English | Telugu

నేను అన్నపూర్ణ స్టూడియోకి దూరమవ్వడానికి కారణం అదే : వెంకట్‌ అక్కినేని

నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు తనయులు వెంకట్‌ అక్కినేని, నాగార్జున అక్కినేని. వీరిద్దరూ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టకముందు అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్‌లో వచ్చిన అన్ని సినిమాలకు నిర్మాతలుగా తన ఇద్దరు తనయుల పేర్లను వేసేవారు అక్కినేని. నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత వెంకట్‌ అక్కినేని కూడా నిర్మాతగాబాధ్యత తీసుకొని సినిమాల నిర్మాణానికి సంబంధించి విషయాలను చూసుకునేవారు. మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే వెంకట్‌ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాల గురించి మాట్లాడారు.

‘నేను, నాగార్జున సినిమా వాతావరణంలో పెరగలేదు. మేం బాగా చదువుకోవాలని నాన్నగారు మమ్మల్ని ఇండస్ట్రీకి దూరంగానే ఉంచారు. అందువల్ల సినిమాల గురించి ఎక్కువ అవగాహన ఉండేది కాదు. అలాగే నాన్నగారు కూడా సినిమాలకు సంబంధించిన ఆలోచనలను మాపై రుద్దేవారు కాదు. ఆ తర్వాత నేను నిర్మాత అవ్వాలని, నాగార్జున హీరో అవ్వాలని అనుకున్నప్పుడు ఆ విషయం చెప్పేందుకు నాన్నగారి దగ్గరకు భయపడుతూనే వెళ్లాం. విషయం తెలుసుకున్న నాన్నగారు మరోమాట లేకుండా వెంటనే ఒప్పుకున్నారు. చాలాకాలం అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలను చూసుకున్నాను. జనరేషన్‌ గ్యాప్‌ వస్తుందన్న ఉద్దేశంతోనే నేను ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాను. ఇప్పుడు నాగార్జున బాధ్యత తీసుకొని అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు చూసుకుంటున్నాడు’’ అన్నారు.

ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేవ్వరరావు మధ్య ఒక సందర్భంలో మనస్ఫర్థలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి వెంకట్‌ అక్కినేని వద్ద ప్రస్తావించగా వారిద్దరి అనుబంధం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశారు.

‘నాన్నగారు, రామారావుగారు ఎంత స్నేహంగా ఉండేవారో నేను ప్రత్యక్షంగా చూశాను.రామారావుగారు మా ఇంటికి వచ్చేవారు, మా అమ్మగారి చేతివంట అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలాసార్లు మా ఇంటికి వచ్చారు. తనకి ఎంతో ఇష్టమైన పాయసం చేయించుకుని మరీ తినేవారు. రామారావుగారు న్న చివరి మూడేళ్లలో మా నాన్నగారు ప్రతి నెల ఒకసారి ఆయనను కలిసేవారు. ఇద్దరూ కలిసి భోజనం చేసేవారు. ఒకసారి నాన్నగారితో కలిసి నేను కూడా రామారావుగారి ఇంటికి వెళ్లాను. మూడు గంటలపాటు వారి జర్నీకి సంబంధించిన విషయాలను గురించి మాట్లాడుకుంటూ కూర్చోవడం నేను చూశాను. రామారావుగారు చనిపోయినపుడు నాన్నగారు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు’ అన్నారు.