్కరొక్కరుగా జగన్ కు వ్యతిరేకంగా జనసేనానికి మద్దతుగా బయటకు వచ్చి గొంతు విప్పుతున్నారు. వీరిలో నేచురల్ స్టార్ నానిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. గతంలో జగన్ సర్కార్ సినిమా టికెట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించిన కారణంతో నానిని జగన్ సర్కార్ నానా విధాలుగా ఇబ్బందులకు గురి చేసింది. ఆయన సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించంది. సినీ పరిశ్రమ మేలు కోసం అంటూ వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించినందుకు, సర్కార్ నిర్ణయం సినీ పరిశ్రమకు మేలు కాదు కీడు చేస్తుందంటూ చెప్పినందుకు  నానిపై పలువురు వైసీపీ నాయకులు నానికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వాన్ని విమర్శించడానికి నాని స్థాయి ఏమిటంటూ నిలదీశారు.  అంతే కాకుండా అప్పట్లో ఆయన సినిమా శ్యాం సింగరాయ్ విడుదల సమయంలో అనేక అడ్డంకులు సృష్టించారు. అప్పటికి మౌనంగా ఉన్న నాని..నానిపై అకారణ ద్వేషాన్ని పెంచుకుని ఆయనను నానా ఇబ్బందులకు గురి చేసిన వైసీపీకి ఇప్పుడు నాని సరైన బదులిచ్చినట్లైంది. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముంగిట, అదీ వైసీపీ గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్న వేళ నాని తన గళం విప్పారు. వైసీపీకి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ కు మద్దతుగా ముందుకు వచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమన్న సంకేతం ఇస్తూ తన ప్రచారానికి తానే బెస్టాఫ్ లక్ చెప్పుకున్నారు. పవన్ కల్యాణ్ ను పొగడ్తలలో ముంచెత్తారు.  దీంతో నాని నాడు వైసీపీ తనను వేధించిన తీరుకు టిట్ ఫర్ టాట్ అన్న చందంగా రిటార్డ్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన సనిమా శ్యాం సింగరాయ్ విడుదల సందర్భంగా వైసీపీ ప్రభుత్వం తన పట్ల వ్యవహరించిన తీరుకు ఇప్పుడు సరైన బదులిచ్చినట్లైందని అంటున్నారు.  
Publish Date: May 8, 2024 1:50PM

భాగ్యనరకం!

చినుకు పడితే హైదరాబాద్ జంటనగరాలు చిగురుటాకులా వణికిపోవడం కొత్త కాదు. ప్రతి  ఏటా వానాకాలంలో భాగ్యనగర  వాసులు నరకం చూడటమూ కొత్త కాదు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో మంగళవారం(మే7)న కురిసిన వర్షంతో భాగ్యనగరం కాస్తా భాగ్యనరకంగా మారిపోయింది. విశ్వనగరం అంటూ ఘనంగా చెప్పుకునే హైదరాబాద్ నగరం విశ్వనరకంగా మారిపోయింది.   లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులు నదులను తలపించాయి. వాహనాలు ఎక్కడిక్కడ స్తంభించిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. గత కొన్ని రోజులుగా మండే ఎండలు, వడగాల్పులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరౌతున్న హైదరాబాదీయులు మంగళవారం సాయంత్రం ఆకాసం మబ్బుపట్టి వర్షం కురవడంతో హమ్మయ్యా అని ఆనందపడ్డారు. అయితే నిముషాల వ్యవధిలోనే వారి ఆనందం ఆవిరైపోయింది. మెల్లిగా మొదలైన వర్షం కుండపోతగా మారింది.  జనాలకు నరకం చూపించింది. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కార్యాలయాలు వదిలి ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో మొదలైన వాన ఏకధాటిగా రెండు గంటలకు పైగా కురిసింది.  దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మెట్రో రైళ్లు సైతం కిక్కిరిసిపోయాయి. భారీ వర్షం కారణంగా చూపుతూ కొంత సేపు మెట్రో సేవలు కూడా నిలిచిపోయాయి.  ప్రభుత్వాలు మారినా హైదరాబాద్ కు వానకష్టాలు మాత్రం తీరడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   చిన్నపాటి వర్షానికే   రోడ్లు జలమయం కావడం, ట్రాఫిక్ జామ్ కావడం పరిపాటిగా మారిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి నరకయాతన హైదరాబాదీయులకు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.
