English | Telugu

ప్రశాంత్‌వర్మ ‘మహాకాళి’ చిత్రం లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇదే!

అ!, కల్కి, జాంబిరెడ్డి వంటి డిఫరెంట్‌ మూవీస్‌ తర్వాత ప్రశాంత్‌వర్మ తెరకెక్కించిన హనుమాన్‌ ఎంతటి భారీ విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. 25 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 350 కోట్లు కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమాకి స్వీక్వెల్‌గా జైహనుమాన్‌ ఉంటుందని ప్రశాంత్‌వర్మ ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మహాకాళి అనే మరో విభిన్న చిత్రం అతని నుంచి రాబోతోంది. అయితే ఈ సినిమాకి అతను కథను మాత్రమే అందిస్తున్నారు. పూజా అపర్ణ దర్శకురాలిగా వ్యవహరిస్తున్నారు. పివిసియులో రూపొందే ప్రతి సినిమా విభిన్నంగా ప్లాన్‌ చేస్తున్నారు. అందులో భాగంగానే ‘మహాకాళి’ సినిమా కూడా వస్తోంది. హనుమంతుడి ధైర్యం, శక్తికి ఎదురుగా మహాకాళి స్ఫూర్తి, శక్తి స్వరూపిణిగా మహాకాళి పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.

బెంగాల్‌ సంస్కృతి, సంప్రదాయాల ఆధారం, మతపరమైన గంభీరత, స్థానిక పౌరాణిక చరిత్ర ఈ కథలో ఉంటాయని చెబుతున్నారు. ‘మహాకాళి’ చిత్రం టాలీవుడ్‌కి ఒక కొత్త తరహా సినిమా అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. సెప్టెంబర్‌ 30 ఉదయం ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ ఇవ్వనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేకాదు, ప్రశాంత్‌వర్మ నుంచి వస్తున్న సినిమా కావడంతో టాలీవుడ్‌లోనూ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడ్డాయి.