English | Telugu

ట్రైలర్‌ చూశాక.. దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అయింది!

మహేష్‌బాబు, రాజమౌళి లేటెస్ట్‌ భారీ ప్రాజెక్ట్‌ ‘వారణాసి’ చిత్రానికి సంబంధించిన బోలెడన్ని అప్‌డేట్స్‌ ప్రేక్షకుల ముందుకు, అభిమానుల ముందుకు వచ్చేశాయి. నవంబర్‌ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో ఎంతో గ్రాండ్‌గా నిర్వహించిన గ్లోబ్‌ ట్రాటర్‌ ఈవెంట్‌లో కావాల్సినన్ని అప్‌డేట్స్‌ ఇచ్చారు. ఈ ఈవెంట్‌ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను ఐమాక్స్‌ ఫార్మాట్‌లో ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యపరిచారు రాజమౌళి. ఈ సందర్భంగా వేదికపైకి మహేష్‌ ఎంట్రీని కూడా చాలా డిఫరెంట్‌గా ప్లాన్‌ చేశారు. ఓ పక్క ట్రైలర్‌ ప్లే అవుతుండగా స్మోక్‌ ఎఫెక్ట్‌లో నందిపై త్రిశూలం పట్టుకొని మహేష్‌ వెళుతున్నట్టుగా క్రియేట్‌ చేసి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు.

అనంతరం సూపర్‌స్టార్‌ మహేష్‌ మాట్లాడుతూ ‘అందరూ అప్‌డేట్‌, అప్‌డేట్‌ అని అడుగుతున్నారు కదా. ఇదే అప్‌డేట్‌.. ఎలా ఉంది? మన మాటల్లో చెప్పాలంటే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్‌ అయింది. నాక్కూడా. ఇది నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. జీవితంలో ఒక్కసారి మాత్రమే సాధ్యమయ్యే ప్రాజెక్ట్‌. అందరూ గర్వపడేలా కష్టపడతాను. ముఖ్యంగా నా డైరెక్టర్‌ రాజమౌళి గర్వపడేలా చేస్తాను. నాన్నగారంటే నాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాను. ఒక్కటి తప్ప. నన్ను పౌరాణిక సినిమాలు చెయ్యమని పదే పదే చెప్పేవారు నాన్నగారు. కానీ, నేను వినలేదు. ఈ సినిమా రాజమౌళిగారు నన్ను రాముడిగా చూపించారు. ఇప్పుడు నాన్నగారు నా మాటలు వింటూ వింటారు.

నేను ఈ ఈవెంట్‌లో క్యాజువల్‌గా ఎంట్రీ ఇద్దామనుకున్నారు. రాజమౌళిగారు కుదరదన్నారు. చూస్తున్నారుగా.. ఇలా వచ్చాను. ఓ బ్లూ షర్ట్‌ వేసుకొని వస్తానన్నాను. కుదరదన్నారు. ఈ షర్ట్‌ వేసుకొమ్మన్నారు. ఇంకా నయం షర్ట్‌ వేసుకొని రమ్మన్నారు. తర్వాత షర్ట్‌ లేకుండానే రమ్మంటారేమో. చాలా రోజుల తర్వాత మీ అందరినీ ఇలా చూడడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. నామీద ఎంతో అభిమానాన్ని చూపిస్తారు మీరు. మీకు నేను ఎప్పుడూ పెద్ద పెద్ద మాటలు చెప్పలేదు. చెప్పలేను కూడా. చేతులెత్తి దండం పెట్టడం తప్ప నాకింకేం తెలీదు. మేం, మా టీమ్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ సహకారంతో మీకోసం ఇంత గ్రాండ్‌గా చేశాం. ఎంతో కష్టపడి మా మా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చారు. మీరు క్షేమంగా ఇంటికి వెళ్లండి. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నారు.