English | Telugu

బుల్లితెరపై పడిపోతున్న ఎన్టీఆర్‌ షో రేటింగ్స్‌!

బుల్లితెరపై యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ దూసుకువెళడానికి ఆశిస్తే... వ్యవహారం అందుకు రివర్స్‌లో ఉంది. టీఆర్పీల లెక్క ప్రకారం ‘బిగ్‌ బాస్‌’ హోస్ట్‌గా అదరగొట్టిన ఆయన... ‘ఎవరు మీలో కోటీశ్వరులు’తో సేమ్‌ మ్యాజిక్‌ రిపీట్‌ చెయ్యలేకపోతున్నారు. బుల్లితెరపై ఆయన షో టీఆర్పీ రేటింగ్‌, గ్రాఫ్‌ కిందకు పడుతూ ఉండటం జెమిని యాజమాన్యాన్ని కొంత కలవరపెట్టే అంశమే. రేటింగ్‌ పటడానికి ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగే టైమింగ్స్‌ కూడా కొంత కారణమని చెప్పక తప్పదు.

‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమంతో ఎన్టీఆర్‌ ‘జెమిని టీవీ’కి మాంచి బూస్ట్‌ ఇచ్చారు. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ గెస్ట్‌గా వచ్చిన కర్టెన్‌ రైజర్‌ ఎపిసోడ్‌కు 11.42 టీఆర్పీ వచ్చింది. నాగార్జున హోస్ట్‌ చేస్తున్న ‘బిగ్‌ బాస్‌ 5’కు వచ్చిన టీఆర్పీ 18తో పోలిస్తే... ఎన్టీఆర్‌ షో రేటింగ్‌ తక్కువ అయిన్నప్పటికీ తీసిపారేయలేం. తొలి వారం మంచి టీఆర్పీ నమోదు చేసింది. యావరేజ్‌గా 5 పాయింట్స్‌ వచ్చాయి. రెండో వారం యావరేజ్‌ టీఆర్పీ రేటింగ్‌ తీసుకుంటే 6 ఉంది. సో... వారం వారానికి పెరుగుతుందని ఆశిస్తే, ఇప్పుడు తగ్గింది.

‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో రేటింగ్‌ మూడో వారం పెరగలేదు. అలాగని, మరీ తగ్గలేదు. కానీ, తర్వాత వారంలో మేజర్‌ డ్రాప్‌ కనిపించింది. యావరేజ్‌ టీఆర్పీ రేటింగ్‌ తీసుకుంటే... జస్ట్‌ 4 ఉందంతే! దీనికి కారణాలు ఏమిటని విశ్లేషిస్తే... ఐపీఎల్‌ మ్యాచ్‌ల ప్రభావం కొంత ఉందని తెలుస్తోంది. అయితే... ఈటీవీ హిట్‌ కామెడీ షో ‘జబర్దస్త్‌’కు యావరేజ్‌ వీక్‌ టీఆర్పీ 7 ఉండటం గమనార్హం. ‘జబర్దస్త్‌’, ‘ఎక్ట్జా జబర్దస్త్‌’ గానీ, ‘ఢీ’ గానీ రాత్రి తొమ్మిదిన్నరకు ప్రసారమవుతాయి. వాటితో పోటీ లేకుండా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ను ఎనిమిదిన్నరకు ప్రసారం చేస్తున్నారు. అయినా జనాలు షో చూడట్లేదు. మగమహారాజులంతా ఐపీఎల్‌ మీద పడ్డారు. మహిళల ఆదరణతో మాటీవీ, జీటీవీ, ఈటీవీ సీరియళ్లు, షోలకు టీఆర్పీలు బావున్నాయి.