English | Telugu

అఖండ2 విషయంలో అలా జరగకూడదని అందరూ కోరుకుంటున్నారు!

గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం 'అఖండ2 తాండవం'. ఈ చిత్రం డిసెంబర్‌ 5న పాన్‌ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అవుతోంది. డిసెంబర్‌ 4న ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్‌ కూడా పడుతున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప2' చిత్రం కూడా డిసెంబర్‌ 5నే రిలీజ్‌ అయింది. ఈ సినిమాకి కూడా డిసెంబర్‌ 4న ప్రీమియర్స్‌ వేశారు. ఆ సందర్భంగా జరిగిన దుర్ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.


గత ఏడాది డిసెంబర్‌ 5న 'పుష్ప' చిత్రానికి సీక్వెల్‌గా 'పుష్ప2' రిలీజ్‌ అయింది. ఈ డిసెంబర్‌ 5న 'అఖండ'కు సీక్వెల్‌గా 'అఖండ2' రిలీజ్‌ అవుతోంది. 'అఖండ2'కి డిసెంబర్‌ 4న ప్రీమియర్స్‌ వేస్తున్నారు. ఏడాది క్రితం జరిగిన ఘటన రిపీట్‌ అవ్వకూడదని, అందరూ సేఫ్‌గా సినిమాను చూసి ఆనందించాలని అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా అభిమానులు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.


'పుష్ప2' ప్రీమియర్‌ సందర్భంగా జరిగిన ఘటనను ఒక హెచ్చరికగా తీసుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, సినిమాను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకుల భద్రత విషయంలో థియేటర్ల యాజమాన్యాలు, పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుంటుందని కూడా సూచిస్తున్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలంటే అభిమానులకు ఈ విషయంలో అవగాహన కల్పించాలని కోరుతున్నారు.


గత కొంతకాలంగా 'అఖండ2' చిత్రానికి పెరుగుతున్న హైప్‌ను చూస్తున్నాం. సినిమాను ఎప్పుడెప్పుడు చూసేద్దామా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో, అభిమానుల్లో బాగా పెరిగింది. ప్రస్తుతం సినిమాపై ఉన్న బజ్‌ను చూస్తుంటే రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్‌ సాధించేలా కనిపిస్తోంది. 'అఖండ' చిత్రంతో ప్రభంజనం సృష్టించిన నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను.. 'అఖండ2'తో తిరుగులేని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అభిమానులు ఎంతో ఉత్సాహంతో చెబుతున్నారు.