English | Telugu

‘కాంత’ వివాదం.. అందరి నోట ఒకటే మాట!

- కోర్టుకెక్కిన త్యాగరాజ భాగవతార్ మనవడు

- కాంత వివాదంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

- కాంతపై సోషల్ మీడియాలో పోస్టులు

దుల్కర్‌ సల్మాన్‌, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కాంత’. వేఫేర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, స్పిరిట్‌ మీడియా బేనర్స్‌పై దుల్కర్‌ సల్మాన్‌, రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్‌ 14న ఈ సినిమా విడుదల కాబోతోంది.

‘కాంత’ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్‌ ఓ వివాదానికి తెర తీసిన విషయం తెలిసిందే. 1930వ దశకంలో సూపర్‌స్టార్‌గా వెలుగొందిన ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌ జీవిత కథనే ‘కాంత’ చిత్రంగా మలిచారంటూ మీడియాలో, సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో త్యాగరాజ భాగవతార్‌ మనవడు ‘కాంత’ చిత్ర నిర్మాతలపై మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తన తాతగారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

నవంబర్‌ 14న ఈ సినిమా విడుదలవుతుండగా త్యాగరాజ భాగవతార్‌ మనవడు కోర్టుకెక్కడం ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై ఇటీవల చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఇద్దరు గొప్ప వ్యక్తులు తమ బ్రిలియన్స్‌ విషయంలో పడిన గొడవల నేపథ్యంలోనే ఈ కథ ఉంటుంది తప్ప ఇది ఎవరి తాత, నాన్నల కథ కాదు అన్నారు. మరోపక్క ఈ సినిమా ప్రీమియర్స్‌ ఆల్రెడీ వేశారు. మీడియాకి కూడా సినిమాని చూపించారు. ‘కాంత’లో వివాదాస్పద అంశాలు ఏమీ లేవని సినిమా చూసిన వారు తమ అభిప్రాయాల్ని చెబుతున్నారు. త్యాగరాజ భాగవతార్‌ జీవితానికి, ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా గురించి జరిగిన ప్రచారం అర్థం లేనిదని తేల్చారు. దీంతో ‘కాంత’ వివాదానికి తెరపడినట్టుగానే భావించాలి.