కారులో 5 కోట్లు..ప్రజకూటమి అభ్యర్థులకే

 

ఎన్నికల నేపథ్యంలో వరంగల్‌- హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై జనగామ జిల్లా పెంబర్తి చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఏపీ 37 సీకే 4985 నెంబరు గల స్విఫ్టు కారులో ఈరోజు వేకువజామున రూ.5,80,65,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వాహనాన్ని, నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ సొమ్ము హవాలా సొమ్మని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ వెల్లడించారు. నగదు గోషామహల్‌కు చెందిన వ్యాపారి కీర్తి కుమార్‌ జైన్‌కు చెందినదిగా గుర్తించామన్నారు. కీర్తి కుమార్‌ జైన్‌తోపాటు అతడి ఇద్దరు కారు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ప్రాథమిక విచారణ ప్రకారం నగదును ప్రజకూటమి అభ్యర్థులకు తరలిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు రూ.1.50 కోట్లు, వరంగల్ తూర్పు అభ్యర్థి వద్దిరాజు రవిచంద్రకు రూ.2 కోట్లు, కాంగ్రెస్‌ నేత కొండా మురళికి రూ.2.30 కోట్లు కారులో తీసుకెళ్తున్నట్లు సీపీ వెల్లడించారు. పట్టుబడిన నగదును కోర్టు ముందు ఉంచుతామన్నారు.