మనోజ్ సినిమాకు బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్
on Aug 31, 2019
మంచు మనోజ్ మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నాడు. రెండేళ్ల క్రితం వచ్చిన 'ఒక్కడు మిగిలాడు' సినిమా తర్వాత ఆయన మళ్లీ ఇప్పటి వరకూ మరో సినిమా ఊసెత్తలేదు. ఒకానొక దశలో నటన నుంచి ఆయన విరమించుకుంటున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. 2013లో వచ్చిన 'పోటుగాడు' సినిమా తర్వాత ఆయన చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ పరంగా సంతృప్తి కలిగించకపోవడం కూడా దీనికి కారణమే వాదన వినిపించింది. నిజానికి ఆయన మునుపటి సినిమా 'ఒక్కడు మిగిలాడు' విమర్శకుల ప్రశంసలు పొందింది. ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ స్ఫూర్తితో రాసిన కథ ఆ సినిమా. ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో మనోజ్ బాగా డిజప్పాయింట్ అయ్యాడు.
ఎట్టకేలకు ఆయన ఒక సినిమా చేయడానికి అంగీకరించాడు. కొన్ని షార్ట్ ఫిలింస్ చేసి, డైరెక్టర్ సుధీర్ వర్మ వద్ద అసిస్టెంట్గా పనిచేసిన శ్రీకాంత్ అనే కొత్త డైరెక్టర్తో ఆయన పనిచేయబోతున్నాడు. శ్రీకాంత్ చెప్పిన కథ మనోజ్కు బాగా నచ్చిందనీ, ఆ కథను వదులుకోడానికి కారణమేదీ ఆయనకు కనిపించలేదనీ, అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ఒక విశేషం.. ప్రస్తుతం మంచి గిరాకీలో ఉన్న రచయిత బుర్రా సాయిమాధవ్ సంభాషణలు రాస్తుండటం. దసరాకి ఈ సినిమా లాంచనంగా మొదలు కావచ్చని చెబుతున్నారు.