English | Telugu
ఇద్దరు భామలతో 'తెలుసు కదా' అంటున్న సిద్ధు!
Updated : Oct 16, 2023
'డీజే టిల్లు'తో ఘన విజయాన్ని అందుకొని యువతకి ఎంతగానో చేరువైన సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం 'డీజే టిల్లు'కి సీక్వెల్ గా రూపొందుతోన్న 'టిల్లు స్క్వేర్'ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. తాజాగా సిద్ధు కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో 30వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాతో క్యాస్టూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతుండటం విశేషం.
ఈ సినిమాకి 'తెలుసు కదా' అనే ఆసక్తికర టైటిల్ ని పెట్టారు. ఈ సందర్భంగా అనౌన్స్ మెంట్ వీడియోని విడుదల చేశారు. డైనింగ్ టేబుల్ పై ఫుడ్ ఐటమ్స్ ని చూపిస్తూ మూవీకి వర్క్ చేస్తున్న వారి పేర్లను రివీల్ చేసిన విధానం బాగుంది. ఇక వీడియో చివరిలో 'తెలుసు కదా' అంటూ సిద్ధు ఫేస్ ని రివీల్ చేయడం ఆకట్టుకుంది.
ఇదొక లవ్ స్టోరీ అని తెలుస్తోంది. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. థమన్ సంగీతం అందిస్తున్నాడు. డీఓపీగా యువరాజ్, ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.
