ఆప్ ఎమ్మెల్యేకు రెండేళ్ల జైలు శిక్ష!

ఢిల్లీలోని ఎయిమ్స్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడిచేసిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి ఢిల్లీ కోర్టు రెండేళ్ల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా ఆయనకు కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. 

 

2016లో సెప్టెంబరు 9న సోమనాథ్ భారతి, మరో 300 మంది కలిసి జేసీబీ ఆపరేటర్ సాయంతో ఎయిమ్స్ ప్రహరీకి ఉన్న ఫెన్సింగును తొలగించారు. ఈ క్రమంలో అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేసినట్టు ఎయిమ్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆర్ఎస్ రావత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 323, 353, 147 కింద కేసులు నమోదయ్యాయి. కేసును విచారించిన కోర్టు ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినందుకు గాను సోమనాథ్ భారతిని దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాండే ఆప్ ఎమ్మెల్యేకి రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.