Publish Date: May 8, 2024 12:52PM

కాళేశ్వరం కుంగింది అందుకే...నిపుణుల మధ్యంతర నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలంగాణ ప్రభుత్వానికి  ప‌లు సూచ‌న‌లు చేసింది.  1) మొత్తం 85గేట్లలో 77 గేట్లకు ఎలాంటి ఇబ్బంది లేదని, మిగిలిన ఎనిమిది గేట్లలో మాత్రం సాంకేతిక , మెకానికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని , వీటిని చక్కదిద్దేందుకు ఏ పద్దతిన మరమ్మత్తులు చేపట్టాలో అధికారులు నివేదికలో పేర్కొన్నారు.   2) మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకులో 15నుంచి 22 పిల్లర్లు దెబ్బతినడంతో వాటిని రిపేర్ చేసేందుకుగాను గేట్లను పైకి ఎత్తివేయాలని సూచించారు. 3) 20, 21 నెంబర్ గేట్లను ఓపెన్ చేయడానికి వీలు లేనందున వాటి స్థానంలో కొత్తవి అమర్చాలని,  రిపేర్ లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ టెక్నికల్ పద్దతిన మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు.   4) బ్యారేజ్ ప్రారంభమైన తర్వాత వచ్చిన మొదటి దఫా వరదతో, మేడిగడ్డలోని ఏడో బ్లాక్ లో సమస్యలు తలెత్తాయని, వాటిని అప్పుడే గుర్తించి మరమ్మత్తులు చేపట్టి ఉంటే, మిగతా పిల్లర్లకు ఎలాంటి సమస్యలు ఉండేవి కావని అధికారులు నివేదిక‌లో రాశారు.  మరమ్మత్తుల సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. 5) 8 గేట్ల ప్రాంతంలో బ్యారేజీ మీదనున్న శ్లాబ్ కుంగిపోవడంతో కొత్త శ్లాబ్ వేయాలని పేర్కొన్నారు.   6) ప్రాజెక్టులో దెబ్బతిన్న పిల్లర్లకు మాత్రమే కాకుండా మిగిలిన వాటికీ ప్రమాదం లేదనుకోలేమని స్పష్టం చేశారు. కాళేశ్వరం మరమ్మత్తులపై గైడ్ లైన్స్ ను డ్యాం సేఫ్టీ అధికారులు జారీ చేశారు.  7)  ప్లానింగ్, డిజైన్, క్వాలీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ లో నిర్ల‌క్ష్యం వ‌ల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగింద‌ని డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికలో తెలిపింది. 8) డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడిందని నివేదికలో పేర్కొంది. బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం, ఫౌండేషన్ మెటీరియల్ యొక్క పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉండటం, బ్యారేజీ లోడ్ వలన ఎగువన ఉన్న కాంక్రీట్ పైల్స్ బలహీన పడటం వల్ల పిల్లర్స్ సపోర్డ్ బలహీనపడిందని నివేదికలో వెల్లడించింది. పిల్లర్లు కుంగిపోవటానికి బ్యారేజీ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవటం వలనేనని తెలిపింది.   మ‌రో వైపు మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌ను  జ్యుడీషియల్‌ కమిషన్‌ సందర్శించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై న్యాయ విచారణలో భాగంగా బరాజ్‌లోని కుంగుబాటుకు గురైన 19, 20, 21వ పియర్లలతోపాటు ఏడో బ్లాక్‌లో వంతెనపై కాలినడకన వెళ్లి జ్యుడీషియల్‌ కమిషన్‌ క్షుణ్ణంగా పరిశీలించింది.  ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న పియర్ల ప్రాంతాన్ని పరిశీలించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. బరాజ్‌లో కుంగిన పియర్ల పగుళ్లను పరిశీలించారు. కుంగుబాటుకు గల కారణాలను, ఇతర సాంకేతిక అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ మాట్లాడుతూ.. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక  అందిందని, దాన్ని అధికారుల సమక్షంలో సమీక్షిస్తున్నట్టు తెలిపారు.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: May 8, 2024 12:12PM

పవన్ కాలికి గాయం.. ఆందోళనలో కూటమి నేతలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాయపడ్డారు. ఎన్నికలకు గట్టిగా ఐదు రోజుల సమయం కూడా లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూనే, కూటమి అభ్యర్థుల విజయం కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా పవన్ కూటమి శ్రేణుల్లో జోష్ నింపేలా ప్రసంగాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.  అయితే ఆయన కాలికి గాయం కావడం కూటమి నేతలు, శ్రేణుల్లో ఆందోళన కలిగించింది. నిర్విరామంగా పర్యటిస్తూ బహిరంగ సభలలో ప్రసగింస్తున్న పవన్ కల్యాణ్ కు అభిమానుల తాకిడీ విపరీతంగా ఉంది. ఎలాగైనా సరే ఆయనతో సెల్ఫీ దిగాలన్న వారి అత్యుత్సాహం కారణంగానే పవన్ కాలికి గాయమైందని అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాజమండ్రి, అనకాపల్లిలో ప్రధాని నరేంద్ర మోడీ సభలలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఉత్తేజపూరిత ప్రసంగాలు చేశారు. అయితే ఆ సందర్భంగా పవన్ కల్యాణ్ తో సెల్ఫీ కోసం అభిమానులు, పార్టీ శ్రేణులూ తహతహలాడిన సందర్భంలో జరిగిన స్వల్ప తొక్కిసలాటలో పవన్ కాలికి గాయమైంది. సాధారణంగా పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బంది ఆయనకు రాక్షణగా ఉంటారు. అయితే ప్రధాని పర్యటన కావడంతో వారు పవన్ కు రక్షణగా ఉండే అవకాశం లేకపోయింది. అనకాపల్లి సభ అనంతరం సెల్ఫీల హడావుడిలో ఎవరో పొరపాటును పవన్ కాలిని తొక్కి ఉంటారనీ, అందుకే గాయమైందని చెబుతున్నారు.   ఆయన రేణిగుంట విమానాశ్రయంలో కాలికి బ్యాండేజితో కనిపించారు. కాలికి గాయమైన ఆయన లెక్క చేయకుండా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తిరుమతిలో చంద్రబాబుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. 
Publish Date: May 8, 2024 12:04PM

మోడీ కూడా అనేశారు.. జగన్ దింపుడు కళ్లెం ఆశలూ గాయెబ్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంత కాలం ఓ నమ్మకం ఉండేది. తాను ఎంత అరాచకపాలన సాగించినా, ఎంత ఆర్థిక అవకతవకలకు పాల్పడినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీ తనకు అండగా నిలుస్తారనీ, ఎన్నికల గండం నుంచి గట్టెక్కిస్తారని. అయితే  తెలుగుదేశం, జనసేనతో ఏపీలో బీజేపీ జతకట్టడంతో ఆ ఆశలు అడియాసలయ్యాయి. అయినా ఏదో దింపుడు కళ్లెం ఆశ.. పేరుకు తెలుగుదేశం, జనసేనలతో బీజేపీ జట్టు కట్టినా అది బీజేపీ రాష్ట్ర క్యాడర్ ను సంతృప్తి పరచడానికే తప్ప.. మరేమీ కాదనీ, బీజేపీ అధినాయకత్వం ఆశీస్సులు తనకే ఉన్నాయనీ ఆయన భ్రమల్లో మునిగి తేలారు. అందుకు అనుగుణంగానే నరసాపురం ఎంపీ టికెట్ ఆర్ఆర్ఆర్ అంటే రఘురామకృష్ణం రాజుకు ఇవ్వవద్దంటూ తాను చేసిన వినతిని బీజేపీ అధినాయకత్వం మన్నించడంతో బీజేపీ ఏ కూటమిలో ఉన్నా.. ఆ పార్టీ అగ్రనాయకత్వం మద్దతు సంపూర్ణంగా తనకే అని గట్టిగా నమ్మేశారు. అందుకే బీజేపీ రాష్ట్ర నేతలు, కొందరు జాతీయ నేతలూ కూడా తన ప్రభుత్వంపై ఎంత తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా జగన్ కానీ, ఆయన పార్టీ నేతలు కానీ బీజేపీని పల్లెత్తు మాట అనలేదు.  