English | Telugu

టాలీవుడ్ కి మిరాయ్ నేర్పిన పాఠం!

ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి ప్రధాన కారణాల్లో అధిక టికెట్ ధరలు ఒకటి. భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాల వరకు టికెట్ రేట్స్ హైక్ ఓకే గానీ.. మీడియం రేంజ్ సినిమాలు, డబ్బింగ్ సినిమాలను కూడా వదలకుండా ధరలు పెంచేస్తున్నారు. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్.. థియేటర్ కి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ నిర్మాతలు ఈ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో అందరి కళ్ళు తెరిపించేలా 'మిరాయ్' మూవీ వచ్చింది. (Mirai Movie)

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన 'మిరాయ్' మూవీకి రూ.60 కోట్ల బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. సినిమాలో మైథలాజికల్ టచ్ ఉంది, వీఎఫ్ఎక్స్ సీన్స్ ఉన్నాయి, అన్నింటికంటే ముఖ్యంగా విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇవి చాలు టికెట్ రేట్స్ హైక్ కి వెళ్లాలనే ఆలోచన నిర్మాతలకు రావడానికి. కానీ, 'మిరాయ్' నిర్మాతలు మాత్రం అలా చేయలేదు. తమ సినిమా ఎక్కువ మందికి చేరువ కావాలనుకున్నారు. అందుకే, సాధారణ టికెట్ ధరలతోనే సినిమాని విడుదల చేశారు. అదే ఇప్పుడు సినిమాకి కలిసొచ్చింది.

సెప్టెంబర్ 12న థియేటర్లలో అడుగుపెట్టిన 'మిరాయ్' మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దానికితోడు టికెట్ రేట్స్ కూడా నార్మల్ గానే ఉండటంతో ప్రేక్షకులు థియేటర్ బాట పడుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడుతున్నారు. దీంతో హైదరాబాద్ వంటి మేజర్ సిటీలలో మ్యాగ్జిమమ్ షోలు ఫుల్ అవుతున్నాయి.

'మిరాయ్' బాటలోనే రాబోయే సినిమాలు కూడా పయనిస్తే మంచిది. ఎందుకంటే, నార్మల్ టికెట్ రేట్స్ ఉంటే.. ఫుట్ ఫాల్స్ పెరుగుతాయి. దాంతో సినిమాకి లాంగ్ రన్ ఉండటమే కాకుండా, మంచి వసూళ్లు వస్తాయి.