English | Telugu

'గుడుంబా శంకర్' రీ-రిలీజ్.. మరో 'ఆరెంజ్' అవుతుందా!

2004 లో వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం 'గుడుంబా శంకర్'ని ఈ ఆగస్టు 31న రీరిలీజ్ చేస్తున్నట్లు తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ప్రకటించారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్ జంటగా వీరశంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'గుడుంబా శంకర్'. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించిన ఈ చిత్రం 2004 సెప్టెంబరు 10న విడుదలై పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. విజయాన్ని అందుకోనప్పటికీ ఈ సినిమాకి ఎందరో అభిమానులున్నారు. ముఖ్యంగా పాటలు, కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అందుకే హిట్ సినిమా కానప్పటికీ 'గుడుంబా శంకర్' రీరిలీజ్ పట్ల పవన్ అభిమానులు ఆసక్తిగానే ఉన్నారు.

నాగబాబు నిర్మించిన మరో చిత్రం 'ఆరెంజ్' ఇటీవల రీరిలీజ్ అయ్యి మంచి వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా హిట్ కానప్పటికీ, దానిని ఇష్టపడేవాళ్లు ఎందరో ఉన్నారు. అందుకే రీరిలీజ్ లో మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు 'గుడుంబా శంకర్' విషయంలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి.

ఇక 'గుడుంబా శంకర్' ద్వారా వచ్చే డబ్బులను జనసేన పార్టీకి ఫండ్ గా ఇస్తామని నాగబాబు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. "ఆగస్టు 31 మరియు సెప్టెంబర్ 1న.. 'గుడుంబా శంకర్'ని థియేటర్లలో తిరిగి విడుదల చేస్తున్నట్లు మేము సగర్వంగా ప్రకటిస్తున్నాము. 'జల్సా' మరియు 'ఆరెంజ్' టిక్కెట్ అమ్మకాల ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని ఎలాగైతే జనసేన పార్టీకి ఫండ్ గా ఇచ్చామో, అలాగే ఈ చిత్రం ద్వారా వచ్చిన ప్రతీ రూపాయిని జనసేన పార్టీ ఫండ్‌కి అంకితం చేయబడుతుంది" అని నాగబాబు పేర్కొన్నారు.