English | Telugu

'రోటి క‌ప‌డా రొమాన్స్'.. టైటిల్ త్యాగం చేసిన దిల్ రాజు!

'రోటి క‌ప‌డా రొమాన్స్'.. టైటిల్ త్యాగం చేసిన దిల్ రాజు!

లక్కీ మీడియా బ్యానర్ పై సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన తాజా చిత్రం 'రోటి కపడా రొమాన్స్'. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష ,మేఘలేఖ,  ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టైటిల్ లోగోను శుక్రవారం ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, "ఈ చిత్ర కథ నేను విన్నాను. ఇలాంటి టైటిల్ తో నేను ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను తీద్దామని అనుకున్నాను. అయితే తమ సినిమాకు ఈ టైటిల్ యాప్ట్ గా వుంటుందని అడిగితే ఈ టైటిల్ ఇచ్చేశాను. కొత్త నటీనటులతో , సాంకేతిక నిపుణులతో, ట్రెండీ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం కంటెంట్ కొత్తగా వుంటుందని అనుకుంటున్నాను. కొత్త కంటెంట్ ఇస్తే మన ఆడియన్స్ సినిమాను తప్పకుండా ఆదరిస్తారు. ఈ చిత్రం కూడా అదే కోవలో చేరాలని ఆశిస్తున్నాను" అన్నారు. 

చిత్ర నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, "ఇప్పటివరకు మా సంస్థలో చాలా యూత్ ఫుల్ సినిమాలు చేశాను. ఆడియన్స్ కూడా ఆ చిత్రాలను బాగా ఆదరించారు. మళ్లీ అలాంటి యూత్ ఫుల్ సినిమా చేయాలనే ఆలోచనతో ఈ సినిమాను నిర్మించాను. పక్కా యూత్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఇందులో ఆల్ ఎమోషన్స్ వుంటాయి" అన్నారు. 

చిత్ర దర్శకుడు విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, "కొన్నేళ్ల క్రితం దిల్ రాజు గారికి కథ చెప్పాలని ఆయన ఆఫీస్ బయట తిరుగుతుండేవాడిని. ఇప్పుడు నా సినిమాకు ఆయనే  టైటిల్ ఇచ్చి ఆయన చేతుల మీదుగా టైటిల్ ను ఆవిష్కరించడం నాకెంతో ప్రత్యేకమైనది. రోటి కపడా రొమాన్స్ ఇదొక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. ఆల్ ఎమోషన్స్ వుంటాయి. నేటి యూత్ కనెక్ట్ అవుతారు. ఇప్పటి వరకు నిర్మాత వేణు ఎంతో మందికి అవకాశం ఇచ్చారు. ఆ కోవలోనే ఆయన నాకు అవకాశం ఇచ్చారు. కథకు తగ్గ నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు. తప్పకుండా చిత్రం అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది" అన్నారు. 

ఈ చిత్రానికి డీఓపీగా సంతోష్ రెడ్డి, సంగీత దర్శకుడిగా హర్ష వర్థన్ రామేశ్వర్, ఎడిటర్ గా విజయ్ వర్థన్, ఆర్ట్ డైరెక్టర్ గా కిరణ్ మామిడి వ్యవహరిస్తున్నారు.