English | Telugu

క‌రోనా వైరస్ ఆ ల్యాబ్ నుంచే వచ్చింది: ట్రంప్‌

కొవిడ్‌-19. ఈ వైరస్‌ చైనాలోని వుహాన్‌లో ఉన్న వైరాలజీ ల్యాబ్‌ నుంచే బయటకు వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. దీనికి సంబంధించి తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వైరస్‌ బయటకు వచ్చిందని అంత బలంగా ఎలా చెప్పగలరని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ..''నేను ఆ విషయాలు బటయకు చెప్పలేను. అలా చెప్పడానికి నాకు అనుమతి కూడా లేదు'' అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆదిలోనే దాన్ని నిలువరించి ఉండాల్సిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ''చైనా కట్టడి చేయలేకపోయిందా.. లేక కావాలనే నిర్లక్ష్యం వహించిందా అన్నది పక్కనబెడితే.. దీని ప్రభావం మాత్రం ప్రపంచంపై భారీ స్థాయిలో ఉంది'' అని వ్యాఖ్యానించారు.

బహుశా కీలక సమయంలో స్పందించకపోయి ఉండడం వల్లే చేజారిపోయి ఉంటుందని తాను భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
అసలు చైనాలో ఏం జరిగిందన్నది త్వరలోనే, దీనికి సంబంధించిన విషయాలన్నీ బయటకు వస్తాయని తెలిపారు.
ఈ ఇన్‌ఫెక్షన్‌ జంతువుల నుంచి వచ్చిందా లేక చైనాలోని ప్రయోగశాల నుంచి ప్రమాదవశాత్తు వెలువడిందా అన్నది త్వ‌ర‌లోనే తేలుస్తామ‌ని అమెరికా నిఘా సంస్థలు పేర్కొన్నాయి.