నేడు విశాఖకు మోడీ

 

హుదూద్ తుఫాను ప్రభావానికి గురైన విశాఖపట్నం పరిసరాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్రలో ప్రధాని పర్యటన 2 గంటల పాటు జరుగుతుంది. మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు విశాఖ నుంచి ఆయన ఏరియల్ సర్వే మొదలవుతుంది. ఏరియల్ సర్వే అనంతరం, విశాఖలో ఏర్పాటు చేసిన తుఫాను ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకిస్తారు. ఈ ప్రదర్శన కోసం సుమారు 100 ఫొటోలను హైదరాబాదులో ప్రింట్ వేయించి వైజాగ్ పంపించారు. తాను తుఫాను పరిస్థితి గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అన్ని విషయాలు తెలుసుకుంటూ వచ్చిన నరేంద్ర మోడీ.. అందుకు తగినట్టుగా సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర యంత్రాంగాన్ని కూడా ఆదేశించారు. ప్రధాని పర్యటన సందర్భంగా, హుదూద్ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరనున్నారు. నష్టపోయిన పంటలు, నివాస గృహాలు, మౌలిక వసతులు, సమాచార, విద్యుత్, రవాణా వ్యవస్థల గురించి మోడీకి చంద్రబాబు నాయుడు వివరించనున్నారు. తక్షణ సాయంగా రూ.2 వేల కోట్లను అందించాలని ఇప్పటికే కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విశాఖ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని ఒరిస్సాకి వెళ్లి, అక్కడ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు.