చిదంబరం బడ్జెట్: దేశ రక్షణ రంగానికి 2,03,670 కోట్లు
posted on Feb 28, 2013 1:12PM
దేశ భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం పునరుద్ఘాటించారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంటుకు సమర్పిస్తూ రక్షణ రంగానికి రూ. 2,03,670 కోట్లు కేటాయిస్తున్నట్టు చిదంబరం ప్రకటించారు. దేశ రక్షణ రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాముఖ్యం ఇస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించిన వెంటనే పార్లమెంటు సభ్యులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.
82వ కేంద్ర వార్షిక బడ్జెట్ గా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చిదంబరం గురువారం 2013-14 బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. చిదంబరం గురువారం ఉదయం 11 గంటలకు లోకసభలో. బడ్జెట్ ప్రసంగం మొదలెట్టారు. ఎనిమిదోసారి ఆయన బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. కాగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత లోక్సభలో అత్యధిక సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రిగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ తొలిస్థానంలో ఉండగా,ఆ తర్వాత స్థానంలో చిదంబరం ఉన్నారు. మొరార్జీ దేశాయ్ 8 సార్లు పూర్తి స్థాయి బడ్జెట్ను, రెండు సార్లు మధ్యంతర బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. చిదంబరం ఇప్పటి వరకు ఏడు సార్లు సమర్పించగా, గురువారం తన ఎనిమిదో వార్షిక బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టి నట్లయ్యింది. ఆర్థిక వృద్ధిరేటు, సమ్మిళత అభివృద్ధే తమ ప్రధాన అజెండా అని చిదంబరం తెలిపారు.