ఇక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాత కూడా జగన్ సర్కార్ కోడ్ ఉల్లంఘనలకు యథేచ్ఛగా పాల్పడుతున్నా ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించకపోవడంతో తనకు ఎదురే లేదన్న భావన జగన్ లో వ్యక్తం అయ్యింది. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రంలో ఎన్నికల పర్యటనకు వచ్చి చిలకలూరి పేటలో కూటమి తొలి సభలో ప్రసంగించారు. ఆ సభ సందర్భంగా శాంతి భద్రతల విషయంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైనా.. ఎన్నికల సంఘం డీజీపీపై చర్య తీసుకోకపోవడంతో.. బీజేపీ పైకి కూటమితో ఉన్నా.. తనకు సహకారం అందించే విషయంలో రెండో ఆలోచనే ఆ పార్టీ అధినాయకత్వానికి లేదని జగన్ మాత్రమే కాదు , ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు, చివరాఖరికి కూటమిలోని తెలుగుదేశం, జనసేన శ్రేణులూ కూడా భావించాయి. నిజమే చిలకలూరిపేట బొప్పూడి సభలో.. జగన్ సర్కారును పల్లెత్తు మాట అనని మోదీ వైఖరిపై, కూటమిలో అసంతృప్తి వెల్లువెత్తింది. ఆ తర్వాత డీజీపీ-సీఎస్-టీటీడీ ఈఓ బదిలీలపై ఈసీ మౌనంపైనా అనుమానం తొంగిచూసింది. జగన్ ఒత్తిడి కారణంగానే ఎంపి రఘురామకృష్ణంరాజుకు నర్సాపురం టికెట్ ఇవ్వలేదన్న చర్చ జరిగింది. ఈ క్రమంలో బొప్పూడి సభలో మోదీ ఏపీ సీఎం జగన్‌పై, విమర్శలకు దూరంగా ఉండటం సహజంగానే అనుమానాలు పెంచినట్లయింది.  అయితే హఠాత్తుగా పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటి వరకూ ఎవరేమన్నా జగన్ ను ప్రధాని మోడీ మాత్రం పన్నెత్తి విమర్శించిన పాపాన పోలేదు. కానీ కాకినాడ, అనకాపల్లి లో ఆయన ప్రసంగాలలో జగన్ సర్కార్ పై విమర్శల వాడి పెరిగింది. మోడీ కూడా జగన్ సర్కార్ అవినీతిపై విమర్శలు గుప్పించారు. మూడు రాజధానులంటూ ఒక్క రాజధానిని కూడా నిర్మించలేదనీ, కానీ ఆ పేరు చెప్పి భయంకరమైన దోపిడీకి పాల్పడ్డారనీ ఎలాంటి శషబిషలూ లేకుండా చెప్పేశారు. అంతే కాదు.. ఎపీలోనూ కేంద్రంలోనూ అధికారంలోకి రాబోయేది కూటమి ప్రభుత్వాలేనని చెప్పారు. చంద్రబాబు విజన్ పై పొగడ్తలు కురిపించారు.  కూటమి అభ్యర్థులకు ఓటేస్తే రాష్ట్రానికి చంద్రబాబు పాలన అందుతుందని చెప్పారు.  ఏపీలో ఉన్నది అవినీతి సర్కారు, అసమర్థ సర్కార్ అని ప్రకటించారు. మారిన మోడీ వైఖరితో అప్పటి వరకూ కూటమి పార్టీల మధ్య ఓట్ల బదలీపై ఉన్న అనుమానాలు పటాపంచలైపోయాయి.  అంతే కాదు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిజాయతీపరుడైన దార్శనికుడు. అందుకే ఆయనతో కలిశాం అని చెప్పడం ద్వారా జగన్ సర్కార్ అవినీతిమయం అని తేల్చేశారు. ప్రధాని  వైఖరి కూటమిలో  ఉత్సాహాన్ని నింపింది.   బీజేపీ-, వైసీపీ తెరచాటు బంధం  అనుమానాలను  పటాపంచలు చేసింది. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సర్కారుపై, ప్రధాని నరేంద్రమోదీ చేసిన మాటల దాడితో వైసీపీ డీలా పడిపోయింది.     
Publish Date: May 8, 2024 11:40AM

ఎదురుదాడికి జగన్ కు ఇక మిగిలింది ఎన్నికల సంఘమే!

ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శరంగా జరుగుతాయన్న నమ్మకం జగన్ లో పోయింది. తనకు అనుకూలంగా, తన అనుకూల అధికారుల కనుసన్నలలో, తన కోసం తానే సృష్టించుకున్న వాలంటీర్ల వ్యవస్థ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికలను ఎన్నికల సంఘం చర్యల కారణంగా భ్రష్టుపట్టిపోతున్నాయని జనగ్ ఇప్పుడు ఊరూవాడా కోడై కూస్తున్నారు. పాపం ఆయనకు ఎన్నికలు తను అనుకున్నట్లు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం రోజు రోజుకూ సన్నగిల్లిపోతోందట. 2019లోనే ఎన్నికలు కూడా ఆయన కోరుకున్న విధంగా సక్రమంగా జరిగాయి. అప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా అంతా తాననుకున్నట్లే, తనకు కావలసినట్లే ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా తనకు కావలసిన విధంగా ఎన్నికలు సక్రమంగా సజావుగా జరగడం లేదు. రాష్ట్రంలో మెజారిటీ అధికారులు తాను చెప్పిందల్లా చేస్తుంటే.. ఈ ఎన్నికల సంఘానికి ఏం వచ్చింది. ఇష్టారీతిన అధికారులను మార్చేస్తోంది. అదీ విపక్ష కూటమి నేతల ఫిర్యాదులకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం ఆయనకు సుతరామూ నచ్చడం లేదు. అందుకే ఆయన ఎన్నికలలో విజయంపైనా నమ్మకం కోల్పోయారు. ఎన్నికలు సజావుగా జరుగవన్న నిశ్చయానికీ వచ్చేశారు. ఎన్నికల సంఘం ఇష్టానుసారంగా అధికారులను మార్చేస్తోందంటూ విమర్శలకు దిగారు.   తన ఐదేళ్ల పాలనలో తన విధానాలు వేలెత్తి చూపే, గొంతెత్తి ప్రశ్నించే వారిపై వేధింపులు, ఎదురుదాడే అస్త్రంగా సంధించి వారి గొంతులను అణిచివేసిన జగన్. న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై కూడా ఎదురుదాడే అస్త్రంగా ముందుకు సాగారు. ఇప్పటి వరకూ ప్రత్యర్ధులపై ఎదురుదాడినే అస్త్రంగా నమ్ముకున్న జగన్..  ఇప్పుడు ఎన్నికల సంఘంపైనా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. తనకు అనుకూలంగా వ్యవహరించే డీజీపీ, ఏడీజీ, ఐజీలు, ఎస్పీలు, కలెక్టర్లు, డీఎస్పీలపై వేటుతో వణికిపోతున్న జగన్.. ఎన్నికల సంఘంపై రుసరుసలాడుతున్నారు. యథా నాయకా, తథా అనుచరులు అన్నట్లుగా జగన్ బాటలోనే  వైసీపీ మంత్రులు, ఎమ్మెల్సీలు,  నేతలు నడుస్తున్నారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో అధికారుల బదిలీలు, పథకాల నిలిపివేతపై జగన్ నుంచి ఎమ్మెల్సీల చేస్తున్న ఎదురుదాడి వారిలో విజయం పట్ల కొరవడిన నమ్మకానికి నిదర్శనంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   గత ఎన్నికల సమయంలో అప్పటికి విపక్ష నేతగా ఉన్న జగన్ అప్పటి అధికార పార్టీపై ఎన్నికల సంఘానికి ఎన్ని ఫిర్యాదులు చేశారు. ఆయన, ఆయన చేసిన ప్రతి ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఎలా ఆఘమేఘాల మీద స్పందించిదీ అన్నది గుర్తు చేస్తూ, చేసుకుంటూ జనం నవ్వుకుంటున్నారు.  గత ఎన్నికల ముందు.. అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్నికల్లో, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అండ్‌కో  ఫిర్యాదుల మేరకు ఎలాంటి జాప్యం లేకుండా అప్పటి సర్కార్ లోని ఐఏఎస్, ఐపీఎస్ , డీఎస్పీలను ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టిన సంగతి తెలిసిందే.   ప్రధానంగా నాటి సీఎస్ అనిల్‌చంద్ర పునేఠా, డీజీపీ , ఇంటలిజన్స్ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావుతోపాటు మరికొందరు ఎస్పీ, కలెక్టర్లను ఎన్నికల సంఘం ఆఘమేఘాల మీద మార్చేసింది.  ఈ విషయాలను ఇప్పడు అధికారంలో ఉన్న వైసీపీ కన్వీనియెంట్ గా మర్చిపోతే పోవచ్చు కానీ, జనానికి ఐదేళ్ల కిందటి సంగతులన్నీ ఇప్పుడు ఒకదాని వెంట ఒకటి గుర్తుకు వచ్చేస్తున్నాయి. వైసీపీ తీరు గురువింద గింజ సామెతగా ఉందని ప్రజలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పింఛన్ల పంపిణీ నుంచీ, ఎన్నికల వేళ నిధుల విడుదల కోసం అభ్యర్థనలు పంపడం వరకూ ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి జగన్ రెడ్డి పాలనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నా, ఎన్నికల సంఘం ఇంకా ఆయనపై ఎందుకు వేటు వేయలేదని ఆశ్చర్యపోతున్నారు.   ఏది ఏమైనా ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్య వైసీపీ నేతలు, కేడర్, చివరాఖరికి అభ్యర్థులు కూడా ఓటమి ఖరారైపోయిందన్న నిర్ణయానికి వచ్చేలా చేసింది. దీంతో వారు సరిగ్గా ఎన్నికల వేళ కాడె వదిలేసినట్లు కనిపిస్తోంది. జగన్ సభలు జనం లేక వెలవెల బోతుండటమే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగనే ఓటమి భయంతో వణికి పోతుంటే.. తామెంత అనుకుంటున్న వైసీపీ అభ్యర్థులు ఎన్నికలలో సొమ్ములు ఖర్చు పెట్టడం వృధా అన్న భావనకు వచ్చి జగన్ సభలకు కూడా జనసమీకరణ చేయడానికి ప్రయత్నించడం లేదు.  మొత్తంగా  ఎన్నికలు సక్రమంగా జరగవేమోనంటూ జగన్ చేసిన  వ్యాఖ్యలు, వైసీపీ అభ్యర్ధుల మనోస్థైర్యాన్ని దారుణంగా దెబ్బతీసిందనడంలో సందేహం లేదు. ఎ ఆ ప్రభావం వైసీపీ ప్రచారంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 
Publish Date: May 8, 2024 11:11AM

హైదరాబాద్ లో రిటైనింగ్ వాల్ కూలి ఏడుగురు మృతి 

వర్షాకాలం ప్రారంభం కాకమునుపే హైదరాబాద్ లో శిథిలావస్థలో ఉన్న భవనాలు ఏ క్షణంలో కూలిపోతాయోనన్న ఆందోళన ఎక్కువైంది. ఎండలతో మండిపోతున్న హైదరాబాద్ లో నిన్న కురిసిన భారీ వర్షం చేదు అనుభవాన్ని మిగిల్చింది.  మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి హైదరాబాద్ మహానగరంలో కురిసిన భారీ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. వర్షం ప్రభావంతో బాచుపల్లిలో గోడ కూలి ఏకంగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఈ విషాదం చోటుచేసుకుంది. మంగళవారం కురిసిన వర్షానికి గోడ కూలిపోయింది. శిథిలాల కింద ఏడు మృతదేహాలను అధికారులు గుర్తించారు. మృతుల పేర్లు రామ్‌ యాదవ్‌ (34), గీత (32), హిమాన్షు (4), తిరుపతిరావు (20), శంకర్‌ (22), రాజు (25), ఖుషిగా గుర్తించారు.కాగా గోడ కూలిందన్న సమాచారం అందుకున్న అధికారులు మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి మొత్తం ఏడు మృతదేహాలను వెలికితీశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.   కాగా మృతులంతా రేణుక ఎల్లమ్మ కాలనీలో ఓ భవన నిర్మాణంలో సెంట్రింగ్ పని చేస్తున్న కార్మికులుగా తెలుస్తోంది. కార్మికులు ఉంటున్న షెడ్‌పై రిటైనింగ్ వాల్ కూలి పడడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతులంతా ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కూకట్ పల్లి ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. కాగా హరిజన్ డెవెలపర్స్ కన్స్ట్రక్షన్స్‌లో ఈ ఘోరం చోటుచేసుకుంది.  
Publish Date: May 8, 2024 11:05AM