నానబెట్టిన సోయా గింజల్ని, దోసకాయ ముక్కలను కలిపి పేస్ట్‌లా తయారుచేసుకుని స్నానం చేసే ముందు శరీరమంతా పట్టించి మృదువుగా రుద్దుకోవడం వల్ల శరీరం నునుపుదేలి, మేని వర్ణం మెరుగవుతుంది.

రెండు చెంచాల సోయాపిండిలో అరచెంచా తేనె, కొద్దిగా టమాటా రసం కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేయడం వల్ల ముఖ సౌందర్యం పెరుగుతుంది.

ఒక స్పూను సోయాపిండి, అరస్పూను నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని చేతులకు రాసుకుని పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచడం వల్ల చేతులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.

పదిహేను సోయాగింజలు, నాలుగు బాదం పప్పులను నాలుగైదు గంటలసేపు నానబెట్టాలి. వీటిని మిక్సీలో వేసి పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ మిశ్రమంలో టీ స్పూన్‌ తేనె, నాలుగైదు చుక్క నిమ్మరసం కలిపి ముఖం, మెడ, చేతులకు పల్చగా పట్టించాలి. అర్ధ గంట తర్వాత మృదువుగా రుద్ది కడిగేయాలి.వారానికోసారి ఈ విధంగా చేయడం వల్ల చర్మం కోమలత్వాన్ని, నిగారింపును సంతరించుకుంటుంది.

సోయాపిండి, పెసరపిండి సమ భాగాలుగా తీసుకుని స్నానం చేసేటప్పుడు సబ్బుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఈ పిండిని ఉపయోగించడం వల్ల సహజ సిద్ధమైన రీతిలో చర్మం పరిశుభ్రపడి నునుపుగా మారుతుంది. మొటిమల వల్ల ముఖం మీద నల్లమచ్చలు ఏర్పడిన వారికి ఓ సులువైన పరిష్కారమార్గం వుంది.

సోయాపాలలో శగపిండి, కొద్ది చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేయాలి. దీనితో నల్లమచ్చలు క్రమంగా కనుమరుగవుతాయి.