English | Telugu

లాక్ డౌన్ ఎఫెక్ట్: కన్న కొడుకు రాలేక భర్తకు అంత్యక్రియలు నిర్వహించిన భార్య..

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో బాధపడుతోంది. మన దేశంలో కూడా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ తరుణంలో చాలా మంది ఉద్యోగులు, విద్యార్థులు, వలస కూలీలు వారు ఎక్కడికక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ స్వంత వూళ్ళకు వెళ్లాలన్నా కూడా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. ఇటువంటి తరుణంలో కన్న కొడుకు ఉండి కూడా భర్త చితికి భార్య తల కొరివి పెట్టాల్సిన సంధర్భం వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా పందిళ్ల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకొంది. ఈ గ్రామానికి చెందిన రాములు అర్ధరాత్రి మరణించాడు. అయితే తన కుమారుడు గుజరాత్ లో ఉద్యోగం చేయడం వల్ల తన స్వగ్రామానికి రాలేకపోయాడు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడం వల్ల తన తండ్రి అంత్యక్రియలు చేయడానికి రాలేకపోయాడు. దీనితో తన భర్త రాములు కి తన భార్య అంత్యక్రియలు నిర్వహించింది. ఈ దృశ్యాన్ని అంతా తన కుమారుడు వీడియోలో చూస్తూ భోరున విలపిస్తున్నాడు. ఇలాంటి విపత్కర సమయాలలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం.