రేవంత్ అరెస్ట్ పై ఈసీ వివరణ

 

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ అరెస్ట్ పై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కి అనుకూలంగా పోలీసులు, ఈసీ పని చేస్తున్నాయని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అరెస్ట్ పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పందించారు. శాంతిభద్రతల అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా రేవంత్‌ను పోలీసులు అరెస్టు చేశారని రజత్‌కుమార్ వెల్లడించారు. కేసీఆర్ కొడంగల్ ప్రచారసభను అడ్డుకుంటామని రేవంత్ ప్రకటించడంతో టీఆర్ఎస్ నాయకులు నాకు ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై  కేంద్ర ఎన్నికల సంఘం కు నివేదిక పంపామని తెలిపారు. వారి ఆదేశాలతోనే ఆర్వో, జిల్లా ఎన్నికల అధికారికి లేఖ రాశానని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఆరోపించినట్లుగా ఎన్నికల కమిషన్ పనిచేయదన్నారు. అన్ని పార్టీలను ఒకలాగే చూస్తామన్నారు.  నిబంధనల ప్రకారమే తాము వ్యవహారిస్తున్నామన్నారు. అరెస్టు వ్యవహారంపై డీజీపీ, జిల్లా ఎన్నికల అధికారి నివేదికలు కోరినట్లు చెప్పారు. రేవంత్‌కు కూడా ఎన్నికల్లో ప్రచారం చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు.