English | Telugu

`క్యాష్` షోలో ర‌చ్చ ర‌చ్చ చేసిన సాయి ప‌ల్ల‌వి

రానా, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం `విరాట‌ప‌ర్వం`. వేణు ఊడుగుల డైరెక్ట్ చేసిన ఈ మూవీని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ బ్యాన‌ర్ పై చెరుకూరి సుధాక‌ర్ నిర్మించారు. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీ గ‌త ఏడాది కాలంగా విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఎట్ట‌కేల‌కు జూన్ 17న వ‌ర‌ల్డ్ వైడ్ గా థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. ఈ నేప‌థ్యంలో రానా, సాయి ప‌ల్ల‌వి ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. టీవీ షోల‌లో పాల్గొంటూ సినిమాని ప్ర‌మోట్ చేస్తున్నారు.

సినిమా మ‌రో మూడు రోజుల్లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్న నేప‌థ్యంలో హీరోయిన్ సాయి ప‌ల్ల‌వితో పాటు చిత్ర బృందం కూడా సుమ యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న `క్యాష్‌` షోలో పాల్గొన్నారు. తాజాగా విడుద‌లైన ఈ షోకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైర‌ల్ గా మారింది. జూన్ 18న రాత్రి 9:30 గంట‌ల‌కు ఈ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేయ‌బోతున్నారు. ఈ షోలో సాయి ప‌ల్ల‌వి చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. చిరున‌వ్వులు చిందిస్తూ షో లోకి ఎంట్రీ ఇస్తూనే సుమ‌పై సాయి ప‌ల్ల‌వి పంచ్ వేసింది. 'మొన్న ఈవెంట్ లో.. ఇప్పుడు ఇక్క‌డ.. ఇది ఎలా సాధ్య‌మైంది?' అంటూ సుమ‌ని ప్ర‌శ్నించింది.

'ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అన్నీ నావే' అంటూ ఫ‌న్నీగా సుమ ఆన్స‌ర్ ఇచ్చింది. సాయి ప‌ల్ల‌వితో పాటు ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల, న‌వీన్ చంద్ర ఈ షోలో పాల్గొన్నారు. న‌వీన్ చంద్ర ఎంట్రీ ఇవ్వ‌గానే సుమ అత‌నికి పెట్రోల్ బాటిల్ ఇచ్చింది. ఇదిలా వుంటే షోలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫొటో డిస్ ప్లే కాగానే సాయి ప‌ల్ల‌వి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ అంటే త‌న‌కు ఎంత ఇష్ట‌మో తెలిపింది సాయి ప‌ల్ల‌వి. సూప‌ర్ స్టార్ అయిన‌ప్ప‌టికీ ఓ సాధార‌ణ వ్య‌క్తిలా వుంటార‌ని, త‌న హార్ట్ లో ఏమ‌నిపిస్తే అది మాట్లాడ‌తార‌ని, అందుకే ఆయ‌నంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని తెలిపింది. ఈ షోకు సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.