English | Telugu
బ్రహ్మముడి సీరియల్ లో ఊహించని మలుపు.. కావ్యకి నిజం తెలిసిపోయింది!
Updated : Jun 14, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ రోజు రోజుకి ఆసక్తికరంగా సాగుతుంది. అయితే తాజాగా ఎన్నో గొడవలు, అవమానల తర్వాత రాహుల్-స్వప్నల పెళ్ళికి ముహూర్తం కుదురుతుంది. కాగా ఇప్పుడు కథ మరింత మలుపు తిరగనుంది. ఇప్పుడు కొత్తగా విడుదల చేసిన 'బ్రహ్మముడి' సీరియల్ ప్రోమోలో కావ్యకి స్వప్న గురించి అసలు నిజం తెలిసిపోయింది.
బ్రహ్మముడి సీరియల్ కథ చాలా సింపుల్. ప్రతీ మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించేలా ఎమోషన్స్ ని చూపిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబం యొక్క అవసరాలు, వాటి కోసం వారు చేసే అప్పులు, వాటిని తట్టుకోలేక వారు సర్దుకుపోయేతత్వాలు ఇలా అన్ని ఎమోషన్స్ ని కలిపి కనకం-కృష్ణమూర్తిల కుటుంబాన్ని చూపిస్తున్నారు. మరొకవైపు ధనవంతులు ఎలా ఉంటారు.. వారి అటిట్యూడ్ ఎలా ఉంటుంది.. వారు మధ్యతరగతి వాళ్ళని ఎలా చూస్తారనేది దుగ్గిరాల కుటుంబాన్ని ప్రతిబింబించేలా చూపిస్తూ ఈ సీరియల్ ముందుకు సాగుతుంది.
కనకం-కృష్ణమూర్తిలకు ముగ్గురు కూతుళ్ళు.. ఒకరు స్వప్న, మరొకరు కావ్య, ఇంకొకరు అప్పు. కనకం వీళ్ళందరిని బాగా డబ్బున్నవాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేసి.. తాము పడే కష్టాలు మా పిల్లలు పడకూడదని ఆశపడుతుంటుంది. అలాగే పెద్ద కూతురు స్వప్న తన తల్లి బాటలోనే ఉండాలనుకుంటుంది. చేసుకుంటే బాగా డబ్బున్న వాడినే చేసుకోవాలని కలలు కంటూ ఉంటుంది. కృష్ణమూర్తి మాత్రం నీతిగా, నిజాయితీగా బ్రతకాలని.. ఉన్నంతంలో హుందాగా బ్రతకాలని వాళ్ళ కూతుళ్ళకి భార్య కనకంకి చెప్తుంటాడు. చివరి అమ్మాయి అప్పు మాత్రం చదువుకుంటూ, పార్ట్ టైం జాబ్ చేస్తూ తన ఖర్చులకు తను డబ్బులు సమకూర్చుకుంటూ ఎవరికి భారంగా ఉండకూడదు అనుకుంటుంది. అయితే తాజాగా జరుగుతున్న సీరియల్ ఎపిసోడ్ లలో కథ పూర్తిగా మలుపు తిరిగింది.
దుగ్గిరాల కుటుంబంలోని అపర్ణ వాళ్ళ కొడుకు రాజ్ కి కనకం కూతురు స్వప్న నచ్చి పెళ్ళిచేసుకుందామనేసరికి తను పెళ్ళిపీటల మీద నుండి లేచిపోతుంది. దాంతో రాజ్ మేనత్త రుద్రాణి కనకం రెండవ కూతురు కావ్యని పెళ్ళిపీటల మీద కూర్చోబెట్టి రాజ్, కావ్యలకి పెళ్ళి చేస్తుంది. ఈ విషయం భరించలేని రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ చాలా కోపంగా ఉంటూ.. కావ్యని ఒక స్టోర్ రూమ్ లో ఉండమని చెప్తుంది. ఇక దుగ్గిరాల కుటుంబం యొక్క ఇంటిపెద్ద సీతారామయ్య మాటకి కట్టుబడి కావ్యని ఏమీ అనలేకపోతుంటారు. అయితే తాజా ఎపిసోడ్లలో.. స్వప్నని తీసుకెళ్ళింది రాహులేనని కావ్యకి తెలిసిపోయి సాక్ష్యాలతో సహా నిరూపిస్తుంది. దాంతో రాహులే స్వప్నని తీసుకెళ్ళాడని తెలుసుకున్న దుగ్గిరాల ఫ్యామిలీ రాహుల్ ని తిట్టేసి స్వప్నతో పెళ్ళి జరిపిస్తామని కనకం-కృష్ణమూర్తితో మాట్లాడి పెళ్ళి చేయాలని చూస్తారు.
అయితే స్వప్నని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేస్తాడు రాహుల్. కొందరు వెయిటర్స్ లా వచ్చి స్వప్నని కిడ్నాప్ చేస్తారు. కావ్య రాహుల్-స్వప్నల పెళ్ళి జరుగుతుందా? అనే సందిగ్ధంలో ఉండగా.. స్వప్న గదిలో ఉన్న లగేజ్ సర్దుతున్న కావ్యకి ఒక ఫోన్ సౌండ్ వినిపిస్తుంది. అది ఎవరిదని చూడగా స్వప్న ఫోన్.. అవతల నుండి ఫోన్ చేసింది స్వప్న ఫ్రెండ్. తనని పెళ్ళిచూపులు చూసి పెళ్లి చేసుకుందామనుకున్న ఫ్రెండ్. ఇటువైపు కావ్య ఫోన్ లిఫ్ట్ చేసిందని తెలియకుండా.. స్వప్న ప్రెగ్నెంట్ కాదనే నిజం చెప్పేస్తాడు. మరి ఈ నిజం తెలిసిన కావ్య ఏం చేయనుంది? కిడ్నాప్ అయిన స్వప్న ఎలా పెళ్ళిపీటలమీదకి చేరింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడాలి మరి. ఇలాంటి మలుపులతో ఈ సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది.